Ads

25 November, 2020

కార్తీక పురాణం! (దశమాధ్యాయము - పదవ రోజు పారాయణము)

 

అజామీళుని పూర్వ జన్మ వృత్తాంతము:

జనకుడు వశిష్టుల వారిని గాంచి " ముని శ్రేష్ఠ ! యీ అజా మీళుడు యెవడు? వాడి పూర్వ జన్మ మెటువంటిది? పూర్వ జన్మంబున నెట్టి పాపములు చేసియుండెను? ఇప్పడీ విష్ణు దూతలు వైకుంటమునకు తీసుకొనిపోయిన తరువాత నేమి జరిగెను? వివరించ వలసినది " గాప్రార్ధించెను. అంత నా మునిశ్రేష్టుడు జనక మహారాజును గాంచి యిట్లు పలికెను.

జనకా! అజా మీ ళుని విష్ణు దూతలు వైకున్తమునకు తీసుకొనిపోయిన తరువాత యమ కింకరులు తమ ప్రభువగు యమ ధర్మ రాజు కదా కేగి, "ప్రభూ! తమ అజ్ఞ ప్రకారము అజా మీ ళుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణు దూతలు కూడా వచ్చి మాతో వాదించి, అజామీళుని విమాన మెక్కించి, వైకుంఠమునకు దీసుకొని పోయిరి. మేము చేయునది లేక, చాల విచారించుచూ యిచటకు వచ్చినారము' అని భయ కంపితులై విన్నవి౦చుకొనిరి.

"ఔరా! ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి యుండలేదే? దీనికి బలమైన కారణము ఏదైనా వుండి యుండవచ్చును" అని యముడు తన దివ్య దృష్టితో అజా మీళుని పూర్వ జన్మ వృ త్తాంతము తెలుసుకొని "ఓహొ! అది యా సంగతి! తన అవసాన కాలమున "నారాయణ" అని వైకుంఠవాసుని స్మరణ జేసి యుండెను. అందులకు గాను, విష్ణు దూతలు వచ్చి, వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని, తెలిసిగాని, మృత్యు సమయమున హరి నామ స్మరణమెవరు చేయుదురో, వారికి వైకుంఠప్రాప్తి తప్పక కలుగును. గనుక, అజా మీళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా!" అని అనుకొనెను.

అజా మీళుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు అపురూపమైన అందంచేతను, సిరి సంపదల చేతను, బలము చేతను, గర్విష్టియై శివారాధన చేయక, శివాలయము యొక్క ధనమునపహరించుచు, శివుని విగ్రహము వద్ద ధూప దీప నైవేద్యములను బెట్టక, దుష్ట సహవసములను మరిగి, విచ్చలవిడిగా తిరుగు చుండెడి వాడు. ఒక్కొక్క ప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరు౦డెడి వాడు. ఇతని కొక బిద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే, చేయునది లేక, ఆమె భర్త చూచియు చూడ నటుల నుండి, భిక్షాటనకై వురూరా తిరుగుచూ, ఏదో వేళకు యింటికి వచ్చి, కాలం గడుపుచు౦డెడి వాడు. ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి, పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన బెట్టుకొని వచ్చి, అలిసిపోయి, "నాకు యీ రొజున ఆకలి మిక్కుటముగానున్నది త్వరగా వంట చేసి పెట్టుము", అని భార్యతో ననెను. అందులకామె ఛీదరించుకోనుచు, నిర్లక్ష్యముతో, కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా యీయక, అతని వంక కన్నెత్తి యైననూ చూడక, విటునిపై మనస్సు గలదియై, మగని తూలనాడుట వలన, భర్తకు కోపం వచ్చి, అటనున్న కఱ్ఱతో బాదెను. 

అంత ఆమె భర్త చెతి నుండి కఱ్ఱ లాగుకొని, భర్తను రెండితలు కొట్టి, బైటకు త్రోసి తలుపులు వేసివేసెను. అతడు చేయునది లేక, భార్యపై విసుగు జనించుట వలన, ఇక యింటి ముఖము పట్ట రాదని తలపోసి, దేశాటనకు వెడలిపోయెను. భర్త యింటి నుండి వెడలి పోయెను కదా యని సంతోషించి, ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై, వీధి అరుగు పై కూర్చుండి యుండగా, ఒక చాకలి వాడు ఆ దారిని పోవుచుండెను. అతనిని పిలిచి "ఓయీ! నీవీ రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకు ర"మ్మని కొరెను. అంత నా చాకలి "తల్లి! నీవు బ్రాహ్మణ పడతివి. నేను నీచకులస్తుడను, చాకలి వాడిని. మీరీ విధముగ పిలుచుట యుక్తము గాదు. నేనిట్టి పాపపు పని చేయజాలను" అని బుద్ది చెప్పి, వెడలి పోయెను. ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు, లోలోన నవ్వుకొని, అచ్చటనుండి బయలుదేరి, ఆ గ్రామ శివార్చకుని కడకేగి, తన కామవా౦ఛ తీర్చమని పరి పరి విధముల బ్రతిమాలి, ఆ రాత్రంతయు అతనితో గడిపి, వుదయమున యింటికి వచ్చి, "అయ్యో! నేనెంతటి పాపమునకు ఒడి గట్టితిని? అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను యింటి నుండి వెడలగొట్టి, క్షణికమయిన కామవాంఛకు లోనయి, మహాపరాధము చేసితిని" అని పశ్చాత్తాపమొంది, ఒక కూలి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి, తన భర్తను వెదకి తీసుకు రావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత, భర్త యింటికి రాగా, పాదములపై బడి, తన తప్పులను క్షమించమని ప్రార్ధించెను. అప్పటి నుండి, మంచి నడవడిక నవలంభించి, భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. 

కొంత కాలమునకు శివర్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి, దిన దినము క్షీణి౦చుచు మరణించెను. అతడు రౌర వాది నరక కుపముల బడి, నానా బాధలు పొంది, మరల నర జన్మమెత్తి సత్య వ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై, కార్తీక మాసమున నది స్నానము చేసి, దేవత దర్శనము చేసి యుండుట వలన, నేడు జన్మముల పాపములు నశించుట చేత, అజా మీళుడై పుట్టెను. అప్పటికి తన అవసాన కాలమున 'నారాయణా ' అని శ్రీ హరిని స్మరించుట వలన, వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా, రోగ గ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాత నలనను భవించి, ఒక మాలవాని యింట జన్మించెను. ఆ మాలవాడు, ఆ పిల్ల జన్మ రాశి చూపించగా, తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడా శిశువును తీసుకొనిపోయి, అడవి యందు వదలి పెట్టేను. అంతలో నొక విప్రుడు ఆ దారిన పోవుచు, పిల్ల యేడుపు విని, జాలి కలిగి, తీసుకొని పోయి తన యింట దాసికిచ్చి పోషించెను. ఆ బాలికనే, అజామీళుడు ప్రేమించెను. వారి పూర్వ జన్మ వృత్తాంత మిదియే. నిర్మల మైన మనస్సుతో, శ్రీ హరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీ హరి కథలను ఆలకించుట, కార్తిక మాస స్నాన ప్రభావముల వలన, నెటువంటి వారైననూ మోక్షమొందగలరు. గాన, కార్తిక మాసము నందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారలిహపర సుఖములు పొందగలరు.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్య మందలి 'దశమాధ్యాయము - పదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgyMU4qjNm1zef77f-J4AaABCQ

No comments: