Ads

Showing posts with label Bhagavad Gita. Show all posts
Showing posts with label Bhagavad Gita. Show all posts

20 October, 2022

దుర్గుణము! భగవద్గీత Bhagavad Gita


దుర్గుణము! అదికూడా భగవంతుడి మహిమే అయితే దానికెందుకు తిరస్కారం?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (33 – 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 33 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bPRR1Z8dsUs ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:42 - అక్షరాణామకారోఽస్మి ద్వంద్వః సామసికస్య చ ।
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః ।। 33 ।।

అక్షరములలో అ-కారమునూ, సమాసములలో ద్వంద్వ సమాసమునూ, అపరిమితమైన కాలమునూ, మరియు సృష్టికర్తలలో బ్రహ్మనూ నేనే.

సంస్కృతములో అన్ని అక్షరములు కూడా, సగం అక్షరాన్ని, "అ" కారముతో కలిపి ఏర్పరచబడ్డాయి. కాబట్టి, అ-కారము అనేది, సంస్కృత అక్షరమాలలో చాలా ప్రాముఖ్యతగలది. "అ" అనేది, అక్షరమాలలో మొదటి అచ్చు. అంతేకాక, అచ్చులను హల్లుల కంటే ముందే రాస్తారు కాబట్టి, "అ" అనేది మొట్టమొదటే వచ్చే అక్షరం. సంస్కృతమనేది చాలా ప్రాచీనమైన భాషే అయినా, అది అత్యంత నాగరికమైనది, మరియు అధునాతనమైనది. సంస్కృత భాషలో ఒక సాధారణమైన ప్రక్రియ ఏమిటంటే, కొన్ని పదాలు కలిపి ఒక సమాసపదముగా చేయటం. ఒక మిశ్రమ పదము తయారుచేయటంలో, రెండు కానీ, అంతకంటే ఎక్కువ కానీ పదాలు, వాటి చివరలు కోల్పోతే, ఆ వచ్చే పదాన్ని సమాస-పదము అంటారు. ప్రముఖంగా ఆరు రకాల సమాసములు ఉన్నాయి: 1) ద్వంద్వ 2) బహువ్రీహి ౩) కర్మ ధారయ 4) తత్పురుష 5) ద్విగు 6) అవ్యయీ భావ. వీటిలో ద్వంద్వము శ్రేష్ఠమయినది. ఎందుకంటే, రెండు పదాలకీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. వేరే వాటిలో, ఒక పదమే ప్రధానంగా ఉంటుంది, లేదా రెండు పదాలు కలిపితే, మూడవ పదానికి అర్థం ఇస్తుంది. సృష్టి అనేది అత్యత్భుతమైనది, మరియు వీక్షించటానికి అబ్బురపరిచే ఒక ప్రక్రియ. మానవ జాతి యొక్క అత్యంత అధునాతన సాంకేతిక ఆవిష్కరణలు కూడా, సృష్టితో పోల్చితే, అత్యల్పముగా అనిపిస్తాయి. కాబట్టి, సమస్త జగత్తునూ తయారుచేసిన బ్రహ్మయే, తన సృజనాత్మకతతో, అందరు సృష్టికర్తలలో కెల్లా, భగవంతుని మహిమను అద్భుతంగా ప్రదర్శించాడని, శ్రీ కృష్ణ పరమాత్మ అంటున్నాడు.

02:38 - మృత్యుః సర్వహరశ్చాహమ్ ఉద్భవశ్చ భవిష్యతామ్ ।
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా ।। 34 ।।

సర్వమునూ కబళించే మృత్యువును నేనే, ఇకముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా, నేనే ఉత్పత్తిస్థానమును. స్త్రీ లక్షణములో నేను కీర్తినీ, సిరిసంపదనూ, చక్కటి వాక్కునూ, జ్ఞానశక్తినీ, మేధస్సూ, ధైర్యము మరియు క్షమాగుణమును. 

పుట్టిన వాడికి మరణము తప్పదు. సమస్త జీవమూ తప్పకుండా మరణముతోనే ముగుస్తుంది. అందుకే, “dead end” అనే మాట కూడా ఉంది. భగవంతుడు కేవలం సృష్టి చేసే శక్తి కలవాడే కాదు; ఆయనే నాశనం చేసే శక్తి కూడా. సమస్తమునూ మృత్యు రూపంలో కబళించి వేస్తాడు. జనన మరణ చక్రంలో, చనిపోయిన వారు మరల పుడతారు. ఇక ముందు వచ్చే వాటికి కూడా, వ్యూహకర్తను తానే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కొన్ని లక్షణములు స్త్రీల వ్యక్తిత్వానికి అలంకారముగా చెప్పబడతాయి, మరికొన్ని గుణములు, పురుషులలో ప్రత్యేకంగా మెచ్చదగినవిగా చెప్పబడతాయి. నిజానికైతే, అసలు ఈ రెండు రకాల గుణములూ కలిగి ఉండటమే, సంపూర్ణ వ్యక్తిత్వము. ఇక్కడ శ్రీ కృష్ణుడు - కీర్తి, సిరిసంపద, మంచి వాక్కు, జ్ఞాపక శక్తి, మేధస్సు, ధైర్యము, మరియు క్షమాగుణమనే లక్షణములు, స్త్రీలను గొప్పవారిగా చేస్తాయి. ఇందులో మొదటి మూడు గుణములూ, బాహ్యంగా వ్యక్తమవుతాయి. అలాగే, తరువాతి నాలుగూ, ఆంతరంగముగా వ్యక్తమవుతాయి. ఇవే కాక, మానవ జాతికి మూలపురుషుడైన ప్రజాపతి దక్షుడుకి, ఇరవై నాలుగు మంది కుమార్తెలు. ఇందులో ఐదుగురు ఉత్తమ స్త్రీలుగా పరిగణించబడతారు. వారు కీర్తి, స్మృతి, మేధ, ధృతి మరియు క్షమ. శ్రీ అనే ఆమె, భృగు మహర్షి కూతురు. వక్ అనే ఆమె, బ్రహ్మ యొక్క కుమార్తె. వీరి వీరి పేర్లకు అనుగుణంగా, ఈ ఏడుగురు స్త్రీలూ, ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు గుణములకు అధ్యక్ష దేవతలు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ గుణములను తన విభూతిగా పేర్కొంటున్నాడు.

04:41 - బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ ।
మాసానాం మార్గశీర్షోఽహమ్ ఋతూనాం కుసుమాకరః ।। 35 ।।

సామ వేద మంత్రములలో నేనే బృహత్సామమని తెలుసుకొనుము; ఛందస్సులలో గాయత్రీఛందస్సు నేనే. హైందవ పంచాగములో మార్గశీర్ష మాసమునూ, మరియు ఋతువులలో పుష్పములను తెచ్చే వసంత ఋతువునూ నేనే.

ఇంతకు పూర్వం శ్రీ కృష్ణుడు వేదములలో, అద్భుతమైన కీర్తనలను కలిగి ఉన్న సామవేదము తానే అని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు సామవేదములో తానే, శ్రేష్ఠమైన మాధుర్యము మెండుగా కలిగిన బృహత్సామమును, అని అంటున్నాడు. సాధారణంగా దీనిని, మధ్యరాత్రి సమయంలో పాడతారు. సంస్కృత భాష, ఇతర భాషలలో లాగా, పద్యాలు రాయటానికి విలక్షణమైన ప్రాస, మరియు ఛందస్సూ కలిగి ఉంది. వేదాలలోని శ్లోకాలు, ఎన్నెన్నో ఛందస్సులలో ఉన్నాయి. వీటిలో గాయత్రీ ఛందస్సు, చాలా ఆకర్షణీయమయినది, మరియు మధురమైనది. ఈ ఛందస్సులో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక మంత్రము, గాయత్రీమంత్రము. మార్గశీర్షమనేది, హైందవ పంచాంగములో తొమ్మిదవ మాసము. అది నవంబరు-డిసెంబరు మాసాల్లో వస్తుంది. భారత దేశంలో ఆ సమయంలో, ఉష్ణోగ్రత మరీ అంత వేడిగా ఉండదు, లేదా మరీ అంత చల్లగానూ ఉండదు. వ్యవసాయ క్షేత్రాలలో పంట కోత సమయమది. అందుకే ఇది జనులకు చాలా ఇష్టమైన నెల. వసంత ఋతువును, ఋతు-రాజు అంటారు. ప్రకృతి ఆహ్లాదకరంగా, తన జీవత్వాన్ని ప్రస్ఫుటంగా చూపించే కాలము అది. వాతావరణంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ, వంసత ఋతువులో చాలా పండుగలు జరుపుకుంటారు. ఈ విధంగా, ఋతువులలో వసంత ఋతువు, భగవంతుని యొక్క విభూతిని చక్కగా వ్యక్తీకరిస్తుంది.

06:29 - ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।
జయోఽస్మి వ్యవసాయోఽస్మి సత్త్వం సత్త్వవతామహమ్ ।। 36 ।।

మోసగాళ్ళలో జూదమును నేను; తేజోవంతులలో తేజస్సును నేను. విజయులలో విజయమును నేను, మరియు సంకల్పము కలవారిలో దృఢ సంకల్పమునూ, ధర్మపరాయణులలో సద్గుణమునూ నేనే.

శ్రీ కృష్ణుడు, సద్గుణాలే కాక, దుర్గుణమును కూడా తన విభూతియే అని పేర్కొంటున్నాడు. జూదమనేది, ఒక ప్రమాదకరమైన చెడు అలవాటు. అది కుటుంబాలనూ, వ్యాపారాలనూ, జీవితాలనూ నాశనం చేస్తుంది. జూదం పట్ల యుధిష్టురుడి బలహీనతే, మహాభారత యుద్ధానికి దారి తీసింది. మరిక జూదము కూడా భగవంతుని మహిమే అయితే, అది హానికరం కాదా? మరి అది ఎందుకు నిషేధించబడింది - అంటే, దానికి సమాధానం, భగవంతుడు తన శక్తిని జీవాత్మకు ప్రసాదిస్తాడు. దానితో పాటుగా, నచ్చిన పనిని చేయటానికీ, ఎంచుకోవటానికీ స్వేచ్ఛను కూడా ఇస్తాడు. మనం ఆయనను మరచిపోవటం ఎంచుకుంటే, మరచిపోయే శక్తిని ఇస్తాడు. ఇది ఎలాగంటే, విద్యుత్ శక్తిని, ఇంటిని వెచ్చబరచటానికీ, లేదా చల్లబరచటానికీ, రెంటికీ వాడుకోవచ్చు. ఆ విద్యుత్-శక్తిని ఎలా వాడుకోవాలో, వినియోగదారుడి ఇష్టం. కానీ, ఆ విద్యుత్తును సరఫరా చేసిన విద్యుత్ కేంద్రానికి, ఆ శక్తిని వినియోగదారుడు సద్వినియోగం చేసినా, లేదా దుర్వినియోగం చేసినా సంబంధం లేదు. అదే విధంగా, జూదగానికి కూడా భగవంతుడు ఇచ్చిన తెలివితేటలూ, సామర్ధ్యమూ ఉంటాయి. కానీ, భగవంతుడు ప్రసాదించిన ఆ కానుకను దుర్వినియోగం చేస్తే, ఆ పాపపు పనులకు భగవంతుడిది బాధ్యత కాదు. ప్రతివారికీ విజయం సాధించటం ఇష్టం; అది భగవంతుని మహిమను తెలియపరుస్తుంది. అంతేకాక, శ్రీ కృష్ణుడు, దృఢ సంకల్పమనే గుణానికి, ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. సత్పురుషులలో ఉండే మంచితనం కూడా, భగవంతుని శక్తికి నిదర్శనమే. అన్ని సద్గుణాలూ, కార్యసిద్ధి, కీర్తి, విజయము మరియు ధృఢసంకల్పము - ఇవన్నీ భగవంతుని నుండి ఉద్భవించినవే. వీటిని మనవే అని అనుకోకుండా, అవి భగవంతుని నుండే వచ్చినవని గమనించాలి.

08:40 - వృష్ణీనాం వాసుదేవోఽస్మి పాండవానాం ధనంజయః ।
మునీనామప్యహం వ్యాసః కవీనాముశనా కవిః ।। 37 ।।

వృష్ణి వంశస్థులలో నేను కృష్ణుడిని, మరియు పాండవులలో అర్జునుడిని. మునులలో వేద వ్యాసుడనని తెలుసుకొనుము, మరియు, గొప్ప ఆలోచనాపరులలో శుక్రాచార్యుడను.

శ్రీ కృష్ణ భగవానుడు, భూ-లోకంలో వృష్ణి వంశములో, వసుదేవుని పుత్రునిగా జన్మించాడు. ఏ జీవాత్మ అయినా, భగవంతుడి కంటే మించినది కాదు కాబట్టి, సహజంగానే, వృష్ణి వంశములో, ఆయనే అత్యంత మహిమాన్వితుడైన వ్యక్తి. పాండవులు అంటే, పాండు రాజు యొక్క ఐదుగురు పుత్రులైన యుధిష్టిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు. వీరిలో అర్జునుడు, సాటిలేని ప్రతిభావంతుడైన విలుకాడు, మరియు శ్రీ కృష్ణుడి యొక్క సన్నిహిత భక్తుడు. భగవంతుడిని తన ప్రియ మిత్రునిగా భావించినవాడు. వేద వ్యాసుడు, మునులలో విశేషమైన ప్రాముఖ్యత కలవాడు. ఆయనకు "బాదరాయణుడు", మరియు "కృష్ణ ద్వైపాయనుడు" అని కూడా పేర్లు కలవు. ఆయన వైదిక జ్ఞానాన్ని ఎన్నో రకాలుగా ప్రకటితం చేశాడు, మరియు ఎన్నో పురాణాలను, మానవుల సంక్షేమం కోసం వ్రాశాడు. నిజానికి, వేద వ్యాసుడు, శ్రీ కృష్ణుడి అవతారమే.. అలాగే, శ్రీమద్ భాగవతంలో పేర్కొనబడిన అవతారాలలో ఒకడిగా, వేద వ్యాసుడు పేర్కొనబడ్డాడు. శుక్రాచార్యుడు ఏంతో పాండిత్యం కలిగిన ముని. నీతి, ఆచార శాస్త్రాలలో ప్రావీణ్యంతో, ఖ్యాతి గడించాడు. దయాళువై, రాక్షసులను తన శిష్యులుగా చేసుకుని, వారి పురోగతికై దిశానిర్దేశం చేశాడు. ఆయన ప్రావీణ్యం వలన, ఆయన ఒక భగవంతుని విభూతి అని చెప్పబడ్డాడు.

10:22 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

17 October, 2022

‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! Uddhava Gita


‘ఉద్ధవ గీత’లో ఏం ఉంది! జూదంలో ఓడిపోకుండా పాండవులను శ్రీ కృష్ణుడు ఎందుకు కాపాడలేదు?

ఉద్ధవుడు శ్రీకృష్ణుని ప్రియ మిత్రుడు. రూపు రేఖలూ, వేష ధారణ కూడా కృష్ణుని వలే ఉంటాయి. నిర్మలమైన భక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలంటే, ఉద్ధవుని గురించి తెలుసుకుంటే గానీ అర్ధం కాదు. ఉద్ధవుడు చిన్ననాటి నుంచే శ్రీ కృష్ణుడికి ఎన్నో సేవలు చేశాడు. ఆయనే కృష్ణుడికి రథసారధి కూడా. కానీ, తను చేసే సేవలకు ఎప్పుడూ ఏ ప్రతిఫలమూ ఆశించలేదు. భక్తిలో పరాకాష్టకు చేరినవారు, భగవంతుడిని తమలోనే దర్శించుకుంటారు. శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తికి ముందు, ఉద్ధవుడితోనే మాట్లాడాడు. కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో అర్జునుడికి ధర్మాన్ని బోధించాడు. అది భగవద్గీతగా, ముఖ్య పారాయణ గ్రంధంగా ప్రజ్వరిల్లుతోంది. అలాగే, శ్రీ కృష్ణుడు చివరిగా ఉద్ధవుడితో మాట్లాడిన మాటలు, ‘ఉద్ధవ గీత’గా ఖ్యాతి గడించింది. అసలు ఉద్ధవ గీతలో ఏముంది? ఉద్ధవుడు శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? కర్మ గురించి వాసుదేవుడు వివరించిన సందేశం ఏంటి -  వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/buXxa_0VE5w ]

ఉద్ధవ గీత అనేది, శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం అనే దానికన్నా, ఆచరించవలసిన ఆదేశం అనడం సమంజసం. ఈ ‘ఉద్ధవ గీత’ అనేది, శ్రీ భాగవతంలోని ఏకాదశ స్కంధంలోని, ఆరవ అధ్యాయం, నలుబదవ శ్లోకం నుండి ప్రారంభమై, ఇరువది తొమ్మిదవ అధ్యాయంతో ముగుస్తుంది. ఈ మొత్తం "ఉద్ధవ గీత"లో, వెయ్యికి పైగా శ్లోకాలున్నాయి. ఉద్ధవుడు యదుకుల శ్రేష్ఠుడు, మహాజ్ఞాని. శ్రీకృష్ణ, ఉద్ధవుల సంవాదమే, ఉద్ధవగీతగా జగత్ ప్రసిద్ధిగాంచింది. శ్రీ కృష్ణుడు చివరిసారిగా చేసిన బోధ ఇదే. ఒక విధంగా చెప్పాలంటే, ‘ఉద్ధవ గీత’, భగవంతుడైన శ్రీ కృష్ణ పరమాత్మ మనకిచ్చే వీడ్కోలు సందేశం అని చెప్పవచ్చు. పరమాత్మలోని దివ్య సుగుణాలన్నీ, ఈ ‘సృష్టి’లోనే ఉన్నాయి. వాటిని గ్రహించి, ఆచరించగలగడమే మహాయోగం. భూమి నుంచి క్షమాగుణాన్నీ.., వాయువు నుంచి పరోపకారాన్నీ, ప్రాణస్థితి నిలకడనూ.., ఆకాశం నుంచి పరమాత్మ సర్వవ్యాపి అనీ.., జలం నుంచి నిర్మలత్వాన్నీ, పావనత్వాన్నీ.., అగ్ని నుంచి దహించే శక్తినీ గ్రహించి, తన దేహం పాంచ భౌతాత్మకమనీ, పంచభూతాల గుణాలను కలిగి ఉండాలనీ తెలుసుకోవాలి జీవుడు. మనిషి కర్మాచరణే ధర్మంగా భావించాలి. దేనిమీద కూడా విపరీతమైన వ్యామోహం ఉండకూడదని చెబుతుంది, ఉద్ధవ గీత.

శ్రీ కృష్ణుడు ఉద్ధవుడితో, ఏదైనా వరం కోరుకో అని చెప్పగా అందుకు ఉద్ధవుడు, ‘దేవా! నీ లీలలను అర్ధం చేసుకోవటం మా తరం కాదు. నాకు ఏ వరమూ వద్దు కానీ, నిన్ను ఓక ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. అడుగవచ్చునా?’ అని, వినయంగా ఇలా అడిగాడు.. ‘కృష్ణా! నీవు మా అందరికీ జీవించటానికి ఇచ్చిన సందేశము ఒకటి, నీవు జీవించిన విధానము మరొకటి. మహాభారత యుద్ధములో, నీవు పోషించిన పాత్ర, తీసుకున్న నిర్ణయములు, చేపట్టిన పనులు నాకేమీ అర్ధం కాలేదు. దయచేసి నా సందేహములను తీర్చి, నన్ను అనుగ్రహించండి.’ అని కోరుకున్నాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! ఆనాడు యుద్ధభూమిలో అర్జునుడికి గీతను బోధించాను. ఈ నాడు నీకు ఉద్ధవ గీతను బోధించటానికి ఈ అవకాశాన్ని కలిపిస్తున్నాను. నన్ను ఏమి అడగాలనుకుంటున్నావో తప్పకుండా అడుగు.’ అని ఉద్ధవుడిని ప్రోత్సహించాడు. ఇక ఉద్ధవుడు తన ప్రశ్నలను అడగటం మొదలు పెట్టాడు.

‘కృష్ణా, పాండవులు నీ ప్రాణ స్నేహితులు కదా! నిన్ను గుడ్డిగా నమ్మారు కూడా. నువ్వు భూత, భవిష్యత్, వర్తమానములు తెలిసినవాడవు. అటువంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? మంచి మిత్రుడు అలాంటి వ్యసనములను ఎక్కడైనా ప్రోత్సహిస్తాడా? పోనీ ఆడనిచ్చావే అనుకో, కనీసం వారిని గెలిపించి, కౌరవులకు బుద్ధి చెప్పి ఉండకూడదా? అది కూడా చెయ్యలేదు. ధర్మజుడు ఆస్తినంతా పోగొట్టుకుని, వీధినపడ్డాడు. ఆఖరికి తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నీవు అడ్డుపడి, వాళ్ళను కాపాడి ఉండవచ్చును కదా? కౌరవులు దుర్బుద్ధితో, పరమ సాధ్వి అయిన ద్రౌపదిని, జూదంలో మోసం చేసి గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో, పాండవులను గెలిపించలేదు. ఎప్పుడో ఆవిడ గౌరవానికి భంగం కలిగినప్పుడు, ఆమెను ఆఖరి క్షణంలో అనుగ్రహించావు. సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని, గొప్ప పేరుపొందావు. కానీ, ముందే నీవు కలుగచేసుకుని ఉంటే, ఆమెకు నిండు సభలో జరిగిన అవమానం తప్పేది కదా. సమయానికి ఆదుకునేవాడే మంచి మిత్రుడనిపించుకుంటాడు. మరి, నీవు చేసినదేమిటి కృష్ణా?’ అని ఉద్ధవుడు ఎంతో బాధతో, కృష్ణుడిని తన ఆంతర్యమేమిటో తెలుపమని ప్రార్ధించాడు. నిజానికి ఈ సందేహములు, మహాభారత యుద్ధం గురించి తెలిసిన వారందరికీ కలుగుతాయి. కనుక కృష్ణుడు ఎంతో ప్రేమతో, ఉద్ధవుడి ద్వారా మనందరికీ ఉద్ధవ గీతను బోధించాడు. ‘ఉద్ధవా! ప్రకృతి ధర్మం ప్రకారం, అన్ని విధాలా జాగ్గ్రత్త పడి, తగిన చర్యలను తీసుకునే వాడే, గెలుపుకు అర్హుడు. దుర్యోధనుడికి జూదములో ప్రావీణ్యము లేకపోయినా, ఆస్తిపరుడు. కనుక తన అర్హత ప్రకారం, ఆస్తిని పణంగా పెట్టాడు. ఎంతో తెలివిగా తన మామ చేత పందెమును వేయించాడు.

ధర్మరాజు మాత్రం, పందెములను నా చేత వేయించాలని అనుకోలేదు. నా సహాయమునూ కోరలేదు. ఒకవేళ శకునితో నేను జూదమాడి ఉంటే, ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెమును శకుని వేయగలిగేవాడా? లేక అతను చెప్పిన పందెము నాకు పడేది కాదా? నీవే ఆలోచించుము..? సరే, ఇదిలా ఉంచు. ధర్మరాజు అజ్ఞానంలో మరొక క్షమించరాని నేరం చేశాడు. అదేమిటంటే, ‘నేను చేసుకున్న కర్మ వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు. ఇటువైపు ఎట్టి పరిస్థితిలో కూడా, కృష్ణుడు రాకూడదు అని ప్రార్ధించాడు. దాంతో ఏమీ చేయలేక, చేతులు కట్టుకుని, తన పిలుపుకోసం ఎదురు చూస్తూ నిలబడిపోయాను. ధర్మజుడు సరే.. భీముడూ, అర్జునుడూ, నకుల సహదేవులు కూడా, ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ, ఏ మాత్రము నా సహాయము కోరలేదు. అలాగే ద్రౌపది కూడా. దుశ్శాసనుడు తనను సభలోకి ఈడ్చినప్పుడు కూడా నన్ను స్మరించకుండా, నిండు సభలో అందరితో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది. చివరికి తన ప్రయత్నములన్నీ విఫలమయ్యాక, గొంతెత్తి నన్ను పిలిచింది. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడింది. అప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యి నేను ద్రౌపదిని రక్షించలేదా?’ అని కృష్ణుడు ఉద్ధవుడిని తిరిగి ప్రశ్నించాడు.

కృష్ణుడి సమాధానములకు ఉద్ధవుడు భక్తితో చలించి, ‘కృష్ణా! అలాగైతే, మాలాంటి సామాన్యుల సంగతి ఏమిటి? మేము చేసే కర్మలలో కూడా, నీవు కోరితే కల్పించుకుని సహాయం చేస్తావా? అవసరమైతే మమల్ని చేడు కర్మలు చేయకుండా కాపాడుతావా? అని చక్కటి ప్రశ్న వేశాడు ఉద్ధవుడు. దానికి శ్రీ కృష్ణుడు చిన్నగా నవ్వుతూ, ‘ఉద్ధవా! మానవ జీవితం, వారు చేసుకున్న కర్మల ద్వారా సాగుతుంది. నేను వారి కర్మలను నిర్వర్తించను, వాటిలో కలుగ చేసుకోను. కేవలం ఒక సాక్షిలా గమనిస్తూ ఉంటాను. అదే భగవంతుని ధర్మము’ అని వివరించాడు. ఆ సమాధానానికి ఉద్ధవుడు ఆశ్చర్య చకితుడై, ‘అయితే కృష్ణా! మేము తప్పుదారి పట్టి, పాపములను మూట కట్టుకుంటుంటే, నువ్వలా దగ్గరుండి చూస్తూ ఉంటావా? మమ్మల్ని అడ్డుకోవా? ఇదెక్కడి ధర్మము కృష్ణ’ అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, ‘ఉద్ధవా! నీ మాటలను నీవే జాగ్రత్తగా గమనించు. నీకే అర్ధమవుతుంది. భగవంతుడు నీతోనే, నీలోనే ఉన్నాడనీ, నిన్ను దగ్గరుండి గమనిస్తున్నాడనీ గుర్తించినప్పుడు, నీవు తప్పులు ఎలా చేయగలుగుతావు చెప్పు? ఈ సత్యాన్ని మరచినప్పుడే, మానవుడు తప్పు దారి పడతాడు, అనర్ధాలను కొని తెచ్చుకుంటాడు. ధర్మరాజు, జూదము గురించి నాకు తెలియదనుకోవడమే తాను చేసిన మొదటి తప్పు. నేను అంతటా ఉన్నానని అతను గుర్తించి ఉంటే, ఆట పాండవులకు అనుగుణంగా సాగేది’ అని ఉద్ధవుడికి చక్కగా బోధించాడు శ్రీ కృష్ణుడు. వాసుదేవుడు బోధించిన మధురమైన గీతను విని, ఉద్ధవుడు ఎంతో ఆనందించి, తన సంశయములన్నిటినీ తీర్చినందుకు కృతజ్ఞతా భావంతో, కృష్ణుడికి నమస్కరించాడు. పూజలూ, ప్రార్థనలూ భగవంతుడి సహాయమును కొరటానికి చేసే కర్మలే. కానీ, సంపూర్ణ విశ్వాసము వీటికి తోడైతే, అంతటా ఆయనే కనిపిస్తాడని, సమస్త మానవళికీ తెలియజేసేదే ‘ఉద్ధవ గీత’.

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxmu0PlOYJc2H3O7EySIXJqt_kOxH60_Ha

05 October, 2022

అత్యుత్తమ విద్య! భగవద్గీత Bhagavad Gita

  

అత్యుత్తమ విద్య! భాగవతంలో చెప్పబడిన ‘సా విద్యా తన్మతిర్యయా!’ అంటే ఏంటి?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (27 – 32 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 27 నుండి 32 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bs3KpJUcTQA ]

శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు..

00:43 - ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్ ।
ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపమ్ ।। 27 ।।

గుఱ్ఱములలో నేను, అమృత సముద్రమును చిలకటం ద్వారా జనించిన ఉచ్చైఃశ్రవసమును. గజేంద్రములలో నేను ఐరావతమును, మరియు మనుష్యులలో రాజును.

తన వైభవాన్నీ, మహిమనూ తెలియపరచటానికి, ప్రతి విభాగములో అత్యద్భుతమైన వాటిని పేరుపేరునా చెప్పటం కొనసాగిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఉచ్చైఃశ్రవసమనేది, దేవలోకాల్లో ఉన్న అత్యంత శ్రేష్ఠమైన రెక్కల గుఱ్ఱము. అది దేవరాజైన ఇంద్రుడికి చెందినది. అది తెల్లని రంగులో ఉంటుంది, మరియు విశ్వములో అత్యంత వేగవంతమైన గుఱ్ఱము. ఉచ్చైఃశ్రవసము, సముద్ర మధన లీలలో ఉద్భవించినది. ఐరావతము, ఇంద్రుని వాహనముగా ఉండే ఒక తెల్లని ఏనుగు. దానినే, అర్ధ-మాతాంగము అని కూడా అంటారు. అంటే, "మేఘాలలో ఉండే ఏనుగు" అని అర్థం. ఐరావతం, గజములన్నింటిలో అత్యుత్తమమైనది.

01:47 - ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ।
ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః ।। 28 ।।

ఆయుధములలో వజ్రాయుధమును, ఆవులలో కామధేనువును, సంతానోత్పత్తికి కారణములలో, కామదేవుడైన మన్మథుడను,  సర్పములలో వాసుకిని నేను.

వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి, దధీచి మహాముని ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధంతోనే, వృత్తాసురుడిని సంహరించాడు. సమస్త లోకాలలో కెల్లా, అన్ని ఆయుధాలలో అత్యంత శక్తివంతమైన ఆయుధం, వజ్రాయుధం. తన దగ్గర ఎల్లప్పుడూ ఉండే చక్రమూ, గద కంటే కూడా, ఆ వజ్రాయుధమునే భగవంతుని వైభవమునకు సూచికగా ఉదహరిస్తున్నాడు, భగవానుడు. మైథున క్రియ అనేది, మంచి సంతానం కోసం మాత్రమే చేసినప్పుడు, అది అపవిత్రమయినది కాదు. సంతానోత్పత్తి ద్వారా, మానవ జాతిని కొనసాగించటానికి అవసరమైన స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ శక్తికి, మన్మధుడు కారణం. ఈ లైంగిక వాంఛకు మూలం, భగవంతుని యందే ఉంది. దీనిని ఇంద్రియ తృప్తి కోసం దుర్వినియోగం చేయకూడదు. కేవలం మంచి సంతానం పొందటం కోసమే ఉపయోగించుకోవాలి.

03:04 - అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ।। 29 ।।

నాగులలో నేను అనంతుడను; నీటిలో వసించే వాటిలో వరుణుడను. పితృగణములో నేను అర్యముడను; న్యాయ-ధర్మ పాలన అందిచే వారిలో, నేను యమధర్మరాజును.

అనంతుడు అంటే, ఆది శేషుడు. ఇది విష్ణుమూర్తి శయనించే నాగుపాము. ఆయనకు పదివేల పడగలున్నాయి. ఆయన ప్రతియొక్క తలతో, భగవంతుని మహిమలను, సృష్టి ప్రారంభం నుండి గానం చేస్తూనే ఉన్నాడు. వరుణుడు అంటే, సముద్ర దేవత. అర్యముడు అంటే, అదితి యొక్క మూడవ పుత్రుడు. ఆయనను పితృగణముల నాయకునిగా పూజిస్తారు. యముడు అంటే, మృత్యు దేవత. ఈ జన్మలో ఆత్మ చేసిన వాటికి అనుగుణంగా, వచ్చే జన్మలో శిక్షలను, లేదా ఉత్తమగతులను, భగవంతుని తరపున అందిస్తాడు. అవి ఎంత భయంకరముగా, బాధాకరముగా ఉన్నా, తన ధర్మం నుండి కొద్దిగా కూడా తప్పడు. సంపూర్ణ దోషరహిత న్యాయమును అందించే వానిగా, ఆయన భగవంతుని యొక్క మహిమను ప్రకటిస్తున్నాడు.

04:13 - ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేంద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ।। 30 ।।

దైత్యులలో నేను ప్రహ్లాదుడను; అన్నింటినీ నియంత్రించే వాటిలో నేను కాలమును. నేనే, మృగములలో సింహమును, మరియు పక్షులలో గరుత్మంతుడనని తెలుసుకొనుము.

మహాశక్తి శాలి అయిన రాక్షస రాజు హిరణ్యకశిపుడి పుత్రుడిగా, ప్రహ్లాదుడు జన్మించాడు. కానీ, అతను అతి గొప్ప విష్ణు భక్తులలో ఒకనిగా అయ్యాడు. అందుకే, రాక్షసులలో ప్రహ్లాదుడు భగవంతుని యొక్క విభూతిని ప్రకటిస్తున్నాడు. కాలమనేది, విశ్వములోని అత్యంత బలమైన, గొప్ప అస్థిత్వాలను కూడా లోబరుచుకుంటుంది. గంభీరమైన సింహము, అడవికి రారాజు, మరియు జంతువులలో భగవంతుని యొక్క శక్తి, సింహములో వ్యక్తమవుతుంటుంది. విష్ణు మూర్తి యొక్క దివ్య వాహనమైన గరుత్మంతుడు, పక్షులలో కెల్లా గొప్ప వాడు.

05:11 - పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ ।
ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।।

పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.

ప్రకృతిలో ఉన్న వాయువు, పవిత్రమొనర్చే పనిని చక్కగా నిర్వర్తిస్తుంది. అది మలినమైన నీటిని నీటి ఆవిరిగా చేస్తుంది; భూమిపై ఉండే ఏదేనీ దుర్గంధమును తీసుకువెళ్ళిపోతుంది; ప్రాణవాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి, అగ్నిని మండేట్టుగా చేస్తుంది. ఈ విధంగా అది ప్రకృతిలో ఒక గొప్ప పవిత్రమొనర్చే పదార్ధము. శ్రీ రామచంద్రప్రభువు, భూమిపై అత్యంత శక్తివంతులైన యోధులలో ఒకడు. ఆయన విల్లు అత్యంత ప్రాణాంతకాయుధము. అయినా, ఆయన ఒక్కసారి కూడా తను శాసించే ఉన్నత స్థాయిని దుర్వినియోగం చేయలేదు. తను ఆయుధం ఉపయోగించింది, మంచి కోసం మాత్రమే. అందుకే ఆయన శస్త్రధారులలో సర్వోన్నతుడు. రాముడు భగవంతుని అవతారము కూడా. అందుకే శ్రీ కృష్ణుడు, ఆయనను తనుగా సూచిస్తున్నాడు. భగవంతుని పాదముల నుండి పుట్టిన గంగా నది, ఒక పవిత్రమైన నది. అది స్వర్గ లోకముల నుండి భూమి పైకి దిగినది. ఎంతో మంది గొప్ప గొప్ప ఋషులు, ఆ నది యొక్క ఒడ్డున తపస్సునాచరిస్తుంటారు. సాధారణ నీటి లాగా కాకుండా, గంగా నది యొక్క నీళ్ళను ఒక బిందెలో పట్టి ఉంచితే, అది ఎన్ని సంవత్సరాలయినా పాడు కాదు. పూర్వ కాలంలో ఇది ఎంతో ప్రస్ఫుటంగా, గమనించదగినట్లుగా ఉండేది. కానీ, ఇప్పటి కాలంలో, కోట్ల లీటర్ల కాలుష్యకారకాలను గంగలో కలిపేయటం వలన, ఈ ప్రభావం కొంచం తగ్గింది. కానీ, ఎన్ని యుగాలు మారినా, గంగ తన స్వచ్ఛతను కొల్పోలేదు.

07:02 - సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ।
అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహమ్ ।। 32 ।।

ఓ అర్జునా, నేనే సమస్త సృష్టికీ ఆది, మధ్య మరియు అంతమని తెలుసుకొనుము. విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను, మరియు సంవాదములలో తర్కబద్ద నిర్ణయమును నేనే.

సృష్టి చేయబడిన ఆకాశమూ, గాలీ, అగ్నీ, నీరు మరియు భూమి కలిపి సర్గ అంటారు. నేనే వీటన్నిటికీ సృష్టికర్తగా ఆది, స్థితికర్తగా మధ్యమ, మరియు లయకర్తగా అంతమును. కాబట్టి, సృష్టి, స్థితి మరియు లయ ప్రక్రియలను, భగవంతుని విభూతిగా పేర్కొనవచ్చు. విద్య అనేది, ఒక వ్యక్తి సంపాదించుకునే శాస్త్రపరమైన జ్ఞానము. శాస్త్రములు పద్దెనిమిది రకముల విద్యలను విశదీకరించాయి. వాటిలో, ప్రధానమైనవి పద్నాలుగు: "శిక్షా, కల్ప, వ్యాకరణం, నిరుక్తి, జ్యోతిషం, చ్చందస్సు - ఈ ఆరూ వేదాంగములు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము - ఇవి నాలుగూ వేద శాఖలు. మీమాంస, న్యాయ, ధర్మ శాస్త్రములు, మరియు పురాణములూ కలిపి, మొత్తం పద్నాలుగు ప్రధాన విద్యలు." ఈ విద్యలు అధ్యయనం చేయటం వలన, బుద్ధి పెంపొందించబడి, జ్ఞానం వృద్ధి చేంది, ధర్మ మార్గ అవగాహన ఏర్పడుతుంది. అంతేకాక, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది, మనుష్యులను భౌతిక, ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేసి, వారికి అమరత్వమును ప్రసాదిస్తుంది. ఈ విధంగా, ఇది ఇంతకు ముందు చెప్పిన విద్యల కంటే ఉన్నతమైనది. ఇదే విషయం, శ్రీ మద్భాగవతం లో కూడా చెప్పబడింది: "సా విద్యా తన్మతిర్యయా" అంటే, భగవంతుని పాదారవిందముల పట్ల బుద్ధికి అనురక్తిని కలిగించేదే, అత్యుత్తమ విద్య అని క్షుణ్ణంగా వివరించబడి ఉంది. వాదోపవాదములు, మరియు తర్కములో జల్ప అంటే, తన అభిప్రాయం స్థిరపరచటం కోసం, ఎదుటివాని యొక్క మాటలలో లోపము పట్టుకోవటం. వితండము అంటే, సత్యముపై సరియైన చర్చకు అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటూ, అర్థంపర్థం లేకుండా వాదించటం. వాదము అంటే, చర్చకు తర్కబద్ధమైన ముగింపును ఇవ్వటం. ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవటానికీ, సత్యమును స్థిరపరచటానికీ, తర్కమే ప్రధాన ఆధారము. మానవ సమాజంలో జ్ఞానాన్ని సునాయాసంగా పెంపొందించుకోవటానికీ, మరియు ఉపదేశించటానికీ, తర్కబద్ధమైన స్పృహయే, మూలాధారం. విశ్వవ్యాప్తమైన తర్కబద్ధ సూత్రములే, భగవంతుని శక్తికి నిదర్శనం.

09:39 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన విభూతిని తెలియజేసే మరికొన్ని ఉపమానాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

21 September, 2022

ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము! Bhagavad Gita


ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము!

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (16 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 16 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ssKwn-s-CpY ]

భగవంతుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఆయనను ఎలా స్మరిస్తూ ఉండాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।।

00:55 - కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।

నీవు సమస్త జగత్తుల యందూ వ్యాపించి, వాటి యందు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగీశ్వరా, నేను మిమ్ము ఎలా తెలుసుకోగలను, మరియు ఎలా స్మరిస్తూ ఉండేను, అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో మిమ్ము చింతన చేయగలనో తెలియజేయండి భగవాన్!

ఇక్కడ యోగం అంటే, భగవంతుని దివ్యమైన శక్తి అయిన యోగమాయ. అలాగే, యోగి అంటే, యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు భగవానుడని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు ఏ విధంగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటినీ, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. సమస్త జగత్తునూ నియంత్రించి, నిర్వహించే వాడిగా, శ్రీ కృష్ణుడి మహిమలనూ, మరియు అత్యున్నత స్థాయిని గురించీ వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు.. "నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించబడటానికి, నీ దివ్య లీలలను తెలుసుకోగోరుతున్నాను. నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నా మీద కృపతో, నిన్ను అర్థంచేసుకోవడానికి, నీ యొక్క మహిమలను తెలియచేయుము." అని భగవానుడిని అడుగుతున్నాడు, అర్జునుడు.

02:18 - విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।

 ఓ జనార్ధనా! మరల విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలనూ, మరియు అవతారములనూ చెప్పుము. నీ దివ్యామృతమును వింటూ ఉంటే, అది ఎన్నటికీ తనివితీరదు.

భగవంతుని మహిమలను వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతమయమైన శ్రీ కృష్ణుడి మాటలను, ఇప్పటివరకూ తన చెవులతో త్రాగుతున్నాడు అర్జునుడు. ఇక ఇప్పుడు, "ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు." అని అంటూ, భగవంతుడిని ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది, అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు, ఇదే విషయాన్ని చెప్పారు: "శ్రీ కృష్ణుడి భక్తులైనవారికి, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా సరిపోదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే, అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది." అని వివరించాడు.

03:28 - శ్రీ భగవానువాచ ।
హంత తే కథయిష్యామి దివ్యా హ్యత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ।। 19 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ కురు శ్రేష్ఠ.. ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే, వాటి వివరణకి అంతమే లేదు.

భగవంతుని శక్తులూ, మరియు ఐశ్వర్యములూ అనంతమైనవి. నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే. ఆయనకు అనంతమైన రూపములున్నవి. అనంతమైన నామములూ, అనంతమైన ధామములూ, అనంతమైన అవతారములూ, అనంతములైన లీలలూ, అసంఖ్యాకమైన భక్తులూ, ఇలా ఎన్నెన్నో. కాబట్టి, వేదములు ఆయనను అనంతుడు అంటాయి. "భగవంతుడు అనంతుడూ, మరియు అసంఖ్యాకమైన రూపములలో ఈ విశ్వములో ప్రకటితమౌతాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించేదయినా, ఆయన అకర్త." అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలియజేస్తుంది. "భగవంతుడు అనంతుడు, మరియు ఆయన తన అనంతమైన అవతారాలలో చేసే లీలలు కూడా, అనంతములు." అని రామాయణంలో వివరించబడి ఉంది. "భగవంతుని మహిమలను లెక్కించగలమని అనుకునే వారు, అల్ప బుద్ధులు. ఈ భూమిపై ఉన్న ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చు కానీ, భగవంతుని యొక్క అనంతమైన మహిమలను గణించలేము." అని వేద వ్యాస మహర్షి దృఢంగా ప్రకటించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు ఇక్కడ, తన విభూతులలోని అతికొద్ది భాగాన్ని మాత్రమే వివరించబోతున్నానని అంటున్నాడు.

05:01 - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।

ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము.

శ్రీ కృష్ణుడు, తానేమీ జీవుడికి అంత దూరంగా, వేరుగా లేనని అంటున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ, అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. "భగవంతుడు మన ఆత్మలయందు స్థితమై ఉన్నాడు." అని వేదములు పేర్కొంటున్నాయి. అందులో కూర్చుని, ఆ ఆత్మకు జీవశక్తి, మరియు నిత్యశాశ్వత గుణమునూ ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది, మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము, మరియు చైతన్యవంతులము కాలేదు. పరమ చైతన్యవంతుడూ, మరియు సనాతనుడూ అయిన భగవంతుడు మనలోనే ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత, అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి, శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నానని అంటున్నాడు. శ్రీ కృష్ణుడే, సమస్త జీవ భూతముల మొదలూ, మధ్యా, తుది. అవి ఆయన నుండే ఉద్బవించాయి. కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవము అంతా, ఆయన శక్తి చేతనే సంరక్షింపబడి, కొనసాగింపబడుతున్నది. కాబట్టి, ఆయనే మధ్య. అలాగే, మోక్షము పొందిన వారు, ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే, నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే, భగవంతుడే అన్ని ప్రాణులకూ తుది.

06:41 - ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో, నేను విష్ణువును. ప్రకాశవంతమైన వస్తువులలో, నేను సూర్యుడను. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట, ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.

పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే, కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు. అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా, ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు. వారే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు, విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో విష్ణువుగా, వామన స్వరూపంలో తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని, కృష్ణుడు పేర్కొంటున్నాడు. అలాగే, ప్రకాశవంతమైన వాటిలో, సూర్యుడు సర్వోన్నతుడు. రాత్రి పూట అన్ని దీపాలూ, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం, రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది. అది తన విభూతి అని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, "వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు" అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలూ, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు శ్రీ కృష్ణుడు. అయితే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా, దైత్యులకు, అంటే, అసురులుకు తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా, దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డను గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో, ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేశాడు. కానీ, అది భ్రూణములుగా మారింది. ఇవి మరుత్తులైనాయి. అంటే, ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే 49 రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి, అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు, మరీచి అని కూడా ఉంది. వాయువులలో తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

09:08 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన గురించీ, తన విభూతి గురించీ కొనసాగించిన అంశాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

14 September, 2022

జ్ఞాన దీపం! భగవద్గీత Enlightenment - Bhagavad Gita


జ్ఞాన దీపం! భగవంతుడిని మనం ఎందుకు చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (11 – 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 11 నుండి 15 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/tm0zK9cT8kk ]

అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే ఏవిధంగా నాశనం చేయాలో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

00:49 - తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః
నాశయామ్యాత్మభావస్థొ జ్ఞానదీపేన భాస్వతా ।। 11 ।।

వారి మీద వాత్సల్యంతో, వారి హృదయములోనే ఉండే నేను, అజ్ఞానముచే ఏర్పడిన చీకటిని, ప్రకాశవంతమైన జ్ఞాన దీపముచే నాశనం చేస్తాను.

అజ్ఞానమనేదానిని మనం చీకటితో పోల్చుతుంటాము. కానీ, భగవంతుడు ఉదహరించే ఈ జ్ఞాన దీపము వేరు. ప్రస్తుతం మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, అన్నీ కూడా ప్రాకృతికమైనవే.. కానీ భగవంతుడు దివ్యమైనవాడు. కాబట్టి, మనం ఆయనను చూడలేకున్నాము, వినలేకున్నాము, తెలుసుకోలేకున్నాము, లేదా ఆయనతో ఏకమవ్వలేకున్నాము. భగవంతుడు తన కృపను ప్రసాదించినప్పుడు, తన దివ్యమైన యోగమాయా శక్తిని, ఆ జీవాత్మపై కరుణిస్తాడు. దానినే, శుద్ధ సత్త్వమని అంటారు. ఇది మాయా సత్త్వ గుణము కంటే వేరైనది. మనకు ఆ శుద్ధ సత్త్వ గుణ శక్తి లభించినప్పుడు, మన ఇంద్రియములూ, మనస్సూ, మరియు బుద్ధీ, దివ్యమైనవిగా అయిపోతాయి. దీనినే సరళంగా చెప్పాలంటే, ఆయన కృప చేత, భగవంతుడు తన దివ్యమైన ఇంద్రియములనూ, దివ్య మనస్సునూ, మరియు దివ్య బుద్ధినీ, ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు. ఈ దివ్య ఉపకరణాలను కలిగి ఉన్న పిదప, ఆ జీవాత్మ భగవంతుడిని చూడగలుగుతుందీ, భగవంతుడిని వినగలుగుతుందీ, మరియు భగవంతునితో ఏకమవ్వగలుగుతుంది. కాబట్టి, వేదాంత దర్శనం పేర్కొన్నట్టు, భగవంతుని కృప ద్వారానే, ఎవరికైనా దివ్య జ్ఞానము కలుగుతుంది. శ్రీ కృష్ణుడి యొక్క దివ్య శక్తి యే, ఆ జ్ఞాన దీపము. భగవంతుని దివ్య శక్తి యొక్క కాంతిచే, భౌతిక శక్తి యొక్క చీకటి పటాపంచలై పోతుంది.

02:30 - అర్జున ఉవాచ ।
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యమ్ ఆదిదేవమజం విభుమ్ ।। 12 ।।

02:49 - ఆహుస్త్వామృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ।। 13 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవే పరబ్రహ్మము, పరంధాముడవు, సర్వోన్నతమైన, పవిత్రమొనర్చే వాడవూ, నిత్య సనాతన భగవంతుడవూ, ఆది పురుషుడవూ, జన్మ రహితుడవూ, మరియు అత్యున్నతమైన వాడవూ. మహర్షులైన నారదుడూ, అసితుడూ, దేవలుడూ, మరియు వ్యాసుడి వంటివారు, ఇది చాటిచెప్పారు. ఇప్పుడు స్వయముగా, నీవే నాకు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నావు.

భగవంతుడి మాటలను విన్న తరువాత, అర్జునుడికి శ్రీ కృష్ణ భగవానుని యొక్క సర్వోన్నత స్థాయిపై, సంపూర్ణ నమ్మకం కలిగింది. మరియు, తనలో ఇప్పుడు కలిగిన ధృఢ విశ్వాసాన్ని బయటికి బలంగా వ్యక్తపరుస్తున్నాడు. ఎప్పుడైతే మాహత్ములైనవారు జ్ఞానాన్ని యదార్థమని చెబుతారో, అప్పుడు దాని యొక్క విశ్వసనీయత స్థిరపడుతుంది. మహర్షులు ఆధ్యాత్మిక జ్ఞానంపై పూర్తి పట్టు కలవారు. అందుకే, అర్జునుడు ఆ మహర్షులను పేర్కొన్నాడు - నారదుడూ, అసితుడూ, దేవలుడూ మరియు వ్యాసుడి వంటి వారు, శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట భగవానుడు, మరియు సర్వ కారణ కారకుడని చెప్పి ఉన్నారు. మహాభారతంలోని భీష్మ పర్వంలో, ఒక పద్యంలో ఎంతో మంది, శ్రీ కృష్ణుడిని స్తుతిస్తారు. "శ్రీ కృష్ణుడే సర్వ జగత్తులకూ సృష్టికర్త, మరియు అందరి మదిలోని భావాలనూ ఎరిగినవాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించే అందరు దేవతలకూ ప్రభువ"ని, నారదుడు స్తుతించాడు. "శ్రీ కృష్ణ భగవానుడే సమస్త యజ్ఞముల లక్ష్యం, మరియు నియమనిష్ఠల సారం. ఆయనే, సమస్తమునకూ భూత, వర్తమాన, భవిష్యత్తు" అని, మార్కండేయ మహర్షి వివరించాడు. "ఆయన దేవ దేవుడు, మరియు విష్ణుమూర్తి యొక్క ప్రథమ మూల స్వరూపమ"ని, భృగు మహర్షి పేర్కోన్నాడు. "ఓ కృష్ణా, నీవే వసువులకు ప్రభువువు, నీవే ఇంద్రుడికీ, మరియు ఇతర దేవతలకూ శక్తిని ప్రసాదించావు" అని వేద వ్యాసుడు వెల్లడించాడు. ఇంకా ఎందరో మహర్షులు, కృష్ణ భగవానుడిని స్తుతించారు. ఆ మహోన్నతమైన, ప్రామాణికమైన మహాత్ములను ఊటంకిస్తూ అర్జునుడూ, ఇప్పుడు శ్రీ కృష్ణుడే, సర్వ కారణ కారకుడనని చెప్పటం ద్వారా, స్వయముగా వారి మాటలను ధ్రువీకరిస్తున్నాడు.

05:14 - సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ।। 14 ।।

ఓ కృష్ణా, నీవు చెప్పినదంతా సత్యమేనని నేను దృఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. ఓ ప్రభూ, దేవతలు కానీ, దానవులు గానీ, నీ యధార్థ స్వరూపమును తెలుసుకోలేరు.

శ్రీ కృష్ణుడి దివ్య వైభవమునూ, మరియు అనంతమైన ఔన్నత్యమునూ, క్లుప్తముగా, శ్రద్ధతో విన్న పిదప, అర్జునుడికి ఇంకా వినాలనే తపన పెరిగింది. శ్రీ కృష్ణుడు ఇంకా తన వైభవములు చెప్పాలనీ, తనకు పూర్తి విశ్వాసం కలిగిందనీ, భగవంతునికి నమ్మిక కలిగిస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీ కృష్ణుడు చెప్పినదంతా యధార్ధమనీ, ఎటువంటి ఊహాకల్పిత వివరణా కాదనీ వక్కాణిస్తున్నాడు, అర్జునుడు. ‘భగవాన్’ అంటే, శక్తీ, జ్ఞానమూ, సౌందర్యమూ, యశస్సూ, ఐశ్వర్యమూ, మరియు వైరాగ్యమనే ఈ ఆరు ఐశ్వర్యములనూ, అనంతమైన మాత్రంలో కలిగి ఉన్న వాడని అర్ధం. దేవతలూ, దానవులూ, మానవులూ, వీరందరూ పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. వారు సంపూర్ణ భగవత్ తత్త్వాన్ని తమంత తాము తెలుసుకోలేరు.

06:27 - స్వయమేవాత్మనాత్మానం వేత్థ త్వం పురుషోత్తమ ।
భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే ।। 15 ।।

ఓ పురుషోత్తమా, సకలభూతముల సృష్టికర్త అయిన వాడా.. సర్వభూతేశా, దేవదేవా, జగత్పతే! నిజానికి, నిన్ను నీవు మాత్రమే, నీ అతీంద్రీయమైన శక్తి ద్వారా ఎరుగుదువు.

శ్రీ కృష్ణుడు సర్వోత్కృుష్ట పరమ పురుషోత్తముడని వక్కాణిస్తూ, అర్జునుడు ఆయనను అలా సంబోధిస్తున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇదే విషయాన్ని పేర్కొన్నది. "భగవంతుడిని ఎన్నటికీ అధిగమించలేము; ఆయన అన్నింటికీ అతీతుడు." భగవంతుడు ఎవ్వరి చేతనూ తెలుసుకోబడలేడని, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పబడింది. ఇది స్పష్టంగా తర్కబద్ధమైనదే. సమస్త జీవులూ, పరిమితమైన బుద్ధిని కలిగి ఉంటారు. కానీ, భగవంతుడు అనంతమైనవాడు. కాబట్టి, ఆయన వారి బుద్ధి పరిధికి అతీతమైనవాడు. ఇది ఆయనను ఏమీ తక్కువ చేయదు సరికదా, ఆయనను ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. ఈ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, తుదకు భగవంతుడేమిటో తెలిసినవాడొక్కడున్నాడు.. అతను స్వయానా భగవంతుడే. ఈ విధంగా, శ్రీ కృష్ణుడికి మాత్రమే, తానెవరో, తానేమిటో తెలుసు. ఒకవేళ తానే తన శక్తులను ఏదేని జీవాత్మకు ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలి జీవాత్మ కూడా, ఆయనను తెలుసుకోగలుగుతుంది.

07:57 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఎలా స్మరిస్తూ ఉండాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

31 August, 2022

దివ్య జ్ఞానం! Bhagavad Gita

 

దివ్య జ్ఞానం! ఆత్మ పూర్వ మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి ఎప్పుడు విడుదల చేయబడుతుంది?

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qIKOgBKXbEk ]

భగవంతుని యొక్క వైభవోపేతమైన, మరియు దేదీప్యమానమైన మహిమలను గుర్తుచేసుకుంటూ, ఆయనపై ధ్యానం చేయటానికి సహాయముగా, అర్జునుడికి ఈ అధ్యాయము, శ్రీ కృష్ణుడిచే చెప్పబడినది. అర్జునుడి భక్తిని మరింత ఇనుమడింపచేయాలని, తన అనంతమైన మహిమలను మరింత వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. భగవంతుడి ఉపదేశం విన్న తరువాత అర్జునుడు, శ్రీ కృష్ణుని యొక్క సర్వోన్నత స్థాయిని గురించి, తాను సంపూర్ణముగా విశ్వసిస్తున్నానని ప్రకటిస్తున్నాడు, మరియు శ్రీ కృష్ణుడే సర్వోత్కృష్ట పరమేశ్వరుడని, చాటిచెబుతున్నాడు. వినటానికి అమృతములా ఉండే ఆయన యొక్క కీర్తి విశేషాలను మరింత చెప్పమని, భగవంతుడిని ప్రార్ధిస్తున్నాడు. సమస్త పదార్ధములకూ కృష్ణుడే ఆది, మధ్య, అంతమూ కావున, ఉన్నదంతా ఆయన యొక్క శక్తి స్వరూపమే అని, శ్రీ కృష్ణుడు తెలియచేస్తున్నాడు.

01:35 - శ్రీ భగవానువాచ ।
భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః ।
యత్తేఽహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా ।। 1 ।।

శ్రీ భగవానుడు ఇలా పలుకుతున్నాడు: ఓ గొప్ప బాహువులు కలవాడా, నా దివ్య ఉపదేశాన్ని మళ్లీ వినుము. నీవు నా ప్రియ సఖుడవు కావున, నీ హితము కోరి, నేను నీకు వాటిని తెలియపరుస్తాను.

తన మహిమలను వినటంలో అర్జునుడి గాఢమైన ఆసక్తిని చూసి, శ్రీ కృష్ణుడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడతని ఆనందాన్ని మరింత పెంచటానికీ, మరియు ప్రేమయుక్త భక్తి పట్ల ఉత్సాహాన్ని ఇనుమడింపచేయటానికీ, తన యొక్క అధ్బుతమైన వైభవాలనూ, మరియు అనన్యమైన గుణములనూ ప్రకటిస్తానని, శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. ఇక్కడ ఆయన "ప్రీయమాణాయ" అన్న పదాలు వాడుతున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ప్రియమైన సఖుడని పిలుస్తున్నాడు. అందుకే ఈ అత్యంత విశేషమైన జ్ఞానాన్ని, అర్జునుడికి తెలియపరుస్తున్నానని, చెబుతున్నాడు.

02:38 - న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః ।
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః ।। 2 ।।

దేవతలకు గానీ, మహర్షులకు గానీ, నా మూల స్థానము తెలియదు. దేవతలకూ, మరియు మహర్షులకూ, మూల ఉత్పత్తి స్థానమును నేనే.

ఒక తండ్రికి తన కుమారుల పుట్టుక, మరియు జీవితం తెలుస్తుంది. ఎందుకంటే, ఆయన ప్రత్యక్షంగా దాన్ని చూస్తాడు. కానీ, తన తండ్రి యొక్క పుట్టుక, మరియు బాల్యము, ఆయన కొడుకులకు తెలియదు. ఎందుకంటే, అవి వారి పుట్టుక కంటే ముందే జరిగి పోయినవి. అదే విధంగా, దేవతలూ మరియు ఋషులూ, భగవంతుని మూల స్థానము యొక్క నిజ స్వరూపమును అర్థం చేసుకోలేరు. ఎందుకంటే, భగవంతుడు, వీరు జన్మించటం కంటే ముందునుండే ఉన్నాడు. “ఈ జగత్తులో ఎవరికి మాత్రం స్పష్టత ఉంది? ఎవరు చెప్పగలరు ఈ విశ్వం ఎక్కడ పుట్టిందో? ఎవరు చెప్పగలరు ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో? దేవతలనేవారు, సృష్టి తరువాత వచ్చారు. కాబట్టి, ఈ విశ్వం ఎక్కడినుండి ఉద్భవించిందో ఎవరికి తెలుసు?” అని వేదములు తెలియజేస్తున్నాయి. “భగవంతుడు దేవతలకు అవగతం కాడు. ఎందుకంటే, ఆయన వారి కంటే ముందు నుండే ఉన్నాడు.” అని ఈశనోపనిషత్తు పేర్కొన్నది. అయినా, తన ప్రియమిత్రుని భక్తిని పెంపొందించటానికి, ఇటువంటి నిగూఢమైన జ్ఞానాన్ని, ఇప్పుడు శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.

04:10 - యో మామజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరమ్ ।
అసమ్మూఢః స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే ।। 3 ।।

నేను జన్మరహితుడను, మరియు ఆది లేనివాడిననీ, మరియు సర్వ లోక మహేశ్వరుడననీ తెలుసుకున్న మనుష్యులు, మోహమునకు గురికారు. వారు సమస్త పాపముల నుండీ విముక్తి చేయబడతారు.

తనను ఎవ్వరూ తెలుసుకోలేరని చెప్పిన పిదప, ఇప్పుడు కొంతమందికి తాను తెలుసని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. ఎవరూ స్వంత ప్రయత్నం ద్వారా భగవంతుడిని తెలుసుకొనజాలరు. కానీ, భగవంతుడే ఎవరి మీదయినా కృప చేస్తే, ఆ అదృష్టవంతమైన జీవాత్మ, ఆయనను తెలుసుకోగలుగుతుంది. కాబట్టి, భగవంతుడిని తెలుసుకోగలిగిన వారంతా, ఆయన దివ్య కృప ద్వారానే దానిని సాధించగలిగారు. ఇంతకుముందు శ్రీ కృష్ణుడు, "నా యందే భక్తితో లగ్నమై ఉండే మనస్సుగలవారికి, నా దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాను; దానితో వారు సునాయాసముగా నన్ను పొందుతారు." అని వివరించాడు. ఆయనే సర్వోన్నత దేవాది దేవుడని తెలుసుకున్న వారు, ఇక భ్రమకు లోను కారు. ఇటువంటి భాగ్యశాలి అయిన జీవాత్మలు, తమ పూర్వ, మరియు ప్రస్తుత కర్మబంధాల నుండి విడుదల చేయబడతారు, మరియు ఆయన పట్ల ప్రేమ యుక్త భక్తిని పెంపొందించుకుంటారు. జీవాత్మలకూ, మరియు తనకూ ఉన్న భేదాన్ని చెప్పటం కోసం, శ్రీ కృష్ణుడు తానే సర్వ లోక మహేశ్వరుడనని ప్రకటిస్తున్నాడు. "భగవంతుడు సమస్త ఈశ్వరులకే ఈశ్వరుడు; ఆయనే సర్వ దేవతలకూ దేవుడు. అందరు ప్రియమైన వారికీ ప్రియమైనవాడు; ఆయనే ఈ జగత్తును ఏలేవాడు, మరియు భౌతిక ప్రకృతి శక్తికి అతీతమైనవాడని, శ్వేతాశ్వర ఉపనిషత్తు పేర్కొంటుంది.

06:01 - బుద్ధిః జ్ఞానమసమ్మోహః క్షమా సత్యం దమః శమః ।
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయమేవ చ ।। 4 ।।

06:12 - అహింసా సమతా తుష్టిస్తపో దానం యశోఽయశః ।
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః ।। 5 ।।

బుద్ధి కుశలతా, జ్ఞానమూ, ఆలోచనలో స్పష్టతా, దయా, నిజాయితీ, మనస్సు-ఇంద్రియ నిగ్రహణా, సుఖ-దుఃఖాలూ, జనన-మరణాలూ, భయము-ధైర్యమూ, అహింసా, సమత్వం, తృప్తీ, తపస్సూ, దానమూ, కీర్తి-అపకీర్తి మొదలగు, మనుష్యులలో ఉండే గుణములలోని వైవిధ్యములు వివిధములైనవి, నా నుండే జనించాయి.

మానవ జాతిలో ఉద్భవించే వివిధ భావాలూ, ఉద్వేగాలూ, చిత్తవృత్తులన్నీ తన నుండే వస్తాయని, భగవంతుడు ప్రకటిస్తున్నాడు.
బుద్ధి అంటే సరియైన దృక్పథంలో విషయ-వస్తువులను విశ్లేషించ గల సామర్ధ్యము.
జ్ఞానము అంటే ఏది ఆధ్యాత్మికము, ఏది భౌతిక ప్రాపంచికమో వేరు చేయగల సామర్ధ్యము.
అసమ్మోహము అంటే అయోమయము, భ్రమ లేకుండుట.
క్షమా అంటే మనకు హాని చేసిన వారిని క్షమించగలిగే సామర్ధ్యము.
సత్యము అంటే సకల జనుల సంక్షేమం కోసం, నిజాన్ని ధైర్యంగా ప్రకటించడం.
దమము అంటే ఇంద్రియములను వాటి వస్తువిషయముల నుండి నిగ్రహించడం.
శమము అంటే మనస్సును నియంత్రించి, నిగ్రహించడం.
సుఖము అంటే ఆనందము, ఉల్లాసముల యొక్క అనుభూతి.
దుఃఖము అంటే కష్టము మరియు వేదన యొక్క అనుభూతి.
భవః అంటే 'నేను ఉన్నాను' అనే భావము.
అభావః అంటే మరణము యొక్క అనుభవము.
భయ అంటే రాబోయే కష్టాల మీద భయము.
అభయ అంటే భయము నుండి విముక్తి.
అహింసా అంటే మనసా, వాచా, కర్మణా ఏ ప్రాణిని కూడా బాధ పెట్టక పోవటం.
సమతా అంటే అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో కూడా ఒక్కలాగే ఉండటం.
తుష్టి అంటే కర్మ ఫలంగా ఏది లభించినా, దానితో తృప్తి చెందటం.
తప అంటే వేద విహితముగా, ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం, స్వచ్ఛందంగా చేసే నిష్ఠలు.
దానము అంటే పాత్రత, లేక అర్హత కలిగిన వారికి ఇచ్చే దానము.
యశము అంటే, మంచి గుణముల చేత వచ్చే కీర్తి.
అయశము అంటే, చెడు గుణముల వలన వచ్చే అపకీర్తి.

వ్యక్తులలో ఈ గుణములు, తాను అనుమతించిన మేర వ్యక్తమవుతుంటాయని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. కాబట్టి, ఆయనే సర్వ ప్రాణుల యొక్క మంచి, మరియు చెడు స్వభావముల మూలము. ఇది విద్యుత్కేంద్రము ద్వారా సరఫరా చేయబడిన విద్యుత్-శక్తి, వివిధ రకాల ఉపకరణాలచే ఉపయోగించబడటం వంటిది. ఒకే విద్యుత్ శక్తి, వేరు వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు, వేరువేరు ఫలితములను ఇస్తుంది. ఒక దానిలో శబ్దాన్నీ, మరొక దానిలో వెలుగునూ, వేరొక దానిలో వేడిమినీ పుట్టిస్తుంది. వేర్వేరు రకాలుగా వ్యక్తీకృతమయినా, వాటి మూలాధారము ఒక్కటే. అదే, విద్యుత్కేంద్రము నుండి ఇవ్వబడిన విద్యుత్ శక్తి. అదే విధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని బట్టి, భగవంతునిచే ఇవ్వబడిన శక్తి, మనలో మంచిగానో, లేదా చెడుగానో వ్యక్తమవుతుంది.

09:33 - ఇక మన తదుపరి వీడియోలో, సమస్త జీవులూ ఏ విధంగా అవతరించాయో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

10 August, 2022

ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి? Bhagavad Gita

  

ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (24 – 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 24 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/EysiFJDCqPo ]

భగవంతుడిని ప్రేమతో ఆరాధించే భక్తుల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ।। 24 ।।

సమస్త యజ్ఞములకూ భోక్తనూ, ఏకైక స్వామినీ నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు, తిరిగి పుట్టవలసినదే.

శ్రీ కృష్ణుడు ఇప్పుడు దేవతల ఆరాధన చేయటంలో ఉన్న లోపాన్ని, ఇక్కడ వివరిస్తున్నాడు. పరమేశ్వరుడైన భగవంతుడిచ్చిన శక్తి వలన, వారికి భౌతిక వరాలను ఇచ్చే సామర్ధ్యం ఉంటుంది. కానీ, వారు తమ భక్తులను జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయలేరు. వారు తమ దగ్గర ఉన్నవి మాత్రమే, వేరే వారికి ఇవ్వగలరు. దేవతలు కూడా సంసార చక్రము నుండి విముక్తి కానప్పుడు, వారు తమ భక్తులను ఎలా విముక్తి చేయ గలరు? అదే సమయంలో, ఏవరికైతే సరైన జ్ఞానం ఉందో, వారు తమ సంపూర్ణ భక్తిని భగవంతుని చరణారవిందాల యందే సమర్పిస్తారు, మరియు వారి భక్తి పరిపక్వత చెందినప్పుడు, వారు మర్త్యలోకాన్ని దాటి, దివ్య ధామానికి చేరుకుంటారు.

01:53 - యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 25 ।।

దేవతలను పూజించే వారు, దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు, పితృదేవతల దగ్గరకి వెళ్తారు. భూతప్రేతములను అర్చించువారు, అలాంటి వాటిలో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.

ఎలాగైతే ఒక గొట్టం లోని నీరు, ఆ గొట్టం అనుసంధానం చేయబడిన ట్యాంక్ స్థాయి వరకే పైకి వస్తాయో, భక్తులు తాము దేనిని పూజిస్తారో, దాని స్థాయి వరకే ఉన్నతిని సాధించగలరు. ఈ శ్లోకంలో, వేరువేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలనూ, వివిధ రకములైన గమ్యములనూ తెలియచేస్తున్నాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతిని సాధించటం కోసం, మనం ఆ పరమాత్మనే ఆరాధించాలని తెలుసుకోవటం కోసం, ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడూ, సూర్యుడూ, కుబేరుడూ, అగ్నీ వంటి వారిని ఆరాధించేవారు, స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత, వారు స్వర్గము నుండి పంపించి వేయబడతారు. పితృలు అంటే పూర్వీకులు. వారి పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే. కానీ, వారి సంక్షేమం కోసం అతి చింతన నష్టదాయకమైనది. పితృ దేవతలను పూజించేవారు, మరణించిన పిదప, తమ పూర్వీకుల లోకాలకు వెళతారు. తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తారు. ఈ వామ-మార్గ తాంత్రికులు, భూతప్రేతములను ఆవాహనచేస్తారు. ఇటువంటి పనులలో పాల్గొనే వారు, వారి తదుపరి జన్మలో, భూతప్రేతములలో జన్మిస్తారు. అయితే, సర్వోన్నత భక్తులు ఎవరంటే, తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారు. భగవంతుని ఆరాధనకై దృఢ సంకల్పము చేసి, మరియు ఆయన భక్తి యందే నిశ్చలబుద్ధితో ఉన్నటువంటి ధన్యులైన జీవులు, తదుపరి జన్మలో, ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.

03:58 - పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 26 ।।

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగానీ, ఒక పువ్వు గానీ, ఒక పండు గానీ, లేదా నీరైనా సమర్పించినా, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా స్వీకరిస్తాను.

దేవతల, మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దేనినైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే, అది సమర్పించండి. భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వును సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే, భగవంతునికి కేవలం ఒక ఆకును సమర్పించండి. ప్రేమతో ఇచ్చినప్పుడు, అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ, మనం దేనిని సమర్పించినా, భక్తితో, ప్రేమతో సమర్పించాలి. ఆరాధించే వారి భక్తి మాత్రమే, భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.  మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులూ, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు, దుర్యోధనుడు గర్వంతో, యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేశాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆతిథ్యాన్ని తిరస్కరించి, ఒక సామాన్యమైన విదురని అనే మహిళ కుటీరానికి వెళ్ళాడు. ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటంతో, విదురని చాలా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి. కానీ, ప్రేమభావనలో, ఆమె బుద్ధి ఎంతగా అయోమయం అయిపోయిందంటే, ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు తినిపించిన సంగతి కూడా తెలియలేదు. అయినప్పటికీ, ఆమె భక్తిని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలనే తిన్నాడు. భగవంతునికి సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చాము? అనేదే అయనకు ముఖ్యం.

06:25 - యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।।

ఓ కుంతీ పుత్రుడా, నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, వాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.

మనం ఎటువంటి సామాజిక భాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్ధ రహిత పానీయాలను త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలను ఆచరిస్తున్నా, ఏ వ్రతాలూ, నిష్ఠలూ ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి. తరచుగా జనులు భక్తిని దైనందిన జీవితం కంటే వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే పూజ చేసేటప్పుడూ, ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే కనబరుస్తుంటారు. నిజానికి భక్తి అంటే, మీరు చేసే ప్రతి పనినీ, భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే, తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే. పనులను ఆయనకు అంకితం చేసి, మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి వేస్తే, దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులను ఇటువంటి దృక్పథం, దివ్యమైన భగవత్ సేవగా, సంపూర్ణముగా మార్చివేస్తుంది. శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, లేదా బుద్ధితో కానీ, తన వ్యక్తిగత స్వభావం అనుగుణంగా చేసే వాటన్నింటినీ, శ్రీమన్నారాయణుడికే అర్పించాలి. భగవంతునికి సమర్పించడం అంటే, మనం పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్నామన్న అంతర్గత భావనతో చేయాలి.

08:16 - శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ।। 28 ।।

అన్ని పనులనూ నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసముచే నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడతావు, మరియు నన్ను చేరుకుంటావు.

అగ్ని పొగచే కప్పివేసి ఉన్నట్టు, ప్రతి ఒక్క పని కూడా, లోపాలతో కూడి ఉంటుంది. మనం భూమిపై నడుస్తున్నప్పుడు, తెలియకుండానే ఎన్నో వేల అతిచిన్న ప్రాణులను చంపేస్తాము. మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణలో, ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాతావరణానికి హాని చేయటమో, లేక వేరే వారి మనస్సును బాధపెట్టడమో జరుగుతుంది. కేవలం, ఒక కప్పు పెరుగు తిన్నా, వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది. కొన్ని మతాల్లో, ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి, నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుంటారు. ఇది కూడా మన శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని, పూర్తిగా నిలువరించలేదు. మన స్వార్ధ ప్రయోజనం తీరటం కోసం మనం పనులు చేసినప్పుడు, తెలిసినా, తెలియకపోయినా, మన పాపాలకు మనం దోషులమే. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం వాటి యొక్క ఫలితములు అనుభవించవలసినదే. మంచి పనులు కూడా బంధన కారకమే.. ఎందుకంటే, అవి ఆత్మని స్వర్గ లోకాలకు వెళ్లి, అ ఫలములను భోగించేటట్టు చేస్తాయి. ఈ విధంగా, మంచి మరియు చెడు కర్మలు కూడా, ఈ జనన-మరణ చక్రంలో ఉండిపోయేటట్టే చేస్తాయి. కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, సమస్త కర్మ ఫలితములనూ నశింపచేయటానికి, ఒక సరళమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన 'సన్యాస యోగము' అన్న పదం వాడుతున్నాడు. అంటే, స్వార్థమును త్యజించమంటున్నాడు. ఆయన అనేదేమిటంటే, మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచీ మరియు చెడూ.. ఈ రెండింటి కర్మ ఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము.

10:25 - సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।। 29 ।।

నేను సర్వ ప్రాణుల యందూ సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్లా, పక్షపాతంతో కానీ, లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు, నా యందే నివసిస్తారు, మరియు నేను వారి యందు నివసిస్తాను.

దేవుడనేవాడు ఉంటే, ఆయన సంపూర్ణ దోషరహిత న్యాయమూర్తిగా ఉంటాడని, మనందరమూ అంతర్లీనంగా నమ్ముతాము. వాన నీరు భూమిపై సమానంగా పడుతుంది. అయినా, వ్యవసాయ క్షేత్రాలలో పడే బిందువు, ధాన్యంగా మారుతుంది; ఎడారి ముళ్లపొదపై పడే బిందువు, ముల్లుగా మారుతుంది; మురుగు గుంటలో పడే బిందువు, మురుగు నీరు అవుతుంది; మరియు ఆల్చిప్పలో పడే బొట్టు, ముత్యంగా మారుతుంది. వానకి ఎలాంటి పక్షపాతం లేదు. అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి, వాన బిందువుల భాద్యత కాదు. వాటిని అందుకునే వాటి స్వభావాల్లో తేడాయే, కారణం. అదే విధంగా, భగవంతుడు ఇక్కడ అనేదేమిటంటే, ఆయన సమస్త ప్రాణుల యందూ సమానమైన కృపను చూపిస్తున్నాడు. అయినా, ఆయనను ప్రేమించని వారు, వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచేత, ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకపోతున్నారు.

11:55 - ఇక మన తదుపరి వీడియోలో, మనస్సులు అపవిత్రంగా ఉన్న వారు ఏమి చేయవచ్చు.. అనేటటువంటి విషయాన్ని, శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

27 July, 2022

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది? Bhagavad Gita

  

నాస్తిక భావాలు! క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయితే ఏమవుతుంది?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (12 – 17 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 12 నుండి 17 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/kyuLkjkLUWI ]

మనుషుల్లో నాస్తిక భావాలు ప్రబలడానికి కారణం ఏంటో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:49 - మోఘాశా మోఘకర్మాణో మోఘజ్ఞానా విచేతసః ।
రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ।। 12 ।।

భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనైనటువంటి జనులు, ఆసురీ మరియు నాస్తిక భావాలను పెంపొందించుకుంటారు. ఆ అయోమయ స్థితిలో, అభ్యుదయం / సంక్షేమం కోసం వారి ఆశలు వ్యర్థమవుతాయి. వారు ఫలాసక్తితో చేసే కర్మలు అన్నీ నిష్ఫలమే, మరియు వారి జ్ఞానము, అయోమయ స్థితిలో ఉంటుంది.

భగవంతుని సాకార రూపం గురించి, ఎన్నో రకాల నాస్తిక ప్రతిపాదనలు ప్రాచుర్యంలో ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంలో దిగి రాలేడని, కొందరు విశ్వసిస్తారు. అందుకే, శ్రీ కృష్ణుడు దేవుడు కాదనీ, కేవలం ఒక యోగి మాత్రమే అనీ అంటారు. మరి కొందరు, శ్రీ కృష్ణుడు 'మాయా-విశిష్ట' బ్రహ్మ అంటారు.. అంటే, భౌతిక శక్తి సంపర్కం వలన వచ్చే ఒక తక్కువ స్థాయి దివ్య వ్యక్తిత్వము అని అర్థం. ఇంకొందరు, శ్రీ కృష్ణుడు, బృందావన గోపికలతో తిరిగిన ఒక సత్ప్రవర్తన లేని వ్యక్తిగా జమ కడతారు. శ్రీ కృష్ణుడు తెలిపిన ఈ శ్లోకం ప్రకారం, ఈ అన్ని సిద్ధాంతాలూ తప్పే, మరియు వీటిని నమ్మే వారి బుద్ధి, భౌతిక మాయా శక్తిచే భ్రమకు లోనయ్యి ఉంది. ఇటువంటి అవైదికమైన సిద్ధాంతాలను నమ్మేవారు, ఆసురీ స్వభావం కలిగినవారుగా పరిగణించ బడతారు. పరమేశ్వరుని సాకార స్వరూపంపై దైవీ భావన లేనందున, వారు ఆయన పట్ల భక్తిలో నిమగ్నమవ్వలేరు. అలాగే, నిరాకార బ్రహ్మం పట్ల భక్తి అత్యంత క్లిష్టమైనది కావటం వలన, అదికూడా చేయలేరు. ఆ ఫలితంగా శాశ్వతమైన సంక్షేమ మార్గాన్ని వారు కోల్పోతారు. క్షణభంగురమైన భౌతిక శక్తి యొక్క ఆకర్షణలచే భ్రమకు లోనయ్యి, వారి యొక్క శాశ్వత సంక్షేమం పట్ల ఆశలు నిష్ఫలమైపోతాయి.

02:47 - మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ।। 13 ।।

ఓ పార్థ, నా యొక్క దివ్యమైన శక్తిని ఆశ్రయించిన మహాత్ములు, ‘నేనే’ సమస్త సృష్టికీ ఆది మూలమని తెలుసుకుంటారు. అనన్య చిత్తముతో, కేవలం నాయందే మనస్సు లగ్నం చేసి, వారు నా భక్తిలో నిమగ్నమౌతారు.

భౌతిక, ప్రాపంచిక జీవితం అనేది, మాయా మోహితులై నిద్ర పోయేవారు అనుభూతి చెందే ఒక దీర్ఘమైన కల. వీరితో పోల్చితే, తమ అజ్ఞానం నుండి మేల్కొని, భౌతిక దృక్పథాన్ని ఒక పీడ కల లాగా, ప్రక్కకి తోసి వేసిన వారే మహాత్ములు. భౌతిక శక్తి మాయ పట్టు వీడిపోయి, వారు ఇప్పుడిక దివ్య యోగమాయ శక్తి ఆశ్రయంలో ఉన్నట్టు అర్థం. ఇటువంటి జ్ఞానోదయమైన మహాత్ములు, భగవంతునితో తమకున్న నిత్య సంబంధము యొక్క ఆధ్యాత్మిక యదార్థాన్ని గుర్తించినవారు. ఎలాగైతే భగవంతునికి, నిరాకార తత్వము, మరియు సాకార రూపమనే రెండు రకాల అస్థిత్వమున్నదో, ఆయన యోగమాయ శక్తికి కూడా, రెండు అస్థిత్వములుంటాయి. అదొక నిరాకార శక్తి. కానీ, అది కూడా ఒక సాకార స్వరూపంలో, రాధా, సీతా, దుర్గా, లక్ష్మీ, కాళీ, పార్వతీ మొదలగు రూపాలలో వ్యక్తమవుతుంది. ఎలాగైతే కృష్ణుడూ, రాముడూ, శివుడూ, నారాయణుడూ మొదలైనవారంతా, ఒకే భగవంతునియొక్క అబేధ స్వరూపాలో, ఈ దివ్య శక్తి స్వరూపాలు కూడా, భగవంతుని దైవీ శక్తి యొక్క నిజరూపాలే. ఒకదాని నుండి ఒకటి, అబేధములే. మహాత్ములు భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క శరణు పొంది ఉంటారు. యోగమాయ కృపవలన, మనకు భగవంతుని యొక్క దివ్య ప్రేమా, జ్ఞానము, మరియు కృప లభిస్తుంది. భగవత్ కృప లభించిన మహాత్ములు, దివ్య ప్రేమ ప్రసాదించబడి ఉంటారు, మరియు అవిచ్ఛిన్నంగా, నిరంతరం భగవత్ భక్తిలోనే నిమగ్నమై ఉంటారు.

04:54 - సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 14 ।।

ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, దృఢ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తితో ఆరాధిస్తుంటారు.

భక్తులు తమ భక్తి సాధన కోసం, దానిని పెంపొందించుకోవటం కోసం, కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు. భగవంతుని కీర్తిని గానం చేయటమే కీర్తన. ఈ కీర్తన అనేది, భక్తిని సాధన చేయటానికి ఉన్న అత్యంత ప్రభావమైన పనిముట్టు. అది మూడు రకాల భక్తి విధానాలను కలిగి ఉంటుంది. శ్రవణం, కీర్తనం, మరియు స్మరణం. మన లక్ష్యం భగవంతునిపై మనస్సుని లగ్నం చేయటమే. అది కీర్తనం, మరియు శ్రవణంతో పాటుగా చేస్తే, ఇంకా సులువవుతుంది. మనస్సనేది, గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత, ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము, మరియు కీర్తనము, జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి. మనస్సును పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీసుకురావటానికి, అవి సహాయం చేస్తాయి. కీర్తన ప్రక్రియ వలన, మరిన్ని ప్రయోజనాలున్నాయి. తరచుగా జనులు జపము, లేదా ధ్యానము ద్వారా, భక్తిని ఆచరిస్తుంటారు. కానీ, వారు జపములో నిమగ్నమయ్యే సదర్భంలో, నిద్రను ఆపుకోలేరు. అయినా, కీర్తన అనేది ఎంతో నిమగ్నమై చేసే పని కాబట్టి, అది సహజంగానే నిద్రను తరిమివేస్తుంది. అంతేకాక, కీర్తన అనేది ధ్యాసను మరల్చే అన్యమైన శబ్దాలను దరిచేరనివ్వదు. కీర్తన అనేది, భారతీయ యోగులలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి మార్గము. సూరదాసూ, తులసీదాసూ, మీరాబాయి, గురు నానక్, కబీర్, తుకారం, ఏకనాథ్, నార్సి మెహతా, జయదేవుడూ, త్యాగరాజు మరియు ఇతరులవంటి ప్రఖ్యాతిగల భక్తి మహాత్ములందరూ గొప్ప కవులు. వారు ఎనెన్నో భక్తి గీతాలను రచించారు, మరియు వాటి ద్వారా, కీర్తనం, శ్రవణం మరియు స్మరణంలో నిమగ్నమైనారు. ఈ కలి యుగంలో, మోక్షానికి ఒక ఉపాయం ఉంది. భగవంతుని కీర్తిని గానం చేస్తూ, మనము భవ సాగరాన్ని దాటివేయవచ్చు.

07:23 - జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ।
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్ ।। 15 ।।

మరికొందరు, జ్ఞాన సముపార్జనా యజ్ఞములో నిమగ్నమై, నన్ను చాలా రకాలుగా ఆరాధిస్తారు. కొందరు నన్ను తమతో అబేధమైన ఏకత్వముగా చూస్తారు. మరికొందరు, నన్ను తమకంటే వేరుగా పరిగణిస్తారు. ఇంకా కొందరు, నా యొక్క విశ్వ రూపము యొక్క అనంతమైన ఆవిర్భావములలో ఆరాధిస్తారు.

సాధకులు, పరమ సత్యాన్ని చేరుకోవటానికి, భిన్నభిన్న పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఆయన నిత్య అంశలుగా, సేవకులగా, భగవంతుని చరణారవిందముల వద్ద భక్తితో శరణాగతి చేస్తారు. జ్ఞాన యోగమును అనుసరించేవారు, తమను తాము బ్రహ్మమే అని పరిగణించుకుంటారు. వారు "సోహం (అది నేను), "శివోహం" (నేను శివుడను), మొదలైన సూత్రాలపై లోతుగా ధ్యానం చేస్తుంటారు. అద్వైత బ్రహ్మముగా, ఆ సర్వోత్కృష్ట అస్థిత్వము యొక్క ప్రాప్తి యే, వారి యొక్క నర్వోన్నత లక్ష్యం. దానికి శాశ్వతత్వమూ, జ్ఞానమూ మరియు ఆనందము వంటి గుణములున్నా, రూపములూ, గుణములూ, స్వభావములూ, మరియు లీలలూ ఉండవు. జ్ఞాన యోగులు కూడా, ఆయనను నిరాకార, సర్వవ్యాప్త తత్వంలో ఆరాధిస్తారు. వీరితో పాటుగా, పలు రకాల అష్టాంగ యోగులూ మొదలైనవారు ఉన్నారు. వారు తమను తాము భగవంతుని కంటే వేరుగా పరిగణించుకుంటారు. అదే ప్రకారంగా, ఆయనతో అనుసంధానం అవుతారు. ఇంకా కొందరు, ఈ కంటికి కన్పించే వ్యక్తమైన విశ్వాన్ని, భగవంతునిగా ఆరాధిస్తారు. వైదిక తత్వములో దీనిని, 'విశ్వ రూప ఉపాసన' అంటారు. ఈ జగత్తు భగవంతునిలో భాగమే కాబట్టి, దాని పట్ల దైవీ భావము తప్పేమీ కాదు. కానీ, అది అసంపూర్ణము. అటువంటి భక్తులకు, పరమేశ్వరుని యొక్క ఇతర విభూతుల పట్ల జ్ఞానం ఉండదు.

09:27 - అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మంత్రోఽహమహమేవాజ్యమ్ అహమగ్నిరహం హుతమ్ ।। 16 ।।

09:37 - పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ చ ।। 17 ।।

నేనే వైదిక క్రతువునూ, నేనే యజ్ఞమునూ, మరియు పితృదేవతలకు సమర్పించే నైవేద్యమును. నేనే ఔషధము, నేనే వేద మంత్రమును, నేనే ఆజ్యము, నేనే అగ్నీ, నేనే సమర్పించే కార్యమును. ఈ జగత్తుకు నేనే తండ్రినీ, నేనే తల్లిని. సంరక్షకుడను నేనే; పితామహుడను నేనే; నేనే పవిత్రం చేసేవాడిని. జ్ఞానం యొక్క లక్ష్యమును నేనే, పవిత్ర శబ్దము ఓం కారమును నేనే, ఋగ్వేదమును, సామవేదమును మరియు యజుర్వేదమును నేనే.

ఈ శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు తన యొక్క అనంతమైన వ్యక్తిత్వానికి గల వేరువేరు స్వరూపములను చెబుతున్నాడు. క్రతువు, యజ్ఞము, అంటే, వేదములలో చెప్పబడిన అగ్నిహోత్ర యజ్ఞము వంటివి. ఇది స్మృతులలో చెప్పబడిన ‘వైశ్వ’ దేవ యజ్ఞముల వంటివి. ఔషదము అంటే, వైద్య శాస్త్రంలో ఉపయోగించే మొక్కలలోని, వ్యాధిని నయం చేయగలిగే సామర్ధ్యము, అని అర్థం. సృష్టి అనేది భగవంతుని నుండి ఉద్భవిస్తుంది. అందుకే, ఆయన దాని తండ్రి. సృష్టికి ముందు ఆయన, అవ్యక్తమైన భౌతిక శక్తిని తన ఉదరము యందు ఉంచుకుంటాడు. కాబట్టి, ఆయన ఆ జగత్ సృష్టికి అమ్మ. ఆయనే ఈ విశ్వ సృష్టిని నిర్వహించేవాడూ, పోషించేవాడూ.. అందుకే ఆయన దాని సంరక్షకుడు. ఆయనే, సృష్టికర్త బ్రహ్మ దేవుని తండ్రి.. అందుకే ఆయన సమస్త విశ్వమునకూ పితామహుడు. వేదములు భగవంతుని నుండి ఉద్భవించాయి. రామాయణంలో ఒక శ్లోకం, దీనిని పునరుద్ఘటించింది. పరమాత్ముడే వేదం, వేదమే పరమాత్మ.

11:30 - ఇక మన తదుపరి వీడియోలో, భోగ వస్తు ప్రాప్తికై, వైదిక కర్మ కాండలను ఆచరించే వారిని గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

13 July, 2022

ఏవి ‘పాపములు’? హృదయం మలినమవటానికి అసలు కారణం ఏంటి? Bhagavad Gita

  

ఏవి ‘పాపములు’? హృదయం మలినమవటానికి అసలు కారణం ఏంటి?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (01 - 05శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/e-cOeyLHNdc ]

ఈ అధ్యాయంలో, మనలో విస్మయాన్నీ, పూజ్య భావాన్నీ, మరియు భక్తినీ ఉత్పన్నం చేసే - తన యొక్క సర్వోత్కృష్ట మహిమలను గురించి, శ్రీ కృష్ణుడు తెలియజేయ బోతున్నాడు..

00:54 - శ్రీ భగవానువాచ ।
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే ।
జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ।। 1 ।।

శ్రీ కృష్ణ భగవానుడిలా పలుకుతున్నాడు. ఓ అర్జునా, నీకు నా మీద అసూయ లేదు కాబట్టి, ఈ యొక్క అత్యంత రహస్యమైన జ్ఞానాన్నీ, మరియు అనుభవపూర్వక విజ్ఞానాన్నీ, ఇప్పుడు నేను నీకు తెలియజేస్తున్నాను; ఇది తెలుసుకున్న తరువాత, నీవు భౌతిక సంసార బాధల నుండి విముక్తి చేయబడతావు.

గర్వం మరియు దురభిమానం వలన, అసూయ వంటి ధోరణి జనిస్తుంది. అది ఒక వ్యక్తి యొక్క భక్తి పూర్వక పూజ్య భావాన్ని, దెబ్బ తీస్తుంది. భగవంతునికి తనకంటూ కావలసినది ఏమీ లేదు. కాబట్టి, ఆయన చేసే ప్రతి కార్యం, జీవాత్మల సంక్షేమం కోసమే అన్న సామాన్య విషయాన్ని కూడా, ఈర్ష్యతో ఉన్న జనులు అర్థం చేసుకోలేరు. జీవుల భక్తిని ఇనుమడింపచేయటానికే, తన కీర్తిని తాను చెప్పుకుంటాడు. అంతేకానీ, మనకున్న అహంభావమనే ప్రాపంచిక దోషము ఆయనకు లేదు. అర్జునుడు ఉదారుడు, విశాలహృదయము కలవాడు, ఈర్ష్య అనే దోషము లేనివాడు కాబట్టి, శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పబోయే దానికి, అర్జునుడు సంపూర్ణంగా అర్హుడు. 

02:16 - రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ ।
ప్రత్యక్ష్యావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ।। 2 ।।

ఈ జ్ఞానము అన్ని విద్యలకూ రారాజు, మరియు అత్యంత గోప్యమయినది. ఇది విన్న వారిని, పవిత్రం చేస్తుంది. ఇది నేరుగా, అనుభవ పూర్వకంగా తెలుసుకోవటానికి వీలైనది, ధర్మ బద్ధమైనది, ఆచరించటానికి సులువైనది, శాశ్వతమైన ఫలితమును ఇచ్చేటటువంటిది.

శ్రీ కృష్ణుడు, తాను ఉపదేశించే జ్ఞానం యొక్క సర్వోత్కృష్ట స్థాయిని వక్కాణించటానికి, “రాజ” అన్న ఉపమానం వాడుతున్నాడు. తన ఉపదేశాన్ని, విశ్వాసము, మతము, అభిప్రాయము, ఆచారము, లేదా నమ్మకము అని ఆయన అనటంలేదు. తను అర్జునుడికి చెప్పబోయేది, అన్ని శాస్త్రాలలో కెల్లా రారాజు అని ప్రకటిస్తున్నాడు. ఈ జ్ఞానము అత్యంత గోప్యమైనది కూడా. స్వేచ్ఛ ఉన్నచోటే, ప్రేమ సాధ్యమవుతుంది కాబట్టి, కావాలనే, భగవంతుడు తను నేరుగా, సునాయాసముగా కనబడకుండా, తనను తాను దాచి ఉంచుకుంటాడు. దీని ద్వారా ఆత్మకు భగవంతుడిని ప్రేమించాలా లేదా అనే స్వేచ్ఛను ఇస్తాడు. ఒక యంత్రము ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. మనం ఆయనను ప్రేమించాలని, భగవంతుడు కోరుకుంటాడు. అందుకే మనకు, ఆయనను కోరుకోవాలా, లేదా, అన్న స్వేచ్ఛను ఇస్తున్నాడు. దాన్ని మన ఇష్టానికే వదిలి వేస్తున్నాడు. కేవలం మనం ఎంచుకున్న మార్గం వలన కలిగే పరిణామాలను మాత్రం, తెలియచెబుతాడు. అలాగే, ఏ మార్గం అవలంభించాలనే స్వేచ్ఛను మనకే వదిలివేస్తాడు. భక్తి యొక్క జ్ఞానము అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే, అది అల్పమైన స్వార్ధముచే కళంకితం కానిది. భక్తుడి యొక్క పాపములూ, బీజములూ, మరియు అవిద్యను, భక్తి సాధన నాశనం చేస్తుంది. ‘పాపములు’ అంటే, జీవుడి అనంతమైన పూర్వ-జన్మల నుండీ ఉన్న పాపరాశి. నిప్పు గడ్డిమోపును భస్మం చేసినట్టు, పాపరాశినంతటినీ భక్తి దహించివేస్తుంది. ‘బీజములు’ అంటే, మనస్సులో ఉన్న మాలిన్యములు. ఇవి పాపపు పనులు చేయటానికి ఉన్న మూల కారణం. ఈ బీజములు ఉన్నంత కాలం, కేవలం పూర్వ జన్మల పాపపు పనులను నిర్మూలిస్తే సరిపోదు. ఎందుకంటే, పాపపు పనులు చేయాలనే కోరిక హృదయంలో ఉండిపోతుంది. వ్యక్తి తిరిగి పాపపు పనులు చేసే అవకాశం ఉంటుంది. భక్తి, హృదయాన్ని పవిత్రం చేస్తుంది. పాపాల యొక్క మూల బీజాలైన కామము, క్రోధము మరియు లోభములను నాశనం చేస్తుంది. కానీ, ఈ బీజముల నాశనం కూడా సరిపోదు. హృదయం మలినమవటానికి ఉన్న అసలు కారణం, అవిద్య. దీనిచే మనలని మనం ఈ దేహమే అనుకుంటాం. దాంతో, శారీరిక కోరికలను సృష్టించుకుని, అవే మనకు సంతోషాన్నిస్తాయి అనుకుంటాము. ఇటువంటి భౌతిక, ప్రాపంచిక కోరికలు తీర్చుకోవటం అనేది, మరింత కామ, క్రోధ, లోభములూ, ఇంకా ఇతర మలినముల వృద్ధికి దారి తీస్తుంది. మనస్సు పరిశుద్ధి చేయబడినా, అజ్ఞానము, అవిద్య ఉన్నంత కాలమూ, అది మరలా మలినమైపోతుంది. భక్తి అనేది అంతిమంగా - ఆత్మ మరియు భగవంతుని యొక్క అనుభవపూర్వక జ్ఞానానికి దారి తీస్తుంది. అది భౌతిక, ప్రాపంచిక అస్థిత్వము యొక్క అజ్ఞానాన్ని, నాశనం చేస్తుంది. 

05:50 - అశ్రద్దధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప ।
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ।। 3 ।।

ఓ శత్రువులను జయించేవాడా.. ఈ ధర్మము యందు విశ్వాసము లేని జనులు, నన్ను పొందలేకున్నారు. వారు పదేపదే జనన-మరణ చక్రంలో, ఈ లోకానికి తిరిగి వస్తుంటారు.

జ్ఞానము ఎంత అద్భుతమైనదైనా, మార్గము ఎంత ప్రభావశీలమైనదైనా, దాని ప్రకారంగా నడుచుకోవటానికి నిరాకరించేవానికి, అది నిరర్ధకమైనది. భగవత్ ప్రాప్తి కోసం కావలసిన మొదటి అడుగు విశ్వాసము, శ్రద్ధ. అప్పుడు వ్యక్తి, స్సత్సంగములలో పాలు పంచుకోవటం మొదలు పెడతాడు. ఇది వ్యక్తిగత భక్తి అభ్యాసమునకు, దారి తీస్తుంది. తరచుగా జనులు, తాము దేనినైతే ప్రత్యక్ష్యంగా గ్రహింపగలుగుతామో, దాన్ని మాత్రమే నమ్ముతామని అంటూ ఉంటారు. అయితే, భగవంతుని అనుభవం తక్షణమే అవ్వదు కాబట్టి, ఆయనను నమ్మరు. కానీ, నిజానికి ఈ ప్రపంచంలో ప్రత్యక్షంగా చూడక పోయినా, ఎన్నో విషయాలను నమ్ముతాం. పాలల్లో దాగి ఉన్న వెన్న మనకు కనబడకపోయినా, వెన్న పాలలో ఉందని నమ్ముతాం. అలాగే భగవంతుడు కూడా మనకు కనపడకపోయినా, అంతటా వ్యాపించి ఉంటాడు. ఆయనను చూడటానికి ఒక పక్రియ ఉంది. విశ్వాసము ఉంటే, మనకు భగవంతుని ప్రత్యక్ష అనుభూతి లభిస్తుంది, మరియు భగవత్ ప్రాప్తిని పొందుతాము. భగవంతుని మీద నమ్మకం అనేది, మానవులు అనాయాసంగా అనుసరించే సహజమైన ప్రక్రియ కాదు. మనకు ఇవ్వబడిన స్వతంత్ర-చిత్తమును ఉపయోగించుకుని, భగవంతునిపై నమ్మకం కలిగి ఉండాలనే దృఢమైన నిర్ణయానికి రావాలి. కౌరవుల సభలో, దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయటానికి ప్రయత్నించినప్పుడు, శ్రీ కృష్ణుడు ఆమె చీరను పొడిగించి, ఆమెను అవమానమూ, సిగ్గు నుండి కాపాడాడు. అక్కడున్న కౌరవులందరూ ఆ అద్భుతాన్ని చూశారు కానీ, శీ కృష్ణుని సర్వశక్తిత్వముపై నమ్మికను ఉంచటానికి, తిరస్కరించారు. నిజాన్ని అర్థంచేసుకోలేకపోయారు. ఆధ్యాత్మిక పథంపై విశ్వాసం అవసరం లేదని నిర్ణయించుకున్న వారు, దివ్య జ్ఞానాన్ని తెలుసుకోకుండా ఉండిపోతారు, మరియు జనన-మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు.

08:12 - మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా ।
మత్-స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ।। 4 ।।

ఈ సమస్త విశ్వమూ నా అవ్యక్త స్వరూపంచే వ్యాపింపబడి ఉన్నది. సమస్త ప్రాణులూ, నా యందే స్థితమై ఉన్నాయి కానీ, నేను వాటి యందు స్థితుడనుకాను.

భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి, ఆ తరువాత ఈ ప్రపంచమంతా బాగానే నడుస్తున్నదా లేదా అని, ఆ సప్త లోకాల పై నుండి తొంగి చూస్తుంటాడనే సిద్ధాంతాన్ని, వైదిక తత్వము ఒప్పుకోదు. వైదిక శాస్త్రాలన్నీ, భగవంతుడు లోకంలో సర్వ వ్యాపి అని పదే పదే ప్రతిపాదించాయి. దేవుడు ఒక్కడే. ఆయనే అందరి హృదయములలో స్థితుడై ఉన్నాడు, ప్రపంచమంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడు ఇప్పటి వరకు ఉన్న అన్నింటిలో వ్యాప్తమై ఉన్నాడు, మరియు ఇక ముందు ఉండే అన్నింటిలో వ్యాపించి ఉంటాడు. భగవంతుడు సర్వ వ్యాపి అన్న విషయాన్ని, పలు విధాలుగా అర్థం చేసుకుంటారు. అది భగవంతుని యొక్క మాయా శక్తి అనే భౌతిక శక్తి ద్వారా సృష్టించబడినది. జీవాత్మలు కూడా భగవంతుని శక్తి స్వరూపమే కానీ, వారు ఆయన యొక్క ఉత్కృష్ట స్థాయి జీవ శక్తి. కాబట్టి, ఈ ప్రపంచము, మరియు దానిలో ఉన్న అన్ని జీవులూ, భగవంతుని శక్తి స్వరూపములే, మరియు ఆయన వ్యక్తిత్వములోని భాగములే. అయినా, ఆయన సర్వ భూతములకూ అతీతుడు. ఎలాగైతే సముద్రము ఎన్నో అలలను విడుదల చేస్తున్నా, ఆ అలలన్నీ సముద్రములోని భాగములే అయినా, సముద్రమనేది, ఈ సమస్త అలల మొత్తానికన్నా ఎంతో ఎక్కువే. అదే విధంగా, జీవులు, మరియు మాయ, భగవంతుని వ్యక్తిత్వంలోని భాగమే అయినా, ఆయన వాటికన్నా ఉన్నతుడు, అతీతుడు.

10:04 - న చ మత్ స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ।। 5 ।।

అయినా సరే, ప్రాణులు నాలో స్థిరముగా ఉండవు. నా దివ్య శక్తి యొక్క అద్భుతమును తిలకించుము. నేనే సమస్త ప్రాణుల సృష్టి కర్తను, మరియు నిర్వాహకుడనూ అయినా, నేను వాటిచే కానీ, లేదా భౌతిక ప్రకృతిచే కానీ, ప్రభావితము కాను.

మాయా శక్తీ, జీవ శక్తీ అనే ఈ రెండు శక్తులకు అతీతంగా, భగవంతునికి ఒక మూడవ శక్తి ఉంది. అదే, దివ్య యోగమాయా శక్తి. యోగమాయ అనేది, భగవంతుని యొక్క సర్వ-శక్తివంతమైన శక్తి స్వరూపము. దానిని కర్తుం-అకర్తుం-సమర్థః అంటారు. అంటే, "అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది" అని. ఆయన వ్యక్తిత్వానికి మనం ఆపాదించే అద్భుతమైన విషయాలకు మూలశక్తి ఇదే. ఉదాహరణకి, భగవంతుడు మన అందరి హృదయములలో ఉన్నాడు. అయినా, మనకందరికీ అయన తెలియడు. ఎందుకంటే, అయన దివ్య యోగమాయ శక్తి, ఆయన నుండి మనలను దూరంగా ఉంచుతుంది. అదేవిధంగా, భగవంతుడు కూడా తనను తాను మాయా ప్రాబల్యం నుండి దూరంగా ఉంచుకుంటాడు. మాయ అనేది, భగవంతుని ముందు నిలబడలేదు. భగవంతుడు, భౌతిక, ప్రాకృతిక శక్తి మాయలో వ్యాప్తమై ఉన్నా, దానికి అతీతుడు. ఒకవేళ ప్రపంచం భగవంతుడిని ప్రభావితం చేయగలిగితే, అప్పుడు ఈ లోకం క్షయమై పోయినా, లేదా వినాశనము చేయబడ్డా, ఆయన యొక్క స్వభావము, మరియు వ్యక్తిత్వము కూడా కృశించి పోవాలి. కానీ, ఈ ప్రపంచంలో అన్ని మార్పులూ చేర్పులూ జరుగుతున్నా కూడా, భగవంతుడు తన నిజ-అస్థిత్వంలోనే స్థితుడై ఉంటాడు.

11:54 - ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుని దివ్యయోగమాయ శక్తి గురించి, మరింత స్పష్టంగా తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

05 July, 2022

భగవద్గీత Bhagavadgita in Telugu - Ashtamodhyaya (Chapter 8, Verses 23 – 28)

‘ఆత్మ నిష్క్రమణ’కు రెండు మార్గాలు! ఏ మార్గం మోక్షానికీ, ఏది పునర్జన్మకూ దారి తీస్తుంది? - #భగవద్గీత అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (23 – 28 శ్లోకాలు)! | Srimad #Bhagavadgita in #Telugu Part 64 - Ashtamodhyaya (Chapter 8, Verses 23 – 28) - Bhakti shatkamu - Akshara Brahma Yoga | @maheedhar |


#భగవద్గీత #Bhagavadgita #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharPlanetLeaf #Hinduism #Maheedhar #ఆత్మనిష్క్రమణ #Mahabharatam #iskcon #krishna #lordkrishna #Bhagavadgeetha #learngita #AksharabrahmaYoga #chandamamakathalu #teluguaudiobook #telugukathalu #bhagavadgitakathalu

29 June, 2022

ప్రళయము – నాలుగు రకాలు! భగవద్గీత Bhagavad Gita

  

ప్రళయము – నాలుగు రకాలు! అలౌకికమైన మరియు సనాతనమైన అవ్యక్త అస్థిత్వం అంటే?

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (18 – 22 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 18 నుండి 22 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/P5npOaGsEJ0 ]

ఆయన యందే స్థితమై ఉన్న సర్వ ప్రాణులూ, సర్వ వ్యాప్తుడైన భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:50 - అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే ।
రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్తసంజ్ఞకే ।। 18 ।।

బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులూ అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి, మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ, తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి.

మహాద్భుతమైన విశ్వ క్రీడలో వివిధ లోకాలూ, వాటి యొక్క గ్రహ వ్యవస్థలూ, మళ్లీ మళ్లీ, సృష్టీ, స్థితీ, ప్రళయ చక్రానికి గురవుతూనే ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగలు అయిపోయేటప్పటికి, అంటే, ఒక కల్పము యొక్క (432,00,00,000) నాలుగు వందల ముప్ఫై రెండు కోట్ల సంవత్సరములలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని గ్రహ వ్యవస్థలూ నాశనం చెందుతాయి. దీనినే, నైమిత్తిక ప్రళయం, అంటే, పాక్షిక లయము అంటారు. ఎలాగైతే ఒక పిల్లవాడు పగలు ఆడుకునేటప్పుడు బొమ్మలతో నిర్మాణాలు చేసి, పడుకునేటప్పుడు వాటిని మళ్లీ తీసేస్తాడో, అదే విధంగా, బ్రహ్మ లేచినప్పుడు, ఈ విశ్వ-గ్రహాల వ్యవస్థనీ, వాటి యందు జీవ రాశులనూ సృష్టించి, పడుకునే ముందు వాటన్నింటినీ లయం చేస్తాడు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల జీవన కాలం ముగిసే సమయానికి, సమస్త విశ్వమూ లయం చేయబడుతుంది. ఈ సమయంలో, మొత్తం భౌతిక సృష్టి లయం చేయబడుతుంది. పంచ-మహాభూతములు, పంచ-తన్మాత్రలలో విలీనమవుతాయి. పంచ తన్మాత్రలు, అహంకారములో విలీనమవుతాయి. అహంకారము, మహత్తు యందు విలీనమవుతుంది.. మహత్తు, ప్రకృతిలోనికి విలీనమవుతుంది. ప్రకృతి అనేది, భౌతిక శక్తి, మాయ యొక్క సూక్ష్మ రూపము. మాయ - దాని యొక్క ఆదిమమైన రూపంలో, మహా విష్ణువు యొక్క శరీరంలో కూర్చుంటుంది. దీనినే, ప్రాకృతిక ప్రళయం, లేదా మహా ప్రళయం అంటారు. తిరిగి మహా విష్ణువు సృష్టి చేయటానికి ఎప్పుడైతే సంకల్పిస్తాడో, ఆయన ప్రకృతి రూపంలో ఉన్న భౌతిక శక్తి వైపు తన చూపును ప్రసరిస్తాడు. కేవలం ఆయన దృష్టి సారించినంతనే, అది ఆవిష్కరించటం మొదలవుతుంది. ప్రకృతి నుండి మహత్తు వస్తుంది, మహత్తు నుండి అహంకారము వస్తుంది, అహంకారము నుండి పంచ-తన్మాత్రలు సృష్టించబడతాయి, పంచ-తన్మాత్రల నుండి పంచ-మహాభూతాలు సృష్టించబడతాయి. ఈ ప్రకారంగా, అనంతమైన బ్రహ్మాండాలు సృష్టించబడతాయి.

03:18 - భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే ।
రాత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవత్యహరాగమే ।। 19 ।।

బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే, సమస్త జీవ రాశులూ పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మ రాత్రి ప్రారంభమవగానే, అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మ పగలు మొదలవగానే, అవన్నీ అప్రయత్న పూర్వకంగానే వ్యక్తమవుతాయి.

వేదములు నాలుగు రకాల ప్రళయములను పేర్కొన్నాయి.

నిత్య ప్రళయం: ప్రతి రోజూ మనం గాఢ నిద్రలోనికి జారిపోయినప్పుడు, మనలోని స్పృహ లయమైపోవటాన్ని, నిత్య ప్రళయం అంటారు.

నైమిత్తిక ప్రళయం: బ్రహ్మ యొక్క పగలు అయిపోయే సమయంలో, మహర్లోకం వరకూ ఉన్న అన్ని లోకాలూ లయమై పోయే ప్రక్రియని, నైమిత్తిక ప్రళయం అంటారు. ఆ సమయానికి ఆయా లోకాల్లో నివసిస్తున్న ఆత్మలన్నీ, అవ్యక్తమైపోతాయి. అవి విష్ణుమూర్తి దేహంలో అచేతనావస్థలో ఉంటాయి. తిరిగి బ్రహ్మ ఈ లోకాలను సృష్టించినప్పుడు, వీటికి తమ తమ పూర్వ జన్మ కర్మల ప్రకారంగా, పుట్టుక లభిస్తుంది.

మహా ప్రళయం: ఇది బ్రహ్మ యొక్క జీవన కాలం ముగిసినప్పుడు జరిగే సమస్త విశ్వం యొక్క లయం. ఈ సమయంలో, విశ్వంలోని అన్ని ఆత్మలూ, మహా విష్ణువు యొక్క దేహంలో అచేతనావస్థ లోనికి వెళ్తాయి. వాటి యొక్క స్థూలశరీరాలూ, మరియూ సూక్ష్మ శరీరాలూ లయమైపొతాయి కానీ, కారణ శరీరాలు ఉండిపోతాయి. తదుపరి సృష్టి క్రమం జరిగినప్పుడు, వాటికి మళ్లీ తమ తమ కారణ శరీరాల్లో దాచి ఉన్న సంస్కారాలూ, మరియూ కర్మలను బట్టి, వాటికి జన్మ ఇవ్వ బడుతుంది.

ఆత్యంతిక ప్రళయం: ఆత్మ చివరికి భగవంతుడిని చేరుకున్నప్పుడు, అది జనన-మరణ చక్రం నుండి శాశ్వతంగా విడుదల చేయబడుతుంది. ఆత్యంతిక ప్రళయం అంటే, జీవుడిని సనాతనముగా కట్టివేసిన మాయా బంధనములు వీడిపోవటం.

05:19 - పరస్తస్మాత్తు భావోఽన్యోఽవ్యక్తోఽవ్యక్తాత్ సనాతనః ।
యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ।। 20 ।।

ఈ యొక్క వ్యక్తమయిన, మరియు అవ్యక్తమయిన సృష్టి కంటే, అలౌకికమైన, మరియూ సనాతనమైన అవ్యక్త అస్థిత్వం కలదు. మిగతా అన్నీ నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.

భౌతిక లోకాల యొక్క నిజ స్వరూపము, మరియు వాటి యొక్క తాత్కాలిక స్వభావము వెల్లడించిన తరువాత, శ్రీ కృష్ణుడు తదుపరి ఇక ఆధ్యాత్మిక కోణ పరిధి గురించి, మాట్లాడుతున్నాడు. అది భౌతిక శక్తి కన్నా అతీతమైనది, మరియూ భగవంతుని దివ్య యోగమాయా శక్తిచే సృష్టించబడినది. మిగతా అన్ని భౌతిక లోకాలూ నాశనమై పోయినా, అది మాత్రం వినాశము చెందదు. భగవంతుని సమస్త సృష్టిలో, దివ్య ఆధ్యాత్మిక ధామము 3/4వ(ముప్పావు) వంతు, భౌతిక లోకములు 1/4వ(పావు) వంతు సృష్టించబడి ఉంది.

06:19 - అవ్యక్తోఽక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిమ్ ।
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ ।। 21 ।।

ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే, సర్వోన్నత లక్ష్యము. దానిని చేరిన తరువాత, వ్యక్తి ఈ లౌకికమైన మర్త్య లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.

ఆధ్యాత్మిక లోకంలోని దివ్య ఆకాశాన్నే, పరవ్యోమము అంటారు. భగవంతుని భిన్న స్వరూపముల యొక్క శాశ్వతమైన దివ్య ధామములు, అక్కడ ఉంటాయి. ఉదాహరణకి : శ్రీ కృష్ణుని ధామమైన గోలోకమూ, శ్రీ రామచంద్రుని ధామమైన సాకేత లోకమూ, నారాయణుని ధామమైన వైకుంఠ లోకమూ, సదాశివుని లోకమైన శివ లోకమూ, దుర్గా మాత ధామమైన దేవీ లోకము మొదలగునవి. ఈ లోకాల్లో, సర్వేశ్వరుడు తన దివ్య మంగళ స్వరూపముతో, తన నిత్య పరివారముతో, నిత్యమూ నివసిస్తుంటాడు. ఈ యొక్క భగవంతుని స్వరూపాలన్నీ, ఒకదానికి ఒకటి అభేధములే, ఇవి అన్నీ ఒకే భగవంతుని వేరువేరు రూపములు మాత్రమే. ఏ రూపాన్ని ఆరాధిస్తే భగవత్ ప్రాప్తిని పొందుతామో, ఆ భగవత్ స్వరూపము యొక్క ధామానికి చేరుకుంటాము. దివ్య శరీరము తీసుకున్న తరువాత, ఆత్మ,భగవంతుని దివ్య కార్యకలాపాలలో, దివ్య లీలలలో, ఇక శాశ్వతంగా పాలు పంచు కుంటుంది.

07:43 - పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాంతఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ।। 22 ।।

సర్వోత్కృష్ట పరమ పురుషుడే, అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడూ, మరియూ సర్వ ప్రాణులూ ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడతాడు.

ఆధ్యాత్మిక అంతరిక్షంలో, తన దివ్య ధామములో నివసించే భగవంతుడే, మన హృదయములో కూడా స్థితుడై ఉన్నాడు. ఆయన భౌతిక ప్రపంచంలో ప్రతి పరమాణువులో కూడా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. భగవంతుడు అంతటా సమానంగా ఉన్నాడు. ఆయన అంతటా, నూటికి నూరు శాతం ఉన్నాడు. కానీ, ఆ యొక్క సర్వ-వ్యాప్త భగవానుని అస్థిత్వం, మనకు ఎటువంటి ఉపయోగకారిగా ఉండదు. ఎందుకంటే, దాని యొక్క అనుభూతిని మనం రుచి చూడలేము. సర్వ వ్యాపి భగవంతుని గురించి, శాండిల్య ముని ఈ విధంగా పేర్కోన్నాడు.. “ఆవు శరీరంలోనే పాలు ఉంటాయి.. కానీ, నీరసంగా, అనారోగ్యంతో ఉన్న ఆవుకు, అవి ఏమీ ఉపయోగ పడవు. అదే పాలను ఆవు నుండి పితికి, పెరుగుగా మార్చి, ఆ పెరుగును మిరియాల పొడితో కొద్దిగా కలిపి దానికే తినిపిస్తే, అది ఆవును నయం చేస్తుంది.” అదే విధంగా, సర్వ-వ్యాపి భగవంతుని ఉనికికి, మన భక్తిని రంజిల్లచేసే అన్యోన్యత ఉండదు. మొదట మనం ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని ఆరాధించి, మన హృదయములో అంతఃకరణ శుద్ధిని పెంపొందించుకోవాలి. అప్పుడు మనం భగవత్ కృపని ఆకర్షించగలం. ఆయన కృపచే, మన మనో, ఇంద్రియబుద్ధుల యందు, తన యొక్క యోగ మాయా శక్తిని ప్రవేశ పెడతాడు. అప్పుడు మన ఇంద్రియములు దివ్యమైనవి అవుతాయి. మనం భగవంతుడిని సగుణ సాకారంగా కానీ, లేదా సర్వ-వ్యాప్త తత్వంలో కానీ, ఆయన దివ్యత్వాన్ని అర్థం చేసుకో గలం. ఈ విధంగా శ్రీ కృష్ణుడు, తాను భక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతానని పేర్కొంటున్నాడు.

09:46 - ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ ఈ లోకం నుండి వెళ్ళిపోవడానికి గల రెండు మార్గాల గురించి, శ్రీ కృష్ణుడు వివరించ బోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

15 June, 2022

మనస్సుతో చేసే ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి! Bhagavad Gita

  

మనస్సుతో చేసే ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి!

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (07 – 11 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 07 నుండి 11 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/CavNgpd9-ew ]

మన మనస్సునూ, బుద్ధినీ, భగవంతుడికి శరణాగతి చేసి సమర్పించనట్లయితే, మనం ఏం పొందగలమో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:50 - తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।
మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 7 ।।

కాబట్టి, సర్వ కాలముల యందూ నన్ను స్మరిస్తూనే ఉండుము, మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు.

"నీ మనస్సుని నా యందే లగ్నం చేయుము, మరియు శరీరంతో నీ ప్రాపంచిక కర్తవ్యాన్ని చేయుము." అని శ్రీ కృష్ణుడు చెప్పిన ఈ మాట, అన్ని రంగాల వారికీ వర్తిస్తుంది. అయితే, అర్జునుడికి సంబంధించినంత వరకు, అతను ఒక క్షత్రియుడు, ఆయన ధర్మం, యుద్ధం చేయటమే. కాబట్టి, అతను, మనస్సుని కృష్ణుని యందు ఉంచి, తన కర్తవ్యాన్ని చేయాలని ఉపదేశించబడుతున్నాడు. కొంతమంది, తాము ఆధ్యాత్మిక జీవితం అవలంభిస్తున్నామన్న మిషతో, తమ ప్రాపంచిక విధులను ఆలక్ష్యం చేస్తారు. మరికొంత మంది, ప్రాపంచిక పనుల నెపంతో, ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యం చేస్తారు. ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక వ్యవహారములు, పరస్పర-విరుద్ధమైనవని, జనులనుకుంటారు. కానీ, భగవంతుని సందేశం, మన సంపూర్ణ జీవితాన్ని పవిత్రము గావించటమే. ఈ విధమైన కర్మ యోగము అభ్యాసము చేసినప్పుడు, ప్రాపంచిక పనులేవీ నిర్లక్ష్యం చేయబడవు. ఎందుకంటే, శరీరము వాటిలోనే నిమగ్నమై ఉంటుంది. కానీ, మనస్సు భగవంతుని యందే నిమగ్నమవటం వలన, ఈ పనులు వ్యక్తిని కర్మ బంధాలలో పెనవేయవు. ఏ పనులను మమకారాసక్తితో చేస్తామో, అవే మనలను కర్మ బంధాలతో పెనవేస్తాయి. ఎప్పుడైతే పని ఆసక్తి రహితంగా ఉంటుందో, ప్రాపంచిక న్యాయము కూడా, మనలను ఆ పనులకు అపరాధిగా పరిగణించదు. ఇదే సూత్రం, కర్మ సిద్ధాంతానికి కూడా వర్తిస్తుంది. అందుకే, మహా భారత యుద్దంలో, శ్రీ కృష్ణుడి ఉపదేశాన్ని పాటిస్తూ, అర్జునుడు యద్ధరంగంలో తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం ముగిసేటప్పటికి, అర్జునుడు ఎలాంటి చెడు కర్మనూ పొందలేదు. ప్రాపంచిక లాభం కోసం, లేదా కీర్తి కోసంగనుక అర్జునుడు ఆ యుద్దం చేసి ఉంటే, అతను కర్మ బంధాలలో చిక్కుకుని ఉండేవాడు. కానీ, అతని మనస్సు శ్రీ కృష్ణుడితో అనుసంధానమై ఉంది. స్వార్ధ పూరిత ఆసక్తి లేకుండా, ఈ లోకంలో తన విధులు నిర్వర్తిస్తూ ఉండటంచేత, ఆయన చేసేది సున్నాతో గుణించబడుతున్నది. ఒక కోటి సంఖ్య నైనా సున్నాతో గుణిస్తే వచ్చేది, సున్నానే. కర్మ యోగమునకు కావలసిన నియమం, ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మనస్సనేదానిని, నిరంతరం భగవంతుని ధ్యాసలో ఉంచటానికి ఉపయోగించాలి. మనస్సు ఒక్క క్షణం అయినా భగవంతుడిని మరచిపోతే, మరుక్షణం అది మాయ యొక్క సైన్యంలోని యోధుల దాడికి గురవుతుంది. అంటే, కామము, క్రోధము, లోభము, ఈర్ష, ద్వేషము వంటివి. అందుకే, దానిని ఎల్లప్పుడూ భగవంతుని యందే నిమగ్నం చేయాలి. తరచుగా జనులు తాము కర్మ, మరియు యోగా చేస్తున్నాము కాబట్టి, తమని తాము కర్మయోగులమనుకుంటారు. రోజులో చాలా భాగము వారు కర్మ చేస్తారు, మరియు కొద్ది నిముషాలు, వారు 'యోగం' అంటే భగవంతుని పై ధ్యానము చేస్తారు. కానీ, ఇది కాదు శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగ నిర్వచనము. కర్మలు చేస్తూనే ఉన్నా, మనస్సు మాత్రం భగవంతుని స్మరణ యందే నిమగ్నమై ఉండాలి. భగవంతుని స్మరణ, అప్పుడప్పుడూ కాకుండా, రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి.

04:33 - అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా ।
పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ ।। 8 ।।

ఓ పార్థా, అభ్యాసముతో, నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక, పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు.

మనస్సుని సర్వదా భగవంతుని యందే ధ్యానంలో నిమగ్నం చేయమని, ఇప్పటికే ఎన్నో సార్లు ఉపదేశించాడు, శ్రీ కృష్ణ భగవానుడు. అభ్యాసము, అంటే, మనస్సుకి భగవంతుని యందే ధ్యాస ఉంచే శిక్షణనివ్వడం. ఇటువంటి అభ్యాసము, ఏదో ఒక స్థిరమైన, నిర్దిష్ట సమయాల్లో కాకుండా, అవిచ్ఛిన్నంగా, అంటే, నిరంతరంగా, రోజువారీ పనులతో పాటుగా చేయాలి. ఎప్పుడైతే మనస్సు భగవంతునితో అనుసంధానమవుతుందో, ప్రాపంచిక విధులలో ఉన్నా, అది శుద్ధి అవుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మనం మనస్సుతో చేసే ఆలోచనలే, మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కానీ, మనం శరీరంతో చేసే పనులు కావు. భక్తిలో నిమగ్నమవ్వాల్సింది, మనస్సు మాత్రమే.. మరియు శరణాగతి చేయాల్సింది కూడా, మనస్సే. భగవత్ ధ్యాసలో మనస్సు నిమగ్నమవ్వటం పరిపూర్ణమయితే, మనకు భగవత్ కృప అందుతుంది. భగవంతుని కృప ద్వారానే, వ్యక్తి భౌతిక బంధాల నుండి విముక్తి పొందుతాడు. అనంతమైన దివ్య ఆనందాన్నీ, దివ్య జ్ఞానాన్నీ, మరియు భగవంతుని దివ్య ప్రేమనూ పొందుతాడు. అటువంటి జీవాత్మ, ఈ శరీరముతోనే భగవత్ ప్రాప్తిని పొందుతుంది. శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, భగవత్ సన్నిధానాన్ని చేరుకుంటుంది.

06:16 - కవిం పురాణమనుశాసితారమ్ అణోరణీయాంసమనుస్మరేద్యః ।
సర్వస్య ధాతారమచింత్యరూపమ్ ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ।। 9 ।।

06:27 - ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ ।
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ స తం పరం పురుషముపైతి దివ్యమ్ ।। 10 ।।

భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు. సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు, మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకూ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగాభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు కచ్చితంగా ఆయనను పొందుతారు.

భగవంతుని పై ధ్యానం అనేది, ఎన్నో రకాలుగా ఉంటుంది. నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామము లేదా ఆయన పరివారము, ఇలా వీటి మీద ధ్యానము చేయవచ్చు. ఇవన్నీ భగవంతునికి సంబంధించినవే, ఆయన కన్నా, అబేధములే. మన మనస్సుని వీటిలో దేనిపైనయినా అనుసంధానం చేస్తే, మనస్సు భగవత్ ప్రపంచంలోనికి ప్రవేశిస్తుంది, మరియు పరిశుద్ధి చెందుతుంది. కాబట్టి, వీటిలో దేనినైనా, లేదా అన్నింటినైనా, మన ధ్యాన విషయంగా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ధ్యానం చేసుకోగలిగే భగవంతుని ఎనిమిది గుణములు వివరించబడ్డాయి..

కవి అంటే, కావ్యకర్త, లేదా జ్ఞాని.. అదే పథంలో దాని వ్యాప్తిచే, సర్వజ్ఞుడని కూడా చెప్పవచ్చు. భగవంతుడికి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ తెలుసు.

పురాణ అంటే, ఆదిరహితము, మరియు అత్యంత ప్రాచీనము అని. భగవంతుడే, సమస్త భౌతిక, మరియు ఆధ్యాత్మిక విషయములకు ఆదిమూలము కానీ, ఆయన మరొక దేనినుండో రాలేదు, మరియు ఆయన కన్నా ముందున్నది, ఇక ఏమీ లేదు.

అనుశాసితారం అంటే, పరిపాలించేవాడు. భగవంతుడు, ఈ విశ్వం నిర్వహించబడటానికి ఉన్న నియమనిబంధనలను సృష్టించేవాడు. ఆ విశ్వం యొక్క వ్యవహారాలను, తనే స్వయంగా, మరియు ఆయన నియమించిన దేవతల ద్వారా అజమాయిషీ చేస్తాడు. ఈ విధంగా ప్రతిదీ, ఆయన ఆధీనంలోనే ఉంటుంది.

అణోరణీయాన్ అంటే, సూక్ష్మాతి సూక్ష్మమయినది. ఆత్మ అనేది, భౌతిక పదార్ధము కంటే, సూక్ష్మమయినది. కానీ, భగవంతుడు, ఆత్మలోపల స్థితుడై ఉంటాడు కాబట్టి, ఆత్మ కన్నా సూక్ష్మమైనవాడు.

సర్వస్య ధాతా అంటే, అన్నిటికీ ఆధారమైనవాడు. అన్ని అలలకూ ఆధారము, సముద్రమయినట్టుగా..

అచింత్య రూపా అంటే, ఊహకందని స్వరూపము ఉన్నవాడు అని. మన మనస్సు కేవలం భౌతిక రూపములు మాత్రమే గ్రహింపగలదు కాబట్టి, భగవంతుడు ఈ భౌతిక మనస్సు కంటే అతీతుడు. కానీ, ఆయన కృప చేస్తే, తన యోగమాయా శక్తి చేత, ఆయన మన మనస్సుని దివ్యమైనదిగా చేస్తాడు. అప్పుడు మాత్రమే, ఆయన కృప చేత, ఆయన మన ఊహకు అందుతాడు.

ఆదిత్య వర్ణ అంటే, ఆయన సూర్యుని వలె తేజోవంతుడు..

తమసః పరస్తాత్ అంటే, అజ్ఞానపు చీకటి కంటే అతీతుడు. ఎలాగైతే ఒక్కోసారి మబ్బులు సూర్యుడికి అడ్డు వచ్చినా, సూర్యుడు ఎప్పటికీ మబ్బులచే కప్పివేయబడలేడో, భగవంతుడు కూడా, ఈ లోకంలో మాయతో సంధానమైయినా, భౌతిక శక్తి మాయచే, ఆయన కప్పివేయబడలేడు.

భక్తి ప్రక్రియలో, మనస్సు భగవంతుని యొక్క రూపము, గుణములు, లీలలు వంటి వాటిపైనే నిమగ్నమవుతుంది. కేవలం భక్తిని మాత్రమే చేస్తే, దానిని శుద్ధ భక్తి అంటారు. దానిని అష్టాంగ యోగంతో పాటుగా చేస్తే, దానిని యోగ-మిశ్ర భక్తి అంటారు. భగవద్గీత యొక్క ఒక అద్భుతమైన గుణం ఏమిటంటే, అది చాలా రకాల ‘సాధనా’లను పేర్కొన్నది. ఎన్నో రకాల వైవిధ్యం, వేరు వేరు రకాల ఆచారాలూ, కుంటుంబాలూ, వ్యక్తిత్వాల నుండి వచ్చిన మనుష్యులను అక్కున చేర్చుకున్నది. పాశ్చాత్య విద్యావంతులు, గురువు సహాయం లేకుండా, హిందూ వేద శాస్త్రాలను చదవటానికి ప్రయత్నిస్తే, వారు చాలా సార్లు ఎన్నో రకాల మార్గాలూ, ఉపదేశాలూ, మరియు తత్వ కోణాలచే, అయోమయానికి గురి అవుతారు. కానీ, ఈ వైవిధ్యం నిజానికి ఒక వరం. అనంతమైన పూర్వ జన్మ సంస్కారాల వలన, మనందరికీ వేరు వేరు స్వభావాలూ, అభిరుచులూ ఉంటాయి. ఒక నలుగురు బట్టలు కొనటానికి వెళితే, వారందరూ వేరు వేరు రంగుల, వేరు వేరు రకాల వాటిని ఎంచుకుంటారు. ఒకవేళ కొట్టులో ఒకే రకం రంగు, ఒకే రకం రూపము ఉన్న బట్టలు ఉంటే, అది మానవులలో అంతర్గతంగా ఉన్న వైవిధ్యాన్ని, తృప్తి పరచలేదు. అదే విధంగా, ఆధ్యాత్మిక పథంలో కూడా, జనులు ఎన్నో రకాల సాధనాలు, పూర్వ జన్మలలో చేసి ఉండవచ్చు. వైదిక శాస్త్రాలు, ఆ వైవిధ్యాన్ని గౌరవిస్తాయి. అదే సమయంలో, "భక్తి" యే వీటన్నిటినీ ఉమ్మడిగా ఉంచి, ఒక్కటిగా కట్టివేసే త్రాడని, నొక్కిచెప్పాయి. అష్టాంగ యోగములో, ప్రాణ శక్తి, వెన్ను పూసలోని సుషుమ్నా నాడి గుండా పైకి లేపబడుతుంది. అది మూడవ కన్ను స్థానమైన కను బొమల మధ్యకు, తేబడుతుంది. తదుపరి, ఆ పరమేశ్వరుడైన భగవంతుని యందే, గాఢమైన భక్తితో, కేంద్రీకరించబడుతుంది.

12:00 - యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః ।
యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే ।। 11 ।।

వేద పండితులు, ఆయనను నాశము చెందని వాడని చెబుతారు. ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు, బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు.

ఇప్పుడా లక్ష్యం యొక్క మార్గాన్ని, క్లుప్తముగా విశదపరుస్తాను. వేదములలో భగవంతుడు ఎన్నో పేర్లతో పిలవబడ్డాడు. వాటిలో కొన్ని: సత్, అవ్యాక్రిత్, ప్రాణ్, ఇంద్ర, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్, పురుష్. ఎన్నో చోట్ల, భగవంతుని నిరాకార తత్వాన్ని సూచించేటప్పుడు, ఆయన 'అక్షర' అన్న పేరుతో కూడా పిలవబడ్డాడు. అక్షర అంటే, 'నాశము లేనిది' అని అర్థం. అక్షరుడైన వాని బ్రహ్మాండమైన శక్తి చేతనే, సూర్యుడు, చంద్రుడు తమ స్థానాల్లో నిలుప బడుతున్నారు. ఈశ్వరుని నిరాకార తత్వాన్ని పొందటానికి, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, యోగ-మిశ్ర-భక్తిని వివరిస్తున్నాడు. సంగ్రహేణ అంటే, "క్లుప్తంగా" అని అర్థం. మరీ అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ మార్గాన్ని, ఆయన క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఈ మార్గము, అందరికీ అనుకూలమైనది కాదు. ఈ మార్గంలో, వ్యక్తి చాలా తీవ్రమైన నియమనిష్ఠలను పాటించాలి. ప్రాపంచిక కోరికలను వదిలి వేసి, బ్రహ్మచర్యం పాటించాలి. కచ్చితమైన ఇంద్రియనిగ్రహమును అలవరచుకోవాలి. బ్రహ్మచర్యము ద్వారా, వ్యక్తి యొక్క శారీరక శక్తి సంరక్షించబడి, ఆ తరువాత సాధన ద్వారా, అది ఆధ్యాత్మిక శక్తిగా మార్చబడుతుంది. సాధకుడు, ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోవటానికి, బ్రహ్మచర్యం పాటించటం వలన, తన జ్ఞాపక శక్తి, మరియు మానసిక సామర్ధ్యాలను పెంచుకుంటాడు.

13:58 - ఇక మన తదుపరి వీడియోలో, పరమ గతిని పొందేటందుకు గల మార్గాన్ని, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!