Ads

Showing posts with label Bhagavad Gita. Show all posts
Showing posts with label Bhagavad Gita. Show all posts

08 June, 2022

'మృత్యువు' – మరు జన్మ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? Bhagavad Gita

 

'మృత్యువు' – మరు జన్మ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది?

'భగవద్గీత' అష్టమోధ్యాయం - అక్షర బ్రహ్మ యోగం (01 – 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, అక్షర బ్రహ్మ యోగములోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/l6WxwSP8Ayc ]

ఈ అధ్యాయంలో, భౌతిక జగత్తులోని రకరకాల లోకాల గురించీ, సృష్టి క్రమంలో ఈ లోకాలూ, మరియూ వాటిలో అసంఖ్యాకమైన జీవ రాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో, శ్రీ కృష్ణుడు విశదీకరించబోతున్నాడు..

00:50 - అర్జున ఉవాచ ।
కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ।
అధిభూతం చ కిం ప్రోక్తమధిదైవం కిముచ్యతే ।। 1 ।।

01:10 - అధియజ్ఞః కథం కోఽత్ర దేహేఽస్మిన్మధుసూదన ।
ప్రయాణకాలే చ కథం జ్ఞేయోఽసి నియతాత్మభిః ।। 2 ।।

అర్జునుడు ఇలా పలికాడు: ఓ పరమేశ్వరా, బ్రహ్మం లేక పరమ సత్యము అనగా ఏమిటి? అధ్యాత్మము లేక ఆత్మ అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవమని అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు, మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢ సంకల్పముతో ఉన్నవారికి, మరణ సమయంలో నీవు తెలియడం ఎలా సాధ్యము?

జ్ఞాన విజ్ఞాన యోగంలోని ఆఖరి శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, బ్రహ్మం, అధిభూత, అధియాత్మ, అధిదైవ, మరియు అధియజ్ఞ అన్న పదాలను పరిచయం చేశాడు. అర్జునుడికి వీటి గురించి ఇంకా తెలుసుకోవాలని, కుతూహలంగా ఉంది. అందుకే, ఈ రెండు శ్లోకాలలో ఏడు ప్రశ్నలను సంధించాడు. వీటిలో ఆరు ప్రశ్నలు, శ్రీ కృష్ణుడు పలికిన పదాల గురించే. ఏడవ ప్రశ్న, మరణ సమయం గురించి. అర్జునుడు, మరణ సమయంలో భగవంతుడిని ఎలా గుర్తుంచుకుని స్మరించాలో, తెలుసుకోగోరుతున్నాడు.

02:28 - శ్రీ భగవానువాచ ।
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ।। 3 ।।

శ్రీ కృష్ణ భగవానుడు ఇలా పలికాడు: సర్వోన్నతమైన, నాశనములేని తత్త్వమునే బ్రహ్మము అంటారు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే, అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకూ, మరియు వాటి అభివృద్ధికీ సంబంధించిన పనులనే, కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలంటారు.

సర్వోత్కృష్ట తత్వమునే, బ్రహ్మము అంటారు. వేదాలలో భగవంతుడిని ఎన్నో పేర్లతో పిలుస్తారు. వాటిలో బ్రహ్మము ఒకటి. అది, స్థల, కాల, మరియు కారణ, కార్య చక్రానికి అతీతమైనది. ఇవి భౌతిక జగత్తు యొక్క గుణములు. కానీ, ‘బ్రహ్మము’ భౌతిక జగత్తుకి అతీతమైనది. అది విశ్వంలో జరిగే పరిణామాల చేత ప్రభావితం కాదు, మరియు అనశ్వరమైనది. కాబట్టి, అది అక్షరం అని వివరించబడినది. బృహదారణ్యక ఉపనిషత్తులో, బ్రహ్మము అనేది, ఈ విధంగా నిర్వచించబడింది. పండితులు, ‘బ్రహ్మము అంటే అక్షరము’ అంటే, నాశనము లేనిదని చెబుతారు. అది 'పరం' అంటే, సర్వోత్కృష్టమైనదని కూడా, పరిగణించబడుతుంది. ఏ విధంగాననగా, దానికి మాయ, మరియు జీవాత్మల కన్నా ఉన్నతమైన గుణములు కలవు. భగవత్ మార్గమే 'అధ్యాత్మ', మరియు ఆత్మస్వరూపత్వము కూడా, అధ్యాత్మ అనబడుతుంది. కానీ ఇక్కడ ఆ పదం, వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వం కోసమే ఉపయోగించబడింది. దీనిలోనే ఆత్మ, మనస్సు, మరియు బుద్ధి, సమ్మిళితమై ఉన్నాయి. కర్మ అంటే, ఆత్మచే చేయబడిన పనులు. ఇవి ప్రతి జీవి యొక్క, ప్రతి జన్మ యందున్న ప్రత్యేకమైన జీవన పరిస్థితులను నిర్దేశిస్తాయి. ఈ కర్మలే, జీవాత్మను సంసార చక్రంలో త్రిప్పుతుంటాయి.

04:32 - అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతమ్ ।
అధియజ్ఞోఽహమేవాత్ర దేహే దేహభృతాం వర ।। 4 ।।

నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే, అధిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే, అధిదైవము అంటారు. సర్వ భూతముల హృదయములలో నివసించే నేను, ‘అధియజ్ఞము’ అంటే, సమస్త యజ్ఞములకూ ప్రభువు, అని పిలువబడతాను.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశమనే ఈ పంచ భూతముల సంయోగంతో ఏర్పడిన, ఈ చిత్రవిచిత్ర రంగు రంగుల విశ్వమునే, అధిభూత అంటారు. సమస్త భౌతిక సృష్టినీ తనలోనే కలిగిఉన్న పరమేశ్వరుని యొక్క విశ్వ రూపమైన విరాట్ పురుషుడినే, అధిదైవము అంటారు. ఎందుకంటే, ఆయన దేవతలకు, అంటే విశ్వములో వేరు వేరు విభాగాలను నిర్వహించే వారికి, అధిపతి. సర్వోత్కృష్ట దివ్య మంగళ స్వరూపుడైన శ్రీ కృష్ణుడు, పరమాత్మ రూపంలో, సర్వ ప్రాణుల హృదయంలో నివసించే వాడూ, అధియజ్ఞమని చెప్పబడతాడు. అన్ని యజ్ఞములూ, ఆయన ప్రీతి కొరకే చేయబడాలి. ఈ విధంగా, ఆయనే సమస్త యజ్ఞములకూ అధ్యక్షుడు, మరియు అన్ని కార్యములకూ ఫలములను ప్రసాదించే వాడు.

05:54 - అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరమ్ ।
యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః ।। 5 ।।

మరణ సమయంలో నన్ను స్మరిస్తూ, దేహాన్ని విడిచిపెట్టిన వాడు, నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికీ తావు లేదు.

ఒక వ్యక్తి యొక్క వచ్చే జన్మ, ఆ వ్యక్తి మరణ సమయంలో, అతని యొక్క అంతఃకరణ స్థితిని బట్టీ, మరియు వ్యక్తికి దేనిపై మనస్సు ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటుందని, పేర్కొంటాడు. కాబట్టి, మరణ సమయంలో ఎవరైనా, భగవంతుని అలౌకిక నామాలూ, గుణములూ, రూపములూ, లీలలూ, మరియు ధామములపై నిమగ్నమై ఉంటే, భగవత్ ప్రాప్తి లక్ష్యం పొందుతాడు. మృత్యు సమయంలో, వ్యక్తి అంతర్గత దృక్పథం, భగవంతుని యందే నిమగ్నమై ఉంటే, అతను భగవంతుడినే పొందుతాడు, మరియు స్వభావములో భగవంతుని లాగానే అవుతాడు.

06:53 - యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరమ్ ।
తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః ।। 6 ।।

ఓ కుంతీ పుత్రుడా, మరణ కాలంలో, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన, అతను ఆ స్థితినే పొందుతాడు.

మృత్యు సమయంలో, సహజంగానే మన మనస్సు, జీవితం మొత్తం అలవాటుగా తయారు చేసుకున్న ఆలోచనల ప్రవాహంలోనే పరుగు పెడుతుంది. మన ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవటానికి సమయం, మన సామాను సర్దుకున్న తరువాత కాదు. ముందు జాగ్రత్తతో, సరియైన ప్రణాళిక ఏర్పాటు అవసరం. మరణ సమయంలో ఏదైతే మన ఆలోచనలలో ప్రధానంగా ఉంటుందో, అదే మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది. వ్యక్తి యొక్క రోజువారీ అలవాట్లు, మరియు సాంగత్యముల ప్రకారం, తను బ్రతికున్నంత కాలం, దేని గురించి తలంచాడో, ధ్యానం చేసాడో, సహజంగానే, దానిమీదే వ్యక్తి యొక్క చివరి తలంపులు ఆధారపడి ఉంటాయి. పురాణాలలో భరత మహారాజు వృత్తాంతం, ఈ విషయంలో చెప్పబడింది. ఆయన ఒక రాజు. కానీ, భగవత్ ప్రాప్తి సాధన కోసం, అడవిలో తపస్విలా జీవిస్తూ, తన రాజ్యాన్ని త్యజించాడు. ఒక రోజు గర్భంతో ఉన్న ఒక జింక, ఒక పులి గాండ్రింపు విని, నీటిలోకి దూకటం చూశాడు. ఆ భయానికి, గర్భంతో ఉన్న జింక, ఒక జింక-పిల్లని ప్రసవించింది. ఆ జింక పిల్ల నీటిలో తెలియాడటం చూసి, భరతుడు జాలి పడి, దానిని రక్షించాడు. అతను దానిని తన కుటీరముకు తీసుకువెళ్ళి, పెంచటం మొదలుపెట్టాడు. అపారమైన వాత్సల్యంతో, దాని యొక్క ఉల్లాసమైన ఆటపాటలను చూస్తూ ఉండేవాడు. దాని కోసం గడ్డి తెచ్చేవాడు, దానిని వెచ్చగా ఉంచటం కోసం, దానిని ఆలింగనము చేసుకునేవాడు. క్రమక్రమంగా ఆయన మనస్సు భగవంతుని నుండి దూరంగా వచ్చి, ఆ జింకపై నిమగ్నమయింది. ఈ అనుబంధం ఎంత గాఢంగా అయ్యిందంటే, రోజంతా ఆ జింక గురించే ఆలోచించేవాడు. ఇక ఆయన మరణించే సమయంలో, ఆ జింక ఏమైపోతుందో అని చింతిస్తూ, దానిని ప్రేమతో పిలిచాడు. దాంతో, భరత మహారాజు తదుపరి జన్మలో, ఒక జింకగా పుట్టాడు. కానీ, ఆయన ఏంతో ఆధ్యాత్మిక సాధన చేసి ఉండటం వలన, ఆయన చేసిన తప్పు యొక్క అవగాహన ఉంది కాబట్టి, జింకగా ఉన్నా సరే, ఆయన, అడవిలో సాధు జనుల ఆశ్రమాల దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. చివరికి, ఆయన తన జింక దేహాన్ని విడిచి పెట్టిన తరువాత, ఆయనకి తిరిగి మానవ జన్మ లభించింది. ఈ సారి, ఆయన ఒక గొప్ప ఋషి, జడ భరతుడయ్యాడు. తన సాధన పూర్తి చేస్తూ, భగవత్ ప్రాప్తి సాధించాడు. స్కంద పురాణం ప్రకారం, మృత్యు సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవటం, చాలా కష్టం. మరణం చాలా బాధాపూరితమైన అనుభవం, ఆ సమయంలో మనస్సు, వ్యక్తి యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం వైపే మొగ్గు చూపుతుంది. మనస్సు భగవంతుని గురించి స్మరించాలంటే, వ్యక్తి యొక్క ఆంతర స్వభావం, అయన యందే లీనమై ఉండాలి. ఆంతర స్వభావం అంటే, మనోబుద్ధుల లోపల నివసించి ఉండే స్మృతి. ఏదైనా ఒకదానిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటేనే, అది ఆంతర స్వభావంగా వ్యక్తమవుతుంది. కాబట్టి, భగవత్ స్మృతిలోనే ఉండే ఆంతర స్వభావాన్ని పెంపొందించుకోవటానికి, భగవంతుడు మన జీవతంలో ప్రతి క్షణం గుర్తుంచుకోబడాలి, జ్ఞప్తికితెచ్చుకోబడాలి, మరియు ధ్యానించబడాలి.

10:36 - ఇక మన తదుపరి వీడియోలో, మన మనస్సు, బుద్ధి, భగవంతుడికి శరణాగతి చేసి, సమర్పించనట్లయితే, మనం ఏం పొందగలమో శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

01 June, 2022

'మరణం' 2000 తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధాకరంగా ఉంటుంది! Bhagavad Gita

  

'మరణం' 2000 తేళ్ళు ఒకేసారి కుట్టినంత బాధాకరంగా ఉంటుంది!

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/-LbeLr3D-NA ]

రాగ, ద్వేషములనే ద్వంద్వములు ఎలా జనిస్తున్నాయో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:46 - వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున ।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ।। 26 ।।

అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులన్నీ తెలుసు.. కానీ, నేను ఎవరికీ తెలియదు.

భగవంతుడు సర్వజ్ఞుడు. తాను ‘త్రికాల-దర్శి’. జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవి అన్నీ ఆయనకు తెలుసు. మనకు, కొద్ది గంటల క్రితం ఏమి ఆలోచించామో గుర్తుండదు. కానీ, అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలో, ప్రతి సమయంలో, విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలూ, మాటలూ, మరియు పనులన్నీ, భగవంతునికి గుర్తు ఉంటాయి. ఇవే, ప్రతి జీవాత్మ యొక్క ‘సంచిత కర్మలు’. అంటే, అనంతమైన జన్మల నుండి ఉన్న కర్మల రాశి. కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలనూ, న్యాయాన్నీ జీవులకు అందించటానికి, భగవంతుడు దీని లెక్క గణిస్తాడు. అందుకే, తనకు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలన్నీ తెలుసంటున్నాడు. భగవంతుడు అన్నీ తెలిసినవాడు. సర్వసాక్షి, మరియు సర్వజ్ఞుడు. ఆయన తపస్సు, జ్ఞాన మయము. తనకు అన్నీ తెలిసినా, తాను మాత్రం ఎవ్వరికీ తెలియదని, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడంటున్నాడు. భగవంతుడు తన మహిమలూ, కీర్తీ, శక్తులూ, గుణములూ, మరియు వ్యాప్తులలో అనంతుడు. కానీ, మన బుద్ధి పరిమితమైనది కాబట్టి, అది సర్వేశ్వరుడైన భగవంతుడిని అర్థం చేసుకోలేదు. ఒకే ఒక వ్యక్తిత్వం, భగవంతుడిని తెలుసుకోగలదు. అది ఆ భగవంతుడే. ఆయన ఏదైనా ఒక జీవాత్మపై తన కృప చూపాలనుకుంటే, తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తాడు. భగవంతుని శక్తిని కలిగి ఉన్న సౌభాగ్యవంతమైన జీవాత్మ, అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతుంది. ఆ ప్రకారంగా, భగవంతుడిని తెలుసుకోగోరే ప్రక్రియలో, కృప అనేది అత్యంత ముఖ్యమైనది. 

02:47 - ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సమ్మోహం సర్గే యాన్తి పరన్తప ।। 27 ।।

ఓ భరత వంశస్థుడా - రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహమనబడే భ్రాంతి నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా.. ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా, పుట్టుక నుండే వీటిచే, భ్రమింపజేయ బడుచున్నది.

ఈ ప్రపంచమంతా ద్వంద్వముల మయం.. పగలు-రాత్రీ; శీతాకాలం-ఎండాకాలం; సంతోషం-దుఃఖం; ఆనందం-బాధ.. అన్నింటికన్నా పెద్ద ద్వందములు, జనన-మరణములు. ఇవి ఒక జంట లాగా ఉంటాయి. పుట్టుక సంభవించగానే, మరణం కచ్చితంగా ఉంటుంది. మరణం మరల పుట్టుకను కలిగిస్తుంది. జననం-మరణం అనే ఈ రెండు చివరల మధ్య ఉండేదే జీవితం. ఈ ద్వంద్వములు, జీవన ప్రయాణంలో విడదీయలేని భాగాలుగా ఉంటాయి. భౌతిక దృక్పథంలో మనకి ఒకటి నచ్చుతుంది, మరియు ఇంకోకదానిపై రోత పుడుతుంది. ఈ ఇష్టము-ద్వేషము అనేవి, ద్వంద్వముల యొక్క అంతర్లీనంగా ఉన్న స్వభావం కాదు.. నిజానికవి మన అజ్ఞానం నుండి ఉద్భవించినవే. తప్పుదారిలో ఉన్న బుద్ధి, భౌతిక సుఖాలు మనకు మంచివనే నిశ్చయంతో ఉంటుంది. బాధ అనేది మనకు హానికరమైనదన్న నిశ్చయంతో జీవిస్తాము. భౌతిక ప్రాపంచిక భోగాలు, ఆత్మపై ఉన్న భౌతిక మాయను మరింత మందంగా చేస్తాయి. అదే సమయంలో, ప్రతికూల పరిస్థితులకు మాయను నిర్మూలించి, మనస్సును ఉద్ధరించే శక్తి ఉందని తెలుసుకోలేకున్నాము. ఈ యొక్క భ్రాంతికి మూల కారణం, అజ్ఞానమే. ఆధ్యాత్మిక పురోగతికి నిదర్శనం ఏంటంటే, వ్యక్తి రాగ-ద్వేషాలకూ, ఇష్టా-అయిష్టాలకూ అతీతంగా ఎదిగి, ఆ రెంటినీ భగవంతుని సృష్టిలో ఉన్న విడదీయలేని తత్వాలుగా, స్వీకరించగలగాలి.

04:44 - యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ ।
తే ద్వంద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతాః ।। 28 ।।

పుణ్య కార్యములు ఆచరించుటచే, ఎవరి పాపములయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు, నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.

అజ్ఞానులు ఏదైతే రాత్రి అనుకుంటారో, జ్ఞానులు దానిని పగలు అనుకుంటారు. ఎవరికైతే భగవత్ ప్రాప్తి కోసం అభిలాష మేలుకోల్పబడినదో, వారు బాధ అనేదాన్ని, ఆధ్యాత్మిక పురోగతి, మరియు స్వార్థ త్యాగం కోసం వచ్చిన అవకాశంగా, స్వీకరిస్తారు. ఆత్మను మరింత మరుగు పరిచే భోగాల పట్ల, అప్రమత్తంగా ఉంటారు. అందుకే, వారు సుఖాల కోసం ప్రయాసపడరు, కష్టాలను ద్వేషించరు. ఇటువంటి జీవాత్మలు, ఎవరైతే తమ మనస్సులను రాగ-ద్వేష ద్వంద్వముల నుండి విముక్తి చేసుకున్నారో, వారు భగవంతుడిని స్థిరమైన, దృఢ సంకల్పముతో ఆరాధించగలరు.

05:48 - జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతన్తి యే ।
తే బ్రహ్మ తద్ విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలమ్ ।। 29 ।।

ముసలితనము, మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మమునూ, తమ ఆత్మ తత్త్వమునూ, సమస్త కర్మ క్షేత్రమునూ తెలుసుకుంటారు.

భగవంతుడు, మన సొంత బుద్ధి బలంచే తెలియబడడు. కానీ, ఆయనకు శరణాగతి చేసిన వారు, ఆయన కృపకు పాత్రులవుతారు. అప్పుడు ఆయన కృప చేత, ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటుంది..

ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, బుద్ధి బలం చేత కానీ, రకరకాల ఉపదేశాలు వినటం వలన కానీ, భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం, ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృపను ప్రసాదిస్తాడో, అప్పుడే ఆ అదృష్ట జీవాత్మ, ఆయనను తెలుసుకోగలదు. అలాగే, ఎప్పుడైతే వ్యక్తికి భగవత్ జ్ఞానం లభిస్తుందో, అతనికి సర్వమూ, ఆయన సంబంధముగానే తెలియబడుతుంది. "భగవంతుడు తెలిస్తే, నీకు అన్నీ తెలుస్తాయి." అని వేదాలు పేర్కొంటున్నాయి. కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు, ఆత్మ-జ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ, ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది, సముద్రములోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మ-జ్ఞానమనేది, బ్రహ్మ-జ్ఞానములో ఒక అతి చిన్న భాగము. నీటి బిందువు గురించి తెలిసిన వారికి, సముద్రము యొక్క లోతూ, వైశాల్యమూ, మరియు శక్తిని గురించీ తెలిసినట్టు కాదు. అదే విధంగా, ఆత్మ గురించి తెలిసినవారికి, భగవంతుని గురించి తెలిసినట్టు కాదు. కానీ, భగవంతుని గురించి తెలిసినవారికి, అప్రయత్నంగానే, భగవంతునిలోనే ఉన్న సమస్త అంగాలూ తెలిసిపోతాయి. కాబట్టి, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఆయననీ, ఆత్మనీ, మరియు సమస్త కర్మ క్షేత్రమునే, ఆయన కృపచే తెలుసుకుంటారు.

07:45 - సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ।। 30 ।।

సమస్త భౌతిక జగత్తుకూ, అధి దేవతలకూ, మరియు సమస్త యజ్ఞాలకూ అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.

శరీరాన్ని విడిచి పెట్టే సమయంలో ఎవరైతే తనను స్మరిస్తారో, వారు తన దివ్య ధామాన్ని చేరుకుంటారు. కానీ, మరణ సమయంలో భగవంతుడిని తలుచుకోవటం, చాలా క్లిష్టమైన పని. ఎందుకంటే, మరణం అనేది అత్యంత బాధాకరమైన అనుభవం. అది 2000 తేళ్ళు ఒకేసారి కుట్టిన రీతిగా ఉంటుంది. ఇది ఎవరి మనస్సూ, లేదా బుద్ధికి సహింపశక్యము కానిది. మరణం సంభవించకముందే, మనస్సూ, బుద్ధీ పని చేయటం ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ తప్పిపోతాడు. అందుకే, మరణ సమయంలో భగవంతుడిని గుర్తుంచుకోవడం, అసాధ్యం. ఇది కేవలం శారీరక సుఖాల, మరియు బాధలకు అతీతంగా ఉన్నవారి వల్లనే, సాధ్యమవుతుంది. ఇటువంటి వారు, స్పృహతోనే శరీరాన్ని విడిచి పెడతారు. తననే అధిభూత, అధిదైవ, మరియు అధియజ్ఞములకు యజమాని అని తెలుసుకున్న వారు, మరణ సమయంలో కూడా పూర్తి భగవత్ స్పృహలోనే ఉంటారు. ఇది ఎలాగంటే, యదార్థమైన జ్ఞానము సంపూర్ణ భక్తికి దారి తీస్తుంది. మనస్సు సంపూర్ణముగా భగవంతునిలోనే నిమగ్నమవుతుంది. ఆ కారణముగా, అది శారీరక స్థాయిలోని కోరికల, బాధల నుండి విడిపోతుంది. ఇటువంటి జీవాత్మ, శారీరక స్పృహలో ఉండదు. 

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే, జ్ఞాన విజ్ఞాన యోగో, నామ సప్తమోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని భక్తిషట్కం, ఏడవ అధ్యాయంలోని జ్ఞాన విజ్ఞాన యోగంలోని, 30 శ్లోకాలూ సంపూర్ణం.

09:51 - ఇక మన తదుపరి వీడియోలో, భక్తి షట్కంలోని ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగంలో శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

25 May, 2022

'యోగమాయ' – నశ్వరమైన దేవతల ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా నశించిపోయేవే! Bhagavad Gita

  

'యోగమాయ' –  నశ్వరమైన దేవతల ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా నశించిపోయేవే!

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (21 – 25 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 21  నుండి 25 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ex7Ad5FAOk0 ]

అక్షరమైన, సర్వోత్కృష్టమైన భగవంతుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకునే వారి గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహమ్ ।। 21 ।।

భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.

పరమేశ్వరుడి ఆరాధనలో విశ్వాసం అనేది, మనకు అత్యంత ప్రయోజనకరమైన విశ్వాసం. అది నిజమైన జ్ఞానం ద్వారానే లభిస్తుంది. కానీ, ప్రపంచంలో మన చుట్టూ చూసుకుంటే, వివిధ దేవతలను ఆరాధించే అసంఖ్యాకమైన భక్తులు కూడా కనబడుతుంటారు. వీరు తమ భక్తిలో ధృడమైన, మరియు నిస్సంకోచమైన విశ్వాసంతో ఉంటారు. దేవతలపై విశ్వాసం కూడా తానే కలిగిస్తున్నాడని అంటున్నాడు, శ్రీ కృష్ణుడు. జనులు భౌతిక, ప్రాపంచిక కోరికలను నెరవేర్చుకోవటానికి, దేవతల ఆరాధన చేయటం చూసినప్పుడు, ఆయనే వారి విశ్వాసాన్ని బలపరచి, వారి భక్తిలో సహాయపడతాడు. దేవతలకు తమంతతామే, భక్తులలో విశ్వాసం పెంచే సామర్థ్యం లేదు. జనులలోనే స్థితమై ఉన్న పరమాత్మయే, వారిలో శ్రద్ధని ప్రేరేపిస్తాడు. జీవాత్మలు, భౌతిక వస్తు సంపద కోసం దేవతారాధన చేసినప్పుడు, ఈ అనుభవం వారి ఆత్మ ఉద్ధరణకు మున్ముందు ఉపయోగపడుతుందనే ఆశతో, భగవంతుడే వారి శ్రద్ద/విశ్వాసాన్ని బలపరుస్తాడు. ఆ తరువాత, ఏదో ఒక రోజు జీవాత్మ, భగవంతుడే పరమపురుషార్థమని తెలుసుకుని, ఆ పరమేశ్వరునికి శరణాగతి చేస్తుంది.

02:26 - స తయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హి తాన్ ।। 22 ।।

శ్రద్ధా, విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు, ఆ దేవతనే ఆరాధించును, మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి ఆ ప్రయోజనాలను సమకూర్చి పెట్టేది నేనే.

దేవతల యొక్క భక్తులు, వారు కోరుకున్న వాటిని ఆయా దేవతల ఆరాధనతో పొందుతారు. కానీ, నిజానికి వాటిని ప్రసాదించేది భగవంతుడేగానీ, దేవతలు కాదు. భౌతిక ప్రయోజనాలను సమకూర్చి పెట్టే అధికారం, దేవతలకు లేదనీ, భగవంతుడు ప్రసాదించినప్పుడే, వాటిని దేవతలు ఆయా భక్తులకు అనుగ్రహిస్తారనీ, ఈ శ్లోకం స్పష్టంగా చెపుతున్నది. కానీ, మిడిమిడి జ్ఞానంతో ఉన్న జనులు, వారు ఆరాధించే దేవతల ద్వారానే ఇవి వస్తున్నాయని అనుకుంటారు.

03:20 - అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్ ।
దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ।। 23 ।।

కానీ, ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము, తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు, ఆయా దేవతల లోకానికి వెళతారు. అదే సమయంలో, నా భక్తులు మాత్రం, నన్నే చేరుకుంటారు.

ప్రాథమిక పాఠశాల అవసరమే.. కానీ, విద్యార్థులు దానిని ఏదో ఒక రోజు మించి పోవాలి. ఒకవేళ ఏ విద్యార్థి అయినా, ప్రాథమిక పాఠశాలలో అవసరానికి మించి ఉండదలచితే, ఉపాధ్యాయులు వారిని హర్షించరు. అంతేకాక, ఆ విద్యార్థికి జీవితంలో ముందుకెళ్ళటానికి శిక్షణ ఇస్తారు. అదే విధంగా, దేవతలను ఆరాధించదలిచే ప్రారంభ దశలో ఉన్న భక్తుల యొక్క విశ్వాసాన్ని, శ్రీ కృష్ణుడు బలపరుస్తాడు. కానీ, భగవత్ గీత ఆనేది, ప్రాథమిక దశ విద్యార్థుల కోసం కాదు. కాబట్టి, ఆయన ఆర్జునుడిని ఈ ఆధ్యాత్మిక సూత్రాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాడు. "మనిషి తను ఆరాధించే వస్తువునే పొందుతాడు. దేవతలను ఆరాధించేవారు, ఆయా దేవతల లోకాలకు, మరణించిన పిదప వెళ్తారు. నన్ను ఆరాధించే వారు, నా దగ్గరికి వస్తారు." అని శ్రీ కృష్ణుడు స్వయంగా వివరిస్తున్నాడు. దేవతలే నశ్వరమైన వారు కాబట్టి, వారి ఆరాధన ద్వారా లభించిన ఫలాలు కూడా, నశించిపోయేవే. కానీ, భగవంతుడు నిత్యుడూ, శాశ్వతుడూ కాబట్టి, ఆయన ఆరాధనతో లభించేవి కూడా నిత్యమైనవి, శాశ్వతమైనవి. భగవంతుని భక్తులు, ఆయన యొక్క నిత్య, శాశ్వత సేవనూ, మరియు ఆయన ధామమునూ పొందుతారు.

05:05 - అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః ।
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమమ్ ।। 24 ।।

పరమేశ్వరుడనైన నన్ను, శ్రీ కృష్ణుడిని - ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి, ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని, అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని, వారు అర్థం చేసుకోలేకున్నారు.

భగవంతుడు నిరాకారుడు మాత్రమే అని, కొందరు జనులు గట్టిగా వాదిస్తారు. మరికొందరు, పరమేశ్వరుడు కేవలం సాకార రూపంలోనే ఉంటాడని, అంతే గట్టిగా వాదిస్తారు. ఈ రెండు దృక్పథాలు కూడా, పరిమితమైనవీ, అసంపూర్ణమైనవీ. భగవంతుడు సంపూర్ణుడు, మరియు దోషరహితుడు. కాబట్టి, ఆయన నిరాకారుడు, మరియు సాకారుడు కూడా. ఆయన రూపం, నిరాకార బ్రహ్మం నుండి వ్యక్తమయినది కాదు. భగవంతుడు తన దివ్య మంగళ స్వరూపంతో, అనాదిగా దివ్య లోకాల్లో ఉన్నాడు. నిరాకర బ్రహ్మాం అనేది, ఆయన అలౌకిక శరీరము నుండి ఉద్భవించే కాంతి. "భగవంతుని దివ్య మంగళ స్వరూపము యొక్క కాలి గోళ్ళ నుండి జనించే కాంతినే, జ్ఞానులు బ్రహ్మంగా ఆరాధిస్తారు" నిజానికి ఆయన సాకార, మరియు నిరాకార తత్వాల మధ్య ఏమీ తేడా లేదు. వీటిలో ఒకటి ఎక్కువ, ఇంకోటి తక్కువ అని ఉండదు. నిరాకార బ్రహ్మంలో కూడా, భగవంతుని అన్ని శక్తులు, మరియు సామర్ధ్యాలు తప్పకుండా ఉంటాయి. కానీ, అవి అవ్యక్తము. ఆయన వ్యకిగత సాకార రూపంలో, తన నామాలూ, రూపమూ, లీలలూ, గుణములూ, ధామాలూ, మరియు పరివారమూ, అన్నీ తన దివ్య శక్తి ద్వారా ప్రకటించబడి, వ్యక్త మవుతాయి.

06:50 - నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ।। 25 ।।

నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను, అందరికీ వ్యక్తమవ్వను. కాబట్టి, జ్ఞానము లేని వారు, నేను పుట్టుక లేని వాడననీ, మరియు మార్పుచెందని వాడననీ తెలుసుకోలేరు.

పరమేశ్వరుడైన శ్రీ విష్ణు మూర్తికి, మూడు ముఖ్యమైన శక్తులున్నాయి - యోగమాయ, ఆత్మ మరియు మాయ. సర్వోత్కృష్ట శక్తిమంతుడైన శ్రీ కృష్ణుడికి, అనంతమైన శక్తులున్నాయి. వీటిలో, యోగమాయ, ఆత్మలు, మరియు మాయ అనేవి, ప్రధానమైనవి. ఆ యోగమాయా దివ్య శక్తి, భగవంతుని యొక్క సర్వ-శక్తిమంతమైన సామర్ధ్యము. దీని ద్వారానే, తన యొక్క దివ్య లీలలనూ, దివ్య ప్రేమానందమునూ, మరియు దివ్య ధామమునూ వ్యక్త పరుస్తాడు. ఆ యొక్క యోగమాయా శక్తి ద్వారానే, భగవంతుడు ఈ లోకంలో అవతరిస్తాడు, మరియు తన దివ్య లీలలను, ఈ భూలోకంలో కూడా ప్రకటిస్తాడు. ఇదే యోగమాయా శక్తిచే, తనను తాను మన నుండి గోప్యంగా ఉంచుకుంటాడు. భగవంతుడు మన హృదయంలోనే కూర్చుని ఉన్నా, ఆయన మనలోనే ఉన్న అనుభూతి మనకు తెలియదు. మనకు ఆయన దివ్య దర్శనం చూడగలిగే అర్హత లభించేవరకూ, ఆయన దివ్యత్వాన్ని యోగమాయ మననుండి కప్పివేసి ఉంచుతుంది. కాబట్టి, మనం ఈశ్వరుడిని, ప్రస్తుతం ఆయన సాకార రూపంలో చూసినా, ఆయనే భగవంతుడని గుర్తు పట్టలేము. ఎప్పుడైతే యోగమాయా శక్తి తన కృప మనపై చూపిస్తుందో, అప్పుడే మనకు భగవంతుడిని చూసి, గుర్తుపట్టగలిగే దివ్య దృష్టి లభిస్తుంది. ఈ యోగమాయా శక్తి, నిరాకారమైనది, ఒక రూపంలో కూడా వ్యక్తమవుతుంది. రాధా, సీతా, దుర్గా, కాళీ, లక్ష్మీ, పార్వతీ మొదలైన రూపాలన్నీ, యోగమాయా శక్తి యొక్క దివ్య మంగళ స్వరూపాలే. ఇవన్నీ కూడా వైదిక సాంప్రదాయంలో, విశ్వానికే మాతృ మూర్తిగా పూజించబడ్డాయి. వీరు అమ్మ గుణాలైన సున్నితత్వమూ, వాత్సల్యమూ, క్షమా, కృప మరియు అకారణ ప్రేమలను ప్రసరిస్తారు. మనకు ఇంకా ముఖ్యముగా, జీవాత్మలకు దివ్య కృపను ప్రసాదించి, ఆధ్యాత్మిక అలౌకిక జ్ఞానాన్ని అందించటం ద్వారా, వాటికి భగవంతుడిని తెలుసుకోగలిగే శక్తిని, వీరు ప్రసాదిస్తారు. ఈ విధంగా యోగమాయ, రెండు పనులూ చేస్తుంది. ఇంకా అర్హత సాధించని జీవాత్మల నుండి, భగవంతుడిని దాచి పెడుతుంది. శరణాగతి చేసిన జీవాత్మలకు, తన కృపను ప్రసాదించి, దానితో వారు భగవంతుడిని తెలుసుకునేటట్టు చేస్తుంది. ఈశ్వరుడికి విముఖంగా ఉన్నవారు, మాయచే కప్పివేయబడతారు. వారు యోగమాయ కృపకు దూరమైపోతారు. ఈశ్వరుడికి సన్ముఖంగా ఉన్నవారు, యోగమాయ రక్షణలోకి వస్తారు, మరియు మాయ నుండి విముక్తిని పొందుతారు.

09:46 - ఇక మన తదుపరి వీడియోలో, రాగ ద్వేషములనే ద్వందములు ఎలా జనిస్తున్నాయో, శ్రీ కృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

18 May, 2022

'అన్య దేవతలు' – వారు ఎవ్వరికీ మాయా బంధనమునుండి విముక్తిని ప్రసాదించలేరు.. Bhagavad Gita

 


'అన్య దేవతలు' – వారు ఎవ్వరికీ మాయా బంధనమునుండి విముక్తిని ప్రసాదించలేరు..

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (16 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 16  నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Nj0-LbmPlEo ]

భగవంతుడు స్వయంగా, ఎటువంటి వారిని తన స్వరూపంగా భావిస్తాడో, ఇలా వివరిస్తున్నాడు...

00:46 - చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున ।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ।। 16 ।।

ఓ భరత వంశీయులలో శ్రేష్టుడా, నాలుగు రకాలైన ధర్మ-పరాయణులు, నా పట్ల భక్తితో నిమగ్నమవుతారు. ఆపదలో ఉన్నవారూ, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారూ, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారూ, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.

తనకు శరణాగతి చేయని నాలుగు రకాల జనుల గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇక ఇప్పుడు, తనను ఆశ్రయించే వారి వర్గీకరణ చేస్తున్నాడు.

1) ఆపదల్లో / దుఖాల్లో ఉన్నవారు - కొంతమంది ప్రజలు ప్రాపంచిక కష్టాలు ఎక్కువైపోయినప్పుడు, ఈ ప్రాపంచికత్వం వెంటపడి పరుగులు పెట్టటం వ్యర్థమనే నిశ్చయానికి వచ్చి, భగవంతుడినే ఆశ్రయించటం మేలని అనుకుంటారు. అదే ప్రకారంగా, ప్రాపంచిక ఆధారాలేవీ వారిని రక్షించలేకపోయినప్పుడు, వారు రక్షణ కోసం భగవంతుడిని ఆశ్రయిస్తారు. శ్రీ కృష్ణుడి కోసం ద్రౌపది చేసిన శరణాగతి, ఇటువంటి కోవకు చెందినదే. కౌరవ సభలో ద్రౌపది వివస్త్రను చేయబడుతున్నప్పుడు, ఆమె మొదట తన భర్తలు రక్షిస్తారనుకుంది. వారు ఎప్పుడైతే ఏమీ చేయలేక, నిస్సహాయులుగా ఉండిపోయారో, సభలో ఉన్న ద్రోణాచార్యుడూ, కృపాచార్యుడూ, భీష్ముడు, మరియు విదురుడి వంటి పుణ్యాత్ములైన పెద్దల మీద ఆశ పెట్టుకుంది. వారు కూడా రక్షించలేకపోయినప్పుడు, తన పళ్ళ మధ్యలో చీరను గట్టిగా పట్టుకుంది. చివరగా, దుశ్శాసనుడు ఆమె చీరను ఒక్కసారిగా లాగినప్పుడు, అది ఆమె పంటి పట్టు నుండి జారి పోయింది. ఆ సమయంలో, ఆమెకు ఇక ఇతరుల రక్షణ మీద నమ్మకం పోయింది. ఇక తన సొంత బలాన్ని కూడా నమ్ముకోలేదు. ఆమె సంపూర్ణముగా, శ్రీ కృష్ణుడికి శరణాగతి చేసింది. వెనువెంటనే ఆయన, సంపూర్ణ రక్షణను అందించాడు. ఆమె చీరను, ఇంకా ఇంకా పొడుగు పెంచటం ద్వారా, అడ్డుకున్నాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా, ద్రౌపదిని వివస్త్రను చేయలేక పోయాడు.

2) జిజ్ఞాసువులు (జ్ఞాన సముపార్జన కోసం పయత్నం చేసే వారు) - కొంత మంది ఆధ్యాత్మికత, దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే ఉత్సుకతతో, భగవంతుడిని ఆశ్రయిస్తారు. కొందరు ఆధ్యాత్మిక క్షేత్రంలో మోక్షము సాధించారని విని ఉండటం వలన, అదేంటో తెలుసుకోవాలని కుతూహలముతో ఉంటారు. కాబట్టి, వారి కుతూహలాన్ని తీర్చుకోవటం కోసం, వారు భగవంతుడిని ఆశ్రయిస్తారు.

3) ప్రాపంచిక సంపత్తిని కోరేవారు - కొంత మంది తమకు ఏమి కావాలో స్పష్టతతో ఉంటారు కానీ, భగవంతుడు మాత్రమే తమకు అవి ఇవ్వగలడని నమ్మకంతో ఉంటారు. అందుకే ఆయనను ఆశ్రయిస్తారు. ఉదాహరణకి, ధృవుడు తన తండ్రి ఉత్తానపాదుని కంటే ఉన్నతుడవ్వాలనే కోరికతో, తన భక్తిని ప్రారంభించాడు. కానీ, అతని భక్తి పరిపక్వమై, భగవంతుని దర్శనం అయిన తరువాత, అమూల్యమైన, దివ్య ప్రేమ వైఢూర్యాలున్నవాడి నుండి తాను కోరుకున్నది, ఒక ముక్కలైన గాజు వక్కల వంటిది అని తెలుసుకున్నాడు. తదుపరి, భగవంతుడిని తనకు పవిత్రమైన, నిస్వార్ధ భక్తిని ప్రసాదించమని కోరాడు.

4) జ్ఞానులు - చివరగా కొందరు జీవులు, తాము భగవంతుని అణు-అంశలమనీ, తమ సనాతనమైన, శాశ్వతమైన భగవంతుడిని ప్రేమించి, సేవించటమే, సార్థకమనే నిశ్చయానికి చేరుకుంటారు.

04:14 - తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ।। 17 ।।

వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారూ, నా పట్ల ధృడ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారినీ, అందరికంటే శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడినీ, మరియు వారు నాకు ప్రియమైనవారు.

ఆపదలో, ప్రాపంచిక వస్తువుల కోసం, కుతూహలంతో, భగవంతుడిని ఆశ్రయించే వారికి, నిస్వార్ధ భక్తి లేనట్టే. నెమ్మదిగా, క్రమక్రమంగా, భక్తి ప్రక్రియలో వారి మనస్సు పవిత్రమై, వారికి భగవంతునితో తమకున్న నిత్య-శాశ్వత అనుబంధ జ్ఞానం, పెంపొందుతుంది. అప్పుడు వారి భక్తి అనన్యమైనదిగా, ఏక చిత్తముతో, నిరంతరం, భగవత్ పరంగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం వారిది కాదనే జ్ఞానం పొందటం వలనా, ఇక్కడ సంతోషమనేది దొరకదని తెలియటం వలనా, వారు అనుకూల పరిస్థితుల కోసం తపించరు, ప్రతికూల పరిస్థితుల పట్ల శోకించరు. ఈ విధంగా, వారు నిస్వార్ధ భక్తిలో స్థితమై ఉంటారు. సంపూర్ణ ఆత్మ సమర్పణ, శరణాగతి దృక్పథంలో, దివ్య సఖుడి కోసం, ప్రేమాగ్నిలో తమని తాము సమర్పించుకుంటారు. కాబట్టి, అటువంటి జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, తనకు అత్యంత ప్రియమైన వారని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

05:40 - ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। 18 ।।

నా యందు భక్తితో ఉన్నవారందరూ, నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో, ధృడ నిశ్చయముతో ఉండి, బుద్ధి నా యందు ఐక్యమై, కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగి ఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.

జ్ఞానంతో ఉన్న భక్తుడే ఉన్నతమైనవాడు. అయితే, మిగతా మూడు రకాల భక్తులు కూడా, ఆయనకి ప్రియమైన వారే. ఏ కారణంతో అయితేనేమి, భక్తిలో నిమగ్నమై ఉన్నవారందరూ, తనకు ప్రియమైన వారే అని చెప్తున్నాడు. అయినా, జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, భౌతిక వస్తు సంపద కారణాల కోసం, భగవంతుడిని పూజించరు. అందుకే, భక్తుల యొక్క ఈ యొక్క నిస్వార్థ, బేషరతుగా ఉన్న ప్రేమకి, భగవంతుడు బద్ధుడై పోతాడు. పరా భక్తి, లేదా దివ్య ప్రేమ అనేది, ప్రాపంచిక ప్రేమ కంటే, చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది, దివ్య సఖుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది, సొంత-ప్రయోజనం కోసం, కోరికచే ప్రెరేపితమైనది. దివ్య ప్రేమ అనేది, ఇచ్చే స్వభావంతో, మరియు ఇష్టసఖుని సేవలో, త్యాగంతో నిండి ఉంటుంది. ప్రాపంచిక ప్రేమ అనేది, తీసుకునే దృక్పథంతో ఉంటుంది. దాని అంతిమ లక్ష్యం, ప్రేమించిన వారి నుండి ఏదో ఒకటి పొందటమే.

07:11 - బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।। 19 ।।

ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడు, ఉన్నదంతా నేనే అని తెలుసుకుని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు, నిజముగా చాలా అరుదు.

చాలా జన్మలలో జ్ఞానం పెంపొందించుకున్న తరువాత, జ్ఞాని యొక్క జ్ఞానము పరిపక్వ దశకు చేరిన పిదప, ఆవ్యక్తి భగవంతునికి శరణాగతి చేస్తాడు. వాస్తవానికి, యదార్ధమైన జ్ఞానం, సహజంగానే భక్తికి దారి తీస్తుంది. జ్ఞానం లేకుండా, విశ్వాసం ఉండలేదు. విశ్వాసం లేకుండా, ప్రేమ పెరుగదు. ఈ విధంగా, యదార్థమైన జ్ఞానం, సహజంగానే ప్రేమతో కూడి ఉంటుంది. మనకు బ్రహ్మం గురించి నిజమైన జ్ఞానం ఉందని అనుకుని, కానీ, ఆయన మీద ఎటువంటి ప్రేమా లేకపోతే, మన జ్ఞానం, ఉత్తగా, సిద్ధాంత పరంగానే ఉన్నట్టు. ఇక్కడ శ్రీ కృష్ణుడు వివరించేది ఏమిటంటే, ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తరువాత, ఆ జ్ఞాని యొక్క జ్ఞానము, నిజమైన విజ్ఞానముగా పరిపక్వం చెందితే, అతను ఉన్నదంతా, ఆ భగవంతుడే అని తెలుసుకుని, పరమేశ్వరుడికి శరణాగతి చేస్తాడు. ఇటువంటి మహాత్ముడు చాలా అరుదు. దీనిని జ్ఞానులకూ, కర్మీలకూ, హఠ యోగులకూ, తపస్వులకూ చెప్పలేదు. దీనిని ఆయన భక్తులకు చెప్పాడు. సర్వమూ భగవంతుడే అని సంపూర్ణముగా తెలుసుకుని, ఆయనకు శరణాగతి చేసేటటువంటి మహోన్నతమైన ఆత్మ చాలా దుర్లభము.

08:49 - కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ।। 20 ।।

భౌతిక ప్రాపంచిక కోరికలతో జ్ఞానం కొట్టుకొని పోయినవారు, అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ, అన్య దేవతలను ఆరాధిస్తారు. ఆయా దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి, ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.

శ్రీ కృష్ణుడే సృష్టిలో సమస్త వస్తువులకూ ఆధారమయినప్పుడు, ఏ ఇతర అన్య దేవతలు కూడా, ఆయన కంటే స్వతంత్రులు కాజాలరు. మన లాంటి జీవాత్మలే అయినా, వారు ఉన్నతులు. వారి పూర్వ జన్మల పుణ్య కార్యముల ఫలితంగా, వారు భౌతిక జగత్తు యొక్క పరిపాలనలో ఉన్నతమైన స్థానం సంపాదించుకుంటారు. వారు ఎవ్వరికీ కూడా మాయ బంధనము నుండి, విముక్తిని ప్రసాదించలేరు. ఎందుకంటే, వారే ఇంకా విముక్తి పొందలేదు. కానీ, వారు తమ పరిధిలోని భౌతిక వస్తువులను ప్రసాదించగలరు. ఈ భౌతిక ప్రాపంచిక కోరికలచే ప్రేరితులై, జనులు దేవతలను పూజిస్తూ, వారి ఆరాధనకు చెప్పబడ్డ నియమాలను పాటిస్తుంటారు. ప్రాపంచిక కోరికలచే, జ్ఞానం కప్పబడిపోయిన ఇటువంటి ప్రజలు, దేవతలని ఆరాధిస్తారు.

10:07 - ఇక మన తదుపరి వీడియోలో, అక్షరమైన, సర్వోత్కృష్టమైన భగవంతుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకునే వారి గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

04 May, 2022

'కారణం' – కారణమే కార్యమునకు బీజము.. Bhagavad Gita

 

'కారణం' – కారణమే కార్యమునకు బీజము..

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (06 – 10 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగములోని 06 నుండి 10 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/A35A7oIap1s ]

అర్జునుడికి భగవంతుడు, తన శక్తి గురించి ఈ విధంగా విశదీకరిస్తున్నాడు..

00:44 - ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ।। 6 ।।

సమస్త జీవ రాశులూ, నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయని, తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికీ మూల ఉత్పత్తిస్థానం, మరియూ నా లోనికే, ఇదంతా లయమై పోతుంది.

ఈ జడపదార్ధము, మరియు జీవశక్తుల సంయోగం వలననే, భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది. పదార్ధము జడమైనది. ఆత్మకి శరీర రూపంలో ఒక వాహనం అవసరం. ఈ రెండు శక్తుల సంయోగం వలన, ప్రాణులు వ్యక్తమవుతాయి. భగవంతుడే ఈ రెండు శక్తులకూ మూల స్థానం. సమస్త సృష్టీ, ఆయన నుండే వ్యక్తమవుతుంది. బ్రహ్మ యొక్క 100 సంవత్సరముల అంతంలో, ఈ సృష్టి చక్రం ముగింపు దశకు చేరుకున్నప్పుడు, భగవంతుడు ఈ సృష్టిని లయం చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మతత్వాలలో విలీనమవుతాయి. ఐదు సూక్ష్మ తత్వాలు, అహంకారంలో విలీనమవుతాయు. అహంకారము, మహత్తులోనికి లీనమవుతుంది. మహత్తు అనేది, ప్రకృతి లోనికి విలీనమవుతుంది. ప్రకృతి కూడా, శ్రీ మహా విష్ణువు శరీరంలోనికి వెళ్లి కూర్చుంటుంది. ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో, మోక్షము పొందలేక పోయిన జీవులు కూడా, భగవంతుని శరీరంలో అవ్యక్త రూపంలో, తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు. మరొకసారి, భగవంతుడు సృష్టి చేయటం సంకల్పించినప్పుడు, ఈ చక్రం తిరిగి మొదలవుతుంది. కాబట్టి, సమస్త అస్థిత్వానికీ, భగవంతుడే జన్మ స్థానం, ఆధారం, మరియు అంతిమ శాంతి స్థానం.

02:28 - మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।

నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ అర్జునా! పూసలన్నీ దారముతో గుచ్చి ఉన్నట్లు, సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.

సర్వోత్కృష్ట భగవానుడైన శ్రీ కృష్ణుడు, ఇక అన్నింటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించీ, తన ఆధిపత్యం గురించీ మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్తా, స్థితికర్తా, లయకర్త. ఆయనే, అన్నింటి అస్తిత్వానికీ మూలాధారము. దారంలో గుచ్చిన పూసల మాదిరిగా, జీవాత్మలు, తమకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే.. అందరినీ సంరక్షించేది ఆయనే.. ఆయన యందే, అందరూ ఉంటారు. భగవంతునితో సమానమైనది ఏదీ లేదు. ఆయన కన్నా ఉన్నతమైనది, ఏమీ లేదు. భగవానుడు, అర్జునుడి ముందు నిలుచుని ఉన్న తన యొక్క శ్రీ కృష్ణ సాకార రూపంలో ఉన్న ఆయనే, సర్వోన్నత, సర్వోత్కృష్ట పరమ సత్యమని, స్పష్టంగా చెబుతున్నాడు.

03:38 - రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ।। 8 ।।

ఓ కుంతీ పుత్రుడా, నీటి యందు రుచిని నేను. సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో, నేను పవిత్ర 'ఓం' కారమును.  ఆకాశములో శబ్దమును. మనుష్యులలో వారి సామర్ధ్యమును.

మనం ఏదైనా పండు తిన్నప్పుడు, ఆ రుచిలో ఉన్న తియ్యదనం, అందులో చక్కెర ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. అదే విధంగా, శ్రీ కృష్ణుడు తన శక్తి యొక్క సమస్త రూపాంతరాలలో, తన ఉనికిని ప్రకటిస్తున్నాడు. అందుకే, నీటి యందున్న రుచి తానే అంటున్నాడు. నీటి యొక్క రుచి, దాని ప్రత్యేక సహజ స్వభావము. ఎవరైనా నీటి యొక్క రుచిని, నీటి నుండి వేరు చేయగలరా? మిగతా అన్ని భౌతిక శక్తులైన వాయువూ, అగ్నీ, ఘన పదార్థములూ, తమ రుచిని వ్యక్తీకరించటానికి నీరు కావాలి. తేమ లేని, ఎండిన నాలుకపై ఎదైనా ఘన పదార్ధమును పెట్టి చూడండి. మనకు ఎటువంటి రుచీ తెలియదు. కానీ, ఆ ఘన పదార్ధములు, నోటిలోని లాలాజలములో కరిగినప్పుడు, వాటి యొక్క రుచి, నాలికపైనున్న రసాంకురములకు తెలుస్తుంది. అప్పుడు మనం దాని రుచిని అనుభవించగలం. అదే విధంగా, ఆకాశం, శబ్దమునకు వాహకంగా పని చేస్తుంది. శబ్దమే, ఎన్నో రకాల భాషలుగా రూపాంతరం చెందుతుంది. ఆకాశంలో ఉండే శబ్దము, ఆ భగవంతుడి శక్తి స్వరూపము. తానే, వేద మంత్రాలకు ముఖ్యమైన 'ఓం' కారమునూ, ప్రణవమునని అంటున్నాడు. సమస్త మానవులలో వ్యక్తమయ్యే సామర్ధ్యానికి కూడా, ఆ భగవానుడే మూల శక్తి.

05:20 - పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ।। 9 ।।

భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేనే, అగ్ని లోని తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సునూ నేనే.

అన్నిటికీ మూల సూత్రము తానే అని, శ్రీ కృష్ణుడు ఇంకా విఫులంగా చెబుతున్నాడు. శారీరక సుఖాలను త్యజించి, బుద్ది పూర్వకంగా, చిత్తశుద్ధి కోసం, నియమ-నిష్ఠలను పాటించటమే, తాపసుల ప్రత్యేకత. ఆయనే, వారి తపస్సు చేసే సామర్ధ్యము అని, భగవంతుడంటున్నాడు. భూమిలో ఉన్న సుగంధము ఆయనే.. అదే దాని ప్రధానమైన గుణము. అగ్నిలో జ్వాల యొక్క వెలుగు, ఆయనే.

06:08 - బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనమ్ ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహమ్ ।। 10 ।।

ఓ అర్జునా! సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సును నేనే.

‘కారణమే’ కార్యమునకు బీజము అని చెప్పబడుతుంది. కాబట్టి, సముద్రమే మేఘములకు బీజం అని చెప్పవచ్చు. మేఘములే వర్షానికి బీజము. సమస్త ప్రాణుల సృష్టికీ, తానే బీజమునని, శ్రీ కృష్ణుడంటున్నాడు. జగత్తులో ఉన్న సమస్త పదార్థమూ, భగవంతుని శక్తి స్వరూపమే కాబట్టి, మహోన్నత వ్యక్తులలో కనిపించే అద్భుతమైన గుణాలు, వారిలో వ్యక్తమయిన భగవంతుని శక్తులే. తెలివిగలవారు, తమ ఆలోచన, మరియు ఉపాయములలో, ఉన్నతమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. వారి ఆలోచనలు, తేజోవంతముగా, విశ్లేషణాత్మకంగా చేసే సూక్ష్మ శక్తి తానే అని, భగవంతుడంటున్నాడు. ఎప్పుడైనా, ఎవరైనా, ఈ ప్రపంచాన్ని మెరుగుపరిచే విధంగా, అత్యత్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించినప్పుడు, భగవంతుని శక్తి, వారి ద్వారా పనిచేస్తున్నట్టు మనం తెలుసుకోవాలి. మహాత్ములు సహజంగానే, తమ పని యొక్క అందాన్నీ, ప్రజ్ఞనూ, మరియు జ్ఞానాన్నీ, భగవత్ కృపకే ఆపాదించారు, ఆపాదిస్తారు.

07:32 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన శక్తులను ఏ విధంగా విఫులీకరిస్తున్నాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

27 April, 2022

'సిద్ధి' – భగవంతుడిని యదార్థముగా తెలుసుకో.. Bhagavad Gita

 

'సిద్ధి' – భగవంతుడిని యదార్థముగా తెలుసుకో..

ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణతను సాధించిన జీవులు, భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకొనలేరు!

'భగవద్గీత' సప్తమోధ్యాయం - జ్ఞాన విజ్ఞాన యోగం (01 – 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, ఇప్పటివరుకూ మనము చెప్పుకున్న 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. ఇక 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను, భక్తి షట్కము అంటారు. భక్తి షట్కములోని మొదటిదైన ఏడవ అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన విజ్ఞాన యోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/9leknUYx5Fs ]

భగవంతుడి యొక్క భౌతిక ప్రకృతి శక్తీ, మాయా బలీయమైనది. దానిని అధిగమించటం, చాలా కష్టం. కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు, ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చీ, మరియూ తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించీ, ఈ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు.

01:15 - శ్రీ భగవానువాచ ।
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్ మదాశ్రయః ।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ।। 1 ।।

భగవంతుడిలా అంటున్నాడు.. ఓ అర్జునా, నా యందు మాత్రమే మనస్సును నిలిపి, భక్తి యోగాభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి, నీవు ఎట్లయితే నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.

మనస్సు తన యందు అనన్య భక్తితో లగ్నం చేసి, భక్తితో తనను సేవించువారు, యోగులలో శ్రేష్ఠులు. సహజంగా, ఈ ప్రతిపాదన కొన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. భగవంతుడిని గూర్చి తెలుసుకునే మార్గం ఏమిటి? ఆయనపై ధ్యానం చేయటం ఎలా? ఒక భక్తుడు ఎలా దేవుడుని పూజించాలి? అని. అర్జునుడు ఈ ప్రశ్నలను అడగకపోయినా, తన కరుణచే, భగవంతుడు ముందే ఊహించి చెప్పనారంభిస్తున్నాడు. 

02:13 - జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః ।
యత్ జ్ఞాత్వా నేహ భూయోఽన్యత్ జ్ఞాతవ్యమ్ అవశిష్యతే ।। 2 ।।

ఏ జ్ఞానాన్నీ, విజ్ఞానాన్నీ తెలుసుకున్న పిదప, ఇంక ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.

ఇంద్రియమనోబుద్ధులచేత తెలుసుకోబడిన దానిని, జ్ఞానము అంటారు. ఆధ్యాత్మిక సాధన వలన, అంతర్గతంగా, లో నుండి తెలియవచ్చిన దానిని, విజ్ఞానము అంటారు. విజ్ఞానమనేది, బుద్ధిచే నేర్చుకున్నది కాదు. నేరుగా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. గురువు, మరియు శాస్త్రముల నుండి మనకు తెలిసేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అనుసరించి, మనం సాధనాభ్యాసం చేసి, అంతఃకరణ శుద్ధి చేసుకున్నప్పుడు, మనలోనుండే ఉదయించిన వివేకమునే, విజ్ఞానం అంటారు. వేద వ్యాస మహర్షి - భగవంతుని యొక్క దివ్య గుణములూ, స్వభావమూ, కీర్తీ మరియు భక్తి విశేషములను విశదీకరిస్తూ, శ్రీమద్ భాగవతం రాయాలని సంకల్పించినప్పుడు, ఆయన జ్ఞానంపై ఆధారపడి రాయలేదు. మొదట భగవంతుని పట్ల అనుభవపూర్వక విజ్ఞానం కోసం, భక్తిలో నిమగ్నమయ్యాడు. భక్తి యోగము ద్వారా, ప్రాపంచిక తలంపులు ఏమీ లేకుండా, వేద వ్యాసుడు తన మనస్సుని భగవంతునిపైనే నిమగ్నం చేశాడు. దీనితో, భగవంతుని అధీనంలో ఉండే ఆయనకే చెందిన బాహ్య శక్తి, మాయ సమేతంగా వేద వ్యాసునికి, సర్వోత్కృష్టుఁడైన దివ్య భగవంతుని దర్శనం కలిగింది. ఆ విధంగా, అంతర్గత విజ్ఞానంతో, ఈ ప్రసిద్ధ పురాణాన్ని వ్రాశాడు. సర్వోత్క్రుష్ట పరమాత్మ యొక్క సిద్ధాంత జ్ఞానంచే ఆర్జునుడిని ప్రకాశితం చేస్తాననీ, అతనికి దాని అంతర్గత విజ్ఞాన వికాసానికి తోడ్పడతాననీ, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. భగవంతుడి ద్వారా తెలుసుకున్న ఈ విజ్ఞానం తరువాత, ఇక తెలుసుకోవటానికి ఈ సృష్టిలో ఇంకేమీ మిగలదు.

04:14 - మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే ।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ।। 3 ।।

వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణ సిద్ధిని సాధించిన వారిలో, ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.

'సిద్ధి' అన్న పదం, పరిపూర్ణత కోసం వాడబడింది. ఈ పదానికి ఎన్నో అర్థాలున్నాయి. సిద్ధి అన్న పదానికి సంస్కృత నిఘంటువు నుండి కొన్ని అర్థాలు చూసినట్లయితే, అలౌకికమైన శక్తుల సంపాదనా, పనిలో సాఫల్యమూ, విజయమూ, నిపుణతా, నెరవేర్చుటా, సమస్యకి పరిష్కారం, వంట లేదా ఏదేని పని పూర్తి, స్వస్థత, లక్ష్యాన్ని చేరుకొనుట, పక్వమునకు వచ్చుట, అత్యున్నత సుఖమూ, మోక్షమూ, అసాధారణమైన నైపుణ్యమూ, పరిపూర్ణత. అయితే, ఇక్కడ శ్రీ కృష్ణుడు, ఈ పదాన్ని ఆధ్యాత్మికతలో పరిపూర్ణత కోసం వాడుతున్నాడు. అసంఖ్యాకమైన ఆత్మలలో, అతి కొద్ది వాటికి మాత్రమే, మానవ దేహం లభించింది. మానవ జన్మ పొందిన వారిలో, కొద్ది మంది మాత్రమే, పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు. పరిపూర్ణతను సాధించిన ఆ జీవాత్మలలో, నా సర్వశ్రేష్ఠమైన స్థాయినీ, మరియూ దివ్య మహిమలనూ యెఱింగిన వారు, చాలా అరుదు. ఆధ్యాత్మిక సాధనలో పరిపూర్ణత సాధించిన జీవులు, భగవంతుడిని గూర్చి యదార్థముగా తెలుసుకొనలేరు. ఎందుకంటే, దేవునిపై భక్తి లేకుండా, ఆయన గురించి తెలుసుకోవటంగానీ, గ్రహించటంగానీ సాధ్యం కాదు. కర్మ, జ్ఞాన, హఠ యోగుల వంటి ఆధ్యాత్మిక సాధకులు, వాటితో పాటుగా, భక్తిని కూడా జోడించకపోతే, భగవంతుడి గురించి తెలుసుకోలేరు. భక్తి రహితంగా, ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటు పడే వారు, భగవంతునిపై సిద్ధాంత పరమైన జ్ఞానానికే, పరిమితమై పోతారు. వారికి పరమ సత్యము యొక్క వాస్తవిక, అనుభవపూర్వక విజ్ఞానం లభించదు. చాలా మంది మనుష్యులలో, కొద్ది మంది మాత్రమే, ఆ భగవంతుడిని యదార్థముగా తెలుసుకుంటారు.

06:22 - భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। 4 ।।

భూమీ, నీరూ, అగ్నీ, వాయువూ, ఆకాశమూ, మనస్సూ, బుద్ధీ మరియు అహంకారమూ, ఇవి నా భౌతిక, ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.

ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి, అద్భుతమైన వైవిధ్యంగలదీ, నిగూఢమైనదీ. దీనిని వర్గీకరణ చేసుకుంటే, మన మితమైన బుద్ధులకి కొంత మేర, అర్థం అవుతుంది. కానీ, ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా, అసంఖ్యాకమైన ఉప-వర్గాలున్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, అక్కడ పదార్ధాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం, 118 మూలకాలు కనుగొనబడి, పీరియాడిక్ టేబుల్ లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో, మరియూ సాధారణంగా, వైదిక తత్వజ్ఞానంలో, సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్ధాన్ని ప్రకృతి అంటారు. అంటే, భగవంతుని శక్తి. దాని యొక్క ఎనిమిది అంగాలను, ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో, ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో, మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ఉన్నదంతా, భగవంతుడి భౌతిక శక్తి యొక్క స్వరూపమే. కేవలం, ఈ ఒక్క ప్రకృతి శక్తియే, ఇన్ని వివిధ రకాల ఆకారములూ, స్వరూపములూ, మరియూ పదార్ధములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం, తైత్తరీయ ఉపనిషత్తులో, విస్తారంగా వివరించబడింది. భౌతికశక్తి యొక్క ప్రప్రథమ మూల స్వరూపము, 'ప్రకృతి'. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు, ఆయన అలా, దాని వంక చూశాడు. అది కదిలించబడి, మహత్తుగా వికసించింది. ఈ మహత్తు మరింత వికసించి, అహంకారముగా వ్యక్తమయ్యింది. ఈ మహత్తూ, అహంకారమూ, రెండూ కూడా, ఆధునిక శాస్త్రము కన్నా సూక్ష్మమైనవి. అహంకారము నుండి పంచ-తన్మాత్రలు, అంటే, ఐదు గ్రాహ్యతలైన రుచీ, స్పర్శా, వాసనా, దృష్టి మరియు శబ్దములు వచ్చాయి. వాటి నుండి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు మరియు భూమి అను పంచ మహా భూతములు జనించాయి. పంచ మహా భూతములు, ఆయన  శక్తి యొక్క రూపాంతరములే కాక, మనస్సూ, బుద్ధి, మరియు అహంకారములు కూడా, భగవంతుడి విశిష్ట శక్తి స్వరూపాలు. ఇవన్నీ కేవలం, తన భౌతిక శక్తీ, మాయ యొక్క విభాగాలే.

08:56 - అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।

ఓ గొప్ప బాహువులు కలవాడా, అర్జునా, ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, నాకొక ఉన్నతమైన శక్తి ఉంది. అదే, జీవ-ఆత్మ శక్తి. ఇది ఈ జగత్తు యందున్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను, కలిగి ఉంటుంది.

ఎనిమిది విధముల ప్రకృతి, తన తక్కువ స్థాయి భౌతిక శక్తి. ఉన్నది కేవలం అది మాత్రమే కాదు. ఇంకొక ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. ఇది జడ పదార్ధం కంటే, పూర్తిగా అతీతమైనది. ఈ శక్తి యే, 'జీవ శక్తి'. ఇది జగత్తు లోని సమస్త ఆత్మలనూ, కలిగి ఉంటుంది. ఆత్మ, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తిలో భాగమే అని, భగవంతుడు వివరిస్తున్నాడు. కాబట్టి, భగవంతుడు సర్వోన్నత శక్తిమంతుడు. ఉన్నదంతా - ఆధ్యాత్మికమైన, భౌతికమైన - ఆయన నిమ్న స్థాయి, లేదా ఆయన ఉన్నత స్థాయి శక్తులతో కూడుకున్నదే. ఎలాగైతే సూర్యుడు ఒక చోటే ఉన్నా కానీ, తన సూర్య కిరణములచే ఈ సౌర కుటుంబమంతా ఎలా వ్యాపిస్తాడో, అదే విధంగా, ఒక్కడే భగవంతుడు, తన అనంతమైన శక్తులచే, ఈ మూడు లోకాలలో వ్యాపించి ఉంటాడు. ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపము, మరియు ఆయనే సర్వోన్నత శక్తిమంతుడు. ఒక్కసారి, మనం ఆత్మ అనేది భగవంతుని శక్తి స్వరూపమని ఒప్పుకున్నప్పుడు, ఆ తదుపరి, సమస్త సృష్టి యొక్క అద్వైతం అవగతమవుతుంది. మూడు అస్థిత్వాలున్నాయి: 1) పదార్థము లేక ద్రవ్యము. ఇది నశించేది. 2) జీవాత్మలు. ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు. ఈయన పదార్థము, మరియు ఆత్మలను కూడా నియంత్రించే వాడు. భగవంతునిపై ధ్యానం చేయటం వలనా, ఆయనతో ఏకమవటం వలనా, మరియూ ఆయనలా అవటం వలనా, ఆత్మ ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛను పొందుతుంది.

ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడికి భగవంతుడు, తన శక్తి గురించి ఏ విధంగా విశదీకరిస్తున్నాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

20 April, 2022

‘యోగి’ - పరిపూర్ణమైన సిద్ధిని పొందటం! Bhagavad Gita

 

‘యోగి’ - పరిపూర్ణమైన సిద్ధిని పొందటం!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (44 – 47 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 44 నుండి 47 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/A8wJC1v5HXw ]

ఎటువంటి యోగిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాడో, శ్రీ కృష్ణడిలా చెబుతున్నాడు.. 

00:46 - పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోఽపి సః ।
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే ।। 44 ।।

వారు తమ ఇష్టానుసారం కాకపోయినా, పూర్వ జన్మల సాధనా బలంచే, కచ్చితంగా భగవంతుని వైపు ఆకర్షించబడతారు. ఇటువంటి సాధకులు, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు, సహజంగానే అతీతంగా ఎదుగుతారు.

ఒకసారి ఆధ్యాత్మిక భావనలు చిగురించిన తరువాత, వాటిని నిర్మూలించలేము. భక్తి యుక్తమైన పూర్వ, ప్రస్తుత జన్మ సంస్కారములు కలిగి ఉన్న జీవాత్మ, సహజంగానే, ఆధ్యాత్మికత వైపు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వ్యక్తి, భగవంతుని దిశగా ఆకర్షించబడతాడు. ఈ ఆకర్షణనే, "భగవంతుని పిలుపు" అని కూడా అంటారు. పూర్వ సంస్కారముల ఆధారంగా వచ్చే ఈ భగవంతుని పిలుపు, ఎంతో బలంగా ఉంటుంది. తమ మనస్సు చెప్పిన మార్గంలోనే ప్రయాణించటానికి, సమస్త ప్రపంచాన్నీ, మరియు తమ స్నేహితుల, బంధువుల సలహాలనూ విడిచిపెడతారు. ఈ విధంగానే, చరిత్రలో గొప్ప రాకుమారులూ, ఉన్నతమైన హోదాలో ఉన్నవారూ, ధనవంతులైన వ్యాపార వేత్తల వంటి వారు, తమ ప్రాపంచిక సుఖాలను త్యజించి, యోగులూ, మునులూ, సన్యాసులూ, స్వామీజీలూ అయ్యారు. వారికున్న తృష్ణ, భగవంతుని కోసం మాత్రమే కావున, వారు సహజంగానే, భౌతిక పురోగతి కొరకు, వేదములలో చెప్పబడిన సకామ కర్మ కాండలకు అతీతంగా ఎదుగుతారు.

02:15 - ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిశః ।
అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।

అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమైన స్వేచ్ఛను పొంది, ఈ జన్మ లోనే, పరిపూర్ణమైన సిద్ధిని పొందుతారు.

ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వ జన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని తెరచాపను ఎగురవేస్తారు. శ్రీ కృష్ణుడు, "ప్రయత్నాద్ యతమానస్తు" అంటున్నాడు. అంటే, ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం. వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే, తీవ్రంగా ఉంటుంది. ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండి వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో, లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మ లోనే పూర్తి చేసినట్టు ఉంటుంది. కానీ, 'అనేకజన్మసంసిద్ధః' , అంటే, "యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది, అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము."

03:39 - తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।

ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మి కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.

తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరక నిష్ఠలు విధించుకుని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంభిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని అంటే, చురుకుగా, ప్రయత్న పూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మి అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం, వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడని, శ్రీ కృష్ణుడు చెబుతున్నాడు. దీనికి కారణం, చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్వుల యొక్క లక్ష్యం, ప్రాపంచిక సంపాదన. వారు ఇప్పటికీ శారీరక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు. భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే, యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది. అందుకే యోగి, వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.

05:03 - యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।। 47 ।।

అందరు యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు దృఢ విశ్వాసంతో, భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.

యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైన వారు అన్న వివాదానికి, ఈ శ్లోకం ముగింపునిస్తుంది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు. సర్వోత్తమమైన అష్టాంగ యోగీ, మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతుణ్ణి కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిసగా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు: "నేను సర్వ-స్వతంత్రుడను.. అయినా, నేను నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు." భక్తియోగి, దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు. అందుకే, భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు, అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడేవాడు. ఈ భక్తులు, తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు. అదే సమయంలో, ఇతర రకాల యోగులు, తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు. వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు కానీ, వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేదు. కోట్ల మంది పరిపూర్ణ సిద్ధిని సాధించి విముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడయిన శ్రీమన్నారాయణుడి పట్ల, భక్తిగల ప్రశాంత చిత్తులు, చాలా అరుదు. భక్తి యోగం, పరిపూర్ణ భగవదనుభూతినీ, విజ్ఞానాన్నీ అందిస్తుంది. కేవలం భక్తి యోగి మాత్రమే, యదార్థమైన భగవత్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుంటాడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే, శ్రీ కృష్ణార్జున సంవాదే, ఆత్మ సంయమయోగో నామ షష్ఠోధ్యాయః

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, ఆరవ అధ్యాయంలోని ఆత్మసంయమయోగంలోని 47 శ్లోకాలూ సంపూర్ణం.

07:34 - ఇక మన తదుపరి వీడియోలో, భక్తి షట్కంలోని మొదటి అధ్యాయం, జ్ఞాన విజ్ఞాన యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

13 April, 2022

‘సకామ కర్మ’ - మంచి చేసే వారు ఎప్పుడూ కష్టాలపాలు కారు! Bhagavad Gita

 

‘సకామ కర్మ’ - మంచి చేసే వారు ఎప్పుడూ కష్టాలపాలు కారు!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (39 – 43 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 39 నుండి 43 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/vtaqdP8-EdY ]

యోగ మార్గం నుండి తప్పిపోయిన వ్యక్తి గురించి, అర్జునడడిగిన ప్రశ్నకు, శ్రీ కృష్ణుడిలా సమాధానమిస్తున్నాడు..

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్యశేషతః ।
త్వదన్యః సంశయస్యాస్య ఛేత్తా న హ్యుపపద్యతే ।। 39 ।।

ఓ కృష్ణా, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము.. మరి ఇక నీ కన్నా, ఇది చేయగలవారెవరున్నారు?

అజ్ఞానం నుండి సందేహాలు పుడతాయి. సందేహాలను నివృత్తి చేసుకునే శక్తి, జ్ఞానం నుండి వస్తుంది. వేద శాస్త్ర పండితులు, పుస్తక జ్ఞానం కలిగి ఉంటారు. ఇది సందేహాలను నివృత్తి చేయటానికి, సరిపోదు. ఎందుకంటే, శాస్త్రాలు ఎన్నో కనిపించే విరుద్ధమైన విషయాలను, కలిగి ఉంటాయి. వీటిని నిజమైన అంతర్గత విజ్ఞానం వల్లనే, సమన్వయం చేసుకోవచ్చు. భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు, ఇటువంటి విజ్ఞానాన్ని కొంత మేర కలిగి ఉంటారు. వారు సర్వజ్ఞులు కారు. ఇటువంటి జ్ఞానోదయమయినవారు, సందేహ నివృత్తి చేయగలిగే శక్తిని కలిగి ఉంటారు. కానీ, వారు సర్వజ్ఞుడైన భగవంతునితో పోటీ పడలేరు. భగవంతుడు మాత్రమే, ఏకైక సర్వజ్ఞుడూ, మరియూ సర్వ-శక్తిమంతుడూ. అందుకే, ఎలాగైతే సూర్యుడే చీకటిని పారద్రోలేందుకు సమర్థుడో, అలాగే, ఆ భగవంతుడే సమస్త అజ్ఞానాన్నీ నిర్మూలించగలిగే, అత్యున్నత సమర్థుడు.

శ్రీ భగవానువాచ ।
పార్థ నైవేహ నాముత్ర వినాశస్తత్య విద్యతే ।
న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 40 ।।

ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు, ఈ లోకంలో కానీ, పర లోకంలో కానీ, చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు, ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.

శ్రీ కృష్ణుడు అర్జునుడిపై ఉన్న వాత్సల్యాన్నీ, మరియూ కృపనూ చూపిస్తూ, ఆయన మార్గంలో ఉన్న వారి బాగోగులను తానే చూసుకుంటాడని చెప్పటానికి, శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు. ఎందుకంటే, వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నట్టు. "మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాల పాలు కారు." ఈ లోకంలో, మరియూ పర లోకంలో, భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడని, ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన, ఆధ్యాత్మికాభిలాషులకు ఒక గొప్ప భరోసా.

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।।

అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।

యోగ భ్రష్టులైన వారు, పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల, సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు, లేదా, ఏంతో కాలం యోగాభ్యాసం వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్య జ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా దుర్లభం.

ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికీ, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికీ, స్వర్గ లోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు, ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు వ్యతిరేకమైనది, భోగము. దీని మీద ఆసక్తితో, వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశమిచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు, అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు, చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడతాడు. ఇటువంటి జీవులకు, తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం కోసం, అనుకూలంగా ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో, చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికతను నేర్పించే వారికి జన్మిస్తారు, లేదా సంపన్నుల కుటుంబంలో, శారీరక అవసరాలన్నీ తీరి, బ్రతుకు తెరువు కోసం, రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం, ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తిగల జీవులకు అనుకూలంగా ఉంటుంది.

మనం పుట్టిన పరిస్థితులూ, సందర్భమూ, మరియూ కుటుంబమనేవి, మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరక తల్లిదండ్రుల నుండి, మనం వంశ పారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశ పారంపర్య పద్ధతి. కానీ, సామాజిక వారసత్వ పద్ధతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలను, మనం పెరిగిన వాతావరం వలన, గుడ్డిగా పాటిస్తుంటాము. ఈ విధంగా, మనం పుట్టిన స్థలమూ, మరియూ కుటుంబమూ, మన జీవిత గమనమూ, మరియూ పురోగతిపై, చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ ప్రతి జన్మలో, పుట్టే స్థలమూ, మరియూ కుటుంబమూ, ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే, ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలపులు, పనుల చిట్టా, భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముననుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క ఆధ్యాత్మిక సంపద, ఫలములనిస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించీ, మరియూ వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, పుణ్య లోకాలకు పంపబడరు. వారికి తమ ప్రయాణం ముందుకు తీసుకువెళ్ళటానికి అనుకూలంగా, ఆధ్యాత్మికతలో, ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో, ఇక్కడే జన్మను ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ, అత్యంత భాగ్యవంతమయినది. ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు, తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్ ।
యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన ।। 43 ।।

ఓ కురు వంశస్తుడా, ఇటువంటి జన్మ పొందిన తరువాత, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేలుకొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు, మరింత పరిశ్రమ చేస్తారు.

ప్రతీ ఒక్క ప్రాణి హృదయంలో స్థితుడై ఉన్న భగవంతుడు, వారికి పరిపూర్ణమైన న్యాయం చేస్తాడు. మన పూర్వ జన్మలలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక సంపదలైన, వైరాగ్యం, జ్ఞానం, భక్తీ, విశ్వాసం, సహనం, దృఢ సంకల్పం వంటివన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి, సరియైన సమయంలో, మన పూర్వ జన్మల పరిశ్రమ ఫలితాన్ని, ఆయా సంపాదనకనుగుణంగా, తిరిగి ఇస్తాడు. మన ఆధ్యాత్మికతను, లోనుండి తిరిగి పెంపొందిస్తాడు. భౌతిక, ప్రాపంచిక ధృక్పథంలోనే ఉన్న కొందరు, అకస్మాత్తుగా, పూర్తి ఆధ్యాత్మికతలో నిమగ్నమవ్వడానికి, ఇదే కారణం. వారి యొక్క ఆధ్యాత్మిక సంస్కారములు మేల్కొన్నప్పుడు, వారికి పూర్వ జన్మల సాధనా ఫలితం, లభిస్తుంది. ఒక యాత్రికుడు విరామం కోసం, దారిలో ఉన్న ఒక విడిది గృహంలో రాత్రిపూట బస చేయవచ్చు. కానీ, తను లేచినప్పుడు, తను అప్పటివరకూ వచ్చిన దూరాన్ని, తిరిగి ప్రయాణం చేయనవసరం లేదు. కేవలం మిగిలిన దూరాన్ని మాత్రమే, ప్రయాణించవలసి ఉంటుంది. అదే విధంగా, భగవంతుని కృప వలన, పూర్వ జన్మలలో తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపాడో, అక్కడి నుండి పురోగమించటానికి, తన పూర్వ జన్మలలో సాధించుకున్న ఆధ్యాత్మిక సంపత్తిని, ఒక మనిషి నిద్ర లేచి కొనసాగించినట్టుగా, యోగి తిరిగి పొందుతాడు. అందుకే, ఇటువంటి యోగి, ఎన్నటికీ దారితప్పడు.

ఇక మన తదుపరి వీడియోలో, ఎటువంటి యోగిని అత్యున్నతమైన వారిగా భగవంతుడు పరిగణిస్తాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

06 April, 2022

‘శ్రద్ధ’ - యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయం..! Bhagavad Gita

  

‘శ్రద్ధ’ - యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయం..!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (34 – 38 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 34 నుండి 38 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/psCpVYUtyiM ]

అర్జునుడి ప్రశ్నకు, మనస్సును ఎలా నియత్రించాలో, శ్రీకృష్ణుడిలా చెబుతున్నాడు..

00:44 - చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ధృడమ్ ।
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్ ।। 34 ।।

ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం, వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది కృష్ణా.

చికాకు పెట్టే మనస్సు గురించి వివరించేటప్పుడు, అర్జునుడు మన అందరి తరపున మాట్లాడుతున్నాడు. మనస్సు చంచలమైనది.. ఎందుకంటే, అది ఒక విషయం నుండి మరో విషయానికి ఎన్నో దిశలలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. అది అల్లకల్లోలమైనది.. ఎందుకంటే, ద్వేషం, కోపం, కామం, లోభం, ఈర్ష, ఆందోళన, భయం, అనుబంధం వంటి వాటితో, ఒక వ్యక్తి అంతఃకరణలో, ఉపద్రవాలను సృష్టిస్తుంది. అది బలమైనది.. ఎందుకంటే, తన శక్తివంతమైన అలలచే బుద్ధిని వశపరుచుకుని, విచక్షణా శక్తిని నాశనం చేస్తుంది. మనస్సు అనేది మొండిది, మూర్ఖమైనది కూడా.. ఎందుకంటే, బుద్ధికే వ్యాకులత కలిగేటట్టు, అది ఒకసారి హానికర ఆలోచనను పట్టుకుంటే, దానిని వదిలి వేయటానికి ఒప్పుకోదు. దాని గురించి పదే పదే చింతిస్తూనే ఉంటుంది. ఈ విధంగా దాని యొక్క హానికరమైన లక్షణాలను వివరిస్తూ, అర్జునుడు, మనస్సును నిగ్రహించటం అనేది వీచేగాలిని నిగ్రహించటం కన్నా కష్టమైనదని ప్రకటిస్తున్నాడు. ఇదొక బలమైన ఉపమానం.. ఎందుకంటే, ఎవరూ కూడా ఆకాశంలోని బ్రహ్మాండమైన గాలిని నిగ్రహించటం, అసాధ్యం.

02:17 - శ్రీ భగవానువాచ ।
అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।

శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: ఓ మహా బాహువులు కల కుంతీ పుత్రుడా.. నీవు చెప్పినది నిజమే. మనస్సనేది, నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము, మరియు వైరాగ్యములచే, దానిని నిగ్రహించవచ్చు.

కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెబుతూ, అతడిని 'మహాబాహో'.. అంటే, "గొప్ప బాహువులు గలవాడా" అని సంబోధిస్తున్నాడు. దాని అర్థం, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహసోపేత వీరులను ఓడించావు. ఈ మనస్సుని ఓడించలేవా?’ అని శ్రీకృష్ణుడు, మనస్సును నియంత్రించడం ఎంతో క్లిష్టతరమైనదని, అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. ప్రపంచంలో కష్టతరమైన పనులెన్నో ఉన్నాయి. అయినా, మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాం. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది, మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుందని, నావికులకు తెలుసు. అయినా, వారు సముద్రానికి దూరం కారు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి వైరాగ్యం, మరియు అభ్యాసం ద్వారా మనస్సుని నియంత్రించవచ్చని, హామీ ఇస్తున్నాడు. మనస్సు, ఇంతకు క్రితం పరుగు పెట్టే అలవాటున్న దిశగా, దాని యొక్క అనుబంధ విషయముల కొరకు పరుగు పెడుతుంది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటమనేది, మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది. పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ, అభ్యాసం. ఇది సాధకులకు ఒక ముఖ్యమైన విషయం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికీ, ప్రావీణ్యతకీ, శ్రేష్ఠతకీ దారి తీసే ప్రముఖ విషయం, అభ్యాసమే. నైపుణ్యం, కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యపడుతుంది. అదే విధంగా, మూర్ఖమైన, మరియు అల్లకల్లోలమైన మనస్సుని, అభ్యాసం ద్వారా, ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయడమే, వైరాగ్యం.. మనస్సుని భగవంతుని మీద నిలపడమే, అభ్యాసం..

04:24 - అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః ।
వశ్యాత్మనా తు యతతా శక్యోఽవాప్తుముపాయతః ।। 36 ।।

మనస్సు అదుపులో లేనివానికి, యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారూ, మరియు సరియైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారూ, యోగములో పరిపూర్ణతను సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.

శ్రీ కృష్ణ పరమాత్మ, ఇప్పుడు మనోనిగ్రహానికీ, మరియు యోగంలో సాఫల్యానికీ ఉన్న సంబంధాన్ని, తెలియ చెబుతున్నాడు. అభ్యాసము, మరియు వైరాగ్యము ద్వారా, మనస్సుకి కళ్ళెం వేయటం నేర్చుకోనివారు, యోగాభ్యాసములో చాలా కష్టాలను ఎదుర్కుంటారని అంటున్నాడు. కానీ, మనస్సుని నిరంతర ప్రయత్నం ద్వారా, తమ నియంత్రణలోకి తెచ్చుకున్న వారు, సరియైన పద్ధతిని అవలంభించటం ద్వారా, విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దిష్ట పద్ధతి ఆయనచే, 6.10 శ్లోకం నుండి 6.32వ శ్లోకం వరకు, విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతుని పైన మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించే తలంచటం, అందరినీ సమ దృష్టితో చూడటమనేవి, దీనిలో భాగము. ఈ విషయం, మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి, ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది; ఇప్పుడు శ్రీ కృష్ణుడిని ఈ విషయం గురించి అడుగుతున్నాడు.

05:51 - అర్జున ఉవాచ ।
అయతిః శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః ।
అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్ఛతి ।। 37 ।।

అర్జునుడు ఇలా పలుకుతున్నాడు : ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యము యొక్క అంతిమ విజయాన్ని, ఈ జన్మ లోనే సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి?

భగవత్ ప్రాప్తి దిశగా ప్రయాణం, 'శ్రద్ధ' తోనే మొదలవుతుంది. చాలా మంది విశ్వాసం గల జీవాత్మలు, పూర్వ జన్మ సంస్కారాల వలనా, లేదా, సాధు పురుషుల సాంగత్యం వలనా, లేదా, ప్రపంచంలోని ప్రతికూలతల వంటి వాటి చేతా, వేద శాస్త్రాల ఆధ్యాత్మిక జ్ఞానంపై విశ్వాసం పెంపొందించుకుంటారు. ఈ ప్రయాణం ప్రారంభించటానికి కావలసిన శ్రద్ధని కలిగించేవి, ఎన్నో కారణాలుండవచ్చు. కానీ ఈ సాధకులు, ఆ తరువాత తగినంత పరిశ్రమ చేయక నిర్లక్షం చేస్తే, మనస్సు చంచలంగానే ఉంటుంది. ఇటువంటి సాధకులు తమ ప్రయాణాన్ని, ఈ జన్మ లో పూర్తి చేయలేరు. ఇటువంటి సాధకుల గతి ఏమిటి? అని అర్జునుడు శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.

07:01 - కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।
అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।

ఓ మహా బాహువులు గల కృష్ణా.. యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి, భౌతిక, మరియు ఆధ్యాత్మిక విజయాలు రెండింటి నుండీ, భ్రష్టుడై పోడా? అతడు విడిపోయి, చెదిరిన మేఘం వలె, ఉభయభ్రష్టుడై, ఎటూకాకుండా పోడా?

విజయం సాధించాలనే కోరిక జీవులకు సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి, దానికది సహజం. భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి, ఆత్మ కూడా, తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయం, కార్య సిద్ధి, రెండు రంగాలలో ఉంటుంది. అవి, భౌతిక మైనది, మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయని అనుకునేవారు, భౌతిక అభ్యున్నతి కోసం పాటు పడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి, ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు, తమ ప్రయత్నంలో విఫలమయితే, వారు అటు భౌతిక సంపదా, ఇటు ఆధ్యాత్మిక సంపదా లేకుండా అయిపోవటం, స్పష్టంగా మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఆలోచించే వారి స్థితి, ఒక విడిపోయి, చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా? అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు.. దాని బరువును పెంచుకుని, వర్షం కురిపించేదిగా అవ్వలేదు. అది కేవలం గాలిలో తేలుతూ, ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా? అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.

ఇక మన తదుపరి వీడియోలో, యోగ మార్గం నుండి తప్పిపోయిన వ్యక్తి గురించి అర్జునుడడిగిన ప్రశ్నకు, శ్రీ కృష్ణుడి సమాధానం తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

30 March, 2022

మనిషికి భగవంతుడి పరీక్ష! భగవంతుడే కష్టాన్ని లోకంలో ఎందుకు ఏర్పాటు చేశాడు? Bhagavad Gita

 

మనిషికి భగవంతుడి పరీక్ష! భగవంతుడే కష్టాన్ని లోకంలో ఎందుకు ఏర్పాటు చేశాడు?

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (28 – 33 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 28 నుండి 33 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/pBbz4VFU4Qk ]

భగవంతుడు పరిపూర్ణ యోగులుగా ఎవరిని పరిగణిస్తారో వివరిస్తున్నాడు..

యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।

స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛను పొందుతాడు. ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచేత, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని చేరుకుంటాడు.

ఆనందము అనేదానిని, నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:

1. తామసిక ఆనందం: ఇది మాదకద్రవ్యాలూ, మద్యమూ, ధూమపానమూ, మాంసాహారమూ, హింసా, నిద్రా మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం.
2. రాజసిక ఆనందం: ఇది మనస్సూ మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం.
3. సాత్త్విక ఆనందం: ఇది కరుణా, ఇతరులకు సేవా, జ్ఞాన సముపార్జనా, మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందము. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం, ఈ కోవకు చెందినదే.
4. నిర్గుణ ఆనందం: ఇది భగవంతుని దివ్య ఆనందము. ఇది పరిమాణంలో, అనంతమైనది. ప్రాపంచిక, భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛను పొంది, భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.

సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।

నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వ భూతములనూ భగవంతుని యందు, మరియు భగవంతుడిని సర్వ భూతములయందూ దర్శిస్తారు.

ప్రతి వస్తువులోనూ, తన వేరు వేరు శక్తుల రూపంలో ఉన్నది, భగవంతుడే. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల చేత, అన్నిటియందూ నిండి, నిబిడీకృతమై, వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదానినీ, భగవత్ సంబంధముగా చూస్తారు.

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।

ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను.

భగవంతుడిని వీడటం అంటే, మనస్సుని అయన నుండి దూరంగా తిరగనీయటం. ఆయనతో ఉండటం అంటే, మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి, ఒక సులువైన మార్గం ఏమిటంటే, ప్రతి విషయాన్నీ, ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధపెడితే, మనస్సు యొక్క స్వభావం ప్రకారం, వారి పట్ల అది ద్వేషం, కోపం వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ, అలా అవ్వనిస్తే, మన మనస్సు దివ్య జగత్తు నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం, ఆగిపోతుంది. దానికి బదులుగా, ఆ వ్యక్తిలో కూర్చుని ఉన్న పరమాత్మను దర్శించగలగాలి. మన మనస్సుకు మనమే సర్దిచెప్పుకోవాలి. “భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. అందుకే, ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను.” ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని చెడురకపు ఆలోచనలు బాధించకుండా, కాపాడుకోవచ్చు. అదే విధంగా, మిత్రునితో కానీ, లేదా బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు, మనస్సు భగవంతుని నుండి వేరైపోతుంది. కొన్నిసార్లు మనస్సు పాత విషయాలపై చింతిస్తూ ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే, ఈ శోకము మనస్సుని భూతకాలము లోనికి తీసుకువెళ్ళటం వలన, వర్తమాన కాలంలో చేయవలసిన హరి, గురు చింతన ఆగిపోతుంది. అలా కాకుండా, ఆ సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు, ఇలా అనుకోవాలి.. “భగవంతుడు కావాలనే నా కోసం, నేను వైరాగ్యం పెంపొందిచుకోవాలని, కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేశాడు. ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే, తన కృపచేత, నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరియైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు.” ఈ విధంగా ఆలోచించటం వలన, మనం భక్తి యుక్త ధ్యాసను కాపాడుకోవచ్చు. 

సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।

నా యందే ఏకత్వంతో స్థితుడై ఉండి, నన్నే సర్వ భూతముల యందూ స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములూ చేస్తున్నా, నా యందే నివసించును.

భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన ప్రతిప్రాణి హృదయములో, పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు. జాతీ, కులం, లింగం, వయస్సు, సామాజిక స్థాయివంటి వాటి ఆధారంగా, వేరు వేరుగా చూస్తారు. ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు హంస లాంటి వారు. అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి. అత్యునత స్థాయి యోగులను, 'పరమ హంస'లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు. వారికి ఈ ప్రపంచ స్పృహ ఉండదు. 

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ।। 32 ।।

సర్వ ప్రాణులనూ సమానముగా దర్శిస్తూ, ఇతరుల సుఖాలూ, దుఃఖాలూ, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.

మన శరీర అవయవాలన్నీ, మనవే అనుకుంటాం. వాటిలో ఏ ఒక్కటి పాడయినా విచారిస్తాము. మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా, అది మనకు హాని జరిగినట్టే అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటాము. అదే విధంగా, అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించే వారు, ఇతరుల సుఖ-దుఃఖాలను కూడా తమవాటిగానే భావిస్తారు. కాబట్టి, అటువంటి యోగులు, ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాషులే. వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం, పాటు పడతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమ-దర్శనము.

అర్జున ఉవాచ ।
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ।। 33 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది, మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది.

మాధవుడు చెప్పిన యోగ విధానంలో ఉన్న ఈ విషయాలు, అర్జునుడికి కష్టంగా తోస్తున్నాయి.

-- ఇంద్రియములను నిగ్రహించుము..
-- అన్ని కోరికలనూ త్యజించుము..
-- మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేయుము..
-- ఆయననే, అచంచలమైన మనస్సుతో స్మరించుము..
-- అందరినీ సమ దృష్టితో చూడుము..

ఇవి ఆచరించలేనివని అర్జునుడు నిర్మోహమాటంగా, తన సందేహాన్ని భగవానుడితో వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఈ విషయాలు, మనస్సుని నియంత్రించకుండా, సాధ్యము కావు. మనస్సు చంచలముగా ఉంటే, ఈ యోగ విషయములన్నీ కూడా, అసాధ్యమే అవుతాయి.

ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడి ప్రశ్నకు, మనస్సును ఎలా నియత్రించాలో, శ్రీకృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

23 March, 2022

'బ్రహ్మ-భూతం' పొందటం ఎలా? ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు.. Bhagavad Gita

 

'బ్రహ్మ-భూతం' పొందటం ఎలా? ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు..

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (23 – 27 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 23 నుండి 27 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/3-ixcOv5iUs ]

నిలకడ లేని మనస్సును, నిరంతరం భగవంతుని మీద ఏ విధంగా కేంద్రీకరించాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:48 - తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।

స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే, యోగమని అంటారు. ఈ యోగమును, దృఢ సంకల్పముతో, ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా, అభ్యాసం చేయాలి.

భౌతిక జగత్తు, మాయ యొక్క అధీనంలో ఉంది. భౌతిక శక్తి అయిన మాయ, చీకటితో పోల్చబడుతుంది. అది మనలను అజ్ఞానం అనే చీకటిలో ఉంచి, మనలను ఈ లోకంలో బాధలకు గురి చేస్తుంది. కానీ, భగవంతుడనే వెలుగుని మన హృదయం లోనికి తెచ్చినప్పుడు, మాయా రూప చీకటి, సహజంగానే నిర్మూలించబడుతుంది. భగవంతుడు వెలుగు వంటి వాడు, మాయ చీకటి వంటిది. ఎలాగైతే చీకటి అనేది వెలుగుని ఓడించలేదో, ఆవిధంగానే, మాయ అనేది, ఎన్నటికీ భగవంతుణ్ణి జయించలేదు. ఇక భగవంతుని సహజ-స్వభావం, దివ్య ఆనందం. అదే సమయంలో, మాయ యొక్క పరిణామం దుఃఖం. అందుకే, భగవంతుని దివ్య ఆనందాన్ని పొందినవాడు, మాయ కలిగించే దుఃఖములకు ఎన్నటికీ ఇక లోనుకాడు. ఈ విధంగా, యోగ స్థితి అంటే, ఆనంద ప్రాప్తీ, దు:ఖ నివృత్తీ, రెండూ ఉన్నట్లే.

02:06 - సంకల్పప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః ।

మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః ।। 24 ।।

02:16 - శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతిగృహీతయా ।

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ ।। 25 ।।

ప్రాపంచిక తలంపులలో నుండి వచ్చిన అన్ని కోరికలనూ త్యజించి, ఇంద్రియములను, అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా, మరియు నిశ్చయముగా, బుద్ధిలో దృఢవిశ్వాసంతో, మనస్సు భగవంతుని యందే స్థితమగును. ఇక మరే విషయం గురించీ ఆలోచించదు.

ధ్యానానికి రెండు ప్రక్రియలు అవసరం. మనస్సుని ప్రాపంచిక జగత్తు నుండి తీసివేయటం, మరియు దానిని భగవంతుని యందే స్థిర పరచటం. మనస్సుకి ప్రపంచంతో అనుబంధంతో ఉన్నప్పుడు, ప్రాపంచిక వస్తువులూ, మనుష్యులూ, సంఘటనల వంటివాటి తలపులు, మనస్సులోకి వస్తూనే ఉంటాయి. ప్రారంభంలో తలంపులు, ‘స్ఫూర్ణా’ రూపంలో ఉంటాయి. అంటే, అప్పుడప్పుడూ వచ్చిపోయే అనుభూతులూ, ఆలోచనలూ. మనం ఈ యొక్క ‘స్ఫూర్ణ’ కావాలని గట్టిగా కోరుకున్నప్పుడు, అది ‘సంకల్పమ’వుతుంది. ఈ విధంగా ఆలోచనలు, అవి అనుకూలమైనవో, లేదా ప్రతికూలమైనవో, దానిని బట్టి, సంకల్పముగా అంటే, ఆయా వస్తు విషయాల కోసం పాటు పడటం.. వికల్పములుగా అంటే, వాటిని ద్వేషించటంగా మారతాయి. ఈ సంకల్ప వికల్ప బీజములు, కోరికలనే మొక్కగా మారతాయి. సంకల్ప వికల్పములనే ఈ రెండూ, మనస్సుపై తక్షణమే వాటి ముద్రను వేస్తాయి. ఈ విధంగా, అవి నేరుగా భగవంతునిపై ధ్యానానికి అవరోధం కలిగిస్తాయి. వాటికి, ఆకస్మికంగా ఎగిసిపడే స్వభావం కూడా ఉంటుంది. ఈ నాటి చిన్న కోరికే, కాలక్రమంలో మహా జ్వాలగా పరిణమించే అవకాశం ఉంది. ఈ విధంగా, ధ్యానంలో విజయం పొందాలనే అభిలాష ఉంటే, భౌతిక వస్తు-విషయముల పట్ల ఆసక్తిని విడిచిపెట్టాలి. ఇక రెండవ ప్రక్రియ, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. ఇది దానంతట అదే అయిపోదు. దృఢ సంకల్పముతో శ్రమిస్తే, విజయం నెమ్మదిగా చేకూరుతుంది. వేద శాస్త్రాలకనుగుణంగా ఉన్న దృఢ సంకల్పాన్ని, ‘ధృతి’ అంటారు. ఈ దృఢ సంకల్పం, బుద్ధి యొక్క గట్టి విశ్వాసం వలన వస్తుంది. చాలా మంది ప్రజలు, ఆత్మ తత్త్వము గురించీ, ప్రాపంచిక పరుగుల నిరర్ధకత్వము గురించీ, వేద శాస్త్రాల పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. కానీ, వారి దైనందిన జీవితం, వారి జ్ఞానానికి అనుగుణంగా ఉండదు. అంతేకాక, పాపిష్ఠి పనులూ, లైంగిక వాంఛలూ, మరియు మత్తుపదార్ధలతో కూడిన పనులు కూడా చేస్తుంటారు. ఇది ఎందుకంటే, వారి బుద్ధి ఈ శాస్త్ర విషయాల మీద నమ్మకాన్ని కలిగి ఉండదు. ఈ ప్రపంచం యొక్క అనిత్యము, మరియు భగవంతునితో తనకున్న శాశ్వత సంబంధాల మీద బుద్ధి ధృఢ విశ్వాసం కలిగి ఉంటే, అప్పుడు ఈ విచక్షణా శక్తి వస్తుంది. ఈ విధంగా బుద్ధిని ఉపయోగించుకుని, క్రమక్రమంగా ఇంద్రియ భోగములను త్యజించాలి. దీనినే ప్రత్యాహారము అంటారు. అంటే, ఇంద్రియ వస్తు-విషయముల వైపు మనస్సు పరుగు తీయటాన్ని నిగ్రహించటం. ప్రత్యాహరములో సాఫల్యం తక్షణమే రాదు. అది పదే పదే అభ్యాసం చేయటం ద్వారా, క్రమక్రమంగా సాధించబడుతుంది.

05:41 - యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।

ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన, నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో, దానిని తిరిగి తెచ్చి, నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.

ధ్యానంలో విజయం, ఒక్క రోజులో రాదు. పరిపూర్ణ సిద్ధిని పొందే మార్గం, సుదూరమైనదీ, మరియు క్లిష్టమైనదీ. భగవంతునిపై మనస్సును కేంద్రీకరించాలని, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడనుకుంటాము. కానీ, క్రమంగా భౌతిక విషయాలపైకి మనస్సు, ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో పరిభ్రమించిపోతుంది. కాబట్టి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలను అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది:

1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం, ఈ ప్రపంచము మన లక్ష్యం కాదని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. 

2. మరల, బుద్ధి విచక్షణ శక్తి చే, భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి, భగవంతుని పైనే కేంద్రీకరించాలి.

3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి, మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దానికదే, అనాయాసముగా అయిపోతుంది.

ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు. అయితే, మనస్సు చంచలమైనదే.. మనం ఎంత ప్రయత్నించినా, అది సహజంగానే, తనకు ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుందని, ముందే అనుకోవాలి. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి బుద్ధి యొక్క విచక్షణా శక్తితో, దానిని భగవంతుడి వైపుకు మళ్లించాలి. ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమ క్రమంగా, మనస్సు భగవంతునిపై అనుసంధానాన్ని పెంచుకుంటుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా సులువవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి, సిద్ధపడాలి.

07:50 - ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ।। 27 ।।

మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడూ, ఆవేశ-ఉద్వేగాలు శాంతింపజేసేవాడూ, పాపరహితుడూ, అన్నింటినీ భగవత్ సంబంధముగా చూసేవాడూ అయిన యోగికి, అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది.

మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేస్తున్న యోగికి, ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి. మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది కానీ, ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు, అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు. ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో, మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ, ఆయన యందే నిమగ్నమై ఉంటుంది. అటువంటి భక్తుడు, ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు. ఆయన గురించే మాట్లాడతాడు, ఆలోచిస్తుంటాడు. ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం, ప్రారంభిస్తుంది. మన అంతర్గత, అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది మన మనస్సు నియంత్రించబడుతుండటానికీ, మన అంతఃకరణ, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికీ, ఒక నిదర్శనం. ఇక్కడ మనము, 'శాంత-రాజసం' మరియు 'అకల్మషం' అయినప్పుడు, మనం 'బ్రహ్మ-భూతం'  అంటే, భగవత్ ప్రాప్తిని పొందుతాము. ఆ స్థితిలో, మనం అత్యున్నత ఆనందమును అనుభవిస్తాము.

ఇక మన తదుపరి వీడియోలో, భగవంతుడు పరిపూర్ణ యోగులుగా ఎవరిని పరిగణిస్తాడో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkx4Ly8Jkv2ufJrfPPc8XnOLQwMddbQLId8

16 March, 2022

'సమాధి' - శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం! Samadhi Sthithi

 

'సమాధి' - శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం!

'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (16 - 22 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 16 నుండి 22 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/0z_x3TolkZY ]

మనస్సు, భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండడానికి ఏం చేయాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।
న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ।। 16 ।।

ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో, లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో, లేదా మరీ తక్కువ నిద్ర పోతారో - వారు యోగములో విజయం సాధించలేరు.

శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించినవారు, యోగములో సాఫల్యం సాధించలేరని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆధ్యాత్మిక పథంలో కొత్తగా అడుగిడిన వారు, అసంపూర్ణ జ్ఞానంతో, ఇలా చెబుతుంటారు. "నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి, శారీరక నిర్వహణ మరచిపోయి, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము." కానీ, ఇటువంటి సిద్ధాంతం, మనిషిని ఎక్కువ దూరం తీసుకు వెళ్ళలేదు. మనము ఈ శరీరమే కాదన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మనం జీవించి ఉన్నతకాలం, మనకు వాహనం. దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. “శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం” అంటే, "ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి సాధనము". ఒకవేళ శరీరం అనారోగ్యంపాలయితే, ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడుతాయని, ఆయుర్వేద గ్రంథమైన చరకసంహిత తెలియజేస్తుంది. ఇక రామాయణంలో, ‘తను బిను భజన వేద నహీఁ వరనా’ అంటే, ‘ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్నా, శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేద’ని, పేర్కోంది. నిజానికి, భౌతిక, ప్రాపంచిక శాస్త్ర సహాయంతో, మన శరీరాన్ని చక్కగా చూసుకొమ్మని ఉపదేశిస్తున్నాయని, వేద ప్రమాణాలు.

02:27 - యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు ।
యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ।। 17 ।।

కానీ ఎవరైతే తినటంలో, మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో, అన్ని దుఖములనూ ఉపశమింపచేయవచ్చు.

యోగం అంటే, ఆత్మ భగవంతునితో ఎకమవ్వటం. యోగమునకు వ్యతిరేకమైనది భోగం. అంటే, ఇంద్రియ సుఖాలలో నిమగ్నమవ్వటం. భోగాలలో నిమగ్నమవ్వటం, శరీరం యొక్క సహజ సూత్రాలను ఉల్లంఘిస్తుంది. అది రోగాలకు దారి తీస్తుంది. శరీరం రోగ గ్రస్థమయితే, అది యోగాభ్యాసాన్ని కుంటుపడేస్తుంది. ఈ విధంగా, శారీరక కార్యకలాపాలలో మితంగా ఉండి, యోగాభ్యాసము చేయటం వలన, మనము అన్ని శారీరిక, మానసిక దుఃఖాల నుండి విముక్తిని పొందవచ్చు.

03:24 - యదా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే ।
నిఃస్పృహస్సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా ।। 18 ।।

వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమ శ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సు మీదనే, లగ్నం చేస్తారు. ఇటువంటి వారు, యోగములో ఉన్నారని చెప్పబడతారు. వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.

ఒక మనిషి, యోగ సాధనను ఎప్పుడు పూర్తి చేసినట్లవుతుందంటే, నిగ్రహింపబడిన మనస్సు, ఎప్పుడైతే కేవలం భగవంతుని యందు మాత్రమే నిలచి స్థితమై పోతుందో, అప్పుడే యోగం పరిపూర్ణమవుతుంది. అదేసమయంలో, మనస్సు దానంతట అదే, ఇంద్రియ లౌల్యముల నుండీ, మరియు ప్రాపంచిక భోగాల నుండీ వీగిపోయి, దూరమైపోతుంది. ఆ సమయంలో వ్యక్తిని, 'యుక్తుడు' గా పరిగణించవచ్చు.

04:18 - యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా ।
యోగినో యతచిత్తస్య యుఞ్జతో యోగమాత్మనః ।। 19 ।।

గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు, ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.

బాహ్య ప్రదేశంలో వీచేగాలికి, దీపజ్యోతి సహజంగానే చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దానిని నియంత్రించటం, అసాధ్యం. కానీ, గాలిలేని చోట, దీపం ఒక బొమ్మ లాగా, నిలకడగా ఉంటుంది. అదే ప్రకారంగా, మనస్సనేది సహజంగా చంచలమైనదీ, నిగ్రహించటానికి చాలా క్లిష్టమైనది. కానీ, ఎప్పుడైతే యోగి యొక్క మనస్సు, సంపూర్ణంగా భగవంతునితో ఏకమై ఉంటుందో, అది కోరికలనే గాలి నుండి కాపాడబడుతుంది. ఇటువంటి యోగి, భక్తి యొక్క బలంచే నిలకడగా, తన మనస్సుని వశమునందుంచుకుంటాడు.

05:15 - యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా ।
యత్ర చైవాత్మనాఽఽత్మానం పశ్యన్నాత్మని తుష్యతి ।। 20 ।।

ఎప్పుడైతే మనస్సు, భౌతికమైన కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడా యోగి, పరిశుద్ధమైన మనస్సు ద్వారా, ఆత్మను దర్శించగలడు. తదుపరి, ఆత్మానందములోనే రమిస్తాడు.

ధ్యానం చేసే పద్ధతినీ, ధ్యానం యొక్క పరిపూర్ణ సిద్ధిస్థితినీ వివరించిన శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, దాని పరిశ్రమ యొక్క ఫలితాలను తెలియపరుస్తున్నాడు. మనస్సు ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో, అప్పుడు వ్యక్తి ఆత్మను, శరీర-మనో-బుద్దుల కంటే వేరుగా, తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకి, ఒక పాత్రలో మురికి నీరుంటే, దాని అడుగుభాగాన్ని, మనం చూడలేము. కానీ, ఆ నీటిలో పటిక వేస్తే, మురికి వేరైపోయి క్రిందికి దిగి, నీరు స్వచ్ఛంగా అయిపోతుంది. అదే ప్రకారంగా, మనస్సు మురికిగా ఉన్నప్పుడు, అది ఆత్మ దర్శనాన్ని తెలియకుండా చేస్తుంది. ఆత్మ యొక్క శాస్త్ర పరిజ్ఞానం, పుస్తక జ్ఞాన స్థాయి లోనే ఉండిపోతుంది. కానీ, ఎప్పుడైతే మనస్సు పవిత్రమవుతుందో, ఆత్మ అనేది, అంతర్గత విజ్ఞానం ద్వారా, నేరుగా అనుభవంలోనికి వస్తుంది.

06:32 - సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియమ్ ।
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః ।। 21 ।।

సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అపరిమితమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న యోగి, నిత్య పరమ సత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు.

ఆనందము కోసం అన్వేషణ అనేది, ఆత్మకున్న అంతర్గత సహజ స్వభావం. మనం, ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశలము, అన్న వాస్తవం నుండి, ఇది జనించింది. మనం పరిపూర్ణ ఆనందం కోసం, ఎన్నో యుగాల నుండి అన్వేషిస్తున్నాము. మనం చేసే ప్రతి పనీ, ఆ ఆనందం కోసమే. కానీ, భౌతిక సుఖాలనిచ్చే వస్తు-విషయముల నుండి, మనస్సూ, ఇంద్రియములూ, కేవలం నిజమైన ఆనందం యొక్క ప్రతిబింబ నీడను మాత్రమే, అనుభవిస్తాయి. ఇంద్రియ ఇష్టసిద్ధి అనేది, ఆత్మ యొక్క తీవ్ర అభిలాషను తృప్తి పరచలేదు. అనంతమైన భగవంతుని ఆనందం కోసమే, ఆత్మ పరితపిస్తుంది. మనస్సు భగవంతుని యందే ఏకమై ఉన్నప్పుడు ఆత్మ, వర్ణింపశక్యముకాని, ఉత్కృష్టమైన, ఇంద్రియాతీతమైన ఆనందాన్ని అనుభవిస్తుంది. వైదిక వాజ్ఞయంలో ఈ స్థితినే, 'సమాధి' అంటారు. సమాధి స్థితిలో, సంపూర్ణ తృప్తి, మరియు సంతుష్టి అనుభవించే ఆత్మకు, కోరికలు ఇంకేమీ ఉండవు. ఆ ప్రకారంగా, ఒక్క క్షణం కూడా విడిపోకుండా, పరమ సత్యము నందే, దృఢముగా స్థితమై ఉంటుంది.

08:04 - యం లబ్ద్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ।। 22 ।।

ఆ స్థితిని పొందిన తరువాత, మరేదీ అంతకంటే గొప్పది కాదని, భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉన్నవాడు, ఎంత తీవ్ర దుఃఖాలలో అయినా, ఏమాత్రం చలింపడు.

భౌతిక జగత్తులో ఎంత మేర సంపాదించినా, వ్యక్తి సంపూర్ణ తృప్తిని పొందలేడు. ఒక పేద వాడు, ధనవంతుడు కావటానికి ఎంతో కష్ట పడతాడు. తను లక్షాధికారి కాగానే, తృప్తి పడ్డ భావన పొందుతాడు. కానీ, అదే లక్షాధికారికి ఒక కోటీశ్వరున్ని చూడగానే, అసంతృప్తి మొదలవుతుంది. ఆ కోటీశ్వరుడు కూడా, ఇంకా ఎక్కువ ఐశ్వర్యంగల వాడిని చూసినప్పుడు, అసంతృప్తి చెందుతాడు. మనం ఎంత సంతోషం పొందినా, అంత కన్నా ఎక్కువ సంతోషం ఉందనుకున్నప్పుడు, ఎదో అసంతృప్తి భావన ఉంటుంది. కానీ, యోగ స్థితి యందు పొందిన ఆనందమనేది, ఆ భగవంతుని యొక్క అనంతమైన ఆనందం. దాని కంటే ఇంకేదీ ఉన్నతమైనది లేదు కాబట్టి, ఆ అనంతమైన ఆనందాన్ని అనుభవించినప్పుడు, ఆత్మ సహజంగానే, తన లక్ష్యాన్ని చేరుకున్నట్లు గ్రహిస్తుంది. భగవంతుని దివ్యానందము, నిత్యమైనది, శాశ్వతమైనది. ఆ స్థితిని ఒకసారి సాధించిన యోగి నుండి, దానిని ఎప్పటికీ తీసివేయలేరు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన జీవి, భౌతిక శరీరంలోనే నివసించి ఉన్నా, భగవత్ భావనలోనే స్థితుడై ఉంటాడు. ఒక్కోసారి, బాహ్యంగా చూస్తే - అనారోగ్యం, వ్యతిరేకతతో ఉండే జనం, అణచివేసే వాతావరణం వంటి వాటితో, ఆ మహాత్ముడు కష్టాల్లో ఉన్నట్లగుపిస్తుంది. కానీ, అంతర్లీనంగా ఆ మహాత్ముడు, భగవత్ సాన్నిధ్యంలోనే ఉండి, దివ్యానందాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి, ఎంత తీవ్రమైన కష్టమైనా, అటువంటి మహాత్ముడిని చలింపచేయలేదు. భగవంతునితోనే ఏకమైన స్థితిలో ఉండి, ఆ మహాత్ముడు శారీరక దృక్పథం నుండి అతీతంగా ఎదిగి, శారీరక హానిచే ప్రభావితం కాడు. ఈ ప్రకారంగా మన పురాణాలలో, ప్రహ్లాదుడు - పాముల గుంటలో వేయబడినా, ఆయుధాలతో హింసించబడినా, అగ్నిలో ఉంచబడినా, కొండపై నుండి విసిరివేయబడినా; ఇవేవీ కూడా ప్రహ్లాదునికి, భగవంతునితో ఉన్న భక్తియుక్త ఏకత్వాన్ని భంగం చేయలేకపోయాయి.

ఇక మన తదుపరి వీడియోలో, నిలకడ లేని మనస్సును, నిరంతరం భగవంతుని మీదే కేంద్రీకరించాలంటే ఏం చేయాలో,  తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugkxgj4c14t8gaUcYUTRo8lml0B13s3I_RXm