Ads

Showing posts with label Bhagavad Gita. Show all posts
Showing posts with label Bhagavad Gita. Show all posts

20 January, 2022

కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ! Bhagavad Gita

 

కామ క్రోధ భయముల నుండి స్వేచ్ఛ!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (01 – 06 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 01 నుండి 06 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/25KAu1L4LQs ]

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు కర్మ సన్యాస మార్గాన్ని విశదీకరిస్తున్నాడు. బాహ్యమైన భోగ సంబంధ తలపులను త్యజించి, కామ, క్రోధ, భయముల నుండి స్వేచ్ఛను పొందడమెలాగో, చెప్పబోతున్నాడు.

00:53 - అర్జున ఉవాచ ।
సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।
యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।

అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ శ్రీ కృష్ణా, నీవు పనులను త్యజించే కర్మ సన్యాసాన్నీ, మరియు భక్తితో పనిచేసే కర్మయోగాన్నీ ప్రశంసించావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో, కచ్చితముగా తేల్చి చెప్పుము.

శ్రీ కృష్ణుడు, పనులను త్యజించడాన్నీ, భక్తితో పని చేయడాన్నీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో, తెలియజేప్పమన్నాడు.  మొదటి అధ్యాయంలో, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి, పూనుకున్నాడు. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు. ఆత్మ నిత్యమైనదీ, నాశము లేనిదీ కావడంవలన, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు కాబట్టి, శోకించటం తెలివితక్కువ పని అని, చెప్పాడు. అర్జునుడు ఒక వీరుడిగా, తన సామాజిక విధిని నిర్వర్తిస్తూ, యుద్ధంలో ధర్మ పక్షాన పోరాడి, ఆ కర్మలను భగవత్ అర్పితం చేయమన్నాడు. మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం, అవశ్యకమైనది. ఎందుకంటే, అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుందని, పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధిని సాధించిన వ్యక్తి, ఎలాంటి సామాజిక విధులనూ నిర్వర్తించే అవసరం లేదని కూడా చెప్పాడు. నాలుగవ అధ్యాయంలో, భగవత్ ప్రీతి కొరకు చేసే రకరకాల కార్యముల గురించి, విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే, జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని, పేర్కోన్నాడు. కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేశాడు. అయితే, ఈ ఉపదేశాలన్నీ, అర్జునుడిని అయోమయానికి గురి చేశాయి. అతను కర్మ సన్యాసమూ, మరియూ కర్మ యోగమూ, రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవని అనుకున్నాడు. ఈ రెండింటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. అందుకే, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేశాడు.

03:09 - శ్రీ భగవానువాచ ।
సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ ।
తయోస్తు కర్మసంన్యాసాత్కర్మయోగో విశిష్యతే ।। 2 ।।

భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు: పనులను త్యజించే కర్మ సన్యాస మార్గము, మరియు భక్తితో పనిచేసే కర్మ యోగ మార్గము, రెండూ సర్వోన్నత లక్ష్యం వైపు దారి తీస్తాయి. కానీ, కర్మ యోగమనేది, కర్మ సన్యాసము కంటే శ్రేష్ఠమైనది.

ఒక కర్మ యోగి, ఆధ్యాత్మిక, మరియు సామాజిక ధర్మాలు రెండింటినీ చేస్తాడు. మనస్సుని భగవంతుని యందే నిలిపి, కేవలం శరీరంతో, సామాజిక ధర్మాలు చేయబడతాయి. కర్మ సన్యాసమనేది, శారీరక దృక్పథం నుండి పైకి వెళ్ళిన ఉన్నత స్థాయి జీవుల కోసం. పూర్తి స్థాయిలో భగవత్ భావనలో ఐక్యమవడం వలన, సామాజిక బాధ్యతలను త్యజించి, సంపూర్ణంగా, ఆధ్యాత్మిక విధులనే నిర్వర్తించే మనిషి, కర్మ సన్యాసి. వారు తమని తాము శరీరం అనుకోరు. తత్ఫలితంగా, వారు తమ శారీరిక ధర్మాలను నిర్వర్తించే అవసరం లేదని భావిస్తారు. ఇటువంటి కర్మ సన్యాసులు, తమ పూర్తి సమయాన్ని, ఆధ్యాత్మికత కోసమే కేటాయిస్తారు. అదే సమయంలో, కర్మ యోగులు, తమకున్న సమయాన్ని, ప్రాపంచిక విధులకూ, ఆధ్యాత్మిక విధులకూ విభజించాల్సి ఉంటుంది. అందుకే, కర్మ సన్యాసులు, భగవంతుని దిశగా వేగంగా వెళ్ళ గలుగుతారు. కర్మ యోగులు, సామాజిక విధుల భారంతో, నెమ్మదిగా సాగుతారు. కానీ, ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, కర్మ సన్యాసం కంటే, కర్మ యోగాన్నే ప్రశంసిస్తున్నాడు. ఎందరో సాధువులు, తమకు వైరాగ్యం కలిగిందనుకుంటూ, ప్రపంచాన్ని త్యజించారు. కానీ, వారి మనస్సు, భగవంతునిపై పూర్తిగా లగ్నం కాలేదు. దీని వలన, వారు ఆధ్యాత్మిక పథంలో, దివ్య ఆనందాన్ని అనుభవించలేక పోయారు. బైరాగుల్లా కాషాయ వస్త్రాలు ధరించి, గంజాయి పీల్చటం వంటి అత్యంత పాపభూయిష్ట పనులు చేస్తుంటారు. కేవలం అజ్ఞానులు మాత్రమే, తమ సోమరితనాన్ని వైరాగ్యమని, తప్పుగా అర్థం చేసుకుంటారు.

05:17 - జ్ఞేయః స నిత్యసంన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి ।
నిర్ద్వంద్వోహి మహాబాహో సుఖం బంధాత్ విముచ్యతే ।। 3 ।।

దేనినీ ద్వేషింపక, దేనినీ ఆశించక ఉన్న కర్మ యోగులను, నిత్య సన్యాసులుగా తెలుసుకొనవలెను. అన్ని రకాల ద్వంద్వములకూ అతీతంగా ఉండి, వారు భౌతిక బంధాల నుండి సునాయాసముగా విముక్తులవుతారు.

బాహ్యంగా ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే, కర్మ యోగులు, అంతర్గతంగా వైరాగ్యాన్ని అభ్యాసం చేస్తుంటారు. కాబట్టి, అనుకూల, ప్రతికూల ఫలితాలు రెండింటినీ సమ దృష్టితో, ఈశ్వరానుగ్రహంగా స్వీకరిస్తారు. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఎంత అద్భుతంగా రచించాడంటే, అది మన క్రమానుసార ఉన్నతి కొరకు, సంతోషాన్నీ, దుఃఖాన్నీ అనుభవింప చేస్తుంది. మనం సాధారణ జీవితాన్ని గడుపుతూ, మన దరికి వచ్చే దేనినైనా సహిస్తూ, సంతోషంగా మన ధర్మం మనం చేస్తూ ఉంటే, ఈ ప్రపంచం సహజంగానే, క్రమక్రమంగా మనల్ని ఆధ్యాత్మిక పురోగతి వైపుకు, తీసుకువెళ్తుంది. అనంతమైన జన్మలలో, ప్రపంచంపై ఉన్న మమకారం వలన, మన హృదయములు మొరటుగా, మలినముతో ఉన్నాయి. కాబట్టి, కర్మ యోగులు భక్తితో పని చేస్తూ, ఫలితముల పట్ల సమదృష్టితో ఉంటారు, మరియు భగవంతుని యందే, తమ మనస్సుని లగ్నం చేయటానికి, నిత్యం అభ్యాసం చేస్తుంటారు.

06:42 - సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।
ఏక మప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విన్దతే ఫలమ్ ।। 4 ।।

అజ్ఞానులు మాత్రమే, కర్మలను త్యజించుట, లేదా కర్మ సన్యాసము, మరియు భక్తితో పని చేయటము, లేదా కర్మయోగము, భిన్నమైనవని చెబుతారు. ఈ రెండింటిలో, ఏ ఒక్క మార్గమును అవలంభించినా, ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చని, యదార్థము తెలిసినవారు చెబుతారు.

సన్యాసమనేది, రెండు రకాలుగా ఉంటుంది. అవి, ఫాల్గు వైరాగ్యమూ, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు కష్టాలనూ, బాధ్యతలనూ వదిలించుకోవటం కోసం దానిని త్యజిస్తారో, అది ఫాల్గు వైరాగ్యమనబడుతుంది. ఇది పలాయనవాద దృక్పథంలో ఉంటుంది, అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం, కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో, కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలెదురైనప్పుడు, దానిని కూడా మరల వదిలేసి, తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి, ఆశిస్తారు. ఇక యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా, భగవంతుని శక్తిగా చూస్తారు. వారికున్న దానిని, వారికి చెందినదిగా పరిగణించరు, మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో, ఆ భగవంతుని సేవ చేయటానికే, ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము, స్థిరమైనది, కష్టాలకు చలించనిది. కర్మ యోగులు, బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా, యుక్త వైరాగ్య భావాలు పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులుగా, మరియు భగవంతుడిని, భోక్తగా పరిగణిస్తారు. అందుకే, ప్రతిదీ, భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో, స్థితులవుతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ, భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో, సమానంగా ఉంటుంది. కర్మ యోగికీ, కర్మ సన్యాసికీ మధ్య, నిజమైన జ్ఞానం విషయంలో, ఏటువంటి తేడా కనపడదు.

08:44 - యత్సాంఖ్యై: ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ।
ఏకం సాఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి ।। 5 ।।

కర్మ సన్యాసము ద్వారా పొందగలిగే అత్యున్నత స్థితిని, భక్తితో కర్మలను ఆచరించటం ద్వారా కూడా, పొందవచ్చు. కాబట్టి, కర్మ సన్యాసము, మరియు కర్మ యోగము, ఒక్కటే అని చూసినవాడే, నిజముగా ఉన్నదున్నట్టుగా చూసినట్టు. ఆధ్యాత్మిక సాధనలో, మనస్సు యొక్క ఉద్దేశమే ప్రధానమైనది. బాహ్యమైన క్రియలు కావు.

ఒక వ్యక్తి, పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా, అతని మనస్సు బాహ్య కోరికలపై మళ్ళితే, అది పరిపూర్ణత కాదు. మరొకరు బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నా, నిరంతరం బృందావనాన్నే తలుస్తుంటే, భగవంతునిపైనే మనస్సును నిమగ్నం చేస్తే, అతడు పరిపూర్ణ స్థితిని పొందుతాడు. మన మానసిక స్థితిని బట్టి, మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుందని, సమస్త వైదిక శాస్త్రాలూ పేర్కొంటున్నాయి. బంధము, మరియు మోక్షమనేవి, మనస్సు యొక్క స్థితి మీద అధారపడతాయి. ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నా, మనస్సుని మాత్రం, భగవంతుని ధ్యానములోనే నిమగ్నం చేయాలి. ఆధ్యాత్మిక దృష్టి లేనివారు, కర్మ సన్యాసికీ, కర్మ యోగికీ ఉన్న బాహ్యమైన తేడాలను చూసి, కర్మ సన్యాసియే ఉన్నతమైనవాడని, భావిస్తారు. కర్మ సన్యాసులు, మరియు కర్మ యోగులు కూడా, తమ మనస్సులను భగవంతుని యందే నిమగ్నం చేసినట్టు చూసి, జ్ఞానులు, వారిద్దరూ ఒకే, సరిసమాన అంతర్గత స్థితిలో ఉన్నట్లు, గమనిస్తారు.

10:18 - సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః ।
యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధిగచ్ఛతి ।। 6 ।।

ఓ గొప్ప బాహువులు కలవాడా. భక్తి యుక్తముగా పని చేయకుండా, పరిపూర్ణ కర్మ సన్యాసమును చేరుకొనుట, చాలా కష్టం. కానీ, కర్మ యోగములో నిష్ణాతుడైన ముని, శీఘ్రముగా పరమాత్మను పొందుతాడు.

ఒక వ్యక్తి ఈ లోకములో, తన ధర్మములు నిర్వర్తిస్తూ, క్రమక్రమంగా కోపము, లోభము, మరియు కామములకు అతీతంగా ఎదగడానికి, ప్రయత్నించాలి. అలా కాక, ఎవరైనా తన విధులను త్యజిస్తే, మనస్సును పరిశుద్ధం చేసుకోవటం, చాలా కష్టం. పరిశుద్ధమైన మనస్సు లేకుండా, నిజమైన వైరాగ్యం పొందడమంటే, సుదూరపు స్వప్నముగానే మిగిలి పోతుంది. మనమందరమూ, మన సహజ స్వభావంచే పని చేయటానికి, ప్రేరేపింపబడతాము. అర్జునుడు ఒక యోధుడు. కానీ, కృత్తిమంగా తన ధర్మమును త్యజించి, అడవులకు పారిపోతే, అతని స్వభావం, అక్కడ కూడా తన కర్తవ్యాన్ని ప్రవర్తిస్తుంది. అలా కాకుండా, తన సహజ గుణాలనీ, ప్రతిభనీ భగవంతుని సేవలోనే ఉపయోగిస్తే, అది ఏంతో ఫలదాయకంగా ఉంటుంది. పిందెగా ఉన్న పండు, తనను మోసి, పోషించే చెట్టుకి, గట్టిగా అతుక్కుని ఉంటుంది. అదే పండు, పూర్తిగా పండినప్పుడు, తనకు ఆధారంగా ఉన్న దాని నుండి, విడిపోతుంది. అదే విధంగా, సంపూర్ణ విజ్ఞానంతో పరిపక్వత చెందే అనుభవం, కర్మ యోగికి, ఈ భౌతిక జగత్తు నుండి అందుతుంది. ఎలాగైతే కష్టపడి పనిచేసేవారికే గాఢ నిద్ర పడుతుందో, కర్మ యోగము ద్వారా, మనస్సుని పరిశుద్ధమొనర్చుకున్నవారికే, గాఢమైన ధ్యానం సాధ్యమవుతుంది.

ఇక మన తదుపరి వీడియోలో, యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, ఆత్మ శుద్ధి కోసం ఆచరించే కర్మల గురించి, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

27 April, 2021

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (7 - 11 శ్లోకాలు)!

  


'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (7 - 11 శ్లోకాలు)!

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 7 నుండి 11 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

ఈ భాగం వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Fm0jzAL6ytw ]

కురు సైన్యంలో ఉన్న వీరుల గురించి, ద్రోణాచార్యునితో, దుర్యోధనుడి సంభాషణ ఇలా కొనసాగుతోంది..

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।

ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా తెలుసుకొనుము. వీరు నాయకులుగా, అత్యంత యోగ్యమైన వారు. మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి వివరించబోతున్నాను.

ఈ సంభాషణలో దుర్యోధనుడు, కౌరవ సైన్యాధ్యక్షుడైన ద్రోణాచార్యుడిని ద్విజోత్తమ, అంటే, బ్రాహ్మణులలో ఉత్తమమైన వాడా అని చెప్పుకొచ్చాడు. అది ఉద్దేశ్యపూర్వకంగా వాడిన పదంగానే అనిపిస్తుంది. నిజానికి ద్రోణాచార్యుడు, వృత్తి రీత్యా యోధుడు కాడు.. సైనిక విద్య నేర్పించే గురువు మాత్రమే. దుర్యోధనుడి మాటల్లో ఉన్న గూడార్థం ఏమిటంటే, ఒక వేళ ద్రోణాచార్యుడు ధైర్యవంతంగా పోరాడకపోతే, రాజ మందిరంలో ఉండే ఒక సామాన్య బ్రాహ్మణుడిగానే మిగిలిపోతాడని, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. పాండవుల పక్షాన ఉన్న వీరుల గురించి వివరించిన దుర్యోధనుడు, ఇక తన పక్షాన నిలబడిన మహాయోధుల గురించి పేర్కోనడం మొదలుపెట్టాడు.

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిర్జయద్రథ: ।। 8 ।।

అన్యే చ బహవః శూరా: మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।

తమరూ, భీష్ముడూ, కర్ణుడూ, యుద్ధాన్ని జయించగల కృపాచార్యుడూ, అశ్వత్థామా, వికర్ణుడూ, సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడూ, జయద్రధుడు, వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే. ఇంకా చాలా మంది వీరయోధులు, నా కోసం ప్రాణాలర్పించటానికి సిద్ధంగా వున్నారు. అనేక ఆయుధాలు కలిగి ఉన్న వీరందరూ, యుద్ధవిద్యలో ప్రావీణ్యం పొందిన వారే.

దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న మహాయోధుల గురించి, ద్రోణాచార్యునికి వివరించాడు. ఈ వీరులందరూ తన పక్షాన పోరాడి, ప్రాణాలు సైతం కొల్పోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ, తన గర్వాన్ని ప్రదర్శించాడు.

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ।। 10 ।।

అపరిమితమైన మన సైనిక బలం, మనం, భీష్మ పితామహుడిచేత రక్షింపబడుతున్నాం. కానీ, భీముడిచేత రక్షింపబడుతున్న ఆ పాండవసైన్యం పరిమితమైనది.

దుర్యోధనుడిలా, గొప్పలకు పోయేవారు, అంత్య  కాలం సమీపించినప్పుడు, పరిస్థితిని నిజాయితీతో అంచనావేయకుండా, అహంకారంతో ప్రగల్భాలు పలుకుతారు. భీష్మపితామహుడు కౌరవ పక్షానికి సర్వసైన్యాధ్యక్షుడు. తన మరణ సమయాన్ని తానే ఎంచుకునే వరం కలిగినవాడు కాబట్టి, అతన్ని ఓడించటం చాలా కష్టం. అందుకే, దుర్యోధనుడు తనకు ఓటమి లేదని వీర్రవీగాడు. ఇక పాండవపక్షం వైపు సైన్యాన్ని, దుర్యోధనుడి బద్ధ శత్రువైన భీముడు పరిరక్షిస్తున్నాడు. భీష్ముడి సామర్ధ్యాన్ని భీముడి బలంతో పోల్చి, పాండవులను తక్కువ అంచనా వేశాడు. కానీ, భీష్ముడు, కౌరవులకూ, పాండవులకూ పితామహుడు.. ఇరు పక్షాల క్షేమం కోరేవాడు. సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ వున్న ఈ పవిత్రయుద్ధంలో, భూమ్మీద ఉన్న ఏ శక్తి కూడా, అధర్మ పక్షాన నిలబడి, గెలుపుని సాధించలేదని, భీష్ముడికి తెలుసు. కానీ, కౌరవులపట్ల తనకున్న నైతిక నిబద్ధత కారణంగా, భీష్ముడు, పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి నిలబడ్డాడు.

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షన్తు భవన్త: సర్వ ఏవ హి ।। 11 ।।

కౌరవ సేనా నాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ, భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను. అంటూ, సైనికులందరినీ ఉద్దేశించి చెప్పాడు.

ఇక యుద్ధం ప్రారంభం కాబోతుండగా, దుర్యోధనుడు తన కౌరవ సేనకు కొన్ని సూచనలు అందించాడు. తన పక్షాన నిలబడిన సర్వ సైన్యాధ్యక్షుడైన భీష్మడు, తన సైన్యానికి స్ఫూర్తిగా, శక్తిగా పరిగణించాడు దుర్యోధనుడు. అందుకే, తన సేనా నాయకులను, తమ తమ సైనిక వ్యూహ స్థానాలను కాపాడుకుంటూ, భీష్ముడిని పరిరక్షించమని కోరాడు.

మన తదుపరి వీడియోలో రణరంగంలో శంఖారావం పూరించడం, యుద్ధ ప్రారంభ విషయాల గురించీ తెలుసుకుందాము.

కృష్ణం వందే జగద్గురం!

21 April, 2021

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!

 

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (3 - 6 శ్లోకాలు)!

భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 3 నుండి 6 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

ఈ భాగం వీడియోగా చూడడానికి = https://youtu.be/QPZD-HR4exs ]

దుర్యోధనుడు, ద్రోణాచార్యుల వారితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు..

పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।

ఆచార్యా, బుద్ధిశాలీ, నీ ప్రియ శిష్యుడైన ద్రుపద పుత్రుడు, వ్యూహంతో పన్నిన పాండవుల మహా సైన్యాన్ని చూడండి..

దుర్యోధనుడు తెలివిగా, తన గురువైన ద్రోణాచార్యుడు గతంలో చేసిన తప్పుని ఎత్తి చూపాడు.

ద్రోణాచార్యుడికి గతంలో, ద్రుపద మహారాజుతో రాజకీయ వైరం ఉండేది. ఆగ్రహంతో ఉన్న ద్రుపదుడు, ఒక యజ్ఞం చేసి, ద్రోణాచార్యుడిని సంహరించగలిగేటటువంటి శక్తి గల పుత్రుడు కలిగేలా వరం పొందాడు. ఆ వర ప్రభావంగా, ద్రుపదునికి పుట్టిన కుమారుడే దృష్టద్యుమ్నుడు. తనను చంపడానికే దృష్టద్యుమ్నుడు జన్మించాడని, ద్రోణాచార్యుడికి తెలిసినా, తన వద్దకు యుద్ధ విద్యనభ్యసించడానికి రాగా, పెద్ద మనస్సుతో, ఒక అత్యున్నత గురువుగా, తనకు తెలిసిన విద్యనంతా బోధించాడు. అయితే, దృష్టద్యుమ్నుడు, పాండవ పక్షాన చేరి, సర్వ సైన్యాధిపతిగా నిలబడి, బలమైన సైనిక వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. గతంలో గురువు గారి కనికరమే, ప్రస్తుత ఇబ్బందికి దారి తీసిందని భావిస్తూ, ఇకనైనా ద్రోణాచార్యుడు పాండవులపై కనికరం చూపించకుండా యుద్ధం చేయాలన్న ఉద్దేశ్యంతో, దుర్యోధనుడు ఈ విధంగా చెప్పాడు.

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।

యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ।

పురుజిత్ కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।

యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।

సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।

వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడూ, విరాటుడూ మరియు ద్రుపదుడు వంటి వారు, గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు. వీరు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడూ, చేకితానుడూ, వీరుడైన కాశీరాజూ, పురుజిత్తూ, కుంతిభోజుడూ, మరియు శైబ్యుడూ, వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడూ, వీరుడైన ఉత్తమౌజుడూ, సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ, ద్రౌపదీ పుత్రులూ, వీరందరూ కూడా మహా వీరులే.

పాండవుల పక్షాన నిలబడిన పెక్కు సైన్యాన్ని చూసి, దుర్యోధనుడు తన ఆందోళనని వ్యక్తం చేశాడు. దాయాది సైన్యంలో ఉన్న, పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన మహారథుల గురించి, ద్రోణాచార్యుడికి వివరించాడు. పాండవుల తరుపున భీమార్జునులతో సమానమైన యోధులూ, యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చే వీరులూ ఉన్నారంటూ, రాబోయె పెను విపత్తును అంచనా వేసి చెప్పాడు దుర్యోధనుడు.

మన తదుపరి వీడియోలో, కురు సైన్యంలో ఉన్న వీరుల గురించి, ద్రోణాచార్యునితో దుర్యోధనుడి సంభాషణలో, మరికొన్ని శ్లోకాల గురించి తెలుసుకుందాము.

కృష్ణం వందే జగద్గురం!

Link: https://www.youtube.com/post/UgzGZIwNvaAwJ-2FF2x4AaABCQ

14 April, 2021

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)!

 

'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (1, 2 శ్లోకాలు)!

ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ, ఆత్మను నశింపజేయదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే.. అంటే, తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి, సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరుకోగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో, భగవంతుని చేరవచ్చు. అటువంటి మార్గాలను మనకు సులభతరంజేసే భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 1, 2 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cCRC_ePh0bs ]

వైశంపాయన మహాముని, అర్జునుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించిన దాని ప్రకారం, భగవద్గీత మొదటి శ్లోకం ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది..

ధృతరాష్ట్ర ఉవాచ ।

ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।

ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో, 'సంజయా, ధర్మ క్షేత్రమైన కురుక్షేత్ర సంగ్రామంలో, యుద్ధానికి సన్నద్ధమైన నా పుత్రులూ, పాండు పుత్రులూ ఏమి చేశారు?' అని అడిగాడు.

ఇలా అడగడానికి కారణం.. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా? అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా? ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు మామకః అంటే, నా కుమారులు, పాండవ: అంటే, పాండుకుమారులు అన్న భావం ప్రకటించడం ద్వారా, పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక, వారిని వైరులగానే చూస్తున్నాడు.. అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో, అలా కౌరవులు దునుమాడ బడతారు అన్నది, ధర్మక్షేత్రానికి అర్ధం.

సంజయ ఉవాచ ।

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।

సంజయుడు ఈ విధంగా చెప్పాడు. యుద్ధానికి సన్నద్ధమై, వ్యూహరచనతో సిద్ధంగా ఉన్న పాండు సైన్యాన్ని చూసిన దుర్యోధనుడు, ద్రోణాచార్యులను సమీపించి ఇట్లా అన్నాడు.. అని, చెప్పసాగాడు.

ధృతరాష్ట్రుడు పుట్టుకతో గృడ్డివాడైనా, అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది. కానీ, అతడి అతి ప్రేమ వలన, అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన, ఎక్కడ తన కొడుకులు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతర్యం తెలుసుగనుక, ఆయనకు ఊరట కలిగిస్తూ.. పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు, గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేననుజూసి లోన భయపడిన రారాజు, అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు.

తదుపరి వీడియోలో దుర్యోధనుడూ, ద్రోణాచార్యుల వారి సంభాషణ గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురం!

Link: https://www.youtube.com/post/Ugw7Rd_qtvKnfAEmqrp4AaABCQ

12 April, 2021

అన్ని సమస్యలకూ పరిష్కారం ‘శ్రీ మద్ భగవద్గీత’! Bhagavad Gita

  

అన్ని సమస్యలకూ పరిష్కారం ‘శ్రీ మద్ భగవద్గీత’!

ఓం యత్ర యోగీశ్వరః కృష్ణో యత్రపార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిర్ధృవానీ తిర్మతిర్మమ..
పార్ధాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయమ్
వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్ |
అద్వైతామృత వర్షిణీమ్ భగవతీమ్ అష్టాదశాధ్యాయినీమ్
అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్ ||

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C4pz2fzWz-8 ]

ఈ శ్లోకం, భగవద్గీతలోని అంతరార్థాన్ని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు మానవాళికి అందించిన అద్భుత బహుమతి, భగవద్గీత. మానవ జీవిత గమనానికి అవసరమైన అన్ని కోణాలనూ స్పృశించి, ప్రతీ సమస్యకూ పరిష్కారం చూపే గ్రంథ రాజమే, శ్రీమద్‌ భగవద్గీత. మన మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం, 25 వ అధ్యాయము మొదలు, 42 వ అధ్యాయము వరకూగల 18 అధ్యాయములను, భగవద్గీత అంటారు. భారతంలో భాగమైనా, భగవద్గీత ప్రత్యేక గ్రంథంగా భావింపబడుతూ, ప్రసిద్ధి చెందింది. భారతం, ద్వాపర యుగం నాటి ఇతి హాసంగా ఖ్యాతి గడించగా, అందులో భాగమైన భగవద్గీత, అన్ని గ్రంథాలకూ, మకుటాయమానంగా భాసిల్లుతోంది. అందుకు కారణం, ఈ 18 అధ్యాయాలలో, సాక్షాత్తూ కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం, ఇమిడి ఉండడమే. అందుకే, ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో, ముఖ్య స్థానం పొందింది. అటువంటి పవిత్ర గ్రంథమైన భగవద్గీత విశిష్ఠతనూ, దాని ప్రాముఖ్యతనూ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

భగవద్గీతను "గీత" అనీ, "గీతోపనిషత్తు" అని కూడా పిలుస్తారు. భగవద్గీత అంటే, "భగవంతుని వాక్కు" అని అర్థం. ఈ అమూల్యమైన భగవద్గీతను, మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు, శ్రీ కృష్ణ పరమాత్ముడు పార్థుడికి బోధించాడు. సిద్ధాంత గ్రంథమైన ఈ భగవద్గీతయందు, వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవంతుని తత్వమూ, ఆత్మ తత్వమూ, జీవన గమ్యమూ, గమ్యసాధనా, యోగముల గురించి, ఇందులో బోధింపబడివుంది. భగవద్గీత, ఉపనిషత్తుల సారమనీ, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకూ, పాపహరణకూ మార్గమనీ చెప్పబడుతోంది. కర్మ యోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అనే మూడు జీవనమార్గాలూ, భగవంతుని తత్వం, ఆత్మ స్వరూపం, ఇందులోని ముఖ్యాంశములు. అన్ని వేదాలలోని మంత్రాలనూ, వాటిలోని విషయ సమాహారాన్నీ కలిపి, ఏకాకారంలో, ఒకే గ్రంథంగా తీర్చబడినదే, భగవద్గీత. అంటే, ఒక దండలోని ముత్యాలను ఏర్చికూర్చినట్లుగా, వేదాలలోని సారాన్ని మిళితం చేసుకున్న గ్రంథం ఇది. భగవద్గీత, మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది.

దాయాదులైన కురు పాండవులు, రాజ్యాధికారం కోసం, యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునుడికి రథసారథి, శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులవారూ శంఖాలను పూరించారు. అర్జునుని కోరికపై, కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా, తన బంధువులూ, గురువులూ, స్నేహితులూ కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం, బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు, కర్తవ్యబోధ చేయమని, శ్రీకృష్ణుడిని అడిగాడు. అలా అర్జునునికీ, శ్రీకృష్ణునికీ మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. జగద్గురువు అర్జునుడికి అనుగ్రహించినటువంటి మహోపదేశమే గీత.

కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే సమస్యలకీ, సందిగ్థతకీ సమాధానంగా, భగవద్గీత ఈ నాటికీ, ఏ నాటికీ ప్రమాణంగా నిలుస్తుందనడంలో, సందేహం లేదు. అటువంటి మహత్తర గీతోపనిషత్తు గురించి, భీష్మ పర్వం 43 వ అధ్యాయం, 4వ శ్లోకంలో వివరించబడిన దాని ప్రకారం, గీతలో శ్రీ కృష్ణుడు 620 శ్లోకాలూ, అర్జునుడు 57 శ్లోకాలూ, సంజయుడు 67 శ్లోకాలూ, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే, మొత్తం 745 శ్లోకాలు. కానీ, ప్రస్తుతం వాడుకలో ఉన్న భగవద్గీత ప్రతిని బట్టి, కృష్ణుడు 574 శ్లోకాలూ, అర్జునుడు 84 శ్లోకాలూ, సంజయుడు 41 శ్లోకాలూ, ధృతరాష్ట్రుడు 1 శ్లోకం చెప్పారు. అంటే, మొత్తం 700 శ్లోకాలు. మరి కొన్ని ప్రతులలో, 13 వ అధ్యాయం ‘క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగం’ మొదట్లో, అర్జునుడు అడిగినట్లుగా ‘ప్రకృతిం పురుషం చైవ..’ అని, ఒక ప్రశ్న ఉంది. దానిని కూడా కలుపుకున్నట్లయితే, మొత్తం 701 శ్లోకాలవుతాయి. మిగిలిన 44 శ్లోకాల గురించిన పరిశోధన, నేటికీ కొనసాగుతూనే ఉంది. స్వయానా భగవానుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. ఒకనాడు భూదేవి, విష్ణుమూర్తితో, ‘స్వామీ, ప్రారబ్ధమనుభవించే వారికి, అంచచలమైన భక్తి ఎలా కలుగుతుంది?’ అని ప్రశ్నించింది. అందుకు భగవానుడు,

మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతిచేత్, 
క్వచిత్స్పర్శం న కుర్వంతి నళీనీదళ మంభసా 
గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్రవై.
సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే.

అని వివరించాడు. అంటే, తామరాకుకి నీరు అంటనట్లుగా, గీతాధ్యానముచేయు వారికి, మహాపాపములు కొంచెమైననూ అంటుకోవు. ఎక్కడ భగవద్గీత గ్రంథముంటుందో, ఎక్కడ గీతా పారాయణ మొనర్చబడుతుంటుందో, అక్కడ ప్రయాగ మొదలగు సమస్తతీర్థములుంటాయి. ఏ చోట గీతాపారాయణం జరుగుతుందో, అక్కడికి సమస్త దేవతలూ, ఋషులూ, యోగులూ, నాగులూ, గోపాలురూ, భగవత్పార్శ్వర్తులూ, నారద, ఉద్ధవాదులూ వచ్చి, శీఘ్రముగా సహాయమొనరుస్తారు. అని సాక్ష్యాత్తూ విష్ణు భగవానుడు, భూదేవికి సెలవిచ్చాడు. ఈ భగవద్గీతలో మొత్తం, 18 అధ్యాయాలున్నాయి. ఒకొక్క అధ్యాయాన్నీ, ఒకొక్క "యోగము" అని అంటారు. వీటిలో 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కలిపి, "కర్మషట్కము" అనీ, 7 నుండి 12 వరకూ గల అధ్యాయాలను, "భక్తి షట్కము" అనీ, 13 నుండి 18 వరకూ గల అధ్యాయాలను, "జ్ఞాన షట్కము" అనీ అంటారు.

ఇంతటి మహత్తర భగవద్గీతను, ప్రతీ ఒక్కరూ పఠించడం, కొంతవరకు అసాధ్యమే. దీనిని చదవలేని వారూ, చదవడానికి వీలుకుదరని వారి కోసం, భగవద్గీతలోని శ్లోకం, తాత్పర్య సహితంగా, మన Maheedhar's planet leaf channelలో భాగాలుగా అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఆదిశంకరాచార్యులు విరచించిన, శ్రీ మద్భగవద్గీత శంకర భాష్య పారాయణం, ఏప్రిల్ 13, ప్లవ నామ సంవత్సరాది ఉగాది నుండీ, ప్రతి మంగళవారం నాడు అందించబోతున్నాం. మా ఈ ప్రయత్నాన్ని మీరు స్వాగతిస్తారనీ, మీ ఆశీస్సులతోపాటు, తోడ్పాటునీ అందిస్తారనీ ఆశిస్తున్నాం. సర్వేజనాః సుఖినోభవంతు!

22 November, 2020

భగవద్గీత ప్రకారం మరణించిన వారి ఆత్మకు గమ్యాన్ని తెలిపే లక్షణాలు!



తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి వచ్చేటప్పుడు, ప్రాణం ఎలా వస్తుందో తెలియదు. మన దేహాన్ని వదిలి, ఆత్మ ఎలా వెళుతుందో తెలియదు. ఈ లోకంలో మనిషి జీవితం తాత్కాలికం, అశాశ్వతం. పుట్టడం, పెరగడం, పెళ్లీ, పిల్లలూ ఇలా వీటితో పాటే, మరణం కూడా మన జీవితంలో ఒక భాగం. పుట్టుట గిట్టుట కొరకే అయినా, మరణం అనే విషయం, ప్రతీ ఒక్కరిలో భయాన్ని పుట్టిస్తుంటుంది. ఒక మనిషి మనతో పాటే ఉంటూ, ఆకస్మాత్తుగా మాయమైపోతారు. ఆనాటి నుండీ, వారితో ఉండే మన బంధం తెగిపోతుంది. వస్తువు పాడైపోయినా, మన కళ్లముందే ఉంటుంది. శరీరాన్ని వదిలిన ఆత్మ ఏమవుతుంది? ఎక్కడకు వెళుతుంది? ప్రాణం ఆత్మ నుండి విడిపోయి ఏం చేస్తుంది? మన చివరి క్షణాల్లో, ప్రాణం పోయే ముందు కనిపించే లక్షణాల వల్ల, మనం స్వర్గానికి వెళతామో? నరకానికి వెళతామో తెలుస్తుందా? అనే విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nq9T9mD0Cng ]

ఒక వ్యక్తి మరణించే ముందు, తాను గడిపిన జీవితంలో చేసిన మంచీ చెడూ, కళ్లముందు కదలాడుతుంటాయి. మనిషి చనిపోయిన వెంటనే, ఆత్మ శరీరం నుండి వేరై, తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తుంటుంది. లోకాన్ని విడిచి వెళ్లే చివరి క్షణాల్లో, ఆ వ్యక్తిలో కనిపించే కొన్ని లక్షణాల వలన, వారు స్వర్గాన్ని పొందబోతున్నారో, నరకాన్ని పొందబోతున్నారో తెలుస్తుంది. శ్రీ కృష్ణుడు భగవద్గీతలో, మరణించిన వారికి సంబంధించిన కొన్ని విషయాలను వివరించాడు. మనిషి శరీరంలో, 9 ప్రధాన ద్వారాలుంటాయి. ఎవరైతే వారి జీవితంలో పుణ్యాలు, అంటే, సకారాత్మక క్రియలు చేస్తారో, వారి శరీరంలోని ఎగువ ద్వారాల నుంచి, ఆత్మ బయటకు వెళ్తుంది. శరీరం ఎగువ భాగంలో ఉన్న కళ్లూ, ముక్కూ, నోరూ, చెవుల గుండా, ఆత్మ బయటకు వస్తుంది. జీవితాంతం సద్గుణమైన పనులు చేసిన గొప్ప వ్యక్తుల ఆత్మలు, ఈ ఎగువ ద్వారాల గుండానే, బయటకు వెళ్తాయి. మరణించే సమయంలో, వారి ఆత్మ ముక్కు నుంచి బయటకు వస్తే, ముక్కు కొంచెం వక్రంగా మారుతుంది. 

కళ్ల నుంచి బయటకు వస్తే, చనిపోయే ముందు కళ్లు మూసుకోరు. చెవి నుంచి ఆత్మ బయటకు వస్తే, చెవి కొంచెం పైకి లాగినట్లు కనిపిస్తుంది. నోటి నుంచయితే, నోరు తెరుచుకుంటుంది. బ్రతికున్న రోజుల్లో ఎలాంటి పనులు చేసినా, మరణించే సమయంలో, వ్యక్తి సంతృప్తిగా, ముఖంలో సంతోషం ఉంటే, వారు తప్పక స్వర్గానికి వెళతారు. అదే విధంగా, వారి జీవితంలో పాపాలు చేసి, పాపాత్మకచర్యలకు పాల్పడిన వారి ముఖంలో, మరణ భయం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే, వ్యక్తి సంతృప్తిగా, సంతోషంగా చనిపోయినట్లయితే, అలాంటి వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. పాప కార్యాలు చేసి, మరణభయంతో చనిపోయిన వారు, నరకానికి వెళ్తారు. గరుడపురాణం, కఠోపనిషత్తుల ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారి ప్రాణాలను తీసుకుపోవడానికి, యమదూతలూ, దేవ దూతలూ వస్తారు. 

పాప కార్యాలు చేసిన వ్యక్తి ఆత్మను తీసుకుపోవడానికి, యమదూతలు వస్తారు. వారిని చూసిన భయంతో, ఆత్మ, శరీరం దిగువ భాగానికి చేరుకుంటుంది. ఆ భయం కారణంగానే, కొంతమంది చనిపోయే ముందు, మల, మూత్రాలు విసర్జిస్తారు. ఈ విధంగా జరగడం మంచిది కాదు. మరణించే సమయంలో ఎవరైతే మల, మూత్రాలను కోల్పోతారో, వారు నరకానికి వెళ్తారు. వ్యక్తుల ఆఖరు క్షణాల్లో, వారి కళ్లు మూసుకుపోవడం, లేదా ఏమీ కనిపించకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సమయంలో, వారికి నలుపురంగు దుస్తుల్లో వచ్చిన యమదూతలు మినహా, మరేమి కనిపించవు. అయితే, సత్పురుషులకూ, జీవితంలో మంచి పనులు ఎక్కువగా చేసినవారికీ, ఈ విధంగా జరగదు. వీరికి చివరి క్షణాల్లో, పసుపు రంగు దుస్తుల్లో ఉన్న దేవ దూతలు కనిపిస్తారు. ఆ దేవదూతలే, వీరిని స్వర్గానికి తీసుకుని వెళ్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం, మనిషి మరణించే సమయంలో, వారికి తులసి నీళ్లో, గంగాజలామో నోటిలో పోస్తారు.

అలాంటి వారు, ఎంతో అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే, తులసీ, గంగాజలం, ఎంతో పవిత్రమైనవి. చాలా మందికి, వారు మరణించే చివరిక్షణాల్లో, ఇవి అందుబాటులో ఉండవు. మరణించే ఆఖరు క్షణాల్లో, తులసి లేదా గంగాజలం నోట్లో పోస్తే, వారు స్వర్గానికి పయనిస్తారు. ఎవరైనా ఇంట్లో మరణిస్తే, వారి ఆత్మ ఆ ఇంట్లోనే ఉంటుందని భావిస్తుంటారు. అయితే, తీరని కోరికలతో, అర్థాంతరంగా వారి జీవితాన్ని మధ్యలోనే ముగించిన వారి విషయంలో, ఇలాంటివి జరిగే అవకాశాలుంటాయి. అంతేకానీ, ముదిమి వయస్సులో చనిపోయిన వారూ, జీవితాన్ని సంపూర్తిగా అనుభవించిన వారి విషయాలలో, ఇలాంటివి జరుగవు. వారు తమ జీవితాలను సంపూర్ణం చేసుకుని, ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా, మరు జన్మకు సిద్ధమవుతుంటారు. శరీరం నుండి వేరుపడిన ఆత్మ, తిరిగి మరోక శరీరంతో, మరో జీవితంలోకి అడుగుపెట్టే వరకూ ఏం చేస్తుంటుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే మా ‘మరణం తర్వాత ఏం జరుగుతుంది?’ అనే వీడియోను చూడండి. వీడియో లింక్, క్రింద పొందుపరిచాను. అది కనిపించని వారు కామెంట్ చేస్తే, రిప్లైలో లింక్ పంపిస్తాను.. 

[ Link: మరణం తర్వాత ఏం జరుగుతుంది? - https://www.youtube.com/watch?v=lOH5s... ]

ధర్మో రక్షతి రక్షితః!