Facts and Mysteries of the World at one place in the Voice of Maheedhar (Planet Leaf)...
Ads
20 January, 2022
కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ! Bhagavad Gita
27 April, 2021
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (7 - 11 శ్లోకాలు)!
21 April, 2021
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!
భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 3 నుండి 6 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగం వీడియోగా చూడడానికి = https://youtu.be/QPZD-HR4exs ]
దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు..
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
ఆచార్యా, బుద్ధిశాలీ, నీ ప్రియ శిష్యుడైన ద్రుపద పుత్రుడు, వ్యూహంతో పన్నిన పాండవుల మహా సైన్యాన్ని చూడండి..
దుర్యోధనుడు తెలివిగా, తన గురువైన ద్రోణాచార్యుడు గతంలో చేసిన తప్పుని ఎత్తి చూపాడు.
ద్రోణాచార్యుడికి గతంలో, ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. ఆగ్రహంతో ఉన్న ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగేటటువంటి శక్తి గల పుత్రుడు కలిగేలా వరం పొందాడు. ఆ వర ప్రభావంగా, ద్రుపదునికి పుట్టిన కుమారుడే దృష్టద్యుమ్నుడు. తనను చంపడానికే దృష్టద్యుమ్నుడు జన్మించాడని, ద్రోణాచార్యుడికి తెలిసినా, తన వద్దకు యుద్ధ విద్యనభ్యసించడానికి రాగా, పెద్ద మనస్సుతో, ఒక అత్యున్నత గురువుగా, తనకు తెలిసిన విద్యనంతా బోధించాడు. అయితే, దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షాన చేరి, సర్వ సైన్యాధిపతిగా నిలబడి, బలమైన సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. గతంలో గురువు గారి కనికరమే, ప్రస్తుత ఇబ్బందికి దారి తీసిందని భావిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు పాండవులపై కనికరం చూపించకుండా యుద్ధం చేయాలన్న ఉద్దేశ్యంతో, దుర్యోధనుడు ఈ విధంగా చెప్పాడు.
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।
ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।
యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడూ, విరాటుడూ మరియు ద్రుపదుడు వంటి వారు, గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు. వీరు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడూ, చేకితానుడూ, వీరుడైన కాశీరాజూ, పురుజిత్తూ, కుంతిభోజుడూ, మరియు శైబ్యుడూ, వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడూ, వీరుడైన ఉత్తమౌజుడూ, సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ, ద్రౌపదీ పుత్రులూ, వీరందరూ కూడా మహా వీరులే.
పాండవుల పక్షాన నిలబడిన పెక్కు సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు తన ఆందోళనని వ్యక్తం చేశాడు. దాయాది సైన్యంలో ఉన్న, పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన మహారథుల గురించి, ద్రోణాచార్యుడికి వివరించాడు. పాండవుల తరుపున భీమార్జునులతో సమానమైన యోధులూ, యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చే వీరులూ ఉన్నారంటూ, రాబోయె పెను విపత్తును అంచనా వేసి చెప్పాడు దుర్యోధనుడు.
మన తదుపరి వీడియోలో, కురు సైన్యంలో ఉన్న వీరుల గురించి, ద్రోణాచార్యునితో దుర్యోధనుడి సంభాషణలో, మరికొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాము.
కృష్ణం వందే జగద్గురం!
Link: https://www.youtube.com/post/UgzGZIwNvaAwJ-2FF2x4AaABCQ
14 April, 2021
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)!
'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)!
ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ, ఆత్మను నశింపజేయదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే.. అంటే, తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి, సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో, భగవంతుని చేరవచ్చు. అటువంటి మార్గాలను మనకు సులభతరంజేసే భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 1, 2 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cCRC_ePh0bs ]
వైశంపాయన మహాముని, అర్జునుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించిన దాని ప్రకారం, భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది..
ధృతరాష్ట్ర ఉవాచ ।
ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో, 'సంజయా, ధర్మ క్షేత్రమైన కురుక్షేత్ర సంగ్రామంలో, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులూ, పాండు పుత్రులూ ఏమి చేశారు?' అని అడిగాడు.
ఇలా అడగడానికి కారణం.. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా? అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా? ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకః అంటే, నా కుమారులు, పాండవ: అంటే, పాండుకుమారులు అన్న భావం ప్రకటించడం ద్వారా, పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక, వారిని వైరులగానే చూస్తున్నాడు.. అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో, అలా కౌరవులు దునుమాడ బడతారు అన్నది, ధర్మక్షేత్రానికి అర్ధం.
సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
సంజయుడు ఈ విధంగా చెప్పాడు. యుద్ధానికి సన్నద్ధమై, వ్యూహరచనతో సిద్ధంగా ఉన్న పాండు సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు, ద్రోణాచార్యులను సమీపించి ఇట్లా అన్నాడు.. అని, చెప్పసాగాడు.
ధృతరాష్ట్రుడు పుట్టుకతో గృడ్డివాడైనా, అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది. కానీ, అతడి అతి ప్రేమ వలన, అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన, ఎక్కడ తన కొడుకులు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతర్యం తెలుసుగనుక, ఆయనకు ఊరట కలిగిస్తూ.. పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు, గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేననుజూసి లోన భయపడిన రారాజు, అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు.
తదుపరి వీడియోలో దుర్యోధనుడూ, ద్రోణాచార్యుల వారి సంభాషణ గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురం!
Link: https://www.youtube.com/post/Ugw7Rd_qtvKnfAEmqrp4AaABCQ