Ads

20 October, 2022

దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita


దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 33 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bPRR1Z8dsUs ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:42 - అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।

అక్షరములలో అ-కారమునూ, సమాసములలో ద్వంద్వ సమాసమునూ, అపరిమితమైన కాలమునూ, మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే.

సంస్కృతములో అన్ని అక్షరములు కూడా, సగం అక్షరాన్ని, "అ" కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. కాబట్టి, అ-కారము అనేది, సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యతగలది. "అ" అనేది, అక్షరమాలలో మొదటి అచ్చు. అంతేకాక, అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి, "అ" అనేది మొట్టమొదటే వచ్చే అక్షరం. సంస్కృతమనేది చాలా ప్రాచీనమైన భాషే అయినా, అది అత్యంత నాగరికమైనది, మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో, రెండు కానీ, అంతకంటే ఎక్కువ కానీ పదాలు, వాటి చివరలు కోల్పోతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ 2) బహువ్రీహి ౩) కర్మ ధారయ 4) తత్పురుష 5) ద్విగు 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది. ఎందుకంటే, రెండు పదాలకీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలు కలిపితే, మూడవ పదానికి అర్థం ఇస్తుంది. సృష్టి అనేది అత్యత్భుతమైనది, మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా, సృష్టితో పోల్చితే, అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తునూ తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరు సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడని, శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.

02:38 - మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।

సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా, నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తినీ, సిరిసంపదనూ, చక్కటి వాక్కునూ, జ్ఞానశక్తినీ, మేధస్సూ, ధైర్యము మరియు క్షమాగుణమును. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవమూ తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది. అందుకే, “dead end” అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా, వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడతాయి, మరికొన్ని గుణములు, పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడతాయి. నిజానికైతే, అసలు ఈ రెండు రకాల గుణములూ కలిగి ఉండటమే, సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమనే లక్షణములు, స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఇందులో మొదటి మూడు గుణములూ, బాహ్యంగా వ్యక్తమవుతాయి. అలాగే, తరువాతి నాలుగూ, ఆంతరంగముగా వ్యక్తమవుతాయి. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి, ఇరవై నాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. వారు కీర్తి, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ. శ్రీ అనే ఆమె, భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె, బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా, ఈ ఏడుగురు స్త్రీలూ, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.

04:41 - బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।

సామ వేద మంత్రములలో నేనే బృహత్సామమని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాగములో మార్గశీర్ష మాసమునూ, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువునూ నేనే.

ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు సామవేదములో తానే, శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును, అని అంటున్నాడు. సాధారణంగా దీనిని, మధ్యరాత్రి సమయంలో పాడతారు. సంస్కృత భాష, ఇతర భాషలలో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస, మరియు ఛందస్సూ కలిగి ఉంది. వేదాలలోని శ్లోకాలు, ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు, చాలా ఆకర్షణీయమయినది, మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము, గాయత్రీమంత్రము. మార్గశీర్షమనేది, హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో, ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు, లేదా మరీ అంత చల్లగానూ ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది జనులకు చాలా ఇష్టమైన నెల. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు. ప్రకృతి ఆహ్లాదకరంగా, తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వంసత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు, భగవంతుని యొక్క విభూతిని చక్కగా వ్యక్తీకరిస్తుంది.

06:29 - ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।

మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమునూ, ధర్మపరాయణులలో సద్గుణమునూ నేనే.

శ్రీ కృష్ణుడు, సద్గుణాలే కాక, దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదమనేది, ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు. అది కుటుంబాలనూ, వ్యాపారాలనూ, జీవితాలనూ నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్టురుడి బలహీనతే, మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే, అది హానికరం కాదా? మరి అది ఎందుకు నిషేధించబడింది - అంటే, దానికి సమాధానం, భగవంతుడు తన శక్తిని జీవాత్మకు ప్రసాదిస్తాడు. దానితో పాటుగా, నచ్చిన పనిని చేయటానికీ, ఎంచుకోవటానికీ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. మనం ఆయనను మరచిపోవటం ఎంచుకుంటే, మరచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని, ఇంటిని వెచ్చబరచటానికీ, లేదా చల్లబరచటానికీ, రెంటికీ వాడుకోవచ్చు. ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో, వినియోగదారుడి ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా, లేదా దుర్వినియోగం చేసినా సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలూ, సామర్ధ్యమూ ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకను దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికీ విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు, దృఢ సంకల్పమనే గుణానికి, ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా, భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలూ, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు ధృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవని గమనించాలి.

08:40 - వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని, మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడనని తెలుసుకొనుము, మరియు, గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.

శ్రీ కృష్ణ భగవానుడు, భూ-లోకంలో వృష్ణి వంశములో, వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మ అయినా, భగవంతుడి కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే, పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులైన యుధిష్టిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు, సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు, మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించినవాడు. వేద వ్యాసుడు, మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు "బాదరాయణుడు", మరియు "కృష్ణ ద్వైపాయనుడు" అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేశాడు, మరియు ఎన్నో పురాణాలను, మానవుల సంక్షేమం కోసం వ్రాశాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే.. అలాగే, శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో ఒకడిగా, వేద వ్యాసుడు పేర్కొనబడ్డాడు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని. నీతి, ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో, ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులను తన శిష్యులుగా చేసుకుని, వారి పురోగతికై దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రావీణ్యం వలన, ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.

10:22 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

17 October, 2022

‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! Uddhava Gita


‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఉద్ధవుని గురించి తెలుసుకుంటే గానీ అర్ధం కాదు. ఉద్ధవుడు చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడికి ఎన్నో సేవలు చేశాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కానీ, తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు, భగవంతుడిని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తికి ముందు, ఉద్ధవుడితోనే మాట్లాడాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ధర్మాన్ని బోధించాడు. అది భగవద్గీతగా, ముఖ్య పారాయణ గ్రంధంగా ప్రజ్వరిల్లుతోంది. అలాగే, శ్రీ కృష్ణుడు చివరిగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు, ‘ఉద్ధవ గీత’గా ఖ్యాతి గడించింది. అసలు ఉద్ధవ గీతలో ఏముంది? ఉద్ధవుడు శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? కర్మ గురించి వాసుదేవుడు వివరించిన సందేశం ఏంటి -  వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/buXxa_0VE5w ]

ఉద్ధవ గీత అనేది, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అనడం సమంజసం. ఈ ‘ఉద్ధవ గీత’ అనేది, శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభమై, ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం "ఉద్ధవ గీత"లో, వెయ్యికి పైగా శ్లోకాలున్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే, ఉద్ధవగీతగా జగత్ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే, ‘ఉద్ధవ గీత’, భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. పరమాత్మలోని దివ్య సుగుణాలన్నీ, ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి, ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్నీ.., వాయువు నుంచి పరోపకారాన్నీ, ప్రాణస్థితి నిలకడనూ.., ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అనీ.., జలం నుంచి నిర్మలత్వాన్నీ, పావనత్వాన్నీ.., అగ్ని నుంచి దహించే శక్తినీ గ్రహించి, తన దేహం పాంచ భౌతాత్మకమనీ, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలనీ తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది, ఉద్ధవ గీత.

శ్రీ కృష్ణుడు ఉద్ధవుడితో, ఏదైనా వరం కోరుకో అని చెప్పగా అందుకు ఉద్ధవుడు, ‘దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు కానీ, నిన్ను ఓక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. అడుగవచ్చునా?’ అని, వినయంగా ఇలా అడిగాడు.. ‘కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి, నన్ను అనుగ్రహించండి.’ అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు.’ అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.

‘కృష్ణా, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసినవాడవు. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి, కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తినంతా పోగొట్టుకుని, వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి, వాళ్ళను కాపాడి ఉండవచ్చును కదా? కౌరవులు దుర్బుద్ధితో, పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో, పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు, ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని, గొప్ప పేరుపొందావు. కానీ, ముందే నీవు కలుగచేసుకుని ఉంటే, ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. మరి, నీవు చేసినదేమిటి కృష్ణా?’ అని ఉద్ధవుడు ఎంతో బాధతో, కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్ధించాడు. నిజానికి ఈ సందేహములు, మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ‘ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం, అన్ని విధాలా జాగ్గ్రత్త పడి, తగిన చర్యలను తీసుకునే వాడే, గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా, ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం, ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.

ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమునూ కోరలేదు. ఒకవేళ శకునితో నేను జూదమాడి ఉంటే, ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే ఆలోచించుము..? సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా, కృష్ణుడు రాకూడదు అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక, చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే.. భీముడూ, అర్జునుడూ, నకుల సహదేవులు కూడా, ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ, ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా, నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక, గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని రక్షించలేదా?’ అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.

కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి, ‘కృష్ణా! అలాగైతే, మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా, నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చేడు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మము’ అని వివరించాడు. ఆ సమాధానానికి ఉద్ధవుడు ఆశ్చర్య చకితుడై, ‘అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి, పాపములను మూట కట్టుకుంటుంటే, నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము కృష్ణ’ అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు. నీకే అర్ధమవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడనీ, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడనీ గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరచినప్పుడే, మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు, జూదము గురించి నాకు తెలియదనుకోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే, ఆట పాండవులకు అనుగుణంగా సాగేది’ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు. వాసుదేవుడు బోధించిన మధురమైన గీతను విని, ఉద్ధవుడు ఎంతో ఆనందించి, తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో, కృష్ణుడికి నమస్కరించాడు. పూజలూ, ప్రార్థనలూ భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే. కానీ, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే, అంతటా ఆయనే కనిపిస్తాడని, సమస్త మానవళికీ తెలియజేసేదే ‘ఉద్ధవ గీత’.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxmu0PlOYJc2H3O7EySIXJqt_kOxH60_Ha

09 October, 2022

ఆదికవి వాల్మీకి జయంతి! Valmiki Jayanthi


అందరికీ 'ఆదికవి వాల్మీకి జయంతి' శుభాకాంక్షలు! 09-10-2022

మహర్షి వాల్మీకి, గొప్ప భారతీయ ఇతిహాస గ్రంథమైన 'శ్రీమద్ రామాయణ' గాధ రచయిత. ఆయన మొదటి సహస్రాబ్ది ప్రారంభంలో నివసించిన ఒక హిందూ మహర్షి. ఆయన 'ఆదికవి'గా పేరుగాంచారు. హిందూ 'స్లోకం' యొక్క అసలు సృష్టికర్త.

[ వాల్మీకి మహర్షి చరిత్ర = https://youtu.be/ceNwjWyMyeg ]

నిజానికి 'వాల్మీకి' భృగు వంశానికి చెందిన పుట్టుకతో ఒక బ్రాహ్మణుడు. విధి అతన్ని దొంగల కుటుంబానికి అప్పగించింది. సప్తర్షులు, మరియు నారద మహర్షితో అనుకోకుండా ఏర్పడిన పరిచయం, ఆయన జీవితాన్ని మార్చివేసింది. రామ నామాన్ని, లేదా రాముని పేరును పునశ్చరణ చేయడం ద్వారా, ఆయన 'మహర్షి', లేదా గొప్ప 'ఋషి' అనే అత్యున్నత స్థితిని పొందారు. దీర్ఘ కాలం తపస్సు చేసిన సమయంలో ఆయన శరీరంపై ఒక 'వల్మీకం' లేదా 'పుట్ట' పెరిగింది. తద్వారా ఆయనకు 'వాల్మీకి' అనే పేరు వచ్చింది.

మహర్షి నారదుడు తన ఆశ్రమానికి వచ్చినప్పుడు, ఆయనను సముచిత గౌరవంతో ఆహ్వానించి, ఆయనను వాల్మీకి ఒక ప్రశ్న అడిగాడు. ఈ లోకంలో ఆదర్శ పురుషుడు ఎవరు? అని. అప్పుడు నారద మహర్షి ఇచ్చిన సమాధానమే, వాల్మీకి 24,000 శ్లోకాలతో కూడిన అద్భుతమైన కావ్యానికి పునాదిగా మారింది. ఈ కథలో లోతుగా మునిగి, వాల్మీకి తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి తమసా నదికి బయలుదేరాడు.

ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన నది, ఆయనకు కథానాయకుడి యొక్క పరిపక్వత, మరియు నిరాడంబరమైన గుణాన్ని, చూసేవారికి గుర్తు చేసింది. లోతైన నీటిలో ప్రతిబింబించే స్వచ్ఛమైన, మరియు పవిత్రమైన వ్యక్తి యొక్క మనస్సును, ఆయన దృశ్యమానం చేశాడు. మరుసటి క్షణంలో, హృదయం లేని వేటగాడు, ప్రేమ పక్షుల జంటలోని మగ పక్షిని కనికరం లేకుండా చంపడాన్ని ఆయన చూశాడు. బాధలో ఉన్న ఆడపక్షి యొక్క దయనీయమైన రోదన, ఋషి హృదయాన్ని ఎంతగానో కదిలించింది. ఆయన వేటగాణ్ణి శపించాడు. ఆ శాపం, ఆయన నోటి నుండి 'శ్లోకం' రూపంలో వెలువడింది. ఋషి 'కవి'గా మారాడు..

ఆయన తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు, చతుర్ ముఖ బ్రహ్మ ఆయనకు కనిపించాడు. నారద మహర్షి రాముడి కథపై ఒక పురాణ కావ్యాన్ని రచించమని ఆదేశించాడు. నారద మహర్షి ఆయనకీ అన్ని సంఘటనల దర్శన వరం, మరియు కథతో అనుసంధానించబడిన అన్ని రహస్యాలనూ బహిర్గతం చేశాడు. తదనుగుణంగా వాల్మీకి ఇతిహాసాన్ని రచించాడు. దానికి రామాయణం అని పేరు పెట్టాడు. సదరు రామాయణం, యుగయుగాలుగా, ఒక మనిషి ధర్మ బద్ధంగా జీవించడానికి నిలువెత్తు నిదర్శనంగా 'శ్రీరాముణ్ణి' చూపిస్తుంది.

ఈ వాల్మీకి జయంతి సందర్భంగా ప్రతి ఒక్క హిందువూ మహర్షి వాల్మీకి విరచిత రామాయణాన్ని చదివి, ప్రభువులకే ప్రభువైన శ్రీ రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని, ధర్మ బద్ధమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను..

ధర్మో రక్షతి రక్షితః!

శరద్ పూర్ణిమ / కోజాగరీ పూర్ణిమ విశిష్టత! Sarad Purnima / Kojagari Purnima


ఈ రోజు '09-10-2022' శరద్ పూర్ణిమ..

ఆశ్వీయుజ పూర్ణిమకే శరద్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.

ఈ శరద్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్ర కాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.

శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరద్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు, వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేశారట.

ఈ పూర్ణిమకే కోజాగరీ పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.

అందరికీ శరద్ పూర్ణిమ శుభాకాంక్షలు..

ఓం శ్రీ మాత్రే నమః

05 October, 2022

అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavad Gita

  

అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 27 నుండి 32 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bs3KpJUcTQA ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:43 - ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ।। 27 ।।

గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైఃశ్రవసమును. గజేంద్రములలో నేను ఐరావతమును, మరియు మనుష్యులలో రాజును.

తన వైభవాన్నీ, మహిమనూ తెలియపరచటానికి, ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసమనేది, దేవలోకాల్లో ఉన్న అత్యంత శ్రేష్ఠమైన రెక్కల గుఱ్ఱము. అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది, మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. ఉచ్చైఃశ్రవసము, సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము, ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని ఏనుగు. దానినే, అర్ధ-మాతాంగము అని కూడా అంటారు. అంటే, "మేఘాలలో ఉండే ఏనుగు" అని అర్థం. ఐరావతం, గజములన్నింటిలో అత్యుత్తమమైనది.

01:47 - ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।

ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో, కామదేవుడైన మన్మథుడను,  సర్పములలో వాసుకిని నేను.

వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి, దధీచి మహాముని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధంతోనే, వృత్తాసురుడిని సంహరించాడు. సమస్త లోకాలలో కెల్లా, అన్ని ఆయుధాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం, వజ్రాయుధం. తన దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రమూ, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు సూచికగా ఉదహరిస్తున్నాడు, భగవానుడు. మైథున క్రియ అనేది, మంచి సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు, అది అపవిత్రమయినది కాదు. సంతానోత్పత్తి ద్వారా, మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి, మన్మధుడు కారణం. ఈ లైంగిక వాంఛకు మూలం, భగవంతుని యందే ఉంది. దీనిని ఇంద్రియ తృప్తి కోసం దుర్వినియోగం చేయకూడదు. కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి.

03:04 - అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। 29 ।।

నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో, నేను యమధర్మరాజును.

అనంతుడు అంటే, ఆది శేషుడు. ఇది విష్ణుమూర్తి శయనించే నాగుపాము. ఆయనకు పదివేల పడగలున్నాయి. ఆయన ప్రతియొక్క తలతో, భగవంతుని మహిమలను, సృష్టి ప్రారంభం నుండి గానం చేస్తూనే ఉన్నాడు. వరుణుడు అంటే, సముద్ర దేవత. అర్యముడు అంటే, అదితి యొక్క మూడవ పుత్రుడు. ఆయనను పితృగణముల నాయకునిగా పూజిస్తారు. యముడు అంటే, మృత్యు దేవత. ఈ జన్మలో ఆత్మ చేసిన వాటికి అనుగుణంగా, వచ్చే జన్మలో శిక్షలను, లేదా ఉత్తమగతులను, భగవంతుని తరపున అందిస్తాడు. అవి ఎంత భయంకరముగా, బాధాకరముగా ఉన్నా, తన ధర్మం నుండి కొద్దిగా కూడా తప్పడు. సంపూర్ణ దోషరహిత న్యాయమును అందించే వానిగా, ఆయన భగవంతుని యొక్క మహిమను ప్రకటిస్తున్నాడు.

04:13 - ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ।। 30 ।।

దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడనని తెలుసుకొనుము.

మహాశక్తి శాలి అయిన రాక్షస రాజు హిరణ్యకశిపుడి పుత్రుడిగా, ప్రహ్లాదుడు జన్మించాడు. కానీ, అతను అతి గొప్ప విష్ణు భక్తులలో ఒకనిగా అయ్యాడు. అందుకే, రాక్షసులలో ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విభూతిని ప్రకటిస్తున్నాడు. కాలమనేది, విశ్వములోని అత్యంత బలమైన, గొప్ప అస్థిత్వాలను కూడా లోబరుచుకుంటుంది. గంభీరమైన సింహము, అడవికి రారాజు, మరియు జంతువులలో భగవంతుని యొక్క శక్తి, సింహములో వ్యక్తమవుతుంటుంది. విష్ణు మూర్తి యొక్క దివ్య వాహనమైన గరుత్మంతుడు, పక్షులలో కెల్లా గొప్ప వాడు.

05:11 - పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।।

పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.

ప్రకృతిలో ఉన్న వాయువు, పవిత్రమొనర్చే పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది మలినమైన నీటిని నీటి ఆవిరిగా చేస్తుంది; భూమిపై ఉండే ఏదేనీ దుర్గంధమును తీసుకువెళ్ళిపోతుంది; ప్రాణవాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి, అగ్నిని మండేట్టుగా చేస్తుంది. ఈ విధంగా అది ప్రకృతిలో ఒక గొప్ప పవిత్రమొనర్చే పదార్ధము. శ్రీ రామచంద్రప్రభువు, భూమిపై అత్యంత శక్తివంతులైన యోధులలో ఒకడు. ఆయన విల్లు అత్యంత ప్రాణాంతకాయుధము. అయినా, ఆయన ఒక్కసారి కూడా తను శాసించే ఉన్నత స్థాయిని దుర్వినియోగం చేయలేదు. తను ఆయుధం ఉపయోగించింది, మంచి కోసం మాత్రమే. అందుకే ఆయన శస్త్రధారులలో సర్వోన్నతుడు. రాముడు భగవంతుని అవతారము కూడా. అందుకే శ్రీ కృష్ణుడు, ఆయనను తనుగా సూచిస్తున్నాడు. భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగా నది, ఒక పవిత్రమైన నది. అది స్వర్గ లోకముల నుండి భూమి పైకి దిగినది. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, ఆ నది యొక్క ఒడ్డున తపస్సునాచరిస్తుంటారు. సాధారణ నీటి లాగా కాకుండా, గంగా నది యొక్క నీళ్ళను ఒక బిందెలో పట్టి ఉంచితే, అది ఎన్ని సంవత్సరాలయినా పాడు కాదు. పూర్వ కాలంలో ఇది ఎంతో ప్రస్ఫుటంగా, గమనించదగినట్లుగా ఉండేది. కానీ, ఇప్పటి కాలంలో, కోట్ల లీటర్ల కాలుష్యకారకాలను గంగలో కలిపేయటం వలన, ఈ ప్రభావం కొంచం తగ్గింది. కానీ, ఎన్ని యుగాలు మారినా, గంగ తన స్వచ్ఛతను కొల్పోలేదు.

07:02 - సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికీ ఆది, మధ్య మరియు అంతమని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను, మరియు సంవాదములలో తర్కబద్ద నిర్ణయమును నేనే.

సృష్టి చేయబడిన ఆకాశమూ, గాలీ, అగ్నీ, నీరు మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్తగా ఆది, స్థితికర్తగా మధ్యమ, మరియు లయకర్తగా అంతమును. కాబట్టి, సృష్టి, స్థితి మరియు లయ ప్రక్రియలను, భగవంతుని విభూతిగా పేర్కొనవచ్చు. విద్య అనేది, ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రధానమైనవి పద్నాలుగు: "శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, చ్చందస్సు - ఈ ఆరూ వేదాంగములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగూ వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములూ కలిపి, మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు." ఈ విద్యలు అధ్యయనం చేయటం వలన, బుద్ధి పెంపొందించబడి, జ్ఞానం వృద్ధి చేంది, ధర్మ మార్గ అవగాహన ఏర్పడుతుంది. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, మనుష్యులను భౌతిక, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేసి, వారికి అమరత్వమును ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం, శ్రీ మద్భాగవతం లో కూడా చెప్పబడింది: "సా విద్యా తన్మతిర్యయా" అంటే, భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే, అత్యుత్తమ విద్య అని క్షుణ్ణంగా వివరించబడి ఉంది. వాదోపవాదములు, మరియు తర్కములో జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం, ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే, సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ, అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే, చర్చకు తర్కబద్ధమైన ముగింపును ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికీ, సత్యమును స్థిరపరచటానికీ, తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికీ, మరియు ఉపదేశించటానికీ, తర్కబద్ధమైన స్పృహయే, మూలాధారం. విశ్వవ్యాప్తమైన తర్కబద్ధ సూత్రములే, భగవంతుని శక్తికి నిదర్శనం.

09:39 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

02 October, 2022

'ఆడపిల్ల తండ్రి' భారతీయ సంస్కృతి - రామాయణ నీతి!

 

భారతీయ సంస్కృతి - రామాయణ నీతి!

ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో అద్భుతంగా చెప్పిన దశరథుడు..

దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో, జనక మహారాజు ద్వారం వద్దకు చేరాడు..

జనక మహారాజు, వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం పలికాడు.

వెంటనే దశరథ మహారాజు, ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేశాడు.

అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి, సంతోషంతో  ఆలింగనం చేసుకుని,
“రాజా! మీరు పెద్దవారు.. పైగా వరుని పక్షంవారు..
ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?
గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా?” అని అన్నాడు ఆశ్చర్యంగా..

అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన సమాధానం చెప్పాడు..
”మహారాజా, మీరు దాతలు.. కన్యదానం చేస్తున్నారు..
నేను మీ ద్వారా కన్యను పొందడానికి వచ్చిన యాచకుణ్ణి..
ఇప్పుడు చెప్పండి.. దాత, మరియు యాచకులలో ఎవరు గొప్ప?” అని అన్నాడు.

ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళవెంట ఆనందభాష్పాలు స్రవిస్తుండగా..
“ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో, వాళ్ళు భాగ్యవంతులు. ప్రతి కూతురి అదృష్టంలో తండ్రి ఉంటాడు.”

ఇదీ భారతీయత.. ఇదీ మన సనాతన సంస్కృతి.. ఇదీ రామాయణం నీతి!

రేపటి తరానికి బ్రతుకూ, భద్రతలతో పాటు, భారతీయతను కూడా నేర్పిద్దాం..

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!

లోకా సమస్తా సుఖినోభవంతు!

26 September, 2022

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?

 

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?
కీటక వేదవ్యాసుల సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేసిన భీష్ముడు!

అంపశయ్యపై ఉన్న భీష్ముడు, ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే, ఒకనాడు భీష్ముడిని చూడడానికి వచ్చిన బృహస్పతిని, ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు.. ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమమయినదని అడిగాడు. అందుకు బృహస్పతి, ఆ ఆరూ గొప్పవే కానీ, అందులో అహింస అత్యుత్తమమని చెప్పి, భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి వెళ్ళిపోయాడు. నిజంగానే అహింస అన్నింటికన్నా గొప్పదా? మరి అహింసకు సంబంధించి, భీష్ముడు చెప్పిన సత్యం ఏంటి? అహింస కారణంగా, కురుక్షేత్రంలో మరణించిన వారు ఎటువంటి లోకాలను పొందారు? అనేటటువంటి జీవిత సత్యాలను ఎరుకపరచే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Piy6yV5J-9M ]

బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు, అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో, "పితామహా! మునీశ్వరులంతా ముక్తకంఠంతో, అహింస చాలా ఉత్తమమని అంటున్నారు. అది ఎందుకంత గొప్పది?" అని అడిగాడు. అందుకు భీష్ముడు, "మనో వాక్కాయ కర్మలతో హింస, మాంసభక్షణం అనేవి చతుర్విధ ఘోర పాపాలు. మాంసభక్షణం మహాపాపంతో సమానం. అయితే, మాంసం రుచి మరిగిన వారు, దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే, మాంసభక్షణను విడిచి పెట్టడమే అహింసగా", ఆర్యులు విశ్వసించారని తెలియజేశాడు.  అందుకు వెంటనే ధర్మరాజు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. "పితామహా! మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమనీ, పైతృక క్రియను మాంసంతోనే నిర్వర్తించాలనీ పెద్దలంటారు. అలాంటప్పుడు, జంతువధ తప్పనిసరి కదా?" అని అడిగాడు. అయితే, సమాధానం తెలియజేయడానికి ముందు భీష్ముడు చిన్న చిరునవ్వి నవ్వి, "ధర్మరాజా! మాంసభక్షణను మానుకోవడం, అశ్వమేధయాగం కన్నా గొప్పది. వధించమని చెప్పడం, వధా... ఈ రెండూ మహాపాపాలు. అయితే, పితృకార్యాలలోనూ, యజ్ఞయాగాదులలోనూ, వేదం చెప్పినట్టుగా చేయడంతో, ఆ హింస వల్ల పాపం ఎంతమాత్రం అంటుకోదు. అయితే, మాంసం మీద మోజుతో, కావాలని ప్రాణుల్ని హింసిస్తే, అది మహాపాపం. తనను నమిలి మింగిన వాణ్ణి, మాంసం నమిలి మింగడం ఎప్పటికయినా జరిగి తీరుతుంది. మాంసం మహారుచిగా ఉంటుంది. అందుకే, దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని కాదనుకుని, మాంసాన్ని విసర్జించినవాడు, దేవతలతో సరిసమానుడని పెద్దల ఉవాచ.

రాళ్ళల్లోనూ, చెట్లలోనూ, మాంసం లభించదు. లభించేది ప్రాణుల వల్లనే! ప్రాణులను కత్తికో కండగా నరుకుతున్నప్పుడు, తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో, అతను అందుకు మళ్ళీ పూనుకోడు. మాంస భోజనాన్ని విడిచిపెడితే, అతనిలోని హింసా ప్రవృత్తి దానంతటదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే, ఆయురారోగ్యాలు పెరుగుతాయని, మార్కండేయాది మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే, దేవతలు రాక్షసులను అవలీలగా గెలువగలిగారు. దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ, అహింస ముందు దిగదుడుపే. నూరు సంవత్సరాలు చేసిన తపశ్చర్యా, మాంసాహారాన్ని మానుకోవడం, రెండూ ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు, దాన ధర్మాలతో, బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ, మాంసాన్ని ముట్టని వారికి, బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టని వారికి, ఆయురారోగ్య బలకీర్తులు, అనాయాసంగా లభిస్తాయని పెద్దలంటారు." అని, మాంసాహారానికి సంబంధించిన విషయాలను భీష్ముడు వివరించగా, అందుకు ధర్మరాజు, "పితామహా! మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పదనం ఉంది కదా, మరెందుకు మనుషులు మాంసాన్ని విసర్జించరు?" అని ప్రశ్నించాడు.

అప్పుడు భీష్ముడు, "ఎందుకు విసర్జించరంటే, అది మహారుచి. పైగా, దానిని తిన్నవారు, శృంగారంలో బలిమి కలిగి ఉంటారు. ఎంత దూరం నడిచినా, వారికి అలుపు రాదు. శరీరం మీది గాయాలు మానిపోతాయి. బక్కచిక్కిన వాడికి, మాంసభక్షణ పుష్టి కలిగిస్తుంది. అందుకే దానిని వదలరు. అయితే ఒక్క విషయం, ప్రాణభయం, జీవాలకన్నింటికీ ఒకటే! అందుకే, తోటి ప్రాణుల్ని దయగా చూడమంటారు. అలా చూసిన వాడు, బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు. దానం, తపస్సు, సత్యం, యజ్ఞం, శౌచం, మంత్ర తంత్రాలూ.. ఇవన్నీ అహింసా స్వరూపాలు." అని చెప్పి, భీష్ముడు ముగించాడు. అప్పుడు ధర్మరాజుకు, అహింస వలన కురుక్షేత్రంలో మరణించిన వారికి ఎలాంటి గతులు కలుగుతాయనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని భీష్ముడికి తెలియజేయగా, భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన సంవాదాన్ని, ధర్మరాజుకి తెలియజేశాడు..

రణరంగంలో రథాలు పరుగుదీస్తున్నాయి. అయితే, వాటికన్నా వేగంగా ఓ కీటకం పరుగుదీస్తూ, రథాలను దాటిపోతోంది. వేదవ్యాసుడు దానిని గమనించి, ఆ కీటకాన్ని ప్రశ్నించాడు.. "ఎందుకంత వేగం? ఏమిటి కారణం?" అని. అందుకు కీటకం కాస్త ఆగి, "ఏం చెప్పమంటావు మునీంద్రా! ఒకదాని వెనుక ఒకటిగా, రథాలు వస్తున్నాయి. రథ చక్రాల ధ్వని మారుమ్రోగుతున్నది. గుర్రాలను అదిలిస్తున్న వారి గొంతులు, మహా భీకరంగా వినవస్తున్నాయి. భయం వేస్తోంది. బ్రతుకంటే ప్రాణికి మహాసుఖం. చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేను. చనిపోవడం ఇష్టం లేదు. అందుకే విపరీతమైన వేగంతో పరుగుదీస్తున్నాను. ప్రాణభీతి కన్నా, పరమ ఆందోళనకరం ఇంకేముంది?" అని వేద వ్యాసుడి దగ్గర వాపోయింది. "నీలాంటి జీవులకూ ఇంద్రియ సుఖం ఉంటుందా? ఉన్నా అది ఏ మాత్రం? ఎప్పుడూ దుఃఖంతో ఉండే నువ్వు, బతికి ప్రయోజనం ఏముంది? చనిపోవడమే సుఖం కదా? బాగా ఆలోచించు.. నీకే అన్నీ తెలుస్తాయి." అని బోధించాడు వ్యాసుడు. అప్పుడు ఆ కీటకం, "అదేమిటి మౌనీ, అంతమాటన్నావు? పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్టుగా మాట్లాడతావేమిటి? మాకూ మా స్థాయిని బట్టి, ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. వాటిని మేము అనుభవిస్తున్నాము. కాబట్టే, చావంటే భయపడుతున్నాను. నీకీ సంగతి తెలియక కాదు. నా చేత చెప్పించాలని అడిగావు. అంతేనా?" అంది కీటకం. అందుకు వ్యాసుడు నవ్వగా, "మహామౌనీ, నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది. చెబుతాను, వింటావా?" అని అడిగింది. అందుకు వ్యాసుడు సరేనన్నాడు. 

అప్పుడు కీటకం, ‘ఓ మహాముని, గత జన్మలో నేను బాగా డబ్బున్న వాణ్ణి. అయినా, ఇంకా సంపాదించాలనే అత్యాశతో, ఇతరుల డబ్బు కూడా కాజేశాను. కోప తాపాలతోనూ, పెద్దల పట్లా, ప్రముఖల పట్లా వినయాన్ని ప్రదర్శించక, యథేచ్ఛగా తిరిగాను. అయితే, నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆమెను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి. ప్రేమగా చూసేవాణ్ణి. ఒకనాడు, ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. అతను అడిగినవన్నీ సమకూర్చి పెట్టి, దణ్ణం పెట్టాను. ఆ కారణంగానే, నాకీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మంచి చేస్తే మంచే జరుగుతుందని, నాకప్పుడు తెలిసింది. మహామౌనీ, అడుగుతున్నానని ఏమీ అనుకోక పోతే, పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు చెప్పండి. ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తోంది. చెప్పండి స్వామీ" అని అడిగింది కీటకం. అందుకు వ్యాసుడు, "ప్రత్యేకించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. పాపాలు చేశావు, పురుగుగా జన్మించావు. ఆ సంగతి నీకూ తెలుసు. అలాగే పుణ్యం చేసి, పూర్వజన్మ జ్ఞానం సంపాదించావు. ఇదీ నీకు తెలిసిందే! నీ గురించి ఇదంతా తెలిసినందువల్లే, నేను నీతో మాట్లాడాలనిపించి, మాట్లాడాను. ఇకపోతే, నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు. తపోబలాన్ని మించింది లేదు. మానవజన్మ స్వీకరించి, పుణ్యం చెయ్యి. అది నీకెంతో శుభప్రదం. పాప పుణ్యాల వల్లనే, మనిషికి గొప్ప జన్మలూ, అధమాధమ జన్మలూ ప్రాప్తిస్తున్నాయి. నువ్వు చేసిన పుణ్యం కారణంగానే, నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు, నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు. నీకిక సమున్నత స్థితి లభిస్తుంది. త్వరలోనే మానవజన్మను సాధిస్తావు. మానవజన్మలో కూడా, నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. దాంతో నీకు ధర్మతత్పరత అలవడుతుంది." అని చెప్పి, వెన్నెలంత చల్లగా, అమృతం కురుస్తున్నంత హాయిగా, ఆ కీటకాన్ని చూసి, "శుభం భూయాత్‌" అని ఆశీర్వదించాడు.

వెంటనే వ్యాసుని పాదాలను తాకి అతనికి ప్రణమిల్లి, అక్కడే ప్రాణత్యాగం చేసిందా కీటకం. వ్యాసమహర్షి ఆశీస్సులకనుగుణంగా, మరణానంతరం మానవునిగా అనేక జాతులలో జన్మించింది, ఆ కీటకం. పుణ్యకర్మలు ఆచరించి, చివరికి క్షత్రియవంశంలో వర్ధిల్లింది. రాజయింది. రాజయి, ఏనుగుపై కూర్చుని, వేలకొలదీ కొమ్ముటేనుగులతో, ఛత్రచామరాలతో, రకరకాల కేతనాలతో పరుగులుదీసే పరివారంతో, వ్యాసమహర్షిని మళ్ళీ సందర్శించింది. అతని పాదాలకు నమస్కరించి నిల్చుంది. రాజు అణకువను ఎంతగానో మెచ్చుకున్నాడు, వ్యాసుడు. అభిమానంగా అక్కున చేర్చుకుని, "రాజా! ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు. తర్వాత గోవుల కోసంగానీ, బ్రాహ్మణుల కోసంగానీ యుద్ధం చేసి, యుద్ధభూమిలో మరణిస్తే, పై జన్మలో బ్రాహ్మణత్వం సాధిస్తావు." అని అన్నాడు. అలా మహర్షి చెప్పినట్టుగానే చేశాడు, ఆ రాజు.

బ్రాహ్మణునిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలెన్నో చేశాడు. యూప స్తంభావళిని నెలకొల్పాడు. లోకారాధ్యుడయ్యాడు. మరణించి స్వర్గలోకంలో దేవేంద్రునికి మిత్రుడయ్యాడు. కొన్నాళ్ళకు కైవల్యాన్ని అందుకున్నాడు. అని ఆ కీటకం గురించి చెప్పి, ‘ధర్మరాజా! యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారోనని ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు సంగతి చెబుతున్నాను, విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ, ఉత్తమలోకాలనే పొందారు. ఈ విషయమై నీకిక ఆందోళన అనవసరం.’ అని తెలియజేశాడు భీష్ముడు.

కృష్ణం వందే జగద్గురుం!

21 September, 2022

ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము! Bhagavad Gita


ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము!

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (16 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 16 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ssKwn-s-CpY ]

భగవంతుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఆయనను ఎలా స్మరిస్తూ ఉండాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।।

00:55 - కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।

నీవు సమస్త జగత్తుల యందూ వ్యాపించి, వాటి యందు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగీశ్వరా, నేను మిమ్ము ఎలా తెలుసుకోగలను, మరియు ఎలా స్మరిస్తూ ఉండేను, అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో మిమ్ము చింతన చేయగలనో తెలియజేయండి భగవాన్!

ఇక్కడ యోగం అంటే, భగవంతుని దివ్యమైన శక్తి అయిన యోగమాయ. అలాగే, యోగి అంటే, యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు భగవానుడని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు ఏ విధంగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటినీ, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. సమస్త జగత్తునూ నియంత్రించి, నిర్వహించే వాడిగా, శ్రీ కృష్ణుడి మహిమలనూ, మరియు అత్యున్నత స్థాయిని గురించీ వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు.. "నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించబడటానికి, నీ దివ్య లీలలను తెలుసుకోగోరుతున్నాను. నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నా మీద కృపతో, నిన్ను అర్థంచేసుకోవడానికి, నీ యొక్క మహిమలను తెలియచేయుము." అని భగవానుడిని అడుగుతున్నాడు, అర్జునుడు.

02:18 - విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।

 ఓ జనార్ధనా! మరల విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలనూ, మరియు అవతారములనూ చెప్పుము. నీ దివ్యామృతమును వింటూ ఉంటే, అది ఎన్నటికీ తనివితీరదు.

భగవంతుని మహిమలను వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతమయమైన శ్రీ కృష్ణుడి మాటలను, ఇప్పటివరకూ తన చెవులతో త్రాగుతున్నాడు అర్జునుడు. ఇక ఇప్పుడు, "ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు." అని అంటూ, భగవంతుడిని ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది, అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు, ఇదే విషయాన్ని చెప్పారు: "శ్రీ కృష్ణుడి భక్తులైనవారికి, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా సరిపోదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే, అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది." అని వివరించాడు.

03:28 - శ్రీ భగవానువాచ ।
హంత తే కథయిష్యామి దివ్యా హ్యత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ।। 19 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ కురు శ్రేష్ఠ.. ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే, వాటి వివరణకి అంతమే లేదు.

భగవంతుని శక్తులూ, మరియు ఐశ్వర్యములూ అనంతమైనవి. నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే. ఆయనకు అనంతమైన రూపములున్నవి. అనంతమైన నామములూ, అనంతమైన ధామములూ, అనంతమైన అవతారములూ, అనంతములైన లీలలూ, అసంఖ్యాకమైన భక్తులూ, ఇలా ఎన్నెన్నో. కాబట్టి, వేదములు ఆయనను అనంతుడు అంటాయి. "భగవంతుడు అనంతుడూ, మరియు అసంఖ్యాకమైన రూపములలో ఈ విశ్వములో ప్రకటితమౌతాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించేదయినా, ఆయన అకర్త." అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలియజేస్తుంది. "భగవంతుడు అనంతుడు, మరియు ఆయన తన అనంతమైన అవతారాలలో చేసే లీలలు కూడా, అనంతములు." అని రామాయణంలో వివరించబడి ఉంది. "భగవంతుని మహిమలను లెక్కించగలమని అనుకునే వారు, అల్ప బుద్ధులు. ఈ భూమిపై ఉన్న ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చు కానీ, భగవంతుని యొక్క అనంతమైన మహిమలను గణించలేము." అని వేద వ్యాస మహర్షి దృఢంగా ప్రకటించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు ఇక్కడ, తన విభూతులలోని అతికొద్ది భాగాన్ని మాత్రమే వివరించబోతున్నానని అంటున్నాడు.

05:01 - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।

ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము.

శ్రీ కృష్ణుడు, తానేమీ జీవుడికి అంత దూరంగా, వేరుగా లేనని అంటున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ, అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. "భగవంతుడు మన ఆత్మలయందు స్థితమై ఉన్నాడు." అని వేదములు పేర్కొంటున్నాయి. అందులో కూర్చుని, ఆ ఆత్మకు జీవశక్తి, మరియు నిత్యశాశ్వత గుణమునూ ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది, మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము, మరియు చైతన్యవంతులము కాలేదు. పరమ చైతన్యవంతుడూ, మరియు సనాతనుడూ అయిన భగవంతుడు మనలోనే ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత, అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి, శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నానని అంటున్నాడు. శ్రీ కృష్ణుడే, సమస్త జీవ భూతముల మొదలూ, మధ్యా, తుది. అవి ఆయన నుండే ఉద్బవించాయి. కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవము అంతా, ఆయన శక్తి చేతనే సంరక్షింపబడి, కొనసాగింపబడుతున్నది. కాబట్టి, ఆయనే మధ్య. అలాగే, మోక్షము పొందిన వారు, ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే, నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే, భగవంతుడే అన్ని ప్రాణులకూ తుది.

06:41 - ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో, నేను విష్ణువును. ప్రకాశవంతమైన వస్తువులలో, నేను సూర్యుడను. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట, ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.

పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే, కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు. అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా, ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు. వారే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు, విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో విష్ణువుగా, వామన స్వరూపంలో తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని, కృష్ణుడు పేర్కొంటున్నాడు. అలాగే, ప్రకాశవంతమైన వాటిలో, సూర్యుడు సర్వోన్నతుడు. రాత్రి పూట అన్ని దీపాలూ, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం, రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది. అది తన విభూతి అని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, "వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు" అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలూ, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు శ్రీ కృష్ణుడు. అయితే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా, దైత్యులకు, అంటే, అసురులుకు తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా, దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డను గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో, ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేశాడు. కానీ, అది భ్రూణములుగా మారింది. ఇవి మరుత్తులైనాయి. అంటే, ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే 49 రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి, అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు, మరీచి అని కూడా ఉంది. వాయువులలో తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

09:08 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన గురించీ, తన విభూతి గురించీ కొనసాగించిన అంశాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

19 September, 2022

ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం! Manmadha reincarnated as Pradyumna


ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం!

మన్మథుడు మనుష్యుల మనస్సుల్లో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని, జన్మతః కలిగినవాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుక, అతని వాహనం. తియ్యటి చెరుకుగడే అతని విల్లు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే, అతని బాణాలు... వాటితో అతను ఎవరి మనస్సులనైనా మధించి వేయగలడు. అలా మనస్సును మథించేవాడు కాబట్టి, ఆయనకు మన్మథుడని పేరు. లోక కల్యాణం కోసం మన్మథుడు శివునిపై తన బాణాన్ని ప్రయోగించగా, ఆ సంగతి తెలుసుకుని, తన త్రినేత్రంతో అతడిని బూడిదచేశాడనే సంగతికూడా తెలిసిందే.. అయితే, శ్రీ హరి కుమారుడైన మన్మథుడు, శివుడి చేతిలో ఎందుకు మరణించాడు? భర్తను కోల్పోయిన రతీ దేవికి, దేవతలిచ్చిన వరం ఏమిటి? రుక్మిణీ దేవి పుత్ర శోకానికీ, మన్మథుడికీ సంబంధం ఏంటి – వంటి చారిత్రక అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QT_irVokuaQ ]

సంతానం కోసం విష్ణుమూర్తి ఒకప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుని వర ప్రభావంతో, విష్ణుమూర్తికి ఓ చక్కని కుమారుడు జన్మించాడు. అతనే మన్మథుడు. శంకరుని ప్రార్థించి, విష్ణుమూర్తి తనను ప్రార్థించలేదని, సతీదేవికి కోపం వచ్చింది. ఆ కోపంతో, శివుని అనుగ్రహంతో విష్ణుమూర్తికి జన్మించిన కుమారుడు, అదే శివుని ఆగ్రహంతో మరణిస్తాడని శపించింది. అప్పుడు విష్ణుమూర్తి సతీదేవిని ప్రార్థించాడు. మన్నించి శాపం తొలగించమన్నాడు. అప్పుడు సతీ దేవి, మరణించినప్పటికీ నీ కుమారుడు మరల జన్మిస్తాడని, విష్ణుమూర్తికి అభయం ఇచ్చింది. మన్మథుడు చూడ చక్కనివాడు. లోకంలోని అందం అంతా పోగయి, తీర్చిదిద్దినట్టుగా ఉంటాడతను. చిలుక వాహనంగా, చెరకుగడ విల్లుగా, అరవిందాది పుష్పాలు బాణాలుగాగలిగిన మన్మధుడికి, వసంతుడు చెలికాడు. మన్మథుని వామభాగం నుండి, ఓ కన్య జన్మించింది. ఆమె పేరు రతీదేవి. అయితే, కొన్ని ఆధారాల ప్రకారం, రతీ దేవి దక్ష ప్రజా పతి కుమార్తెగా కూడా చెప్పబడుతుంది. మన్మథుడు రతీ దేవిని భార్యగా స్వీకరించాడు. మన్మథకార్యం ఒక్కటే.. బ్రహ్మాదిదేవతలనేగాక, జితేంద్రియులయిన మహర్షులను కూడా మోహపెట్టి, వారిని కామాసక్తులను చేయడమే, తన కర్తవ్యం. తమను తారకాసురుడు హింసిస్తున్నప్పుడు, దేవతలంతా బ్రహ్మదేవుని సమీపించి, మొరపెట్టుకున్నారు. కాపాడమని వేడుకున్నారు. శివునికి పుట్టే కుమారుడు తప్ప, మరెవరూ తారకాసురుణ్ణి వధించలేరనీ, అంత వరకూ ఓర్పు వహించాలనీ అన్నాడు బ్రహ్మ. ఆ సమయంలో పరమనిష్ఠతో, శివుడు ఘోరతపస్సు చేస్తున్నాడు. ఆయనను వివాహం చేసుకోవాలని, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వేచి ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు, దేవతలు. అందుకే మన్మథుణ్ణి ఆశ్రయించారు.

శివుని మనస్సు పార్వతిపై లగ్నమయ్యేటట్లుగా చేయమని, మన్మథుడిని ప్రార్థించారు. శివుని మీదకు పూలబాణాలు ప్రయోగించసాగాడు. ఆ బాణాలకు శివుని ఏకాగ్రత మళ్ళి, మనస్సు చెదిరింది. తననలా చేసింది ఎవరన్నట్టుగా, కోపంతో కళ్ళు తెరచి చూశాడు శివుడు. ఎదురుగా మన్మథుడు కనిపించాడు. రెట్టించిన కోపంతో, మూడవకన్ను తెరవడంతో, మన్మథుడు బూడిదయ్యాడు. భర్త బూడిదయిపోయాడని తెలిసి, రతీదేవి విలపించింది. అతని వియోగాన్ని తట్టుకోలేక రోదించింది. అప్పుడు దేవతలు, మరణించిన మన్మథుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడని, తెలియజేశారు. ఆమెను ఓదార్చారు. కొన్నాళ్ళకు నారదుడు, రతీదేవిని సందర్శించాడు. రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుడతాడనీ, అయితే, అతన్ని శంభరాసురుడు చంపేందుకు ప్రయత్నిస్తాడనీ, చెప్పాడు. తన భర్తను కాపాడుకునేందుకు రతీదేవి భూలోకానికి విచ్చేసింది. మాయావతి పేరుతో శంభరాసురుని ఇంట చేరి, అతడికి సేవలు చేయసాగింది. కొద్దిరోజులు గడవగా, ద్వారకలో రుక్మిణీదేవికి చక్కని కుమారుడు జన్మించాడు. అతడే ప్రద్యుమ్నుడు.

నాడు శివుని మూడవకంటికి బూడిదయిన మన్మథుడు, కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తికి కుమారుడయ్యాడు. ప్రద్యుమ్నుడు జన్మించి, వారం రోజులు కూడా గడవక ముందే, ఆపద ముంచుకొచ్చింది. జటాసురుని పుత్రుడైన శంభరాసురునికి, ప్రద్యుమ్నుని కారణంగా మరణం ఉన్నదని తెలిసింది. ఆ సంగతి ఆకాశవాణి చెప్పి, శంభరాసురుడిని హెచ్చరించింది. దాంతో శంభరాసురుడు, కాకిరూపంలో రుక్మిణి ఇంట ప్రవేశించి, ప్రద్యుమ్నుని ముక్కున కరచుకుని తీసుకుపోయి, సముద్రంలో పడవేశాడు. మాగన్నులో ఉన్న రుక్మిణి, పొత్తిళ్ళలో పిల్లాడు ఉన్నాడనుకున్నది. మెలకువ తెచ్చుకుని చూసే సరికి, పిల్లవాడు లేడు. రాజ్యమంతా ప్రద్యుమ్నుని కోసం వెదకసాగారు. కానీ, ఎవరికీ దొరకలేదు. కాకి రూపంలో వచ్చిన శంభరాసురుడు, ప్రద్యమ్నుణ్ణి సముద్రంలో పడవేయగా, ఒక చేప మింగి వేసింది. దైవవశాన ఒక జాలరి వలకు చిక్కింది. వలలో చిక్కిన చేపను చూసి ముచ్చటపడ్డాడు, జాలరి. దానిని కానుకగా, రాజైన శంభరాసురునికి బహూకరించాడు. వంటవారు ఆ చేపను కోసి చూడగా, దాని కడుపులో ఉన్న బాలుణ్ణి చూసి, ఆశ్చర్యపోయారు.

అక్కడున్న మాయావతికి పిల్లాడి సంగతి చెప్పి, ఏం చేద్దామని ప్రశ్నించారు. ఆలోచనలో పడింది మాయావతి. ఈ పిల్లాడు ఎవరయి ఉంటాడంటూ, తర్జనభర్జన పడసాగింది. అప్పుడు నారదుడు వచ్చాడక్కడికి. మాయావతిగా ఉన్న రతీదేవికి జరిగిన సంగతంతా వివరించాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, నీ భర్తే అని అన్నాడు. శంభరాసురుడు సముద్రంలో పడవేస్తే, చేప మింగిందన్నాడు. రతీదేవి సంతోషించి, ప్రద్యుమ్నుణ్ణి జాగ్రత్తగా పెంచసాగింది. ప్రద్యుమ్నుడు యువకుడయ్యాక, అతనికి పూర్వగాథంతా చెప్పింది, రతీదేవి. తారకాసురుని కారణంగా అప్పుడలా విడిపోయి, ఇప్పుడిలా కలుసుకున్నామని చెప్పింది, రతీ దేవి. శంభరుని వల్ల ప్రమాదం ఉన్నదని చెప్పి, అతనికి మహామాయావిద్యను ఉపదేశించింది. ఆమె చెప్పిన విద్యను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న ప్రద్యుమ్నుడు, శంభరాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇద్దరి మధ్యా ఘోరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శంభరాసురుడు, అనేక మాయలు ప్రయోగించాడు. ఆ మాయలన్నింటినీ తను నేర్చుకున్న మహామాయావిద్యతో, తుత్తునియలు చేశాడు ప్రద్యుమ్నుడు. చివరికి శంభరాసురుణ్ణి సంహరించాడు. రాక్షస సంహారానంతరం, భార్య రతీదేవితో సహా, ఆకాశానమార్గాన ద్వారకకు పయనమయ్యాడు ప్రద్యుమ్నుడు.

సరాసరి అంతఃపురంలో దిగిన ప్రద్యుమ్నుని చూసి, చెలికత్తెలు కృష్ణుడనే అనుకున్నారు. తర్వాత అతని పక్కన ఉన్న రతీదేవిని చూసి, కాదనుకున్నారు. ప్రద్యుమ్నుని చూసి రుక్మిణీదేవి, ఆనాడు తను కోల్పోయిన బిడ్డ పెరిగి పెద్దయితే ఇంతవాడయ్యేవాడు కదా! అని అనుకున్నది. పట్టి పట్టి ప్రద్యుమ్నునిలో పోలికలను వెదకసాగింది. అప్పుడక్కడికి నారదుడూ, దేవకీవసుదేవులతో సహా శ్రీకృష్ణుడు కూడా వచ్చారు. రుక్మిణికి జరిగిన కథంతా తెలియజేశాడు, నారదుడు. ఈ కుర్రవాడు నీ కొడుకే అని నారదుడు చెప్పడంతో, రుక్మిణీ దేవి ఎంతో ఆనందించింది. వెంటనే సతీసమేతంగా ప్రద్యుమ్నుడు, తల్లిదండ్రులకూ, పెద్దలకూ నమస్కరించాడు. వారి ఆశీర్వాదాలందుకున్నాడు. అయితే, ప్రద్యుమ్నుడు, మేనమామ రుక్మి కుమార్తె అయిన రుక్మావతిని కూడా వివాహం చేసుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి మరీ, రుక్మావతిని సొంతం చేసుకున్నాడు. బావ – బావమరుదులుగా, రుక్మి, కృష్ణులకు శత్రుత్వం ఉన్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం, తెగిన బంధుత్వాన్ని కలుపుకోవడం కోసం, రుక్మావతితో ప్రద్యుమ్నుని వివాహానికి ఇరువురూ అంగీకరించారు. రుక్మావతీ ప్రద్యుమ్నులకు, ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అనిరుద్ధుడు. అతను తండ్రి తాతలు ఇరువురికీ, సరి సమానుడిగా ప్రసిద్ధిగాంచాడు.

కృష్ణం వందే జగద్గురుం!

16 September, 2022

గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా? Scientific Facts About River Ganga


గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయా?

ఒకసారి శివపార్వతులు ఆకాశమార్గంలో కాశీ నగరానికి వెళ్తున్నారు. వారికి గంగానదిలో అనేకమంది యాత్రికులు స్నానాలు చేస్తుండటం కనిపించింది. అది చూసి పార్వతీదేవి ఇలా అన్నది.. ‘నాథా! ఇంతమంది గంగలో స్నానాలు చేస్తున్నారు కదా! నిజంగానే వారి పాపాలు తొలగిపోతాయా? అదే నిజమైతే, అందరూ పాపాలు చేసి, వాటి ఫలితాన్ని అనుభవించకుండా, గంగాస్నానం చేసి పోగొట్టుకుంటారు కదా!’ అని సందేహం వెలిబుచ్చింది.

[ గంగ పవిత్రతకు సాక్ష్యాలుగా నిలుస్తున్న పరిశోధనలు!  = https://youtu.be/gSFGqtO5ABU ]

ఈశ్వరుడు చిరునవ్వుతో.. ‘దేవీ! నీవు నేను చెప్పిన విధంగా చేస్తే, నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’ అంటూ, ఆమె ఏమి చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం పార్వతీమాత, పండు ముతైదువ రూపం ధరించి, గంగలో మునిగిపోతున్న ఒక వృద్ధుణ్ణి చూపిస్తూ, ‘దయచేసి నా భర్తను కాపాడండి’ అంటూ కేకలు వేయసాగింది. ఆ మాటలు విని చాలామంది గంగలోకి దూకి, ఆమె పతి ప్రాణాలను రక్షించేందుకు సిద్ధమయ్యారు. అది చూసిన వృద్ధురాలు, ‘అయ్యా..! నా భర్తకొక శాపం ఉంది. పాపాత్ములెవరయినా ఆయనను ముట్టుకుంటే, వెంటనే ఆయన ప్రాణాలు పోతాయి. అదే విధంగా, ఆయనను తాకిన వారి తల బద్దలవుతుంది. కనుక మీలో పాప రహితులు మాత్రమే ఆయనను రక్షించేందుకు పూనుకోండి’ అని హెచ్చరించింది.

ఆ మాటలు విని అందరూ వెనక్కి వెళ్లిపోయారు. ఒకే ఒక వ్యక్తి మాత్రం నదిలో దూకి, కొట్టుకు పోతున్న వృద్ధుడి రెక్క పుచ్చుకుని, తన వీపు మీద ఆయనను మోస్తూ, ఒడ్డుకు తీసుకు వచ్చాడు. వృద్ధురాలు అతనికి కృతజ్ఞతలు చెబుతూ.. 'నాయనా! నీవు ప్రాణాలకు తెగించి మరీ నా మాంగల్యం దక్కించావు. నీవు పాపరహితుడవా?’ అని అడిగింది. అందుకా వ్యక్తి, ‘అమ్మా! నేను ఇంతకు ముందే గంగా స్నానం చేసి పునీతుడనయ్యాను. అందుకే నీ పతి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నించాను’ అని చెప్పాడు.

పార్వతీ పరమేశ్వరులు ఆ వ్యక్తికి దర్శనమిచ్చి, అంతులేని సంపదలను ప్రసాదించి, తిరిగి విను వీధులలో విహరించ సాగారు. ‘చూశావా దేవీ! విశ్వాసం ఉంటే, గంగ తప్పకుండా వారి పాపాలను ప్రక్షాళన చేస్తుంది’ అని అన్నాడు పరమేశ్వరుడు. అర్థమైందన్నట్లుగా పార్వతి చిరునవ్వుతో తల పంకించింది.

పని చేస్తుందా లేదా? అని అనుమానంతో వేసుకుంటే, ఔషధం కూడా పని చేయదు. దేనికైనా నమ్మకం ముఖ్యం..

ఓం నమః శివాయ!

14 September, 2022

జ్ఞాన దీపం! భగవద్గీత Enlightenment - Bhagavad Gita


జ్ఞాన దీపం! భగవంతుడిని మనం ఎందుకు చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (11 – 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tm0zK9cT8kk ]

అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

00:49 - తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థొ జ్ఞానదీపేన భాస్వతా ।। 11 ।।

వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.

అజ్ఞానమనేదానిని మనం చీకటితో పోల్చుతుంటాము. కానీ, భగవంతుడు ఉదహరించే ఈ జ్ఞాన దీపము వేరు. ప్రస్తుతం మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, అన్నీ కూడా ప్రాకృతికమైనవే.. కానీ భగవంతుడు దివ్యమైనవాడు. కాబట్టి, మనం ఆయనను చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము, లేదా ఆయనతో ఏకమవ్వలేకున్నాము. భగవంతుడు తన కృపను ప్రసాదించినప్పుడు, తన దివ్యమైన యోగమాయా శక్తిని, ఆ జీవాత్మపై కరుణిస్తాడు. దానినే, శుద్ధ సత్త్వమని అంటారు. ఇది మాయా సత్త్వ గుణము కంటే వేరైనది. మనకు ఆ శుద్ధ సత్త్వ గుణ శక్తి లభించినప్పుడు, మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, దివ్యమైనవిగా అయిపోతాయి. దీనినే సరళంగా చెప్పాలంటే, ఆయన కృప చేత, భగవంతుడు తన దివ్యమైన ఇంద్రియములనూ, దివ్య మనస్సునూ, మరియు దివ్య బుద్ధినీ, ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు. ఈ దివ్య ఉపకరణాలను కలిగి ఉన్న పిదప, ఆ జీవాత్మ భగవంతుడిని చూడగలుగుతుందీ, భగవంతుడిని వినగలుగుతుందీ, మరియు భగవంతునితో ఏకమవ్వగలుగుతుంది. కాబట్టి, వేదాంత దర్శనం పేర్కొన్నట్టు, భగవంతుని కృప ద్వారానే, ఎవరికైనా దివ్య జ్ఞానము కలుగుతుంది. శ్రీ కృష్ణుడి యొక్క దివ్య శక్తి యే, ఆ జ్ఞాన దీపము. భగవంతుని దివ్య శక్తి యొక్క కాంతిచే, భౌతిక శక్తి యొక్క చీకటి పటాపంచలై పోతుంది.

02:30 - అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ ।। 12 ।।

02:49 - ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన, పవిత్రమొనర్చే వాడవూ, నిత్య సనాతన భగవంతుడవూ, ఆది పురుషుడవూ, జన్మ రహితుడవూ, మరియు అత్యున్నతమైన వాడవూ. మహర్షులైన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, మరియు వ్యాసుడి వంటివారు, ఇది చాటిచెప్పారు. ఇప్పుడు స్వయముగా, నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

భగవంతుడి మాటలను విన్న తరువాత, అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయిపై, సంపూర్ణ నమ్మకం కలిగింది. మరియు, తనలో ఇప్పుడు కలిగిన ధృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెబుతారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే, అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడూ, అసితుడూ, దేవలుడూ మరియు వ్యాసుడి వంటి వారు, శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు, మరియు సర్వ కారణ కారకుడని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో, ఒక పద్యంలో ఎంతో మంది, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. "శ్రీ కృష్ణుడే సర్వ జగత్తులకూ సృష్టికర్త, మరియు అందరి మదిలోని భావాలనూ ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరు దేవతలకూ ప్రభువ"ని, నారదుడు స్తుతించాడు. "శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం, మరియు నియమనిష్ఠల సారం. ఆయనే, సమస్తమునకూ భూత, వర్తమాన, భవిష్యత్తు" అని, మార్కండేయ మహర్షి వివరించాడు. "ఆయన దేవ దేవుడు, మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపమ"ని, భృగు మహర్షి పేర్కోన్నాడు. "ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువువు, నీవే ఇంద్రుడికీ, మరియు ఇతర దేవతలకూ శక్తిని ప్రసాదించావు" అని వేద వ్యాసుడు వెల్లడించాడు. ఇంకా ఎందరో మహర్షులు, కృష్ణ భగవానుడిని స్తుతించారు. ఆ మహోన్నతమైన, ప్రామాణికమైన మహాత్ములను ఊటంకిస్తూ అర్జునుడూ, ఇప్పుడు శ్రీ కృష్ణుడే, సర్వ కారణ కారకుడనని చెప్పటం ద్వారా, స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు.

05:14 - సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ।। 14 ।।

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యధార్థ స్వరూపమును తెలుసుకోలేరు.

శ్రీ కృష్ణుడి దివ్య వైభవమునూ, మరియు అనంతమైన ఔన్నత్యమునూ, క్లుప్తముగా, శ్రద్ధతో విన్న పిదప, అర్జునుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీ కృష్ణుడు ఇంకా తన వైభవములు చెప్పాలనీ, తనకు పూర్తి విశ్వాసం కలిగిందనీ, భగవంతునికి నమ్మిక కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు చెప్పినదంతా యధార్ధమనీ, ఎటువంటి ఊహాకల్పిత వివరణా కాదనీ వక్కాణిస్తున్నాడు, అర్జునుడు. ‘భగవాన్’ అంటే, శక్తీ, జ్ఞానమూ, సౌందర్యమూ, యశస్సూ, ఐశ్వర్యమూ, మరియు వైరాగ్యమనే ఈ ఆరు ఐశ్వర్యములనూ, అనంతమైన మాత్రంలో కలిగి ఉన్న వాడని అర్ధం. దేవతలూ, దానవులూ, మానవులూ, వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు సంపూర్ణ భగవత్ తత్త్వాన్ని తమంత తాము తెలుసుకోలేరు.

06:27 - స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ।। 15 ।।

ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయిన వాడా.. సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే! నిజానికి, నిన్ను నీవు మాత్రమే, నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.

శ్రీ కృష్ణుడు సర్వోత్కృుష్ట పరమ పురుషోత్తముడని వక్కాణిస్తూ, అర్జునుడు ఆయనను అలా సంబోధిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది. "భగవంతుడిని ఎన్నటికీ అధిగమించలేము; ఆయన అన్నింటికీ అతీతుడు." భగవంతుడు ఎవ్వరి చేతనూ తెలుసుకోబడలేడని, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడింది. ఇది స్పష్టంగా తర్కబద్ధమైనదే. సమస్త జీవులూ, పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. కానీ, భగవంతుడు అనంతమైనవాడు. కాబట్టి, ఆయన వారి బుద్ధి పరిధికి అతీతమైనవాడు. ఇది ఆయనను ఏమీ తక్కువ చేయదు సరికదా, ఆయనను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, తుదకు భగవంతుడేమిటో తెలిసినవాడొక్కడున్నాడు.. అతను స్వయానా భగవంతుడే. ఈ విధంగా, శ్రీ కృష్ణుడికి మాత్రమే, తానెవరో, తానేమిటో తెలుసు. ఒకవేళ తానే తన శక్తులను ఏదేని జీవాత్మకు ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ కూడా, ఆయనను తెలుసుకోగలుగుతుంది.

07:57 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఎలా స్మరిస్తూ ఉండాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

12 September, 2022

చెత్త కుప్పలో వదిలివేయబడ్డ జీవకుడు వైద్య శిఖామణిగా ఎలా ఎదిగాడు? Ancient Indian Physician Jivaka


చెత్త కుప్పలో వదిలివేయబడ్డ జీవకుడు వైద్య శిఖామణిగా ఎలా ఎదిగాడు?

వైద్య శాస్త్రంలో ఎంతో కీర్తి గడించిన మహానీయుల ప్రస్తావన, మన పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. మొక్కలూ, మూలికలతోనే అంతుచిక్కని వ్యాధులనుండీ, ప్రాణాపాయమైన వ్యాధులనుండీ, ఎన్నో ప్రాణాలను కాపాడిన వైద్యశిఖామణలున్నారు. వారిలో, అపర ధన్వంతరిగా పిలువబడే సుశ్రుతుడి గురించి, మన గత వీడియోలో తెలుసుకున్నాము. సుశ్రుతుడి గురించిన మన వీడియో చూడాలనుకుంటే, దాని లింక్ ను క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. మన సనాతన ధర్మ గొప్పతనాన్నీ, మన సంస్కృతిలో ఉన్న ఔన్నత్యాన్నీ చాటి చెప్పే మహానీయుల గాధలను మీకు అందించాలని ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే, ఎన్నో వేల సంవత్సరాల క్రితమే, ప్రపంచానికి నాగరికత అంటే తెలియని సమయంలో, ఎన్నో అద్భుతాలు చేసిన మహర్షుల గురించీ, వైద్య ఆచార్యుల గురించీ వీడియోలు అందిస్తూ వస్తున్నాను. అటువంటి వారిలో, బుద్ధుని అంతరంగిక వైద్యుడిగా, మగధ రాజ్యానికీ, బింబిసారుడికీ ఆచార్య వైద్యుడిగా, మెదడుకు సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయడంలో మేటి వైద్యునిగా, బౌద్ధ, జైన మత గ్రంథాలలో సైతం స్థానం సంపాదించుకున్న మేధావి, జీవకుడు. బుద్ధుడికీ, జీవకుడికీ పరిచయం ఎలా జరిగింది? అసలు జీవకుడి వృత్తాంతం ఏమిటి - అనే విషయాలతో పాటు, బుద్ధునికి ప్రధాన శిష్యుడిగా, అనుయాయుడిగా మారడానికి ఎటువంటి సంఘటనలు దోహదం చేశాయి - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/3AMFYlYPDVs ]

కొన్ని ఆధారాల ప్రకారం, జీవకుడు రాజగృహనగర వేశ్య కుమారుడు. ఆమె అతడికి జన్మనిచ్చి, చెత్తకుప్పలో వదిలి వెళ్ళిపోయింది. ఆ బాలుడిని మగధ రాజవంశీయుడైన అభయుడు తీసుకువచ్చి, జీవకుడిగా నామకరణం చేసి, అలనా పాలనా చూసుకున్నాడు. యుక్త వయస్సు వచ్చాక, విద్యాభ్యాసం కోసం తక్షశిలకు పంపించాడు, అభయుడు. ఏకసంథాగ్రాహి అయిన జీవకుడు, ఏడు సంవత్సరాలు వైద్య విద్యను అభ్యసించాడు. ఒకనాడు వైద్య గురువైన ఆత్రేయను కలిసి, "తన చదువు పూర్తయిందా?" అని అడిగాడు జీవకుడు. అందుకు గురువు ఒక గడ్డపారను చేతికిచ్చి, తక్షశిలకు ఎనిమిది మైళ్ళ కైవారంలో, వైద్యానికి పనికిరాని మొక్కలను తనకు తెచ్చివ్వమని చెప్పాడు. అలా గురువు గారి మాట ప్రకారం, కొన్నాళ్ల పాటు తక్షశిల చుట్టూ ఉన్న ప్రతీ మొక్కను పరిశీలించాడు. కానీ, అతనికి వైద్యానికి పనికి రాని మొక్కంటూ ఏదీ కనిపించకపోవడంతో, ఒట్టి చేతులతో తక్షశిలకు తిరిగి వచ్చాడు. సంగతి తెలుసుకున్న వైద్య గురువు ఆత్రేయ, జీవకుడి విద్య విజయవంతంగా పూర్తయిందని సంతోషించి, కొంత ధనం చేతబెట్టి, దీవించి పంపించాడు.

అలా జీవకుడు, ప్రకృతిలో పనికిరాని మొక్కంటూ ఏదీ లేదని తెలుసుకోవడమే కాక, ఎన్నో సందర్భాలలో నిరూపించాడు కూడా. అయితే, జీవకుడు విద్య పూర్తి చేసుకుని తిరిగి వచ్చే సమయంలో, అయోధ్యా నగరంలో, ఒక శ్రేష్టిగారి భార్య, శిరస్సుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా, జీవకుడు ఆమె వ్యాధిని నయం చేశాడు. దాంతో సంతోషించిన శ్రేష్టి, ఆనాటి సోమ్ము ప్రకారం, 12 వేల కహాపణాలనూ, ఇద్దరు నౌకర్లనూ, గుర్రపు బగ్గీనీ బహుకరించి పంపించాడు. ఆ ధనాన్ని తెచ్చి అభయుడికిచ్చి, అతని ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆనాటి నుండీ మగధ రాజ్యానికి రాజ వైద్యునిగా, అనేక సేవలు అందించాడు. అప్పటిలోనే జీవకుడు, కపాలాన్ని ఛేదించి, మొదడులోని రెండు యెటిక పాములు, అంటే tape warmsని తీశాడని, బౌద్ధ గ్రంథంలో వివరించబడి ఉంది.

వేరు మూలికలతో కషాయం, లేపనాలూ, పిండికట్లూ, ఔషధగుణాలూగల నూనెలను వాడటం, శస్త్ర చికిత్సలోనూ, పలురకాల వైద్యవిధానాలను అవలంభించాడు. శస్త్రచికిత్సలు చేసేటప్పుడు, ముందుగా రక్తాన్ని గడ్డకట్టించి, ఆ తరువాత పదునైన కొమ్మును వాడి, చికిత్స చేసేవాడు. వైద్యంలో ఎన్నో మెరుగైన పద్ధతులను అనుసరించేవాడు. జీవకుడు వైద్యునిగా, చుట్టు ప్రక్కల అన్ని రాజ్యాలలో ఎంతో పేరుగడించాడు. ఒకనాడు బుద్ధుడికి ఆరోగ్యం పాడైయింది. విపరీతమైన దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి, నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతుంటే, తన శిష్యుడైన ఆనందుడి సలహాతో, జీవకుడిని పిలిపించారు. జీవకుడు వస్తూనే, బుద్ధుడిని ఆనారోగ్యానికి సంబంధించిన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. “దగ్గు వచ్చేటపుడు నోట్లోంచి శ్లేష్మం పడుతుందా? అది విషపు వాసన వేస్తుందా? రోజులో ఎంతసేపు వస్తోంది? పొడిదగ్గు మాత్రమేనా? ఊపిరి తీసుకోవడంలో ఛాతీ నెప్పులున్నాయా?” వంటి అనేక ప్రశ్నలను అడిగాడు జీవకుడు. వాటన్నింటికీ బుద్ధుడు సమాధానాలు చెప్పాక, “మీకు ఉన్నది ఊపిరితిత్తులలో సమస్య. దానికి నేను మూడు మందులు పట్టుకొస్తాను. వాటిని నేరుగా నోట్లోంచి తీసుకోనక్కర్లేదు. మందును మూడు ఫలాల్లో పెట్టి ఇస్తాను. వాటిని మూడు గంటలకోసారి వాసన చూస్తూ ఉండండి. వారం రోజుల్లో ఆరోగ్యం కుదుట పడుతుంది.” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఆ మర్నాడు మందు తీసుకువచ్చి, దానిని ఎలా వాడాలో చెప్పి, తిరిగి వెళ్ళబోతుండగా, ఈ మందుకీ, వైద్యానికీ ఖర్చు ఏమైనా ఇవ్వాలా? అని ఆనందుడు అడిగాడు. అందుకు తల అడ్డం తిప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు జీవకుడు. ఆ తరువాత కొన్ని రోజులకు జీవకుడు, తన సేవకుడి ద్వారా ఒక రత్న కంబళిని బుద్ధుడికి పంపించాడు. ఆనందుడు ఆ కంబళిని చూసి, రాజుల దగ్గర మాత్రమే ఉండే ఇంత ఖరీదైన రత్న కంబళి, తన దగ్గరకు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని విచారణ చేశాడు. జీవకుడు ఉజ్జయిని రాజైన చండప్రజ్యోతుడికి, కామెర్లు తగ్గించాడు. దాంతో అబ్బురపడి, రాజు ఓ రెండు రత్న కంబళీలు బహుమానంగా ఇచ్చాడు. అయితే, బుద్ధుడి బోధనలపట్ల ఆకర్షితుడైన జీవకుడు, ఒక కంబళీని ఆయనకు కానుకగా పంపించాడు. కానీ, బుద్ధుడు ఆ కంబళిని ముక్కలు ముక్కలుగా కత్తిరించి, ప్రతీ సన్యాసికీ ఓ ముక్కను ఇచ్చాడు. బుద్ధుడు చేసిన పని తెలుసుకున్న జీవకుడికి, బుద్ధుడి ధర్మమార్గంపై మరింత ఆసక్తి ఏర్పడి, ఆయన శిష్యుడిగా మారిపోయాడు.

మరోసారి, బుద్ధుడి కాలికి గాయంకావడంతో, జీవకుడు చికిత్స చేయడానికి వెళ్ళాడు. దెబ్బ బాగా లోతుగా తగలడంతో, కుట్లు వేసి కట్టు కట్టి, మూడు వారాల వరకూ విప్పకూడదని చెప్పి, ఈ దెబ్బ ఎలా తగిలిందని బుద్ధుడిని అడిగాడు. అందుకు ఆనందుడు చొరవ తీసుకుని, బుద్ధుడి మీద కోపం పెంచుకున్న దేవదత్తుడు, రాయిని విసిరాడు. దాని వల్లే ఈ గాయం అయిందని వివరించాడు. ఆ సంగతి విని కోపగించుకున్న జీవకుడు, “మిమ్మల్ని చిన్నప్పటినుండీ కష్టపెడుతూ, ప్రతీ పనికీ అడ్డుతగులుతూ, మీ మీద కోపంతో, ఈర్ష్యతో రగిలే మనుషులను, మీరెందుకు మీ సంఘంలో చేర్చుకుంటున్నారు?” అని ప్రశ్నించాడు. అందుకు చిరునవ్వుతో, “దొంగతనం చేస్తుంటే, ఓ దొంగకి దెబ్బ తగిలింది.. లేదా, కసాయి జంతువధ చేస్తుంటే, ప్రాణాంతకమైన దెబ్బ తగిలింది. వారు నీ దగ్గిరకి వైద్యం కోసం వచ్చారు. అప్పుడు నువ్వు వైద్యం చేస్తావా? లేక వాళ్లు చేసిన పనిని బట్టి, వైద్యం చేయాలా వద్దా అని ఆలోచిస్తావా?” అని తిరిగి ప్రశ్నించాడు. ఛెళ్ళున చెంపమీద కొట్టినట్టు మ్రాన్పడిపోయిన జీవకుడు, మాట తడబడుతూండగా, “రోగి ఎటువంటివాడు, ఏం చేస్తుంటే రోగం తగిలిందీ? అన్న విషయం వైద్యుడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోరాదు.” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బుద్ధుడు, “ఈ సన్యాసం ఇవ్వడం, సంఘంలో జేర్చుకునే విషయం కూడా అటువంటిదే” అని చిరునవ్వుతో చెప్పాడు.

వారి సంభాషణ ముగిసిన తరువాత, మరో మూడు వారాల్లో కట్టు విప్పడానికి వస్తానని చెప్పి, జీవకుడు వెళ్ళిపోయాడు. మూడు వారాలు తిరిగేసరికి, భగవానుడి కట్టువిప్పడానికి బయల్దేరుతుంటే, శ్రావస్తిలో ఒకరికి ప్రాణపాయంగా ఉంది. తప్పక మీరు రావాలని, రోగి బంధువు కోరడంతో, తప్పనిసరి పరిస్థితిలో అక్కడికి బయలుదేరాడు, జీవకుడు. అయితే, ప్రాణం మీదకి వచ్చిన మనిషికి నయంకావడానికి, చికిత్స చేశాడు. కానీ, ఆయన కుదుట పడడానికి మరో మూడు వారాల సమయం పడుతుంది. ఆ రోజు సాయంత్రం జీవకుడు, బుద్ధుడి కాలికి కట్టిన కట్టు విప్పడానికి, విహారంలో ఎవరూ లేరన్న విషయం గుర్తుకు వచ్చి, ఏమి చేయాలో తోచని పరిస్థితిలో కళ్ళుమూసుకున్నప్పుడు, మానసిక ప్రకంపనలు కలగడం తెలియవచ్చింది. మనస్సులో ఎవరో తనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థమయ్యింది. దాంతో కాసేపు మౌనంగా ధ్యానం చేయడం మొదలు పెట్టాడు, జీవకుడు. అయితే, తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నది బుద్ధుడేమోననీ, కాలికట్టు ఎలా విప్పాలో చెప్పమని అడుగుతున్నాడేమోననీ భావించి, ఓ సారి ఆ కట్టుకట్టిన విధం, దాన్ని ఎలా విప్పాలో మనసులో విశదంగా, ఒక్కో మెట్టూ గుర్తు చేసుకున్నాడు. తరువాత, ఒక్కసారిగా మనసులో ప్రకంపనలు ఆగిపోయి, ప్రశాంతగా అనిపించింది.

తాను ఆ రోజు బుద్ధుడితో ప్రత్యక్షంగా మాట్లాడిన అనుభూతి కలిగింది. తరువాత మూడు వారాలకు శ్రావస్తి నుంచి వెనక్కొచ్చిన జీవకుడు, హుటాహుటిన వెళ్ళి బుద్ధుని కాలికేసి చూసి ఆశ్చర్యపోయాడు. కట్టు విప్పేసి ఉంది. గాయం మానిపోయి, దాని రూపు కూడా కనబడడంలేదు. నేను ధ్యానంలో మీకు చెప్పిన విధానాన్ని, మీరు నిజంగానే అవలంభించారా? అదెలా సాధ్యం అయింది? అని ప్రశ్నించాడు జీవకుడు. “ఆ రోజు నువ్వు ధ్యానంలో కుట్లు ఎలా విప్పాలో విశదంగా గుర్తుచేసుకున్నావు. దానిని గ్రహించిన నేను, నువ్వు చెప్పినట్టే చేసి, కుట్లు విప్పుకున్నాను. ఎప్పుడైతే ఇద్దరి మానసిక తరంగాలు ఏకం అవుతాయో, అప్పుడు ఆలోచనలు ఒకరికొకరికి తెలియడం, అంత కష్టం కాదు. మాట్లాడుకోవడానికి మనిషి ఎదురుగా ఉండాల్సిన పని లేదు. అందుకే భిక్షువులు ఎంత దూరంగా ఉన్నా, నేనెప్పుడూ వాళ్లతో ఉన్నట్టే.. భౌతికంగా, ఎదురెదురుగా ఉండాల్సిన అవసరం లేదు.” అని బుద్ధుడు ఉపదేశించాడు. అప్పుడు జీవకుడికి అర్థమయ్యింది, బుద్ధుడు కారణ జన్ముడని. నాటి నుండి, బుద్ధుడి ప్రధాన శిష్యునిగా, అనుయాయునిగా మారిపోయాడు, జీవకుడు. ఇంతటి వైద్య పరిజ్ఞానం కలిగిన జీవకుడి గురించి, మన దగ్గరున్న పాఠ్యపుస్తకాలలో గానీ, అందరికీ అందుబాటులో ఉండే గ్రంధాలలో గానీ సమాచారం లేకపోవడం, గమనార్హం.

మగధ సామ్రాజ్యాన్ని పాలించిన బింబిసారుడి కాలంలో రాజ వైద్యుడిగా ఉన్న జీవకుడు, ఎందరో రాజులకు ప్రాణం పొసి, ప్రాణదాతగా అందరి మన్ననలనూ పొందాడు. మగధ రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యంగా మలచిన బింబిసారుడికి సంబంధించిన మరింత సమాచారం, మన గత వీడియోలో ఉంది. దాని లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను.

ధర్మో రక్షతి రక్షితః!

09 September, 2022

నేనేగనుక లేకపోతే? What will happen if I was not there?


నేనేగనుక లేకపోతే? అందరూ ఈ విధంగా ఆలోచిస్తే అంతా శుభమే..

మనస్సు చంచలమైనది. దానిని అదుపులో పెట్టుకోవడం అంత సులభం కాకపోయినా, అసాధ్యమైతే కాదు. లంకలో బంధింపబడిన సీతామాతను చూసిరమ్మని, హనుమంతులవారిని రామచంద్ర ప్రభువు పంపినపుడు, అక్కడ ఆయన ఆలోచనలను గమనించి, మన ఆలోచనా విధానాన్ని మార్చుకోగలిగితే, ఎన్నో సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆ విషయాలను ఈ రోజుటి మన మంచిమాట వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/r51zgQeMEEE ]

అశోక వనంలో రావణుడు, సీతమ్మ వారి మీదకోపంతో కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు, హనుమంతుడనుకున్నాడు.. ఎవరి దగ్గరనుంచైనా కత్తిని తీసుకుని, రావణాసురుని తలను ఖండించాలని.. కానీ, మరుక్షణంలోనే మండోదరి, రావణుడి చేతిని పట్టుకుని ఆపడాన్ని చూశాడు.. ఆశ్చర్యపోయాడు..

నేనేగనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేవారెవరు? అనేది నా భ్రమ అన్నమాట.. అని అర్ధమయ్యింది హనుమంతుడికి..
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాము.  'నేను లేకపోతే ఎలా?' అని..

సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.. హనుమంతుడికి అప్పుడర్థమయ్యింది.. ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో, వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడని..

మరింత ముందుకు వెళితే, త్రిజట ‘తనకు ఒక కల వచ్చిందనీ, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ నేను చూశాను’ అని చెప్పింది. అయితే, హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే, ప్రభువు తనకు సీతమ్మను చూసి రమ్మని మాత్రమే చెప్పాడు. అంతేగానీ, లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.. మరి తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం? అని అనుకున్నాడు.. అయితే, త్రిజట ఇది తన స్వప్నంలో చూశానని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తనిప్పుడేం చేయాలి..? సరే.. ఆ ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే, అలా జరుగుతుందని సరిపెట్టుకున్నాడు.

హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకు వచ్చినప్పుడు, హనుమంతుడు ఏమీ చేయలేదు. అలా నిలబడి ఉండిపోయాడు. అయితే, ఆ సమయంలో విభీషణుడు వచ్చి, 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అని హితవు పలికాడు.. అప్పుడు హనుమంతునికి అర్థమైంది.. తనను రక్షించే భారం, ప్రభువు విభీషణుని పై ఉంచాడని..

ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకుని, 'కోతిని చంపవద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం. తోకకు నిప్పు పెట్టండి..' అని ఆదేశించాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది.. త్రిజట స్వప్నం నిజం కాబోతోందని.. ‘ప్రభువు నాకే చెప్పి ఉంటే, నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి?’ ఇటువంటి ఆలోచనల వరంపరతో, ఆశ్చర్యంలో మునిగిపోయాడు, హనుమంతుడు.. పరమ ఆశ్చర్యం ఏమిటంటే, వాటన్నింటికీ ఏర్పాట్లు, రావణుడే స్వయంగా చేయించాడు.. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకో గలిగిన తన ప్రభువు, తనకు ‘లంకను చూసి రా’ అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది?

అందుకే ప్రియ బాంధవులారా.. ఒకటి గుర్తుంచుకోండి.. ఈ ప్రపంచంలో జరిగేదంతా, ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ మనమంతా, కేవలం నిమిత్త మాత్రులం మాత్రమే.. అందువల్ల, ‘నేను లేకపోతే’ ఏమవుతుందో! అన్న భ్రమలో ఎప్పుడూ బ్రతకవద్దు.. 'నేనే’ గొప్పవాడినన్న గర్వం తలకెక్కనివ్వ వద్దు..

భగవంతుడి సృష్టిలోని కోటానుకోట్ల దాసులలో, అతి చిన్నవాడిని నేనని తెలుసుకుని, మంచిగా మసలుకుందాము..

జై శ్రీరామ్!

08 September, 2022

సౌభాగ్యాన్నిచ్చే విఘ్నేశ్వరి! Vighneshwari

 

సౌభాగ్యాన్నిచ్చే విఘ్నేశ్వరి!

గజముఖి, గణనాయకి, విఘ్నేశ్వరి, లంబోదరి, గణేశాని, వినాయకి.. ఈ పేర్లను పొరపాటుగా అనడం లేదు! స్త్రీ రూప వినాయకుడి గురించి చాలామందికి తెలియదు. ఆ పేర్లే ఇవన్నీ. ఆలంపూర్, భువనేశ్వర్ లలో స్త్రీలు సర్వ సంపదలనిమ్మని వినాయకి వ్రతం చేస్తుంటారు..

పార్వతీదేవి తపస్సు చేసి, మహోన్నత వరంగా పొందిన తనయుడు వినాయకుడు. తనకంటూ నాయకుడు లేని, తానే లోక నాయకుడైన వినాయకుడు, సర్వ స్వతంత్రుడు. 106 రూపాలతో, 16 విశేష రూపాలతో అలరిస్తూ, 8 రూపాలతో నిత్యపూజలందుకుంటున్నాడు. అమ్మ వారు ఓంకార రూపిణి. వినాయకుడూ ప్రణవ రూపుడే. ఓంకారంలా ఉందని కొందరంటే, గణపతే ఓంకార స్వరూపుడని పురాణాలు స్పష్టం చేశాయి. వినాయకుడు తన అంశయేననీ, మంత్ర, యంత్ర, తంత్ర ఉపాసనా విధానాలన్నీ తామిద్దరికీ ఒక్కటేనంది ఆదిపరాశక్తి. అందుకే వినాయకుణ్ణి సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, శక్తి గణపతి, లక్ష్మి గణపతి, గాయత్రీ గణపతిగా పూజిస్తున్నాం. ఈ గణపతులకు విడివిడిగా ఆలయాలూ ఉన్నాయి. లక్ష్మీ సరస్వతులతో కూడిన గణపతి పటం లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. పార్వతీ మాత ఒడిలో చిన్న గణపతి ఉన్న విగ్రహాలు కోకొల్లలు, హంపిలో తల్లి ఒడిలోనున్న గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. అంకము చేరి శైల తనయస్తన దుగ్ధములానువేళ..' తరహాలో, తల్లిపాలు తాగుతున్న వినాయకుణ్ణి వర్ణించిన పద్యాలెన్నో ఉన్నాయి.

తల్లి మాట మేరకు తండ్రినెదిరించి ప్రాణాలు కోల్పోయాడు చిన్ని గణపతి. పతి చేతిలో పుత్రుడు మరణించాడని తెలిసి ఆగ్రహించి, తన అవతారాలైన ఖంజ, కాళి, కరాళి, భగళ, ఛిన్నమస్త, ధూమవతి, మాతంగి మొదలైన వేలాది శక్తులను పిలిచి, లోకాన్ని అల్లకల్లోలం చేయమంది పార్వతి. అంతే! ఆ జగన్మాతలంతా దేవతలను మింగేశారు. తట్టుకోలేక విష్ణ్వాది దేవుళ్లందరూ పార్వతిని స్తుతించి, ప్రసన్నం చేసుకుని, ఏనుగు తలను తెచ్చ బాలునికి అతికించి, మళ్లీ బ్రతికించారు. అదీ స్త్రీ శక్తి, అదీ మాతృ శక్తి, పురుషులంతా కలిసినా, ఆ శక్తి రూపిణిని ఏమీ చేయలేక, దాసోహమన్నారు. ఆ తల్లిని సంతోష పెట్టడానికే శివుడు లంబోదరునికి ఉపనయనం చేసి, గణాధిపత్యాన్ని కట్టబెట్టాడు. తల్లి సంకల్పిస్తే తనయులకు ఏ లోటూ లేకపోవడమే కాదు.. ఉన్నత స్థానమూ లభిస్తుంది. అందుకే గణపతి శివపార్వతులకు ప్రదక్షిణ చేసి..

తల్లిదండ్రుల పదోదకము బోలంగ వే దాకాశ గంగా మహాజలంబు
మాతా పితలతో సమానత గనజాలరఖిల గీర్వాణ చూడాగ్రమణులు..

అంటూ, వారి విలువను లోకానికి తెలియచేశాడు. 'అమ్మ కడ సౌభాగ్యమడిగి మాకీయవా దేవాదిదేవా' అని స్త్రీలు వినాయకుని వేడుకుంటున్నారు. పార్వతి తదితర దేవతలతో కూడి సౌభాగ్యాన్నీ, సంపదనీ, విద్యనూ, మంత్ర విద్యనూ, జవసత్వాలనూ అందిస్తున్నాడు. గణపతి స్త్రీ పక్షపాతి. అందుకే స్త్రీ దేవతా మూర్తులతో కూడి, స్త్రీలకే ఎక్కువగా వరాలిస్తున్నాడు.

వినాయకునిది పృధ్వీతత్త్వం. భూమాతతో కూడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాడు. అందుకే గణపతిని మట్టిరూపంలో పూజించమని, అటు పంట ఫలం, ఇటు ఆరోగ్య బలం దక్కించుకోమంటోంది శాస్త్రం. వినాయకుడు పంచముఖుడు. పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచ మహాభూతాలూ, పంచ కోశాలూ, పంచ తన్మాత్రలే, ఆ పంచ ముఖాలు.

ఓంకార మాద్యం ప్రవదంతి సంతో వాచః శ్రుతీనామపి యం గృణంతి
గజాననం దేవ గణానతాంఘ్రి భజే హ మర్దేందు కృతావతంసం..

విఘ్నాలను కలిగించేదీ, తొలగించేదీ వినాయకుడే. త్రిమూర్తుల, త్రిమాతల, సకల దేవతల, అష్ట దిక్పాలకుల,నవగ్రహాల పూజలందుకునే ఆది పూజ్యుడు గణపతి..

ఓం మహాగణాధిపతయే నమః

07 September, 2022

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు? Bhagavadgita

 

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/YCh5RGla9Fo ]

సమస్త జనులూ ఏ విధంగా అవతరించారో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:44 - మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ।। 6 ।।

సప్త ఋషులూ, వారి పూర్వం నలుగురు మహాత్ములూ, పద్నాలుగు మనువులూ – వీరందరూ, నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే, ఈ లోకంలోని సమస్త జనులూ అవతరించారు.

తానే విశ్వములోని సమస్త వస్తు విషములకూ ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెబుతున్నాడు, శ్రీ కృష్ణుడు. ఇంతకు ముందు ఇరవై గుణస్వభావాలను పేర్కొన్నాడు. ఇప్పుడిక ఇరవై ఐదు ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే – ఏడుగురు ఋషులూ, నలుగురు అత్యున్నత మహాత్ములూ; పద్నాలుగు మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వము యొక్క వంశపారంపర్య విధానాన్ని కూడా, క్లుప్తంగా చెప్పాడు.

బ్రహ్మదేవుడు, విష్ణు మూర్తి యొక్క హిరణ్యగర్భ శక్తి నుండి జన్మించాడు. బ్రహ్మ నుండి నలుగురు మాహాత్ములు జనించారు – వారే, సనక, సనందన, సనత, సనాతనులు. వీరినే నలుగురు కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో, ఈ నలుగురు కుమారులు, బ్రహ్మ దేవునికి అందరి కంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మ దేవుని మనస్సు నుండే జన్మించారు కాబట్టి, వారికి తల్లి లేదు. వారు నిత్య ముక్తులైన జీవాత్మలు, మరియు యోగ శాస్త్రములో నిష్ణాతులు కాబట్టి, ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి, వారికి శక్తి ఇవ్వబడింది. కుమార ఋషుల తరువాత, సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రీ, పులస్త్యా, పులహా, క్రతూ మరియు వశిష్టులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత పద్నాలుగు మనువులు వచ్చారు. స్వాయంభువా, స్వారోచిషా, ఉత్తమా, తమసా, రైవతా, చక్షుషా, వైవస్వతా, సవర్ణీ, దక్షసావర్ణీ, బ్రహ్మసావర్ణీ, ధర్మసావర్ణీ, రుద్ర-పుత్రా, రోచ్యా మరియు భావుత్యక. వారికి మనష్య జాతిని దేవతాలోకాల నుండి నిర్వహించే, మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాము. అందుకే,  ఈ కాలాన్ని వైవస్వత మన్వంతరము అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో, ఇంకా ఏడుగురు మనువులు ఉంటారు. విశ్వమును నిర్వహించటానికి, దేవ లోకాలలో చాలా మంది దేవతలు ఉంటారు. వీరందరూ, బ్రహ్మ యొక్క పుత్రులు, మనుమలు.. ‘బ్రహ్మ’ విష్ణు మూర్తి నుండి పుట్టాడు. విష్ణు మూర్తి కూడా, శ్రీ కృష్ణుని యొక్క అబేధమైన స్వరూపమే. కాబట్టి, శ్రీ కృష్ణుడే అందరు మూల పురుషులకూ మూల పురుషుడని చెప్పవచ్చు.

03:31 - ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ।। 7 ।।

నా మహిమలనూ మరియు దివ్య శక్తులనూ యదార్థముగా తెలిసినవారు, నిశ్చలమైన భక్తి యోగము ద్వారా, నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

మహిమ అన్న పదం, విశ్వములో ప్రకటితమయ్యే, భగవంతుని యొక్క గొప్ప శక్తిని సూచిస్తుంది. యోగము అన్న పదం, ఈ అద్భుతమైన శక్తులతో, భగవంతుని యొక్క సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అద్భుతమైన వైభవాల పట్ల అవగాహన పెంచుకుంటామో, మరియు మనకు ఆయన మహిమలపై నమ్మకం కలుగుతుందో, మనం సహజంగానే, ఆయన భక్తిలో నిమగ్నమౌతాము. భగవంతుని వైభవం పట్ల జ్ఞానము, భక్తుల యొక్క ప్రేమను పెంచుతుంది. వారి భక్తిని ఇనుమడింప చేస్తుంది. భగవంతుని పట్ల సరియైన అవగాహన/జ్ఞానము అనేది, ఆయన పట్ల భక్తిని పెంపొందించుతుంది.  అనంతమైన బ్రహ్మాండాల పనితీరులో ప్రకటితమయ్యే భగవంతుని అద్భుతమైన వైభవాన్ని విశదీకరించిన పిదప, శ్రీ కృష్ణుడు తెలియజేసినదేమిటంటే, ఎవరైతే ఈ జ్ఞానము యందు స్థితులై ఉంటారో, వారు అచంచలమైన భక్తితో, ఆయన తోనే ఏకమై ఉంటారు.

04:54 - అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ।। 8 ।।

నేనే సమస్త సృష్టికీ మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు, నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.

శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని, "అహం సర్వస్య ప్రభవో" అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే, "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమునూ, మరియు సర్వ కారణ కారణమునూ" అని. ఈ విషయం భగవద్గీతలో చాలా సార్లు ప్రకటితం చేశాడు, శ్రీ కృష్ణుడు. "నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను. వారిని పురుషులుగా, లేదా స్త్రీలగా చేస్తాను. వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను. ఏదేని జీవాత్మను, బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను."

ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు, దృఢ విశ్వాసం పెంచుకునీ, మరియు ప్రేమయుక్త భక్తితో, ఆయనను ఆరాధిస్తారని, బుుగ్వేదంలో పేర్కొనబడింది. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, ఈ భౌతిక జగత్తుకీ మరియు ఆధ్యాత్మిక జగత్తుకీ, రెండింటికీ సర్వేశ్వరుడు. కానీ, కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. శ్రీ కృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టీ, స్థితీ, లయములో నిమగ్నం కాడు. శ్రీ కృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే, మోక్షము సాధించిన జీవులతో, తన దివ్య ధామము గోలోకములో, ప్రేమ యుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం, ఆయనే కారణోదక్షాయి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు, ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఈ విధంగా, అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే, మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడని కూడా అంటారు. ఆయన కారణ సముద్రంలోని దివ్య నీటిలో ఉంటూ, అనంతమైన బ్రహ్మాండాలను, తన శరీర రోమ కూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే, ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో, వ్యాప్తించి ఉంటాడు. ఆయననే ద్వితీయ పురుషుడంటారు. గర్భోదక్షాయి విష్ణు నుండి, బ్రహ్మ జన్మించాడు. ఆయనే, సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు. విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్ధాలనూ, ప్రకృతి నియమాలనూ, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులూ మొదలైన అన్నింటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి, బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు. నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త. గర్భోదక్షాయి విష్ణువు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువునే, తృతీయ పురుషుడని అంటారు. విశ్వం పైన ఉంటాడు కానీ, తానే పరమాత్మ రూపంలో, సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలను అందచేస్తూ ఉంటాడు. అందుకే, ఆయనను విశ్వ స్థితికారకుడంటారు. ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ, శ్రీ కృష్ణుడి కన్నా అబేధములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక, మరియు భౌతిక సృష్టీ, ఆయన నుండే వచ్చాయని అంటున్నాడు.

08:29 - మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।। 9 ।।

వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ, మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ, అత్యంత తృప్తినీ, పరమానందమునూ అనుభవిస్తుంటారు.

మనస్సు యొక్క స్వభావమేమిటంటే, దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది. ఆయన యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన, భగవంతుని భక్తులు, ఆయనను గుర్తుచేసుకుంటూ, స్మరించటంలో నిమగ్నమై పోతారు. ఆయన పట్ల భక్తియే, వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది. దాని నుండే వారి జీవిత పరమార్ధం, లక్ష్యం, బ్రతికేందుకు శక్తినీ పొందుతారు. ఒక చేపకు నీరు ఎలా అవసరమో, వారికి భగవత్ స్మరణ అలా అవసరమని భావిస్తారు. వ్యక్తుల హృదయానికి ఏది ఇష్టమైనదో తెలుసుకోవాలంటే, వారు తమ మనస్సూ, శరీరమూ, మరియు సంపదనూ దేనికి అంకితం చేస్తారో, దానిని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ వారు ఖరీదైన వాహనాల కోసం డబ్బు ఖర్చు పెడుతుంటే, వారి మనస్సు, వాటిపై ఉన్నట్టు. ఒకవేళ వారు విలాసవంతమైన సెలవులపై బాగా ఖర్చు పెడుతుంటే, అదే వారికి బాగా నచ్చే విషయమన్నట్టు. ఒకవేళ వారు జబ్బుతో బాధపడేవారికి సహాయం చేస్తుంటే, ఆ విషయమే వారి యొక్క మనస్సులో ఉన్నట్టు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది, వారి పట్ల సమయమూ, డబ్బూ వెచ్చించే వైనంతో మనకు తెలుస్తుంది. ఇదే విధంగా, భక్తుల యొక్క ప్రేమ అనేది, వారు భగవంతునికి అంకితమయ్యే తీరుతో ప్రకటితమవుతుంది. భక్తులు తమ జీవితాన్ని భగవంతుడికి చేసే శరణాగతి నుండి, తృప్తి లభిస్తుంది. భక్తులు తమ కార్యకలాపముల ఫలితాన్ని, వారికి ఇష్టమైన భగవంతునికే సమర్పిస్తారు కాబట్టి, వారు ప్రతి సందర్భమూ, ఆయన నుండే వస్తున్నదని భావిస్తారు. కాబట్టి, వారు అనుకూల, మరియు ప్రతికూల పరిస్థితులను కూడా, భగవత్ సంకల్పముగా చూస్తారు. ఈ రెంటిలో కూడా, సమత్వ బుద్ధితో ఉంటారు. కొంతమంది భగవంతుని వైభవాల, కీర్తన, మరియు శ్రవణ ప్రక్రియలలో వారు ఆనందం అనుభవించటమే కాక, దానిని ఇతరులతో కూడా పంచుకుంటారు. తమలో, తమ ఆధ్యాత్మిక పురోగతి కోసం, భగవంతుని దివ్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటారు.

11:03 - తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ।। 10 ।।

మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో, నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు.

మన సొంత తెలివితేటలతో, భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివి ఉన్నా, చివరికి మన బుద్ధి, భౌతిక శక్తిచే తయారుచేయబడినదని ఒప్పుకోవలసినదే. కాబట్టి, మన ఆలోచనలూ, కుశలతా, మరియు వివేకమూ, భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు, మరియు ఆయన యొక్క దివ్య జగత్తూ, మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు, ధృడముగా ఈ విషయాన్నినొక్కి వక్కాణించాయి.

11:54 - ఇక మన తదుపరి వీడియోలో, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

05 September, 2022

ఆమె తన 7 గురు కొడుకులనూ ఎందుకు చంపుకున్నది? Why did she kill her 7 sons?

 

ఆమె తన 7 గురు కొడుకులనూ ఎందుకు చంపుకున్నది? వశిష్ఠుడి శాపమే కారణమా?

మన పురాణ ఇతిహాసాలలో, స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సృష్టి మొదలు, మృత్యువు వరకూ ప్రతీ విషయంలో, స్త్రీ మూర్తుల ప్రాముఖ్యత కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం, ఎంతో మంది స్త్రీలను మనం నేటికీ పూజిస్తూనే ఉన్నాం. అలా ప్రముఖంగా చెప్పబడే వారిలో, గంగాదేవి ఒకరు. అయితే, శివుడి శిరస్సును అధివసించిన గంగాదేవి గురించిన చాలా విషయాలు, మనలో కొందరికి తెలియవు. మన మహాభారతంలో, అరివీర పరాక్రమవంతుడిగా పేరు గడించిన భీష్ముడు, గంగాదేవి కుమారుడు. గంగ, శాపవశాత్తు భూలోకంలో జన్మించిన శంతనుడిని వివాహం చేసుకుని, అతని ద్వారా పొందిన ఏడుగురు సంతానాన్ని నీళ్ళపాలు చేసింది. శంతనుడు భూలోకంలో జన్మించడానికీ, గంగను వివాహం చేసుకోవడానికీ గల కారణం ఏంటి? ఒక తల్లిగా గంగా దేవి తన కుమారులను ఎందుకు చంపింది? భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించడానికి, వశిష్ఠుడి శాపమే కారణమా - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

 [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dPPKVSNIjGk ]

పూర్వం ఇక్ష్వాకు వంశంలో, మహాభిషుడునే చక్రవర్తి, వెయ్యి అశ్వమేధ యాగాలూ, నూరు రాజసూయ యాగాలూ చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి, అక్కడ దేవతలతోనూ, మహాఋషులతోనూ, బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచి, గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకిలేచి, గంగాదేవి తొడలు కనిపించాయి. దేవతలందరూ తలలు పక్కకు తిప్పుకున్నారు కానీ, మహాభిషుడు ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవునికి కోపం వచ్చి, “మహాభిషా, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించు” అని శపించాడు. తన తప్పు తెలుసుకున్న మహాభిషుడు “బ్రహ్మదేవా, భూలోకంలో ప్రతీపుడనే పుణ్యాత్ముడు ఉన్నాడు. కాబట్టి, అతనికి కొడుకుగా జన్మిస్తాను. దయచేసి నా కోరికను మన్నించండి” అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు సరేనన్నాడు. ఇదిలా ఉండగా, గాలికి చీర తొలగినప్పుడు, తన తొడలను చూసిన మహాభిషుణ్ణి చూసి, గంగాదేవి మోహించింది. అతనినే తలచుకుంటూ భూలోకానికి వస్తుంటే, ఎనిమిది మంది వసువులు ఆమెకు ఎదురు పడ్డారు. దీనంగా ఉన్న వారిని చూసి, కారణం ఏమిటని ప్రశ్నించింది గంగాదేవి.

అప్పుడు అష్ట వసువులు, “అమ్మా గంగాదేవి, మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలెనని పోతున్నాము. నువ్వు ఎదురు పడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభిషుడు, మానవలోకంలో ప్రతీపునకు, శంతనుడిగా జన్మిస్తాడు. నీకూ అతనికీ సంగమము అవుతుంది. నీకూ, శంతనునికీ మేము జన్మిస్తాము” అని అడిగారు. అందకు గంగాదేవి కూడా సంతోషించింది. ‘మీ కోరిక తప్పక తీరుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి’, అని చెప్పింది. అయితే అష్టవసువులు మరొక కోరిక కోరారు.

“అమ్మా, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ, మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు. దానికి వశిష్ఠ మహర్షి కూడా అనుమతి ఇచ్చారు” అని చెప్పారు. దాంతో ఆలోచించి, “అందరూ పుట్టగానే కాలం చేస్తే, తల్లిగా శోకాన్ని భరించడం కష్టతరం కాదా? నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక్క కుమారుడున్నా చాలు” అని అడిగింది గంగా దేవి. అప్పుడు వసువులు, “అమ్మా గంగాదేవి, మాలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశలతో దీర్ఘాయువుగా, నీ కన్న కొడుకై మానవ లోకంలో ఉంటాడు” అని చెప్పారు. దాంతో గంగాదేవి సంతోషంగా, అష్టవసువులతో ఒప్పందం చేసుకుంది. తరువాత కొంతకాలానికి, మానవ లోకంలో ప్రతీపుడనే మహారాజు రాజ్య భోగాలను అనుభవించి, గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షం అయింది. ఒక దివ్య కాంత రూపంలో, అతని కుడి తొడమీద కూర్చుంది. ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. “నీవు ఎవరు? నా తొడమీద ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు. అందుకు గంగ, “ప్రతీప మహారాజా, నేను జహ్ను మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను అవుదామని వచ్చాను. నన్ను స్వీకరించు” అని అడిగింది.

“ఓ జాహ్నవీ, నాకు ఇప్పటికే పెళ్లయినది. నేను నా భార్యను తప్ప, మరొక స్త్రీని మనస్సులో కూడా తలవను. అయినా, నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? పైగా, ఆడవారు భర్త ఎడమ తొడమీద కూర్చుంటారు. సంతానం, తండ్రి కుడి తొడపై కూర్చుంటారు. నువ్వు నా తొడపై కూర్చున్నావు కాబట్టి, నా కొడుకును వరించి పెళ్లి చేసుకొనుము” అని ప్రతీపుడు చెప్పగా, అక్కడి నుండి గంగాదేవి అంతర్థానమయింది. ప్రతీపునకూ, అతని భార్య అయిన సునందకూ, బ్రహ్మ శాపం ప్రకారం మహాభిషుడు, శంతనుడిగా జన్మించాడు. ఒకరోజు ప్రతీపుడు శంతనుని పిలిచి, “కుమారా, ఒకరోజు గంగానదీ తీరాన ఒక కన్యను చూశాను. నువ్వు నా కొడుకుకు భార్యవు కమ్మని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహము చేసుకొనుము. ఆమెను గురించిన వివరాలేమీ అడగకుండా, ఆమె కోర్కె తీర్చు” అని చెప్పాడు. తండ్రి మాటకు సరే అన్నాడు శంతనుడు. నిజానికి శంతనుడికి తన శాపం గురించి గుర్తులేదు. శంతనుడికి గంగను గురించి చెప్పిన తరువాత, ప్రతీపుడు తపోవనానికి వెళ్లిపోయాడు.

శంతనుడు రాజ్యభారాన్ని తీసుకున్నాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్లగా, అక్కడ గంగానదీ తీరంలో, గంగాదేవి ఒక మానవస్త్రీ రూపంలో, శంతనుడికి కనిపించింది. ఆమె మనోహర రూపానికి ముగ్ధుడై, ఆమెనే చూస్తుండిపోయాడు, శంతనుడు. ఆమె కూడా శంతనుని అందానికి పరవశించి, అతనినే చూస్తూ ఉంది. వెంటనే తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శంతనునికి. పైగా ఆమె మీద మనసు పడడంతో, గంగాదేవి చెప్పిన షరతులన్నింటికీ అంగీకరించి, తనను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏమి చేసినా,  ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించకూడదని, ముందుగానే మాట తీసుకుంది గంగాదేవి. ఆ తరువాత గంగకూ, శంతనుడికీ, అష్ట వసువులు ఒకరి వెంట ఒకరుగా, కుమారులుగా జన్మించారు.

గంగ వారందరినీ, పుట్టిన వెంటనే గంగానదిలో పడవేసింది. తన కుమారులు నిర్జీవులుగా మారుతుండడంతో, శంతనుడికి మనసులో బాధగా ఉన్నా, గంగాదేవి పెట్టిన షరతు ప్రకారం, ఏమీ ప్రశ్నించేవాడు కాదు. అలా శంతునుడి ద్వారా గంగకు ఏడుగురు వసువులు పుట్టారు, చనిపోయారు. వారందరి తరువాత, అష్టమ వసువు అయిన ప్రభాసుడు జన్మించాడు. ఈసారి శంతనుడు ఊరుకోలేదు. “ఇప్పటిదాకా, పుట్టిన వారందరిని గంగలో పడవేశావు. నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు. ఎందుకిలా చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు. “శంతన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు. నేను వెళ్లిపోతున్నాను. నేనెవరినని అనుకుంటున్నావు? నేను గంగను. అష్ట వసువులు వశిష్ఠ మహాముని శాపంతో, మానవ లోకంలో పుట్టారు. వారు కోరిన కోరిక ప్రకారం, నా గర్భాన జన్మించారు. పుట్టగానే వారికి విముక్తి కలిగించాను. ఈ ఎనిమిదవ వాడు, చిరకాలం జీవిస్తాడు. కీర్తి మంతుడవుతాడు” అని చెప్పింది గంగ. ఆ మాటలను విన్న శంతనుడు ఆశ్చర్యపడి, “ఓ గంగా, వసువులు దేవతలు, దోషము లేనివారు కదా? వశిష్ట మహాఋషి, వారిని ఎందుకు శాపించారు? అందులో ఎనిమిదవ వాడు మాత్రం, మానవ లొకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తాడు? వివరంగా చెప్పు” అని అడిగాడు. అప్పుడు గంగ వసువుల శాప వృత్తాంతాన్ని వివరించింది.

“శంతన మహారాజా, వరుణుడి కుమారుడైన వశిష్ఠుడనే మహాముని, మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్ఠుని ఆశ్రమంలొ, నందిని అనే కామధేనువు ఉంది. అది వశిష్ఠునికి కావలిసిన వస్తువులన్నింటినీ ఇస్తూ, అతనికి సేవచేస్తూ ఉండేది. ఒకరోజు అష్ట వసువులు వారి భార్యలతో కలసి, వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ కామధేనువును చూసి, దాని మహిమకు అశ్చర్యపోయారు. అందులో ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో, “నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి, రోగం, ముసలి తనము లేకుండా బ్రతుకుతారంటారు కదా? మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడయి ఉండాలి? కాబట్టి, ఈ ధేనువును నా ప్రాణ స్నేహితురాలు జీతవతికి కానుకగా ఇవ్వాలని, కోరికగా ఉన్నది” అని అడిగింది. దానికి మిగిలిన వసువులు కూడా, ఆమెకు వంత పాడారు. తన భార్య కోరికను నెరవేర్చడానికి, ఎనిమిదవ వసువైన ప్రభాసుడు, కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్లాడు. వశిష్ఠ మహాముని తన యోగ దృష్టితో, ఇదంతా చూసి ఆగ్రహించాడు. దాంతో, మదమాత్సర్యాలకు లోబడిన మీరందరూ, మానవులై పుట్టండని శపించాడు. వెంటనే తప్పు తెలుసుకున్న వసువులందరూ, వశిష్ఠుని కాళ్ల మీద పడ్డారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని, మహర్షిని వేడుకున్నారు. అందుకు వశిష్ఠుడు, మీ కోరిక నెరవేరుతుంది. కాని అసలు నేరం చేసిన వాడు, ఈ ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుడు మాత్రం, తన జీవితాన్ని మానవలోకంలో గడుపుతాడు. భార్య కోసం ఇటువంటి కార్యానికి ఒడిగట్టినందుకు, ఆజన్మాంత బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా బ్రతుకుతాడు” అన్న వశిష్ఠుడి మాటలనూ, అష్ట వసువుల శాపం గురించీ చెప్పి, తన కుమారుడిని తీసుకుని, గంగా దేవి శంతనుడుని విడిచి వెళ్లింది. దాంతో జరిగినదానికి విచారిస్తూ, శంతనుడు తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. కొంతకాలం తరువాత, ఒకరోజు శంతనుడు వేట నిమిత్తము గంగానదీ తీరానికి వెళ్లాడు. ఒక చోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. శంతనుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ, గంగానది వెంట నడుస్తుండగా, అక్కడ ఒక చోట బాలుడు గంగా నదికి అడ్డంగా, తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు.

అతనే గంగా శంతనుల కుమారుడు దేవవ్రతుడు. కానీ, శంతనుడు ఆ కుమారుని గుర్తించలేదు. ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చి, “ప్రభూ, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రుడూ, బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలను అభ్యసించాడు. పరశురామునితో సమానంగా, ధనుర్విద్యను ఆకళింపుజేసుకున్నాడు. ఇక ఇప్పుడు, నీ కుమారుని స్వీకరించుము” అని దేవవ్రతుడిని శంతనునికి అప్పగించి, గంగ వెళ్లిపోయింది. వీరుడూ, ధీరుడూ, గుణవంతుడూ, సకల విద్యాపారంగతుడూ అయిన కొడుకును చూసి, శంతనుడు ఉప్పొంగిపోయాడు. కొడుకును హస్తినాపురానికి తీసుకువచ్చి, దేవవ్రతునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత శంతనుడు, యోజన గంధిగా పిలువబడే సత్యవతిని చూసి, వివాహం చేసుకోవాలనుకున్నాడు. సత్యవతి, తన కుమారులకు మాత్రమే రాజ్యపట్టాభిషేకం చేయాలనీ, భీష్ముడు బ్రహ్మచారిగా ఉండాలనీ, షరతు విధించింది. దానికి శంతనుడు అంగీకరించలేదు. కానీ, ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు, సత్యవతి తండ్రి దాశరాజు వద్దకు వెళ్లి, ఆమె కోరక మేరకు, వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవిస్తాననీ, రాజ్యం ఆమె పుత్రులకే అప్పగిస్తాననీ చెప్పి, వారిని ఒప్పించి, తండ్రికి పెళ్లి చేశాడు. అలా వశిష్ఠుడి శాపం ప్రకారం, సత్యవతి షరతు కారణంగా, భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించి, తనువు చాలించాడు.

కృష్ణం వందే జగద్గురుం!