Ads

25 November, 2020

విధి లిఖితం విష్ణువు నైనా విడిచిపెట్టదు!

 

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్‌!

దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‌!!

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/q7OQVyx4sU4 ]

రోజూ ఎన్నో మరణాలు సంభవిస్తుంటాయి. కోవిడ్ సమయంలో, ఇతర మరణాలు ఆగకుండా ఉండవు కదా? ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత బలగం ఉన్న మనిషి అయినా, ఎంత కీర్తిమంతుడైనా, సినీ ప్రముఖుడైనా, రాజకీయ నాయకుడైనా, ఈ కోవిడ్ సమయంలో ప్రాణం విడిస్తే, కుటుంబ సభ్యులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ‘ఈ సమయంలో ఇలా ఏమిటి? అంతిమయాత్రలో పట్టుమని, పదిమంది కూడా లేకుండానా?’ అని చాలామంది, మరింతగా కృంగిపోతూ ఉంటారు. అంతేకాదు.. కొందరికి ఉన్న కొడుకులు, కూతుళ్లు అందరూ విదేశాల్లో ఉన్నవారు ఉన్నారు. ఇటువంటి సమయాల్లో, ఏం జరిగా ఎవ్వరూ రాలేని పరిస్థితి. వారందరి కోసం "మహాభారతం" మౌసలపర్వంలోని శ్రీకృష్ణుని అంత్యక్రియల విషయం, క్లుప్తంగా ఒక్కసారి చెప్పుకోవాల్సిన సందర్భం ఇది.

ఎక్కడో ద్వారక.. దానికి చాలా దూరంలో తపోవనం.. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.. అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ, బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య, ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు. 

ఆ కార్యక్రమం ముగిశాక, అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త నెమ్మదిగా చెప్పాలని, వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం దాకా ప్రయాణమై వచ్చాడు. వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు.. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలిపోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాకూడదని కూడా అనుకున్నాడు. అర్జునిడితో పాటున్న రథసారధి, ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే, అర్జునుడిని ఓదార్చారు. 

అప్పటికే శ్రీకృష్ణుడు, ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల, దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇప్పటి కరోనాలాగానే, అప్పుడు యాదవుల వినాశనానికి ముసలం పుట్టింది. ఆ విషయం మరో వీడియోలో తెలుసుకుందాము. 

సరిగ్గా అప్పుడే ద్వారక సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉండడంతో, ఇక ఆ జీవం లేని దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక, అక్కడే, అర్జునుడొక్కడే, అరగంటలో అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా.

అష్టభార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి, అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప, ఇంకెవ్వరూ లేరు. 

శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి, ఇద్దరు కొడుకులున్నా, వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.

అంతటి ఇతహాసపురుషులకే అటువంటి అంతిమఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలూ, ఊరటలూ, మార్గనిర్దేశకాలూ అవుతాయనడానికి, ఇదొక ఉదాహరణ. 

మనమంతా కూడా కాలంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు, ఎవరికి, ఎలా నిర్ణయిస్తుందో, ఎవరూ చెప్పలేరు. అంతా దైవేఛ్ఛగా భావించి, ముందుకు సాగిపోతూ ఉండడమే. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgzIvT0iVN-GvHBdjON4AaABCQ

No comments: