Ads

26 September, 2022

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?

 

మాంసాహారం మంచిదేనా? ధర్మరాజుతో భీష్ముడేం చెప్పాడు?
కీటక వేదవ్యాసుల సంవాదాన్ని ధర్మరాజుకు తెలియజేసిన భీష్ముడు!

అంపశయ్యపై ఉన్న భీష్ముడు, ధర్మరాజుకు అనేక ఉపదేశాలు చేశాడు. అయితే, ఒకనాడు భీష్ముడిని చూడడానికి వచ్చిన బృహస్పతిని, ధర్మరాజు ఒక ప్రశ్న వేశాడు. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు.. ఈ ఆరింటిలో ఏది అత్యుత్తమమయినదని అడిగాడు. అందుకు బృహస్పతి, ఆ ఆరూ గొప్పవే కానీ, అందులో అహింస అత్యుత్తమమని చెప్పి, భీష్ముడి దగ్గర సెలవు తీసుకుని, దేవలోకానికి వెళ్ళిపోయాడు. నిజంగానే అహింస అన్నింటికన్నా గొప్పదా? మరి అహింసకు సంబంధించి, భీష్ముడు చెప్పిన సత్యం ఏంటి? అహింస కారణంగా, కురుక్షేత్రంలో మరణించిన వారు ఎటువంటి లోకాలను పొందారు? అనేటటువంటి జీవిత సత్యాలను ఎరుకపరచే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Piy6yV5J-9M ]

బృహస్పతి సమాధానం విన్న ధర్మరాజు, అహింస గురించి మరింతగా తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు భీష్ముడితో, "పితామహా! మునీశ్వరులంతా ముక్తకంఠంతో, అహింస చాలా ఉత్తమమని అంటున్నారు. అది ఎందుకంత గొప్పది?" అని అడిగాడు. అందుకు భీష్ముడు, "మనో వాక్కాయ కర్మలతో హింస, మాంసభక్షణం అనేవి చతుర్విధ ఘోర పాపాలు. మాంసభక్షణం మహాపాపంతో సమానం. అయితే, మాంసం రుచి మరిగిన వారు, దానిని ఎన్నటికీ విడిచిపెట్టరు. అందుకే, మాంసభక్షణను విడిచి పెట్టడమే అహింసగా", ఆర్యులు విశ్వసించారని తెలియజేశాడు.  అందుకు వెంటనే ధర్మరాజు తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. "పితామహా! మాంసం పితృదేవతలకు అత్యంత ఇష్టమనీ, పైతృక క్రియను మాంసంతోనే నిర్వర్తించాలనీ పెద్దలంటారు. అలాంటప్పుడు, జంతువధ తప్పనిసరి కదా?" అని అడిగాడు. అయితే, సమాధానం తెలియజేయడానికి ముందు భీష్ముడు చిన్న చిరునవ్వి నవ్వి, "ధర్మరాజా! మాంసభక్షణను మానుకోవడం, అశ్వమేధయాగం కన్నా గొప్పది. వధించమని చెప్పడం, వధా... ఈ రెండూ మహాపాపాలు. అయితే, పితృకార్యాలలోనూ, యజ్ఞయాగాదులలోనూ, వేదం చెప్పినట్టుగా చేయడంతో, ఆ హింస వల్ల పాపం ఎంతమాత్రం అంటుకోదు. అయితే, మాంసం మీద మోజుతో, కావాలని ప్రాణుల్ని హింసిస్తే, అది మహాపాపం. తనను నమిలి మింగిన వాణ్ణి, మాంసం నమిలి మింగడం ఎప్పటికయినా జరిగి తీరుతుంది. మాంసం మహారుచిగా ఉంటుంది. అందుకే, దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని కాదనుకుని, మాంసాన్ని విసర్జించినవాడు, దేవతలతో సరిసమానుడని పెద్దల ఉవాచ.

రాళ్ళల్లోనూ, చెట్లలోనూ, మాంసం లభించదు. లభించేది ప్రాణుల వల్లనే! ప్రాణులను కత్తికో కండగా నరుకుతున్నప్పుడు, తన శరీరం కూడా అటువంటిదేనని మనిషి అనుకున్న పక్షంలో, అతను అందుకు మళ్ళీ పూనుకోడు. మాంస భోజనాన్ని విడిచిపెడితే, అతనిలోని హింసా ప్రవృత్తి దానంతటదే పోతుంది. మాంసాహారాన్ని మానుకుంటే, ఆయురారోగ్యాలు పెరుగుతాయని, మార్కండేయాది మహర్షులు చెప్పారు. మాంసాహారం మానుకున్న కారణంగానే, దేవతలు రాక్షసులను అవలీలగా గెలువగలిగారు. దానం, ధర్మం, యజ్ఞయాగాదులన్నీ, అహింస ముందు దిగదుడుపే. నూరు సంవత్సరాలు చేసిన తపశ్చర్యా, మాంసాహారాన్ని మానుకోవడం, రెండూ ఒక్కటే అంటారు పెద్దలు. తపస్సు, దాన ధర్మాలతో, బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ, మాంసాన్ని ముట్టని వారికి, బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుంది. కనీసం ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజాలలో మాంసాన్ని ముట్టని వారికి, ఆయురారోగ్య బలకీర్తులు, అనాయాసంగా లభిస్తాయని పెద్దలంటారు." అని, మాంసాహారానికి సంబంధించిన విషయాలను భీష్ముడు వివరించగా, అందుకు ధర్మరాజు, "పితామహా! మాంసాన్ని విసర్జించడంలో ఇంత గొప్పదనం ఉంది కదా, మరెందుకు మనుషులు మాంసాన్ని విసర్జించరు?" అని ప్రశ్నించాడు.

అప్పుడు భీష్ముడు, "ఎందుకు విసర్జించరంటే, అది మహారుచి. పైగా, దానిని తిన్నవారు, శృంగారంలో బలిమి కలిగి ఉంటారు. ఎంత దూరం నడిచినా, వారికి అలుపు రాదు. శరీరం మీది గాయాలు మానిపోతాయి. బక్కచిక్కిన వాడికి, మాంసభక్షణ పుష్టి కలిగిస్తుంది. అందుకే దానిని వదలరు. అయితే ఒక్క విషయం, ప్రాణభయం, జీవాలకన్నింటికీ ఒకటే! అందుకే, తోటి ప్రాణుల్ని దయగా చూడమంటారు. అలా చూసిన వాడు, బ్రహ్మలోకాన్ని సులువుగా అందుకుంటున్నాడు. దానం, తపస్సు, సత్యం, యజ్ఞం, శౌచం, మంత్ర తంత్రాలూ.. ఇవన్నీ అహింసా స్వరూపాలు." అని చెప్పి, భీష్ముడు ముగించాడు. అప్పుడు ధర్మరాజుకు, అహింస వలన కురుక్షేత్రంలో మరణించిన వారికి ఎలాంటి గతులు కలుగుతాయనే అనుమానం కలిగింది. ఆ విషయాన్ని భీష్ముడికి తెలియజేయగా, భీష్ముడు జనన మరణాలకు సంబంధించిన కీటక వేదవ్యాసుల మధ్య జరిగిన సంవాదాన్ని, ధర్మరాజుకి తెలియజేశాడు..

రణరంగంలో రథాలు పరుగుదీస్తున్నాయి. అయితే, వాటికన్నా వేగంగా ఓ కీటకం పరుగుదీస్తూ, రథాలను దాటిపోతోంది. వేదవ్యాసుడు దానిని గమనించి, ఆ కీటకాన్ని ప్రశ్నించాడు.. "ఎందుకంత వేగం? ఏమిటి కారణం?" అని. అందుకు కీటకం కాస్త ఆగి, "ఏం చెప్పమంటావు మునీంద్రా! ఒకదాని వెనుక ఒకటిగా, రథాలు వస్తున్నాయి. రథ చక్రాల ధ్వని మారుమ్రోగుతున్నది. గుర్రాలను అదిలిస్తున్న వారి గొంతులు, మహా భీకరంగా వినవస్తున్నాయి. భయం వేస్తోంది. బ్రతుకంటే ప్రాణికి మహాసుఖం. చావంటే చెప్పలేనంత దుఃఖం. ఆ దుఃఖాన్ని తట్టుకోలేను. చనిపోవడం ఇష్టం లేదు. అందుకే విపరీతమైన వేగంతో పరుగుదీస్తున్నాను. ప్రాణభీతి కన్నా, పరమ ఆందోళనకరం ఇంకేముంది?" అని వేద వ్యాసుడి దగ్గర వాపోయింది. "నీలాంటి జీవులకూ ఇంద్రియ సుఖం ఉంటుందా? ఉన్నా అది ఏ మాత్రం? ఎప్పుడూ దుఃఖంతో ఉండే నువ్వు, బతికి ప్రయోజనం ఏముంది? చనిపోవడమే సుఖం కదా? బాగా ఆలోచించు.. నీకే అన్నీ తెలుస్తాయి." అని బోధించాడు వ్యాసుడు. అప్పుడు ఆ కీటకం, "అదేమిటి మౌనీ, అంతమాటన్నావు? పురుగులకు ఇంద్రియ సుఖం లేదన్నట్టుగా మాట్లాడతావేమిటి? మాకూ మా స్థాయిని బట్టి, ఇంద్రియ సుఖాలు ఉన్నాయి. వాటిని మేము అనుభవిస్తున్నాము. కాబట్టే, చావంటే భయపడుతున్నాను. నీకీ సంగతి తెలియక కాదు. నా చేత చెప్పించాలని అడిగావు. అంతేనా?" అంది కీటకం. అందుకు వ్యాసుడు నవ్వగా, "మహామౌనీ, నీకెందుకో నా పూర్వజన్మ వృత్తాంతం చెప్పాలని ఉంది. చెబుతాను, వింటావా?" అని అడిగింది. అందుకు వ్యాసుడు సరేనన్నాడు. 

అప్పుడు కీటకం, ‘ఓ మహాముని, గత జన్మలో నేను బాగా డబ్బున్న వాణ్ణి. అయినా, ఇంకా సంపాదించాలనే అత్యాశతో, ఇతరుల డబ్బు కూడా కాజేశాను. కోప తాపాలతోనూ, పెద్దల పట్లా, ప్రముఖల పట్లా వినయాన్ని ప్రదర్శించక, యథేచ్ఛగా తిరిగాను. అయితే, నా తల్లి పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండేవాణ్ణి. ఆమెను కంటికి రెప్పలా కాపాడేవాణ్ణి. ప్రేమగా చూసేవాణ్ణి. ఒకనాడు, ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చాడు. అతను అడిగినవన్నీ సమకూర్చి పెట్టి, దణ్ణం పెట్టాను. ఆ కారణంగానే, నాకీ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మంచి చేస్తే మంచే జరుగుతుందని, నాకప్పుడు తెలిసింది. మహామౌనీ, అడుగుతున్నానని ఏమీ అనుకోక పోతే, పుణ్యకృత్యాల ఆచరణ విశేషాలు చెప్పండి. ఈ జన్మకి ఇంతకన్నా గొప్పది లేదని నాకు అనిపిస్తోంది. చెప్పండి స్వామీ" అని అడిగింది కీటకం. అందుకు వ్యాసుడు, "ప్రత్యేకించి నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. పాపాలు చేశావు, పురుగుగా జన్మించావు. ఆ సంగతి నీకూ తెలుసు. అలాగే పుణ్యం చేసి, పూర్వజన్మ జ్ఞానం సంపాదించావు. ఇదీ నీకు తెలిసిందే! నీ గురించి ఇదంతా తెలిసినందువల్లే, నేను నీతో మాట్లాడాలనిపించి, మాట్లాడాను. ఇకపోతే, నా తపశ్శక్తితో నీ కీటకత్వాన్ని తొలగిస్తాను. బాధపడకు. తపోబలాన్ని మించింది లేదు. మానవజన్మ స్వీకరించి, పుణ్యం చెయ్యి. అది నీకెంతో శుభప్రదం. పాప పుణ్యాల వల్లనే, మనిషికి గొప్ప జన్మలూ, అధమాధమ జన్మలూ ప్రాప్తిస్తున్నాయి. నువ్వు చేసిన పుణ్యం కారణంగానే, నీకు పూర్వజన్మ జ్ఞానంతో పాటు, నన్ను కూడా కలుసుకోగలిగే అదృష్టాన్ని సాధించావు. నీకిక సమున్నత స్థితి లభిస్తుంది. త్వరలోనే మానవజన్మను సాధిస్తావు. మానవజన్మలో కూడా, నీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. దాంతో నీకు ధర్మతత్పరత అలవడుతుంది." అని చెప్పి, వెన్నెలంత చల్లగా, అమృతం కురుస్తున్నంత హాయిగా, ఆ కీటకాన్ని చూసి, "శుభం భూయాత్‌" అని ఆశీర్వదించాడు.

వెంటనే వ్యాసుని పాదాలను తాకి అతనికి ప్రణమిల్లి, అక్కడే ప్రాణత్యాగం చేసిందా కీటకం. వ్యాసమహర్షి ఆశీస్సులకనుగుణంగా, మరణానంతరం మానవునిగా అనేక జాతులలో జన్మించింది, ఆ కీటకం. పుణ్యకర్మలు ఆచరించి, చివరికి క్షత్రియవంశంలో వర్ధిల్లింది. రాజయింది. రాజయి, ఏనుగుపై కూర్చుని, వేలకొలదీ కొమ్ముటేనుగులతో, ఛత్రచామరాలతో, రకరకాల కేతనాలతో పరుగులుదీసే పరివారంతో, వ్యాసమహర్షిని మళ్ళీ సందర్శించింది. అతని పాదాలకు నమస్కరించి నిల్చుంది. రాజు అణకువను ఎంతగానో మెచ్చుకున్నాడు, వ్యాసుడు. అభిమానంగా అక్కున చేర్చుకుని, "రాజా! ఈ జన్మలో మునీంద్రులకే ఆశ్చర్యం కలిగించే మహనీయ తపశ్చర్యకు ఉపక్రమించు. తర్వాత గోవుల కోసంగానీ, బ్రాహ్మణుల కోసంగానీ యుద్ధం చేసి, యుద్ధభూమిలో మరణిస్తే, పై జన్మలో బ్రాహ్మణత్వం సాధిస్తావు." అని అన్నాడు. అలా మహర్షి చెప్పినట్టుగానే చేశాడు, ఆ రాజు.

బ్రాహ్మణునిగా జన్మించాడు. పుణ్యక్షేత్రాలెన్నో సందర్శించాడు. యజ్ఞయాగాలెన్నో చేశాడు. యూప స్తంభావళిని నెలకొల్పాడు. లోకారాధ్యుడయ్యాడు. మరణించి స్వర్గలోకంలో దేవేంద్రునికి మిత్రుడయ్యాడు. కొన్నాళ్ళకు కైవల్యాన్ని అందుకున్నాడు. అని ఆ కీటకం గురించి చెప్పి, ‘ధర్మరాజా! యుద్ధంలో మరణించిన బంధువులు ఏమయ్యారోనని ఆందోళన చెందుతున్నావు. ఏ లోకాలు ప్రాప్తించాయోనని తెలుసుకోవాలనుకుంటున్నావు. అసలు సంగతి చెబుతున్నాను, విను. కురుక్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన వారందరూ, ఉత్తమలోకాలనే పొందారు. ఈ విషయమై నీకిక ఆందోళన అనవసరం.’ అని తెలియజేశాడు భీష్ముడు.

కృష్ణం వందే జగద్గురుం!

21 September, 2022

ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము! Bhagavad Gita


ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చుగానీ భగవంతుడి మహిమలను గణించలేము!

'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (16 – 21 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 16 నుండి 21 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ssKwn-s-CpY ]

భగవంతుడిని ఎలా తెలుసుకోగలరో, మరియు ఆయనను ఎలా స్మరిస్తూ ఉండాలో, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

00:45 - వక్తుమర్హస్యశేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః ।
యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ।। 16 ।।

00:55 - కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ ।
కేషు కేషు చ భావేషు చింత్యోఽసి భగవన్మయా ।। 17 ।।

నీవు సమస్త జగత్తుల యందూ వ్యాపించి, వాటి యందు వసించి ఉండే నీ దివ్య విభూతులను దయచేసి నాకు వివరించుము. ఓ యోగీశ్వరా, నేను మిమ్ము ఎలా తెలుసుకోగలను, మరియు ఎలా స్మరిస్తూ ఉండేను, అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఏ ఏ స్వరూపాలలో మిమ్ము చింతన చేయగలనో తెలియజేయండి భగవాన్!

ఇక్కడ యోగం అంటే, భగవంతుని దివ్యమైన శక్తి అయిన యోగమాయ. అలాగే, యోగి అంటే, యోగమాయ యొక్క యజమాని. శ్రీ కృష్ణుడు భగవానుడని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడి విభూతులు ఏ విధంగా ఈ జగత్తులో ప్రకటితమవుతాయో, ఇంకా చెప్పబడని వాటినీ, ఇప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. సమస్త జగత్తునూ నియంత్రించి, నిర్వహించే వాడిగా, శ్రీ కృష్ణుడి మహిమలనూ, మరియు అత్యున్నత స్థాయిని గురించీ వినాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఈ విధంగా ప్రాధేయపడుతున్నాడు.. "నాకు నిశ్చలమైన భక్తి ప్రసాదించబడటానికి, నీ దివ్య లీలలను తెలుసుకోగోరుతున్నాను. నీ కృప లేకుండా, నీ వ్యక్తిత్త్వం గురించి తెలుసుకోవటం అసాధ్యము. కాబట్టి, దయచేసి నా మీద కృపతో, నిన్ను అర్థంచేసుకోవడానికి, నీ యొక్క మహిమలను తెలియచేయుము." అని భగవానుడిని అడుగుతున్నాడు, అర్జునుడు.

02:18 - విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్ధన ।
భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మేఽమృతమ్ ।। 18 ।।

 ఓ జనార్ధనా! మరల విస్తారముగా నీ యొక్క దివ్య మహిమలనూ, మరియు అవతారములనూ చెప్పుము. నీ దివ్యామృతమును వింటూ ఉంటే, అది ఎన్నటికీ తనివితీరదు.

భగవంతుని మహిమలను వివరించే కథలు, ఆయనను ప్రేమించే వారికి అమృతము వంటివి. అమృతమయమైన శ్రీ కృష్ణుడి మాటలను, ఇప్పటివరకూ తన చెవులతో త్రాగుతున్నాడు అర్జునుడు. ఇక ఇప్పుడు, "ఇంకోసారి...! నీ దివ్యలీలలను వినాలనే నా దాహం ఇంకా తీరలేదు." అని అంటూ, భగవంతుడిని ఉత్సాహపరుస్తున్నాడు. దివ్యామృతము యొక్క స్వభావము ఇది. అది ఒకపక్క తృప్తి పరుస్తూనే ఉంటుంది, అదే సమయంలో ఇంకా ఇంకా కావాలనిపింపజేస్తుంది. నైమిశారణ్య ఋషులు, సూత మహాముని నుండి శ్రీమద్భాగవతం వింటున్నప్పుడు, ఇదే విషయాన్ని చెప్పారు: "శ్రీ కృష్ణుడి భక్తులైనవారికి, ఆయన దివ్య లీలలను ఎంత విన్నా సరిపోదు, విసుగనిపించదు. ఈ లీలామృతం ఎలాంటిదంటే, అది అనుభవించే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది." అని వివరించాడు.

03:28 - శ్రీ భగవానువాచ ।
హంత తే కథయిష్యామి దివ్యా హ్యత్మవిభూతయః ।
ప్రాధాన్యతః కురుశ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే ।। 19 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ కురు శ్రేష్ఠ.. ఇప్పుడు నా యొక్క దివ్య విభూతులను నీకు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకంటే, వాటి వివరణకి అంతమే లేదు.

భగవంతుని శక్తులూ, మరియు ఐశ్వర్యములూ అనంతమైనవి. నిజానికి ఆయన గురించి ఉన్నవన్నీ అనంతములే. ఆయనకు అనంతమైన రూపములున్నవి. అనంతమైన నామములూ, అనంతమైన ధామములూ, అనంతమైన అవతారములూ, అనంతములైన లీలలూ, అసంఖ్యాకమైన భక్తులూ, ఇలా ఎన్నెన్నో. కాబట్టి, వేదములు ఆయనను అనంతుడు అంటాయి. "భగవంతుడు అనంతుడూ, మరియు అసంఖ్యాకమైన రూపములలో ఈ విశ్వములో ప్రకటితమౌతాడు. ఆయనే ఈ విశ్వమును నిర్వహించేదయినా, ఆయన అకర్త." అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు తెలియజేస్తుంది. "భగవంతుడు అనంతుడు, మరియు ఆయన తన అనంతమైన అవతారాలలో చేసే లీలలు కూడా, అనంతములు." అని రామాయణంలో వివరించబడి ఉంది. "భగవంతుని మహిమలను లెక్కించగలమని అనుకునే వారు, అల్ప బుద్ధులు. ఈ భూమిపై ఉన్న ధూళి రేణువులను లెక్కపెట్టవచ్చు కానీ, భగవంతుని యొక్క అనంతమైన మహిమలను గణించలేము." అని వేద వ్యాస మహర్షి దృఢంగా ప్రకటించాడు. కాబట్టి, శ్రీ కృష్ణుడు ఇక్కడ, తన విభూతులలోని అతికొద్ది భాగాన్ని మాత్రమే వివరించబోతున్నానని అంటున్నాడు.

05:01 - అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః ।
అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ ।। 20 ।।

ఓ అర్జునా, నేను సర్వ భూతముల హృదయములలో కూర్చుని ఉన్నాను. నేనే సర్వ ప్రాణుల ఆది, మధ్యము మరియు అంత్యము.

శ్రీ కృష్ణుడు, తానేమీ జీవుడికి అంత దూరంగా, వేరుగా లేనని అంటున్నాడు. నిజానికి అతి దగ్గర కంటే దగ్గరగా ఉన్నాడు. నిత్య శాశ్వత ఆత్మ, అన్ని ప్రాణుల హృదయ స్థానంలో స్థితమై ఉన్నది. "భగవంతుడు మన ఆత్మలయందు స్థితమై ఉన్నాడు." అని వేదములు పేర్కొంటున్నాయి. అందులో కూర్చుని, ఆ ఆత్మకు జీవశక్తి, మరియు నిత్యశాశ్వత గుణమునూ ప్రసాదిస్తాడు. ఆయన శక్తిని ఉపసంహరిస్తే, మన ఆత్మ కూడా జడమైపోతుంది, మరియు నశించిపోతుంది. ఈ ప్రకారంగా మనం జీవాత్మలము, మన స్వీయ శక్తి చేత నిత్యులము, మరియు చైతన్యవంతులము కాలేదు. పరమ చైతన్యవంతుడూ, మరియు సనాతనుడూ అయిన భగవంతుడు మనలోనే ఉండి, తన శక్తిని మనకు ప్రసాదించటం చేత, అలా ఉండగలుగుతున్నాము. కాబట్టి, శ్రీ కృష్ణుడు సమస్త ప్రాణుల హృదయములో తాను స్థితుడనై ఉన్నానని అంటున్నాడు. శ్రీ కృష్ణుడే, సమస్త జీవ భూతముల మొదలూ, మధ్యా, తుది. అవి ఆయన నుండే ఉద్బవించాయి. కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే జీవము అంతా, ఆయన శక్తి చేతనే సంరక్షింపబడి, కొనసాగింపబడుతున్నది. కాబట్టి, ఆయనే మధ్య. అలాగే, మోక్షము పొందిన వారు, ఆయన యొక్క దివ్య ధామమునకు వెళ్లి, ఆయన సన్నిధిలోనే, నిత్యశాశ్వతంగా నివసిస్తారు. అందుకే, భగవంతుడే అన్ని ప్రాణులకూ తుది.

06:41 - ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ ।
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశీ ।। 21 ।।

అదితి యొక్క పన్నెండుగురు పుత్రులలో, నేను విష్ణువును. ప్రకాశవంతమైన వస్తువులలో, నేను సూర్యుడను. మరుత్తులలో మరీచుడను, మరియు రాత్రి పూట, ఆకాశ నక్షత్రాలలో చంద్రుడను నేను.

పురాణాల ఆధారంగా మనం తెలుకునేదేమిటంటే, కశ్యప మహామునికి ఇద్దరు భార్యలు. అదితి మరియు దితి. తన మొదటి భార్య అదితి ద్వారా, ఆయనకు పన్నెండుగురు దేవతలు జన్మించారు. వారే - ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట మరియు వామన అనే వారు. వీరిలో వామనుడు, విష్ణు మూర్తి యొక్క అవతారము. ఈ విధంగా, ఆదిత్యులలో విష్ణువుగా, వామన స్వరూపంలో తన వైభవాన్ని ప్రకటిస్తున్నానని, కృష్ణుడు పేర్కొంటున్నాడు. అలాగే, ప్రకాశవంతమైన వాటిలో, సూర్యుడు సర్వోన్నతుడు. రాత్రి పూట అన్ని దీపాలూ, ఆకాశంలోని సమస్త నక్షత్రాలతో కూడి, చంద్రుడు కూడా ఉన్నా - అవన్నీ రాత్రి యొక్క చీకటిని తొలగించటానికి సరిపోవు. కానీ, సూర్యుడు ఉదయించిన మరుక్షణం, రాత్రి చీకటి తొలగిపోతుంది. సూర్యుని శక్తి అలాంటిది. అది తన విభూతి అని, శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. తదుపరి ఆయన రాత్రిపూట ఆకాశం గురించి చెప్తున్నాడు. ఒక ప్రఖ్యాత నానుడి ఉంది, "వెయ్యి నక్షత్రాల కన్నా ఒక్క చంద్రుడు మేలు" అని. రాత్రి పూట ఆకాశంలో ఉన్న నక్షత్రాలూ, తారాగణములలో తానే చంద్రుడను అంటున్నాడు శ్రీ కృష్ణుడు. అయితే, కశ్యపుడు తన రెండవ భార్య అయిన దితి ద్వారా, దైత్యులకు, అంటే, అసురులుకు తండ్రి అయ్యాడు. కానీ, దైత్యుల తరువాత కూడా, దితి తనకు ఇంద్రుడి కన్నా శక్తిశాలి అయిన ఇంకొక పుత్రుడిని కోరింది. తన బిడ్డను గర్భంలోనే ఒక సంవత్సర కాలం ఉంచుకుంది. ఇంద్రుడు ఒక వజ్రాయుధంతో, ఆ పిండమును ఎన్నో ముక్కలుగా చేశాడు. కానీ, అది భ్రూణములుగా మారింది. ఇవి మరుత్తులైనాయి. అంటే, ఎంతో ప్రయోజనము చేసే ఈ విశ్వంలో ప్రసరించే 49 రకాల వాయువులు. వీటిలో ప్రధానమైనవి, అవహము, ప్రవహము, నివహము, పుర్వహము, ఉద్వహము, సంవహము మరియు పరివహము. వీటిలో ముఖ్యమైన పరివహమునకు ఇంకో పేరు, మరీచి అని కూడా ఉంది. వాయువులలో తన విభూతి, మరీచి రూపంలో వ్యక్తమవుతున్నదని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

09:08 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు తన గురించీ, తన విభూతి గురించీ కొనసాగించిన అంశాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

19 September, 2022

ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం! Manmadha reincarnated as Pradyumna


ప్రద్యుమ్నుడిగా శ్రీకృష్ణుడికి జన్మించిన ‘మన్మథుడి’ వృత్తాంతం!

మన్మథుడు మనుష్యుల మనస్సుల్లో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని, జన్మతః కలిగినవాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుక, అతని వాహనం. తియ్యటి చెరుకుగడే అతని విల్లు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే, అతని బాణాలు... వాటితో అతను ఎవరి మనస్సులనైనా మధించి వేయగలడు. అలా మనస్సును మథించేవాడు కాబట్టి, ఆయనకు మన్మథుడని పేరు. లోక కల్యాణం కోసం మన్మథుడు శివునిపై తన బాణాన్ని ప్రయోగించగా, ఆ సంగతి తెలుసుకుని, తన త్రినేత్రంతో అతడిని బూడిదచేశాడనే సంగతికూడా తెలిసిందే.. అయితే, శ్రీ హరి కుమారుడైన మన్మథుడు, శివుడి చేతిలో ఎందుకు మరణించాడు? భర్తను కోల్పోయిన రతీ దేవికి, దేవతలిచ్చిన వరం ఏమిటి? రుక్మిణీ దేవి పుత్ర శోకానికీ, మన్మథుడికీ సంబంధం ఏంటి – వంటి చారిత్రక అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QT_irVokuaQ ]

సంతానం కోసం విష్ణుమూర్తి ఒకప్పుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుని వర ప్రభావంతో, విష్ణుమూర్తికి ఓ చక్కని కుమారుడు జన్మించాడు. అతనే మన్మథుడు. శంకరుని ప్రార్థించి, విష్ణుమూర్తి తనను ప్రార్థించలేదని, సతీదేవికి కోపం వచ్చింది. ఆ కోపంతో, శివుని అనుగ్రహంతో విష్ణుమూర్తికి జన్మించిన కుమారుడు, అదే శివుని ఆగ్రహంతో మరణిస్తాడని శపించింది. అప్పుడు విష్ణుమూర్తి సతీదేవిని ప్రార్థించాడు. మన్నించి శాపం తొలగించమన్నాడు. అప్పుడు సతీ దేవి, మరణించినప్పటికీ నీ కుమారుడు మరల జన్మిస్తాడని, విష్ణుమూర్తికి అభయం ఇచ్చింది. మన్మథుడు చూడ చక్కనివాడు. లోకంలోని అందం అంతా పోగయి, తీర్చిదిద్దినట్టుగా ఉంటాడతను. చిలుక వాహనంగా, చెరకుగడ విల్లుగా, అరవిందాది పుష్పాలు బాణాలుగాగలిగిన మన్మధుడికి, వసంతుడు చెలికాడు. మన్మథుని వామభాగం నుండి, ఓ కన్య జన్మించింది. ఆమె పేరు రతీదేవి. అయితే, కొన్ని ఆధారాల ప్రకారం, రతీ దేవి దక్ష ప్రజా పతి కుమార్తెగా కూడా చెప్పబడుతుంది. మన్మథుడు రతీ దేవిని భార్యగా స్వీకరించాడు. మన్మథకార్యం ఒక్కటే.. బ్రహ్మాదిదేవతలనేగాక, జితేంద్రియులయిన మహర్షులను కూడా మోహపెట్టి, వారిని కామాసక్తులను చేయడమే, తన కర్తవ్యం. తమను తారకాసురుడు హింసిస్తున్నప్పుడు, దేవతలంతా బ్రహ్మదేవుని సమీపించి, మొరపెట్టుకున్నారు. కాపాడమని వేడుకున్నారు. శివునికి పుట్టే కుమారుడు తప్ప, మరెవరూ తారకాసురుణ్ణి వధించలేరనీ, అంత వరకూ ఓర్పు వహించాలనీ అన్నాడు బ్రహ్మ. ఆ సమయంలో పరమనిష్ఠతో, శివుడు ఘోరతపస్సు చేస్తున్నాడు. ఆయనను వివాహం చేసుకోవాలని, హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి వేచి ఉన్నది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకున్నారు, దేవతలు. అందుకే మన్మథుణ్ణి ఆశ్రయించారు.

శివుని మనస్సు పార్వతిపై లగ్నమయ్యేటట్లుగా చేయమని, మన్మథుడిని ప్రార్థించారు. శివుని మీదకు పూలబాణాలు ప్రయోగించసాగాడు. ఆ బాణాలకు శివుని ఏకాగ్రత మళ్ళి, మనస్సు చెదిరింది. తననలా చేసింది ఎవరన్నట్టుగా, కోపంతో కళ్ళు తెరచి చూశాడు శివుడు. ఎదురుగా మన్మథుడు కనిపించాడు. రెట్టించిన కోపంతో, మూడవకన్ను తెరవడంతో, మన్మథుడు బూడిదయ్యాడు. భర్త బూడిదయిపోయాడని తెలిసి, రతీదేవి విలపించింది. అతని వియోగాన్ని తట్టుకోలేక రోదించింది. అప్పుడు దేవతలు, మరణించిన మన్మథుడు ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడని, తెలియజేశారు. ఆమెను ఓదార్చారు. కొన్నాళ్ళకు నారదుడు, రతీదేవిని సందర్శించాడు. రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడు పుడతాడనీ, అయితే, అతన్ని శంభరాసురుడు చంపేందుకు ప్రయత్నిస్తాడనీ, చెప్పాడు. తన భర్తను కాపాడుకునేందుకు రతీదేవి భూలోకానికి విచ్చేసింది. మాయావతి పేరుతో శంభరాసురుని ఇంట చేరి, అతడికి సేవలు చేయసాగింది. కొద్దిరోజులు గడవగా, ద్వారకలో రుక్మిణీదేవికి చక్కని కుమారుడు జన్మించాడు. అతడే ప్రద్యుమ్నుడు.

నాడు శివుని మూడవకంటికి బూడిదయిన మన్మథుడు, కృష్ణావతారంలో ఉన్న విష్ణుమూర్తికి కుమారుడయ్యాడు. ప్రద్యుమ్నుడు జన్మించి, వారం రోజులు కూడా గడవక ముందే, ఆపద ముంచుకొచ్చింది. జటాసురుని పుత్రుడైన శంభరాసురునికి, ప్రద్యుమ్నుని కారణంగా మరణం ఉన్నదని తెలిసింది. ఆ సంగతి ఆకాశవాణి చెప్పి, శంభరాసురుడిని హెచ్చరించింది. దాంతో శంభరాసురుడు, కాకిరూపంలో రుక్మిణి ఇంట ప్రవేశించి, ప్రద్యుమ్నుని ముక్కున కరచుకుని తీసుకుపోయి, సముద్రంలో పడవేశాడు. మాగన్నులో ఉన్న రుక్మిణి, పొత్తిళ్ళలో పిల్లాడు ఉన్నాడనుకున్నది. మెలకువ తెచ్చుకుని చూసే సరికి, పిల్లవాడు లేడు. రాజ్యమంతా ప్రద్యుమ్నుని కోసం వెదకసాగారు. కానీ, ఎవరికీ దొరకలేదు. కాకి రూపంలో వచ్చిన శంభరాసురుడు, ప్రద్యమ్నుణ్ణి సముద్రంలో పడవేయగా, ఒక చేప మింగి వేసింది. దైవవశాన ఒక జాలరి వలకు చిక్కింది. వలలో చిక్కిన చేపను చూసి ముచ్చటపడ్డాడు, జాలరి. దానిని కానుకగా, రాజైన శంభరాసురునికి బహూకరించాడు. వంటవారు ఆ చేపను కోసి చూడగా, దాని కడుపులో ఉన్న బాలుణ్ణి చూసి, ఆశ్చర్యపోయారు.

అక్కడున్న మాయావతికి పిల్లాడి సంగతి చెప్పి, ఏం చేద్దామని ప్రశ్నించారు. ఆలోచనలో పడింది మాయావతి. ఈ పిల్లాడు ఎవరయి ఉంటాడంటూ, తర్జనభర్జన పడసాగింది. అప్పుడు నారదుడు వచ్చాడక్కడికి. మాయావతిగా ఉన్న రతీదేవికి జరిగిన సంగతంతా వివరించాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, నీ భర్తే అని అన్నాడు. శంభరాసురుడు సముద్రంలో పడవేస్తే, చేప మింగిందన్నాడు. రతీదేవి సంతోషించి, ప్రద్యుమ్నుణ్ణి జాగ్రత్తగా పెంచసాగింది. ప్రద్యుమ్నుడు యువకుడయ్యాక, అతనికి పూర్వగాథంతా చెప్పింది, రతీదేవి. తారకాసురుని కారణంగా అప్పుడలా విడిపోయి, ఇప్పుడిలా కలుసుకున్నామని చెప్పింది, రతీ దేవి. శంభరుని వల్ల ప్రమాదం ఉన్నదని చెప్పి, అతనికి మహామాయావిద్యను ఉపదేశించింది. ఆమె చెప్పిన విద్యను సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్న ప్రద్యుమ్నుడు, శంభరాసురుణ్ణి యుద్ధానికి పిలిచాడు. ఇద్దరి మధ్యా ఘోరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శంభరాసురుడు, అనేక మాయలు ప్రయోగించాడు. ఆ మాయలన్నింటినీ తను నేర్చుకున్న మహామాయావిద్యతో, తుత్తునియలు చేశాడు ప్రద్యుమ్నుడు. చివరికి శంభరాసురుణ్ణి సంహరించాడు. రాక్షస సంహారానంతరం, భార్య రతీదేవితో సహా, ఆకాశానమార్గాన ద్వారకకు పయనమయ్యాడు ప్రద్యుమ్నుడు.

సరాసరి అంతఃపురంలో దిగిన ప్రద్యుమ్నుని చూసి, చెలికత్తెలు కృష్ణుడనే అనుకున్నారు. తర్వాత అతని పక్కన ఉన్న రతీదేవిని చూసి, కాదనుకున్నారు. ప్రద్యుమ్నుని చూసి రుక్మిణీదేవి, ఆనాడు తను కోల్పోయిన బిడ్డ పెరిగి పెద్దయితే ఇంతవాడయ్యేవాడు కదా! అని అనుకున్నది. పట్టి పట్టి ప్రద్యుమ్నునిలో పోలికలను వెదకసాగింది. అప్పుడక్కడికి నారదుడూ, దేవకీవసుదేవులతో సహా శ్రీకృష్ణుడు కూడా వచ్చారు. రుక్మిణికి జరిగిన కథంతా తెలియజేశాడు, నారదుడు. ఈ కుర్రవాడు నీ కొడుకే అని నారదుడు చెప్పడంతో, రుక్మిణీ దేవి ఎంతో ఆనందించింది. వెంటనే సతీసమేతంగా ప్రద్యుమ్నుడు, తల్లిదండ్రులకూ, పెద్దలకూ నమస్కరించాడు. వారి ఆశీర్వాదాలందుకున్నాడు. అయితే, ప్రద్యుమ్నుడు, మేనమామ రుక్మి కుమార్తె అయిన రుక్మావతిని కూడా వివాహం చేసుకున్నాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి మరీ, రుక్మావతిని సొంతం చేసుకున్నాడు. బావ – బావమరుదులుగా, రుక్మి, కృష్ణులకు శత్రుత్వం ఉన్నప్పటికీ, పిల్లల భవిష్యత్తు కోసం, తెగిన బంధుత్వాన్ని కలుపుకోవడం కోసం, రుక్మావతితో ప్రద్యుమ్నుని వివాహానికి ఇరువురూ అంగీకరించారు. రుక్మావతీ ప్రద్యుమ్నులకు, ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు అనిరుద్ధుడు. అతను తండ్రి తాతలు ఇరువురికీ, సరి సమానుడిగా ప్రసిద్ధిగాంచాడు.

కృష్ణం వందే జగద్గురుం!