Ads

22 November, 2020

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!



తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nq9T9mD0Cng ]

ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది. 

కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు. 

పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.

అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’ అనే వీడియోను చూడండి. వీడియో లింక్, క్రింద పొందుపరిచాను. అది కనిపించని వారు కామెంట్ చేస్తే, రిప్లైలో లింక్ పంపిస్తాను.. 

[ Link: మరణం తర్వాత ఏం జరుగుతుంది? - https://www.youtube.com/watch?v=lOH5s... ]

ధర్మో రక్షతి రక్షితః!

No comments: