Ads

Showing posts with label Mahabharatam. Show all posts
Showing posts with label Mahabharatam. Show all posts

05 September, 2022

ఆమె తన 7 గురు కొడుకులనూ ఎందుకు చంపుకున్నది? Why did she kill her 7 sons?

 

ఆమె తన 7 గురు కొడుకులనూ ఎందుకు చంపుకున్నది? వశిష్ఠుడి శాపమే కారణమా?

మన పురాణ ఇతిహాసాలలో, స్త్రీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సృష్టి మొదలు, మృత్యువు వరకూ ప్రతీ విషయంలో, స్త్రీ మూర్తుల ప్రాముఖ్యత కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం, ఎంతో మంది స్త్రీలను మనం నేటికీ పూజిస్తూనే ఉన్నాం. అలా ప్రముఖంగా చెప్పబడే వారిలో, గంగాదేవి ఒకరు. అయితే, శివుడి శిరస్సును అధివసించిన గంగాదేవి గురించిన చాలా విషయాలు, మనలో కొందరికి తెలియవు. మన మహాభారతంలో, అరివీర పరాక్రమవంతుడిగా పేరు గడించిన భీష్ముడు, గంగాదేవి కుమారుడు. గంగ, శాపవశాత్తు భూలోకంలో జన్మించిన శంతనుడిని వివాహం చేసుకుని, అతని ద్వారా పొందిన ఏడుగురు సంతానాన్ని నీళ్ళపాలు చేసింది. శంతనుడు భూలోకంలో జన్మించడానికీ, గంగను వివాహం చేసుకోవడానికీ గల కారణం ఏంటి? ఒక తల్లిగా గంగా దేవి తన కుమారులను ఎందుకు చంపింది? భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించడానికి, వశిష్ఠుడి శాపమే కారణమా - అనేటటువంటి ఉత్సుకతను రేకెత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

 [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dPPKVSNIjGk ]

పూర్వం ఇక్ష్వాకు వంశంలో, మహాభిషుడునే చక్రవర్తి, వెయ్యి అశ్వమేధ యాగాలూ, నూరు రాజసూయ యాగాలూ చేసి, బ్రహ్మలోకానికి వెళ్లి, అక్కడ దేవతలతోనూ, మహాఋషులతోనూ, బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చింది. అప్పుడు గాలి బలంగా వీచి, గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకిలేచి, గంగాదేవి తొడలు కనిపించాయి. దేవతలందరూ తలలు పక్కకు తిప్పుకున్నారు కానీ, మహాభిషుడు ఆసక్తిగా చూశాడు. అది చూసిన బ్రహ్మదేవునికి కోపం వచ్చి, “మహాభిషా, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించు” అని శపించాడు. తన తప్పు తెలుసుకున్న మహాభిషుడు “బ్రహ్మదేవా, భూలోకంలో ప్రతీపుడనే పుణ్యాత్ముడు ఉన్నాడు. కాబట్టి, అతనికి కొడుకుగా జన్మిస్తాను. దయచేసి నా కోరికను మన్నించండి” అని వేడుకున్నాడు. అందుకు బ్రహ్మదేవుడు సరేనన్నాడు. ఇదిలా ఉండగా, గాలికి చీర తొలగినప్పుడు, తన తొడలను చూసిన మహాభిషుణ్ణి చూసి, గంగాదేవి మోహించింది. అతనినే తలచుకుంటూ భూలోకానికి వస్తుంటే, ఎనిమిది మంది వసువులు ఆమెకు ఎదురు పడ్డారు. దీనంగా ఉన్న వారిని చూసి, కారణం ఏమిటని ప్రశ్నించింది గంగాదేవి.

అప్పుడు అష్ట వసువులు, “అమ్మా గంగాదేవి, మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలెనని పోతున్నాము. నువ్వు ఎదురు పడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభిషుడు, మానవలోకంలో ప్రతీపునకు, శంతనుడిగా జన్మిస్తాడు. నీకూ అతనికీ సంగమము అవుతుంది. నీకూ, శంతనునికీ మేము జన్మిస్తాము” అని అడిగారు. అందకు గంగాదేవి కూడా సంతోషించింది. ‘మీ కోరిక తప్పక తీరుతుంది. మీరు నిశ్చింతగా వెళ్ళండి’, అని చెప్పింది. అయితే అష్టవసువులు మరొక కోరిక కోరారు.

“అమ్మా, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ, మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు. దానికి వశిష్ఠ మహర్షి కూడా అనుమతి ఇచ్చారు” అని చెప్పారు. దాంతో ఆలోచించి, “అందరూ పుట్టగానే కాలం చేస్తే, తల్లిగా శోకాన్ని భరించడం కష్టతరం కాదా? నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక్క కుమారుడున్నా చాలు” అని అడిగింది గంగా దేవి. అప్పుడు వసువులు, “అమ్మా గంగాదేవి, మాలో ఎనిమిదవ వాడు ప్రభాసుడు. అతడు మా అందరి అంశలతో దీర్ఘాయువుగా, నీ కన్న కొడుకై మానవ లోకంలో ఉంటాడు” అని చెప్పారు. దాంతో గంగాదేవి సంతోషంగా, అష్టవసువులతో ఒప్పందం చేసుకుంది. తరువాత కొంతకాలానికి, మానవ లోకంలో ప్రతీపుడనే మహారాజు రాజ్య భోగాలను అనుభవించి, గంగానది తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షం అయింది. ఒక దివ్య కాంత రూపంలో, అతని కుడి తొడమీద కూర్చుంది. ప్రతీపుడు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. “నీవు ఎవరు? నా తొడమీద ఎందుకు కూర్చున్నావు?” అని అడిగాడు. అందుకు గంగ, “ప్రతీప మహారాజా, నేను జహ్ను మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను అవుదామని వచ్చాను. నన్ను స్వీకరించు” అని అడిగింది.

“ఓ జాహ్నవీ, నాకు ఇప్పటికే పెళ్లయినది. నేను నా భార్యను తప్ప, మరొక స్త్రీని మనస్సులో కూడా తలవను. అయినా, నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? పైగా, ఆడవారు భర్త ఎడమ తొడమీద కూర్చుంటారు. సంతానం, తండ్రి కుడి తొడపై కూర్చుంటారు. నువ్వు నా తొడపై కూర్చున్నావు కాబట్టి, నా కొడుకును వరించి పెళ్లి చేసుకొనుము” అని ప్రతీపుడు చెప్పగా, అక్కడి నుండి గంగాదేవి అంతర్థానమయింది. ప్రతీపునకూ, అతని భార్య అయిన సునందకూ, బ్రహ్మ శాపం ప్రకారం మహాభిషుడు, శంతనుడిగా జన్మించాడు. ఒకరోజు ప్రతీపుడు శంతనుని పిలిచి, “కుమారా, ఒకరోజు గంగానదీ తీరాన ఒక కన్యను చూశాను. నువ్వు నా కొడుకుకు భార్యవు కమ్మని అడిగాను. ఆమె దానికి అంగీకరించింది. నీవు ఆమెను వివాహము చేసుకొనుము. ఆమెను గురించిన వివరాలేమీ అడగకుండా, ఆమె కోర్కె తీర్చు” అని చెప్పాడు. తండ్రి మాటకు సరే అన్నాడు శంతనుడు. నిజానికి శంతనుడికి తన శాపం గురించి గుర్తులేదు. శంతనుడికి గంగను గురించి చెప్పిన తరువాత, ప్రతీపుడు తపోవనానికి వెళ్లిపోయాడు.

శంతనుడు రాజ్యభారాన్ని తీసుకున్నాడు. ఒకరోజు శంతనుడు వేటకు వెళ్లగా, అక్కడ గంగానదీ తీరంలో, గంగాదేవి ఒక మానవస్త్రీ రూపంలో, శంతనుడికి కనిపించింది. ఆమె మనోహర రూపానికి ముగ్ధుడై, ఆమెనే చూస్తుండిపోయాడు, శంతనుడు. ఆమె కూడా శంతనుని అందానికి పరవశించి, అతనినే చూస్తూ ఉంది. వెంటనే తండ్రి చెప్పిన మాట గుర్తుకు వచ్చింది శంతనునికి. పైగా ఆమె మీద మనసు పడడంతో, గంగాదేవి చెప్పిన షరతులన్నింటికీ అంగీకరించి, తనను వివాహం చేసుకున్నాడు. ఆమె ఏమి చేసినా,  ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? అని ప్రశ్నించకూడదని, ముందుగానే మాట తీసుకుంది గంగాదేవి. ఆ తరువాత గంగకూ, శంతనుడికీ, అష్ట వసువులు ఒకరి వెంట ఒకరుగా, కుమారులుగా జన్మించారు.

గంగ వారందరినీ, పుట్టిన వెంటనే గంగానదిలో పడవేసింది. తన కుమారులు నిర్జీవులుగా మారుతుండడంతో, శంతనుడికి మనసులో బాధగా ఉన్నా, గంగాదేవి పెట్టిన షరతు ప్రకారం, ఏమీ ప్రశ్నించేవాడు కాదు. అలా శంతునుడి ద్వారా గంగకు ఏడుగురు వసువులు పుట్టారు, చనిపోయారు. వారందరి తరువాత, అష్టమ వసువు అయిన ప్రభాసుడు జన్మించాడు. ఈసారి శంతనుడు ఊరుకోలేదు. “ఇప్పటిదాకా, పుట్టిన వారందరిని గంగలో పడవేశావు. నాకు ఈ కొడుకును వదలడం ఇష్టం లేదు. ఎందుకిలా చేస్తున్నావు?” అని ప్రశ్నించాడు. “శంతన మహారాజా, నీవు నాకు ఇచ్చిన మాట తప్పావు. నేను వెళ్లిపోతున్నాను. నేనెవరినని అనుకుంటున్నావు? నేను గంగను. అష్ట వసువులు వశిష్ఠ మహాముని శాపంతో, మానవ లోకంలో పుట్టారు. వారు కోరిన కోరిక ప్రకారం, నా గర్భాన జన్మించారు. పుట్టగానే వారికి విముక్తి కలిగించాను. ఈ ఎనిమిదవ వాడు, చిరకాలం జీవిస్తాడు. కీర్తి మంతుడవుతాడు” అని చెప్పింది గంగ. ఆ మాటలను విన్న శంతనుడు ఆశ్చర్యపడి, “ఓ గంగా, వసువులు దేవతలు, దోషము లేనివారు కదా? వశిష్ట మహాఋషి, వారిని ఎందుకు శాపించారు? అందులో ఎనిమిదవ వాడు మాత్రం, మానవ లొకంలో ఎక్కువ కాలం ఎందుకు జీవిస్తాడు? వివరంగా చెప్పు” అని అడిగాడు. అప్పుడు గంగ వసువుల శాప వృత్తాంతాన్ని వివరించింది.

“శంతన మహారాజా, వరుణుడి కుమారుడైన వశిష్ఠుడనే మహాముని, మేరు పర్వతపు గుహలో తపస్సు చేస్తున్నాడు. వశిష్ఠుని ఆశ్రమంలొ, నందిని అనే కామధేనువు ఉంది. అది వశిష్ఠునికి కావలిసిన వస్తువులన్నింటినీ ఇస్తూ, అతనికి సేవచేస్తూ ఉండేది. ఒకరోజు అష్ట వసువులు వారి భార్యలతో కలసి, వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ కామధేనువును చూసి, దాని మహిమకు అశ్చర్యపోయారు. అందులో ఎనిమిదవ వసువు భార్య తన భర్తతో, “నందిని అనే ఈ కామధేనువు పాలు తాగి, రోగం, ముసలి తనము లేకుండా బ్రతుకుతారంటారు కదా? మరి దీని యజమాని ఎంతటి గొప్పవాడయి ఉండాలి? కాబట్టి, ఈ ధేనువును నా ప్రాణ స్నేహితురాలు జీతవతికి కానుకగా ఇవ్వాలని, కోరికగా ఉన్నది” అని అడిగింది. దానికి మిగిలిన వసువులు కూడా, ఆమెకు వంత పాడారు. తన భార్య కోరికను నెరవేర్చడానికి, ఎనిమిదవ వసువైన ప్రభాసుడు, కామధేనువును బలవంతంగా తీసుకుని వెళ్లాడు. వశిష్ఠ మహాముని తన యోగ దృష్టితో, ఇదంతా చూసి ఆగ్రహించాడు. దాంతో, మదమాత్సర్యాలకు లోబడిన మీరందరూ, మానవులై పుట్టండని శపించాడు. వెంటనే తప్పు తెలుసుకున్న వసువులందరూ, వశిష్ఠుని కాళ్ల మీద పడ్డారు. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా అనుగ్రహించమని, మహర్షిని వేడుకున్నారు. అందుకు వశిష్ఠుడు, మీ కోరిక నెరవేరుతుంది. కాని అసలు నేరం చేసిన వాడు, ఈ ఎనిమిదవ వసువు అయిన ప్రభాసుడు మాత్రం, తన జీవితాన్ని మానవలోకంలో గడుపుతాడు. భార్య కోసం ఇటువంటి కార్యానికి ఒడిగట్టినందుకు, ఆజన్మాంత బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా బ్రతుకుతాడు” అన్న వశిష్ఠుడి మాటలనూ, అష్ట వసువుల శాపం గురించీ చెప్పి, తన కుమారుడిని తీసుకుని, గంగా దేవి శంతనుడుని విడిచి వెళ్లింది. దాంతో జరిగినదానికి విచారిస్తూ, శంతనుడు తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు. కొంతకాలం తరువాత, ఒకరోజు శంతనుడు వేట నిమిత్తము గంగానదీ తీరానికి వెళ్లాడు. ఒక చోట గంగానది ప్రవాహం ఆగిపోయినట్టు కనిపించింది. శంతనుడు అది చూసి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ, గంగానది వెంట నడుస్తుండగా, అక్కడ ఒక చోట బాలుడు గంగా నదికి అడ్డంగా, తన బాణాలతో అడ్డుకట్ట కట్టాడు.

అతనే గంగా శంతనుల కుమారుడు దేవవ్రతుడు. కానీ, శంతనుడు ఆ కుమారుని గుర్తించలేదు. ఇంతలో గంగాదేవి అక్కడకు వచ్చి, “ప్రభూ, ఈ బాలుడు మీ కుమారుడు. వశిష్ఠుని వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రుడూ, బృహస్పతి వద్ద ధర్మశాస్త్రాలను అభ్యసించాడు. పరశురామునితో సమానంగా, ధనుర్విద్యను ఆకళింపుజేసుకున్నాడు. ఇక ఇప్పుడు, నీ కుమారుని స్వీకరించుము” అని దేవవ్రతుడిని శంతనునికి అప్పగించి, గంగ వెళ్లిపోయింది. వీరుడూ, ధీరుడూ, గుణవంతుడూ, సకల విద్యాపారంగతుడూ అయిన కొడుకును చూసి, శంతనుడు ఉప్పొంగిపోయాడు. కొడుకును హస్తినాపురానికి తీసుకువచ్చి, దేవవ్రతునికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. ఆ తరువాత శంతనుడు, యోజన గంధిగా పిలువబడే సత్యవతిని చూసి, వివాహం చేసుకోవాలనుకున్నాడు. సత్యవతి, తన కుమారులకు మాత్రమే రాజ్యపట్టాభిషేకం చేయాలనీ, భీష్ముడు బ్రహ్మచారిగా ఉండాలనీ, షరతు విధించింది. దానికి శంతనుడు అంగీకరించలేదు. కానీ, ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు, సత్యవతి తండ్రి దాశరాజు వద్దకు వెళ్లి, ఆమె కోరక మేరకు, వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగా జీవిస్తాననీ, రాజ్యం ఆమె పుత్రులకే అప్పగిస్తాననీ చెప్పి, వారిని ఒప్పించి, తండ్రికి పెళ్లి చేశాడు. అలా వశిష్ఠుడి శాపం ప్రకారం, సత్యవతి షరతు కారణంగా, భీష్ముడు బ్రహ్మచారిగా, సంతానహీనుడిగా జీవించి, తనువు చాలించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

13 June, 2022

యుద్ధానికి ముందు పాండవుల సంతతి తలను కృష్ణుడెందుకు బలి కోరాడు? Story of Khatu Shyam

 

యుద్ధానికి ముందు పాండవుల సంతతి తలను కృష్ణుడెందుకు బలి కోరాడు?

మహాభారతం, తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని, ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రాంతికి లోను చేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాల సమ్మిళిత మహా గ్రంథమే, ‘మహాభారతం’. నిజానికి మహాభారతం అంటేనే ‘శ్రీకృష్ణుడు’. తను లేనిదే, మహాభారతం లేదు. అయితే, భారతంలో కొనియాడబడిన అనేక మంది వీరులను, ఒక్క నిముషంలో సంహరించగలిగే మహావీరుడు, ‘బర్బరీకుడు’. అమ్మవారి శక్తితో, గొప్పయోధుడిగా పేరుగడించిన బర్బరీకుడు, కురుక్షేత్రంలో పాల్గోనకపోవడానికి ఒక కారణం ఉంది. అసలు బర్బరీకుడెవరు, అతని వృత్తాంతం ఏంటి? కురుక్షేత్రాన్ని నిముషంలో అంత చేయగల శక్తిని, అతను ఎలా సంపాదించాడు? శ్రీ కృష్ణుడు మారు వేషంలో వచ్చి, బర్బరీకుడిని కోరిన కోరికేమిటి – వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/i8U51cgclHA ]

ఒకసారి పాండవులందరూ, శ్రీ కృష్ణుడితో సహా సభలో వుండగా, ఘటోత్కచుడు తన తండ్రి భీముడిని కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో వారందరూ, ఘటోత్కచుడికి సరైన వధువు ఎవరని చర్చిస్తున్న సమయంలో, శ్రీ కృష్ణుడిని సలహా అడిగారు. ప్రాగ్ జ్యోతిష్య పురంలో ఉన్న అహిళావతి అనే యువతి, ఘటోత్కచుడికి తగిన భార్య అని, శ్రీ కృష్ణుడు సూచించాడు. అహిళా వతి, అమ్మవారి ఉపాసకురాలు. ఆమె భక్తికి మెచ్చిన ఆది శక్తి, తన దివ్య ఖడ్గాన్నీ, డాలునూ ప్రసాదించింది. శ్రీ కృష్ణుడి మాట మేరకు, ఘటోత్కచుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి నల్లని మేని, కుండలాంటి తల, చక్కని రింగురింగుల జుట్టుతో, ఒక పుత్రుడు జన్మించాడు. అతడి శోరోజాలు ఉంగరాలు ఉంగరాలుగా ఉండడం వలన, అతడికి బర్బరీకుడని నామకరణం చేశారు. ఈ బర్బరీకుడు, తన తండ్రిలా ఎంతో తెలివి, ధైర్యం, శౌర్యంగలవాడు. బర్బరీకుడు, తల్లివద్దనే సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. మహీసాగర సంగమంలో, గుప్తక్షేత్రం వద్ద నవదుర్గా ఉపాసన చేసి అమ్మవారిని ఆరాధించి, ఎంతో మహిమాన్వితమైన మూడు బాణాలను వరంగా పొందాడు.

ఒకనాడు పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, అందరూ బర్బరీకుడు నివసించే వనం వద్దకు వెళ్ళడం తటస్థించింది. అక్కడున్న తటాకంలో నీటిని తీసుకురమ్మని యుధిష్టరుడు ఆదేశించగా, భీముడు నీటి కోసం ఆ తటాకంలోకి అడుగుపెట్టాడు. భీముడు తన తాత అన్న విషయం తెలియక బర్బరీకుడు ఆగ్రహించి, దేవి అభిషేకానికి ఉపయోగించే ఆ నీటిని మలినం చేసినందున శిక్ష తప్పదని, భీముణ్ణి ఎత్తి కిందకు విసిరేయబోయాడు. ఆ సమయంలో భీముడు తన తాత గారని తెలుసుకున్న బర్బరీకుడు, పెద్దలను అవమానించిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, సముద్రంలో దూకబోయాడు. అప్పుడు అమ్మవారు అడ్డుకుని, నీ శిక్షకు పరిహారంగా ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసి, తపస్సు చెయ్యమని ఆదేశించింది. అలా బర్బరీకుడు తన తాత గారి పేరిట నాడు ప్రతిష్ఠ చేసిన లింగమే, నేటి భీమేశ్వర లింగం.

కురు పాండవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం మొదలయినప్పుడు, ఆ యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకున్నాడు. యుద్ధంలో పాలు పంచుకోవడానికి తన తల్లి అనుమతి తీసుకోగా, అహిళావతి, బర్బరీకుని బలమెరిగి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, వారికి అతని సహాయాన్ని అందించమని చెప్పి పంపించింది. తనదగ్గరున్న అజేయమైన మూడుబాణాలను తీసుకుని, కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు బర్బరీకుడు. కౌరువుల పక్షాన 11 అక్షౌహిణులూ, పాండవులపక్షాన, 7 అక్షౌహిణుల సైన్యం వుంది కాబట్టి, పాండవులు బలహీనులని భావించి, వారి వైపు చేరాడు. అయితే, ఒకనాడు యుద్ధ రంగంలో శ్రీ కృష్ణుడు, పాండవుల శక్తిని తెలుసుకోదలచి, ఎవరు ఎన్ని రోజులలో యుద్ధాన్ని ముగించగలరు అని ప్రశ్నించాడు. దానికి ఒక్కొక్కరూ ఒక్కో సమాధానాన్ని చెప్పారు. అయితే, వారి గుంపుకు కాస్త దూరంగా నిలబడిన బర్బరీకుడిని చూసి, అతడి శక్తిని పరీక్షించే నెపంతో శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుని వేషంలో, నువ్వైతే కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్నాళ్ళలో ముగించగలవలని ప్రశ్నించాడు. తన వద్ద దివ్య త్రిశరాలున్నాయనీ, వాటి ద్వారా క్షణకాలంలో యుద్ధాన్ని ముగించగలననీ, బర్బరీకుడు సమాధానమిచ్చాడు. వాటి గొప్పదనాన్ని కూడా వివరించాడు. "నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండవ బాణం, వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడవ బాణం, శిక్షను అమలుపరుస్తుంది." అని తన వద్దనున్న త్రిశరాల గురించి, వివరించాడు.

అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు, 'నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే, ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు' అంటూ బర్బరీకుని రెచ్చగొట్టాడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో, ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు, తన తొలి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం, చెట్టు మీది ఆకులన్నింటి మీదా తన గుర్తును వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. శ్రీ కృష్ణుడు కావాలనే ఒక ఆకును త్రుంచి, తన కాలి క్రింద దాచిపెట్టాడు.  తన బాణం కృష్ణుడి పాదం దగ్గర తిరగడం చూసిన బర్బరీకుడు, 'అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి' అని అడగగా, బర్బరీకుడి బాణం, ఆ ఆకును చీల్చి, తిరిగి అతని వద్దకు చేరుకుంది. అది చూసిన శ్రీకృష్ణుడు, బర్బరీకుడు యుద్ధంలో పాల్గోంటే ఫలితాలు తారుమారు కావడం తథ్యం అని భావించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, 'బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ, నువ్వు ఏ పక్షానికైతే నీ సహాయాన్ని అందిస్తావో... నిముషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు, పాండవులూ, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే, ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు' అని సత్యాన్ని విశదపరిచాడు.

శ్రీ కృష్ణుడి మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో, 'ఇంతకీ మీరెవరు స్వామీ, మీకేం కావాలి?' అని అడిగాడు. దానికి శ్రీ కృష్ణుడు, 'మహాభారత యుద్ధానికి ముందు, ఒక వీరుడి తల బలి ఇవ్వాల్సి ఉంది. నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక, నీ తలనే బలిగా ఇవ్వు' అని కోరాడు. దాంతో, మారు వేషంలో వచ్చింది సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని, బర్బరీకుడికి అర్థమైపోయింది. మారు మాట్లాడకుండా, తన తలను అర్పించేందుకు సిద్ధపడ్డాడు. అయితే, తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉందనీ, ఆ సంగ్రామాన్ని పూర్తిగా చూసే భాగ్యాన్ని తనకు కల్పించమనీ, కోరుకున్నాడు బర్బరీకుడు. ఆ విధంగానే, అతను తన శిరస్సును ఖండించుకున్న తరువాత, కురుక్షేత్రం మొత్తం కనిపించేలా, ఒక ఎత్తైన కొండపై దానిని పెట్టి, ఆ సంగ్రామాన్ని వీక్షించేలా చేశాడు, కృష్ణ భగవానుడు.

బర్బరీకుడి వద్దనున్న మూడు బాణాలూ, అధ్యాత్మిక, అధిభౌతికా, అధిదైవిక త్రివిధ తాపాలని చెబుతారు, పండితులు. వారి వారి సంచిత కర్మలు, ఎవరెవరు పోతారో గుర్తుపెట్టగా, ఆగామికర్మ, ఎవరికి ఇంకా లోకంలో నూకలున్నాయో గుర్తిస్తే, ప్రారబ్ధం, ఎవరెవరిని సంచితం గుర్తు పెట్టిందో, వారిని మట్టుపెడుతుంది. ఇది కర్మల ప్రతిరూపం అనుకుంటే, శ్రీకృష్ణుని శరణాగతి చేసినవారికి, వీటినుండి రక్షణ కలిగి, ఆ తాపాలనూ, కర్మలనూ నశింప చేసి, మనలను రక్షిస్తాడు. మహాభారత యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన బర్బరీకుడు, శాప వశాన జన్మించి, శ్రీ కృష్ణుడి వలన మరణించాడు.

ఒకనాడు భూమ్మీద అధర్మం పెరిగిపోయిందని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను వేడుకోవడానికి, దేవతలందరూ వచ్చారు. వారి బాధలను తెలుసుకున్న శ్రీ మహా విష్ణువు, దుష్ట శక్తులను సంహరించడానికి, త్వరలోనే తానొక అవతారాన్ని ధరిస్తానని, వారికి మాట ఇచ్చాడు. ఇదంతా వింటున్న ఒక యక్షుడు, ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా? అని ఒకింత పొగరుగా మాట్లాడాడు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ, యక్షుడికి ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్ట మొదట బలయ్యేది నువ్వే.. అంటూ శపించాడు. ఆ విధంగానే, బర్బరీకుడు యుద్ధ ప్రారంభంలో బలి అవ్వాల్సి వచ్చింది. కురుక్షేత్రం ముగిసిన తరువాత, శ్రీకృష్ణుడిని శరణు వేడుకుని, శాప విమోచనం పొందాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, కలియుగంలో బర్బరీకుడు పూజలందుకుంటాడనీ, అతడిని తలుచుకున్నంత మాత్రాన, భక్తుల కష్టాలన్నీ కడతేరిపోతాయనీ వరమిచ్చాడు. ప్రస్తుతం మన రాజస్థాన్, నేపాల్ లలో ఖాటుశ్యామ్ జీ పేరిటా, గుజరాత్లో బలియాదేవ్ పేరిటా, బర్బరీకుడిని కొలుస్తున్నారు భక్తులు.  ఉత్తరాదిలో బర్బరీకుడిని ఆరాధించేవారి సంఖ్య, అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పును పొందిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది, భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం, చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.

కృష్ణం వందే జగద్గురుం!

25 April, 2022

హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!

 


హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!


మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! రెండవ భాగం - భీష్ముడి విషయంలో చింతిస్తున్న ధర్మరాజుకు, అశ్వమేధ యాగం చేసి, దాన ధర్మాలు చేయమని హితవు చెప్పాడు, వ్యాసుడు. అందుకు కావాల్సిన సంపద, నిధి రూపంలో ఉందనీ, దానిని చేజిక్కించుకోమనీ సలహా ఇచ్చి, మరుత్తు మహారాజు కథనూ, బృహస్పతి అతనిని అవమానించడం, నారదుడి సలహా మేరకు, సంవర్తనుడిని కలిసి యాగానికి ఉపద్రష్టగా ఉండమని వేడుకోవడం, మన గత వీడియోలో తెలుసుకున్నాము. ఇక ఈ రోజుటి మన వీడియోలో, సంవర్తునుడు విధించిన షరతు ఏంటి? అందుకు మరుత్తు ఒప్పుకున్నాడా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి విషయాలను, తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/SpDeK1UDtbg ]

సంవర్తునుడు పెట్టిన షరతు ఏంటంటే, ఏకారణం చేతనూ, యాగం భగ్నం కాకూడదు. నీ యాగానికి ఉపద్రష్టగా వ్యవహరిస్తున్నానని నా అన్నకు తెలిస్తే, అతడు నీపై గల ద్వేషంతో, యజ్ఞమునకు భంగం కలిగిస్తాడు. ఒకవేళ, అలా జరిగినా, ‘నేను నిన్ను శపిస్తాను’ అని హెచ్చరించి, కార్యమును జాగ్రత్తగా నిర్వహించమని, సూచించాడు. అందుకు మరుత్తు, 'నాకు మీ కృప లభించింది. నాకిక విచారములేదు. దేవేంద్రుడూ, ఇంద్రుడే కాదు, పరమేశ్వరుడే అడ్డువచ్చినా, నేనిక చలించను. నేను నా ప్రయత్నంలో విఫలమైతే, సూర్యుడూ, చంద్రుడూ ఉన్నంత కాలం, నాకు పుణ్యలోకాలు ఉండవు' అంటూ శపధం చేశాడు. అయితే సంవర్తనుడు, మహేంద్రుడి కంటే ధనవంతుడిని చేసి, తన చేత యాగం చేయిస్తానంటూ మరుత్తుకు మాట ఇచ్చాడు. అంత సంపద ఎలా సాధ్యం అని అడగగా, ‘హిమాలయాలకు ఉత్తరభాగాన, ముంజవంతం అనే పర్వతం ఉంది. అక్కడ శివుడు, పార్వతితో కలసి, దేవతలూ, సిద్ధులూ, గరుడులూ, గంధర్వులూ మొదలైన వారితో చేరి, విహరిస్తుంటారు. అక్కడ ఆకలి దప్పులూ, రోగాలూ మొదలైనవి ఉండవు. ఆ పర్వతం మీద అనేక బంగారు కొండలూ, బంగారుమయమైన ఇసుకా, పుష్కలంగా లభిస్తుంది. మనం అక్కడకు పోయి, శివపార్వతులను ప్రార్ధించి, వారి కరుణతో, బంగారు రాళ్ళనూ, ఇసుకనూ తీసుకు వద్దాం, నీవు సేవకులను సిద్ధం చేసుకో. ఎంతమందిని అక్కడకు తీసుకువెళితే, అంత సంపదను తెచ్చుకోవచ్చు’ అంటూ, తన ఆలోచనను మరుత్తుకు తెలియజేశాడు.

సంవర్తనుడి ఆజ్ఞ ప్రకారమే, మరుత్తు తన సైన్యంతో వెళ్లి, పార్వతీ, పరమేశ్వరులను ప్రార్ధించి, వారి కరుణతో అంతు లేని సంపదలను తీసుకుని, నగరానికి వచ్చాడు. ఆవిధంగా, మరుత్తు ధనవంతుడై, యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించి, మహా వైభవంగా యజ్ఞం ప్రారంభించాడు. ఈ సంగతి తెలుసుకున్న బృహస్పతి, తనలో తాను కృంగి కృశించి పోయాడు. దేవేంద్రుడు అది గమనించి, 'దేవతలకు గురువైన మీరిలా ఎందుకు శోకిస్తున్నారు? ఇందుకు కారణమైన వారెవరో చెప్పినట్లైన, వారిని నేను కఠినంగా శిక్షిస్తాను' అని అన్నాడు. అప్పుడు బృహస్పతి, జరిగిన విషయాన్నీ, మరుత్తు యాగానికి తన విరోధి అయిన సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న సంగతినీ, తెలియజేశాడు. అతడు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తున్నందుకు, నా మనస్సు చాలా చింతిస్తోంది. అతడిని ఎలాగైనా ఉపద్రష్టగా ఉండకుండా నిరోధించాలి! అని ఇంద్రుడితో వాపోయాడు. వెంటనే అగ్నిని పిలిపించి, ‘నీవు ఎలాగైనా మరుత్తును, ఆ యజ్ఞమునకు బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచమని, నా మాటగా చెప్పి, అతను అంగీకరించేలా చేయాలి’ అని అన్నాడు. ఇంద్రుడి మాట ప్రకారం, తన నిజస్వరూపంతో మరుత్తు దగ్గరకు వెళ్లగా, అతడు అగ్ని దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, సత్కరించాడు. అప్పుడు అగ్నిదేవుడు తన రాక వెనుక దాగిన మర్మాన్ని వివరించాడు. తాను దేవేంద్రుడి దూతగా వచ్చానంటూ, 'బృహస్పతి, నీ యజ్ఞానికి యాజకత్వం వహించడానికి అంగీకరించాడు. అందువలన, నీవు మానుష్యత్వం వీడి, దైవత్వం పొందవచ్చు. కనుక నీవు బృహస్పతిని యాజకుడిగా చేసి, యజ్ఞము నిర్వహించు' అని చెప్పాడు.

అందుకు మరుత్తు వినయంగా, దేవ గురువు బృహస్పతికి శతకోటి నమస్కారాలు చేసి, ‘నేను చేయబోవు యజ్ఞానికి యాజకుడిగా ఉండమని చెప్పినప్పుడు, ఆయన నన్ను మానవుడనని చులకన చేసి, నిరాకరించాడు. నేను తరువాత కష్టపడి, బృహస్పతి తమ్ముడిని అతి ప్రయాసతో, నా యజ్ఞానికి యాజకుడిగా ఉండడానికి సమ్మతింపచేసి, యజ్ఞముకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ యాగానికి సంవర్తనుడు సమర్ధుడని నమ్ముతున్నాను’ అంటూ సమాధానమిచ్చాడు. మరుత్తుని ఒత్తిడి చేస్తున్న అగ్ని దేవుడి మాటలను సావధానంగా విన్న సంవర్తనుడు ఇక సహించలేక, 'అగ్నిదేవా! నీవింకా ఇలా మాట్లాడుతుంటే, నేను నిన్ను, నా కంటి చూపుతో కాల్చివేస్తాను' అని అరిచాడు. ఆ మాటలకు అగ్నిదేవుడు భయపడి, దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. మరుత్తు తన మాటలకు ప్రభావితం కాలేదనీ, అతనిని బలవంత పెట్టడానికి ప్రయత్నించడం చూసిన సంవర్తనుడు ఆగ్రహించి, నన్ను భస్మం చేస్తానని హెచ్చరించాడనీ చెప్పాడు.

ఇంద్రుడు అగ్ని దేవుడితో, 'నీవు తిరిగి వెళ్ళి మరుత్తును ఎలాగైనా, నయానో, భయానో, బృహస్పతి యాజకత్వానికి ఒప్పించు. అలా ఒప్పుకోక పోతే, నా వజ్రాయుధాన్ని ప్రయోగించి, అతడిని యమ సదనానికి పంపుతానని బెదిరించు' అని చెప్పాడు. 'దేవేంద్రా! నాకు తిరిగి వెళ్ళాలంటే భయంగా ఉంది. సంవర్తనుడు నన్ను భస్మం చేస్తాడని భయపడుతున్నాను. కనుక నా బదులుగా వేరెవరినైనా పంపు' అని అన్నాడు. ఇక గత్యతరం లేక అగ్ని దేవుడిని వదిలి, ధృతరాష్ట్రుడనే గంధర్వుడిని, మరుత్తు వద్దకు పంపాడు. అయితే, ముందుగా జరిగిన విషయమేదీ, గంధర్వుడైన ధృతరాష్ట్రుడికి తెలియదు. ఇంద్రుడి మాట ప్రకారం, మరుత్తుతో సంవర్తనుడి ముందు, తాను వచ్చిన పనిని వివరించాడు. 'నీ యాగమునకు బృహస్పతిని యాజకుడిగా నియమించు. లేకపోతే తన వజ్రాయుధాన్ని నీ పై ప్రయోగించగలడు' అని హెచ్చరించాడు. అయితే, బృహస్పతి అన్న మాటలూ, తరువాత జరిగిన పరిణామాలూ మరుత్తు వివరిస్తుండగానే, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం, అతని వైపుకు దూసుకు వచ్చింది. దానిని చూపిస్తూ ధృతరాష్ట్రుడు, 'రాజా! అటుచూడు. వజ్రాయుధం నీ మీదకు దూసుకు వస్తోంది. దానిని ఎలా ఎదుర్కుంటావో, నీ ఇష్టం' అంటూ బెదిరించసాగాడు. ఇంతలో తన వైపుకు వస్తున్న వజ్రాయుధాన్ని చూసి, ‘నన్ను ఈ వజ్రాయుధం బారి నుండి రక్షించండి’ అంటూ సంవర్తనుడిని వేడుకున్నాడు. అప్పుడు సంవర్తనుడు చిరునవ్వు నవ్వి, 'నీవు భయపడకు. నా దగ్గరున్న సంస్థంభన విద్యతో, వజ్రాయుధాన్ని తిప్పికొడతాను. ఒక్క వజ్రాయుధాన్నే కాదు. దేవతలు ప్రయోగించే ఏ ఆయుధాన్నైనా, నేను నా విద్యతో తిప్పికొట్టగలను. నీవిక వజ్రాయుధాన్ని గురించి మరచిపో.

ఇంద్రుడి మాటకు ఎదురితిరిగి మరీ నా చేత యాగం జరిపిస్తున్నందుకు, చాలా సంతోషిస్తున్నాను. నీవు ఏదైనా వరం కోరుకోమని అన్నాడు సంవర్తనుడు. అప్పుడు మరుత్తు, 'మీరుండగా నాకు ఇంద్రుడి వలన భయంలేదు. మీ తపోశక్తితో, ఇంద్రుడికి నా మీదున్న కోపమును పోగొట్టి, దేవేంద్రుడు దిక్పాలకాది దేవతలతో యజ్ఞానికి విచ్చేసి, నేను సమర్పించు హవ్యమును స్వీకరించేటట్లుజేసి, నాకు పుణ్యలోకప్రాప్తి కలిగించండి' అంటూ కోరుకున్నాడు. అందుకు సంవర్తనుడు, నా ఆహ్వానం మీద దేవేంద్రుడు, సోమపానం చేయడానికి వస్తాడు. అతడితో దేవతలందరూ వస్తారు. ఇక నీవు యజ్ఞాన్ని మొదలు పెట్టు. అని భరోసా ఇచ్చాడు. ఇంద్రుడు పంపిన వజ్రాయుధాన్ని తన శక్తితో ఆపి, దానిని తిరిగి పంపించాడు. ధృతరాష్ట్రుడిని కూడా సగౌరవంగా పంపించాడు. తరువాత సంవర్తనుడు, దేవతలను ఆవాహన చేసి ఆహ్వానించాడు. దేవతలు సంవర్తనుడి ఆహ్వానం అందుకుని, యజ్ఞానికి విచ్చేశారు. మరుత్తు సంవర్తనుడి ఆజ్ఞమీద దేవేంద్రాది దేవతలను సగౌరవంగా ఆహ్వానించి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి, సత్కరించాడు. వారికి ఆసనాలు సమర్పించి, చేతులు జోడించి, 'నా ఆహ్వానాన్ని మన్నించి, నీవు దేవతలతో నా గృహమునకు విచ్చేసి, నా జన్మసఫలం చేశావు.  ఈ మహాత్ముడు బృహస్పతికి స్వయానా తమ్ముడు. మహా తపస్వి. నా అభ్యర్ధన మన్నించి, నేను చేస్తున్న యజ్ఞానికి యాజకత్వం వహిస్తున్నాడు. దయా సాగరా.. నా యందు కోపం మానుకుని కరుణించి, నన్ను చల్లగా చూడు' అంటూ దేవేంద్రుడిని అర్థించాడు. ఇంద్రుడు కరిగిపోయి, 'నీ వలన నేను ప్రీతి చెందాను మరుత్తు మహారాజా. బృహస్పతికి తమ్ముడైన ఈ సంవర్తనుడు, మహిమాన్వితుడని చెప్పడంలో, సందేహమేముంది' అంటూ చిరనవ్వు నవ్వాడు.

ఆ మాటలకు సంవర్తనుడు, 'దేవేంద్రా ! నేను పిలువగానే యజ్ఞముకు విచ్చేయడం, నా తపః ఫలం కాక మరేమిటి? మీ రాకతో మరుత్తు చేస్తున్న ఈ క్రతువు పుణ్యాల రాశి అయింది. కరుణాతరంగా! నీ దయ నా మీద ప్రసరింప చేస్తే, ఈ యజ్ఞము మంత్ర లోపం లేకుండా, నిర్వహిస్తాను. నీవు దయతో వీక్షించు. నీ రాకతో మరుత్తు పుణ్యలోక అర్హతను పొందాడు' అంటూ దేవేంద్రుడిని స్తుతించాడు. సంవర్తనుడి ప్రశంశలకు మహదానంద భరితుడైన దేవేంద్రుడు, ‘ఈ యజ్ఞవాటికను ఉదాత్తంగా తీర్చిదిద్దండి. గంధర్వులనూ, అప్సరసలనూ పిలిచి, నృత్య-సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఈ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగేలా, ఏర్పాట్లు చేయండి’ అని దేవతలను ఆజ్ఞాపించాడు. అలా ఇంద్రుడి సహకారంతో, సంవర్తనుడు యజ్ఞమును చక్కగా నిర్వహించి, దేవతలకు సోమపానం అందించాడు. దేవతలంతా సోమపానం స్వీకరించి, సంతుష్టులయ్యారు. వారంతా మరుత్తు వీడ్కోలందుకుని, స్వర్గలోకం చేరారు. దేవతలు యజ్ఞమునకు వచ్చి, సోమరసపానము చేసి వెళ్ళిన తరువాత కూడా, యజ్ఞము కొనసాగింది. యాగము పూర్తికాగానే, మరుత్తు బ్రాహ్మణులకు అపారంగా దాన ధర్మాలు చేశాడు. అంతేకాక, ఆ యజ్ఞ నిర్వహణకు వాడిన బంగారు పాత్రలూ, కలశములు కూడా, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. తరువాత సంవర్తనుడి ఆజ్ఞ మేరకు, జనరంజకంగా పాలన సాగించాడు మరుత్తు. కానీ, బ్రాహ్మణులకు ఒక చిక్కువచ్చి పడింది. వారు దానంగా పొందిన బంగారమును మోసుకు వెళ్ళ లేక, వారి జీవనముకు కావలసినంత బంగారము మాత్రం వెంట తీసుకుని, మిగిలినది బంగారు కలశాలలో భద్రపరచి, 'ఈ నిధిని భవిష్యత్తులో ఎవరు కనుక్కుంటారో, వారికి ఈ నిధి సొంతమవుతుంది' అని శాసనం వ్రాసిపెట్టి, వెళ్లారు.

కాబట్టి ధర్మనందనా! 'నీవు ఆ నిధిని స్వాధీన పరచుకుని, అశ్వమేధ యాగమును నిర్వహించు. అది పార్వతీ పరమేశ్వరుల కరుణ ద్వారా లభించిన సంపద' అని వ్యాసుడు, జరిగిన గాధను వివరించాడు. అయితే, వ్యాసుడు అశ్వమేధ యజ్ఞానికి కావలసిన ధనము సమకూర్చుకునే మార్గం చెప్పినా, ధర్మరాజుకు శోకము తగ్గ లేదు. అది చూసిన శ్రీకృష్ణుడు, 'ధర్మజా! ఏపని అయినా, నిశ్చింతగా, నిర్మలంగా చెయ్యాలి కానీ, ఇలా చింతించడం తగదు. ఇప్పటివరకు బోధించిన జ్ఞానం ఏమైంది? నీకింకా, కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహాలు తగ్గినట్లు లేదు. ఇక నీ ఆలోచనలు కట్టి పెట్టి, యాగ నిర్వహణ చేపట్టు' అని హితబోధ చేశాడు. ఆ విధంగా బ్రాహ్మణులు దాచి పెట్టిన నిధిని చేజిక్కించుకుని, అశ్వమేధ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు, ధర్మనందనుడు.

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

18 April, 2022

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం.. Mahabharatam

 

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం..

భీష్మ నిర్యాణానంతరం విరాగిగా మారిన ధర్మరాజుకు వ్యాసుడు చెప్పిన నిధి రహస్యం!

మహాభారత యుద్ధానంతరం భీష్ముని నిష్క్రమణ, ధర్మరాజును మరింత క్షోభకు గురిచేసింది. చిన్నప్పటి నుండీ చేరదీసి, మంచి బుద్ధులు నేర్పి, ఆయన మరణానికి కారణం తానే అని తెలిసినా, తనను మన్నించి, అడిగిన ధర్మ సందేహాలన్నింటినీ తీర్చిన భీష్ముడు తనువు చాలించడం, ధర్మరాజు మనస్సును కలచి వేసింది. ఆ మనో వేదనతో, ధర్మరాజు వనవాసానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. అందుకు వ్యాసుడు ఆగ్రహించి, తాను చేయవలసిన కార్యం గురించి వివరించాడు. అశ్వమేధ యాగం చేసి, బ్రాహ్మణులకు ఘనంగా దాన ధర్మాలు చేసినట్లయితే, కొంత దు:ఖం తీరుతుందని, హితవు పలికాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yJxaUbjfopE ]

అయితే, యాగానికి సరిపడా ధనం ధర్మరాజు దగ్గర లేదు. అప్పటికే కురుక్షేత్ర యుద్ధంలో, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యంలో కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారిని హింసించి, పన్నులు వేసి, అలా వచ్చిన డబ్బుతో యాగం చేయడం, యుధిష్టురుడికి నచ్చలేదు. అప్పుడు వ్యాసుడు ఒక నిధి గురించి వివరించి, దానిని సొంతం చేసుకుంటే, యాగం అత్యంత ఘనంగా చేయవచ్చని సూచించాడు. వెంటనే ధర్మరాజు, ఆ నిధి సక్రమ సంపాదనా, లేక అక్రమ సంపాదనా? అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసుడు, ఆ నిధి వెనుక దాగిన కథను వివరించాడు. అపార సంపదతో నిండిన ఆ నిధి ఎవరిది? అది ఎలా సంపాదించారు? అసలు అంత నిధి ఎందుకు దాచారు - వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

కృతయుగంలో, మనువుకు ప్రజాని అనే కుమారుడుండేవాడు. అతడి కుమారుడు క్షుతుడు. క్షుతుని కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు, నూరుగురు కుమారులు. వారిలో పెద్దవాడు, వింశుడు. వింశుని కుమారుడు వివంశుడు. వివంశుడికి 15 మంది కుమారులు. వారిలో పెద్ద వాడు ఖనీనేత్రుడు. అతడు అధికమైన బల శౌర్యములు కలవాడు. కానీ, పరమదుర్మార్గుడు. అతడు తన 14 మంది తమ్ములను చంపి, రాజ్యాధికారమును చేజిక్కించుకున్నాడు. ఖనీనేత్రుడు ఎవరినీ నమ్మేవాడు కాదు. ప్రజలను ద్వేషించే వాడు. అతడి ఆగడాలను సహించలేని మంత్రులు, అతడిని పదవీచ్యుతుడిని చేసి, అతడి కుమారుడైన కరంధముడికి పట్టంకట్టారు. అతడు ఎంతో దయామయుడు. ధర్మాన్ని పాటిస్తూ, సదా సత్యమునే పలికే వాడు. కరంధముడు, ఉన్నదంతా దాన ధర్మములు చేసి, చివరకు దరిద్రుడయ్యాడు. కోశాగారంలో ధనములేక, సైన్యములకు జీతభత్యములు కూడా ఇవ్వలేని పరిస్థితి, నెలకొంది. సైన్యము క్షీణించింది.

అది తెలుసుకున్న శత్రురాజులు, రాజ్యము మీద దండెత్తివచ్చి, అతడిని రాజ్యభ్రష్టుడిని చేశారు. చివరకు అడవుల పాలయ్యాడు. కానీ, కరంధముడు ఏ మాత్రం చింతించకుండా, నియమ నిష్ఠలతో తపస్సు చేయనారంభించాడు. అప్పుడొక అద్భుతం జరిగి, అతడి తపోఫలముగా, అపారమైన సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో వెళ్ళి, శత్రువులను జయించి, తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. ఆ రాజ్యాన్ని ధర్మనిష్ఠతోనూ, సత్యవాక్పరిపాలనతోనూ, జనరంజకంగా పాలన చేశాడు కరంధముడు. అతడు అంగీరసుడిని ఉపద్రష్టగా పెట్టుకుని, అనేక యజ్ఞయాగములు చేశాడు. ఆ పుణ్యఫలాల చేత, కరంధముడు సశరీరంగా స్వర్గలోకానికి చేరాడు. కరంధముడి కుమారుడు అవిక్షత్తు కూడా, తండ్రి వలె ప్రజలను కన్న బిడ్డలలాగా పాలించాడు. తదనంతరం, అవిక్షత్తు కుమారుడైన మరుత్తు కూడా, తాత, తండ్రి మాదిరిగా, ఎన్నో యజ్ఞ యాగాలు చేశాడు.  మరుత్తు ధర్మతత్పరుడూ, కీర్తిమంతుడూ, మహాబలవంతుడూ, తేజస్సు కలిగిన వాడూ, వేదవేదాంగ పారంగతుడు. తాను చేసే యాగాలకు ఉపద్రష్టగా, ఇంద్రునకు బదులుగా, బృహస్పతిని ఆహ్వానించేవాడు.

ఒకనాడు ఇంద్రుడు అసూయతో బృహస్పతి చెంతకు వెళ్ళి, 'మరుత్తు తాను చేయబోవు యజ్ఞమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాడు. దేవగురువైన మీరు, ఒక మానవుడు చేయు యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించడం, అవమానం కదా! కనుక మీరు అతడి యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండాలనుకుంటే, నన్ను మరచిపోయి, అతడి దగ్గరే ఉండండి. లేదంటే అది మానుకుని, ఇక్కడే ఉండండి' అని అన్నాడు. అందుకు బృహస్పతి కంగారుపడి, 'దేవేంద్రా! నాకు మీరే కావాలి. నేను మరొకరి యజ్ఞానికి ఎలా ఆధ్వర్యం వహించగలను. నేను మిమ్మల్ని వదలను' అన్నాడు. తరువాత మరుత్తు మరొక యాగానికి సిద్ధం చేసుకుని బృహస్పతి వద్దకు వెళ్ళి, 'మహాత్మా ! నేను అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెట్టాను. మీరు దానికి ఉపద్రష్టగా ఉండి, యజ్ఞాన్ని నిర్వహించండి. తమరు అంగీకరిస్తారని, నేను అన్నీ ఏర్పాట్లూ చేశాను' అని చెప్పాడు. అప్పుడు బృహస్పతి జరిగిన విషయాన్ని దాచి,  మరుత్తుతో, 'నేను రాలేను.. దానికొక కారణం ఉంది. అదే సమయంలో ఇంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. దానికి నేను ఉపద్రష్టగా ఉండి, యజ్ఞ నిర్వహణ చేయాలి' అని సున్నితంగా తిరస్కరించాడు.

దానికి మరుత్తు చిన్నబుచ్చుకుని, 'అలా అంటే ఎలా మహాత్మా! మా తాతగారైన కరంధముడికి, మీ తండ్రి గారైన అంగీరసుడు ఉపద్రష్టగా ఉండి, అనేక యజ్ఞయాగాదులు చేయించారు. అలాగే మీరు కూడా ఉపద్రష్టగా ఉండి, ఎలాగైనా నేను చేయతలపెట్టిన యజ్ఞాన్ని నిర్విజ్ఞంగా జరిగేలా చూడండి' అంటూ అర్ధించాడు. అందుకు బృహస్పతి, 'మరుత్తు మహారాజా! నేను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తాను. కనుక మానవుడవయిన నీకు, ఉపద్రష్టగా ఉండలేను. నీవు వేరే ఉపద్రష్టను నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అంటూ నచ్చచెప్పాడు. ఇక మరుత్తు ఏం మాట్లాడకుండా, అవమాన భారంతో వెనుదిరిగాడు. మార్గ మధ్యంలో నారదుడు కనిపించి, 'మహారాజా! ఎక్కడి నుండి వస్తున్నావు? ఏ పనిమీద వెళుతున్నావు?' అని అడిగాడు. అందుకు మరుత్తు, 'నారద మహర్షీ! నేను తలపెట్టిన అశ్వమేధయాగానికి ఉపద్రష్టగా ఉండమని అడగడానికి, బృహస్పతి వద్దకు వెళ్ళి అర్ధించాను. అందుకతడు, తాను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేస్తుంటాననీ, అందువలన మానవుడనైన నాకు, ఉపద్రష్టగా ఉండలేనని నిరాకరించాడు. నేను అవమాన భారంతో తిరిగి వెళుతున్నాను.

ఇంత అవమానం మోస్తూ బ్రతికి ఉండడం అవసరమా?' అని పలికాడు. నిరాశలో ఉన్న మరుత్తుతో నారదుడు, 'బృహస్పతి కాకుంటే మరొకరు దొరకరా! అంగీరసుడి చిన్న కుమారుడైన సంవర్తనుడిని, అతడి అన్న అయిన బృహస్పతి అవమానించి, ఇంటి నుండి తరిమివేయగా, అతడు విరాగిగా, దిగంబరంగా, అడవుల వెంట తిరుగుతున్నాడు. నీవు ఎలాగైనా అతడిని అర్ధించి, నీ యజ్ఞానికి ఉపద్రష్టగా నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అని సలహా ఇచ్చాడు. ఆ మాటలకు మరుత్తు సంతోషించి, సరైన సమయంలో సలహా ఇచ్చి, తనను ఆదుకున్నందున్నకు నారదుడిని స్తుతించాడు. ఆ సంవర్తనుడు ఎక్కడ ఉంటాడో, అతడిని ఎలా తీసుకు రావాలా? అని ఆలోచిస్తుండగా, నారదుడు, ‘సంవర్తనుడు కాశీ పట్టణంలో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. అతడిని గుర్తించాలంటే, నీవొక పని చేయాలి. నీవు ఒక శవమును పెట్టుకుని, కాశీనగర ముఖద్వారంవద్ద నిలబడి ఉండు. ఆ శవమును చూసి ఎవరు పారిపోతారో, అతడే సంవర్తనుడని తెలుసుకో. నీవు అతడిని వెంబడించి, ఏకాంత సమయం చూసి, భక్తితో ప్రార్ధించి, నీ యాగమునకు ఉపద్రష్టగా ఉండమని అడుగు. అతడు తనను గురించి నీకు ఎవరు చెప్పారు? అని ఆడిగినప్పుడు, నా పేరు తెలియజేయుము. నేను ఎక్కడున్నానని అడిగితే, నాకు మీ సంగతి చెప్పి, అగ్ని ప్రవేశం చేశాడని అతనితో చెప్పు’ అని మరుత్తుకు సలహా ఇచ్చాడు, నారదుడు.

వెంటనే మరుత్తు, సంవర్తనుడి కొరకు కాశీపట్టణం వెళ్ళాడు. ఒక శవమును పెట్టుకుని, నగరముఖద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడకు ఒక వెర్రి వాడు వచ్చి, ఆ శవాన్ని చూసి, దెబ్బతిన్న జంతువులా పరిగెత్తసాగాడు. అతడే సంవర్తనుడని తెలుసుకున్న మరుత్తు, అతడిని వెంబడించి కొంతదూరం వెళ్ళి, అతడి ఎదురుగా నిలిచాడు. ఆ వెర్రివాడు మరుత్తు మీద దుమ్మెత్తి పోసి, అతడి మీద ఊసి, వెర్రిగా ప్రవర్తించాడు. మరుత్తు ఆ సంఘటనలకు కోపించక, అతడిని వెంబడించాడు. నిర్జన ప్రదేశానికి చేరుకున్న ఆ వెర్రివాడు, ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మరుత్తు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి, వినయంగా నిలిచాడు. అప్పుడు సంవర్తనుడు, 'ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపారు?' అని అడిగాడు. అప్పుడు మరుత్తు, 'నారదుడు మీ గురించి తెలియజేశాడు' అని సమాధానమివ్వగా, ‘ఇప్పుడు నారదుడు ఎక్కడున్నాడు?’ అని సంవర్తనుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. ‘మీ గురించి తెలియజేసి, వెంటనే అగ్ని ప్రవేశం చేశాడు నారదుడు’ అని బదులిచ్చాడు మరుత్తు.

దాంతో శాంతించిన సంవర్తనుడు, 'నీవు నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నాతో ఏం పని?' అని ప్రశ్నించాడు. అందుకు మరుత్తు, ‘మహాత్మా! మీరు నేను చేయబోయే యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండి, యజ్ఞమును పూర్తిచేయండి’ అని అర్ధిస్తూ, తన గురించి వివరించాడు. మరుత్తు గురించీ, అతని తాత, తండ్రుల గురించీ తెలుసుకున్న సంవర్తునుడు, అతనిని ప్రీతితో చూస్తూ, నేను మా అన్న బృహస్పతి చేత అవమానించబడి, నా ఇంటినీ, సంపదనూ, అన్ననూ వదిలి, ఇలా అడవుల వెంట విరాగిగా తిరుగుతున్నాను. నాబోటి పేదవాడు, నీకు ఉపద్రష్టగా ఉంటే, నీకు ఏ గౌరవం ఉంటుంది? కనుక బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచుకుని, యాగమును పూర్తి చేసుకో. అలా కాకుండా, నన్నే ఉపద్రష్టగా చేసుకోవాలంటే, నీవు మా అన్నవద్ద అనుమతి తీసుకోవాలి. నాకు మా అన్న అంటే విపరీతమైన గౌరవం ఉంది’ అని అన్నాడు. అందుకు మరుత్తు, 'నేను మీ వద్దకు వచ్చే పూర్వమే, మీ అన్నను ఉపద్రష్టగా ఉండమని కోరాను. కానీ అతడు నన్ను అవమానిస్తూ, దేవతలకు ఉపద్రష్టగా ఉన్న నేను, మానవులకు ఉపద్రష్టగా ఉండలేనని, నన్ను తిప్పి పంపాడు. ఇప్పుడు నేను తిరిగి బృహస్పతి వద్దకు ఎలా వెళ్ళగలను?' అని సావధానంగా పలికాడు. ఇక మరుత్తు మాటలకు సంవర్తనుడు అంగీకరించి, ఉపద్రష్టగా ఉండి, యాగము చేయించడానికి ఒప్పుకున్నాడు. అయితే, అతడు ఒక షరతు విధించాడు.

మరి ఆ షరతుకు మరుత్తు ఒప్పుకున్నాడా? సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న యాగాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించారు? మరుత్తు యాగంలో సోమ పానం తీసుకోవడానికి, దేవతలు వచ్చారా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, మన తరువాయి భాగంలో తెలుసుకుందాము..

27 December, 2021

పౌండ్రక వాసుదేవుడి వధ! Death of Paundraka Vasudeva

 


పౌండ్రక వాసుదేవుడి వధ!

శ్రీ కృష్ణుడి లీలలనూ, మాయలనూ వర్ణించడం ఎవరికి సాధ్యం? వసుదేవుడి కుమారుడు కాబట్టి, కృష్ణ భగవానుడిని వాసుదేవుడని కూడా పిలుస్తారు. మరి ఈ పౌండ్రక వాసుదేవుడెవరు? అతని గురించీ, అతని మూర్ఖత్వం గురించీ మనలో చాలా మందికి తెలియదు. తన వెర్రితనంతో కృష్ణుడిని ఎదురించి, ఆయన చేత సంహరించబడ్డాడు. వాసుదేవుడికీ, పౌండ్రక వాసుదేవుడికీ సంబంధం ఏంటి? పౌండ్రకుడు కృష్ణుడిని ఎందుకు హెచ్చరించాడు? కాశీరాజు కుమారుడు, మహాజ్వాలను కృష్ణుడి పైకి ఎందుకు పంపాడు - అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nwFrCuWSY2A ]

శ్రీ భాగవత పురాణంలోని ఈ గాధ, మనందరికీ ఒక సత్యాన్ని బోధిస్తుంది. అదేమిటో తెలుసుకుందాము. కరూ దేశానికి రాజు, పౌండ్రక వాసుదేవుడు. అతడు మూర్ఖుడు మాత్రమే కాకుండా, దురహంకారి కూడా. తనకు వాసుదేవుడనే పేరుండడం వలన, తానే నిజమైన వాసుదేవుడననీ, సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువుననీ విర్రవీగేవాడు. ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన పేరును పెట్టుకుని మోసం చేస్తున్నాడనీ, వాసుదేవుడిగా అందరిలో చలామణీ అవుతున్నాడనే భ్రమలో జీవించేవాడు. పౌండ్రక వాసుదేవుడు మాత్రమే కాక, అతడి చుట్టూ ఉండే అనుచరగణం కూడా వెర్రివారే. రాజు ఏం చెబితే, అదే నిజమని భావించి, అతనే నిజమైన వాసుదేవుడని నమ్మేవారు. వీరందరూ కలసి, పౌండ్రకుడి భ్రమను నిజమని, రాజ్యమంతా ప్రచారం చేశారు. నిత్యం అతడిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి, పొగడ్తలతో ముంచేసేవారు, అనుచరులు.

క్రమంగా అతడి పిచ్చి ముదిరి, తలకెక్కింది. తనకు తప్ప, వాసుదేవుడనే పేరు ఇంకెవ్వరికీ ఉండకూడదని భావించాడు. అనుకున్నదే తడవుగా, వెంటనే తన దూత ద్వారా, ద్వారకలోని శ్రీ కృష్ణుడికి సందేశం పంపించాడు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళ్ళిన పౌండ్రకుడి దూత, 'ఓయీ కృష్ణా! యాదవా! ఈ భూమండలాన్ని రక్షించడానికి వాసుదేవుడనైన నేను అవతరించాను. నీవు నా పేరునీ, నా చిహ్నాలనీ ఉపయోగించి సంచరిస్తున్నావని తెలిసింది. ఇది నీకు తగదు. ఇకపై నీవు నా వాసుదేవ నామాన్ని వినియోగించకుండా, నన్ను శరణువేడుకో. లేదా నాతో యుద్ధానికి తలపడు. నిన్ను సరాసరి యమలోకానికి పంపిస్తాను.' అని తాను తీసుకువచ్చిన సందేశాన్ని చదివి వినిపించాడు. ఈ వార్త విన్న సభలోని వారందరూ, ఎవడీ పిచ్చివాడు! అంటూ నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖులున్నారా? అని ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో పౌండ్రకుడి దూతనుద్దేశించి, 'నీవు వెళ్ళి నీ వాసుదేవుడికి చెప్పు, ఏ ఆయుధాలను నన్ను విసర్జించమన్నాడో, అవే ఆయుధాలతో, పౌండ్రక వాసుదేవుడినీ, అతడి అనుచరులనూ, సమూలంగా సంహరిస్తాను. యుద్ధానికి సిద్ధం కమ్మను.' అని తిరుగు వర్తమానం పంపాడు.

చెప్పినట్లుగానే శ్రీ కృష్ణుడు, పౌండ్రకుడి రాజ్యం మీదకు దండెత్తాడు. పౌండ్రకుడు ఎంతో ఉత్సాహంతో, రెండు అక్షౌహిణుల సైన్యంతో, శ్రీ కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. అతడికి అసరాగా, అతడి మిత్రుడైన కాశీరాజు, మూడు అక్షౌహిణీల సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. యుద్ధరంగంలోకి వచ్చిన పౌండ్రకుడు, అచ్చం శ్రీ కృష్ణుడిలా వేణువునీ, ఫించాన్నీ, పీతాంబరాలనూ, కిరీట కుండలాలనూ ధరించి ఎదురయ్యాడు. వేషగాడిలా కనిపించిన పౌండ్రకుడిని చూసి, శ్రీ కృష్ణుడు ఫక్కున నవ్వాడు. దాంతో ఆగ్రహించిన పౌండ్రకుడు, తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ శ్రీ కృష్ణుడిపై ప్రయోగించాడు. ఆ శ్యామసుందరుడు వాటిని తునాతునకలు చేసి, తన చక్రయుధాన్ని ప్రయోగించి, పౌండ్రక వాసుదేవుడి తలను నరికివేశాడు. ఒక ప్రక్క పౌండ్రకుడు మరణించినా, యుద్ధం ఆపకుండా పోరాడుతున్న కాశీరాజు తలను కూడా ఖండించి, బాణంతో ఆ తల కాశీరాజు కోటలో పడేలా చేశాడు. అలా యుద్ధంలో పౌండ్రకుడిపై విజయం సాధించిన శ్రీ కృష్ణుడు, ద్వారకకు వెళ్ళిపోయాడు.

కాశీరాజు మరణానికి కారణం శ్రీ కృష్ణుడని తెలుసుకున్న అతని కుమారుడు సుదక్షిణుడు, ఆవేశంతో రగిలిపోయాడు. కృష్ణుడిపై పగ తీర్చుకోవాలని తలచి, శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. తన కఠోర దీక్షకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, కృష్ణుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడందుకు నిరాకరించి, అభిచార హోమం చేసి, తద్వారా తన కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడు. ఆ విధంగానే, సుదక్షణుడు ఎంతో నిష్ఠగా, ఆ అభిచార హోమాన్ని నిర్వహించాడు. ఆ యాగం పూర్తయిన తరువాత, హోమగుండం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. సుదక్షిణుడు ఆ శక్తిని, ద్వారకా నగరంలో ఉన్న శ్రీ కృష్ణుడి మీదకు ప్రయోగించాడు. మహోజ్వలగా, ఎత్తైన జ్వాలలను విరజిమ్ముతూ, కృత్యాశక్తి, ద్వారకానగరంలోకి ప్రవేశించింది. నగరాన్ని దహించడం మొదలుపెట్టింది. దాని ధాటికి తట్టుకోలేని ద్వారక ప్రజలు, కృష్ణుణ్ణి శరణు వేడుకున్నారు. దాంతో, ఆయన కృత్య మీద తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కృత్యను అడ్డుకుని, దానిని ప్రయోగించిన సుదక్షిణుణ్ణీ, అతడి నగరాన్నీ దహించి, తిరిగి కృష్ణుడి చెంతకు చేరింది.

మంచికో చెడుకో, నిరంతరం శ్రీ కృష్ణుడి పేరునే తలుస్తూ, ఆయన అలంకారాన్నే ధరిస్తూ, కృష్ణ నామస్మరణతోనే తన జీవితాన్ని గడిపిన పౌండ్రక వాసుదేవుడు, అంత్యకాలంలో ఆ భగవానుడి చేతిలో దుర్మరణం పొందినా, శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందాడు. ఈ గాధ ద్వారా ప్రతివొక్కరూ తెలుసుకోవలసిన సత్యం, నిత్య దైవనామ స్మరణ ప్రాముఖ్యత.

కృష్ణం వందే జగద్గురుమ్!

29 April, 2021

మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు! What to learn from Mahabharata!

  

మహాభారతం ప్రతి ఒక్కరికీ నేర్పే జీవిత పాఠాలు! 

భారతీయుల ప్రాచీన, పురాణ గ్రంధాలలో, మహాభారతం ఒకటి. 'తింటే గారలే తినాలి, వింటే భారతమే వినాలి' అనే నానుడి మనందరికీ తెలిసిందే. కానీ, ప్రస్తుతం ఫాస్ట్ ఫార్వార్డ్ గా ఉన్న మనం, కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడి పుస్తకంగానో చూస్తున్నాం. నిజానికి, ఇప్పటి రోజులకీ సరిపడేటట్లు, సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో, మనకు మహాభారతం చెబుతుంది. మహాభారతం చెప్పిన కొన్ని ముఖ్యమైన పాఠాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6ilXFONjd4M ]

జీవితంలో గెలవడానికి, జాలీ, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు..

కర్ణుడు అంటేనే మంచితనానికీ, దాన, ధర్మాలకీ పెట్టింది పేరు. కానీ, సమయాన్ని బట్టి నడుచుకోక పోవడం వలనా, చెడు అంటే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. కాబట్టి, జీవితంలో గెలవాలంటే, మంచితనంతో పాటు, చుట్టూ ఉండే సమాజ పరిస్థితులనూ, సమయాన్ని బట్టీ నడుచుకోవాలి.

చెడు స్నేహం, ఊహలకి కూడా అందని విధంగా మన జీవితం నాశనం చేయొచ్చు..

పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్నీ నాశనంజేసి, వారితో స్నేహంగా, వారి ఆస్థానంలో ఉంటూనే, వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు, జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టాలి.

ఎటువంటి బేధాలూ చూడని నిజమైన స్నేహం, జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది..

పాండవులు శ్రీ కృష్ణుడినీ, కౌరవులు కర్ణుడునీ పొందటం, అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే. కర్ణుడు లేని రారాజు బలం ఏ పాటిదో, కౌరవ సేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యమో తెలిసిన సంగతే.. కుల, మత, పేద మరియు ధనిక భేదాలని చూడకుండా, మంచి వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు.

అధికం అనేది అత్యంత ప్రమాదకరం..

కౌరవుల తల్లి అయిన గాంధారికి, వంద మంది పుత్రులు ఒకేసారి కలగటం వల్ల, వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ, వారి బాగోగులు చూస్తూ, క్రమశిక్షణతో పెంచటము కూడా, చాలా కష్టం. అలాగే, దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా, కౌరవులు నాశనం అయ్యారు. కాబట్టి, అన్ని చోట్లా, ముఖ్యంగా చెడు పక్షాన అధికం అనేది, అత్యంత ప్రమాదకరం.

ఎవరి పనులు వారే చేసుకోవాలి..

అరణ్య వాసం, అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి, వాళ్ళు నేర్చుకున్న ఇంటి, వంట పనులు చాలా ఉపయోగ పడ్డాయి. అలాగే, మనం కూడా మన అవసరాల కోసం, కొన్ని పనులు నేర్చుకోవాలి.

మనకి సంబంధించిన దాని కోసం, ఎంత కష్టమైనా పోరాడాలి..

కౌరవులతో పోల్చుకుంటే, పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా, పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకుని, చిత్తశుద్దితో పోరాటం చేసి, విజేతలుగా నిలిచారు.

అతి ప్రేమవలన కలిగే నష్టం..

ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ, ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో, కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా, వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు, తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక, వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే, విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీదయినా, అతి ప్రేమ, అతి నమ్మకం, నాశనానికీ, మోసానికీ దారితీస్తాయి.

జీవితాంతం విద్య నేర్చుకుంటూ ఉండటమే ఉత్తమం..

అర్జునుడు తన జీవితం ఆసాంతం, విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండి యుద్ద శాస్త్రం, ఇంద్రుడి ద్వారా దైవ సంబంధమైన ఆయుధాల వాడకం, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులూ, ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే, అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడం వలన, ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.

కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు..

కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా, వాస్తవానికి వారిలో చాలా మంది, పాండవులకి సహాయపడ్డ వాళ్ళే. బీష్మ, విదుర, ద్రోణులు, రహస్యంగా పాండవులకి ఎంత సహాయంజేశారో తెలిసినదే. ఇక విదురుడయితే, కౌరవుల ప్రతీ అడుగూ, పాండవులకు చేరవేయడం తెలిసినదే..

మిడిమిడి జ్ఞానం, అత్యంత ప్రమాదకరం..

పద్మవ్యూహం లోనికి ప్రవేశించటమే కానీ, బయటపడటం తెలియక, తనకున్న అర్ధ జ్ఞానముతో అభిమన్య్యుడి వంటి మహావీరుడు నేల రాలిపోయాడు. ఏ పనినయినా, పూర్తిగా తెలుసుకున్నాకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే, ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.

స్త్రీని అవమానించడం పతనానికి నాంది..

కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన, ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం, చివరికి కౌరవులనూ, వాళ్ళ సామ్రాజ్యాన్నీ, నామ రూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వాళ్ళని అవమాన పరచడం, పతనానికి దారి తీస్తుంది.

నీకు ఆసక్తి ఉంటే, నిన్ను ఎవ్వరూ ఆపలేరు..

చాలా మందికి తెలిసినంత వరకూ, అర్జునుడే ప్రపంచం మొత్తంలో, అత్యుత్తమ విలుకాడు. కానీ, కుటిల రాజకీయాల వలన, తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు, అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా, అతనికి ఉన్న ఆసక్తే, అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున, ఏదైనా సాధించాలంటే, ముందుగా మనకు దానిమీద అమితమైన ఆసక్తి ఉండాలి. లేకపోతే సాధించలేము.

విజయానికి మంచి వ్యూహం తప్పనిసరి..

పాండవుల విజయానికి కృష్ణుడి పకడ్బందీ వ్యూహమే ముఖ్య కారణం. ఏ పని చెయ్యాలన్నా, ఒక మంచి వ్యూహం ఉండాలి. అలా అయితేనే, ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం.

మహా భారతం మనకి మన చరిత్రతో పాటు, జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది.. 

కృష్ణం వందే జగద్గురుమ్!

Link: https://www.youtube.com/post/Ugx7EP6hWjwZ7TkW-R54AaABCQ

28 March, 2021

మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు!

 

మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన సన్యాసి ‘లక్ష్యం’ - 4 హత్యలు!

మహాభారతంలోని అతిరధ మహారధులలో ఒకడిగా, కురుక్షేత్ర సంగ్రామంలో మహా యోధుడిగా, శ్రీ కృష్ణ భగవానుడికి సన్నిహితుడిగా, మన ఇతిహాసాలలో చెప్పబడిన మహోన్నత వ్యక్తి అర్జునుడు. ఇంద్రుని అంశతో, కుంతీ దేవికి జన్మించిన అర్జునుడు, పరమశివుని నుండి రౌద్రాస్త్రాన్నీ, వరుణుడి నుండి వారుణాస్త్రాన్నీ, ఆగ్ని దేవుని నుండి ఆగ్నేయాస్త్రాన్నీ, వాయుదేవుడి నుండి వాయవ్యాస్త్రాన్నీ, ఇంద్రుని నుండి ఇతర అస్త్రాలనూ పొందాడు. అయితే, వీటన్నింటికన్నా అర్జునుడి వద్ద ఉన్న అతి పెద్ద, శక్తివంతమైన అస్త్రం, శ్రీ కృష్ణ పరమాత్ముడు. మహా సంగ్రామంలో గెలవడానికి కారణం, తన ఆయుధాలూ, బలమూ కాదనీ, నిరంతరం తన వెన్నంటే ఉన్న తన బావ శ్రీ కృష్ణుడనీ, ఒకానొక సందర్భంలో, అర్జునుడు స్వయంగా వ్యక్తపరిచాడు. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nxAY2zJ4tZw ]

ధర్మ పరిరక్షణార్ధం, కృష్ణ పరమాత్ముడు అర్జునుడి రథసారథిగా, పాండవులకు మార్గ నిర్దేశనం చేశాడు. అర్జునుడికి శ్రీ కృష్ణుడంటే, ఎనలేని భక్తి, గౌరవం. కృష్ణయ్య మాటను తూ.చ తప్పకుండా పాటించేవాడు. ఒకానొక సందర్భంలో అర్జునుడు, శ్రీకృష్ణుడితో, ‘నన్ను మించిన భక్తుడు, ఈ ప్రపంచంలో నీకు వేరొకరు లేరు కదా బావా!’ అని ప్రేమతో, కించిత్ గర్వంతో అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు చిరు మందహాసం చేసి, అర్జునుడిని నిర్మానుష్యంగా ఉన్న ఒక అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. శ్రీ కృష్ణుడు అర్జునుడిని ఎక్కడకు తీసుకువెళ్లాడు? నిజంగా కృష్ణ పరమాత్మకు అర్జునుడే గొప్ప భక్తుడా? లీలామానుష రూపధారి అయిన శ్రీ కృష్ణుడు, అర్జునుడికి ఏం తెలియజేయాలనుకున్నాడు? అనే ఆసక్తికర విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము...

తానే గొప్ప భక్తుడిననే అపోహలో ఉన్న అర్జునుడిని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి, చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న ఒక సన్యాసిని చూపించాడు కృష్ణ పరమాత్ముడు. ‘అర్జునా, ఈతడు పరమ సాత్వికుడు. కేవలం ఆకులూ అలములూ తింటూ ఎప్పుడూ తపోదీక్షలో ఉంటాడు’ అని, అతనిని దూరంనుంచే పరిచయం చేశాడు. అతనిని చూసిన అర్జునుడికి, ఒక సందేహం కలిగింది. ‘అతను పరమ సాత్వికుడు, సత్యమార్గంలో నడిచే సన్యాసే అయితే, అతని దగ్గర కత్తి ఎందుకు ఉంది?’ అని కృష్ణుడ్ని ప్రశ్నించాడు అర్జునుడు. అందుకు కృష్ణ పరమాత్ముడు, ‘నీ సందేహాన్ని అతనినే అడిగి నివృత్తి చేసుకో. నీ ప్రశ్నలకు అతనే సరైన సమాధానం చెబుతాడు.. మరో మాట.. నువ్వు అర్జునుడివన్న సంగతి అతనికి తెలియదు. నీవుకూడా ఆ విషయాన్ని బయల్పరచకు’ అని చెప్పి, అర్జునుడిని ముని వద్దకు పంపాడు కృష్ణుడు. ముని దగ్గరకు వెళ్లిన అర్జునుడు, ‘అయ్యా, భవబంధాలను వదిలి, సన్యాస దీక్షలో జీవిస్తూ, నిత్యం దైవ స్మరణలో మునిగితేలుతుండే మీకు, ఈ కత్తితో అవసరమేముంది?’ అని అడిగాడు. 

అప్పుడా ముని సమాధానం చెబుతూ, ‘నేను, ఈ సృష్టిలో ఓ నలుగురు వ్యక్తులను చంపాలనుకుంటున్నాను. అందుకే, ఈ కత్తిని నా దగ్గర ఉంచుకున్నాను’, అని అన్నాడు. అతని సమాధానం విన్న అర్జునుడు ఆశ్చర్యపోయి, ‘ఏవరు ఆ నలుగురు? వారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వారి వల్ల మీకేమైనా అపాయం పొంచివుందా?’ అని అడిగాడు. అప్పుడా సన్యాసి, తాను ఎవరిని చంపాలనుకుంటున్నాడో, ఎందుకు చంపాలనుకుంటున్నాడో వివరించాడు. ‘మొదటిగా నారదుడిని చంపాలి. ఆయన ఎప్పుడూ ఆ భగవానుణ్ణి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. నిత్యం "నారాయణ నారాయణ" అంటూ, ఆ పరమాత్మను తలుచుకుంటూ, ఆ భగవానుడికి విశ్రాంతిలేకుండా చేస్తూ ఉంటాడు. నారద ముని, ప్రతీక్షణం కృష్ణ భగవానుడిని తలచుకోవడం వల్ల, ఆయన కొన్ని సార్లు నిద్ర నుంచి తుళ్లిపడుతుంటాడు. నారదుడు ఆ విధంగా కృష్ణ భగవానుడిని ఇబ్బంది పెడుతున్నందుకు, అతనిని చంపాలని నిర్ణయించుకున్నాను. 

ఇక రెండవ వ్యక్తి, ద్రౌపది. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, ఒకనాడు వారుండే ప్రాంతానికి దూర్వాస ముని వచ్చాడు. సాధారణంగా ఎవరైనా మునివర్యులు ఇంటికి గానీ, ఆశ్రమానికి గానీ వస్తే, వారికి కాస్త త్రాగడానికి నీళ్లిచ్చి, తినడానికి అన్నం పెట్టి, మర్యాద చేయడం సంప్రదాయం. దూర్వాస ముని వచ్చే సమయానికి, పాండవులు ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తిని, బయటకు వెళ్లారు. ఆ సమయంలో దూర్వాసముని రావడంతో, ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాక, అతిథి మర్యాద చేయడానికి ఆహారం లేకపోవడంతో, ముని కోపానికి బలవ్వకూడదని, కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించింది. దూర్వాస ముని ఆగ్రహం నుండి బయటపడే మార్గం చెప్పమని, వేడుకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, తాను అన్నం తింటే, ఆ దూర్వాసముని ఆకలి తీరినట్లవుతుందనీ, ఇంట్లో ఉన్న ఎంతో కొంత ఆహారమైనా తనకు ఇమ్మని అడిగాడు. అప్పుడు ద్రౌపది, తాను తినగా మిగిలిన ఎంగిలి మెతుకున్న పాత్రను శ్రీ కృష్ణుడికిచ్చింది. ఆ ఎంగిలి మెతుకును శ్రీ కృష్ణుడు తినగా, దూర్వాస ముని కడుపునిండిపోగా, కుంటి సాకులు చెప్పి, అక్కడి నుండి నిష్క్రమించాడు. సాక్ష్యాత్తూ ఆ నారాయణుడే శ్రీకృష్ణపరమాత్ముడని తెలిసీ, ఆయనకి ఎంగిలి మెతుకు పెట్టింది ద్రౌపది. తాను చేసింది తప్పు. నా కృష్ణయ్యకు ఎంగిలి మెతుకు పెట్టడం, నేను సహించలేను. అందుకే ఆమెను హత్య చేయాలనుకుంటున్నాను.

ఇక నేను చంపాలనుకుంటున్న మూడవ వ్యక్తి ప్రహ్లాదుడు. నారాయణుడికి పరమభక్తుడు ప్రహ్లాదుడు. కానీ, అతని తండ్రి, రాక్షస రాజైన హిరణ్య కశిపుడి వలన, నా భగవానుడు ఎన్నో బాధలనుభవించాడు. నారయణ నామ స్మరణ నచ్చక, ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్యకశ్యపుడు చాలా రకాలుగా హింసించాడు. కానీ, వాటన్నింటినుండీ ప్రహ్లాదుడుని కాపాడుతూ వచ్చాడు భగవానుడు. ఈ క్రమంలో, ప్రహ్లాదుడు అనుభవించవలిసిన అనేక బాధలను తాననుభవించాడు. ప్రహ్లాదుడి తండ్రి వలన, అనేక అవమానాలను ఎదుర్కొన్నాడు. అందుకే, ప్రహ్లాదుడిని సంహరించాలనుకుంటున్నాను. 

ఇక చివరిగా, నేను చంపాలని ఎదురు చూస్తోన్న వ్యక్తి, అర్జునుడు. అతని పేరు చెప్పడానికి గల కారణం, కురుక్షేత్రయుద్ధ సమయంలో, కృష్ణుడిని తన రథ సారథిగా పెట్టుకోవడం. ఈ సృష్టి మొత్తానికీ రక్షకుడైన ఆయన్ని, అలా రథసారథిగా మార్చి, ఆయనను మరింత ఉద్వేగానికి లోనుచేయడం, నాకు నచ్చలేదు. అందుకే, అర్జునుడిని చంపాలని నిశ్చయించుకున్నాను. ఈ నలుగురి వల్లా, నా కృష్ణయ్య అనేక బాధలు పడ్డాడు. నా స్వామిని ఇబ్బంది పెట్టిన వారిని, నేను వదిలి పెట్టను’ అని, ఆ భగవానుడిపై తనకున్న ప్రేమను వ్యక్తపరిచి,  తిరిగి తపస్సుకు పూనుకున్నాడు. 

ఆ సన్యాసి చెప్పిన మాటలు విన్న అర్జునుడు, ఒకింత ఆశ్చర్యానికి లోనైనా, తనకంటే ఎంతో గొప్ప భక్తులు, కృష్ణుడికి ఉన్నారన్న సత్యాన్ని అర్థం చేసుకున్నాడు. ఇతరుల భక్తితో పోలిస్తే, తనది ఎక్కువ కాదనీ, ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో, ఆ పరంధాముడి సాంగత్యం లభ్యమయ్యిందనీ భావించి, సిగ్గుతో తల దించుకుని, అర్జునుడు అక్కడి నుండి వెనుదిరిగాడు. 

దైవారాధనలో, దైవకార్యాలు చేసేటప్పుడూ, మన అవసరాల కోసం కాకుండా, మనస్సును పూర్తిగా ఆ భగవంతునిపై లగ్నం చేయడం నేర్చుకోవాలి. మన అవసరాలూ, మన కోరికలూ, ఆ భగవంతునికి తెలియనివి కావు. ఏవి, ఎప్పుడు మన జీవితాల్లో జరగాలో, ఎప్పుడు ఏం కావాలో, మనకన్నా ఆయనకే బాగా తెలుసు. కాబట్టి, ఇకపై దేవుణ్ణి స్మరించేటప్పుడు, కోరికల చిట్టాలతో కాకుండా, మనస్పూర్తిగా, స్వచ్ఛమైన మనస్సుతో స్మరించండి. ఆయన ప్రేమను ఆస్వాదించండి. "కృష్ణం వందే జగద్గురుం!".

Link: https://www.youtube.com/post/UgwpUtA0Hyl9BP6NEwJ4AaABCQ

04 March, 2021

కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు? Why didn't Balram participate in the battle of Mahabharata?


కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?

శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్ముడిగా, దేవకీమాత అష్టమ గర్భాన అవతరించడానికి ముందు, ఆ తల్లి సప్తమ గర్భాన ప్రవేశించిన ఆదిశేషువు అంశ అయిన బలరాముని, యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణీ దేవి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా గర్భ సంకర్షణముచే జన్మించడం వలన, ఈయన సంకర్షణుడయ్యాడు. బలరామ కృష్ణులిద్దరూ సాందీపుడి వద్ద శిష్యరికంజేశారు. బలవంతులకే బలవంతుడుగనుక, ఈయన బలరాముడిగా సార్ధక నామధేయుడయ్యాడు. అంతటి బల సంపన్నుడూ, సాక్ష్యాత్తూ శ్రీ కృష్ణ పరంధాముడి సోదరుడూ, భీమ, దుర్యోధనులకు గురువు అయిన బలరాముడు, కురుక్షేత్ర సంగ్రామంలో ఎందుకు పాల్గొనలేదు? అనే విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XMr1YBV4Zv8 ]

సంస్కారవంతులు ఎల్లప్పుడూ హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. లోకనీతి వీరికి తెలుసు కాబట్టి, ధర్మాన్ని కాపాడాలనే అవ్యక్తమైన అలజడి, అంతరంగాల్లో అంతర్లీనంగా కొనసాగుతుంది. అలాంటి విభిన్నమైన ఆలోచనా, అందరికీ మంచే జరగాలనే సదుద్దేశం, మహాభారతంలోని బలరాముడి రూపంలో కన్పించింది. భూత, భవిష్యత్, వర్తమానాలను, చేజేతులా లిఖించుకుని బాధపడే రోజును చూడకూడదనుకునే వైవిధ్యం, బలరాముడిది. బలరాముడు... రోహిణీ వసుదేవుల తనయుడు.. కృష్ణుడికి అన్న, యాదవులకు ఆప్తుడు, భీమ దుర్యోధనులకు గురువు. మంచిని మాత్రమే కోరుకునే బలరాముడు, తప్పును నిలదీసేవాడు. ద్వాపరయుగ ధర్మాలైన దయ, తపస్సును వీడనివాడు బలరాముడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమేనన్నది నానుడి. మల్లయుద్ధంలో భీమునికీ, గదా యుద్ధంలో దుర్యోధనునికీ శిక్షణ ఇచ్చి, వారికి గురువైనాడు. అందుకే, కురుక్షేత్రం చివరలో, వీరి మధ్య పోరును చూసి తట్టుకోలేకపోయాడు.

భీమదుర్యోధనులు తనకు రెండు కళ్లలాంటివారనీ, వారి శౌర్యపరాక్రమాలు, ప్రజల రక్షణకు ఉపయోగపడాలే గానీ, పరస్పర వైరానికి కాదనీ పరితపించాడు. కృష్ణుడు పాండవ పక్షాన నిలిస్తే, బలరాముడు కౌరవ పక్షపాతి. అలాగని అధర్మానికి సహకరించేవాడని కాదు. ఇరువురూ బంధువులే కదా.. ఇద్దరి క్షేమం కోరడంలోనే న్యాయముందనేవాడు. జాంబవతీ శ్రీ కృష్ణుల కొడుకు సాంబుడు హస్తినాపురానికి వెళ్లినప్పుడు, దుర్యోధనుని కూతురు లక్షణను ఇష్టపడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. దీంతో, ద్వారకకు ఆమెను తన రథంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఇంతలో విషయం తెలిసిన కౌరవులు, అతడిని బంధించారు. కౌరవులు బంధువులే కాబట్టి, వారితో యుద్ధం చేయడం సబబు కాదనీ, తానే వెళ్లి విషయం చర్చిస్తానని, బలరాముడు బయలుదేరాడు.

కురు యోధులు, చిన్న యువకుని బంధించడం సరికాదనీ, బంధు మర్యాద పాటించే వాడిని గనుక, సావధానంగా మాట్లాడుతున్నాననీ, దుర్యోధనునితో బలరాముడు అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు, వారిని చేతగాని వారితో పోల్చి, అవమానించాడు. బంధుప్రీతి వారిపట్ల పనికిరాదని నిర్ణయించుకున్న బలరాముడు, మహోగ్రుడై, హస్తినాపుర నగరాన్ని తన నాగలితో సగానికి చీల్చడంతో, అల్లకల్లోలం మొదలైంది. కురు ప్రముఖులు వచ్చి క్షమాపణ కోరడంతో, బలభద్రుడు శాంతించాడు.

ఉత్తర, అభిమన్యుల వివాహ వేడుకలో, తొలిసారిగా కురుపాండవుల గురించి, తన అభిప్రాయాన్ని ప్రకటించాడు బలరాముడు. బంధుత్వంలో వచ్చే విభేదాలు, సమాజానికి అధర్మ మార్గాన్ని సూచిస్తాయనీ, కురుపాండవులు అది అర్థం కానివారు కాదనీ, కలత చెందేవాడు. యుద్ధానికి ముందు, అర్ధ రాజ్యానికి హక్కుదారులైన పాండవుల తరఫున దూతను పంపి, అర్థించడం మంచిదని సలహా ఇచ్చాడు. ఈ నెపంతో కురుపాండవుల మధ్య యుద్ధం రాకూడదనే భావన, బలరాముడిది. కానీ, యుద్ధం తప్పలేదు. ద్వేషం, కోపం, అత్యాశలే కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించాయనీ, అది వారికే పరిమితం కాకుండా, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టబోతోందనీ భావించిన బలరాముడు, తీర్థయాత్రలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు.

42 రోజుల తీర్థయాత్ర ముగించుకుని, కురుక్షేత్ర సంగ్రామం చివరిలో, తీవ్రమైన వ్యథతో, హస్తినకు చేరుకున్న బలరాముడికి, భీమ దుర్యోధనుల యుద్ధం కంటపడింది. భయంకరంగా, దుర్యోధనుని తొడలు చీల్చుతున్న భీముణ్ణి వారిస్తూ, అధర్మమని, తన నాగలి తీసి అతడిపైకి వస్తున్న బలరాముడ్ని చూసి, కృష్ణుడు వారించాడు. క్షత్రియ ధర్మం ప్రకారం, న్యాయమని సర్ది చెప్పడంతో, తన శిష్యులిద్దరూ పరస్పరం కలహించుకుంటుంటే చూడలేక, ద్వారకకు తరలి వెళ్లాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత, బలరాముడు అరణ్యంలో ఒక వృక్షం క్రింద కూర్చుని, ధ్యానంలో నిమగ్నమైన సమయంలో, ఆయన నోటినుండి తెల్లని సర్పం బయటకు వచ్చి, పడమటి సముద్రంలో కలిసిపోయింది. బలరాముడు ఆదిశేషువు అవతారామనడానికి, ఇదివొక నిదర్శనము.

ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/Ugzo5hn_ogYikhU7SQ54AaABCQ

24 January, 2021

‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు! Mahabharatam in Telugu


‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు!

కృష్ణ ద్వైపాయనుడూ, గొప్ప రుషీ అయిన వేద వ్యాసుడు, కేవలం మహాభారత గ్రంథరచయితే కాదు, మన ఇతిహాస వేదాలను కూడా సకలనం చేసి, భావి తరాలకూ, యుగయుగాలకూ అందించిన మహోన్నత మహాపురుషుడు. వ్యాసుడు రచింపక ముందు, లక్షల సంవత్సరాల నుండీ, వేదాలు మన భూమండలాన్ని శాసిస్తున్నాయి. ఆనాటి కాలంలో, ఒక తరం నుండి మరొక తరానికి వేదాలు, మౌఖికంగా ప్రచారం కాబడ్డాయి. వారు శబ్ద ప్రాముఖ్యతా, ప్రభావం అర్ధం చేసుకున్నారు కాబట్టి, వేదాలు లిఖితపూర్వకంగా వినియోగించడానికి, నిరాకరించారు. భౌతికంగా, మన వాడుకలో ఉన్నవాటన్నింటిలోకీ, సూక్ష్మమైనది శబ్దం. విద్యుదయస్కాంత శక్తి, దీని పైస్థాయికి చెందింది. మన మెదడులో తిరిగేది కూడా, అదే శక్తి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/bDCCIC1IwDk ]

అతి సూక్ష్మమైన శబ్ద ప్రాముఖ్యతను తెలుసుకుని, దానిని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చో గుర్తించారు, మన పూర్వీకులు. ఆనాటి కాలంలో, వేదాలను మౌఖికంగా పలకడమే సంప్రదాయం. ఆ సమయంలో, గంగాతీరంలో వచ్చిన 14 సంవత్సరాల సుదీర్ఘ కరవు కారణంగా, ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. పంటలు ఎండిపోయాయి. ఆనాటి నాగరికత చిన్నాభిన్నమైంది. పొట్టనింపుకోవడానికి ఆహార పోషణలో పడిపోయిన ప్రజలు, వేదాలను వల్లెవేయటం, మరచిపోయారు.  సంప్రదాయాలను పూర్తిగా వదులుకున్నారు. ఆ తరువాత కరవు ప్రభావం తగ్గింది. కానీ, నాగరికత నాశనమైంది. ఆ సమయంలోనే, వ్యాసుడు వేదాలను లిఖిత పూర్వకంగా అందించాడు. ఆనాటి సత్యయుగంలో, మానవులకు మానసిక శక్తి ఎక్కువగా ఉన్నందున, మౌఖికంగా ప్రసారం చేయడానికి, తగిన ఙ్ఞాపకశక్తి ఉండేది. కలియుగం సమీపిస్తున్న కొద్దీ, మానవ మానసిక, ఙ్ఞాపక శక్తి తగ్గపోతుండండంతో, భావి తరాల కోసం వ్యాసుడు, గణపతి ద్వారా వేదాలను రాయించాడు. అవే, ఋగ్వేదం, అథర్వణ వేదం, సామ వేదం, యజుర్వేదం. ఇదే సంప్రదాయ వరుస క్రమం, రాను రాను, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, యజుర్వేదం అనే వరుస క్రమం ఏర్పడింది.

వ్యాసుడు సంకలనం చేసిన ఈ నాలుగు వేదాలూ, నేటికీ మానవ చరిత్రలోని అతి గొప్ప లిఖిత ప్రతులుగా పరిగణింపబడ్డాయి. ఆ తర్వాత వ్యాసుడు, అన్ని కాలాల ప్రజలకీ యుక్తమైన ఒక శాశ్వత గ్రంథాన్ని రచించాలని, సంకల్పించాడు. వెంటనే గణపతి ద్వారా, మహాభారతగాధను, అద్వితీయ గ్రంధంగా రచించ పూనుకున్నాడు. వ్యాసుడు వివరిస్తుండగా, అతని శిష్యుడైన వైశంపాయనుడు వింటుండగా, గణపతి లిఖించాడు. అంతటి అత్యద్భుతమైన ఆ గ్రంథాన్ని, దేవతలు దొగిలించారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, ఈ గాథను యుథిష్టరుడి రెండో తరం వారసుడైన జనమేజయునికి వివరించాడు, వైశంపాయనుడు. నేడు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఉంటున్న మహాభారతం, గణపతి లిఖించినది కాదు. వైశంపాయనుడికి జ్యప్తికి ఉన్నది మాత్రమే. ఇప్పుడున్న ఈ 1,00,000 శ్లోకాలూ, వ్యాసుడు చెప్పిన వాటిలో, కేవలం కొద్ది భాగం మాత్రమే. పంచమవేదమైన మహాభారతం 18 పర్వాలూ, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా, ఖ్యాతిగడించింది. 

''యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్'' అంటే, ఇందులో ఏది ఉందో, అదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది మరెక్కడా ఉండదు’ అని దాని అర్ధం. ఎంతో పవిత్ర గ్రంథాలుగా భావించే, భగవద్గీతా, విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా, మహాభారతంలోని భాగాలే. ద్వాపర యుగం నాటి సంఘటనల సమాహారంగా విరాజిల్లుతోన్న మహాభారతంలోని ఘట్టాలూ, సన్నివేశాలూ, నేటి కాలానికి, అనేక పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి. వాటిలో దాగిన కొన్ని ముఖ్య విషయాలను తెలుసుకుందాం..

జీవితంలో గెలవడానికి జాలీ, దయా, మంచితనం మాత్రమే ఉంటే చాలదనీ, పరిస్థితులూ, సమయాన్ని బట్టి నడుచుకోవాలనేది, కర్ణుడి పాత్ర తెలియజేస్తుంది. మంచితనానికీ, ధానగుణానికీ, కర్ణుడు మారుపేరుగా నిలిచినా, సమయాన్ని బట్టి నడుచుకోకుండా, అధర్మంవైపు నిలబడి, ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

చెడు స్నేహం జీవితం నాశనం చేస్తుందని, శకుని జీవితం వివరిస్తుంది. కౌరవులతో స్నేహం నటిస్తూనే, వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. కౌరవుల నాశనానికి, పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే. 

బేధాలు చూడని నిజమైన స్నేహం, జీవితంలో, ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి, కృష్ణుడూ, కర్ణుడి పాత్రలే ఉదాహరణ. కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడూ, కౌరవుల పక్షాన కర్ణుడూ నిలిచి, ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో, అందరికీ తెలిసిందే. 

మనకి సంబంధించిన దాని కోసం, ఎంత కష్టమైనా పోరాడాలని, పాండవుల దృఢవైఖరి తెలియజేస్తుంది. కౌరవులతో పోల్చుకుంటే, పాండవుల సైన్యం చాలా తక్కువ. అయినా కానీ, పాండవులు ఆత్మవిశ్వాసం, చిత్తశుద్దితో పోరాటం చేసి, విజేతలుగా నిలిచారు.

పిల్లల పట్ల అతి ప్రేమ నష్టం కలిగిస్తుందనడానికి, ధ్రుతరాష్ట్రుడు ఉదాహరణ. ఓవైపు బిడ్డల మీద ప్రేమా, ఇంకోవైపు తాను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య, ధ్రుతరాష్ట్రుడు నలిగిపోయాడు. కొడుకుల వినాశనం తెలిసినా, వారు చేస్తోన్న దురాగతాలను ఆపలేకపోయాడు. ఒకవేళ ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక, క్రమశిక్షణలో పెట్టి ఉంటే, విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయినా, అతి ప్రేమ, అతి నమ్మకం, నాశనానికీ, మోసానికీ దారితీస్తాయి.

విద్యను జీవితాంతం నేర్చుకోవడమే ఉత్తమ బహుమతనడానికి, అర్జునుడు ఉదాహరణ. తన జీవితం ఆసాంతం, విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుడి నుంచి అస్త్ర విద్యలూ, ఇంద్రుడి నుంచి దైవ సంబంధ ఆయుధాల ప్రయోగం, మహదేవుడి నుంచి పాశుపతాస్త్రం, యుధిష్టరుడు, కృష్ణుడి నుంచి రాజనీతులను, ప్రతీ దశలోనూ అభ్యసించడమే, అర్జునుడిని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. నిత్యం నేర్చుకోవడం వలన, కచ్చితంగా విజయం వరిస్తుందనడానికి, అర్జునుడి పాత్ర కీలకం.

కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారనడానికి, మహాభారతంలో కొన్ని పాత్రలున్నాయి. విదురుడూ, ద్రోణుడూ, భీష్ముడూ, కౌరవుల పక్షాన ఉన్నా, పాండవులకు సహాయపడ్డారు.

మహిళలను ఆపదల నుంచి కాపాడాలనీ, అలా కాకపోతే అనర్థాలు తప్పవనడానికి, ద్రౌపది వస్త్రాపహరణమే ఉదాహరణ. కేవలం తనకు జరిగిన అవమానం వల్ల, ద్రౌపది కౌరవులపై పెంచుకున్న కోపం, చివరికి వారినీ, వారి సామ్రాజ్యాన్నీ, నామ రూపాలు లేకుండా చేసింది.

అనేక అడ్డంకులు ఎదురైనా, భారీగా గాలీ వానా కురుస్తున్నా, కంసుడి బారి నుండి కృష్ణుడిని రక్షించడానికి వసుదేవుడు, కృష్ణుణ్ణి ఒక బుట్టలో తీసుకుని వెళ్ళాడు. పరిస్థితులకు ఎదురీది, కృష్ణుడిని కాపాడాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, మన కర్తవ్యం మనం నెరవేర్చాలి.

ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్యను నేర్పించేందుకు, అంగీకరించలేదు. కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోలేదు. అయినా, మొక్కవోని దీక్షతో, తనపై తనకున్న నమ్మకంతో, విలువిద్యలో మంచి పట్టును సాధించాడు.

ఎటువంటి అడ్డంకులు ఎదురైనా, వాటిని అధిగమించి, అనుకున్న పనిని పూర్తిచేయాలి. ఫలితం మీద దృష్టి పెట్టడం వలన, చక్కటి పనితీరును ప్రదర్శించలేరు. ఏకాగ్రత లోపం, ఏర్పడవచ్చు. 

ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నే, కృష్ణుడు మహాభారతంలో, స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది, ప్రకృతి యొక్క సహజ ధర్మం. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే, తన జీవితంలో అనేక విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నాడు. కన్నవారు ఒకరు, పెంచినవారు ఒకరు. గోకులంలో, అలాగే బృందావనంలో, ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు. అయితే, తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం, ఆ ప్రదేశాలను విడిచి వెళ్లవలసివచ్చింది. అదే విధంగా, రాధతో ప్రేమలో పడినా, రుక్మిణిని పెళ్లాడాడు. జీవితంలో ఎదురైన అనేక మార్పులనూ, పరిస్థితులనూ, చక్కగా ఎదుర్కున్నాడు. 

శ్రీకృష్ణుడు, జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు.. ఆ విధంగా కంసుడి బారి నుంచి రక్షింపబడ్డాడు. గోకులాన్నీ, తన స్నేహితులనూ విడిచాడు. అందువలన రాక్షసుడు వధించబడ్డాడు. ద్రౌపది వస్త్రాపహరణం జరగినప్పుడు, శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు. కృష్ణుడిపై ఆమె నమ్మకం, వమ్ము కాలేదు. ధర్మాన్ని నిలబెట్టాడు. తన గతజన్మలో పాపాల వలన, తానీ విధమైన ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుందా? అని ద్రౌపది కృష్ణుడిని ప్రశ్నించినప్పుడాయన, ‘బాధలకు గురయ్యే వారు, గతజన్మలో పాపాలు చేసినవారు కాదు.. పాపాలు చేసే వారే, గతజన్మలో కూడా పాపి అవడం వలన, అదే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు’ అని వివరించాడు. అందువలన, ఏది జరిగినా మంచికే జరుగుతుందని, మహాభారతం స్పష్టం చేస్తోంది.

మహాభారత యుద్ధం తరువాత, శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు, ఆమె కృష్ణుడిని శపించింది. కృష్ణుడి వంశం కూడా, తన వంశం నాశనమైన విధంగానే నాశనమవ్వాలని కోరుకుంది. కృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్నా, కృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని, ఆమె తన బాధను వెళ్ల గ్రక్కింది. కృష్ణుడు కేవలం ధర్మం వైపు నిలబడి, దానిని గెలిపించాడు.

ఇటువంటి అనేక అంశాలు, మహాభారతం నుండి మనం గ్రహించవలసిన జీవిత సత్యాలు. వీటి వెనకున్న అర్థాలను గ్రహిస్తే, ఆ వ్యక్తి జీవితం, ఎంతో బాగుంటుంది. ఎటువంటి మానసిక సంక్షోభాలకూ గురవ్వడు. జరిగేదంతా మంచికేనని అర్థం చేసుకుంటాడు. ప్రతివ్యక్తి లక్ష్యం, ధర్మాన్ని కాపాడటం అయి ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత:

Link: https://www.youtube.com/post/UgwCa7RQRaRYfvCz3yF4AaABCQ

25 November, 2020

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు!

 

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్‌!

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!!

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ సమయంలో, ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా? ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా, ఈ కోవిడ్ సమయంలో ప్రాణం విడిస్తే, కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ‘ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్రలో పట్టుమని, పదిమంది కూడా లేకుండానా?’ అని చాలామంది, మరింతగా కృంగిపోతూ ఉంటారు. అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి సమయాల్లో, ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం, క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.

ఎక్కడో ద్వారక.. దానికి చాలా దూరంలో తపోవనం.. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ, బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య, ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 

ఆ కార్యక్రమం ముగిశాక, అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని, వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు.. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాకూడదని కూడా అనుకున్నాడు. అర్జునిడితో పాటున్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే, అర్జునుడిని ఓదార్చారు. 

అప్పటికే శ్రీకృష్ణుడు, ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల, దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇప్పటి కరోనాలాగానే, అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది. ఆ విషయం మరో వీడియోలో తెలుసుకుందాము. 

సరిగ్గా అప్పుడే ద్వారక సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉండడంతో, ఇక ఆ జీవం లేని దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక, అక్కడే, అర్జునుడొక్కడే, అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి, అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప, ఇంకెవ్వరూ లేరు. 

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి, ఇద్దరు కొడుకులున్నా, వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలూ, ఊరటలూ, మార్గనిర్దేశకాలూ అవుతాయనడానికి, ఇదొక ఉదాహరణ. 

మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు, ఎవరికి, ఎలా నిర్ణయిస్తుందో, ఎవరూ చెప్పలేరు. అంతా దైవేఛ్ఛగా భావించి, ముందుకు సాగిపోతూ ఉండడమే. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgzIvT0iVN-GvHBdjON4AaABCQ