Ads

Showing posts with label Bhagavadgita. Show all posts
Showing posts with label Bhagavadgita. Show all posts

07 September, 2022

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు? Bhagavadgita

 

సృష్టి క్రమము! సమస్త వస్తు విషములకూ మూల ఉత్పత్తి స్థానమెవరు?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/YCh5RGla9Fo ]

సమస్త జనులూ ఏ విధంగా అవతరించారో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:44 - మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ।। 6 ।।

సప్త ఋషులూ, వారి పూర్వం నలుగురు మహాత్ములూ, పద్నాలుగు మనువులూ – వీరందరూ, నా మనస్సు నుండే జన్మించారు. వారి నుండే, ఈ లోకంలోని సమస్త జనులూ అవతరించారు.

తానే విశ్వములోని సమస్త వస్తు విషములకూ ఎలా మూల ఉత్పత్తి స్థానమో చెబుతున్నాడు, శ్రీ కృష్ణుడు. ఇంతకు ముందు ఇరవై గుణస్వభావాలను పేర్కొన్నాడు. ఇప్పుడిక ఇరవై ఐదు ఉన్నత మహాత్ములను పేర్కొంటున్నాడు. వీరే – ఏడుగురు ఋషులూ, నలుగురు అత్యున్నత మహాత్ములూ; పద్నాలుగు మనువులు. తన నుండే వచ్చిన సమస్త విశ్వము యొక్క వంశపారంపర్య విధానాన్ని కూడా, క్లుప్తంగా చెప్పాడు.

బ్రహ్మదేవుడు, విష్ణు మూర్తి యొక్క హిరణ్యగర్భ శక్తి నుండి జన్మించాడు. బ్రహ్మ నుండి నలుగురు మాహాత్ములు జనించారు – వారే, సనక, సనందన, సనత, సనాతనులు. వీరినే నలుగురు కుమారులు అంటారు. మన బ్రహ్మాండంలో, ఈ నలుగురు కుమారులు, బ్రహ్మ దేవునికి అందరి కంటే ముందు పుట్టిన సంతానం. వారు బ్రహ్మ దేవుని మనస్సు నుండే జన్మించారు కాబట్టి, వారికి తల్లి లేదు. వారు నిత్య ముక్తులైన జీవాత్మలు, మరియు యోగ శాస్త్రములో నిష్ణాతులు కాబట్టి, ఇతరులకు ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షప్రాప్తికి సహాయం చేయటానికి, వారికి శక్తి ఇవ్వబడింది. కుమార ఋషుల తరువాత, సప్త ఋషులు వచ్చారు. వీరే మారీచ, అంగీర, అత్రీ, పులస్త్యా, పులహా, క్రతూ మరియు వశిష్టులు. వీరికి మనుష్య జనాభాని పెంపొందించమనే పని ఇవ్వబడింది. ఆ తరువాత పద్నాలుగు మనువులు వచ్చారు. స్వాయంభువా, స్వారోచిషా, ఉత్తమా, తమసా, రైవతా, చక్షుషా, వైవస్వతా, సవర్ణీ, దక్షసావర్ణీ, బ్రహ్మసావర్ణీ, ధర్మసావర్ణీ, రుద్ర-పుత్రా, రోచ్యా మరియు భావుత్యక. వారికి మనష్య జాతిని దేవతాలోకాల నుండి నిర్వహించే, మరియు వైదిక ధర్మాన్ని నిలిపి సంరక్షించే అధికారం ఇవ్వబడింది. మనం ప్రస్తుతం ఏడవ మనువైన వైవస్వత మనువు కాలంలో ఉన్నాము. అందుకే,  ఈ కాలాన్ని వైవస్వత మన్వంతరము అంటారు. ఈ ప్రస్తుత కల్పంలో, ఇంకా ఏడుగురు మనువులు ఉంటారు. విశ్వమును నిర్వహించటానికి, దేవ లోకాలలో చాలా మంది దేవతలు ఉంటారు. వీరందరూ, బ్రహ్మ యొక్క పుత్రులు, మనుమలు.. ‘బ్రహ్మ’ విష్ణు మూర్తి నుండి పుట్టాడు. విష్ణు మూర్తి కూడా, శ్రీ కృష్ణుని యొక్క అబేధమైన స్వరూపమే. కాబట్టి, శ్రీ కృష్ణుడే అందరు మూల పురుషులకూ మూల పురుషుడని చెప్పవచ్చు.

03:31 - ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్త్వతః ।
సోఽవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః ।। 7 ।।

నా మహిమలనూ మరియు దివ్య శక్తులనూ యదార్థముగా తెలిసినవారు, నిశ్చలమైన భక్తి యోగము ద్వారా, నాతో ఏకమై పోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

మహిమ అన్న పదం, విశ్వములో ప్రకటితమయ్యే, భగవంతుని యొక్క గొప్ప శక్తిని సూచిస్తుంది. యోగము అన్న పదం, ఈ అద్భుతమైన శక్తులతో, భగవంతుని యొక్క సంబంధాన్ని సూచిస్తుంది. మనం ఎప్పుడైతే పరమేశ్వరుని యొక్క అద్భుతమైన వైభవాల పట్ల అవగాహన పెంచుకుంటామో, మరియు మనకు ఆయన మహిమలపై నమ్మకం కలుగుతుందో, మనం సహజంగానే, ఆయన భక్తిలో నిమగ్నమౌతాము. భగవంతుని వైభవం పట్ల జ్ఞానము, భక్తుల యొక్క ప్రేమను పెంచుతుంది. వారి భక్తిని ఇనుమడింప చేస్తుంది. భగవంతుని పట్ల సరియైన అవగాహన/జ్ఞానము అనేది, ఆయన పట్ల భక్తిని పెంపొందించుతుంది.  అనంతమైన బ్రహ్మాండాల పనితీరులో ప్రకటితమయ్యే భగవంతుని అద్భుతమైన వైభవాన్ని విశదీకరించిన పిదప, శ్రీ కృష్ణుడు తెలియజేసినదేమిటంటే, ఎవరైతే ఈ జ్ఞానము యందు స్థితులై ఉంటారో, వారు అచంచలమైన భక్తితో, ఆయన తోనే ఏకమై ఉంటారు.

04:54 - అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ।। 8 ।।

నేనే సమస్త సృష్టికీ మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ కొనసాగుతున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు, నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.

శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని, "అహం సర్వస్య ప్రభవో" అనటంతో ప్రారంభిస్తున్నాడు. అంటే, "నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమునూ, మరియు సర్వ కారణ కారణమునూ" అని. ఈ విషయం భగవద్గీతలో చాలా సార్లు ప్రకటితం చేశాడు, శ్రీ కృష్ణుడు. "నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను. వారిని పురుషులుగా, లేదా స్త్రీలగా చేస్తాను. వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను. ఏదేని జీవాత్మను, బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను."

ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు, దృఢ విశ్వాసం పెంచుకునీ, మరియు ప్రేమయుక్త భక్తితో, ఆయనను ఆరాధిస్తారని, బుుగ్వేదంలో పేర్కొనబడింది. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, ఈ భౌతిక జగత్తుకీ మరియు ఆధ్యాత్మిక జగత్తుకీ, రెండింటికీ సర్వేశ్వరుడు. కానీ, కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. శ్రీ కృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టీ, స్థితీ, లయములో నిమగ్నం కాడు. శ్రీ కృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే, మోక్షము సాధించిన జీవులతో, తన దివ్య ధామము గోలోకములో, ప్రేమ యుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం, ఆయనే కారణోదక్షాయి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు, ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు. ఈ విధంగా, అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే, మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడని కూడా అంటారు. ఆయన కారణ సముద్రంలోని దివ్య నీటిలో ఉంటూ, అనంతమైన బ్రహ్మాండాలను, తన శరీర రోమ కూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే, ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో, వ్యాప్తించి ఉంటాడు. ఆయననే ద్వితీయ పురుషుడంటారు. గర్భోదక్షాయి విష్ణు నుండి, బ్రహ్మ జన్మించాడు. ఆయనే, సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు. విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్ధాలనూ, ప్రకృతి నియమాలనూ, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులూ మొదలైన అన్నింటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి, బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు. నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త. గర్భోదక్షాయి విష్ణువు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువునే, తృతీయ పురుషుడని అంటారు. విశ్వం పైన ఉంటాడు కానీ, తానే పరమాత్మ రూపంలో, సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలను అందచేస్తూ ఉంటాడు. అందుకే, ఆయనను విశ్వ స్థితికారకుడంటారు. ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ, శ్రీ కృష్ణుడి కన్నా అబేధములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక, మరియు భౌతిక సృష్టీ, ఆయన నుండే వచ్చాయని అంటున్నాడు.

08:29 - మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।। 9 ।।

వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరికొకరు నా గురించి తెలుపుకుంటూ, మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ, అత్యంత తృప్తినీ, పరమానందమునూ అనుభవిస్తుంటారు.

మనస్సు యొక్క స్వభావమేమిటంటే, దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది. ఆయన యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన, భగవంతుని భక్తులు, ఆయనను గుర్తుచేసుకుంటూ, స్మరించటంలో నిమగ్నమై పోతారు. ఆయన పట్ల భక్తియే, వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది. దాని నుండే వారి జీవిత పరమార్ధం, లక్ష్యం, బ్రతికేందుకు శక్తినీ పొందుతారు. ఒక చేపకు నీరు ఎలా అవసరమో, వారికి భగవత్ స్మరణ అలా అవసరమని భావిస్తారు. వ్యక్తుల హృదయానికి ఏది ఇష్టమైనదో తెలుసుకోవాలంటే, వారు తమ మనస్సూ, శరీరమూ, మరియు సంపదనూ దేనికి అంకితం చేస్తారో, దానిని బట్టి తెలుసుకోవచ్చు. ఒకవేళ వారు ఖరీదైన వాహనాల కోసం డబ్బు ఖర్చు పెడుతుంటే, వారి మనస్సు, వాటిపై ఉన్నట్టు. ఒకవేళ వారు విలాసవంతమైన సెలవులపై బాగా ఖర్చు పెడుతుంటే, అదే వారికి బాగా నచ్చే విషయమన్నట్టు. ఒకవేళ వారు జబ్బుతో బాధపడేవారికి సహాయం చేస్తుంటే, ఆ విషయమే వారి యొక్క మనస్సులో ఉన్నట్టు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది, వారి పట్ల సమయమూ, డబ్బూ వెచ్చించే వైనంతో మనకు తెలుస్తుంది. ఇదే విధంగా, భక్తుల యొక్క ప్రేమ అనేది, వారు భగవంతునికి అంకితమయ్యే తీరుతో ప్రకటితమవుతుంది. భక్తులు తమ జీవితాన్ని భగవంతుడికి చేసే శరణాగతి నుండి, తృప్తి లభిస్తుంది. భక్తులు తమ కార్యకలాపముల ఫలితాన్ని, వారికి ఇష్టమైన భగవంతునికే సమర్పిస్తారు కాబట్టి, వారు ప్రతి సందర్భమూ, ఆయన నుండే వస్తున్నదని భావిస్తారు. కాబట్టి, వారు అనుకూల, మరియు ప్రతికూల పరిస్థితులను కూడా, భగవత్ సంకల్పముగా చూస్తారు. ఈ రెంటిలో కూడా, సమత్వ బుద్ధితో ఉంటారు. కొంతమంది భగవంతుని వైభవాల, కీర్తన, మరియు శ్రవణ ప్రక్రియలలో వారు ఆనందం అనుభవించటమే కాక, దానిని ఇతరులతో కూడా పంచుకుంటారు. తమలో, తమ ఆధ్యాత్మిక పురోగతి కోసం, భగవంతుని దివ్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటారు.

11:03 - తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ।। 10 ।।

మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో, నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను. దానిచే వారు నన్ను పొందవచ్చు.

మన సొంత తెలివితేటలతో, భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివి ఉన్నా, చివరికి మన బుద్ధి, భౌతిక శక్తిచే తయారుచేయబడినదని ఒప్పుకోవలసినదే. కాబట్టి, మన ఆలోచనలూ, కుశలతా, మరియు వివేకమూ, భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు, మరియు ఆయన యొక్క దివ్య జగత్తూ, మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు, ధృడముగా ఈ విషయాన్నినొక్కి వక్కాణించాయి.

11:54 - ఇక మన తదుపరి వీడియోలో, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

09 March, 2022

‘ధ్యానం’ - చెడు సంస్కారాలనూ మరియూ అలవాట్లనూ నిర్మూలించటానికి! Bhagavadgita

 

‘ధ్యానం’ - చెడు సంస్కారాలనూ మరియూ అలవాట్లనూ నిర్మూలించటానికి!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (11 - 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/WzL6jhGivwA ]

మన మనస్సుని ఏకాంత ధ్యానం ద్వారా ఎలా పరిశుద్ధమొనర్చుకోవాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।
నాత్యుఛ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ।। 11 ।।

యోగాభ్యాసము చేయటానికి, శుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి. దీనిని, కుశ గడ్డీ, జింక చర్మము, మరియు ఒక వస్త్రమును, ఒక దానిపై మరొకటి వేసి సిద్ధం చేసుకోవాలి. ఈ ఆసనము, మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు, అలాగే మరీ తక్కువ ఎత్తులోనూ ఉండకూడదు.

ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, బాహ్య సాధన గురించి చెబుతున్నాడు. ప్రారంభిక దశలో, బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కుశగడ్డితో చేసిన చాప, నేల నుండి వేడిమీ, చలి నుండీ రక్షణనిస్తుంది. వ్యక్తి ధ్యానములో నిమగ్నమై ఉన్నప్పుడు, పైనున్న జింక చర్మం, విషపూరిత ప్రాణులైన పాములూ, తేళ్ళ వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే, పడిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే, నేలపై పురుగులూ, కీటకాల వంటి వాటితో, ఇబ్బంది కలుగవచ్చు.

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।
ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।।

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।

దానిపై స్థిరముగా కూర్చుని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలనూ, కార్యకలాపాలనూ నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమునూ, మెడనూ, మరియు శిరస్సునూ, స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.

ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీ కృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి, ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనాలో, సోమరితనం ఆవహించి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో, ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూ, మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు. కానీ, ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో, మధ్యలో నిద్దురలోనికి జారుకునే వారు, చాలా మంది ఉంటారు. ఇలా కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోమంటున్నాడు. అయితే, కొందరు మోకాలు నొప్పుల వలన గానీ, ఏదైనా గాయాల వలన కానీ, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు. ఎందుకంటే, వారు కుర్చీలో కూర్చునయినా ధ్యానం చేయవచ్చు. కానీ, తప్పకుండా నిటారుగా, మరియు నిశ్చలంగా కూర్చోవాలన్న నియమాన్ని, పాటించాలి. దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి. అది అటూ ఇటూ పోకుండా, రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా, ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో, సహకరిస్తాయి. బాహ్యమైన ఆసనం, శరీరాన్ని ఉంచిన తీరూ, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి. ధ్యానం అనేది యదార్ధంగా, ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించు కోవచ్చు, మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం, మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికీ, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికీ, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికీ, దోహద పడుతుంది. ధ్యానం, చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. అది ప్రతికూల పరిస్థితులలో కూడా, మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి, దోహదపడుతుంది. జీవితంలో విజయంకోసం కావలసిన దృఢసంకల్పబలాన్ని, పెంపొందిస్తుంది. చెడు సంస్కారాలను, మరియు అలవాట్లను నిర్మూలించటానికీ, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికీ, దోహదపడుతుంది.

ప్రశాంతాత్మా విగతభీః బ్రహ్మచారివ్రతే స్థితః ।
మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః ।। 14 ।।

ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, నిశ్చల మనస్సుతో, బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి.

ధ్యానంలో సాఫల్యం సాధించటానికి, బ్రహ్మచర్యం పాటించటం యొక్క ఆవశ్యకతని, శ్రీ కృష్ణుడుద్ఘాటిస్తున్నాడు. జంతువులలో, సంతానోత్పత్తి కోసం, లైంగిక కోరికలు దోహదపడతాయి. జంతువులు ప్రధానంగా, సంతానం కోసమే ఈ చర్యలో పాల్గొంటాయి. చాలా వరకు జీవజాతుల్లో, సంభోగానికి ఒక నిర్ధిష్ట కాలం ఉంటుంది. జంతువులు ఈ క్రియలో యథేచ్చగా పాల్గొనవు. మనుష్యులకు ఉన్నతమైన బుద్ధి ఉండటం చేతా, యథేచ్చగా చేసే స్వేచ్ఛ ఉండటం చేతా, సంతానోత్పత్తి క్రియ ఒక విచ్చలవిడి భోగంగా మార్చివేయ బడింది. బ్రహ్మచర్యం పాటించటం వలన, శారీరక శక్తి పెరగటం, బుద్ధిలో స్పష్టత, మహోన్నత సంకల్ప బలం, చక్కటి జ్ఞాపక శక్తి, మరియు చురుకైన ఆధ్యాత్మిక బుద్ధీ కలుగుతాయి. అది కళ్ళలో తళుకునూ, బుగ్గలలో మెరుపునూ కలుగచేస్తుంది. బ్రహ్మచర్యం యొక్క నిర్వచనంలో, కేవలం శారీరక క్రియను మాత్రమే ఆపడం కాదు. ఈ ఎనిమిది రకాల క్రియలనూ నియంత్రించాలి: 1) దాని గురించి ఆలోచించటం. 2) దాని గురించి మాట్లాడటం, 3) దాని గురించి హాస్యాస్పదం చేయటం. 4) దానిని ఊహించటం. 5) దానిని కోరుకోవటం. 6) ఎవరినైనా దాని గురించి ప్రలోభ పెట్టటం. 7) దాని మీద ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించటం. 8) దానిలో పాల్గొనటం. ఎవరినైనా బ్రహ్మచారి అనాలంటే, వారు వీటన్నింటినీ త్యజించి ఉండాలి.

యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః ।
శాంతిం నిర్వాణపరమాం మత్సంస్థామధిగఛ్చతి ।। 15 ।।

ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపి, క్రమశిక్షణతో కూడుకున్న మనస్సును కలిగిన యోగి, 'నిర్వాణమును' పొందును. నా యందే పరమ శాంతితో, స్థితుడై ఉండును.

ఈ ప్రపంచంలో ఎన్నో రకాల ధ్యాన పద్దతులున్నాయి. కానీ, ఏ పద్ధతిలో ధ్యానం చేసినా, మనస్సుని భగవంతుని యందే నిలిపి ఉంచాలి. ధ్యానము యొక్క లక్ష్యము, కేవలం ఏకాగ్రతను పెంపొందించటమే కాదు. మనస్సుని పరిశుద్ధి చేసుకోవటం కూడా. శ్వాసా, చక్రాలూ, శూన్యం, దీపం వంటి వాటిపై ధ్యానం, ఏకాగ్రతను పెంచుకోవటానికి దోహదపడవచ్చు. కానీ, మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి, కచ్చితంగా మనస్సుని, సంపూర్ణ పరిశుద్ధుడైన భగవంతుని యందు నిలిపితేనే సాధ్యం. ఎవరైతే ఆయనపై మనస్సుని నిమగ్నం చేస్తారో, వారి మనస్సు కూడా, త్రిగుణముల కంటే అతీతంగా మారుతుంది. ఈ విధంగా, 'ప్రాణము' లపై ధ్యానం, అలౌకికమైనదని, అభ్యాసకులు చెబుతారు. కానీ, నిజమైన అలౌకిక ధ్యానం అనేది, భగవంతుని పట్ల చేసేదే ఉంటుంది. మనం అన్ని భగవంతుని దివ్య లక్షణములైన - నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ, పరివారమూ - వీటిపై ధ్యానం చేయవచ్చు. వీటిలో దేనిపైనయినా ధ్యానం చేసుకుని, భగవంతునిపై ధ్యానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. చాలామంది సాధకులకు, కేవలం నామము మాత్రమే, మనస్సుని రంజిప చేయటానికి తగినంత ఆకర్షణ కలుగచేయదు. అనంతమైన జన్మల సంస్కారముల వలన, మనస్సు సహజంగానే, స్వరూపముల వైపు ఆకర్షితమవుతుంది. భగవత్ రూపము ఆధారంగా చేసుకుంటే, ధ్యానమనేది సహజంగా, సులువుగా ఉంటుంది. దీనినే 'రూప ధ్యానము' అంటారు. ఒకసారి మనస్సు భగవత్ రూపంపై కేంద్రీకృతమయితే, మనము దానిని దేవుని గుణములపై - అయన దయా, సౌందర్యం, జ్ఞానం, ప్రేమా, ఉదారతా, కృపా, ఇంకా ఎన్నో... ఇలా వీటిపై చింతన చేయటం ద్వారా, మరింత ఇనుమడింపచేయవచ్చు. ఆ తర్వాత మానసిక సేవ చేయటం ద్వారా, ధ్యానంలో మరింత పురోగతిని సాధించవచ్చు. ఆయనకు ఆహార పదార్థములు సమర్పించినట్టూ, అర్చన చేసినట్టూ, ఆయనకు పాట పాడినట్టూ, పాద సేవ చేసినట్టూ, విసనకర్ర వీచినట్టూ, స్నానం చేయించినట్టూ, ఆయనకై వంట చేసినట్టూ, ఇలా భావన చేయవచ్చు. దీనిని 'మానస సేవ' అంటారు. ఈ రకంగా, మనం భగవంతుని నామాలూ, రూపాలూ, గుణాలూ, లీలలూ మొదలైన వాటిపై, ధ్యానం చేయవచ్చు. ఇవన్నీ కూడా, ఎల్లప్పుడూ భగవంతుని యందే మనస్సుని నిమగ్నం చేయటానికి ఉపయోగపడే అత్యంత శక్తివంతమైన ఉపకరణములే.

ఇక మన తదుపరి వీడియోలో, ‘మనస్సు’ భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా, నిశ్చలంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

02 March, 2022

‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు.. Bhagavadgita

  

‘సాధన’ - పాలను నీళ్ళలో పోస్తే అది తన అస్థిత్వాన్ని నిలుపుకోలేదు..

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (06 - 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/DglWrsZAmOA ]

ఇంద్రియములను జయించిన వారై, ప్రశాంతంగా ఎలా జీవించాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - బంధు రాత్మాఽఽత్మన స్తస్య యేనాత్మై వాత్మనా జితః ।
అనాత్మ నస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్ ।। 6 ।।

మనస్సుని జయించినవారికి, అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.

మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తిలో చాలా భాగాన్ని వెచ్చిస్తాం. అయితే, మన వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, ఈర్ష్యా, భ్రాంతీ మొదలైనవి, మనలోనే ఉంటాయని చెబుతున్నాయి. ఈ అంతర్గత శత్రువులు, బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బాహ్య శత్రువులు మనలను కొంత వరకే బాధిస్తాయి. కానీ, మనలోనే ఉండే శత్రువులు, మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేస్తాయి. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ సొంత మనస్సు వలన, మానసిక కుంగుబాటూ, ద్వేషమూ, ఆందోళన, బెంగ, మరియు ఒత్తిడి వంటి వాటితో, దౌర్భాగ్యమైన జీవితం గడిపిన వారూ, గడుపుతున్న వారూ, అనేక మంది ఉన్నారు. వైదిక తత్వ శాస్త్రం, వ్యాధులనేవి, వైరస్, బ్యాక్టీరియాల వలన మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనల వలన కూడా వస్తాయని చెప్పుకొచ్చింది. ఎవరైనా పొరపాటుగా మీ మీదకు రాయి విసిరితే, అది కొద్ది సేపు మాత్రమే మిమ్మల్ని బాధిస్తుంది. కానీ, తరువాతి రోజు దాని గురించి మనం మరచిపోతాము. అదే మనల్ని బాధించే మాట అంటే, అది ఎన్నో సంవత్సరాల వరకూ మనలను బాధిస్తూనే ఉంటుంది. ఇదే ఆలోచనల యొక్క శక్తి.

02:24 - జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః ।
శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానావమానయోః ।। 7 ।।

మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములూ, సుఖదుఃఖములూ, మానావమానముల వంటి ఈ ద్వంద్వములకు అతీతంగా, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు, ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.

ఇంద్రియములకూ, ఇంద్రియ వస్తువిషయ సంపర్కంచే మనస్సుకీ, శీతోష్ణములూ, సుఖదుఃఖాలూ అనుభవంలోనికి వస్తాయి. మనస్సు నిగ్రహింపబడని వరకూ, వ్యక్తి ఇంద్రియ భోగ-సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. కష్టాలనే అనుభూతులను అనుభవిస్తూనే ఉంటాడు. మనస్సుని జయించిన యోగి, ఈ క్షణభంగురమైన, తాత్కాలికమైన పరిణామాలను, శారీరక, ఇంద్రియ పనులుగా గుర్తించి, అవి నిత్య శాశ్వతమైన ఆత్మ కంటే వేరుగా తెలుసుకుని, వాటిచే ప్రభావితుడు కాడు. అటువంటి ఉన్నత స్థాయి యోగి, శీతోష్ణములూ, సుఖ-దుఃఖాలూ మొదలైన వాటికి, అతీతంగా ఉంటాడు. మనస్సు వసించేందుకు రెండే ప్రదేశాలున్నాయి. ఒకటి మాయా లోకం, మరొకటి భగవత్ లోకం. ఒకవేళ మనస్సు ప్రాపంచిక, ఇంద్రియ ద్వందములకు అతీతంగా ఎదగ గలిగితే, అది సునాయాసంగా భగవంతుని యందు నిమగ్నమవుతుంది. ఈ విధంగా, పురోగమించిన యోగి యొక్క మనస్సు, భగవంతుని ధ్యాసలో, సమాధి యందు స్థితమవుతుంది.

03:51 - జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థొ విజితేంద్రియః ।
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మకాంచనః ।। 8 ।।

జ్ఞానమూ, విజ్ఞాన విచక్షణా కలిగి, తృప్తితో ఉన్నయోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలోనూ ప్రశాంతంగా ఉంటారు. వారు మట్టీ, రాళ్ళూ, మరియు బంగారమూ, వీటన్నింటినీ ఒకే దృష్టితో చూస్తారు.

జ్ఞానము అంటే, గురువు గారి దగ్గర విని, శాస్త్ర గ్రంధములు చదివి, సిద్ధాంతపరంగా తెలుసుకున్న విషయం. విజ్ఞానము అంటే, అంతర్గతంగా, అనుభవ వేద్యమైన జ్ఞానము. ఇది అంతర్గంతంగా విచ్చుకునేది. ఈ జ్ఞానమూ, విజ్ఞానములనే రెండింటిచే, ఉన్నత స్థాయి యోగి యొక్క బుద్ధి, ప్రకాశితమవుతుంది. ఈ వివేకము కలిగిఉన్న యోగి, అన్ని భౌతిక వస్తువులను కూడా, భౌతిక శక్తి యొక్క ప్రతి రూపాలుగా చూస్తాడు. అన్ని వస్తువులనూ, భగవత్ సంబంధంగా చూస్తాడు. భౌతిక శక్తి భగవంతునిదే కాబట్టి, అన్ని వస్తువులూ ఆయన సేవ కొరకే ఉన్నాయి. పరమాత్మతో నిరంతరం అనుసంధానమై ఉండాలి. ఇటువంటి వ్యక్తి, భగవంతుని దివ్య ఆనందాన్ని రుచి చూడటం మొదలుపెడతాడు. కాబట్టి, తృప్తాత్మ అవుతాడు. అంటే, అంతర్గతంగా అనుభవంలోనికి వచ్చిన విజ్ఞానంచే, సంపూర్ణ తృప్తిని పొందుతాడు.

05:11 - సుహృన్మిత్రా ర్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు ।
సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి ర్విశిష్యతే ।। 9 ।।

శ్రేయోభిలాషులనూ, మిత్రులనూ, శత్రువులనూ, సాధువులనూ, పాపులనూ - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు.

మిత్రులూ, సహచరులూ, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువులూ, బంధువుల పట్లా తటస్థంగా, మరియూ పుణ్యాత్ములూ, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా ఉన్న యోగి, మానవులలో సర్వ శ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు. మిత్రుల పట్లా, శత్రువుల పట్లా వేర్వేరు విధంగా స్పందించటం, మానవ సహజ స్వభావం. కానీ, ఒక ఉన్నత స్థాయి యోగి యొక్క స్వభావం, వేరుగా ఉంటుంది. భగవంతుని విజ్ఞానము కలిగి ఉన్న ఉన్నతమైన యోగి, ఈ సమస్త సృష్టినీ భగవంతుని కన్నా అబేధముగా చూస్తాడు. ఈ విధంగా, వారు అన్ని ప్రాణులనూ సమ దృష్టితో చూడగలుగుతారు. ఈ సమత్వ దృష్టి కూడా, చాలా స్థాయిలలో ఉంటుంది:

1. "అన్ని ప్రాణులూ దివ్యాత్మలు. కాబట్టి, భగవంతుని అంశలే." అందుకే వారు సమానంగా చూడబడతారు. నిజమైన పండితుడు అందరినీ జీవాత్మలుగా చూస్తాడు కాబట్టి, తన లాంటి వారిగానే చూస్తాడు."

2. అంతకన్నా ఉన్నత మైన దృష్టి ఇది: "భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి, అందరూ గౌరవింపబడదగిన వారే."

3. అత్యున్నత స్థాయిలో, యోగి ఈ విధమైన దృష్టిని పెంపొందించుకుంటాడు: "ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపాలే." జగత్తు అంతా యదార్థంగా భగవంతుని స్వరూపమే అని, వైదిక వాఙ్మయం పదే పదే పేర్కొంటుంది. భగవంతుడు ఈ ప్రపంచంలో ప్రతి చోటా నిండి ఉన్నాడు. ప్రతిదీ, ఆయన శక్తి స్వరూపమే. కాబట్టి, అత్యున్నత యోగి, ప్రతివారినీ భగవత్ సాక్షాత్కారముగా చూస్తాడు. ఈ విధమైన జ్ఞానదృష్టి కలిగిఉన్నవారే, యోగులు.

07:02 - యోగీ యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ।
ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ।। 10 ।।

యోగస్థితిని పొందగోరేవారు, నియంత్రించబడిన మనస్సూ, శరీరంతో, భగవత్ ధ్యానంలో, కోరికలనూ, భోగ వస్తువులనూ త్యజించి, ఏకాంతంలో ఉండాలి.

ఏదైనా ఒక విషయంలో నైపుణ్యత సాధించాలంటే, ప్రతి రోజూ సాధన అవసరం. అనుదినమూ అభ్యాసం చేసినవాడే, ప్రావీణ్యతను సాధిస్తాడు, విజేత అవుతాడు. అభ్యాసం అనేది, ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా, చాలా అవసరం. ప్రతి రోజూ ధ్యానాభ్యాసము ద్వారా, ఆధ్యాత్మిక ప్రావీణ్యతను సాధించే పద్ధతిని వివరిస్తున్నాడు. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాం. ఈ ప్రాపంచిక కార్యక్రమాలూ, జనులూ, వారి మాటలూ, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి కొంత సమయాన్ని, ప్రతి రోజూ, ఏకాంత సాధనకు ఉపయోగించాలి. పాలను నీళ్ళలో పోస్తే, అది తన స్వీయ అస్థిత్వాన్ని నిలుపుకోలేదు. ఎందుకంటే, నీరు దానితో కలిసి పోతుంది. కానీ, అదే పాలను నీటి కంటే వేరుగా ఉంచి, దానిని పెరుగు చేసి, ఆ పెరుగునుండి తీసిన వెన్నను నీటిలో వేస్తే, దాని అస్థిత్వాన్ని కోల్పోదు. అలానే, మన మనస్సు పాల వంటిది. ఈ ప్రపంచం నీళ్ళ వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన, మనస్సు దానిచే ప్రభావితమై, ప్రాపంచికంగా అవుతుంది. కానీ, ఇంద్రియ వస్తువిషయములతో అతితక్కువ సంబంధం కలిగి ఉండే ఏకాంత వాతావరణం, మనస్సుని పై స్థాయికి తీసుకెళ్ళి, భగవంతునిపై కేంద్రీకరించటానికి, అనుకూలంగా ఉంటుంది. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి, మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికీ, మరియూ భగవంతునిపై కేంద్రీకరించటానికీ, 'సాధన' చేయాలి. ఇలా రోజుకి ఒకటి, లేదా రెండు గంటలు అభ్యాసం చేస్తే, ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా, దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా, ఏకాంతంలో రోజువారీ సాధన ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని, కాపాడుకోవచ్చు.

ఇక మన తదుపరి వీడియోలో, మన మనస్సుని ఏకాంత ధ్యానం ద్వారా ఎలా పరిశుద్ధమొనర్చుకోవాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

23 February, 2022

‘ఆత్మోద్ధరణ’ - మన మనస్సే మన ప్రధాన శత్రువు! Bhagavadgita

 

‘ఆత్మోద్ధరణ’ - మన మనస్సే మన ప్రధాన శత్రువు!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (01 - 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7gjf_PpDYMk ]

నిజమైన సన్యాసులూ, యోగుల గురించి, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:44 - శ్రీ భగవానువాచ ।
అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ।
స సన్న్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్నచాక్రియః ।। 1 ।।

భగవంతుడు ఇలా అంటున్నాడు: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను, అంటే వారు చేయవలసిన విధులను చేసిన వారే, నిజమైన సన్యాసులూ, యోగులూ. అంతేకానీ, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారూ, లేదా శారీరక క్రియలు త్యజించిన వారూ కాదు.

మన వేదాలలో, అగ్ని హోత్ర యజ్ఞముల వంటి కర్మ కాండలు చెప్పబడ్డాయి. సన్యాసాశ్రమంలోకి ప్రవేశించిన వారు, కర్మ కాండలు చేయకూడదనే నియమాలున్నాయి. నిజానికి వారు అగ్నిని తాకకూడదు. కనీసం వంట కోసం కూడా, తాకకూడదు. భిక్ష ద్వారా పొందిన అన్నాన్ని మాత్రమే, స్వీకరించాలి. అలా అని, కేవలం అగ్నిని విడిచిపెట్టినంత మాత్రాన, ఆ వ్యక్తి సన్యాసి అయిపోడు. కేవలం బాహ్యమైన సన్యాస శకలు, ఎవరినీ సన్యాసిని కానీ, యోగిని కానీ చేయవు. ఎవరైతే తమ కర్మ ఫలములను భగవంతునికే అర్పిస్తారో, వారే నిజమైన సన్యాసులూ, యోగులు. యోగ అంటే, ఏక మవ్వటం. ఇది ‘జీవాత్మ’ పరమాత్మతో ఏకమవ్వటాన్ని సూచిస్తుంది. అలాగే, యోగి అంటే, మనస్సు పూర్తిగా భగవంతునితో ఏకమయినవాడు, అని అర్థం. అంటే, అటువంటి యోగి మనస్సు, సహజంగానే ఈ ప్రపంచం నుండి ఉపసంహరించబడి ఉంటుంది. కర్మ యోగమును పాటించే వారు, తమ అన్ని కార్యములనూ, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పట్ల, వినయ, విధేయ, సేవా దృక్పథంతోనే చేస్తారు. ఒకవేళ వారు గృహస్థులైనా, అటువంటి వ్యక్తులు, నిజమైన యోగులు, మరియు అసలైన సన్యాసులు.

02:30 - యం సన్న్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ ।
న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ।। 2 ।।

సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా, ప్రాపంచిక కోరికలను త్యజించకుండా, యోగి కాలేరు.

సన్యాసి అంటే, మనో-ఇంద్రియముల సుఖాలను త్యజించిన వాడు, అని అర్థం. ఆత్మ పొందవలసిన లక్ష్యం, భగవత్-ప్రాప్తి. భగవంతుని దిశగా వెళ్ళటం, మనస్సుని ఆయన దిశగా తీసుకెళ్లటం, యోగ మార్గము. జీవిత లక్ష్యం యొక్క అసంపూర్ణ జ్ఞానం కలవారు, సన్యాసం తీసుకోవటమే, అత్యున్నత లక్ష్యంగా భావిస్తారు. నిజమైన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నవారు, భగవత్ ప్రాప్తియే తమ ఆధ్యాత్మిక ప్రయాణ అంతిమ లక్ష్యంగా తెలుసుకుంటారు. సన్యాసంలో రెండు రకాలుంటాయి. ఫాల్గు వైరాగ్యం, మరియు యుక్త వైగాగ్యం. ఫాల్గు వైరాగ్యం అంటే, ప్రాపంచిక వస్తువులను మాయకు చెందిన వస్తువులగా పరిగణించి, ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా ఉంటాయి కాబట్టి, వాటిని త్యజించటం. యుక్త వైరాగ్యం అంటే, సర్వమూ భగవంతునికి చెందినవే అని భావించి, అవన్నీ భగవత్ సేవకి ఉపయోగించబడేవే, అని అనుకోవటం.

03:47 - ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే ।
యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే ।। 3 ।।

యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న జీవాత్మకు, ఫలాపేక్ష లేకుండా పని చేయటమే, సాధనం అంటారు. యోగంలో ఉన్నత స్థాయిని చేరుకున్న మునికి, ధ్యానంలో ప్రశాంతతయే, సాధనం అంటారు.

యోగ సాధనను అకాక్షించే వారికి, కర్మ యోగమే యుక్తమైనది. అలాగే, యోగ సాధనలో ఉన్నతమైన స్థాయిని చేరుకున్న వారికి, కర్మ సన్యాసమే ఎక్కువ అనుగుణమైనది. 'యోగం' అన్న పదం, లక్ష్యాన్నీ, మరియూ ఆ లక్ష్యాన్ని చేరుకునే విధానాన్నీ, రెంటినీ సూచిస్తుంది. యోగం అంటే, భగవంతుని చేరుకోవటానికి ఎక్కే, నిచ్చెన. అన్నింటికన్నా క్రింది మెట్టులో జీవాత్మ, ప్రాపంచికత్వంలో చిక్కుకుని, లౌకిక విషయాల పట్ల నిమగ్నమై ఉంటుంది. యోగమనే నిచ్చెన, జీవాత్మను ఆ నిమ్న స్థాయి నుండి, భగవంతునిలోనే ఎప్పుడూ స్థితమై ఉండే స్థాయికి తీసుకెళ్తుంది. ఆ నిచ్చెనకుండే మెట్లకు, వేరువేరు పేర్లున్నాయి. కానీ, యోగం అన్న పదం, అన్నింటికీ వర్తిస్తుంది. 'యోగ-ఆరురుక్షు' అంటే, అప్పుడే నిచ్చెన ఎక్కటం మొదలు పెట్టిన, భగవంతునితో సంయోగానికి కృషి చేస్తున్న సాధకులు. యోగ-ఆరూఢ అంటే, నిచ్చెనపై ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, అని అర్థం.

05:11 - యదా హి నేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే ।
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢస్తదోచ్యతే ।। 4 ।।

ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్లా, మరియూ కర్మల పట్లా ఆసక్తి రహితముగా ఉంటాడో, ఆ వ్యక్తి, యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే, అతడు సమస్త కర్మ ఫలములనూ అనుభవించాలనే కోరికలను, త్యజించాడు కాబట్టి.

మనస్సు భగవంతునితో యోగములో ఏకమవుతున్న కొలదీ, సహజంగానే జగత్తు నుండి దూరమైపోతుంది. కాబట్టి, మనస్సు యొక్క స్థితిని బేరీజు వేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే, అది అన్ని ప్రాపంచిక కోరికల నుండీ స్వేచ్చను పొందిందో లేదో, చూసుకోవడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి, ఇంద్రియ విషయముల కోసం ప్రాకులాడడో, మరియూ వాటిని పొందటం కోసం ఏ పనీ చేయడో, అప్పుడా వ్యక్తి, ప్రాపంచికత నుండి దూరమయినట్టు. ఇటువంటి వ్యక్తి, ఇంద్రియ భోగాలను అనుభవించటం కోసం, పరిస్థితులను సృష్టించే అవకాశాలను చూడటం, మానేస్తాడు. అంతిమంగా, ఇంద్రియ భోగాలను అనుభవించాలనే అన్ని కోరికలనూ భస్మం చేస్తాడు. పూర్వపు ఇంద్రియ భోగ స్మృతులను నిర్మూలిస్తాడు. మనస్సు ఇక ఇంద్రియ ఉద్వేగాల వలన జనించే స్వార్ధ పూరిత క్రియల కోసం, పరుగులు తీయదు. మన మనస్సుపై ఈ స్థాయి నియంత్రణ సాధించినప్పుడు, యోగములో ఉన్నతమైన స్థాయిని చేరుకున్నట్టు, పరిగణించబడతాం.

06:41 - ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ।
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ।। 5 ।।

నీ మనస్సు యొక్క శక్తిచే, నిన్ను నీవు ఉద్ధరించుకొనుము. అంతేకానీ, పతనమైపోవద్దు. ఎందుకంటే, మనస్సే మన మిత్రుడూ, మరియూ ఆ మనస్సే మన శత్రువూ అవ్వవచ్చు.

మన ఉన్నతికీ, లేదా పతనానికీ, మనమే కారణం. చిత్తశుద్ధిగల సాధకులకు దిశానిర్దేశం చేయటానికీ, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికీ, భగవత్-ప్రాప్తి నొందిన మహాత్ములు, ప్రతి కాలంలో ఉండేటట్టుగా చూసుకుంటాడు, దేవుడు. కాబట్టి, అనంతమైన పూర్వ జన్మలలో, చాలా సార్లు భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములను మనం కలిసే ఉంటాం. అయినా, భగవత్ ప్రాప్తిని పొందలేక పోయాము అంటే, సరైన మార్గ దర్శకత్వం లేకపోవటం సమస్య కాదు. దానిని స్వీకరించక పోవటం, లేదా సరిగా ఆచరించక పోవటమే ప్రధాన సమస్య. మన మనస్సే, మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం, మనం చేసే ప్రయత్నాలకు అవరోధం కల్పించే వినాశకారి, అదే. ఒక పక్క, జీవాత్మ యొక్క గొప్ప శ్రేయిభిలాషి లాగా, మనకు అత్యంత శ్రేయస్సుని కలుగ చేసే శక్తి, మనస్సుకి ఉంది. మరో పక్క, మన ప్రగాఢ శత్రువుగా, మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా దానికి ఉంది. నియంత్రించబడిన మనస్సు, ఏంతో మేలు కలుగజేస్తుంది. నిగ్రహింపబడని మనస్సు, తుచ్ఛమైన తలంపులతో, జీవాత్మను పతనానికి గురి చేస్తుంది. మన మనస్సు నాలుగు స్థాయిలలో పని చేస్తుంది.

1: ఆలోచనలు సృష్టించినప్పుడు, దానిని 'మనస్సు' అంటాము.

2: ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దానిని 'బుద్ధి' అంటాము.

3: ఏదేని ఒక వస్తువు, లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు, దానిని ‘చిత్తము’ అంటాము.

4: ఎప్పుడైతే అది శరీరానికి సంబంధించిన వాటితో అనుసంధానమై - సంపద, హోదా, అందమూ, చదువూ వంటి వాటి పట్ల గర్వం పెంచుకుంటుందో, దానిని ‘అహంకారము’ అంటాము.

ఇవన్నీ, నాలుగు వేరువేరు అస్థిత్వాలు కావు. ఇవి ఒకే మనస్సు యొక్క నాలుగు నిర్వహణ స్థాయిలు. కాబట్టి, వీటన్నింటినీ కలిపి ‘మనస్సు’ అని చెప్పవచ్చు. అందుకే, మన మనస్సుని ఉపయోగించుకుని, ‘ఆత్మోద్ధరణ’ చేసుకోవాలి.

ఇక మన తదుపరి వీడియోలో, ఇంద్రియములను జయించిన వారై, ప్రశాంతముగా ఎలా జీవించాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

16 February, 2022

ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా! Bhagavadgita

 

ఆత్మ జ్ఞానమా? బ్రహ్మ జ్ఞానమా!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (25 – 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 25 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/60lPB4Sy6dA ]

భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభించాలంటే ఏం చేయాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - లభంతే బ్రహ్మనిర్వాణమ్ ఋషయః క్షీణకల్మషాః ।
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితే రతాః ।। 25 ।।

ఎవరి పాపములు నశించినవో, ఎవరి సందేహములన్నీ నిర్మూలింపబడినవో, ఎవరి మనస్సులు నియమబద్ధమైనవో, ఎవరైతే సమస్త ప్రాణుల సంక్షేమం కోసం నిమగ్నమవుతారో, అట్టి పవిత్రమైన వ్యక్తులు, భౌతిక జగత్తు నుండి విముక్తి పొంది, భగవంతుడిని పొందుతారు.

కరుణా స్వభావము అనేది, ఋషులకున్న స్వాభావిక గుణము. దానిచే స్ఫూర్తినొంది, వారు తమ వాక్కూ, మనస్సూ, శరీరములనూ, పరుల సంక్షేమం కోసమే ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక సంక్షేమం, భౌతిక దుఃఖాల మూల కారణాన్ని తాకుతుంది. ఆత్మ యొక్క భగవత్ స్పృహని మేల్కొలపటానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి, అత్యున్నత సంక్షేమ కార్యం ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క ఆత్మని, భగవంతునితో ఏకం చేయటమే. పవిత్రమైన మనస్సున్న మహోన్నత జీవులు, ఈ రకమైన సంక్షేమ పనులే చేస్తుంటారు. ఈ విధమైన సంక్షేమ కార్యాలు, మరింతగా భగవత్ కృపని ఆకర్షిస్తాయి. దాంతో వీరు ఈ మార్గంలో, మరింత ఉన్నతమైన దశకు చేరుకుంటారు. చివరికి వారు సంపూర్ణ అంతఃకరణ శుద్ధిని సాధించిన తరువాత, పరిపూర్ణమైన శరణాగతి చేసిన తరువాత, మోక్షము పొంది, పరమ పదమును పొందుతారు.

02:08 - కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసామ్ ।
అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనామ్ ।। 26 ।।

నిరంతర ప్రయాస ద్వారా, కామ-క్రోధముల నుండి బయట పడిన వారూ, మనస్సుని నిగ్రహించిన వారూ, ఆత్మ-జ్ఞానంలో ఉన్నవారూ అయినటువంటి సన్యాసులకు, ఇహ పర లోకాలలో, భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభిస్తుంది.

కర్మ యోగమనేదే, అత్యధిక జనులకు సరిపోయే సురక్షిత మార్గం. అందుకే, శ్రీ కృష్ణుడు దానిని అర్జునుడికి సూచించాడు. కానీ, ప్రాపంచిక జగత్తు నుండి నిజముగా వైరాగ్యం కలిగిన వానికి, 'కర్మ సన్యాసం' కూడా సరిపోతుంది. దీనిలో ఉన్న అనుకూలత ఏమిటంటే, ప్రాపంచిక విధుల వైపు, మన సమయం, శక్తీ, ఖర్చు కావు. మనం పూర్తిగా ఆధ్యాత్మిక సాధన యందు నిమగ్నమవ్వవచ్చు. చరిత్రలో ఏంతో మంది మహాత్ములైన సన్యాసులున్నారు. ఇటువంటి కర్మ సన్యాసులు కూడా, అత్యంత త్వరితంగా పురోగతిని సాధించి, సర్వత్రా శాంతిని పొందుతారు. కామ-క్రోధముల నుండి వచ్చే ఉద్వేగాలను నిర్మూలించి, మనస్సుని వశపరుచుకున్న ఇటువంటి వారు, ఈ జన్మలో, పై జన్మలలో, సంపూర్ణ శాంతిని పొందుతారు. మన జీవితంలో శాంతి లోపించడానికి కారణం, ‘బాహ్య పరిస్థితులు’ అనే తప్పుడు దృక్పథంలో ఉంటాం. పరిస్థితులు ఎప్పుడు మారతాయా, ఎప్పుడు ప్రశాంతత లభిస్తుందా, అని ఎదురు చూస్తాం. కానీ, శాంతి అనేది బాహ్య పరిస్థితులపై ఆధార పడి ఉండదు. అది శుద్ధి చేయబడిన ఇంద్రియ, మనో, బుద్ధుల వల్ల ఉత్పన్నమయ్యే ఫలితం. సన్యాసులు తమ మనస్సునూ, ఆలోచనలనూ, తమలో అంతర్లీనంగా తిప్పుకోవటం వలన, బాహ్య పరిస్థితులకు అతీతంగా, అపారమైన శాంతిని పొందుతారు. ఈ విధంగా, తమ అంతర్గత యంత్రాంగమంతా సరియైన ప్రకారంగా ఉండటం వలన, వారు అంతటా శాంతినే అనుభవిస్తారు. అంతేకాకుండా, ఇక్కడే విముక్తిని పొందుతారు.

04:04 - స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువోః ।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ ।। 27 ।।

04:15 - యతేంద్రియమనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః ।
విగతేఛ్చాభయక్రోధో యః సదా ముక్త ఏవ సః ।। 28 ।।

అన్నిబాహ్యమైన భోగ విషయముల తలంపులనూ త్యజించి, దృష్టి కను బొమల మధ్యే కేంద్రీకరించి, నాసికా రంధ్రముల లోనికి వచ్చే, బయటకు వెళ్ళే గాలిని సమముగా నిలిపి, ఈ విధంగా ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధిని నిగ్రహించి, కామ, క్రోధ, భయ రహితుడైన ముని, సర్వదా, మోక్ష స్థితి యందే వసించును.

తరచుగా సన్యాసులు, తమ నిష్ఠలతో పాటుగా, అష్టాంగ యోగ, లేదా హఠ యోగ వైపు మొగ్గు చూపుతారు. వారి యొక్క తీవ్రమైన వైరాగ్యం, వారిని భక్తి మార్గం వైపుకు అంతగా పోనివ్వదు. దానికి, భగవంతుని నామములూ, రూపాలూ, లీలలూ, మరియూ ఆయన ధామములపై ధ్యానం, అవసరం. సన్యాసులు తమ దృష్టీ, శ్వాసలను నియంత్రించటం ద్వారా, ఇంద్రియ వస్తువుల తలంపులని దగ్గరకు రానివ్వరు. తమ దృష్టిని కను బొమల మధ్యే, కేంద్రీకరిస్తారు. ఒకవేళ కళ్ళు పూర్తిగా మూస్తే, నిద్ర రావచ్చు. ఒకవేళ కళ్ళు పూర్తిగా తెరిస్తే, చుట్టూ ఉన్నవాటి వలన, ధ్యానంలో మనస్సు నిలబడలేకపోవచ్చు. ఈ రెండు దోషాలనూ నివారించటానికి, సన్యాసులు కళ్ళు సగమే తెరచి, తమ దృష్టిని కను బొమల మధ్యన, లేదా నాసికాగ్రాన నిలుపుతారు. బయటకు వెళ్ళే శ్వాసా, లోనికి వచ్చే శ్వాసా, రెండూ యోగ సమాధిలో నిలిచి పోయేవరకూ అనుసంధానం చేస్తారు. ఇంద్రియ, మనస్సు, బుద్ధులను నియంత్రించటానికి, ఈ యోగ పద్ధతి చాలా సహకరిస్తుంది. ఇటువంటి వ్యక్తులు, భౌతిక, ప్రాపంచిక మాయ నుండి విముక్తి పొందటమే, తమకున్న ఏకైక లక్ష్యంగా ఉంటారు. ఇటువంటి సన్యాస నిష్ఠల అభ్యాసం, ఆత్మ-జ్ఞానానికి దారి తీస్తుంది కానీ, బ్రహ్మ-జ్ఞానానికి కాదు.

06:06 - భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరమ్ ।
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి ।। 29 ।।

సమస్త యజ్ఞములకూ, తపస్సులకూ, భోక్తను నేనే అనీ, సమస్త లోకములకూ అధిపతిని అనీ, సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుడననీ తెలుసుకొనిన పిదప, నా భక్తుడు శాంతిని పొందుతాడు.

బ్రహ్మ- జ్ఞానము పొందాలంటే, భగవంతుని కృప ఉండాలి, అది భక్తి ద్వారా వస్తుంది. సన్యాస మార్గం కూడా, అన్ని తపస్సులకూ, నియమ నిష్ఠలకూ, భగవంతుడే భోక్త అన్న జ్ఞానంతో, ఈశ్వర శరణాగతి ద్వారానే, పరిపూర్ణత పొందుతుందని ఉద్ఘాటిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అనాది నుండీ జీవాత్మ, భగవంతుని నుండి విడిపోయి ఉంది. జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేదే, నిజమైన యోగం. కాబట్టి, భక్తి కలపకుండా, ఏ ఒక్క యోగ విధానం కూడా, సంపూర్ణం కాదు. ఈ గీత ద్వారా శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక సాధనకున్న అన్ని కచ్చితమైన మార్గాలనూ, అద్భుతంగా వివరించాడు. కానీ, ప్రతిసారీ లక్ష్యం సాధించటానికి భక్తి అనేది, ఈ అన్ని మార్గాలలో కూడా అవసరం అని చెప్పి, వాటికి పరిపూర్ణతను తెచ్చాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే, కర్మసన్న్యాస యోగో నామ పంచమోధ్యాయః

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, అయిదవ అధ్యాయం, కర్మసన్న్యాసయోగంలోని 29 శ్లోకాలూ, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని ఆరవ అధ్యాయం, ఆత్మసంయమయోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

09 February, 2022

ఆంతర వెలుగు! Bhagavadgita

  

ఆంతర వెలుగు!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/t5lg4WDoupw ]

ఆత్మ యందు అంతులేని ఆనందాన్ని అనుభవించాలంటే ఏం చేయాలో శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:47 - ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।

సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మ లోనే, జనన మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి, పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.

ఇష్టాయిష్టాలకూ, సుఖ-దుఃఖాలకూ, సంతోషము-బాధలకూ అతీతంగా ఉండగలిగిన వారు, నిరంతర జన్మ మరణ సంసారాన్ని దాటేస్తారు. మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకూ, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము. ఎందుకంటే, శారీరక ఆహ్లాదమూ, కష్టముల పరంగా, కోరికలూ, ద్వేషాలూ అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు, ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్ధ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చల తత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది.

02:06 - న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్ ।
స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః ।। 20 ।।

భగవంతుని యందే స్థితులై, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందు దృఢమైన అవగాహన కలిగి ఉండి, భ్రమకు లోనుకాకుండా ఉన్నవారు, ప్రియమైనవి లభిస్తే పొంగిపోరు, ఏదైనా అప్రియమైనవి జరిగితే, క్రుంగిపోరు.

భక్తిలో, మన చిత్తమును శరణాగతిగా భగవదర్పితము చేసినప్పుడు, సుఖాలకు పొంగిపోకుండా, దు:ఖాలకు క్రుంగిపోకుండా ఉండే స్థితిని, చేరుకుంటాము. మన చిత్తమును భగవంతుని చిత్తముతో ఐక్యం చేసినప్పుడు, సంతోషాన్నీ, బాధనీ, భగవంతుని అనుగ్రహంగా స్వీకరిస్తాము. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగించే అవగాహన ఎమిటంటే, భగవంతునికి ప్రీతి కలిగించటంలోనే, మన స్వీయ-ప్రయోజనం ఉందనే సత్యాన్ని, తెలియజేస్తుంది. ఇది ఈశ్వర శరణాగతి దిశగా తీసుకెళ్తుంది. ఎప్పుడైతే మన స్వీయ-చిత్తం, భగవంతుని చిత్తములో ఏకమైపోతుందో, అప్పుడు సంతోషాలనీ, దుఃఖాలనీ, ఈశ్వరానుగ్రహంలా, ప్రశాంతంగా స్వీకరించే సమత్వ బుద్ధి పెంపొందుతుంది. ఇదే సర్వోత్కృష్ట స్థితిలో ఉన్నవాని లక్షణం.

03:21 - బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖమ్ ।
స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే ।। 21 ।।

బాహ్యమైన ఇంద్రియ సుఖాలపై మమకారాసక్తులు లేనివాడు, ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తాడు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తాడు.

వైదిక శాస్త్రాలు అనేక పర్యాయములు, భగవంతుడిని అనంతమైన దివ్య ఆనంద సాగరంగా, అభివర్ణించాయి.

భగవంతుని స్వరూపము, స్వచ్ఛమైన ఆనందముచే తయారుచేయబడినదని భారతంలో, భగవంతుడు సంతోషానందముల మహాసాగరమని రామాయణంలో, దేవుని చేతులూ, పాదములూ, ముఖమూ, ఉదరమూ మొదలగునవన్నీ, ఆనందముచే తయారు చేయబడినవని  పద్మ పురాణంలో, వివరించబడ్డాయి. ఈ శాస్త్రాల్లో ఉన్న శ్లోకములన్నీ, దివ్య ఆనందమే భగవంతుని వ్యక్తిత్వ స్వభావమని, వక్కాణిస్తున్నాయి. తన ఇంద్రియములూ, మనస్సూ, మరియూ బుద్ధిని, భగవంతుని యందే నిమగ్నం చేసినవారు, తమలోనే ఉన్న భగవంతుని యొక్క దివ్య ఆనందాన్ని అనుభవించటం, ప్రారంభిస్తారు.

04:30 - యే హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే ।
ఆద్యంతవంతః కౌంతేయ న తేషు రమతే బుధః ।। 22 ।।

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కం వలన కలిగే భోగాలు, ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా, అవి యథార్థముగా దుఃఖ హేతువులే. ఓ కుంతీ పుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది-అంతం ఉంటాయి. కాబట్టి, జ్ఞానులు వీటి యందు రమించరు.

ఇంద్రియ వస్తు-విషయ సంపర్కంచే, ఇంద్రియములు సుఖానుభూతులను కలుగ చేస్తాయి. మనస్సు ఒక ఆరవ ఇంద్రియము లాగా, గౌరవమూ, పొగడ్తా, పరిస్థితులూ, విజయమూ మొదలైన వాటి నుండి, ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరిక, మానసిక సుఖాలన్నింటినీ, భోగాలంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు, ఆత్మను సంతృప్తి పరచలేవు. ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవీ, పరిమితమైనవి. కాబట్టి, ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. కొంత సమయం తరువాత, వ్యక్తిని మరల అసంతృప్తితో నింపివేస్తాయి. కానీ, భగవంతుని ఆనందం నిత్యమైనది. ఒకసారి పొందిన తరువాత, అది శాశ్వతంగా ఉంటుంది. ప్రాపంచిక సుఖాలు, జడమైనవి. కాబట్టి, క్రమక్రమంగా తగ్గిపోతాయి. భౌతిక వస్తువుల నుండి కలిగే సుఖం, మనం దానిని ఆనందించే కొద్దీ, తగ్గిపోతుంది. కానీ భగవంతుని ఆనందం, చైతన్యవంతమైనది. అది సత్-చిత్-ఆనందం. కాబట్టి, ఒక వ్యక్తి భగవత్ నామాన్ని నిరంతరం, రోజంతా జపిస్తూ ఉన్నా, నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందుతాడు. ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని అస్వాదిస్తున్నప్పుడు, మనస్సు, అన్ని భౌతిక సుఖాల యందూ రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు, భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకుని, తమ ఇంద్రియములను వాటి నుండి, నిగ్రహిస్తారు.

06:27 - శక్నోతీహైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ ।
కామక్రోధోద్భవం వేగం స యుక్తః స సుఖీ నరః ।। 23 ।।

ఈ శరీరమును విడిచి పెట్టక ముందే, ఎవరైతే కామ-క్రోధ శక్తులను నియంత్రణ చేయగలరో, వారు యోగులు. వారు మాత్రమే, నిజమైన సుఖసంతోషములు గలవారు.

మానవ శరీరం అనేది, ఆత్మకి, ఆత్యున్నత లక్ష్యమైన భగవత్ ప్రాప్తిని సాధించేందుకు ఉన్న ఒక అద్భుతమైన అవకాశం. ఈ శరీరంలో మనకు వివేచనాత్మక శక్తి ఉంటుంది. కానీ, జంతువులు తమ సహజ స్వభావంచే ప్రవర్తిస్తాయి. మనకున్న విచక్షణా శక్తిని వాడుకోవటం ద్వారా, కామ-క్రోధముల యొక్క ఉద్వేగాన్ని నియంత్రించాలి. తనకు కావలసిన వస్తువు ఎప్పుడైతే దొరకదో, అప్పుడు మనస్సు క్రోధంతో నిండిపోతుంది. కామ-క్రోధముల ఆవేశం, నదీ ప్రవాహంలా, చాలా ప్రబలంగా ఉంటుంది. జంతువులు కూడా ఈ ఆవేశాలకు లోనవుతాయి. కానీ, మనుష్యుల లాగా, ఆ ఆవేశాలను నియంత్రించే విచక్షణా శక్తి, వాటికి లేదు. మనుష్య బుద్ధికి వివేచనాత్మక శక్తి ప్రసాదించబడింది. కాబట్టి, జ్ఞానం వలన కలిగిన విచక్షణ చేత, మనస్సుని నిగ్రహించాలి.

07:40 - యోఽoతః సుఖోఽoతరారామః తథాంతర్జ్యోతిరేవ యః ।
స యోగీ బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోఽధిగచ్ఛతి ।। 24 ।।

ఎవరైతే తమలో తాము ఆనందంగా ఉంటారో, లోనున్న పరమాత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉండి, అంతర్గత జ్ఞాన వెలుగుచే ప్రకాశిస్తూ ఉంటారో, అటువంటి యోగులు, భగవంతునితో ఏకమై, భౌతిక, ప్రాపంచిక అస్తిత్వము నుండి విముక్తులవుతారు.

"ఆంతర వెలుగు" అంటే, ఈశ్వరానుగ్రహంచే, మనం ఆయనకు శరణాగతి చేసినప్పుడు, మనలో నుండి బయటకు వచ్చే దివ్య ఆధ్యాత్మిక పరిజ్ఞానం. మనకు కొన్ని బాహ్య వస్తువుల నుండి సుఖం లభిస్తుంది. మనం ఒక వస్తువు కొన్నప్పుడు, ఎంతో ఆనందిస్తాము. కానీ, ఒక సంవత్సరం వాడిన తరువాత, మరొక వస్తువు కావాలనిపిస్తుంది. పాతదానిపై మనకున్న మమకారం పోతుంది. ఇటువంటి బాహ్య వస్తువుల ద్వారా మనం పోందే ఆనందం, సుఖం, తాత్కాలికం. అదే మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడో, భగవంతుడి దివ్య మూర్తిని చూసినప్పుడో కలిగే ఆనందం, మనం దానిని స్మరించినప్పుడల్లా కలుగుతుంది. ఆ సుఖం, మన మనస్సుని భగవంతుని యందే నిమగ్నం చేసినప్పుడు, అనుభవంలోకి వస్తుంది. మనకు అంతర్గతంగా ఆనందం అనుభవంలోకి రానప్పుడు, బాహ్యమైన దురాకర్షణలని శాశ్వతంగా నిరోధించలేము. కానీ, ఎప్పుడైతే భగవదానందం హృదయంలో ప్రవహించటం మొదలవుతుందో, క్షణభంగురమైన బాహ్య సుఖాలు అల్పమైనవిగా అనిపించి, త్యజించటానికి వీలుంటుంది.

ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక అస్థిత్వం నుండి విముక్తి లభించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

26 January, 2022

జన్మ మృత్యు సంసార చక్రం! Bhagavadgita

  

జన్మ, మృత్యు, సంసార చక్రం!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (07 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 07 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ncVFV_BFNzs ]

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, ఆత్మ శుద్ధి కోసం ఆచరించే కర్మల గురించి, శ్రీ కృష్ణుడు చెప్పబోతున్నాడు..

00:46 - యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।

పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలోని ఆత్మలో, పరమాత్మను  దర్శిస్తారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, వారు కర్మబంధాలలో చిక్కుకోరు.

కర్మయోగులలో వివిధ రకాల వారు ఉన్నారు. 
విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు, 
విజితాత్మా - మనస్సుని జయించినవాడు, 
జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.

ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందూ భగవంతుడినే దర్శిస్తారు. అందరితో  గౌరవప్రదంగా మెలుగుతూ ఉంటారు. వారు చేసే కార్యకలాపాలు, స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి, వారి జ్ఞానం, క్రమక్రమంగా వృద్ధిచెందుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక  భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. అవి ఇక భగవత్ సేవకు అందుబాటులో ఉంటాయి. భక్తి యుక్త సేవ, అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము సహజ పద్ధతిలో, జ్ఞానోదయ దిశగా, ఒక్కొక్క మెట్టూ పైకి తీసుకువెళుతుంది. కాబట్టి, ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

02:08 - నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ।। 8 ।।

02:18 - ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ।
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ।। 9 ।।

కర్మ యోగములో ధృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు, చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడూ, వాసన చూస్తున్నప్పుడూ, భుజిస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, త్యజించేటప్పుడూ, గ్రహించేటప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ, "చేసేది నేను కాదు" అన్ని ఎల్లప్పుడూ భావిస్తారు. ప్రాకృతిక ఇంద్రియములే, వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.

మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే, మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడుతుంటాము. ఈ కర్తుత్వ భావనతో వచ్చే  గర్వం, ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి, పెద్ద అడ్డంకిగా మారుతుంది. కానీ, భగవత్ దృక్పథంలో ఉన్న కర్మ యోగులు, ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో, వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు కాబట్టి, తమ శారీరిక క్రియలను, తమకు ఆపాదించుకోరు. శరీరము, భగవంతుని యొక్క ప్రాకృతిక శక్తితో  తయారు చేయబడినది. కాబట్టి, వారు చేసే అన్ని పనులూ, భగవత్ శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు. వారు ఈశ్వర  సంకల్పానికి శరణాగతి చేశారు కాబట్టి, తమ మనోబుద్ధులకు, ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందటానికి, కృషి చేస్తారు. ఈ విధంగా, భగవంతుడే అన్ని పనులూ చేస్తున్నాడనే భావనలో, దృఢంగా స్థితులై ఉంటారు.

03:54 - బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 10 ।।

సమస్త మమకారాసక్తులనూ త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలనూ అంకితం చేసేవారు, తామరాకు, నీటిచే తడపబడనట్లు,  వారు పాపముచే తాకబడరు.

తామర పువ్వును, భగవంతుని దివ్య శరీర భాగాలని వర్ణించేటప్పుడు, ఒక గౌరవ ప్రదమైన ఉపమానంగా వాడతారు. తామర పూవుకు మరోక పేరు, 'పంకజము'.. అంటే, "బురద నుండి జన్మించినది". కొలను అడుగున ఉండే బురద నుండి, తామర పూవు జనిస్తుంది. నీటి ఉపరితలం పైకి పెరిగి, సూర్యుని వైపు పుష్పిస్తుంది. బురదలో పుట్టినా, తన  అందాన్నీ, స్వచ్ఛతనూ కాపాడుకుంటుంది. కొలను నీటి ఉపరితలంపై తేలియాడే తామరాకులు, నీటిని అంటుకోనివ్వవు. తామరాకుకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, అది నీటిలోనే పుట్టి పెరిగినా, నీటిని తాకనివ్వదు. అదే విధంగా, కర్మ యోగులు, అన్ని పనులూ చేస్తున్నా, వారు భగవత్ దృక్పథంలో పని చేయటం వలన, వారికి పాపము అంటదు.

04:58 - కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ।। 11 ।।

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరమూ, మనస్సూ, ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

ఆనందాన్ని అన్వేషిస్తూ, భౌతిక, ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృధా ప్రయాసే అని, యోగులు అర్థం చేసుకుంటారు. వాస్తవాన్ని తెలుసుకుని, వారి స్వార్ధ కోరికలను త్యజించి, అన్ని కర్మలూ భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే, అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త అని విశ్వసిస్తారు. అయితే, అంత:కరణ శుద్ధి అనేది, మన చేతిలోనే ఉంటుంది. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దానిని భక్తిలో నిమగ్నం చేస్తే, అదే భగవంతునికి అమితానందాన్నిస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు, తమ అంతఃకరణ శుద్ధిని, అతిముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దానిని స్వార్థం కోసం కాకుండా, భగవత్ ప్రీతి కోసమే చేస్తారు.

06:03 - యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।। 12 ।।

అన్ని క్రియాకలాపముల ఫలాలను భగవంతునికే అర్పితము చేసి, కర్మ యోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే  సమయంలో, తమ కోరికలచే ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనాల కోసం పని చేసే వారు, కర్మ బంధములలో  చిక్కుకుంటారు. ఎందుకంటే, వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.

చేసే పని ఒక్కటే అయినా, కొందరు భౌతిక బంధాలలో చిక్కుకుంటారు. అదే సమయంలో మరి కొందరు, భౌతిక  బంధాలనుండి విముక్తిని పొందుతారు. భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండా, వాటిచే ప్రేరేపింపబడకుండా ఉన్న వారు, కర్మ బంధాలలో చిక్కుకోరు. కానీ, ప్రతిఫలం కోసం ప్రాకులాడుతూ, భౌతిక సుఖాలనుభవించాలనే కామానికి వశమై పోయిన వారు, కర్మబంధ ప్రతి క్రియలలో చిక్కుకుంటారు. భగవంతునితో మానసికంగా ఏకమైపోయిన యుక్త పురుషులు, తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిగా, అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే, కర్మలు చేస్తుంటారు. కాబట్టి, వారు త్వరలోనే దివ్య జ్ఞానాన్నీ, మరియు శాశ్వతమైన ముక్తినీ పొందుతారు. భగవంతునితో ఏకమవ్వని అయుక్త పురుషులు, అత్యాశచే ఉసికొల్పబడి, వ్యామోహంతో, కర్మ ఫలములను ఆశిస్తారు. ఇటువంటి దృక్పథంతో చేయబడిన పనులు, జన్మ-మృత్యు సంసార చక్రం లో బంధించివేస్తాయి.

ఇక మన తదుపరి వీడియోలో, నిజమైన సంతోషాలు పొందాలంటే ఏంచేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

12 January, 2022

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి! Bhagavadgita

  

జ్ఞానంతో శాశ్వతమైన శాంతి!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (37 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 37 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7rwg9mZpgVw ]

అలౌకిక జ్ఞానంతో శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

యథైధాంసి సమిద్ధోఽగ్నిః భస్మసాత్కురుతేఽర్జున ।
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా ।। 37 ।।

ఎలాగైతే ప్రజ్వలించే అగ్ని, కట్టెలను భస్మము చేయునో, ఓ అర్జునా, జ్ఞానాగ్ని కూడా, భౌతిక కర్మల నుండి జనించే ప్రతిక్రియలన్నింటినీ, భస్మము చేయును.

మనందరికీ కూడా, అనంత జన్మల నుండి చేసిన పుణ్య, పాప కర్మల ప్రతిక్రియల కర్మరాశి, పేరుకుని పోయి ఉంటుంది. ఈ కర్మ ఫలితాలను అనుభవిస్తూ, తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే, అది ఇంకా ఎన్నో జన్మలు పట్టవచ్చు. అంతేకాక, ఈ సమయంలో మరిన్ని కర్మలు పేరుకుపోయి, అదొక అంతులేని ప్రక్రియగా మిగిలిపోతుంది. కానీ, మన కర్మలన్నింటినీ, ఈ జన్మ లోనే భస్మం చేసే శక్తి, జ్ఞానానికి ఉందని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి భరోసా ఇస్తున్నాడు. ఎందుకంటే, ఆత్మ యొక్క జ్ఞానం, మనలను భగవంతుని శరణాగతి దిశగా తీసుకువెళ్తుంది. భగవంతునికి శరణాగతి చేసినప్పుడు, ఆయన మన యొక్క అనంతమైన జన్మల కర్మలను భస్మం చేసి, భౌతిక బంధముల నుండి విముక్తి చేస్తాడు. ఎలా అయితే ఒక చిన్న నిప్పు తునక మహా జ్వాలగా మారి, ఒక పెద్ద కొండను సైతం భస్మం చేయగలదో, అలాగే, మనలో రగిలే జ్ఞానాగ్ని, మన క్రియలన్నింటినీ భస్మం చేస్తుంది.

న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే ।
తత్స్వయం యోగసంసిద్దః కాలేనాత్మని విందతి ।। 38 ।।

దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమొనర్చేది, ఈ లోకంలో వేరే ఏమీ లేదు. చాలా కాలం, యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత, కాల క్రమంలో ఈ జ్ఞానం, సాధకుని హృదయంలో పొందబడుతుంది.

ఒక వ్యక్తిని పవిత్రమొనర్చి, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లి, ముక్తిని ప్రసాదించి, మరియు భగవంతుని దగ్గరకు చేర్చే శక్తి, కేవలం జ్ఞానానికి మాత్రమే ఉంది. కాబట్టి, అది మహోన్నతమైనదీ, అత్యంత పవిత్రమైనది. వేద శాస్త్రాలను చదవటం, మరియు గురువు గారి ప్రవచనాలను వినటం ద్వారా, ఒక రకమైన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. కానీ, ఈ పుస్తక పరిజ్ఞానం సరిపోదు. ఆత్మ, భగవంతుడూ, మాయ, కర్మ, జ్ఞానం, భక్తీ అనే విషయముల మీద, సంపూర్ణ అవగాహన, కేవలం గురువు గారి దగ్గర నుండే నేర్చుకోగలం. ఈ పద్ధతిలో కాకుండా భగవత్ ప్రాప్తి నొందడం, ఎవరికైనా అసాధ్యం. ఎప్పుడైతే వారు తెలుసుకున్న పుస్తక జ్ఞానం ప్రకారంగా సాధన చేస్తారో, అది వారి అంతఃకరణను శుద్ధి చేస్తుంది. అప్పుడు, ఆత్మ తత్వము, దానికీ భగవంతునికీ ఉన్న సంబంధం, హృదయంలో అంతర్గతంగా ప్రకటితం చేస్తుంది.

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః ।
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శాంతిమచిరేణాధిగచ్ఛతి ।। 39 ।।

గాఢమైన శ్రద్ధావిశ్వాసాలు కలవారూ, మరియు తమ మనో-ఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసినవారూ, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించుకుంటారు. ఇటువంటి శ్రేష్ఠమైన, అలౌకిక జ్ఞానంతో, వారు అతిత్వరగా, శాశ్వతమైన పరమ శాంతిని పొందుతారు.

అన్ని ఆధ్యాత్మిక సత్యాలూ, తక్షణమే అర్థం కావు. కొన్నింటిని ఆధ్యాత్మిక పథంలో, ఉన్నతమైన స్థాయిని చేరుకున్న తరువాతే, అనుభవించగలము. గురువు, మరియు శాస్త్రముల పట్ల ధృఢ విశ్వాసమునే, శ్రద్ధ అంటారు. ఒకవేళ ఇలాంటి శ్రద్ధ, తప్పుడు వ్యక్తి మీద పెడితే, అది భయానక పరిణామాలకు దారి తీస్తుంది. కానీ, అదే శ్రద్ధ ఒక నిజమైన గురువు మీద పెడితే, అది శాశ్వత సంక్షేమం దిశగా, మనలను తీసకువెళుతుంది. అదే సమయంలో, గుడ్డి విశ్వాసం కూడా మంచిది కాదు. ఒక గురువు గారి మీద, అటువంటి శ్రద్ధ ఉంచే ముందు, మన బుద్ధిని ఉపయోగించి, ఆ గురువు పరమ సత్యాన్ని ఎరిగినవాడనీ, దానిని ఆయన వేద ప్రమాణంగా ఉపదేశిస్తున్నాడనీ, నిర్ధారణ చేసుకోవాలి. దీనిని నిశ్చయించుకున్న తరువాత, అటువంటి గురువు మీద మన నమ్మకాన్ని పెంచుకోవటానికి, కృషిచేయాలి. అదేవిధంగా, వారి మార్గదర్శకత్వంలో, భగవంతునికి శరణాగతి చేయాలి. గురువు, మరియు భగవంతునిపై, నిస్సంకోచమైన, దృఢమైన విశ్వాసం కలవారికి, వేదముల జ్ఞాన సారం, వారి హృదయంలో తెలియ చేయబడుతుంది.

అజ్ఞశ్చాశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరో న సుఖం సంశయాత్మనః ।। 40 ।।

జ్ఞానమూ, విశ్వాసమూ, రెండూ లేని వారూ, అనుమానపడే స్వభావం కలవారూ, పతనమైపోతారు. విశ్వాసములేక, సందేహించే వారికి, ఈ లోకంలో, ఇంకా, పర లోకంలో కూడా, సుఖం ఉండదు.

సాధకులను వారి విశ్వాసం, మరియు జ్ఞాన స్థాయిలను బట్టి, మూడు రకాలుగా వర్గీకరించాయి, శాస్త్రాలు. శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉండి, దృఢ విశ్వాసం కలిగినవాడు, అత్యున్నత సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా, గురువు, మరియు భగవంతుని పై విశ్వాసం కలిగి ఉన్నవాడు, మధ్యమ స్థాయి సాధకుడు. శాస్త్ర పరిజ్ఞానం లేకుండా, విశ్వాసం కూడా లేనివాడు, నిమ్న స్థాయి సాధకుడు. ఈ మూడవ రకం వారు, ఈ జన్మలో గానీ, లేదా, ఆ పై జన్మలలో గానీ, ఎన్నటికీ సుఖాన్ని పొందలేరు. ప్రాపంచిక కార్యకలాపాలకు కూడా, నమ్మకం, ఎంతో అవసరం.

యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।

ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ సందేహాలన్నీ నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని, కర్మలు బంధించవు.

కర్మ అంటే, విహిత ఆచారములూ, మరియూ సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములూ. సన్యాసం అంటే, “త్యజించుట/విడిచిపెట్టుట”. “యోగ” అంటే, “భగవంతునితో ఐక్యత”. ఇక్కడ శ్రీ కృష్ణుడు, యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు. అంటే, “పూజాది అన్ని కర్మలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మ లను భగవంతునికే అంకితం చేసేవారు” అని అర్థం. అలాంటి వారు, తమ క్రియలన్నింటినీ, భగవత్ సేవగానే చేస్తారు. భక్తి యుక్తంగా వారు చేసే పనులు, వారిని కర్మ బంధములలో పెనవేయవు. తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే, వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే, పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేస్తామో, వాటికి, కర్మ ప్రతిక్రియలుండవు. అంటే, సంఖ్యలను సున్నాతో గుణించినట్టే. పదిని సున్నాతో గుణించినా, కోటిని సున్నాతో గుణించినా, ఫలితం శూన్యమే. అదే విధంగా, జ్ఞానోదయం అయిన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు. ఎందుకంటే, వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు. కర్మలను భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.

తస్మాదజ్ఞానసంభూతం హృత్-స్థం జ్ఞానాసినాత్మనః ।
ఛిత్త్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత ।। 42 ।।

కాబట్టి, జ్ఞానమనే ఖడ్గంతో, నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయుము. ఓ భరత వంశీయుడా, కర్మ యోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము.

అర్జునుడి ఆధ్యాత్మిక గురు స్థానంలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన శిష్యునికి కర్మ యోగాభ్యాసం ద్వారా, లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్నీ, విశ్వాసాన్నీ ఉపయోగించుకుని, తన మనస్సులో ఉన్న సందేహాలను పెకలించివేయమని ఉపదేశిస్తున్నాడు. అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం, లేచి, తన విధిని, కర్మ-యోగ దృక్పథంలో నిర్వర్తించమని, పిలుపునిస్తున్నాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జునసంవాదే, జ్ఞానకర్మసన్న్యాసయోగోనామ చతుర్థోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, నాలుగవ అధ్యాయం, జ్ఞానకర్మసన్న్యాసయోగంలోని, 42 శ్లోకాలూ, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని అయిదవ అధ్యాయం, కర్మసన్న్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

05 January, 2022

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం! Bhagavadgita

  

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (31 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 31 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GT_2nUOrUyU ]

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ ।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ।। 31 ।।

యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి, పరమ సత్యము దిశగా పురొగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్టుడా, ఏ విధమైన యజ్ఞమూ చేయని వారు, ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ, ఎటువంటి సుఖమునూ పొందలేరు.

ఒక కార్యాన్ని భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగి ఉండటమే, యజ్ఞము యొక్క రహస్యం. భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే, దాన్ని స్వీకరిస్తారు. ఆ నివేదన అనంతరం, పళ్ళెంలో ఉన్న శేషాన్ని, ఆయన ప్రసాదంగా తీసుకుంటారు. అటువంటి అమృతతుల్యమైన ప్రసాదం, మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత, మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి. అదేవిధంగా, భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే, వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటారు. ఎప్పుడైతే వస్తువులు, లేదా పనులు, భగవంతునికి యజ్ఞంగా సమర్పిస్తారో, ఆ శేషం, అంటే ప్రసాదం, ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహము వంటిది. అలా కాకుండా, యజ్ఞాన్ని ఆచరించని వారు, కర్మ-ఫల బంధాలలో చిక్కుకుని, మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు. వారు ఎప్పటికీ, సుఖ సంతోషాలను పొందలేరు.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।

ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ, వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి, అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.

వేదముల యొక్క అధ్బుతమైన లక్షణం ఏమిటంటే, అవి ఎన్నో, విభిన్నరకాల మానవ స్వభావాలను గుర్తించి, వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. రకరకాల మనుష్యులకు, రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నింటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే, ఇవన్నీ భక్తితో, భగవత్ అర్పితముగా చేయాలి. కాబట్టి, వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా, మనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ, భౌతిక బంధాల నుండి విముక్తి పొందే జ్ఞానాన్ని, సముపార్జించాలి.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।

ఓ శత్రువులను లోబరుచుకునే వాడా, యాంత్రికముగా, ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా, జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏది ఏమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలూ జ్ఞానమునందే పరిసమాప్తమవుతాయి.

పూజాది క్రియలూ, ఉపవాసాలూ, మంత్ర జపాలూ, తీర్థ యాత్రలూ, ఇవన్నీమంచివే కానీ, వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా, ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ, మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికి, అవి సరిపోవు. చాలా మంది ప్రజలు, భగవన్నామాన్ని జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లె వేస్తుంటారు, పవిత్ర ధామాలను సందర్శిస్తుంటారు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటువంటి భౌతిక క్రియలతోనే, భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో, ఇవన్నీ చేస్తుంటారు. అయితే, జ్ఞాన సముపార్జనతో, భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. భగవంతునిపై, మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవటం వలన, మన భక్తి భావన వృద్ధిచెందుతుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।। 34 ।।

ఒక ఆధ్యాత్మిక గురువును చేరి, పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలడుగుతూ, ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని, నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే, అతను స్వయంగా, యథార్థమును దర్శించినవాడు.

ఆత్మ యొక్క బుద్ధి, అనంత జన్మల అజ్ఞానంచే కప్పివేయబడి ఉంటుంది. అవిద్యచే ఆవరింపబడి ఉండి, బుద్ధి తన అజ్ఞానాన్ని తన సొంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా, ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి, సేవించాలి. అలా చేసినట్లయితే, ఆయన శాస్త్ర జ్ఞానాన్నీ, మరియు వివేచనాత్మకతను ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు. గురువుకి శరణాగతి చేయకుండా, భౌతిక మాయ నుండి ముక్తి లభించదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ, ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా, విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం, బోధకునికి రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది, శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు. దానిని ఎంతో కొంత రుసుము చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయమూ, నమ్రతా పెంపొందించుకుంటాడో, సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమవుతాడో, అది గురుకృపచే శిష్యుని హృదయంలో, ప్రకటించబడుతుంది.

యజ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ।। 35 ।।

ఈ మార్గాన్ని అనుసరిస్తూ, గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు తిరిగి మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులూ భగవంతుని భాగాలే అనీ, అవి నా యందే స్థితమై ఉన్నాయనీ, గ్రహిస్తావు.

ఏ విధంగానయితే సూర్యుడిని చీకటి కప్పివేయలేదో, అదే విధంగా, మాయ అనేది, ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మని, వశపరుచుకోలేదు. భగవంతుడిని ఎరిగిన వారు, ఎప్పటికీ ఆ భగవత్ ధ్యాసలోనే ఉంటారు. మాయ యొక్క భ్రాంతిలో, మనం ప్రపంచాన్ని ఆ భగవంతుని కంటే వేరుగా చూస్తాము. తోటి వారు, మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా అన్న విషయంపై, మనం వారితో స్నేహం, లేదా శతృత్వం పెంచుకుంటాము. జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్య ఆధ్యాత్మిక వివేకము, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చి వేస్తుంది. జ్ఞానోదయమైన మాహాత్ములు, ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు. వారికి లభించినదంతా, ఆ భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు. అందరు మనుష్యులూ, ఆ భగవంతుని అంశలే అని భావించి, అందరి పట్లా దైవీ భావన కలిగి ఉంటారు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।

పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారని పరిగణించబడిన వారు కూడా, ఈ ప్రాపంచిక భవసాగరాన్ని, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి, దాటిపోవచ్చు.

భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది. దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు, మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల కష్టాలకు గురి చేస్తుంది.

ఆది ఆత్మిక అంటే, తన శరీరం, మనస్సూ  పెట్టే బాధలు; 
ఆది భౌతిక అంటే, ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; 
ఆది దైవిక అంటే, వాతావరణ, మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు.

ఈ యొక్క భౌతికబద్ధ స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు. ఈ బాధలు భరిస్తూ, అనంత జన్మలు గడిచిపోతుంటాయి. ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం, ఈ భౌతిక భవ సాగరాన్ని దాటడానికి, ఒక పడవనిస్తుంది. అవివేకులు కర్మలు చేసి, వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా, జ్ఞానులు ముక్తిని సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి, సహకరిస్తుంది.

ఇక మన తదుపరి వీడియోలో, అలౌకిక జ్ఞానంతో, శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

29 December, 2021

ఆత్మ సమర్పణ..! Bhagavadgita

 

ఆత్మ సమర్పణ..!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fbmO2fBQxpI ]

శ్రీ కృష్ణుడు వివ‌రించిన‌ వివిధ రకాల యజ్ఞాల వివరణ..

దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ।। 25 ।।

కొంతమంది యోగులు, భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ, దేవతలను పూజిస్తారు. మరికొంతమంది, పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ, సంపూర్ణంగా ఆరాధిస్తారు.

యజ్ఞ ప్రక్రియ అనేది, భగవత్ దృక్పథంలో, భగవంతునికి నివేదనగా చేయాలి. కానీ, కొంతమంది యజ్ఞాన్ని భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు. జ్ఞానం లేనివారు, భౌతిక ప్రయోజనాల కోసం, దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు.

యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన కొంతమంది, వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ-సమర్పణ, లేదా ఆత్మాహుతి, లేదా తమ ఆత్మను భగవదర్పితం చేయటం, అంటారు.

శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।

మరికొందరు, శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను, ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు, శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను, ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.

అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని, అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో, అగ్ని అనేది, సంకేతాత్మకమైనది. ఆత్మ- నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, రెండు పూర్తి విరుద్ధమైన మార్గాలున్నాయి. మొదటిది, ఇంద్రియములను తిరస్కరించటం. ఈ పద్ధతిని, హఠ యోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర పోషణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలనూ, ఆపివేస్తారు. సంకల్ప బలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి , అంతర్ముఖంగా ఉంచుతారు. దీనికి వ్యతిరేకమైనది, భక్తి యోగాభ్యాసం. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి, వాడతారు.

సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ।। 27 ।।

కొందరు, జ్ఞానముచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ, మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో, సమర్పిస్తారు.

హఠ యోగులు, ఇంద్రియములను సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు, ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకవంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా, సాధిస్తారు. ఈ ప్రపంచం యొక్క మిథ్యా స్వభావం, ఈ శరీరమూ, మనస్సూ, బుద్ధీ, అహంకారం కన్నా వేరైన అస్థిత్వమని, తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమయి ఉంటారు. ఇంద్రియములు, బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడతాయి. మనస్సు, ఆత్మ యందు ధ్యానంలోనే, నిమగ్నం చేయబడుతుంది. ఆత్మ మరియు పరమాత్మ, అబేధమనే ప్రతిపాదనలో, ఆత్మ-జ్ఞానం యందే స్థితులై ఉండటమే, వారి లక్ష్యం. జ్ఞాన యోగ మార్గం చాలా కష్టమైనది. దీనికి చాలా నిష్ఠ, మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం.

ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।

కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ, వేద శాస్త్రాలని చదువుతూ, జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.

మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తిలో, ఆశయాలలో మరియు సంస్కారాలలో, వేరువేరుగా ఉంటారు. యజ్ఞములనేవి, కొన్ని వందల రకాలుగా ఉంటాయి. అవి భగవంతునికి అర్పించినప్పుడు, అంతఃకరణ శుద్ధికీ, ఆత్మోద్ధరణకీ ఉపయోగపడతాయి.

ద్రవ్య యజ్ఞం: కొందరు ధనం సంపాదించి, దానిని ధర్మ కార్యాల కోసం దానం చేయటం వైపు, మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో, భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు.

యోగ యజ్ఞం: భారత తత్త్వశాస్త్రములో, యోగ దర్శనమనేది, ఆరు తత్వ సిద్ధాంతాలలో ఒకటి. ఆధ్యాత్మిక పురోగతి కోసం, శరీర ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకూ, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై, దీనిని ఒక యజ్ఞం లాగా ఆచరిస్తారు.

జ్ఞాన యజ్ఞం: కొంతమంది మనుష్యులు, జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ, జ్ఞానాన్నీ మరియు భగవంతునిపై ప్రేమనీ పెంపొందించుకుంటారు.

అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।

అపరే నియతేహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।

మరికొందరు, లోనికి వచ్చే శ్వాస యందు, బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు, బయటకు వెళ్ళే శ్వాస యందు, లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ, లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. ఇటువంటి యజ్ఞం తెలిసినవారంతా, ఇటువంటి పరిక్రియల ద్వారా, తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు.

కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు. ప్రాణాయామం అంటే, "శ్వాస యొక్క నియంత్రణ" అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో, పూరకము అంటే, శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకునే ప్రక్రియ, రేచకము అంటే, ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ, అంతర కుంభకము అంటే, గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. ఈ సమయంలో, లోనికి వెళ్ళే శ్వాసలో బయటకు వచ్చే శ్వాస, తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

బాహ్య కుంభకము -- ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. ఈ సమయంలో, బయటకు వెళ్ళే శ్వాసలో, లోనికి వచ్చే శ్వాస తాత్కాలికంగా నిరోధించబడుతుంది.

ఈ రెండు కుంభకములూ క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి, బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణలోనే, వీటిని అభ్యాసం చేయాలి. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికీ, మనస్సుని కేంద్రీకరించటానికీ, ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని, యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.

ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

23 December, 2021

భగవద్గీత - Bhagavadgita

 

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా ।
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా ।।

శ్లోకం అర్ధం:
భగవద్గీతను కొంచమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు (దీనర్థము చావు అంటే భయం పోతుందని).

[ భగవద్గీత వీడియోలు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b ]

భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై, మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ, భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం, మనిషిలో అజ్ఞానం దూరం చేసి, స్థిత ప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మల జలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు, జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం, మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?

అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ, అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై, మృత్యు భయం వీడి తరిస్తుంది.

21 December, 2021

పాపములు అంటకుండా, మనస్సూ ఇంద్రియముల నియంత్రణ.. శ్రీ కృష్ణుడు! Bhagavadgita

  

పాపములు అంటకుండా, మనస్సూ ఇంద్రియముల నియంత్రణ.. శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/t0kxt0sga2k ]

పాపములు అంటకుండా, మనస్సునూ, ఇంద్రియములనూ ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 19 ।।

ఎవరి యొక్క సమస్త కర్మలూ, భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో, మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో, అట్టివారు జ్ఞానోదయమైన మునులచే, పండితులనబడతారు.

జీవాత్మ అనేది, ఆనంద సముద్రమయిన భగవంతుని యొక్క అణు-అంశ కాబట్టి, సహజంగానే తనుకూడా, ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ, భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ, తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో, భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి, కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు, మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి, జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి.

కానీ, జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, తాను కోరుకునే ఆనందం, ఇంద్రియ వస్తు-విషయముల ద్వారా లభించదనీ, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందనీ, తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమునూ, భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. "నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, దానిని భ‌గ‌వంతునికి అర్పిత‌ముగా చేయాలి. జ్ఞానోదయం క‌లిగిన‌ జీవాత్మ, భౌతిక సుఖాల కోసం ప్రాకులాడకుండా, స్వార్థంతో కూడిన పనులను త్యజించి, అన్ని కర్మలనూ భగవంతుడికే అంకితం చేస్తుంది. ఆ విధంగా చేసిన‌ పనులు, ఎలాంటి కర్మ బంధనాలనూ కలుగచేయవు. ఆ కర్మలు, ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి, భస్మమై పోతాయి.

త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ।। 20 ।।

ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై గ‌ల మ‌మ‌కారాన్ని త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. ఇత‌ర‌ బాహ్య వస్తు-విషయములపై ఆధార పడరు. అటువంటి వారు, కర్మలలో నిమగ్నమయి ఉన్నా, వారు ఏమీ చేయనట్టే.

బాహ్యంగా కనిపించే విష‌యాలను బ‌ట్టి, క‌ర్మల‌ను నిర్ణయించ‌లేము. మనస్సు యొక్క స్థితి, దానిని కర్మా లేక‌ ఆకర్మా అని నిర్ణయిస్తుంది. జ్ఞానుల యొక్క మనస్సు ఎప్పుడూ, భగవత్ ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది. భగవంతుడిపై సంపూర్ణ భ‌క్తి గ‌ల‌ వారు, బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారు చేసే పనుల‌న్నీ, అకర్మగా పరిగణించబడతాయి.

నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 21 ।।

ఆశారహితుడై ఉండి, నాది అన్న భావన లేకుండా, మనస్సు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవారు, శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా, అటువంటి వారికి ఏ పాపమూ అంటదు.

భగవత్ స్పృహలో ఉండి పనులు చేసే సాధువులు, అన్ని పాపాల నుండీ విముక్తి చేయబడతారు. ఎందుకంటే, వారి మనస్సు మమకార రహితంగా, మరియు 'ఇది నాది' అన్న భావన లేకుండా ఉంటుంది, మరియు వారి యొక్క ప్రతి చర్యా, భగవత్ ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది. అటువంటి వారికి, మనస్సు యొక్క ఉద్దేశము అనేది ప్రధానం కానీ, కర్మ కాదు.

యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబద్ధ్యతే ।। 22 ।।

అప్రయత్నముగా లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వందములకు, అంటే, సుఖ-దుఃఖాలూ, లాభ-నష్టాలూ వంటి వాటికి అతీతులై ఉంటారు. అన్ని ర‌కాల‌ పనులూ చేస్తూనే ఉన్నా, గెలుపు ఓటములలో సమత్వ బుద్ధితో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.

ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు. పగలు, రాత్రి; తీపి-చేదు; వేడి-చల్లదనం; వాన-కరవు మొదలగునవి. గులాబీ మొక్కకు అందమైన పువ్వూ, వికృతమైన ముల్లుంటుంది. జీవితం కూడా అలానే, తన వంతు ద్వంద్వములను తెస్తుంది - సుఖము, దుఃఖమూ; గెలుపు, ఓటమీ; కీర్తి, అపకీర్తి వంటివి. ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి, అన్ని పరిస్థితులనూ సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో జీవించాలి. ఫలితాలపై ఆశ లేకుండా, మన కర్తవ్యాన్ని చేస్తూ పోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.

గతసంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః ।
యజ్ఞా యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।। 23 ।।

అటువంటి వారు, ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు, మరియు వారి బుద్ధి, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పనీ, భగవత్ అర్పితంగా ఉంటుంది. కాబట్టి, వారు అన్ని రకాల కర్మల ప్రతిచర్య నుండీ, విముక్తి చేయబడతారు.

సమస్త కర్మలనూ భగవత్ అర్పితము చేయ‌డ‌మంటే, ఆత్మశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకోవ‌డం. నిజానికి జీవాత్మ స్వ-స్వభావంగా భగవంతుని దాసుడు. ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు, తమ సమస్త కర్మలనూ ఆయనకు అర్పితముగా చేస్తారు. అలా వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి, విముక్తి చేయబడతారు.

బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।

సంపూర్ణ భగవత్ ధ్యాసలోనే ఉన్న వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము వంటివి బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదానిని కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు, భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.

నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ, భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. కానీ రెండూ వేర్వేరు. అగ్నికి బాహ్యంగా ఉండేవి వెలుగు. దీనిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. అలాగే, శక్తి అనేది, శక్తివంతుని కన్నా వేరైనది. కానీ, అది ఆయనలో భాగమే. శ్రీ కృష్ణుడు శక్తిమానుడు, ఆత్మ అతని శక్తి.  ఆత్మ అనేది భగవంతుని నుండి వేరైనది కాదు. కానీ, భగవంతుని కన్నా బేధ‌మే. కాబట్టి, భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తునంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అబేధమైనదిగా చూస్తారు.

ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు వివ‌రించిన‌ వివిధ రకాల యజ్ఞాల ప్రాముఖ్యత  గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

15 December, 2021

కర్మ బంధాల్లో చిక్కుకోకూడదంటే.. శ్రీ కృష్ణుడు! Bhagavadgita

 

కర్మ బంధాల్లో చిక్కుకోకూడదంటే.. శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (13 - 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 13 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఏం చేయాలో శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/S1NFp3tN_l8 ]

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ।। 13 ।।

జనుల గుణములూ, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చే సృష్టింపబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా, నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.

వేదములు జనులను, నాలుగు రకాల వృత్తుల వారీగా విభజించాయి. ఇవి కేవలం వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ, వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం, ప్రతి సమాజంలోనూ ఉంటుంది. వైదిక శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం, భౌతిక శక్తి, మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది. అవి, సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారు స్వాభావికంగా, చదువు చెప్పటం మరియు పూజాది కార్యక్రమాలు చేయడంపై, ఆసక్తి కలిగి ఉంటారు. క్షత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, కొంచెం సత్వ గుణం మిళితమై ఉంటారు. వీరు పరిపాలన మరియు యాజమాన్యం వైపు మొగ్గు చూపుతారు. వైశ్యులు, రజో గుణమూ మరియు కొంత తమో గుణమూ మిళితమై ఉంటారు. కాబట్టి, వారు వ్యాపారమూ మరియు వ్యవసాయమూ ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు.. వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది, జన్మతహా వచ్చినవీ కావు, మార్చలేనివీ కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది, జనుల స్వభావమూ మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది, అని శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన దీనికి అకర్త. భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు. కానీ, ఆ శక్తితో ఏం చేయాలనే విషయంపై, పూర్తి స్వేచ్ఛ మనకు మాత్రమే ఉంది. కాబట్టి, మన చర్యలకు భగవంతుడు కారణం కాదు.

న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ।। 14 ।।

కర్మలు నన్ను అంటవు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో, వారు కర్మ బంధములలో చిక్కుకోరు.

మనం అగ్నిలో అపవిత్రమైన పదార్థములు సమర్పించినా, అది తన స్వచ్ఛతను కోల్పోదు. అగ్ని స్వచ్ఛమైనది, అందులో మనం ఏది వేసినా, అది కూడా శుద్ధమైపోతుంది. అలాగే, ఎన్నో మురికి కాలువలు పవిత్రమైన గంగా నదిలో కలుస్తుంటాయి. అంతమాత్రాన అది మురికి కాలువ కాదు. పవిత్రమైన గంగా నది, ఆ మురికి కాలువలన్నింటినీ పవిత్రంగా మార్చివేస్తుంది. అదే విధంగా, భగవంతుడు కూడా, తాను చేసే కర్మల వలన కళంకితుడు కాడు. చేసే పనుల వలన వచ్చే ఫలములను, తన భోగం కోసం చేస్తే, ఆ కర్మలు మనలను కర్మబంధములతో పెనవేస్తాయి. కానీ, భగవంతుని చర్యలు, స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు. ఆయన చేసే ప్రతి చర్యా, జీవులపై కరుణతో చేసేవే. కాబట్టి, ఆయనకు కర్మ బంధములు అంటవు.

ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ ।। 15 ।।

ఈ సత్యమును తెలుసుకుని, ప్రాచీన సమయంలో మోక్షము పొందగోరిన వారు కూడా, తమ కర్మలను ఆచరించారు. కాబట్టి, ప్రాచీన మునుల అడుగుజాడలలో నడుస్తూ, నీవు కూడా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.

భగవత్ ప్రాప్తి కోసం ఆశించే మునులకు, భౌతిక లబ్దిపై ఆసక్తి ఉండదు. వారు ఈ ప్రపంచంలో చేసే కర్మలు, భగవత్ సేవ కోసం, ఆయన ప్రీతి కోసం. వారు భక్తితో చేసే సంక్షేమ కార్యాల యొక్క కర్మ బంధనాలు, వారికి అంటవు. స్వార్ధ ప్రయోజనం ఏ మాత్రమూ లేని యోగులూ, మునులు కూడా, భగవత్ ప్రీతి కొరకు కర్మలను ఆచరిస్తూ ఉంటారు. భక్తితో పని చేయటం కూడా, భగవత్ కృపకి పాత్రులవడానికి దోహద పడుతుంది. అందుకే, అర్జునుడిని కూడా, తన కర్మలను చేయమంటున్నాడు శ్రీ కృష్ణుడు.

కిం కర్మ కిమకర్మేతి కవయోఽప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 16 ।।

కర్మ అంటే ఏమిటి? అకర్మ అంటే ఏమిటి? అని, వివేకవంతులు కూడా దీనిని అర్థం చేసుకోవడంలో, తికమకపడుతున్నారు. ఇప్పుడు నేను నీకు కర్మ రహస్యం వివరిస్తాను. దీనిని తెలుసుకోవటం ద్వారా, నిన్ను నీవు భౌతిక బంధముల నుండి విడిపించుకోవచ్చు.

చేయదగిన పని ఏమిటి? చేయకూడని పని ఏమిటి? అనే విషయాన్ని నిర్ణయించుకోవటం, గొప్ప ఋషులకూ, దేవతలకు కూడా చాలా క్లిష్టమైన విషయం. ధర్మము స్వయంగా, భగవంతునిచే సృష్టించబడింది, మరియు ఆయన మాత్రమే దానిని యదార్ధముగా ఎఱుగగలడు. శ్రీ కృష్ణుడు అర్జునునికి వివరించే గోప్యమైన కర్మ, అకర్మల విజ్ఞానంతో, అర్జునుడు భౌతిక బంధములనుండి తనను తాను విడిపించుకోవచ్చు.

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ।। 17 ।।

కర్మ, వికర్మ, అకర్మ - నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యదార్థం, నిగూఢమైనది, మరియు అర్థం చేసుకోవటానికి క్లిష్టమైనది.

పని అనేది, మూడు రకాలుగా వర్గీకరించబడింది. కర్మ, వికర్మ మరియు అకర్మ.

కర్మ: ఇంద్రియ నియంత్రణ, మరియు చిత్త శుద్ధికి దోహదపడే విధంగా ఉండే శాస్త్ర విహితమయిన మంగళప్రద పనులు.

వికర్మ: శాస్త్రములచే నిషేధింపబడిన ఆశుభకరమైన పనులు. ఇవి హాని కారకమైనవి, మరియు ఆత్మ అధఃపతనానికి దారితీసేవి.

అకర్మ: ఫలాసక్తి లేకుండా, కేవలం భగవంతుని ప్రీతి కోసం మాత్రమే చేసే పనులు. వీటికి కర్మ, ప్రతిక్రియలూ ఉండవు. ఇవి జీవాత్మను బంధించవు.

కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః ।
స బుద్ధిమాన్మనుశ్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ ।। 18 ।।

ఎవరైతే అకర్మ యందు కర్మనూ, మరియు కర్మ యందు అకర్మనూ దర్శించుదురో, వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలనూ చేస్తూనేవున్నా, యోగులుగా పిలువబడతారు.

అకర్మలో కర్మ: ఒక రకమైన అకర్మ పద్ధతిలో, జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలిచి, వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలి పెట్టినా, వారి మనస్సు, ఇంద్రియ వస్తు-విషయములపైనే చింతిస్తూ ఉంటుంది. అటువంటి మనుష్యులు ఏమీ చేయనట్లు కనపడినా, నిజానికి వారి సోమరితనమే, పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయనన్నప్పుడు, అది పాపమని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

కర్మలో అకర్మ: కర్మ యోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా, కర్మ ఫలములను భగవంతునికే అంకితం చేస్తూ, పని చేస్తారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, వారు కర్మ బంధాలలో చిక్కుకోరు. ఎందుకంటే, వారు తమ భోగం కోసం ఆశించరు. భారత చరిత్రలో ఏంతో మంది మహారాజులు - ధ్రువుడూ, ప్రహ్లాదుడూ, యుధిష్టురుడూ, పృథువూ, అంబరీషుడూ తమ రాజ ధర్మాలను తమ శక్త్యానుసారం నిర్వర్తించారు. అదే సమయంలో, భౌతిక వాంఛల యందు వారి మనస్సు లేదు కాబట్టి, వారి పనులు అకర్మగా పరిగణించబడతాయి.

ఇక మన తదుపరి వీడియోలో, ఏ పాపమూ అంటకుండా, మనస్సూ, ఇంద్రియములనూ ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!