Ads

Showing posts with label భగవద్గీత. Show all posts
Showing posts with label భగవద్గీత. Show all posts

20 October, 2022

దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita


దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 33 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bPRR1Z8dsUs ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:42 - అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।

అక్షరములలో అ-కారమునూ, సమాసములలో ద్వంద్వ సమాసమునూ, అపరిమితమైన కాలమునూ, మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే.

సంస్కృతములో అన్ని అక్షరములు కూడా, సగం అక్షరాన్ని, "అ" కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. కాబట్టి, అ-కారము అనేది, సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యతగలది. "అ" అనేది, అక్షరమాలలో మొదటి అచ్చు. అంతేకాక, అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి, "అ" అనేది మొట్టమొదటే వచ్చే అక్షరం. సంస్కృతమనేది చాలా ప్రాచీనమైన భాషే అయినా, అది అత్యంత నాగరికమైనది, మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో, రెండు కానీ, అంతకంటే ఎక్కువ కానీ పదాలు, వాటి చివరలు కోల్పోతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ 2) బహువ్రీహి ౩) కర్మ ధారయ 4) తత్పురుష 5) ద్విగు 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది. ఎందుకంటే, రెండు పదాలకీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలు కలిపితే, మూడవ పదానికి అర్థం ఇస్తుంది. సృష్టి అనేది అత్యత్భుతమైనది, మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా, సృష్టితో పోల్చితే, అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తునూ తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరు సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడని, శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.

02:38 - మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।

సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా, నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తినీ, సిరిసంపదనూ, చక్కటి వాక్కునూ, జ్ఞానశక్తినీ, మేధస్సూ, ధైర్యము మరియు క్షమాగుణమును. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవమూ తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది. అందుకే, “dead end” అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా, వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడతాయి, మరికొన్ని గుణములు, పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడతాయి. నిజానికైతే, అసలు ఈ రెండు రకాల గుణములూ కలిగి ఉండటమే, సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమనే లక్షణములు, స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఇందులో మొదటి మూడు గుణములూ, బాహ్యంగా వ్యక్తమవుతాయి. అలాగే, తరువాతి నాలుగూ, ఆంతరంగముగా వ్యక్తమవుతాయి. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి, ఇరవై నాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. వారు కీర్తి, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ. శ్రీ అనే ఆమె, భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె, బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా, ఈ ఏడుగురు స్త్రీలూ, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.

04:41 - బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।

సామ వేద మంత్రములలో నేనే బృహత్సామమని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాగములో మార్గశీర్ష మాసమునూ, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువునూ నేనే.

ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు సామవేదములో తానే, శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును, అని అంటున్నాడు. సాధారణంగా దీనిని, మధ్యరాత్రి సమయంలో పాడతారు. సంస్కృత భాష, ఇతర భాషలలో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస, మరియు ఛందస్సూ కలిగి ఉంది. వేదాలలోని శ్లోకాలు, ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు, చాలా ఆకర్షణీయమయినది, మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము, గాయత్రీమంత్రము. మార్గశీర్షమనేది, హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో, ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు, లేదా మరీ అంత చల్లగానూ ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది జనులకు చాలా ఇష్టమైన నెల. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు. ప్రకృతి ఆహ్లాదకరంగా, తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వంసత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు, భగవంతుని యొక్క విభూతిని చక్కగా వ్యక్తీకరిస్తుంది.

06:29 - ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।

మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమునూ, ధర్మపరాయణులలో సద్గుణమునూ నేనే.

శ్రీ కృష్ణుడు, సద్గుణాలే కాక, దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదమనేది, ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు. అది కుటుంబాలనూ, వ్యాపారాలనూ, జీవితాలనూ నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్టురుడి బలహీనతే, మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే, అది హానికరం కాదా? మరి అది ఎందుకు నిషేధించబడింది - అంటే, దానికి సమాధానం, భగవంతుడు తన శక్తిని జీవాత్మకు ప్రసాదిస్తాడు. దానితో పాటుగా, నచ్చిన పనిని చేయటానికీ, ఎంచుకోవటానికీ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. మనం ఆయనను మరచిపోవటం ఎంచుకుంటే, మరచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని, ఇంటిని వెచ్చబరచటానికీ, లేదా చల్లబరచటానికీ, రెంటికీ వాడుకోవచ్చు. ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో, వినియోగదారుడి ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా, లేదా దుర్వినియోగం చేసినా సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలూ, సామర్ధ్యమూ ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకను దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికీ విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు, దృఢ సంకల్పమనే గుణానికి, ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా, భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలూ, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు ధృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవని గమనించాలి.

08:40 - వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని, మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడనని తెలుసుకొనుము, మరియు, గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.

శ్రీ కృష్ణ భగవానుడు, భూ-లోకంలో వృష్ణి వంశములో, వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మ అయినా, భగవంతుడి కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే, పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులైన యుధిష్టిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు, సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు, మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించినవాడు. వేద వ్యాసుడు, మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు "బాదరాయణుడు", మరియు "కృష్ణ ద్వైపాయనుడు" అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేశాడు, మరియు ఎన్నో పురాణాలను, మానవుల సంక్షేమం కోసం వ్రాశాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే.. అలాగే, శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో ఒకడిగా, వేద వ్యాసుడు పేర్కొనబడ్డాడు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని. నీతి, ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో, ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులను తన శిష్యులుగా చేసుకుని, వారి పురోగతికై దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రావీణ్యం వలన, ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.

10:22 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

05 October, 2022

అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavad Gita

  

అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 27 నుండి 32 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bs3KpJUcTQA ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:43 - ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ।। 27 ।।

గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైఃశ్రవసమును. గజేంద్రములలో నేను ఐరావతమును, మరియు మనుష్యులలో రాజును.

తన వైభవాన్నీ, మహిమనూ తెలియపరచటానికి, ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసమనేది, దేవలోకాల్లో ఉన్న అత్యంత శ్రేష్ఠమైన రెక్కల గుఱ్ఱము. అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది, మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. ఉచ్చైఃశ్రవసము, సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము, ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని ఏనుగు. దానినే, అర్ధ-మాతాంగము అని కూడా అంటారు. అంటే, "మేఘాలలో ఉండే ఏనుగు" అని అర్థం. ఐరావతం, గజములన్నింటిలో అత్యుత్తమమైనది.

01:47 - ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।

ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో, కామదేవుడైన మన్మథుడను,  సర్పములలో వాసుకిని నేను.

వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి, దధీచి మహాముని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధంతోనే, వృత్తాసురుడిని సంహరించాడు. సమస్త లోకాలలో కెల్లా, అన్ని ఆయుధాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం, వజ్రాయుధం. తన దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రమూ, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు సూచికగా ఉదహరిస్తున్నాడు, భగవానుడు. మైథున క్రియ అనేది, మంచి సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు, అది అపవిత్రమయినది కాదు. సంతానోత్పత్తి ద్వారా, మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి, మన్మధుడు కారణం. ఈ లైంగిక వాంఛకు మూలం, భగవంతుని యందే ఉంది. దీనిని ఇంద్రియ తృప్తి కోసం దుర్వినియోగం చేయకూడదు. కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి.

03:04 - అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। 29 ।।

నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో, నేను యమధర్మరాజును.

అనంతుడు అంటే, ఆది శేషుడు. ఇది విష్ణుమూర్తి శయనించే నాగుపాము. ఆయనకు పదివేల పడగలున్నాయి. ఆయన ప్రతియొక్క తలతో, భగవంతుని మహిమలను, సృష్టి ప్రారంభం నుండి గానం చేస్తూనే ఉన్నాడు. వరుణుడు అంటే, సముద్ర దేవత. అర్యముడు అంటే, అదితి యొక్క మూడవ పుత్రుడు. ఆయనను పితృగణముల నాయకునిగా పూజిస్తారు. యముడు అంటే, మృత్యు దేవత. ఈ జన్మలో ఆత్మ చేసిన వాటికి అనుగుణంగా, వచ్చే జన్మలో శిక్షలను, లేదా ఉత్తమగతులను, భగవంతుని తరపున అందిస్తాడు. అవి ఎంత భయంకరముగా, బాధాకరముగా ఉన్నా, తన ధర్మం నుండి కొద్దిగా కూడా తప్పడు. సంపూర్ణ దోషరహిత న్యాయమును అందించే వానిగా, ఆయన భగవంతుని యొక్క మహిమను ప్రకటిస్తున్నాడు.

04:13 - ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ।। 30 ।।

దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడనని తెలుసుకొనుము.

మహాశక్తి శాలి అయిన రాక్షస రాజు హిరణ్యకశిపుడి పుత్రుడిగా, ప్రహ్లాదుడు జన్మించాడు. కానీ, అతను అతి గొప్ప విష్ణు భక్తులలో ఒకనిగా అయ్యాడు. అందుకే, రాక్షసులలో ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విభూతిని ప్రకటిస్తున్నాడు. కాలమనేది, విశ్వములోని అత్యంత బలమైన, గొప్ప అస్థిత్వాలను కూడా లోబరుచుకుంటుంది. గంభీరమైన సింహము, అడవికి రారాజు, మరియు జంతువులలో భగవంతుని యొక్క శక్తి, సింహములో వ్యక్తమవుతుంటుంది. విష్ణు మూర్తి యొక్క దివ్య వాహనమైన గరుత్మంతుడు, పక్షులలో కెల్లా గొప్ప వాడు.

05:11 - పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।।

పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.

ప్రకృతిలో ఉన్న వాయువు, పవిత్రమొనర్చే పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది మలినమైన నీటిని నీటి ఆవిరిగా చేస్తుంది; భూమిపై ఉండే ఏదేనీ దుర్గంధమును తీసుకువెళ్ళిపోతుంది; ప్రాణవాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి, అగ్నిని మండేట్టుగా చేస్తుంది. ఈ విధంగా అది ప్రకృతిలో ఒక గొప్ప పవిత్రమొనర్చే పదార్ధము. శ్రీ రామచంద్రప్రభువు, భూమిపై అత్యంత శక్తివంతులైన యోధులలో ఒకడు. ఆయన విల్లు అత్యంత ప్రాణాంతకాయుధము. అయినా, ఆయన ఒక్కసారి కూడా తను శాసించే ఉన్నత స్థాయిని దుర్వినియోగం చేయలేదు. తను ఆయుధం ఉపయోగించింది, మంచి కోసం మాత్రమే. అందుకే ఆయన శస్త్రధారులలో సర్వోన్నతుడు. రాముడు భగవంతుని అవతారము కూడా. అందుకే శ్రీ కృష్ణుడు, ఆయనను తనుగా సూచిస్తున్నాడు. భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగా నది, ఒక పవిత్రమైన నది. అది స్వర్గ లోకముల నుండి భూమి పైకి దిగినది. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, ఆ నది యొక్క ఒడ్డున తపస్సునాచరిస్తుంటారు. సాధారణ నీటి లాగా కాకుండా, గంగా నది యొక్క నీళ్ళను ఒక బిందెలో పట్టి ఉంచితే, అది ఎన్ని సంవత్సరాలయినా పాడు కాదు. పూర్వ కాలంలో ఇది ఎంతో ప్రస్ఫుటంగా, గమనించదగినట్లుగా ఉండేది. కానీ, ఇప్పటి కాలంలో, కోట్ల లీటర్ల కాలుష్యకారకాలను గంగలో కలిపేయటం వలన, ఈ ప్రభావం కొంచం తగ్గింది. కానీ, ఎన్ని యుగాలు మారినా, గంగ తన స్వచ్ఛతను కొల్పోలేదు.

07:02 - సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికీ ఆది, మధ్య మరియు అంతమని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను, మరియు సంవాదములలో తర్కబద్ద నిర్ణయమును నేనే.

సృష్టి చేయబడిన ఆకాశమూ, గాలీ, అగ్నీ, నీరు మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్తగా ఆది, స్థితికర్తగా మధ్యమ, మరియు లయకర్తగా అంతమును. కాబట్టి, సృష్టి, స్థితి మరియు లయ ప్రక్రియలను, భగవంతుని విభూతిగా పేర్కొనవచ్చు. విద్య అనేది, ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రధానమైనవి పద్నాలుగు: "శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, చ్చందస్సు - ఈ ఆరూ వేదాంగములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగూ వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములూ కలిపి, మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు." ఈ విద్యలు అధ్యయనం చేయటం వలన, బుద్ధి పెంపొందించబడి, జ్ఞానం వృద్ధి చేంది, ధర్మ మార్గ అవగాహన ఏర్పడుతుంది. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, మనుష్యులను భౌతిక, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేసి, వారికి అమరత్వమును ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం, శ్రీ మద్భాగవతం లో కూడా చెప్పబడింది: "సా విద్యా తన్మతిర్యయా" అంటే, భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే, అత్యుత్తమ విద్య అని క్షుణ్ణంగా వివరించబడి ఉంది. వాదోపవాదములు, మరియు తర్కములో జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం, ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే, సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ, అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే, చర్చకు తర్కబద్ధమైన ముగింపును ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికీ, సత్యమును స్థిరపరచటానికీ, తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికీ, మరియు ఉపదేశించటానికీ, తర్కబద్ధమైన స్పృహయే, మూలాధారం. విశ్వవ్యాప్తమైన తర్కబద్ధ సూత్రములే, భగవంతుని శక్తికి నిదర్శనం.

09:39 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

14 September, 2022

జ్ఞాన దీపం! భగవద్గీత Enlightenment - Bhagavad Gita


జ్ఞాన దీపం! భగవంతుడిని మనం ఎందుకు చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (11 – 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tm0zK9cT8kk ]

అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

00:49 - తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థొ జ్ఞానదీపేన భాస్వతా ।। 11 ।।

వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.

అజ్ఞానమనేదానిని మనం చీకటితో పోల్చుతుంటాము. కానీ, భగవంతుడు ఉదహరించే ఈ జ్ఞాన దీపము వేరు. ప్రస్తుతం మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, అన్నీ కూడా ప్రాకృతికమైనవే.. కానీ భగవంతుడు దివ్యమైనవాడు. కాబట్టి, మనం ఆయనను చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము, లేదా ఆయనతో ఏకమవ్వలేకున్నాము. భగవంతుడు తన కృపను ప్రసాదించినప్పుడు, తన దివ్యమైన యోగమాయా శక్తిని, ఆ జీవాత్మపై కరుణిస్తాడు. దానినే, శుద్ధ సత్త్వమని అంటారు. ఇది మాయా సత్త్వ గుణము కంటే వేరైనది. మనకు ఆ శుద్ధ సత్త్వ గుణ శక్తి లభించినప్పుడు, మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, దివ్యమైనవిగా అయిపోతాయి. దీనినే సరళంగా చెప్పాలంటే, ఆయన కృప చేత, భగవంతుడు తన దివ్యమైన ఇంద్రియములనూ, దివ్య మనస్సునూ, మరియు దివ్య బుద్ధినీ, ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు. ఈ దివ్య ఉపకరణాలను కలిగి ఉన్న పిదప, ఆ జీవాత్మ భగవంతుడిని చూడగలుగుతుందీ, భగవంతుడిని వినగలుగుతుందీ, మరియు భగవంతునితో ఏకమవ్వగలుగుతుంది. కాబట్టి, వేదాంత దర్శనం పేర్కొన్నట్టు, భగవంతుని కృప ద్వారానే, ఎవరికైనా దివ్య జ్ఞానము కలుగుతుంది. శ్రీ కృష్ణుడి యొక్క దివ్య శక్తి యే, ఆ జ్ఞాన దీపము. భగవంతుని దివ్య శక్తి యొక్క కాంతిచే, భౌతిక శక్తి యొక్క చీకటి పటాపంచలై పోతుంది.

02:30 - అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ ।। 12 ।।

02:49 - ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన, పవిత్రమొనర్చే వాడవూ, నిత్య సనాతన భగవంతుడవూ, ఆది పురుషుడవూ, జన్మ రహితుడవూ, మరియు అత్యున్నతమైన వాడవూ. మహర్షులైన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, మరియు వ్యాసుడి వంటివారు, ఇది చాటిచెప్పారు. ఇప్పుడు స్వయముగా, నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

భగవంతుడి మాటలను విన్న తరువాత, అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయిపై, సంపూర్ణ నమ్మకం కలిగింది. మరియు, తనలో ఇప్పుడు కలిగిన ధృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెబుతారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే, అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడూ, అసితుడూ, దేవలుడూ మరియు వ్యాసుడి వంటి వారు, శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు, మరియు సర్వ కారణ కారకుడని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో, ఒక పద్యంలో ఎంతో మంది, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. "శ్రీ కృష్ణుడే సర్వ జగత్తులకూ సృష్టికర్త, మరియు అందరి మదిలోని భావాలనూ ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరు దేవతలకూ ప్రభువ"ని, నారదుడు స్తుతించాడు. "శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం, మరియు నియమనిష్ఠల సారం. ఆయనే, సమస్తమునకూ భూత, వర్తమాన, భవిష్యత్తు" అని, మార్కండేయ మహర్షి వివరించాడు. "ఆయన దేవ దేవుడు, మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపమ"ని, భృగు మహర్షి పేర్కోన్నాడు. "ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువువు, నీవే ఇంద్రుడికీ, మరియు ఇతర దేవతలకూ శక్తిని ప్రసాదించావు" అని వేద వ్యాసుడు వెల్లడించాడు. ఇంకా ఎందరో మహర్షులు, కృష్ణ భగవానుడిని స్తుతించారు. ఆ మహోన్నతమైన, ప్రామాణికమైన మహాత్ములను ఊటంకిస్తూ అర్జునుడూ, ఇప్పుడు శ్రీ కృష్ణుడే, సర్వ కారణ కారకుడనని చెప్పటం ద్వారా, స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు.

05:14 - సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ।। 14 ।।

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యధార్థ స్వరూపమును తెలుసుకోలేరు.

శ్రీ కృష్ణుడి దివ్య వైభవమునూ, మరియు అనంతమైన ఔన్నత్యమునూ, క్లుప్తముగా, శ్రద్ధతో విన్న పిదప, అర్జునుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీ కృష్ణుడు ఇంకా తన వైభవములు చెప్పాలనీ, తనకు పూర్తి విశ్వాసం కలిగిందనీ, భగవంతునికి నమ్మిక కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు చెప్పినదంతా యధార్ధమనీ, ఎటువంటి ఊహాకల్పిత వివరణా కాదనీ వక్కాణిస్తున్నాడు, అర్జునుడు. ‘భగవాన్’ అంటే, శక్తీ, జ్ఞానమూ, సౌందర్యమూ, యశస్సూ, ఐశ్వర్యమూ, మరియు వైరాగ్యమనే ఈ ఆరు ఐశ్వర్యములనూ, అనంతమైన మాత్రంలో కలిగి ఉన్న వాడని అర్ధం. దేవతలూ, దానవులూ, మానవులూ, వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు సంపూర్ణ భగవత్ తత్త్వాన్ని తమంత తాము తెలుసుకోలేరు.

06:27 - స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ।। 15 ।।

ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయిన వాడా.. సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే! నిజానికి, నిన్ను నీవు మాత్రమే, నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.

శ్రీ కృష్ణుడు సర్వోత్కృుష్ట పరమ పురుషోత్తముడని వక్కాణిస్తూ, అర్జునుడు ఆయనను అలా సంబోధిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది. "భగవంతుడిని ఎన్నటికీ అధిగమించలేము; ఆయన అన్నింటికీ అతీతుడు." భగవంతుడు ఎవ్వరి చేతనూ తెలుసుకోబడలేడని, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడింది. ఇది స్పష్టంగా తర్కబద్ధమైనదే. సమస్త జీవులూ, పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. కానీ, భగవంతుడు అనంతమైనవాడు. కాబట్టి, ఆయన వారి బుద్ధి పరిధికి అతీతమైనవాడు. ఇది ఆయనను ఏమీ తక్కువ చేయదు సరికదా, ఆయనను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, తుదకు భగవంతుడేమిటో తెలిసినవాడొక్కడున్నాడు.. అతను స్వయానా భగవంతుడే. ఈ విధంగా, శ్రీ కృష్ణుడికి మాత్రమే, తానెవరో, తానేమిటో తెలుసు. ఒకవేళ తానే తన శక్తులను ఏదేని జీవాత్మకు ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ కూడా, ఆయనను తెలుసుకోగలుగుతుంది.

07:57 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఎలా స్మరిస్తూ ఉండాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

05 July, 2022

భగవద్గీత Bhagavadgita in Telugu - Ashtamodhyaya (Chapter 8, Verses 23 – 28)

‘ఆత్మ నిష్క్రమణ’కు రెండు మార్గాలు! ఏ మార్గం మోక్షానికీ, ఏది పునర్జన్మకూ దారి తీస్తుంది? - #భగవద్గీత అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (23 – 28 శ్లోకాలు)! | Srimad #Bhagavadgita in #Telugu Part 64 - Ashtamodhyaya (Chapter 8, Verses 23 – 28) - Bhakti shatkamu - Akshara Brahma Yoga | @maheedhar |


#భగవద్గీత #Bhagavadgita #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharPlanetLeaf #Hinduism #Maheedhar #ఆత్మనిష్క్రమణ #Mahabharatam #iskcon #krishna #lordkrishna #Bhagavadgeetha #learngita #AksharabrahmaYoga #chandamamakathalu #teluguaudiobook #telugukathalu #bhagavadgitakathalu

29 June, 2022

ప్రళయము – నాలుగు రకాలు! భగవద్గీత Bhagavad Gita

  

ప్రళయము – నాలుగు రకాలు! అలౌకికమైన మరియు సనాతనమైన అవ్యక్త అస్థిత్వం అంటే?

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (18 – 22 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 18 నుండి 22 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/P5npOaGsEJ0 ]

ఆయన యందే స్థితమై ఉన్న సర్వ ప్రాణులూ, సర్వ వ్యాప్తుడైన భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:50 - అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।

బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులూ అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి, మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ, తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి.

మహాద్భుతమైన విశ్వ క్రీడలో వివిధ లోకాలూ, వాటి యొక్క గ్రహ వ్యవస్థలూ, మళ్లీ మళ్లీ, సృష్టీ, స్థితీ, ప్రళయ చక్రానికి గురవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే, ఒక కల్పము యొక్క (432,00,00,000) నాలుగు వందల ముప్ఫై రెండు కోట్ల సంవత్సరములలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలూ నాశనం చెందుతాయి. దీనినే, నైమిత్తిక ప్రళయం, అంటే, పాక్షిక లయము అంటారు. ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు, ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థనీ, వాటి యందు జీవ రాశులనూ సృష్టించి, పడుకునే ముందు వాటన్నింటినీ లయం చేస్తాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వమూ లయం చేయబడుతుంది. ఈ సమయంలో, మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు, అహంకారములో విలీనమవుతాయి. అహంకారము, మహత్తు యందు విలీనమవుతుంది.. మహత్తు, ప్రకృతిలోనికి విలీనమవుతుంది. ప్రకృతి అనేది, భౌతిక శక్తి, మాయ యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమమైన రూపంలో, మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే, ప్రాకృతిక ప్రళయం, లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపును ప్రసరిస్తాడు. కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహత్తు వస్తుంది, మహత్తు నుండి అహంకారము వస్తుంది, అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడతాయి, పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడతాయి. ఈ ప్రకారంగా, అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడతాయి.

03:18 - భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ।। 19 ।।

బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే, సమస్త జీవ రాశులూ పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభమవగానే, అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే, అవన్నీ అప్రయత్న పూర్వకంగానే వ్యక్తమవుతాయి.

వేదములు నాలుగు రకాల ప్రళయములను పేర్కొన్నాయి.

నిత్య ప్రళయం: ప్రతి రోజూ మనం గాఢ నిద్రలోనికి జారిపోయినప్పుడు, మనలోని స్పృహ లయమైపోవటాన్ని, నిత్య ప్రళయం అంటారు.

నైమిత్తిక ప్రళయం: బ్రహ్మ యొక్క పగలు అయిపోయే సమయంలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని లోకాలూ లయమై పోయే ప్రక్రియని, నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ సమయానికి ఆయా లోకాల్లో నివసిస్తున్న ఆత్మలన్నీ, అవ్యక్తమైపోతాయి. అవి విష్ణుమూర్తి దేహంలో అచేతనావస్థలో ఉంటాయి. తిరిగి బ్రహ్మ ఈ లోకాలను సృష్టించినప్పుడు, వీటికి తమ తమ పూర్వ జన్మ కర్మల ప్రకారంగా, పుట్టుక లభిస్తుంది.

మహా ప్రళయం: ఇది బ్రహ్మ యొక్క జీవన కాలం ముగిసినప్పుడు జరిగే సమస్త విశ్వం యొక్క లయం. ఈ సమయంలో, విశ్వంలోని అన్ని ఆత్మలూ, మహా విష్ణువు యొక్క దేహంలో అచేతనావస్థ లోనికి వెళ్తాయి. వాటి యొక్క స్థూలశరీరాలూ, మరియూ సూక్ష్మ శరీరాలూ లయమైపొతాయి కానీ, కారణ శరీరాలు ఉండిపోతాయి. తదుపరి సృష్టి క్రమం జరిగినప్పుడు, వాటికి మళ్లీ తమ తమ కారణ శరీరాల్లో దాచి ఉన్న సంస్కారాలూ, మరియూ కర్మలను బట్టి, వాటికి జన్మ ఇవ్వ బడుతుంది.

ఆత్యంతిక ప్రళయం: ఆత్మ చివరికి భగవంతుడిని చేరుకున్నప్పుడు, అది జనన-మరణ చక్రం నుండి శాశ్వతంగా విడుదల చేయబడుతుంది. ఆత్యంతిక ప్రళయం అంటే, జీవుడిని సనాతనముగా కట్టివేసిన మాయా బంధనములు వీడిపోవటం.

05:19 - పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ।। 20 ।।

ఈ యొక్క వ్యక్తమయిన, మరియు అవ్యక్తమయిన సృష్టి కంటే, అలౌకికమైన, మరియూ సనాతనమైన అవ్యక్త అస్థిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.

భౌతిక లోకాల యొక్క నిజ స్వరూపము, మరియు వాటి యొక్క తాత్కాలిక స్వభావము వెల్లడించిన తరువాత, శ్రీ కృష్ణుడు తదుపరి ఇక ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి, మాట్లాడుతున్నాడు. అది భౌతిక శక్తి కన్నా అతీతమైనది, మరియూ భగవంతుని దివ్య యోగమాయా శక్తిచే సృష్టించబడినది. మిగతా అన్ని భౌతిక లోకాలూ నాశనమై పోయినా, అది మాత్రం వినాశము చెందదు. భగవంతుని సమస్త సృష్టిలో, దివ్య ఆధ్యాత్మిక ధామము 3/4వ(ముప్పావు) వంతు, భౌతిక లోకములు 1/4వ(పావు) వంతు సృష్టించబడి ఉంది.

06:19 - అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 21 ।।

ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే, సర్వోన్నత లక్ష్యము. దానిని చేరిన తరువాత, వ్యక్తి ఈ లౌకికమైన మర్త్య లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.

ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే, పరవ్యోమము అంటారు. భగవంతుని భిన్న స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు, అక్కడ ఉంటాయి. ఉదాహరణకి : శ్రీ కృష్ణుని ధామమైన గోలోకమూ, శ్రీ రామచంద్రుని ధామమైన సాకేత లోకమూ, నారాయణుని ధామమైన వైకుంఠ లోకమూ, సదాశివుని లోకమైన శివ లోకమూ, దుర్గా మాత ధామమైన దేవీ లోకము మొదలగునవి. ఈ లోకాల్లో, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో, తన నిత్య పరివారముతో, నిత్యమూ నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ, ఒకదానికి ఒకటి అభేధములే, ఇవి అన్నీ ఒకే భగవంతుని వేరువేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవత్ ప్రాప్తిని పొందుతామో, ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటాము. దివ్య శరీరము తీసుకున్న తరువాత, ఆత్మ,భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో, ఇక శాశ్వతంగా పాలు పంచు కుంటుంది.

07:43 - పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ।। 22 ।।

సర్వోత్కృష్ట పరమ పురుషుడే, అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడూ, మరియూ సర్వ ప్రాణులూ ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు.

ఆధ్యాత్మిక అంతరిక్షంలో, తన దివ్య ధామములో నివసించే భగవంతుడే, మన హృదయములో కూడా స్థితుడై ఉన్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు. ఆయన అంతటా, నూటికి నూరు శాతం ఉన్నాడు. కానీ, ఆ యొక్క సర్వ-వ్యాప్త భగవానుని అస్థిత్వం, మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు. ఎందుకంటే, దాని యొక్క అనుభూతిని మనం రుచి చూడలేము. సర్వ వ్యాపి భగవంతుని గురించి, శాండిల్య ముని ఈ విధంగా పేర్కోన్నాడు.. “ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి.. కానీ, నీరసంగా, అనారోగ్యంతో ఉన్న ఆవుకు, అవి ఏమీ ఉపయోగ పడవు. అదే పాలను ఆవు నుండి పితికి, పెరుగుగా మార్చి, ఆ పెరుగును మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే, అది ఆవును నయం చేస్తుంది.” అదే విధంగా, సర్వ-వ్యాపి భగవంతుని ఉనికికి, మన భక్తిని రంజిల్లచేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఆరాధించి, మన హృదయములో అంతఃకరణ శుద్ధిని పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలం. ఆయన కృపచే, మన మనో, ఇంద్రియబుద్ధుల యందు, తన యొక్క యోగ మాయా శక్తిని ప్రవేశ పెడతాడు. అప్పుడు మన ఇంద్రియములు దివ్యమైనవి అవుతాయి. మనం భగవంతుడిని సగుణ సాకారంగా కానీ, లేదా సర్వ-వ్యాప్త తత్వంలో కానీ, ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకో గలం. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతానని పేర్కొంటున్నాడు.

09:46 - ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి గల రెండు మార్గాల గురించి, శ్రీ కృష్ణుడు వివరించ బోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

23 December, 2021

భగవద్గీత - Bhagavadgita

 

భగవద్గీతా కించిదధీతా
గంగా జలలవ కణికాపీతా ।
సకృదపి యేన మురారి సమర్చా
క్రియతే తస్య యమేన స చర్చా ।।

శ్లోకం అర్ధం:
భగవద్గీతను కొంచమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు (దీనర్థము చావు అంటే భయం పోతుందని).

[ భగవద్గీత వీడియోలు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b ]

భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై, మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ, భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం, మనిషిలో అజ్ఞానం దూరం చేసి, స్థిత ప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మల జలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు, జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం, మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?

అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ, అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై, మృత్యు భయం వీడి తరిస్తుంది.

22 November, 2020

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!



తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nq9T9mD0Cng ]

ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది. 

కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు. 

పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.

అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’ అనే వీడియోను చూడండి. వీడియో లింక్, క్రింద పొందుపరిచాను. అది కనిపించని వారు కామెంట్ చేస్తే, రిప్లైలో లింక్ పంపిస్తాను.. 

[ Link: మరణం తర్వాత ఏం జరుగుతుంది? - https://www.youtube.com/watch?v=lOH5s... ]

ధర్మో రక్షతి రక్షితః!