Ads

Showing posts with label మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం. Show all posts
Showing posts with label మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం. Show all posts

25 April, 2022

హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!

 


హిమాలయాలకు ఉత్తర భాగాన ఉన్న గుప్త నిధి రహస్యాన్ని తెలియజేసిన సంవర్తనుడు!


మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! రెండవ భాగం - భీష్ముడి విషయంలో చింతిస్తున్న ధర్మరాజుకు, అశ్వమేధ యాగం చేసి, దాన ధర్మాలు చేయమని హితవు చెప్పాడు, వ్యాసుడు. అందుకు కావాల్సిన సంపద, నిధి రూపంలో ఉందనీ, దానిని చేజిక్కించుకోమనీ సలహా ఇచ్చి, మరుత్తు మహారాజు కథనూ, బృహస్పతి అతనిని అవమానించడం, నారదుడి సలహా మేరకు, సంవర్తనుడిని కలిసి యాగానికి ఉపద్రష్టగా ఉండమని వేడుకోవడం, మన గత వీడియోలో తెలుసుకున్నాము. ఇక ఈ రోజుటి మన వీడియోలో, సంవర్తునుడు విధించిన షరతు ఏంటి? అందుకు మరుత్తు ఒప్పుకున్నాడా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి విషయాలను, తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/SpDeK1UDtbg ]

సంవర్తునుడు పెట్టిన షరతు ఏంటంటే, ఏకారణం చేతనూ, యాగం భగ్నం కాకూడదు. నీ యాగానికి ఉపద్రష్టగా వ్యవహరిస్తున్నానని నా అన్నకు తెలిస్తే, అతడు నీపై గల ద్వేషంతో, యజ్ఞమునకు భంగం కలిగిస్తాడు. ఒకవేళ, అలా జరిగినా, ‘నేను నిన్ను శపిస్తాను’ అని హెచ్చరించి, కార్యమును జాగ్రత్తగా నిర్వహించమని, సూచించాడు. అందుకు మరుత్తు, 'నాకు మీ కృప లభించింది. నాకిక విచారములేదు. దేవేంద్రుడూ, ఇంద్రుడే కాదు, పరమేశ్వరుడే అడ్డువచ్చినా, నేనిక చలించను. నేను నా ప్రయత్నంలో విఫలమైతే, సూర్యుడూ, చంద్రుడూ ఉన్నంత కాలం, నాకు పుణ్యలోకాలు ఉండవు' అంటూ శపధం చేశాడు. అయితే సంవర్తనుడు, మహేంద్రుడి కంటే ధనవంతుడిని చేసి, తన చేత యాగం చేయిస్తానంటూ మరుత్తుకు మాట ఇచ్చాడు. అంత సంపద ఎలా సాధ్యం అని అడగగా, ‘హిమాలయాలకు ఉత్తరభాగాన, ముంజవంతం అనే పర్వతం ఉంది. అక్కడ శివుడు, పార్వతితో కలసి, దేవతలూ, సిద్ధులూ, గరుడులూ, గంధర్వులూ మొదలైన వారితో చేరి, విహరిస్తుంటారు. అక్కడ ఆకలి దప్పులూ, రోగాలూ మొదలైనవి ఉండవు. ఆ పర్వతం మీద అనేక బంగారు కొండలూ, బంగారుమయమైన ఇసుకా, పుష్కలంగా లభిస్తుంది. మనం అక్కడకు పోయి, శివపార్వతులను ప్రార్ధించి, వారి కరుణతో, బంగారు రాళ్ళనూ, ఇసుకనూ తీసుకు వద్దాం, నీవు సేవకులను సిద్ధం చేసుకో. ఎంతమందిని అక్కడకు తీసుకువెళితే, అంత సంపదను తెచ్చుకోవచ్చు’ అంటూ, తన ఆలోచనను మరుత్తుకు తెలియజేశాడు.

సంవర్తనుడి ఆజ్ఞ ప్రకారమే, మరుత్తు తన సైన్యంతో వెళ్లి, పార్వతీ, పరమేశ్వరులను ప్రార్ధించి, వారి కరుణతో అంతు లేని సంపదలను తీసుకుని, నగరానికి వచ్చాడు. ఆవిధంగా, మరుత్తు ధనవంతుడై, యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించి, మహా వైభవంగా యజ్ఞం ప్రారంభించాడు. ఈ సంగతి తెలుసుకున్న బృహస్పతి, తనలో తాను కృంగి కృశించి పోయాడు. దేవేంద్రుడు అది గమనించి, 'దేవతలకు గురువైన మీరిలా ఎందుకు శోకిస్తున్నారు? ఇందుకు కారణమైన వారెవరో చెప్పినట్లైన, వారిని నేను కఠినంగా శిక్షిస్తాను' అని అన్నాడు. అప్పుడు బృహస్పతి, జరిగిన విషయాన్నీ, మరుత్తు యాగానికి తన విరోధి అయిన సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న సంగతినీ, తెలియజేశాడు. అతడు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తున్నందుకు, నా మనస్సు చాలా చింతిస్తోంది. అతడిని ఎలాగైనా ఉపద్రష్టగా ఉండకుండా నిరోధించాలి! అని ఇంద్రుడితో వాపోయాడు. వెంటనే అగ్నిని పిలిపించి, ‘నీవు ఎలాగైనా మరుత్తును, ఆ యజ్ఞమునకు బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచమని, నా మాటగా చెప్పి, అతను అంగీకరించేలా చేయాలి’ అని అన్నాడు. ఇంద్రుడి మాట ప్రకారం, తన నిజస్వరూపంతో మరుత్తు దగ్గరకు వెళ్లగా, అతడు అగ్ని దేవుడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి, సత్కరించాడు. అప్పుడు అగ్నిదేవుడు తన రాక వెనుక దాగిన మర్మాన్ని వివరించాడు. తాను దేవేంద్రుడి దూతగా వచ్చానంటూ, 'బృహస్పతి, నీ యజ్ఞానికి యాజకత్వం వహించడానికి అంగీకరించాడు. అందువలన, నీవు మానుష్యత్వం వీడి, దైవత్వం పొందవచ్చు. కనుక నీవు బృహస్పతిని యాజకుడిగా చేసి, యజ్ఞము నిర్వహించు' అని చెప్పాడు.

అందుకు మరుత్తు వినయంగా, దేవ గురువు బృహస్పతికి శతకోటి నమస్కారాలు చేసి, ‘నేను చేయబోవు యజ్ఞానికి యాజకుడిగా ఉండమని చెప్పినప్పుడు, ఆయన నన్ను మానవుడనని చులకన చేసి, నిరాకరించాడు. నేను తరువాత కష్టపడి, బృహస్పతి తమ్ముడిని అతి ప్రయాసతో, నా యజ్ఞానికి యాజకుడిగా ఉండడానికి సమ్మతింపచేసి, యజ్ఞముకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాను. ఈ యాగానికి సంవర్తనుడు సమర్ధుడని నమ్ముతున్నాను’ అంటూ సమాధానమిచ్చాడు. మరుత్తుని ఒత్తిడి చేస్తున్న అగ్ని దేవుడి మాటలను సావధానంగా విన్న సంవర్తనుడు ఇక సహించలేక, 'అగ్నిదేవా! నీవింకా ఇలా మాట్లాడుతుంటే, నేను నిన్ను, నా కంటి చూపుతో కాల్చివేస్తాను' అని అరిచాడు. ఆ మాటలకు అగ్నిదేవుడు భయపడి, దేవేంద్రుని వద్దకు తిరిగి వెళ్ళిపోయాడు. మరుత్తు తన మాటలకు ప్రభావితం కాలేదనీ, అతనిని బలవంత పెట్టడానికి ప్రయత్నించడం చూసిన సంవర్తనుడు ఆగ్రహించి, నన్ను భస్మం చేస్తానని హెచ్చరించాడనీ చెప్పాడు.

ఇంద్రుడు అగ్ని దేవుడితో, 'నీవు తిరిగి వెళ్ళి మరుత్తును ఎలాగైనా, నయానో, భయానో, బృహస్పతి యాజకత్వానికి ఒప్పించు. అలా ఒప్పుకోక పోతే, నా వజ్రాయుధాన్ని ప్రయోగించి, అతడిని యమ సదనానికి పంపుతానని బెదిరించు' అని చెప్పాడు. 'దేవేంద్రా! నాకు తిరిగి వెళ్ళాలంటే భయంగా ఉంది. సంవర్తనుడు నన్ను భస్మం చేస్తాడని భయపడుతున్నాను. కనుక నా బదులుగా వేరెవరినైనా పంపు' అని అన్నాడు. ఇక గత్యతరం లేక అగ్ని దేవుడిని వదిలి, ధృతరాష్ట్రుడనే గంధర్వుడిని, మరుత్తు వద్దకు పంపాడు. అయితే, ముందుగా జరిగిన విషయమేదీ, గంధర్వుడైన ధృతరాష్ట్రుడికి తెలియదు. ఇంద్రుడి మాట ప్రకారం, మరుత్తుతో సంవర్తనుడి ముందు, తాను వచ్చిన పనిని వివరించాడు. 'నీ యాగమునకు బృహస్పతిని యాజకుడిగా నియమించు. లేకపోతే తన వజ్రాయుధాన్ని నీ పై ప్రయోగించగలడు' అని హెచ్చరించాడు. అయితే, బృహస్పతి అన్న మాటలూ, తరువాత జరిగిన పరిణామాలూ మరుత్తు వివరిస్తుండగానే, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం, అతని వైపుకు దూసుకు వచ్చింది. దానిని చూపిస్తూ ధృతరాష్ట్రుడు, 'రాజా! అటుచూడు. వజ్రాయుధం నీ మీదకు దూసుకు వస్తోంది. దానిని ఎలా ఎదుర్కుంటావో, నీ ఇష్టం' అంటూ బెదిరించసాగాడు. ఇంతలో తన వైపుకు వస్తున్న వజ్రాయుధాన్ని చూసి, ‘నన్ను ఈ వజ్రాయుధం బారి నుండి రక్షించండి’ అంటూ సంవర్తనుడిని వేడుకున్నాడు. అప్పుడు సంవర్తనుడు చిరునవ్వు నవ్వి, 'నీవు భయపడకు. నా దగ్గరున్న సంస్థంభన విద్యతో, వజ్రాయుధాన్ని తిప్పికొడతాను. ఒక్క వజ్రాయుధాన్నే కాదు. దేవతలు ప్రయోగించే ఏ ఆయుధాన్నైనా, నేను నా విద్యతో తిప్పికొట్టగలను. నీవిక వజ్రాయుధాన్ని గురించి మరచిపో.

ఇంద్రుడి మాటకు ఎదురితిరిగి మరీ నా చేత యాగం జరిపిస్తున్నందుకు, చాలా సంతోషిస్తున్నాను. నీవు ఏదైనా వరం కోరుకోమని అన్నాడు సంవర్తనుడు. అప్పుడు మరుత్తు, 'మీరుండగా నాకు ఇంద్రుడి వలన భయంలేదు. మీ తపోశక్తితో, ఇంద్రుడికి నా మీదున్న కోపమును పోగొట్టి, దేవేంద్రుడు దిక్పాలకాది దేవతలతో యజ్ఞానికి విచ్చేసి, నేను సమర్పించు హవ్యమును స్వీకరించేటట్లుజేసి, నాకు పుణ్యలోకప్రాప్తి కలిగించండి' అంటూ కోరుకున్నాడు. అందుకు సంవర్తనుడు, నా ఆహ్వానం మీద దేవేంద్రుడు, సోమపానం చేయడానికి వస్తాడు. అతడితో దేవతలందరూ వస్తారు. ఇక నీవు యజ్ఞాన్ని మొదలు పెట్టు. అని భరోసా ఇచ్చాడు. ఇంద్రుడు పంపిన వజ్రాయుధాన్ని తన శక్తితో ఆపి, దానిని తిరిగి పంపించాడు. ధృతరాష్ట్రుడిని కూడా సగౌరవంగా పంపించాడు. తరువాత సంవర్తనుడు, దేవతలను ఆవాహన చేసి ఆహ్వానించాడు. దేవతలు సంవర్తనుడి ఆహ్వానం అందుకుని, యజ్ఞానికి విచ్చేశారు. మరుత్తు సంవర్తనుడి ఆజ్ఞమీద దేవేంద్రాది దేవతలను సగౌరవంగా ఆహ్వానించి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి, సత్కరించాడు. వారికి ఆసనాలు సమర్పించి, చేతులు జోడించి, 'నా ఆహ్వానాన్ని మన్నించి, నీవు దేవతలతో నా గృహమునకు విచ్చేసి, నా జన్మసఫలం చేశావు.  ఈ మహాత్ముడు బృహస్పతికి స్వయానా తమ్ముడు. మహా తపస్వి. నా అభ్యర్ధన మన్నించి, నేను చేస్తున్న యజ్ఞానికి యాజకత్వం వహిస్తున్నాడు. దయా సాగరా.. నా యందు కోపం మానుకుని కరుణించి, నన్ను చల్లగా చూడు' అంటూ దేవేంద్రుడిని అర్థించాడు. ఇంద్రుడు కరిగిపోయి, 'నీ వలన నేను ప్రీతి చెందాను మరుత్తు మహారాజా. బృహస్పతికి తమ్ముడైన ఈ సంవర్తనుడు, మహిమాన్వితుడని చెప్పడంలో, సందేహమేముంది' అంటూ చిరనవ్వు నవ్వాడు.

ఆ మాటలకు సంవర్తనుడు, 'దేవేంద్రా ! నేను పిలువగానే యజ్ఞముకు విచ్చేయడం, నా తపః ఫలం కాక మరేమిటి? మీ రాకతో మరుత్తు చేస్తున్న ఈ క్రతువు పుణ్యాల రాశి అయింది. కరుణాతరంగా! నీ దయ నా మీద ప్రసరింప చేస్తే, ఈ యజ్ఞము మంత్ర లోపం లేకుండా, నిర్వహిస్తాను. నీవు దయతో వీక్షించు. నీ రాకతో మరుత్తు పుణ్యలోక అర్హతను పొందాడు' అంటూ దేవేంద్రుడిని స్తుతించాడు. సంవర్తనుడి ప్రశంశలకు మహదానంద భరితుడైన దేవేంద్రుడు, ‘ఈ యజ్ఞవాటికను ఉదాత్తంగా తీర్చిదిద్దండి. గంధర్వులనూ, అప్సరసలనూ పిలిచి, నృత్య-సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. ఈ యజ్ఞము నిర్విఘ్నంగా జరిగేలా, ఏర్పాట్లు చేయండి’ అని దేవతలను ఆజ్ఞాపించాడు. అలా ఇంద్రుడి సహకారంతో, సంవర్తనుడు యజ్ఞమును చక్కగా నిర్వహించి, దేవతలకు సోమపానం అందించాడు. దేవతలంతా సోమపానం స్వీకరించి, సంతుష్టులయ్యారు. వారంతా మరుత్తు వీడ్కోలందుకుని, స్వర్గలోకం చేరారు. దేవతలు యజ్ఞమునకు వచ్చి, సోమరసపానము చేసి వెళ్ళిన తరువాత కూడా, యజ్ఞము కొనసాగింది. యాగము పూర్తికాగానే, మరుత్తు బ్రాహ్మణులకు అపారంగా దాన ధర్మాలు చేశాడు. అంతేకాక, ఆ యజ్ఞ నిర్వహణకు వాడిన బంగారు పాత్రలూ, కలశములు కూడా, బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. తరువాత సంవర్తనుడి ఆజ్ఞ మేరకు, జనరంజకంగా పాలన సాగించాడు మరుత్తు. కానీ, బ్రాహ్మణులకు ఒక చిక్కువచ్చి పడింది. వారు దానంగా పొందిన బంగారమును మోసుకు వెళ్ళ లేక, వారి జీవనముకు కావలసినంత బంగారము మాత్రం వెంట తీసుకుని, మిగిలినది బంగారు కలశాలలో భద్రపరచి, 'ఈ నిధిని భవిష్యత్తులో ఎవరు కనుక్కుంటారో, వారికి ఈ నిధి సొంతమవుతుంది' అని శాసనం వ్రాసిపెట్టి, వెళ్లారు.

కాబట్టి ధర్మనందనా! 'నీవు ఆ నిధిని స్వాధీన పరచుకుని, అశ్వమేధ యాగమును నిర్వహించు. అది పార్వతీ పరమేశ్వరుల కరుణ ద్వారా లభించిన సంపద' అని వ్యాసుడు, జరిగిన గాధను వివరించాడు. అయితే, వ్యాసుడు అశ్వమేధ యజ్ఞానికి కావలసిన ధనము సమకూర్చుకునే మార్గం చెప్పినా, ధర్మరాజుకు శోకము తగ్గ లేదు. అది చూసిన శ్రీకృష్ణుడు, 'ధర్మజా! ఏపని అయినా, నిశ్చింతగా, నిర్మలంగా చెయ్యాలి కానీ, ఇలా చింతించడం తగదు. ఇప్పటివరకు బోధించిన జ్ఞానం ఏమైంది? నీకింకా, కామ, క్రోధ, మద, మాత్సర్య, మోహాలు తగ్గినట్లు లేదు. ఇక నీ ఆలోచనలు కట్టి పెట్టి, యాగ నిర్వహణ చేపట్టు' అని హితబోధ చేశాడు. ఆ విధంగా బ్రాహ్మణులు దాచి పెట్టిన నిధిని చేజిక్కించుకుని, అశ్వమేధ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాడు, ధర్మనందనుడు.

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

18 April, 2022

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం.. Mahabharatam

 

మరుత్తు తలపెట్టిన అశ్వమేధ యాగం! మొదటి భాగం..

భీష్మ నిర్యాణానంతరం విరాగిగా మారిన ధర్మరాజుకు వ్యాసుడు చెప్పిన నిధి రహస్యం!

మహాభారత యుద్ధానంతరం భీష్ముని నిష్క్రమణ, ధర్మరాజును మరింత క్షోభకు గురిచేసింది. చిన్నప్పటి నుండీ చేరదీసి, మంచి బుద్ధులు నేర్పి, ఆయన మరణానికి కారణం తానే అని తెలిసినా, తనను మన్నించి, అడిగిన ధర్మ సందేహాలన్నింటినీ తీర్చిన భీష్ముడు తనువు చాలించడం, ధర్మరాజు మనస్సును కలచి వేసింది. ఆ మనో వేదనతో, ధర్మరాజు వనవాసానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. అందుకు వ్యాసుడు ఆగ్రహించి, తాను చేయవలసిన కార్యం గురించి వివరించాడు. అశ్వమేధ యాగం చేసి, బ్రాహ్మణులకు ఘనంగా దాన ధర్మాలు చేసినట్లయితే, కొంత దు:ఖం తీరుతుందని, హితవు పలికాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yJxaUbjfopE ]

అయితే, యాగానికి సరిపడా ధనం ధర్మరాజు దగ్గర లేదు. అప్పటికే కురుక్షేత్ర యుద్ధంలో, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాజ్యంలో కేవలం స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారిని హింసించి, పన్నులు వేసి, అలా వచ్చిన డబ్బుతో యాగం చేయడం, యుధిష్టురుడికి నచ్చలేదు. అప్పుడు వ్యాసుడు ఒక నిధి గురించి వివరించి, దానిని సొంతం చేసుకుంటే, యాగం అత్యంత ఘనంగా చేయవచ్చని సూచించాడు. వెంటనే ధర్మరాజు, ఆ నిధి సక్రమ సంపాదనా, లేక అక్రమ సంపాదనా? అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. అప్పుడు వ్యాసుడు, ఆ నిధి వెనుక దాగిన కథను వివరించాడు. అపార సంపదతో నిండిన ఆ నిధి ఎవరిది? అది ఎలా సంపాదించారు? అసలు అంత నిధి ఎందుకు దాచారు - వంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

కృతయుగంలో, మనువుకు ప్రజాని అనే కుమారుడుండేవాడు. అతడి కుమారుడు క్షుతుడు. క్షుతుని కుమారుడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు, నూరుగురు కుమారులు. వారిలో పెద్దవాడు, వింశుడు. వింశుని కుమారుడు వివంశుడు. వివంశుడికి 15 మంది కుమారులు. వారిలో పెద్ద వాడు ఖనీనేత్రుడు. అతడు అధికమైన బల శౌర్యములు కలవాడు. కానీ, పరమదుర్మార్గుడు. అతడు తన 14 మంది తమ్ములను చంపి, రాజ్యాధికారమును చేజిక్కించుకున్నాడు. ఖనీనేత్రుడు ఎవరినీ నమ్మేవాడు కాదు. ప్రజలను ద్వేషించే వాడు. అతడి ఆగడాలను సహించలేని మంత్రులు, అతడిని పదవీచ్యుతుడిని చేసి, అతడి కుమారుడైన కరంధముడికి పట్టంకట్టారు. అతడు ఎంతో దయామయుడు. ధర్మాన్ని పాటిస్తూ, సదా సత్యమునే పలికే వాడు. కరంధముడు, ఉన్నదంతా దాన ధర్మములు చేసి, చివరకు దరిద్రుడయ్యాడు. కోశాగారంలో ధనములేక, సైన్యములకు జీతభత్యములు కూడా ఇవ్వలేని పరిస్థితి, నెలకొంది. సైన్యము క్షీణించింది.

అది తెలుసుకున్న శత్రురాజులు, రాజ్యము మీద దండెత్తివచ్చి, అతడిని రాజ్యభ్రష్టుడిని చేశారు. చివరకు అడవుల పాలయ్యాడు. కానీ, కరంధముడు ఏ మాత్రం చింతించకుండా, నియమ నిష్ఠలతో తపస్సు చేయనారంభించాడు. అప్పుడొక అద్భుతం జరిగి, అతడి తపోఫలముగా, అపారమైన సైన్యం ఉద్భవించింది. ఆ సైన్యంతో వెళ్ళి, శత్రువులను జయించి, తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు. ఆ రాజ్యాన్ని ధర్మనిష్ఠతోనూ, సత్యవాక్పరిపాలనతోనూ, జనరంజకంగా పాలన చేశాడు కరంధముడు. అతడు అంగీరసుడిని ఉపద్రష్టగా పెట్టుకుని, అనేక యజ్ఞయాగములు చేశాడు. ఆ పుణ్యఫలాల చేత, కరంధముడు సశరీరంగా స్వర్గలోకానికి చేరాడు. కరంధముడి కుమారుడు అవిక్షత్తు కూడా, తండ్రి వలె ప్రజలను కన్న బిడ్డలలాగా పాలించాడు. తదనంతరం, అవిక్షత్తు కుమారుడైన మరుత్తు కూడా, తాత, తండ్రి మాదిరిగా, ఎన్నో యజ్ఞ యాగాలు చేశాడు.  మరుత్తు ధర్మతత్పరుడూ, కీర్తిమంతుడూ, మహాబలవంతుడూ, తేజస్సు కలిగిన వాడూ, వేదవేదాంగ పారంగతుడు. తాను చేసే యాగాలకు ఉపద్రష్టగా, ఇంద్రునకు బదులుగా, బృహస్పతిని ఆహ్వానించేవాడు.

ఒకనాడు ఇంద్రుడు అసూయతో బృహస్పతి చెంతకు వెళ్ళి, 'మరుత్తు తాను చేయబోవు యజ్ఞమునకు మిమ్ము ఆహ్వానిస్తున్నాడు. దేవగురువైన మీరు, ఒక మానవుడు చేయు యజ్ఞానికి ఉపద్రష్టగా వ్యవహరించడం, అవమానం కదా! కనుక మీరు అతడి యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండాలనుకుంటే, నన్ను మరచిపోయి, అతడి దగ్గరే ఉండండి. లేదంటే అది మానుకుని, ఇక్కడే ఉండండి' అని అన్నాడు. అందుకు బృహస్పతి కంగారుపడి, 'దేవేంద్రా! నాకు మీరే కావాలి. నేను మరొకరి యజ్ఞానికి ఎలా ఆధ్వర్యం వహించగలను. నేను మిమ్మల్ని వదలను' అన్నాడు. తరువాత మరుత్తు మరొక యాగానికి సిద్ధం చేసుకుని బృహస్పతి వద్దకు వెళ్ళి, 'మహాత్మా ! నేను అశ్వమేధ యాగం చెయ్యాలని తలపెట్టాను. మీరు దానికి ఉపద్రష్టగా ఉండి, యజ్ఞాన్ని నిర్వహించండి. తమరు అంగీకరిస్తారని, నేను అన్నీ ఏర్పాట్లూ చేశాను' అని చెప్పాడు. అప్పుడు బృహస్పతి జరిగిన విషయాన్ని దాచి,  మరుత్తుతో, 'నేను రాలేను.. దానికొక కారణం ఉంది. అదే సమయంలో ఇంద్రుడు ఒక యజ్ఞము చేయ తలపెట్టాడు. దానికి నేను ఉపద్రష్టగా ఉండి, యజ్ఞ నిర్వహణ చేయాలి' అని సున్నితంగా తిరస్కరించాడు.

దానికి మరుత్తు చిన్నబుచ్చుకుని, 'అలా అంటే ఎలా మహాత్మా! మా తాతగారైన కరంధముడికి, మీ తండ్రి గారైన అంగీరసుడు ఉపద్రష్టగా ఉండి, అనేక యజ్ఞయాగాదులు చేయించారు. అలాగే మీరు కూడా ఉపద్రష్టగా ఉండి, ఎలాగైనా నేను చేయతలపెట్టిన యజ్ఞాన్ని నిర్విజ్ఞంగా జరిగేలా చూడండి' అంటూ అర్ధించాడు. అందుకు బృహస్పతి, 'మరుత్తు మహారాజా! నేను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞము చేయిస్తాను. కనుక మానవుడవయిన నీకు, ఉపద్రష్టగా ఉండలేను. నీవు వేరే ఉపద్రష్టను నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అంటూ నచ్చచెప్పాడు. ఇక మరుత్తు ఏం మాట్లాడకుండా, అవమాన భారంతో వెనుదిరిగాడు. మార్గ మధ్యంలో నారదుడు కనిపించి, 'మహారాజా! ఎక్కడి నుండి వస్తున్నావు? ఏ పనిమీద వెళుతున్నావు?' అని అడిగాడు. అందుకు మరుత్తు, 'నారద మహర్షీ! నేను తలపెట్టిన అశ్వమేధయాగానికి ఉపద్రష్టగా ఉండమని అడగడానికి, బృహస్పతి వద్దకు వెళ్ళి అర్ధించాను. అందుకతడు, తాను దేవతలకు ఉపద్రష్టగా ఉండి యజ్ఞ నిర్వహణ చేస్తుంటాననీ, అందువలన మానవుడనైన నాకు, ఉపద్రష్టగా ఉండలేనని నిరాకరించాడు. నేను అవమాన భారంతో తిరిగి వెళుతున్నాను.

ఇంత అవమానం మోస్తూ బ్రతికి ఉండడం అవసరమా?' అని పలికాడు. నిరాశలో ఉన్న మరుత్తుతో నారదుడు, 'బృహస్పతి కాకుంటే మరొకరు దొరకరా! అంగీరసుడి చిన్న కుమారుడైన సంవర్తనుడిని, అతడి అన్న అయిన బృహస్పతి అవమానించి, ఇంటి నుండి తరిమివేయగా, అతడు విరాగిగా, దిగంబరంగా, అడవుల వెంట తిరుగుతున్నాడు. నీవు ఎలాగైనా అతడిని అర్ధించి, నీ యజ్ఞానికి ఉపద్రష్టగా నియమించుకుని, యజ్ఞమును నిర్వహించుము' అని సలహా ఇచ్చాడు. ఆ మాటలకు మరుత్తు సంతోషించి, సరైన సమయంలో సలహా ఇచ్చి, తనను ఆదుకున్నందున్నకు నారదుడిని స్తుతించాడు. ఆ సంవర్తనుడు ఎక్కడ ఉంటాడో, అతడిని ఎలా తీసుకు రావాలా? అని ఆలోచిస్తుండగా, నారదుడు, ‘సంవర్తనుడు కాశీ పట్టణంలో పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. అతడిని గుర్తించాలంటే, నీవొక పని చేయాలి. నీవు ఒక శవమును పెట్టుకుని, కాశీనగర ముఖద్వారంవద్ద నిలబడి ఉండు. ఆ శవమును చూసి ఎవరు పారిపోతారో, అతడే సంవర్తనుడని తెలుసుకో. నీవు అతడిని వెంబడించి, ఏకాంత సమయం చూసి, భక్తితో ప్రార్ధించి, నీ యాగమునకు ఉపద్రష్టగా ఉండమని అడుగు. అతడు తనను గురించి నీకు ఎవరు చెప్పారు? అని ఆడిగినప్పుడు, నా పేరు తెలియజేయుము. నేను ఎక్కడున్నానని అడిగితే, నాకు మీ సంగతి చెప్పి, అగ్ని ప్రవేశం చేశాడని అతనితో చెప్పు’ అని మరుత్తుకు సలహా ఇచ్చాడు, నారదుడు.

వెంటనే మరుత్తు, సంవర్తనుడి కొరకు కాశీపట్టణం వెళ్ళాడు. ఒక శవమును పెట్టుకుని, నగరముఖద్వారం వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడకు ఒక వెర్రి వాడు వచ్చి, ఆ శవాన్ని చూసి, దెబ్బతిన్న జంతువులా పరిగెత్తసాగాడు. అతడే సంవర్తనుడని తెలుసుకున్న మరుత్తు, అతడిని వెంబడించి కొంతదూరం వెళ్ళి, అతడి ఎదురుగా నిలిచాడు. ఆ వెర్రివాడు మరుత్తు మీద దుమ్మెత్తి పోసి, అతడి మీద ఊసి, వెర్రిగా ప్రవర్తించాడు. మరుత్తు ఆ సంఘటనలకు కోపించక, అతడిని వెంబడించాడు. నిర్జన ప్రదేశానికి చేరుకున్న ఆ వెర్రివాడు, ఒక వటవృక్షం కింద కూర్చున్నాడు. మరుత్తు అతడికి సాష్టాంగ నమస్కారం చేసి, వినయంగా నిలిచాడు. అప్పుడు సంవర్తనుడు, 'ఎవరు నువ్వు? నిన్ను ఎవరు పంపారు?' అని అడిగాడు. అప్పుడు మరుత్తు, 'నారదుడు మీ గురించి తెలియజేశాడు' అని సమాధానమివ్వగా, ‘ఇప్పుడు నారదుడు ఎక్కడున్నాడు?’ అని సంవర్తనుడు ఆగ్రహంతో ప్రశ్నించాడు. ‘మీ గురించి తెలియజేసి, వెంటనే అగ్ని ప్రవేశం చేశాడు నారదుడు’ అని బదులిచ్చాడు మరుత్తు.

దాంతో శాంతించిన సంవర్తనుడు, 'నీవు నా దగ్గరకు ఎందుకు వచ్చావు? నాతో ఏం పని?' అని ప్రశ్నించాడు. అందుకు మరుత్తు, ‘మహాత్మా! మీరు నేను చేయబోయే యజ్ఞమునకు ఉపద్రష్టగా ఉండి, యజ్ఞమును పూర్తిచేయండి’ అని అర్ధిస్తూ, తన గురించి వివరించాడు. మరుత్తు గురించీ, అతని తాత, తండ్రుల గురించీ తెలుసుకున్న సంవర్తునుడు, అతనిని ప్రీతితో చూస్తూ, నేను మా అన్న బృహస్పతి చేత అవమానించబడి, నా ఇంటినీ, సంపదనూ, అన్ననూ వదిలి, ఇలా అడవుల వెంట విరాగిగా తిరుగుతున్నాను. నాబోటి పేదవాడు, నీకు ఉపద్రష్టగా ఉంటే, నీకు ఏ గౌరవం ఉంటుంది? కనుక బృహస్పతిని ఉపద్రష్టగా ఉంచుకుని, యాగమును పూర్తి చేసుకో. అలా కాకుండా, నన్నే ఉపద్రష్టగా చేసుకోవాలంటే, నీవు మా అన్నవద్ద అనుమతి తీసుకోవాలి. నాకు మా అన్న అంటే విపరీతమైన గౌరవం ఉంది’ అని అన్నాడు. అందుకు మరుత్తు, 'నేను మీ వద్దకు వచ్చే పూర్వమే, మీ అన్నను ఉపద్రష్టగా ఉండమని కోరాను. కానీ అతడు నన్ను అవమానిస్తూ, దేవతలకు ఉపద్రష్టగా ఉన్న నేను, మానవులకు ఉపద్రష్టగా ఉండలేనని, నన్ను తిప్పి పంపాడు. ఇప్పుడు నేను తిరిగి బృహస్పతి వద్దకు ఎలా వెళ్ళగలను?' అని సావధానంగా పలికాడు. ఇక మరుత్తు మాటలకు సంవర్తనుడు అంగీకరించి, ఉపద్రష్టగా ఉండి, యాగము చేయించడానికి ఒప్పుకున్నాడు. అయితే, అతడు ఒక షరతు విధించాడు.

మరి ఆ షరతుకు మరుత్తు ఒప్పుకున్నాడా? సంవర్తనుడు ఉపద్రష్టగా ఉన్న యాగాన్ని ఆపడానికి ఎవరు ప్రయత్నించారు? మరుత్తు యాగంలో సోమ పానం తీసుకోవడానికి, దేవతలు వచ్చారా? యజ్ఞ వాటిక మొదలు, సమస్త సామగ్రినీ బంగారముతో చేయించిన మరుత్తుకు, అంత సంపద ఎక్కడి నుండి వచ్చింది? మరుత్తు యాగం పూర్తయ్యిందా? అనేటటువంటి ఆసక్తికర విషయాలను, మన తరువాయి భాగంలో తెలుసుకుందాము..