Ads

Showing posts with label Bhagavadgita. Show all posts
Showing posts with label Bhagavadgita. Show all posts

08 December, 2021

భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు? Bhagavadgita

  

భగవంతుడు నిరాకారుడైతే విగ్రహారాధన ఎందుకు?

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (07 - 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 07 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/5dd980Ubhro ]

జీవన్మరణాలలో జీవాత్మ తిరుగుతూ ఉండకుండా, శాశ్వత మోక్షాన్ని ఏ విధంగా పొందాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।

ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.

ధర్మము అంటే, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకీ, పురోగతికీ సహకరించే విహిత కర్మలు. అధర్మం అంటే, దీనికి విరుద్ధం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్తా, నిర్వహణాధికారీ అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకుని దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే, అవతారము అంటాము. భగవంతునికి అనంతమైన అవతారములున్నాయని, వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి. అవతారములు నాలుగు రకాలుగా, వర్గీకరించబడ్డాయి.

1. ఆవేశావతారములు – ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టటం, మరియు, ఆ జీవాత్మ ద్వారా, కార్యకలాపాలు చేయటం. నారద ముని, ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ.

2. ప్రాభవావతారములు – ఇవి భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులను ప్రదర్శించిన అవతారములు. దేవుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమై, తన కార్యాన్ని పూర్తిచేసి వెళ్లిపోయేవి. హంసావతారము, దీనికి ఒక ఉదాహరణ. ఈ అవతారంతో, కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి, వెళ్ళిపోయాడు భగవానుడు. ఇక భూలోకంలో, చాలా ఏళ్లు ఉండే అవతారాలు.. పద్దెనిమిది పురాణాలనూ, మరియు మహాభారతాన్నీ వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతార రూపమే.

3. వైభవావతారములు – తన దివ్య రూపంలో దిగివచ్చి, తనకున్న మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారమూ, కూర్మావతారమూ, వరాహావతారములు, వైభవావతారముల ఉదాహరణలు.

4. పరావస్థావతారములు – భగవంతుడు తన సర్వ మహోన్నత శక్తులను, తన దివ్య స్వరూపంలో వ్యక్తపరచినవి. శ్రీ కృష్ణుడూ, శ్రీ రాముడూ, నృసింహావతారమూ, పరావస్థావతారములకు ఉదాహరణలు.

“భగవంతుని యొక్క అన్ని అవతారములూ, ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి. అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితమయినవి.” ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తాను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా, తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు, ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ।। 8 ।।

ధర్మాత్ములను కాపాడటానికీ, దుష్టులను నిర్మూలించటానికీ, మరియు ధర్మ సూత్రములను తిరిగి స్థాపించటానికీ, నేను ఈ లోకంలో ప్రతీ యుగమునందు అవతరిస్తాను.

జీవాత్మ చేయగలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. దీనినే భగవంతుడు, తన అవతారం ద్వారా వృద్ధి నొందిస్తాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, తన దివ్య రూపములూ, నామములూ, గుణములూ, లీలలూ, ధామములూ, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు. ఇది జీవాత్మలకు భక్తి కోసం, ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికీ, అనుసంధానమవటానికీ ఒక రూపం అవసరం. అందుకే, భగవంతుని నిరాకార తత్త్వాన్ని ఆరాధించడం, చాలా కష్టం. అదే సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, చాలా సులభం. జీవాత్మలు భక్తిలో నిమగ్నమై, తమ అంతఃకరణ శుద్ధికి సహకరించటానికి, తన నామములూ, రూపములూ, లీలలూ, గుణములూ, ధామములూ, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి, భగవంతుడు అవతరిస్తాడు.

భగవంతుని లీలల్లో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు. వీరు విష్ణు నివాసమైన వైకుంఠ ద్వారపాలకులు, జయ-విజయులు. వారు రాక్షసులుగా నటించి, రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దేవతలు కాబట్టి, మరెవ్వరి వలనా సంహరింపబడలేరు. కాబట్టి, దేవుడే అటువంటి రాక్షసులను తన లీలల్లో భాగంగా, సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు. ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి, తగినంత ఉన్నతిని పొంది ఉన్నారు. అందుకే, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగించాడు.

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సొఽర్జున ।। 9 ।।

ఓ అర్జునా, నా యొక్క జన్మ, మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత, తిరిగి జన్మనెత్తరు, నా నిత్య శాశ్వత ధామానికే వస్తారు.

భగవంతునిపై ప్రేమ పూర్వక స్మరణ ద్వారా, మన మనస్సు శుద్ది అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మంపై ఉండవచ్చు, లేదా సాకార రూపంపై ఉండవచ్చు. నిరాకార బ్రహ్మంపై ఉండే భక్తి, అగోచరమైనది. భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి? దేనితో అనుసంధానమవ్వాలి? అనేది వారికి తెలియదు. ఒక స్వరూపంతో ఉన్న భగవంతునిపై భక్తి, సులువైనది, మరియు ఆచరణీయమైనది. అలాంటి భక్తికి, భగవంతుని వ్యక్తిత్వంపై, దైవిక భావాలు అవసరం. భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే దైవిక భావాల వలన, రాతి విగ్రహాలను ఆరాధించటంతో, ప్రజలు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలే, భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి. "భగవంతుడు కట్టెలో లేడు, రాతిలో లేడు. భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి, విగ్రహాన్ని ప్రేమ పూర్వక భావంతో ఆరాధించుము" అని మనువు చెప్పిన అక్షర సత్యం.

వీతరాగభయక్రోధా మన్మయా మాముపాశ్రితాః ।
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ।। 10 ।।

రాగ-ద్వేష-క్రోధ రహితముగా ఉండి, నా యందే సంపూర్ణంగా స్థితులై ఉండి, నన్నే ఆశ్రయించి, ఎంతో మంది ఇంతకు పూర్వం, నా యొక్క జ్ఞానంచే పవిత్రులయ్యారు. ఆ విధంగానే, నా దివ్య ప్రేమను పొందారు.

మమకారానురాగాలూ, భయం, మరియు కోపం త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేయాలి. నిజానికి భయానికీ, కోపానికీ, రెండింటికీ కారణం, మమకారమే. మనం అనుబంధం పెంచుకున్న వస్తువు, మన నుండి దూరమవుతుందేమో అన్న భావనే, భయాన్ని కలుగ చేస్తుంది. మనం మమకారం పెంచుకున్న వస్తువుని పొందటంలో వచ్చే అడ్డంకి వలన, క్రోధం జనిస్తుంది. అందుకే, మమకారానుబంధమే, మనస్సు మలినమవటానికి మూల కారణం. ఈ మాయా ప్రపంచం, ప్రకృతి యొక్క త్రి-గుణములచే సమ్మిళితమై ఉంటుంది. మన మనస్సుని ఏదో ఒక భౌతిక వస్తువు, లేదా వ్యక్తి యందు లగ్నం చేస్తే, మన మనస్సు కూడా త్రిగుణములచే ప్రభావితమవుతుంది. బదులుగా, అదే మనస్సుని, త్రిగుణములకు అతీతుడైన భగవంతుని యందు లగ్నం చేస్తే, అలాంటి భక్తి, మనస్సుని పవిత్రం చేస్తుంది.

యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 11 ।।

ఓ అర్జునా, నాకు ఏ ప్రకారంగా మనుజులు శరణాగతి చేస్తారో, నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా, తెలియకపోయినా, అందరూ నా మార్గాన్ని అనుసరించాల్సిందే.

తనకు శరణాగతి చేసిన వారందరికీ, తన అనుగ్రహంతో ప్రతిస్పందిస్తానని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. భగవంతుని ఉనికిని తిరస్కరించిన వారికి, ఆయన కర్మ సిద్ధాంత రూపంలో, కలుస్తాడు. వారి హృదయాల్లో ఆసీనుడై, వారి కర్మలకు తగిన ఫలితాలను ఇస్తుంటాడు. ఎటువంటి నాస్తికులైనా, ఆయన సేవ చేయకుండా, తప్పించుకోలేరు. వారు దేవుని భౌతిక శక్తి అయిన ‘మాయ’కు సేవ చేయాల్సిందే. మాయ అనేది, ఎన్నో స్వరూపాల్లో వ్యక్తమవుతుంది. సంపదా, భోగాలూ, బంధువులూ, కీర్తీ, మొదలగునవి. మాయా శక్తి, వారిని కామ, క్రోధ, లోభ గుణములతో బంధించివేస్తుంది. అదే సమయంలో, ప్రాపంచిక, భౌతిక ఆకర్షణల నుండి తమ మనస్సుని పక్కకి మరల్చి, భగవంతుడే తమ లక్ష్యము, ఆశ్రయముగా బ్రతికేవారి ఆన్ని అవసరాలనూ.., తల్లి తన బిడ్డ బాగోగులు చూసుకున్నట్లుగా, ఆయనే చూసుకుంటాడు. ఆయనకు శరణాగతి చేసిన వారి యొక్క అనంతమైన జన్మల సంచిత కర్మలను నాశనం చేస్తాడు, మాయా బంధనము నుండి విముక్తులను చేస్తాడు, భౌతిక సంసార చీకటి తొలగిస్తాడు, దివ్యానందాన్నీ, దివ్య జ్ఞానాన్నీ మరియు దివ్య ప్రేమనీ ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే భక్తుడు భగవంతుడిని నిస్వార్ధంగా ప్రేమించటం నేర్చుకుంటాడో, తానే స్వయంగా వారి ప్రేమకు బానిసయిపోతాడు.

కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।
క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ।। 12 ।।

ఈ లోకంలో, భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు, దేవతలను పూజిస్తారు. ఎందుకంటే, భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.

భౌతిక లాభాల కోసం ప్రయత్నించే వారు, వరముల కోసం, దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు, భౌతికమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే, వారు ఆ వరాలను ఇవ్వ గలుగుతున్నారు. అల్ప జ్ఞానం ఉన్నవారు, వారిని ఆశ్రయిస్తారు. కానీ, నిజంగా తెలివైనవారు, తమ తమ కోరికల నివృత్తి కోసం, ఆ సర్వ శక్తివంతుడైన భగవంతుడినే ఆశ్రయిస్తారు.

ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా, కర్మ బంధాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే, ఏం చేయాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

01 December, 2021

కర్మ, అకర్మ మరియు వికర్మల గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

  

కర్మ, అకర్మ మరియు వికర్మ గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (01 - 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/7xnctA7uUDA ]

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు కర్మల స్వభావాన్ని విశదీకరిస్తున్నాడు. కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే మూడు సూత్రాలను గురించి, చెప్పబోతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ ।
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ ।। 1 ।।

శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు: నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును, సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. అతను మనువుకీ, మనువు ఇక్ష్వాకునికీ, దీనిని ఉపదేశించాడు.

అమూల్యమైన, వెలకట్టలేని జ్ఞానాన్ని ఎవరికైనా, చెపితే సరిపోదు. ఆ జ్ఞానాన్ని అందుకున్నవారు, దాని విలువను తెలుసుకుని, గౌరవించి, ఆ జ్ఞానం యొక్క ప్రామాణికత మీద విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే, వారు తమ జీవిత నడవడికలో, దానిని ఆచరించటానికి కావలసిన శ్రమ చేస్తారు. అర్జునుడికి తాను ఉపదేశించే ఆధ్యాత్మిక విజ్ఞానం యొక్క విశ్వసనీయతనూ, ప్రాముఖ్యతనీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు స్థిరపరుస్తున్నాడు. తాను ఉపదేశించే ఈ జ్ఞానం, కేవలం, ఆర్జునుడిని యుద్ధం కోసం ప్రేరేపించే సౌలభ్యం కోసం, ఇప్పటికిప్పుడు పుట్టించినది కాదనీ, సృష్టి ఆరంభం నుండే ఉందనీ, అర్జునుడికి వివరిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు మొట్టమొదటగా, వివస్వానుడికి, అంటే, సూర్య భగవానుడికి ఈ యోగ శాస్తాన్ని, బోధించాడు. అతను మానవ జాతికి మూలపురుషుడైన మనువుకీ; మనువు దానిని సూర్య వంశ ప్రథమ రాజైన ఇక్ష్వాకుడికీ, బోధించాడు.

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః ।
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప ।। 2 ।।

ఓ శత్రువులను జయించేవాడా, ఈ విధముగా, పరంపరాప్రాప్తమైన ఈ యోగ శాస్త్రము, రాజర్షులకు తెలిసింది. కానీ, కాలగమనంలో అది లుప్తమైపోయినది.

దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, అవరోహణ క్రమంలో అందుకునేటప్పుడు, శిష్యుడు భగవత్-ప్రాప్తిని తెలిపే శాస్త్రాన్ని, గురువు గారి నుండి అర్థంచేసుకుంటాడు. ఆ గురువు, తన గురువు నుండి ఇలాగే అందుకుంటాడు. ఈ విధమైన సాంప్రదాయంలోనే రాజర్షులైన నిమీ, జనకుడూ, యోగ శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారు. భగవంతుడు, సృష్టి ప్రారంభంలో ఈ జ్ఞానాన్ని, ప్రప్రధమంగా జన్మించిన బ్రహ్మ దేవుని హృదయంలో, తెలియపరిచాడు. ఆయన నుండి ఈ సంప్రదాయం, కొనసాగింది. కానీ, ఈ భౌతిక ప్రపంచ స్వభావం వలన, కాల క్రమంలో, ఈ జ్ఞానం క్షీణించిపోయింది. ప్రాపంచిక మనస్తత్వం కలిగిన కపటులైన శిష్యులు, తమ కళంకిత దృక్పథంతో, బోధనలను అన్వయిస్తుంటారు. కొద్ది తరాల్లోనే, ఆ జ్ఞానం యొక్క శక్తి మలినమైపోతుంది. ఇలా జరిగినప్పుడు, తన అకారణ కరుణచే, భగవంతుడు ఆ సందేశాన్ని మానవ జాతి సంక్షేమం కోసం, తిరిగి సుస్థిరపరుస్తుంటాడు. ఆ పనిని, తానే ఈ లోకంలో అవతరించి గానీ, లేదా తన పని కోసమే నియమింపబడ్డ భగవత్ ప్రాప్తి నొందిన మహనీయుని ద్వారా గానీ, చేస్తాడు.

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్ ।। 3 ।।

అదే ప్రాచీనమైన, పరమ రహస్యమైన ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును, నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, నీవు నా మిత్రుడవు, మరియు భక్తుడవు. ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.

ఏదైనా విషయాన్ని ఈ లోకంలో రహస్యంగా ఉంచడానికి, రెండు కారణాలుంటాయి. ఒకటి, రహస్యం తనకే తెలియాలనే స్వార్థం, రెండోది, ఆ విషయాన్ని దుర్వినియోగం కాకుండా, కాపాడడం కోసం. ఈ యోగ విద్య ఒక రహస్యంగా ఉండటానికి, ఈ రెండు కారణాలూ కాక, వేరే కారణం ఉంది. అదేమిటంటే, దీనిని అర్థం చేసుకోవడటానికి, ఒక అర్హత ఉండాలి. ఆ అర్హతే, 'భక్తి'. భగవద్గీత యొక్క నిగూఢమైన సందేశాన్ని, కేవలం పాండిత్యంతోనో, లేదా సంస్కృత భాషపై పట్టుతోనో అర్థం చేసుకోవటానికి, కుదరదు. దీనికి భక్తి అవసరం. ఇది జీవాత్మకు భగవంతుని పట్ల ఉండే సూక్ష్మమైన అసూయని నిర్మూలించి, ఆయన అణు-అంశలుగా, ఆయన సేవకులుగా, మనల్ని మనం పరిగణించుకునేలా చేస్తుంది. అర్జునుడు ఈ విద్యను నేర్చుకోవటానికి తగిన విద్యార్థి. ఎందుకంటే, అతను భగవంతుని భక్తుడు. అర్జునుడు భగవంతుడిని, తన మిత్రునిగా ఆరాధించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు అతనితో మిత్రునిగా, భక్తుడిగా సంభాషిస్తున్నాడు. భక్తి నిండిన హృదయం లేకుండా, భగవద్గీత యొక్క సందేశాన్ని, వాస్తవరూపంలో అర్థం చేసుకోవడం, అసాధ్యం.

అర్జున ఉవాచ ।
అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।
కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: నీవు వివస్వనుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యను అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావంటే, నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

శ్రీ కృష్ణుడి మాటలతో, అర్జునుడు కొంత అయోమయానికి గురయ్యాడు. సూర్య భగవానుడు, సృష్టి ప్రారంభం నుండీ ఉన్నాడు. కానీ, శ్రీ కృష్ణుడు ద్వాపర యుగంలో పుట్టాడు. ఒకవేళ శ్రీ కృష్ణుడు దేవకీవసుదేవుల తనయుడైతే, ఈ యోగ విద్యని, సూర్య భగవానుడికి ఎలా చెప్పాడనే విషయంపై, అర్జునుడి సంశయం మొదలైంది. అందుకే ఇలా అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।
తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పరంతపా! మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరచిపోయావు. కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి.

భగవంతుడు లోక కళ్యాణం కోసం, ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలో అవతరిస్తూ ఉంటాడు. కానీ, అతని దైవిక గుణాలూ, దివ్య శక్తులూ ఏమాత్రం తగ్గవు. జీవాత్మకీ, పరమాత్మ అయిన భగవంతునికీ, చాలా పోలికలున్నాయి. రెండూ సత్-చిత్-ఆనందములే. కానీ ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి. భగవంతుడు సర్వ వ్యాపి. జీవాత్మ, తానున్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది.. భగవంతుడు సర్వశక్తివంతుడు. కానీ జీవాత్మకి, తనను తాను మాయా మొహం నుండి కూడా, భగవంతుని కృప లేకుండా, విడిపించుకునే శక్తి లేదు.. భగవంతుడు, ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. ఆత్మ ఈ నియమాలకు బద్దుడై ఉంటుంది.. సమస్త సృష్టినీ నిర్వహించేవాడు భగవంతుడు. జీవాత్మ కూడా, అతనిచేతనే నిర్వహింపబడుతుంది.. భగవంతుడు సర్వజ్ఞుడు. కానీ జీవాత్మ, ఒక్క విషయంపై కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు. జీవాత్మకీ, పరమాత్మకీ చాలా తారతమ్యం ఉంటుంది.

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।

నేను పుట్టుకలేని వాడనూ, సమస్త ప్రాణులకూ ప్రభువునూ, నాశములేని వాడినై ఉండి కూడా, ఈ లోకంలో నేను, నా దివ్య శక్తి యోగమాయచే కనిపిస్తుంటాను.

భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడన్న అభిప్రాయాన్ని, చాలా మందిఒప్పుకోరు. వారు, నిరాకార, సర్వ వ్యాపి, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే నమ్మకాన్ని, కలిగి ఉంటారు. భగవంతుడు కచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ, అంతమాత్రాన, ఆయన అదే సమయంలో, ఒక రూపము తీసుకోలేడని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి, ఆయనకి తన సంకల్పంచే, ఒక స్వరూపంతో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి, "భగవంతుడు నిరాకారుడు" అనేది, అసంపూర్ణ ప్రతిపాదన. అదే విధంగా, "భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు" అంటే, అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి, రెండు అస్థిత్వాలున్నాయి - వ్యక్తిగత స్వరూపం, మరియు నిరాకార అస్తిత్వం. నిజానికి, జీవాత్మకి కూడా, తన అస్థిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి, శరీరాన్ని, మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు, కనిపించదు. అదేవిధంగా, అది శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది - ఒక సారి కాదు. అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమవుతూ, మారుతూ ఉంటుంది. సూక్షమైన ఆత్మకే, ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి కూడా, ఆ శక్తి ఉంటుందనేది, అందరూ అంగీకరించాల్సిన సత్యం.

ఇక మన తదుపరి వీడియోలో, జీవన్మరణాలలో జీవాత్మ తిరుగుతూ ఉండకుండా, శాశ్వత మోక్షాన్ని ఏ విధంగా పొందాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

24 November, 2021

కామమును ఎలా నిర్మూలించాలో చెప్పిన శ్రీ కృష్ణుడు! Bhagavadgita

  

కామమును ఎలా నిర్మూలించాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (40 - 43 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 40 నుండి 43 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/CzMG2-WXelo ]

దు:ఖహేతువైన కామమును ఎలా నిర్మూలించాలో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే ।
ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ ।। 40 ।।

ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ అనేవి, కోరికల మూల స్థానంగా చెప్పబడుతుంది. వాటి ద్వారా, అది, వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది, మరియు జీవాత్మని భ్రమకు గురిచేస్తుంది.

కామము నివసించే స్థానాలను వెల్లడి చేయటం ద్వారా, శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని నియంత్రించే పద్దతి ఒకటుందని, వివరిస్తున్నాడు. ముట్టడి చేసే ముందుగా, శత్రువు యొక్క కోటని గుర్తించాలి. ఇంద్రియములూ-మనస్సూ-బుద్ధులలో నుండి కామము, తన ఆధిపత్యాన్ని జీవాత్మపై, చలాయిస్తుంది. ఈ కామ ప్రభావంచే, బాహ్య విషయములను, ఇంద్రియములు కోరుతాయి. దాంతో, ఇంద్రియములు మనస్సుని పిచ్చిపట్టేటట్లు చేస్తాయి. మనస్సు బుద్ధిని తప్పుదారి పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి, తన విచక్షణా శక్తిని కోల్పోతుంది. బుద్ధి మసకబారినప్పుడు, వ్యక్తి చిత్త భ్రాంతికి లోనై, కామానికి వశుడై, దాన్ని తీర్చుకోవడానికి, ఏదైనా చేస్తాడు. ఈ ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధి - అనే పరికరములు, తమంత తామే చెడ్డవి కాదు. అవి మనకు భగవత్ ప్రాప్తికి సహకరించటానికి, ప్రసాదించబడ్డాయి. కానీ మనమే, కామానికి, వాటిపై ముట్టడి చేసి, వశపరుచుకునే అనుమతినిస్తున్నాం. 

తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ ।
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ ।। 41 ।।

కాబట్టి, ఓ భరత శ్రేష్టుడా.. మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామమనే శత్రువును, నిర్మూలించు.

అన్ని అరిష్టములకూ మూలకారణమైన కామాన్ని ఎలా అధిగమించాలో, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. కామము, మానవ అత్మోద్ధరణకు ఎంతో హానికరమైనది. కామము యొక్క నిక్షేప స్థానాన్ని గుర్తించి, మొదట ఈ ఇంద్రియముల కోరికలను నిగ్రహించాలి. అలాకాకుండా వాటిని పెంచితే, అది మన దుఃఖాలకు మూలకారణం అవుతుంది. వాటిని నిర్మూలించటం, శాంతికి మార్గం. శారీరక, ఇంద్రియ విషయముల కొరకై, కోరికలను మనమే సృష్టించుకుంటాం. తరువాత వాటిచే, ఉద్విగ్నతకు లోనవుతాం. మనకు కావలసిన వస్తువు చేజిక్కిన తరువాత, మనంతమనమే సృష్టించుకున్న రోగం, నిర్మూలించబడుతుంది. దాన్నే మనం ఆనందం అనుకుంటాము. కానీ, మనలను మనం జీవాత్మగా పరిగణించుకుంటే, ఆత్మ ఆనందమే మన లక్ష్యం అయితే, ఈ ప్రాపంచిక కోరికలను త్యజించటం, సులువవుతుంది. 

ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః ।
మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ।। 42 ।।

స్థూల శరీరం కన్నా, ఇంద్రియములు ఉన్నతమైనవి. ఇంద్రియముల కన్నా, మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది, బుద్ధి. బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది, ఆత్మ.

ఒక తక్కువ స్థాయి అస్థిత్వాన్ని, దాని యొక్క ఉన్నతమైన అస్థిత్వంచేత నియంత్రించవచ్చు. ఈ శరీరం, స్థూల పదార్ధంతో తయారయింది. దానికన్నా ఉన్నతమైనవి, ఐదు జ్ఞానేంద్రియములు. ఇంద్రియముల కన్నా మించినది, మనస్సు. మనస్సు కన్నా ఉన్నతమైనది, విచక్షణా శక్తి కలిగిన బుద్ధి. కానీ, ఈ బుద్ధి కన్నా మించినది, దివ్యాత్మ. ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, మరియు ఆత్మల ఆధిపత్య క్రమం యొక్క జ్ఞానాన్ని, మన కామాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేయటానికి ఉపయోగించుకోవచ్చు.

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా ।
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ ।। 43 ।।

ఈ విధంగా జీవాత్మ అనేది, భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనదని తెలుసుకుని, ఓ మహా బాహువులు కలవాడా, నిన్ను నీవు వశపరుచుకొనుము. అంటే, ఇంద్రియమనోబుద్ధులను, నీ ఆత్మ శక్తి ద్వారా లోబరచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును, సంహరింపుము.

ఆత్మ అనేది భగవంతుని అంశ కాబట్టి, అది దివ్యమైనది. అంటే, అది కోరుకునే దివ్య ఆనందం, దివ్య వస్తువు ద్వారానే, లభ్యమవుతుంది. ఎందుకంటే, ప్రాపంచిక వస్తువులన్నీ, భౌతికమైనవే. ఈ భౌతిక విషయములు, ఆత్మ యొక్క గాఢమైన, అంతర్లీన తపనని తీర్చలేవు. కాబట్టి, వాటి కోసం కోరికలను సృష్టించుకోవటం, నిష్ప్రయోజనమైన పని. మనం తప్పకుండా, మన బుద్ధికి శిక్షణ ఇచ్చి, ఆ తరువాత దానిని మనస్సూ, ఇంద్రియములనూ నియంత్రించటానికి వినియోగించాలి. ఉదాహరణకు, ఐదు గుర్రాలచే లాగబడే ఒక రథం ఉంది. ఆ గుర్రాలకు నోటియందు పగ్గాలున్నాయి. ఆ పగ్గాలు, రథ సారథి చేతిలో ఉన్నాయి. ఆ రథం వెనుక భాగంలో, ఒక ప్రయాణీకుడున్నాడు. నిజానికి ఆ ప్రయాణీకుడు, రథ సారధికి దిశా నిర్దేశం చేయాలి. అప్పుడు సారధి, పగ్గాలతో గుర్రాలకి దిశా నిర్దేశం చేయాలి. కానీ, ప్రయాణికుడు నిద్రపోతే, గుర్రాలు తమ ఇష్టానుసారం నడుస్తాయి. ఈ ఉపమానంలో, రథం అంటే శరీరం; గుర్రాలు అనేవి ఐదు ఇంద్రియములు; గుర్రాల నోటియందు ఉన్న పగ్గాలు, మనస్సు; రథ సారధి, బుద్ధి; వెనుక కూర్చున్న ప్రయాణీకుడు, శరీరంలో ఉన్న జీవాత్మ. ఇంద్రియములైన గుర్రాలు, భోగాలను కోరుకుంటాయి. పగ్గాలు, గుర్రాలను నియంత్రించలేనట్లు, మనస్సు ఇంద్రియములపై నియంత్రణ చేయటం లేదు. సారధి పగ్గాల లాగుడుకు వశమైనట్లు, బుద్ధి, మనస్సుకు వశమైపోయింది. కాబట్టి, భౌతికంగా బద్ధుడై ఉన్న స్థితిలో, అయోమయానికి గురై ఉన్న జీవాత్మ, బుద్ధిని సరియైన దిశలో నడిపించలేదు. ఆ విధంగా, రథం ఎటు పోవాలన్న విషయాన్ని, ఇంద్రియములే నిర్దేశిస్తాయి. ఇంద్రియ సుఖములను, జీవాత్మ పరోక్షంగా అనుభవిస్తుంది. కానీ, అవి దానికి సంతృప్తినివ్వలేవు. ఈ రథంలో కూర్చునిఉన్న జీవాత్మ, అలా అనంత కాలం నుండి, భౌతిక ప్రపంచంలో తిరుగుతూనే ఉన్నాడు. ఒకవేళ జీవాత్మ తన ఉన్నతమైన స్వభావంతో మేల్కొని చురుగ్గా వ్యవహరిస్తే, బుద్ధిని సరియైన దిశలో పెట్టవచ్చు. అప్పుడు బుద్ధి, తక్కువ స్థాయి అస్థిత్వాలైన మనస్సూ, ఇంద్రియములను సరిగ్గా నియంత్రిస్తుంది.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, మూడవ అధ్యాయం, కర్మ యోగంలోని 43 శ్లోకాలు, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని నాలుగవ అధ్యాయం, జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

18 November, 2021

మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు! Bhagavadgita

  

మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (35 - 39 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 35 నుండి 39 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Lx_inSfGdwQ ]

స్వధర్మ నిర్వహణ గురించి, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।।

ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే, అత్యుత్తమం. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించటం, ప్రమాదకరమైనది.

జీవాత్మ యొక్క ధర్మం, భగవంతుణ్ణి ప్రేమించడమే. అదే, మన అస్థిత్వానికి ఉన్న మూల సూత్రం. మన వ్యక్తిగత ధర్మం, మనకున్న ప్రస్తుత జీవనంలోని సందర్భం, పరిస్థితీ, పరిపక్వతా, మరియు వృత్తిని బట్టి ఉంటుంది. జీవన శైలి మారినప్పుడూ, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడూ, ధర్మం అనేది మారుతుంది. అందుకే, తన వృత్తి ధర్మాన్ని చేయమని, అర్జునుడికి బోధిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను, మానసిక స్థైర్యముతో, చాలా సునాయాసంగా చేయవచ్చు. కానీ, ఇతరుల విధులు చూడడానికి ఆకర్షణీయంగా అనిపించినా, అది ప్రమాదకరమైనది. వారి ధర్మం, మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్ధులలో ఘర్షణకు దారితీస్తుంది. అంతేకాకుండా, మన అంత:కరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి అవుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా, స్వంత ధర్మములు నిష్ఠగా చేయడంలో, మరణించినా ఉత్తమమే అన్న సందేశాన్నిస్తున్నాడు, భగవానుడు.

అర్జున ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ।। 36 ।।

అర్జునుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ వృష్ణి వంశీయుడైన శ్రీ కృష్ణా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా, బలవంతంగా, ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడుతున్నాడు?

అర్జునుడు శ్రీ కృష్ణుడిని, మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహాన్ని అడిగాడు. పాపపు పనులు చేసేటప్పుడు, మనందరికీ, ఇది తప్పు అనే భావననో, లేదా పశ్చాత్తాపాన్నో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకూ నిలయమన్న నిజం మీద, మనఃసాక్షి స్థితమై ఉంటుంది. ఆయన అంశ అయినటువంటి మనకు, సుగుణములకూ, మంచితనానికీ ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్నిస్తుంది. కాబట్టి, దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి వంటివి, తప్పు అని తెలియజేస్తుంది. సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులని మనకు తెలిసినా, ఎదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా, మనం ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో, అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే, దానికి సమాధానం చెప్పమని, శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః ।
మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।।

భగవానుడు ఇలా సమాధానమిస్తున్నాడు: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామము, అంటే కోరికలూ, వాంఛలే, తదుపరి క్రోధముగా పరిణామం చెందుతాయి. దీనిని, లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము.

వేదములలో, కామము అన్న పదాన్ని, కేవలం లైంగిక వాంఛల కోసమే కాక, మనం ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలనూ ఉద్దేశించి, వాడబడుతుంది. ఈ విధంగా, కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం యావా, వస్తువుల కోసం ఆశా, కీర్తి-ప్రతిష్ఠలపై కోరికా, అధికారం కోసం తపనా మొదలగునవి.. ప్రతి యొక్క ప్రాణికీ, స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమ వక్రదారిలో పరావర్తనమైనప్పుడు, అది కామంగా మారుతుంది. ఎప్పుడైతే జీవాత్మ, ఈ శరీరమనే భౌతిక శక్తితో అనుసంధానం అవుతుందో, ఆత్మ యొక్క భగవంతునిపై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా, 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది, భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. కాబట్టి, భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన, అంటే, కామము కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైనది.

ప్రాపంచిక వస్తువులు తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తాయని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది. దాంతో వాటిని పొందటానికి మనిషి, ఆశ పడతాడు. కామమూ, లోభమూ మరియు క్రోధమూ అనబడే ఈ మూడింటి ప్రభావంచేత, మనిషి పాపాలు చేస్తాడు. అందుకే శ్రీ కృష్ణుడు, కామమే అన్ని అరిష్టాలకూ మూల కారణం అని అంటున్నాడు.

ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।।

నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ముచే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా,  ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామముచే కమ్మివేయబడుతుంది.

ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే, విచక్షణ అంటారు. ఈ విచక్షణ, మన బుద్ధిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే, అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి, మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు. వెలుగు నిచ్చే అగ్ని, పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం, సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది. కానీ దుమ్ముచే మాసిపోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది, బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది, మరియు, గర్భము యందు భ్రూణము వలె పూర్తిగా దాచి ఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది, తామసిక కోరికలు, విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా, మన కోరికల స్థాయిని బట్టి, మనం విన్న, చదివిన, ఆధ్యాత్మిక జ్ఞానం, మరుగున పడిపోతుంది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ।। 39 ।।

ఓ కుంతీ పుత్రుడా, అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, కోరికల రూపంలో ఉన్న శత్రువుచే, కప్పివేయబడుతుంది. ఇది ఎప్పటికీ తృప్తిపరచలేనిది, అగ్నిలాగా మండుతూనే ఉంటుంది.

ఈ శ్లోకంలో కామము అంటే, "కోరిక". దుష్పూరేణ అంటే, "తనివితీరనివి", అనల అంటే, "ఎన్నటికీ చల్లారనిది", అనే పదాలున్నాయి. ఇవి ఎంతో ప్రభావితమైనవి. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకుని, దానిని తీర్చటానికి ఆశచూపుతుంది. కానీ, ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత ఉధృతితో మండుతుంది. కోరిక అనేది, ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ, ఎవ్వరికీ, సుఖాన్నివ్వలేదు. దానిని ‘దుఃఖానికి మూల హేతువు’ అని తెలుసుకుని త్యజించేవారు, వివేకవంతులు. కానీ, ఈ జ్ఞాన రహస్యాన్ని అర్థం చేసుకోలేనివారు, రజోగుణ కారణమైన కోరికలను తీర్చుకోవటానికే, ప్రయత్నిస్తుంటారు. ప్రాపంచిక విషయాల కోసం, వృధా ప్రయాసతో, తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.

ఇక మన తదుపరి వీడియోలో, దు:ఖహేతువైన కామమును ఎలా నిర్మూలించాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

10 November, 2021

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

  

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (30 - 34 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 30 నుండి 34 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/dtyn2ylGSPQ ]

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ।। 30 ।।

అన్ని కార్యములనూ నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే, నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశా, స్వార్ధ చింతనా, మరియు మానసిక శోకమునూ వీడినవాడవై యుద్ధం చేయుము!

దేవునిపై ఆధారపడి, కర్మలను నిర్వహించాలి. ఎందుకంటే, అదే జీవుని సహజ స్థితి. భగవానుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే, నిజమైన స్థితి. కాబట్టి, ఆయన సహకారము లేకుండా, జీవుడు స్వయంగా ఆనందాన్ని అనుభవించలేడు. అందుకే, శ్రీ కృష్ణుడు అర్జునుడిని యుద్ధము చేయమని బోధిస్తున్నాడు. భగవానుని సత్సంకల్పం కోసం, మానవుడు సర్వమూ త్యాగం చేయడమే కాకుండా, విద్యుక్త ధర్మములను కూడా, ఎటువంటి మమకారం లేకుండా నిర్వహించాలి. కర్మఫలములకు ఆశింపక, ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించి నడుచుకోవాలి. అంటే, ఒక గుమాస్తా తన యజమాని ధనాన్ని లక్షల్లో లెక్కించినా, ఒక్క పైసాను కూడా తీసుకోలేడు. ఆ విధంగానే, ఈ జగత్తు ఏ వ్యక్తికీ చెందినది కాదు. ప్రతి మానవుడూ, తన గుణమూ మరియు స్థితిననుసరించి, ఒక ప్రత్యేకమైన కర్మననుసరించాల్సి ఉంటుంది. ఆ కర్మను భగదర్పితం చేసినట్లయితే, ముక్తిని పొందగలడు.

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ।। 31 ।।

పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో, దోష విచారణ లేకుండా, నా ఈ బోధను పాటించే వారు, కామ్యకర్మ బంధముల నుండి విముక్తులవుతారు.

భగవద్గీతలోని ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి, వాటిని శ్రద్ధగా పాటిస్తే కలిగే ఫలితాలను, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకుని మన జీవితాలను మార్చుకోవడమే, మనం చేయవలసిన విశేష ధర్మం. అలా చేయడం వలన, కామం, క్రోధం, లోభం, ఈర్ష్యా, మాయ అనబడే మానసిక రోగాలు తొలగిపోతాయి.

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ।। 32 ।।

కానీ, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, జ్ఞానం-విచక్షణలు లోపించి, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి, తమ భ్రష్టత్వాన్ని కోరి తెచ్చుకుంటారు.

మన ప్రాపంచికమైన బుద్ధి, అసంఖ్యాకమైన దోషాలతో ఉంటుంది. కాబట్టి, ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ, అన్ని సార్లూ అర్థం చేసుకోలేము. భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని, మనస్ఫూర్తిగా స్వీకరించి, అవగతం చేసుకోవడమే కాక, నిగూఢమైన, అర్థం కాని విషయాలు, భవిష్యత్తులో అర్థమవుతాయని ఆశిస్తూ, నమ్మకంతో, శ్రీ కృష్ణుడిపై విశ్వాసముంచాలి. కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. అది, మనం అర్థం చేసుకోలేనిదాన్ని, తప్పుగా చూపిస్తుంది. ఈ విషయంపై విచక్షణా జ్ఞనం లేనివారు, తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి, తిరుగుతుంటారు.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।

వివేకవంతులు కూడా, తమ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి, పనులు చేస్తారు. అన్ని ప్రాణులూ, తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?

జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపించబడి, తమ వ్యక్తిగత ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటారు. ఎటువంటి వారైనా సరే, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలనీ, ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మనీ, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలనీ కలిగి ఉంటారు. గత అలవాట్లు, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించడం, చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు, దానిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే, అది ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, తన స్వభావమే యుద్ధానికి ప్రేరిపిస్తుంది. తనలో సహజంగా జనించే ఆలోచనే, దానికి ప్రోద్బలాన్ని కలిగిస్తుంది.  మన లక్ష్యాలను ప్రాపంచిక భోగాల నుండి తప్పించి, భగవత్ ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా, మనం కలిగి ఉండే సహజ స్వభావాన్ని పవిత్రం చేసుకోవాలి.

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ।। 34 ।।

ఇంద్రియములు సహజంగానే, ఇంద్రియ విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. కానీ, వాటికి వశము కాకూడదు. ఎందుకంటే, ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.

మన భౌతిక శరీరం ఉన్నంత కాలం, దాని నిర్వహణ కోసం, ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. పూర్వ జన్మ సంస్కారములు, అన్ని ప్రాణుల మీదా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అవి సహజంగానే, ఇంద్రియ విషయముల వైపుగా పరుగులుతీస్తాయి. వాటి యొక్క పరస్పర సహచర్యం, సుఖ దు:ఖ అనుభూతులను కలుగచేస్తుంది. మనస్సు, ఇంద్రియ విషయముల ద్వారా కలిగే ఆనంద, దు:ఖాలను, నిత్యం స్మరిస్తూ ఉంటుంది. మనకు ఆనందాన్నీ, సుఖాన్నీ కలిగించే వాటి మీద చింతనా, మనస్సుకి వాటి మీద ఆసక్తీ కలిగేలా చేస్తుంది. అదేవిధంగా, దు:ఖ హేతువుల మీద చింతన, ద్వేషాన్ని కలిగిస్తుంది. మనం ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు, మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల పరిస్థితులూ ఎదురవుతాయి. సుఖాల కోసం ప్రాకులాడకుండా, దు:ఖాలనుండి పారిపోకుండా ఉండడానికి, మనం అభ్యాసం చేయాలి. మనో ఇంద్రియముల ఇష్టా-అయిష్టములకు బానిసలై పోకుండా ఉంటే, మనం నిమ్న స్వభావాన్ని అధిగమించినట్లే. అలా ఉండాలంటే, రాగ ద్వేషాలలో వేటికీ వశం కాకుడదు.

ఇక మన తదుపరి వీడియోలో, స్వధర్మ నిర్వహణ గురించి, శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

03 November, 2021

అహంకార పట్టులో ఆత్మ తననుతాను ఈ శరీరమే అనుకుంటుంది! Bhagavadgita

  

అహంకార పట్టులో ఆత్మ తననుతాను ఈ శరీరమే అనుకుంటుంది!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (25 - 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 25 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/0C40lsw2pec ]

జ్ఞానులు కూడా తమ కర్మలను ఎందుకు ఆచరించాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత ।
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ।। 25 ।।

ఓ భరత వంశీయుడా, అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తితో తమ విధులను నిర్వర్తించినట్లుగా, జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం, తమ కర్మలను ఆచరించాలి.

శారీరక దృక్పథంలోనే ఉండి, ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి, వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న వారు, అజ్ఞానులూ, అవివేకులూ అనబడుతారు. ఎందుకంటే, వారికి పుస్తక జ్ఞానం ఉన్నా, వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు, బద్ధకమూ, శంకా లేకుండా, తమ కర్తవ్యమును జాగ్రత్తగా, శాస్త్రోక్తముగా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలనూ, కర్మ కాండలనూ చేయటం వలన, వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం లభిస్తుందని, వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకూ, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకూ, కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో, భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా, సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి. అంతేకాక, ప్రస్తుతం అర్జునుడు చేయవలసినది, ధర్మ యుద్ధం. కాబట్టి, సమాజ శ్రేయస్సు కోసం, అర్జునుడు క్షత్రియ వీరునిగా, తన కర్తవ్యాన్ని నిర్వహించాలి.

న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ ।
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ।। 26 ।।

కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. అంతేకాక, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి, స్ఫూర్తినివ్వాలి.

గొప్ప వ్యక్తులు, మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు. ఎందుకంటే, సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి, అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసే ఎలాంటి మాటలనూ, చేతలనూ, జ్ఞానులు చేయరాదని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు. జ్ఞానులు అజ్ఞానులకి అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెబుతూ, వారి విధులను విడిచి పెట్టమని, ఎన్నటికీ చెప్పరాదు. సాధారణంగా, ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు, కేవలం రెండు పద్ధతులనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఫలాసక్తితో కష్టపడి పనిచేయడం, లేదా అన్ని పనులూ శ్రమతో కూడినవీ, కష్టతరమైనవీ, ఇంకా పాపిష్టివీ అంటూ, వాటన్నింటినీ విడిచి పెట్టాడానికి చూస్తారు. ఈ రెండు పద్ధతులలో, తప్పించుకునే పద్ధతి కన్నా, ఫలాసక్తితో పని చేయటమే ఏంతో మేలైనది. కాబట్టి, వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు, అజ్ఞానులకు కూడా, తమ విధులను చక్కగా, శ్రద్ధతో నిర్వర్తించేలా, స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులపడి కలతచెందితే, వారికి పని చేయటం మీద విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక ప్రక్క పనులు ఆపి, మరోప్రక్క జ్ఞానం వృద్ధి చెందక, అజ్ఞానులు రెంటికీ చెడిపోతారు.

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।

అన్ని కార్యములు కూడా, ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడతాయి. కానీ, అజ్ఞానంలో జీవాత్మ, తను ఈ శరీరమే అన్న భ్రమతో, తనే కర్తను అని అనుకుంటుంది.

ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు, మనం నిర్దేశించినవి కావనీ, అవి ప్రకృతిచే చేయబడినవనీ, మనం గుర్తించాలి. ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకూ కర్త. ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. స్థిరమైన జీవాత్మ, కదిలే ప్రకృతియే తాననుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవంతునికి శరణాగతి చేసిన మరుక్షణం, తను కర్తను కానని తెలుసుకుంటుంది. అయితే, జీవాత్మ తానే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను, మార్గదర్శకం చేస్తుంది. మనస్సు, శరీర వ్యవస్థ చేసే పనులకు, జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో, పని చేస్తాయి.

తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।

ఓ మహా బాహువులున్న అర్జునా.. జ్ఞానులు జీవాత్మను, గుణములూ, కర్మల నుండి వేరుగా చూస్తారు. ఇంద్రియములూ, మనస్సు రూపంలో ఉన్న గుణములూ, ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకుని, వాటి యందు ఆసక్తులు కారు.

అహంకారంచే భ్రమకు లోనై, తమను తాము శరీరమే అనుకునేవారు, తామే కర్తలమనుకుంటారు. అహంకారాన్ని నిర్మూలించిన వారు, శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛను పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతను, భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి, వారు ప్రాపంచిక క్రియలకు, తామే కర్తలమని మభ్యపడరు. బదులుగా, ప్రతి కార్యకలాపం, మూడు గుణముల కదలిక వలననే జరుగుతున్నదని తలుస్తారు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు, భగవంతుడే అన్నీ చేస్తున్నాడనుకుంటే, సామాన్య ప్రజలు, తామే చేస్తున్నామనుకుంటారు.

ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు ।
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ।। 29 ।।

గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను, కలవరపరచరాదు.

మరి జీవాత్మ అనేది, గుణములూ, వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనది. ప్రకృతి గుణములచే భ్రమకు లోనయి, వారే కర్తలమని అనుకుంటారు. ప్రకృతి యొక్క త్రి-గుణములచే పూర్తిగా సమ్మోహితులై, వారు ఇంద్రియ, శారీరక, మానసిక ఆనందం కోసమే పని చేస్తువుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా, ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ జ్ఞానులు, అంతగా విషయ జ్ఞానం లేని వారి మనస్సులను, కలవరపెట్టకూడదు. అంటే, జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై రుద్దకూడదు. "నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి, కర్మ అర్థరహితమైనది. దానిని విడిచిపెట్టు" అని చెప్పకూడదు. వారు అజ్ఞానులకు తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూ, నెమ్మదిగా మమకారాసక్తి, అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్న వారికీ, అదిలేని వారికీ ఉన్న తేడాని వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మల నుండి ముక్తులవ్వాలంటే ఏం చేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

27 October, 2021

ముల్లోకాలలో తన విధిని గురించి శ్రీ కృష్ణుడేం చెప్పాడు! Bhagavadgita

 

ముల్లోకాలలో తన విధిని గురించి శ్రీ కృష్ణుడేం చెప్పాడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (20 - 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 20 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qf_lVTsqF7g ]

ముల్లోకాలలో తన విధిని గురించి, శ్రీ కృష్ణుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు.

కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ।। 20 ।।

యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।

తమ ధర్మములను నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు, సిద్ధిని పొందారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను, సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.

జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం, ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను చూసి, మనుష్యజాతి ప్రభావితం అవుతుంది. అటువంటి నాయకులు, తమ నడవడిక ద్వారా, సమాజాన్ని ఉత్తేజపరచి, జనులు అనుసరించడానికి మార్గ దర్శకం అవుతారు. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే, మిగతా సమాజం కూడా, నీతి ప్రవర్తనా, నిస్వార్ధం, మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ, ఎక్కడ నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్ధ పూరితంగా, అనైతికతతో, ఆధ్యాత్మిక అనాసక్తతతో, దిగజారి పోతుంది. ఒక గొప్ప నాయకుడు కర్మ యోగిగా ఉంటే, ఆయనను అనుసరించేవారు, కనీసం తమ కర్మలను చేస్తూ, భాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. అది తమ మనస్సునీ, ఇంద్రియములనూ నియంత్రణలో ఉంచుకోవడానికీ, మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో, ఉన్నత దశను చేరుకోవడానికీ, దోహదపడుతుంది. కాబట్టి, సమాజానికి ఒక ఆదర్శం చూపడం కోసం, అర్జునుడిని, కర్మ యోగం వైపుగా అడుగులు వేయమని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు.

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ।। 22 ।।

అర్జునా, ఈ మూడు లోకాలలో, నేను చేయవలసిన కర్తవ్యం, పొందవలసినదీ, సాధించవలసినదీ ఏమీ లేదు. అయినా, నేను చేయవలిసిన విధులను చేస్తూనే ఉంటాను.

మనమందరమూ ఎందుకు పని చేస్తున్నామంటే, మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరమూ, అనంత ఆనంద సముద్రమైన భగవంతుని అణు అంశలం కాబట్టి, ఆనందాన్ని వెతుకుతున్నాము. మనం చేసే ప్రతి పనీ, ఆనందం కోసమే. కానీ, ఆనందం అనేది, భగవంతుని శక్తులలో ఒకటి. అది ఆయనకు మాత్రమే, అనంతమైన మేర ఉంటుంది. తనకు తానే, సమగ్రమైన, పరిపూర్ణుడైన ఆయనకు, బాహ్యమైనదేమీ అవసరం లేదు. మహోన్నత వ్యక్తిత్వంగల వారు కర్మలు చేస్తే, దానికి ఒకే ఒక కారణం ఉంటుంది. అది తమ కోసం కాదు. ఇతరుల సంక్షేమం కోసమే. తన సాకార స్వరూపంలో శ్రీ కృష్ణుడిగా, ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా, లోక హితార్ధం పని చేస్తున్నానని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.

యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।

ఓ పార్థా, నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, అందరు మనుష్యులూ, నా దారినే అనుసరిస్తారు.

ఈ భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక గొప్ప నాయకుడిగా, రాజుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో దర్శనమిచ్చాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన విహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ, ఎంతోమంది సామాన్య జనులు, ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే, జనులను తప్పుదారి పట్టించడంలో దోషుడయ్యేది తానే అని, శ్రీ కృష్ణుడు భావిస్తున్నాడు.

ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ ।
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ।। 24 ।।

నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలూ నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను. మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.

శ్రీ కృష్ణుడు ఈ భూలోకంలో, ఒక మానవుడిగా కనిపిస్తూ, అవతరించినప్పుడు, ఆయన రాజ వీరుల కుటుంబీకునిగా, సమాజంలో అన్నివిధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే, ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని, మిగతా జనులు, ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీ కృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే, ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు, కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి, గందరగోళ స్థితికి లోనవుతారు. అదే విధంగా, అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని, ప్రపంచ ప్రఖ్యాతినొందాడు. అతను ధర్మాత్ముడైన యుధిష్టిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే, తన ధర్మ బద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే, ఏంతో మంది ఉన్నతమైన ఇతర వీరులూ, యోధులూ, ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచి పెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి, ధర్మాత్ములూ, అమాయకులూ అయిన ప్రజల వినాశనానికి, కారకమవుతుంది. అందుకే, సమస్త మానవ జాతి కల్యాణం కోసం, తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు.

ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానులు కూడా తమ కర్మలను ఎందుకు ఆచరించాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

21 October, 2021

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుతాలు! Bhagavadgita

 

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన అద్భుతాలు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (15 - 19 శ్లోకాలు)! - భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 15 నుండి 19 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MNnc9zKzoa4 ]

సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు..

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముధ్భవమ్ ।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్ ।। 15 ।।

మానవుల విహిత కర్మలు, వేదములలో చెప్పబడ్డాయి. మరియు, వేదములు ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ వ్యాపి అయిన భగవంతుడు, నిత్యమూ యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.

వేదములు భగవంతుని శ్వాస నుండి వెలువడ్డాయి. ఈ సనాతనమైన వేదములలో, మనుష్యుల విధులను, ఆ భగవంతుడే స్వయంగా వివరించాడు. ఈ విధులు ఏ విధంగా తయారుచేయ బడ్డాయంటే, వాటిని నిర్వర్తించడం ద్వారా, ప్రాపంచికంగా కూరుకుపోయిన మనుష్యులు, నెమ్మదిగా తమ వాంఛలను నియంత్రణ చేసుకుని, తమని తాము తమో గుణం నుండి రజో గుణానికీ, రజో గుణం నుండి సత్వ గుణానికీ ఉద్ధరించుకోవటం, నేర్చుకోవచ్చు. ఈ విధులు యజ్ఞంలాగా, ఆయనకే అంకితం చేయడానికి నిర్దేశింపబడ్డాయి. కాబట్టి, భగవంతుని అర్పితముగా, పవిత్రం చేయబడిన విధులు, దైవికంగా, భగవత్ సంబంధముగా ఉండి, భగవంతునితో అభేదంగా ఉంటాయి.

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః ।
అఘాయురింద్రియారామ: మోఘం పార్థ స జీవతి ।। 16 ।।

వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో, తమ బాధ్యతలను నెరవేర్చని వారు, పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే, జీవిస్తారు. అట్టి వారి జీవితము, వ్యర్థము.

ఇక్కడ చక్రం అంటే, ఒక సృష్టి క్రమంలో జరిగే క్రమబద్ధ పరిణామాలు. ఈ విశ్వం అనే చక్రంలో, అందరు సభ్యులూ తమ విధులను నిర్వర్తించి, దాని యొక్క చక్కటి పరిభ్రమణానికి దోహదపడతారు. మనము కూడా ప్రకృతి చక్రం నుండి కావలసిన వాటిని తీసుకుంటాము కాబట్టి, మనము కూడా, మనకు నిర్దేశించబడిన విధులు, నిర్వర్తించాలి. ఈ పరంపరలో, మన మానవులకు మాత్రమే, తాము చేసే పనులను, స్వీయ-స్వేఛ్చ ద్వారా ఎంచుకునే అవకాశం కల్పించబడింది. కాబట్టి, మనం ఈ ప్రకృతి పరిణామానికి అనుకూలంగా ఉండి దోహద పడొచ్చు, లేదా, ఈ విశ్వ వ్యవస్థ ఆటంకం లేకుండా నడవటానికి, ఉపయోగపడవచ్చు. వివిధ ఆధ్యాత్మిక స్థాయిలలో ఉన్న అన్ని ప్రాణులనూ క్రమశిక్షణతో ఉంచి, నేర్పించి, ఉద్ధరించటానికే, ఈ ప్రకృతి యొక్క చక్రం, భగవంతుని ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యజ్ఞంలో, తమ కర్తవ్యాన్ని నిర్వహించటం ద్వారా పాలుపంచుకొనని వారు, తమ ఇంద్రియములకు బానిసలై, పాపపు జీవితాన్ని గడుపుతారని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి విశదీకరిస్తున్నాడు.

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ।। 17 ।।

కానీ, ఎవరైతే ఆత్మయందే రమింతురో, పరిపూర్ణ జ్ఞానంతో, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.

బాహ్యమైన వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే, ఆత్మ యందు రమిస్తూ, సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే, మన బంధానికి మూలకారణం, కోరికలే, అన్ని పాపాలకీ మూల కారణం. అందుకే, వాటిని త్యజించాలి. కోరికలను త్యజించడం అంటే, ప్రాపంచిక కోరికలను వదిలిపెట్టడం. అంతేకానీ, ఆధ్యాత్మిక పురోగతి కోసం, లేదా, భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరిక కాదు. మానసిక వాంఛలు, మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి. ఎప్పుడైతే జీవాత్మ భగవంతుని నుండి విడిపోతుందో, అప్పుడు భౌతిక శక్తి, దానిని మాయలో కప్పివేస్తుంది. ఈ మాయ వలన, తనను తాను శరీరమే అనుకుంటూ, తనను తాను ఆత్మనని మరచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తుంది. జ్ఞానోదయమయిన వారు, ఆత్మ అనేది భౌతిక మయినది కాదనీ, దివ్యమైనదనీ, అందుకే నాశములేనిదనీ తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ, నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు కాబట్టి, ఆ ఇంద్రియ వస్తు-విషయములపై ఉండే యావ, మూర్ఖత్వం. ఈ విధంగా, ఆత్మ-జ్ఞానులైన మహాత్ములు, తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి, తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు. భగవంతునితో సంయోగమునొందిన వారు, వేదముల శిరస్సుపై నడుస్తారు. అంటే, వారు ఇక వేదములలో చెప్పిన నియమములను, పాటించవలసిన అవసరం లేదు. 

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన ।
న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ।। 18 ।।

ఇటువంటి ఆత్మ జ్ఞానులైన వారు, తమ విధులను చేయటం వలన కానీ, చేయకపోవటం వలన కానీ, వారికి వచ్చేవీ, పోయేవీ  ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం, వారు ఇతర జీవుల మీద ఆధార పడవలసిన అవసరమూ లేదు.

జ్ఞానోదయమైన మహాత్ములు, అలౌకిక ఆత్మ స్థాయిలో ఉంటారు. వారి యొక్క ప్రతి పని కూడా, భగవత్ సేవలో అతీంద్రియమైనదే. కాబట్టి, శారీరిక స్థాయిలోనున్న ప్రాపంచిక జనులకు, వారి వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం సూచింపబడిన విధులు, అటువంటి వారికి వర్తింపవు. జ్ఞానోదయమయిన జీవాత్మలు, పరిశుద్ధ మనస్సు కలిగి, భగవంతుని యందే రమిస్తూ ఉండే స్థాయిని చేరుకుంటారు. ఇటువంటి మహాత్ములు, నేరుగా భక్తియందే, పూర్తి ఆధ్యాత్మిక కర్మల యందే నిమగ్నమయి ఉంటారు. అంటే, ధ్యానం, అర్చనా, కీర్తనా, గురు సేవా వంటివి. ఇటువంటి జీవాత్మలు, తమ ప్రాపంచిక కర్తవ్యములను త్యజిస్తే, అది పాపం అనిపించుకోదు. వారు కావాలనుకుంటే, ప్రాపంచిక విధులను నిర్వర్తించవచ్చు కానీ, వాటిని తప్పకుండా చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సత్పురుషులు, ప్రహ్లాదుడూ, ధృవుడూ, అంబరీషుడూ, పృథువూ, మరియు విభీషణుడూ. అతీంద్రియ స్థాయిని చేరుకున్న తరువాత కూడా, తమ విధులను నిర్వర్తించారు. ఇక కర్మ యోగులు, బాహ్యంగా తమ విధులను చేసినా, అంతర్గతంగా తమ మనస్సు, భగవంతుని యందే చేర్చిన వారు. తమ ప్రాపంచిక ధర్మాన్ని విడిచి పెట్టి, సన్యాస జీవితాన్ని తీసుకున్నవారు, కర్మ సన్యాసులు. శంకరాచార్యులూ, మధ్వాచార్యులూ, రామానుజాచార్యుల వంటి వారు, బాహ్యంగా, అంతర్గతంగా, శారీరికంగా, మన: పూర్వకంగా, భగవత్ భక్తి లోనే నిమగ్నమై ఉంటారు.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికిజ్ఞానోదయమయ్యే ఈ రెండు మార్గాలనూ, సూచిస్తున్నాడు.

తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః ।। 19 ।।

కాబట్టి, మమకార బంధాలను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన, మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.

జనులు పూర్తి ఆధ్యాత్మిక జ్ఞాన స్థాయి చేరనంత వరకూ, వారి వారి విహిత కర్మలను చేస్తుండమని చెప్పాడు. జ్ఞానోదయమైన మహాత్ములు, విధింపబడిన కర్మలను చేయనవసరం లేదని అన్నాడు. కాబట్టి, అర్జునుడికి ఈ రెంటిలో ఏది యోగ్యమయినది? అంటే, ప్రస్తుతం చేయాల్సిన కర్తవ్యాన్ని వదిలి, సన్యాసం తీసుకోవడం కన్నా, తన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించి, దానిని భగవదర్పితం చేయమని, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు.

ఇక మన తదుపరి వీడియోలో, ముల్లోకాలలో తన విధి గురించి, శ్రీ కృష్ణుడి సంభాషణ తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

13 October, 2021

బ్రహ్మదేవుడి సృష్టి గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన వాస్తవాలు! Bhagavadgita

  

బ్రహ్మదేవుడి సృష్టి గురించి శ్రీ కృష్ణుడు చెప్పిన వాస్తవాలు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (10 - 14 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 10 నుండి 14 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bgxb1EtLtN8 ]

బ్రహ్మదేవుడి సృష్టి గురించి, శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..

సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః ।
అనేన ప్రసవిష్యధ్వమేష వోఽస్త్విష్టకామధుక్ ।। 10 ।।

సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు మానవజాతిని, వారి విధులతో పాటుగా సృష్టించి, ఇలా చెప్పాడు.. "ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వృద్ధి చెందండి. ఇవే మీ సమస్త కోరికలనూ తీరుస్తాయి."

ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములూ, భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగములే. అన్ని అంశములూ సహజంగానే, తమ మూలభాగము నుండి గ్రహిస్తాయి, దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి, ప్రాణుల జీవనానికి అవసరమైన వేడినీ, వెలుగునూ ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి, మన పోషణ కోసం ఆహారం తయారు చేయటమే కాక, నాగరిక జీవన శైలి కోసం, ఎన్నో ఖనిజాలను, తన గర్భంలో దాచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది, మరియు శబ్దతరంగ శక్తి ప్రసరణకు, దోహద పడుతుంది. మానవులమైన మనం కూడా, భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలీ, నడిచే నేలా, త్రాగే నీరూ, వచ్చే వెలుతురూ, ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం, వీటన్నింటినీ వాడుకుంటున్నప్పుడు, వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధింపబడిన కర్తవ్యములను, భగవత్ సేవ లాగా చేయటం ద్వారా, ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో, మనం తప్పకుండా పాలుపంచుకోవాలి. ఆయన మననుండి కోరుకునే యజ్ఞం అదే. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే, మన స్వ-ప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది.

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః ।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ।। 11 ।।

మీ యజ్ఞముల ద్వారా, దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన, అందరికీ శేయస్సూ, సౌభాగ్యం కలుగుతుంది.

ఈ విశ్వం యొక్క నిర్వహణకు దేవతలు అధికారులు. భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని, వారి ద్వారా చేస్తాడు. ఈ దేవతలు, భౌతిక జగత్తు యొక్క పరిధిలోనే ఉంటారు. అవే, స్వర్గాది ఉన్నత లోకాలు. దేవతలు అంటే, భగవంతుడు కారు. వారూ మనవంటి ఆత్మలే. ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి, నిర్దిష్ఠమైన పదవులలో ఉంటారు. మన ప్రభుత్వంలోని ఒక్కో పరిధికి, ఒక్కో అధికారిలాగా, ఈ ప్రపంచ వ్యవహారాలు అజమాయిషీ చేయటానికి, అగ్ని దేవుడూ, వాయు దేవుడూ, వరుణ దేవుడూ, ఇంద్రుడూ వంటి వారు, పదవులను అధిరోహించి ఉంటారు. గత జన్మలలో చేసిన పుణ్య కార్యముల ఫలముగా, ఎంపిక చేయబడిన జీవాత్మలు, ఈ పదవులలో ఉండి, విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి. వీరే దేవతలు.

దేవతలను సంతృప్తి పరచటానికి, వేదాలు ఎన్నో రకాల కర్మకాండలనూ, ప్రక్రియలనూ చెప్పాయి. ప్రతిఫలంగా, దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు. మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే, ఆ నీరు పువ్వులకూ, ఫలములకూ, ఆకులకూ, కొమ్మలకూ, చిగురులకూ ఎలా చేరుతుందో, అదే విధంగా, మనం చేసే యజ్ఞం, ఆ భగవంతుని సంతోషం కోసం చేసినప్పుడు, అప్రయత్నపూర్వకంగా, దేవతలు కూడా సంతోషిస్తారు. ప్రీతి నొందిన దేవతలు, భౌతిక ప్రకృతి మూల-భూతములను జీవులకు అనుకూలంగా మార్చటం ద్వారా, తిరిగి వారికి సంపత్తీ, సౌభాగ్యాన్నీ కలిగిస్తారు.

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః ।
తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ।। 12 ।।

యజ్ఞములు చేయడం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, దేవతలకు తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.

ఈ విశ్వం యొక్క వేరువేరు ప్రక్రియల నిర్వహణాధికారులైన దేవతలే, మనకు వర్షం, గాలీ, పంటలూ, చెట్లూ, చేమలూ, ఖనిజములూ, సారవంతమైన నేల వంటివి ప్రసాదిస్తారు. వారి నుండి వీటన్నింటినీ పొందిన మనం, వారికి ఋణపడి ఉండాలి. దేవతలు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తారు. అలాగే, మనం కూడా మన ధర్మాన్ని సరైన దృక్పథంతో నిర్వర్తించాలని, వారు ఆశిస్తారు. దేవతలందరూ, ఆ దేవదేవుని సేవకులే కాబట్టి, ఎవరైనా భగవంతుని అర్పితంగా యజ్ఞం చేస్తే, వారందరూ ప్రీతి చెంది, ఆ జీవాత్మకి అనుకూలంగా ఉండే భౌతిక పరిస్థితులను కలిగించి, సహకరిస్తారు. ప్రకృతి ప్రసాదించిన ఈ కానుకలని, ఈశ్వర సేవ కోసం కాకుండా, మన భోగం కోసమే అన్నట్టుగా పరిగణిస్తే, అది దొంగ మనస్తత్వం అవుతుంది.

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః ।
భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ।। 13 ।।

యజ్ఞములో మొదట నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక మనసున్న సత్పురుషులు, సర్వ పాపముల నుండి ముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు, పాపమునే భుజింతురు.

వైదిక సంప్రదాయంలో, ఆహారాన్ని భగవంతుని నివేదన కోసమే అన్న దృక్పథంతోనే వండేవారు. ఆహార పదార్థాలన్నీ, కొంచెం కొంచెం ఒక పళ్ళెంలో ఉంచి, భగవంతుడిని వాటిని స్వీకరించమని, శాబ్దిక లేక మానసిక ప్రార్థన చేస్తారు. అలా నైవేద్యం చేసిన తరువాత, ఆ పళ్ళెంలో ఉన్న ఆహారం, 'ప్రసాదం' గా పరిగణించబడుతుంది. ఆ పళ్ళెంలో, ఇంకా పాత్రలలో ఉన్న ఆహారం, భగవదనుగ్రహముగా పరిగణించబడి, ఆ దృక్పథంలోనే భుజించబడుతుంది. ముందుగా భగవంతునికి నైవేద్యం చేసి తినటం వలన, మన పాపములనుండి విముక్తి కలుగుతుంది. అలాకాకుండా, భగవంతునికి నివేదన చేయకుండా అన్నం తినేవారు, పాపం చేస్తున్నట్టే అని, శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. మన ఇంద్రియ భోగం కోసమే తింటే, ప్రాణహాని వలన కలిగే కర్మ బంధాలలో చిక్కుకుంటాము. యజ్ఞంలో, భగవత్ నివేదన చేయగా మిగిలిన ఆహారాన్ని భుజించినప్పుడు, ఆ దృక్పథం మారుతుంది. మన శరీరాన్ని భగవంతుని సొత్తుగా, దాన్ని భగవంతుని సేవకోసం ఉపయోగించటానికి, మన సంరక్షణలో ఉంచబడినట్టు పరిగణిస్తాము. అనుమతించబడిన ఆహారాన్ని, ఆయన అనుగ్రహంగా, శరీర పోషణ కోసము స్వీకరిస్తాము. ఈ మనోభావంతో, ఆ ప్రక్రియ అంతా పవిత్రమవుతుంది.

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।

ప్రాణులన్నీ ఆహారం వలననే జీవిస్తాయి. ఆహారం వర్షము వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన, వానలు కురుస్తాయి. నిర్దేశింపబడిన కర్తవ్యముల ఆచరణచే, యజ్ఞము జనిస్తుంది.

శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో, ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమవుతుంది. ధాన్యం భుజించబడి, రక్తముగా మారుతుంది. రక్తము నుండి వీర్యము జనిస్తుంది. వీర్యమే, మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు. వీటిచే ప్రీతినొందిన దేవతలు, వానలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.

ఇక మన తదుపరి వీడియోలో, సృష్టి చక్రం గురించి శ్రీ కృష్ణుడి వివరణ తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

29 September, 2021

మాయా బంధాలనుండి విముక్తి ఎలా పొందాలో చెప్పిన శ్రీ కృష్ణుడు! Bhagavadgita

 

మాయా బంధాలనుండి విముక్తి ఎలా పొందాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (06 - 09 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 06 నుండి 09 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/9B6RqN-bNVk ]

జ్ఞానేంద్రియములను మనస్సుతో ఎలా అదుపు చేయాలో, శ్రీ కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు..

కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ।
ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ।। 6 ।।

బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం, ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండే వారు, తమను తాము మోసం చేసుకునే వారు. అలాంటి వారు కపటులనబడతారు.

సన్యాసి జీవన శైలికి ఆకర్షింపబడి, ప్రజలు తమ వృత్తిని విడిచిపెట్టినా, ఇంద్రియ విషయముల మీద మానసిక వైరాగ్యం ఏర్పడదు. బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించినా, అంతర్గతంగా, తుచ్ఛమైన మనోభావాలతో జీవించే స్థితిలో ఉంటారు. కాబట్టి, ఒక కపట సన్యాసిగా జీవించటం కన్నా, బాహ్య ప్రపంచంలోని పోరాటాలని ఎదుర్కుంటూ, కర్మ యోగిగా జీవించటమే మేలు. బాహ్యంగా, ఇంద్రియ విషయములను త్యజించినా, మనస్సులో మాత్రం, వాటి గురించే ఆలోచిస్తూ ఉండే వారు కపటులనీ, తమని తామే మోసం చేసుకునే వారనీ, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు.

యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున ।
కర్మేంద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే ।। 7 ।।

కానీ, అర్జునా, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, కర్మేంద్రియములతో మమకార, ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మ యోగులు, నిజంగా ఏంతో శ్రేష్ఠులు.

'కర్మ యోగం' అన్న పదంలో, రెండు ప్రధానమైన విషయములున్నాయి. 'కర్మ' వృత్తి ధర్మాలు, మరియు 'యోగం', భగవంతునితో సంయోగం. కర్మ యోగి అంటే, తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ, మనస్సును భగవంతుని యందే నిలిపేవాడు. అలాంటి కర్మ యోగికి, అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, కర్మ బంధాలు అంటవు. ఎందుకంటే, వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది, కర్మ ఫలాలపై ఆసక్తియే కానీ, చేసే కర్మలు కావు. కర్మ యోగికి కర్మ ఫలాలపై మమకారం ఉండదు. అదేవిధంగా, ఒక కపట సన్యాసి, క్రియలను త్యజించినా, మమకారం విడిచిపెట్టడు కాబట్టి, కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు.

గృహస్థు జీవనంలో ఉండీ, కర్మ యోగము ఆచరణ చేసే వాడు, మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా, ఏంతో ఉత్తముడని, శ్రీ కృష్ణుడి వివరణ. ‘శరీరం జగత్తులో, మనస్సు భగవంతునిలో ఉంచి, ప్రపంచంలో వ్యవహారాలు చేయటమే, కర్మ-యోగం. శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ, మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండటమే, కపటత్వం’.

నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః ।
శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః ।। 8 ।।

కాబట్టి, నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే, పనులు చేయటం అనేది, క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచి పెట్టడం వలన, శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.

మనస్సు, బుద్ధి, భగవత్ ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంతవరకూ, కర్తవ్య ధోరణితో, బాహ్యమైన భౌతిక పనులను చేయటం, వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి, వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి, సోమరితనం అనేది, ఆధ్యాత్మిక మార్గంలో, అతిపెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది. సోమరితనం అనేది, మనుష్యులకు ప్రధాన శత్రువు. అది మన శరీరంలోనే ఉంటుంది కాబట్టి, మరింత హానికరమైనది. పని అనేది, మనకు అత్యంత నమ్మకమైన స్నేహితుడి లాంటిది. అది పతనం నుండి కాపాడుతుంది. సాధారణ క్రియలైన తినటం, స్నానం చేయటం, మరియు ఆరోగ్యం కాపాడుకోవటం వంటి వాటికి కూడా, పని చేయాలి. ఈ యొక్క విద్యుక్తమైన క్రియలను, 'నిత్య కర్మలు' అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీరనిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం, పురోగతికి సంకేతం కాదు. అది శరీరమూ, మనస్సులను కృశింపచేసి, బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరో పక్క, చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము, ఆధ్యాత్మిక పథంలో ఎంతో సహకారంగా ఉంటుంది. కాబట్టి, అలసత్వం అనేది, భౌతిక పురోగతికి కానీ, ఆధ్యాత్మిక పురోగతికి కానీ, మంచిది కాదు.

యజ్ఞార్ధాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః ।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ।। 9 ।।

పనులను ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి. లేదంటే, ఆ పనులు మనలను ఈ జగత్తులో, కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.

కత్తి, బందిపోటు చేతిలో ఉంటే, అది మనుష్యులను భయభీతులను చేయటానికీ, లేదా చంపటానికీ ఆయుధమవుతుంది. అదే, ఒక శస్త్ర చికిత్స వైద్యుడి దగ్గర ఉంటే, ప్రజల జీవితాలను కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు. అలాగే, శుభకరమైనదీ కాదు. దానిని వాడే విధానం బట్టి, దాని ప్రభావం ఉంటుంది. పని అనేది మంచిదా, చెడ్డదా అని చెప్పలేము. మానసిక దృక్పథం బట్టి, అది ఉన్నతికి కారకం కావచ్చు, లేదా, బంధన కారకం కూడా అవ్వవచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని, ఈ భౌతిక జగత్తులో బంధన కారకమవుతుంది. కానీ, ఒక యజ్ఞంలాగా, ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని, మాయా బంధాలనుండి విముక్తి కలిగించి, దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. పనులు చేయటం అనేది, మన యొక్క సహజ స్వభావం కాబట్టి, ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథంతో, పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి, మనం ఏదో ఒక పని చేయకుండా, ఒక్క క్షణం కూడా ఉండలేము. మనం కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ, మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞం లాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్నీ, దానిలో ఉండే ప్రతిదానినీ భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాం.

ఇక మన తదుపరి వీడియోలో, బ్రహ్మ దేవుడి సృష్టి గురించి, శ్రీ కృష్ణుడి వివరణ తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

23 September, 2021

నిజమైన కర్మ యోగిగా ఎలా మారాలో తెలియజేసిన శ్రీ కృష్ణభగవానుడు! Bhagavadgita

 


నిజమైన కర్మ యోగిగా ఎలా మారాలో తెలియజేసిన శ్రీ కృష్ణభగవానుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (01 - 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/55y8nHLfONs ]

కర్మ యోగం మొదటి శ్లోకంలో, అర్జునుడు శ్రీ కృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు..

అర్జున ఉవాచ ।

జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ।। 1 ।।

వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ।। 2 ।।

అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ జనార్ధనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమయినదయితే, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో, నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో, దయచేసి ఆ ఒక్క మార్గాన్ని, నిశ్చయాత్మకంగా ఉపదేశించుము.

పరమాత్మ మొదటగా, మరణంలేని ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునుడికి, తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి, తన విధిని నిర్వర్తించటం ద్వారా కీర్తినీ, ఉత్తమ లోకాలనూ పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని ఆర్జునుడిని ప్రేరేపించిన పిదప, శ్రీ కృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియచేశాడు. అదే, కర్మ యోగ శాస్త్రం. అర్జునుడిని కర్మ ఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో, బంధనం సృష్టించే కర్మలు, బంధ నాశనం చేసే కర్మలుగా మారతాయి. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని, 'బుద్ధి యోగము' అని వివరించాడు. అంటే, ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా, మనస్సుని స్థిరమైన బుద్ధి చేత నియంత్రించాలి. మరియు, బుద్ధిని అధ్యాత్మిక విజ్ఞానం ద్వారా, అచంచలమైనదిగా తయారు చేసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు కానీ, ఆ కర్మల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని, త్యజించమన్నాడు. దానిని సరిగా అర్థం చేసుకోని అర్జునుడు, కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదయినప్పుడు, తను ఈ భయంకరమైన యుద్ధం చేయటమనే కర్తవ్యాన్ని, ఎందుకు చేయాలి? అనుకున్నాడు.

శ్రీ భగవానువాచ ।

లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ।। 3 ।।

భగవంతుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికిగల రెండు మార్గములు, ఇంతకు పూర్వమే చెప్పాను. ధ్యాన నిష్ఠయందు ఆసక్తిగలవారికి, జ్ఞాన మార్గము. పనుల పట్ల ఆసక్తిగలవారికి, కర్మ మార్గము.

శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక పరిపూర్ణత కొరకు, రెండు మార్గములను ఉపదేశించాడు. మొదటిది, విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా, ఆత్మ యొక్క నిజ స్వభావాన్నీ, మరియూ, అది శరీరము నుండి ఎలా వేరైనదో, తెలుసుకోవటం. ఇది 'సాంఖ్య యోగం'. తత్వ విచారణ దృక్పథం ఉన్నవారూ, మేధో విశ్లేషణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే వారూ, ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది, భగవంతునిపై భక్తి భావనతో పని చేయటం. ఇది, 'బుద్ధి యోగం'. అలా పని చేయటం, అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. దాంతో, స్వచ్ఛ మైన మనస్సులో జ్ఞానం సహజంగానే వృద్దినొంది, అది జ్ఞానోదయ స్థితి వైపుకు దారితీస్తుంది.

ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో, ధ్యానము పట్ల మొగ్గు చూపే వారుంటారు, మరియు, కర్మల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి, ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటినుండీ, ఈ రెండు మార్గాలూ ఉన్నాయి. తన ఉపదేశం, అన్ని రకాల జనులకూ ఉద్దేశించబడింది కాబట్టి, శ్రీ కృష్ణుడు ఈ రెండింటి గురించీ వివరిస్తున్నాడు.

న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ।। 4 ।।

మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి, కర్మ బంధముల నుండి విముక్తి పొందలేడు. అలాగే, కేవలం బాహ్య సన్యాసము ద్వారా, జ్ఞాన సిద్ధినీ పొందజాలడు.

కేవలం కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన, కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటే, మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక, భౌతిక కర్మ మాదిరిగానే, అది కూడా కర్మ బంధాలలో కట్టివేస్తుంది. నిజమైన కర్మ యోగి, కర్మ ఫలాలపై మమకార, ఆసక్తులు లేకుండా పనిచేయటం, నేర్చుకోవాలి. దీనికి బుద్ధి యందు జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, అవసరం. కాబట్టి, కర్మ యోగములో కూడా, తత్వ జ్ఞానం అవసరం.

ప్రపంచాన్ని త్యజించి, సన్యాసి అయిపోనంత మాత్రాన, సాంఖ్య యోగి, జ్ఞానోదయ స్థితిని పొందలేడు. భౌతిక ఇంద్రియార్ధ వస్తువులను త్యజించినా, మనస్సులో మలినాలు ఉన్నంత కాలం, నిజమైన జ్ఞానం కలుగదు. పూర్వపు చింతలను పదేపదే ఆలోచించటం, మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారయి, కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా, అదే పథంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా, ప్రాపంచికముగా మలినమయిన మనస్సు - ఒత్తిడీ, ఆందోళనా, భయమూ, ద్వేషమూ, ఈర్ష్యా, మమకారం వంటి అనేకానేక ప్రాపంచిక భావావేశాలకు, లోనవుతూనే ఉంటుంది. ఈ విధంగా, కేవలం, బాహ్యమైన భౌతిక సన్యాసంతో, సంపూర్ణ జ్ఞానోదయం అనేది, మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా, దానికి అనుగుణమైన, అంతఃకరణ శుద్ధి చేసే చర్యలు ఉండాలి. కాబట్టి, సాంఖ్య యోగములో కూడా, కర్మలు అవసరమే. తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి, కేవలం మానసిక అభిమానం. అలాగే, భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం, మేధస్సుతో చేసే ఊహాగానాలు.

న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 5 ।।

ఎవ్వరూ ఒక్క క్షణం కూడా, కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులూ, తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరేపితమై, కర్మలు చేయవలసి ఉంటుంది.

కొంత మంది, కర్మ అనగా, వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు. అంతేకానీ, రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం, మరియు, ఆలోచించటం వంటివి కూడా అని అలోచించరు. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులనూ, కర్మలుగానే పరిగణించాలి. అందుకే, ఒక్క క్షణమైనా, పూర్తి క్రియా రహితంగా ఉండటం, సాధ్యం కాదు. ఊరికే కూర్చున్నా, అదొక క్రియ.. పడుకుంటే, అది కూడా ఒక క్రియ.. మనం నిద్ర పొతే, మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది. గాఢ నిద్రలో కూడా, గుండె, మరియు ఇతర శారీరిక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, మనుష్యులకు పూర్తి క్రియా రహిత స్థితి అసాధ్యమని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఈ యొక్క శరీరమూ, మనస్సూ, బుద్ధి వ్యవస్థ, తన యొక్క స్వీయ త్రిగుణములైన సత్వ-రజో-తమో గుణముల చేతనే, ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో, ఈ విధంగా వివరించబడింది. 'ఎవ్వరూ కూడా, ఏ పనీ చేయకుండా, ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారూ, తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి, అప్రయత్నంగా కర్మలు చేస్తారు.'

ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానేంద్రియములను, మనస్సుతో అదుపు చేయడం ఎలాగో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

16 September, 2021

పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో తెలిపిన శ్రీ కృష్ణుడు! Bhagavadgita

  

పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో తెలిపిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (69 - 72 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 69 నుండి 72 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MYC7nNPuZpU ]

అహంకార రహితంగా ఉండడం వలన, పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు.

యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః ।। 69 ।।

సర్వ భూతములకూ ఏది పగలో, అది పండితునికి అజ్ఞానపు రాత్రి.. మరియు సర్వ భూతములకూ ఏది రాత్రో, అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.

లౌకిక దృక్పథంలో ఉండేవారు, భౌతిక వస్తు-విషయముల భోగమే, నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు. ప్రాపంచిక విలాసాల ఆనందమే, జీవితంలో విజయమనుకుంటారు. "పగలు" అంటే, ఇంద్రియ సుఖాలు లేకపోవడం, "చీకటి" అంటే, రాత్రి అనుకుంటారు. దివ్య జ్ఞానం కలిగిన వివేకవంతులు, ఇంద్రియ భోగాలను ఆత్మకి హానికరమైనవిగా తెలుసుకుంటారు కాబట్టి, వాటిని "రాత్రి" గా పరిగణిస్తారు. ఇంద్రియ విషయముల నుండి దూరంగా ఉండటమే, ఆత్మ ఉద్ధరణకి అవసరమని భావించి, దానిని "పగలు"గా పరిగణిస్తారు.

ఆపూర్యమాణమచలప్రతిష్ఠం
సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ ।
తద్వత్ కామా యం ప్రవిశంతి సర్వే
స శాంతిమాప్నోతి న కామకామీ ।। 70 ।।

ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా, ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి, శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తి పరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి, దానిని పొందడు.

ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తున్నా, సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే అపూర్వమైన సమర్థత ఉంది. ప్రపచంలోని అన్ని నదులూ, సముద్రాలలోనికి వచ్చి పోర్లిపోతుంటాయి.. కానీ, సముద్రం మాత్రం పొంగదూ, తగ్గదు. వానా కాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరినా, అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు. అదే విధంగా, జ్ఞానోదయమైన ముని, శారీరిక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా, లేదా అవేమీ లేకపోయినా సరే, ప్రశాంత చిత్తంతో ఉండి, చలించకుండా ఉంటాడు. కేవలం అలాంటి యోగి మాత్రమే, నిజమైన శాంతిని పొందుతాడు.

విహాయ కామాన్యః సర్వాన్పుమాంశ్చరతి నిఃస్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి ।। 71 ।।

ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలనూ త్యజించి, అత్యాశ లేకుండా, నేను, నాది అన్న భావన లేకుండా, అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.

మనము ఏదైనా కోరికను మనస్సులో పెంచుకుంటే, ఆ తరుణమే, లోభమూ, క్రోధముల ఉచ్చు లోకి వెళ్ళినట్లే. ఎలాగైనా మనము చిక్కుకు పోతాము. కాబట్టి, అంతర్గత ప్రశాంతతకి దారి, కోరికలను తీర్చుకోవటంలో లేదు. వాటిని నిర్మూలించుకోవటంలోనే ఉంది. ప్రపధమంగా, భౌతిక ఉన్నతి కోసం అత్యాశ అనేది, మనకున్న అమూల్యమైన సమయాన్ని ఘోరంగా వృధా చేసుకోవటమే. అంతేకాక, అదొక అంతులేని పరుగు. అభివృద్ధి చెందిన దేశాలలో, చాలా కొద్ది మందికి మాత్రమే తిండీ, బట్టలకు లోటు ఉంది. అయినా, వారు అశాంతితో ఉంటారు. ఎందుకంటే, వారిలో తృష్ణ, అత్యాశ, ఇంకా తీరలేదు. సంతృప్తి అనే సంపత్తి కలిగినవారే, గొప్ప ఐశ్వర్యవంతులు. మనుష్యుల మధ్య వచ్చే చాలా మటుకూ పొట్లాటలు, ''అహం" వల్లనే జనిస్తాయి. అహంకారాన్ని పెంచి పోషించుకోకుండా, దానిని త్యజించటంలోనే, ప్రశాంతతకి మార్గముంది.  "నాది" అన్న భావన అజ్ఞానం వలన వస్తుంది. ఎందుకంటే, ఈ భూగోళం అంతా భగవంతునిదే. మనం ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లి పొతాము. మరిక ఈ ప్రాపంచిక వస్తువులు మనవి, అని ఎలా అనుకోగలం?

ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాస్యామంతకాలేఽపి బ్రహ్మనిర్వాణమృచ్ఛతి ।। 72 ।।

ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత, ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా, ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.

'బ్రహ్మం' అంటే భగవంతుడు, మరియు 'బ్రాహ్మీ స్థితి' అంటే, భగవత్-ప్రాప్తి నొందిన స్థితి. జీవాత్మ అంతఃకరణ శుద్ధిని సాధించిన తరువాత, భగవంతుడు తన దివ్య కృపని ప్రసాదిస్తాడు. ఆయన కృపచే, దివ్య జ్ఞానాన్నీ, దివ్య ఆనందాన్నీ, మరియు దివ్య ప్రేమనీ, జీవాత్మకి ప్రసాదిస్తాడు. ఇవన్నీ, భగవత్ ప్రాప్తి సమయంలో, భగవంతునిచే ఇవ్వబడే దివ్యమైన శక్తులు. అదే సమయంలో, జీవాత్మను, మాయా బంధనం నుండి దేవుడు విడిపిస్తాడు. 'సంచిత కర్మలు' నశిస్తాయి. 'అవిద్య'.. అంటే, భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి, లోపలున్న అజ్ఞానం పోగొట్ట బడుతుంది. భౌతిక ప్రకృతిలో త్రి-గుణముల యొక్క ప్రభావం, అంతరించి పోతుంది. భౌతిక పరిస్థితిలో ఉన్న త్రి-దోషములు, ముగుస్తాయి. పంచ-క్లేశములు, అంటే, ప్రాపంచిక బుద్ధి యొక్క ఇదు దోషాలు, నశిస్తాయి. పంచ-కోశములు భస్మమైపోతాయి. ఆ సమయం నుండి, జీవాత్మ శాశ్వతంగా, మాయా బంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది. ఎప్పుడైతే జీవాత్మ, ఈ భగవత్ ప్రాప్తి దశను సాధిస్తుందో, అది 'జీవన్ ముక్త' అనబడుతుంది. అంటే, ఈ శరీరంలో ఉన్నప్పుడే, ముక్తి సాధించినట్లు. తరువాత మరణ సమయంలో, ముక్త జీవాత్మ అంతిమంగా, తన భౌతిక శరీరాన్ని త్యజించి, భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది. ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత, అది ఎల్లప్పుడూ, దేవునితోనే ఉంటుంది. ఆ తరువాత, అజ్ఞానపు మాయ, జీవాత్మను ఎన్నటికీ వశము చేసుకోలేదు. మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితిని, 'నిర్వాణం', 'మోక్షం' అని అంటారు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే
సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని కర్మషట్కం, రెండవ అధ్యాయం, సాంఖ్యయోగంలోని 72 శ్లోకాలు, సంపూర్ణం.

ఇక మన తదుపరి వీడియోలో, కర్మషట్కములోని మూడవ అధ్యాయం, కర్మ యోగంలో, శ్రీ కృష్ణుడు వివరించిన నిగూఢ సత్యాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

09 September, 2021

దు:ఖాన్ని తొలగించుకుని, శాంతిని పొందే మార్గాన్ని సూచించిన శ్రీ కృష్ణుడు! Bhagavadgita

 

దు:ఖాన్ని తొలగించుకుని, శాంతిని పొందే మార్గాన్ని సూచించిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (64 - 68 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 64 నుండి 68 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6VT92RzBMaA ]

దు:ఖాన్ని తొలగించుకుని, శాంతిని పొందే మార్గాన్ని, శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..

రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।

ఇంద్రియ వస్తువులను వాడేటప్పుడు కూడా, మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు, భగవంతుని కృపకు పాత్రుడవుతాడు.

వినాశనానికి దారి తీసే అధోపతనం, ఇంద్రియ వస్తువులలో ఆనందం ఉన్నదని చింతించటంతో, ఆరంభమవుతుంది. దాహం వేయటం, శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన, ఆత్మకు అంత సహజమైనది. "నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను" అనుకోవటం అసంభవం.. ఎందుకంటే, అది ఆత్మకి అసహజము. మరి ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో, అంటే, భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపును, పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తీ, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా, ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు. పైగా, అది శుద్ధి చేస్తుంది. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణం అంత శుద్ధి అవుతుంది.

ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।

భగవత్ కృప ద్వారా, అన్ని దుఃఖాలూ తొలిగిపోయి, పరమ శాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తంతో ఉన్నవాని బుద్ధి, శీఘ్రంగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.

కృప అనేది, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి, వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి లాంటిది. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్నీ, దివ్య ప్రేమనూ, మరియు దివ్య ఆనందాన్నీ అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని, భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం, మరియు జ్ఞానంలో ముంచి వేస్తుంది. భగవంతుని కృప వలన, మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం యొక్క రుచిని ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన, శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువులపై యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి, అన్ని దుఃఖాలకూ అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే, ఆనందానికి మూలమనీ, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమనీ, బుద్ధి, స్థిర నిశ్చయానికి వస్తుంది.

నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।। 66 ।।

మనస్సునూ, ఇంద్రియములనూ నియంత్రించని, క్రమశిక్షణ లేనివానికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవడైతే మనస్సుతో, భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో, వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించినవాడు, సంతోషంగా ఎలా ఉండగలడు?

మనస్సునీ, ఇంద్రియములనూ నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు, భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్యమైన ఆనందాన్ని కూడా, పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా, నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి, పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్లుగా, ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి, భక్తితో ఉండరో, వారిని త్రిగుణాత్మకమైన మాయ బాధిస్తూనే ఉంటుంది. ఆ బాధ కారణంగా, మన జీవితంలో సంతోషం దూరమవుతుంది.

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ।। 67 ।।

ఎలాగైతే బలమైన గాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన అయినా మనస్సు కేంద్రీకృతమవుతుందో, అది బుద్ధిని హరించి వేస్తుంది.

భగవంతుడు ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారుచేశాడు. కాబట్టి, అవి సంహజంగానే, బాహ్య ప్రపంచ వస్తువులపై ఆకర్షితమవుతాయి. వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమయినా, దానికి మనస్సుని తప్పు త్రోవ పట్టించే శక్తి ఉంది. జింకలు ‘తీయని’ స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి, వాటిని సంహరిస్తాడు. అలానే మనం కూడా, బాహ్య వస్తువులపై ప్రేమను పెంచుకుని, నిజమైన సంతోషానికి దూరమవుతున్నాం.

తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 68 ।।

కాబట్టి, ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి, ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు.

జ్ఞానోదయమైన వారు, బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు, పరిశుద్ధమైన బుద్ధితో, మనస్సుని నియంత్రిస్తారు, మరియు, ఆ మనస్సు ద్వారా, ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ, భౌతికమైన స్థితిలో, దీనికి విరుద్ధంగా అవుతుంది. ఇంద్రియములు మనస్సుని తమ దిశగా లాగుకుంటాయి; మనస్సు బుద్ధిని వశపరచుకుంటుంది; బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. అందుకే, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ది చేసుకుంటే, ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో, బుద్ధి దివ్య జ్ఞాన పథం నుండి ప్రక్కకి తొలగదు.

ఇక మన తదుపరి వీడియోలో, అహంకార రహితంగా ఉండడం వలన, పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో, శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

02 September, 2021

స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశించి మనిషి పతనమౌతాడు! – శ్రీ కృష్ణుడు Bhagavadgita

  

స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశించి మనిషి పతనమౌతాడు! – శ్రీ కృష్ణుడు

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (59 - 63 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 54 నుండి 63 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/oTdecbwzN4U ]

ఇంద్రియాలను ఏ విధంగా వశపరుచుకోవాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।
రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59 ।।

సాధకులు ఇంద్రియములను భోగ విషయముల నుండి నియంత్రించినా, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఆ రుచి కూడా అంతమవుతుంది.

ఉపవాస సమయంలో, ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు, ఇంద్రియ వాంఛలు బలహీనమవుతాయి. అదే విధంగా, అనారోగ్యంతో ఉన్నప్పుడు, భోగ విషయాలపై ఆసక్తి పోతుంది. ఈ వైరాగ్యం తాత్కాలికమైనది. ఎందుకంటే, కోరికల మూల బీజం, మనస్సులోనే ఉంటుంది. ఉపవాసం ముగిసినప్పుడు కానీ, లేదా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కానీ, కోరికలు తిరిగి వస్తాయి. జీవాత్మ, ఆ పరమాత్మ యొక్క అణు-అంశ. అందుకే, భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం, ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం. ఆ దివ్య ఆనందం లభించేవరకూ, జీవాత్మ తృప్తి చెందదు, మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది. సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తితో, ఇంద్రియములను నియంత్రించవచ్చు. కానీ, ఆ నియంత్రణ తాత్కాలికమే. ఎందుకంటే, అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలలను ఆర్పలేదు. కానీ, జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై, దివ్య ఆనందాన్ని పొందినప్పుడు, తను అనంతమైన జన్మల నుండి, పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది. భగవంతుడు సర్వానందమయుడు. జీవాత్మ, ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు, ఆ ఆనందంలో తనివి తీరుతుంది. ఆ తర్వాత సహజంగానే, నిమ్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది. భగవత్ భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం, దృఢమైనది, మరియు అచంచలమైనది.

యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ।
ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః ।। 60 ।।

ఇంద్రియములు ఎంత బలవత్తరమైనవీ, అల్లకల్లోలమైనవీ అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా, బలవంతంగా లాక్కునిపోగలవు.

ఇంద్రియములనేవి, అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి. అవి దుడుకైనవీ, తెంపరితనం మెండుగా ఉన్నవి. కాబట్టి, వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది, సాధకులు, తమలో తామే పోరాటం చేయాల్సిన సందర్భం లాంటింది. అందుకే, ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు, కామ క్రోధాదులతో కూడిన విలాసాలను కోరే తమ ఇంద్రియములను మచ్చికచేసుకోవటానికి, ప్రయత్నించాలి. అలా కాకపోతే, అవి గొప్ప సహృదయులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి, పట్టాలు తప్పేలా చేస్తాయి.

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితాః ।। 61 ।।

ఎవరైతే తమ ఇంద్రియములను వశపరచుకుని, మనస్సుని, "నా" యందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్లు.

చంచలమైన మనస్సునూ, ఇంద్రియములనూ మచ్చిక చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వాటిని సరియైన పద్దతిలో ఎలా ఉపయోగించాలో, తెలియచేస్తున్నాడు. శ్రీమద్ భాగవతంలో, అంబరీష మహారాజు యొక్క ఉదాహరణ, ఈ ప్రక్రియని అద్భుతంగా విశదీకరిస్తుంది. అంబరీషుడు తన మనస్సుని, శ్రీ కృష్ణుడి పాదారవిందములను స్మరించటానికే ఉపయోగించాడు. తన నాలుకను భగవంతుని నామ, రూప, గుణ, లీలలను కీర్తించడానికే వాడాడు. తన శ్రవణేంద్రియములను, భగవంతుని కథలను వినటానికే ఉపయోగించాడు. తన కళ్ళను, అందమైన కోవెలలో, భగవంతుని మూర్తిని చూడటానికీ, తన స్పర్శని భగవంతుని భక్తుల పాదాలను ఒత్తటానికీ, తన ముక్కు పుటాలను, భగవంతుని పూజలో అర్పించిన సుగంధ ద్రవ్యములను వాసన చూడటానికీ, తన పాదాలను, గుడి చుట్టూ ప్రదక్షిణ చేయటానికీ, శిరస్సును, భగవంతునికీ భక్తులకూ నమస్కరించటానికీ వినియోగించాడు. ఈ విధంగా, తన ఇంద్రియములన్నింటినీ, భగవత్ సేవలోనే వాడి, వాటిని జయించాడు. మనం కూడా, చేసే కర్మలలో, భగవద్ నామస్మరణను విడిచిపెట్టకూడదు. అలా దేవుని చరణారవిందాలను గట్టిగా పట్టుకున్న వాడే, సంపూర్ణ జ్ఞానవంతుడు.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే ।
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోఽభిజాయతే ।। 62 ।।

ఇంద్రియ విషయముల మీద చింతన చేయడం వలన, వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి, కోరికలను కలుగ చేస్తుంది. ఆ కోరికల నుండే, క్రోధం ఉత్పన్నమవుతుంది.

క్రోధం, లోభం, కామం మొదలగునవి, వైదిక వాజ్ఞ్మయంలో, మానసిక రోగాలుగా పరిగణించబడ్డాయి. మనందరికీ, శారీరిక వ్యాధులంటే ఏమిటో తెలుసు. అనారోగ్యం, మనిషిని కృంగదీస్తుంది. అయితే, మనం శారీరిక వ్యాధుల కన్నా అధికంగా, మానసిక రోగాలతో సతమతమవుతూ ఉంటాం. మనం, కామ, క్రోధ, లోభాదులను, మానసిక వ్యాధులుగా పరిగణించక పోవటం వలన, మనం వాటిని నయం చేసుకోవటానికి ప్రయత్నించం. ఒకసారి కోరిక జనిస్తే, అది రెండు సమస్యలను సృష్టిస్తుంది. లోభం, మరియు క్రోధం. కోరికలను తీర్చుకుంటే, అది అత్యాశకు దారి తీస్తుంది. కాబట్టి, వాంఛలను తృప్తి పరచటం ద్వారా, వాటిని పోగొట్టుకోలేము. ప్రపంచంలోని సమస్త సంపదలూ కలిగి ఉన్నా, ఎదో ఒక వెలితి ఉంటుంది. కాబట్టి, దుఃఖానికి మూల కారణం కోరికలే, అని తెలుసుకుని, వాటిని త్యజించాలి. మరోప్రక్క, కోరికలు తీర్చుకోవటానికి ఆటంకం కలిగినప్పుడు, కోపం కలుగుతుంది. కోపం అనేది, దానికదే ఉత్పన్నమవ్వదు. అది కోరికలకు ఆటంకం కలగటం నుండి వస్తుంది. ‘కోరిక’ మమకారబంధం నుండి వస్తుంది. మమకారాసక్తి అనేది, ఇంద్రియ విషయముల యందు పదేపదే ఆలోచించటం వలన కలుగుతుంది. ఈ విధంగా, ఇంద్రియ భోగ వస్తు, విషయముల మీద పదేపదే చింతించటం అనే సాధారణ క్రియ, లోభం, క్రోధం అనే జంట రోగాల దిశగా, మన పతనానికి దారి తీస్తుంది.

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః ।
స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి ।। 63 ।।

కోపం అనేది, విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగచేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు, మనుష్యుడు పతనమౌతాడు.

ఉదయం పూట పొగమంచు సూర్య కాంతిని తగ్గించినట్టు, కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. మనుష్యులు కోపంలో తప్పిదాలు చేసి, తరువాత చింతిస్తారు. ఎందుకంటే, కోపంలో ఉన్నప్పుడు, బుద్ధి భావోద్వేగాలచే కప్పి వేయబడుతుంది. ఏది మంచి, ఏది చెడు? అనే విచక్షణను కోల్పోయి, భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకోపోతాం. అక్కడి నుండి, ఇక అతః పతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ది వినాశనాన్ని కలుగచేస్తుంది. బుద్ధి అనేది, అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది. అదే నశించినప్పుడు, వ్యక్తి సర్వ నాశనమైపోతాడు.
ఇక మన తదుపరి వీడియోలో, దు:ఖాలను తొలగించుకుని, శాంతిని ఏ విధంగా పొందాలో, స్వయంగా శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!