Ads

07 January, 2022

'ప్రార్థన' - భగవంతుడితో సంభాషణ! How to Talk to God

 

'ప్రార్థన' - భగవంతుడితో సంభాషణ!

మనిషి ఈ ప్రపంచంలో సుఖంగా ఉండాలనుకోవడం, అందుకు తగ్గ వెసులుబాటుకోసం ప్రయత్నించడం, సహజం. ధనం ధర్మంగా సంపాదించుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవచ్చు. అంతులేని కోరికలు, గుర్రాల్లా పరుగులు తీస్తూనే ఉంటాయి. ధనం, ఇంధనంలా దహించుకుపోతూంటుంది. జీవితంలో ఈ విషయం, ప్రతి మనిషికీ, ఏదో ఒక రోజు తప్పనిసరిగా అర్థం అవుతుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dtTEMWXYWHs ]

అప్పుడు.. ఈ భౌతికమైన సుఖాలు కేవలం తాత్కాలికమేనన్న జ్ఞానం కలుగుతుంది. వీటికి మించిన శాశ్వతానందం ఎక్కడుందన్న జిజ్ఞాస, ఆ సమయంలో మొదలవుతుంది. గుండెలోతుల్లో నుంచి, గంగాజలంలా పైకి లేచిన ఆ ఆకాంక్ష, ఒక ఆర్తనాదమై, ఒక ఆవేదనా రూపమై, చెలరేగుతుంది. అదే 'ప్రార్థన!'. పూర్తి వివరణ తెలుసుకోవడానికి, ఈ వీడియోను చివరిదాకా చూడండి..

మన హృదయాన్ని దైవం ముందు ఆవిష్కరించుకోవడాన్ని, ప్రార్థన అన్నారు. అది ఏ గ్రంథం లోనిదైనా కావచ్చు. శ్లోకం కావచ్చు, పద్యం గానీ, పాట గానీ కావచ్చు. మాటలే లేని మౌన ధ్యానమూ కావచ్చు. భగవంతుడితో భక్తుడు జరిపే సంభాషణ, ప్రార్థన. ప్రార్థన మనిషి జీవితంలో, ఆలోచనల్లో భాగం. ప్రార్థన మన శ్వాస వంటిదే. కవులు తమ కావ్యారంభంలో, ఇష్టదేవతా ప్రార్థన చేస్తారు. తమ కావ్యాలకు యశస్సూ, పండితాదరణా కావాలని కోరుకుంటారు. కావ్యావతారికల్లో ఇష్టదైవాన్ని, తమ ప్రభువులకు విజయ పరంపర కలిగించమని ప్రార్థిస్తారు. రాజాశ్రయం కోరని పోతన, 'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్‌' అని అన్నాడు. అంటే, మోక్షం కోసం రాస్తున్నానని, విన్నవించుకున్నాడు. భక్త రామదాసు కీర్తనల్లో, ఆర్తి, ప్రేమ, కోరిక కనిపిస్తాయి. వీటిలోంచి విన్నపం పుడుతుంది. అదీ ప్రార్థనే. అధికారికి విన్నవించుకునేటప్పుడు, అతడి విశ్రాంతి సమయం చూసుకుని, మనోభావం, చిత్తవృత్తీ గ్రహించి మరీ వ్యవహరిస్తారు. అలాగే భగవంతుడికీ షోడశోపచారాలు చేసి, కొంతసేపు కీర్తిస్తారు. నీ సేవకుడినంటూ దాసోహం చేస్తారు.

కష్టాల్లో ఉన్నప్పుడూ, సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడూ, కొందరికి భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు కష్టాలు తొలగించమని, ప్రార్థిస్తారు. మొసలి వల్ల తన ప్రాణం పోవడం నిశ్చయం అనుకున్న గజేంద్రుడు, 'నా బలం నశించిపోతోంది. ధైర్యం తరిగిపోయింది. ప్రాణాలు పోతున్నాయి. వచ్చి రక్షించు!' అని శ్రీహరిని ప్రార్థించాడు. నిత్య జీవితంలో సంకటాలు ఎదురైనప్పుడూ, కోరికలు నెరవేరనప్పుడూ, ఏదైనా ఆశించినప్పుడూ, దైవాన్ని ప్రార్థించడం పరిపాటి. కానీ, ప్రార్థనను జీవితంలో భాగంగా చేసుకోవాలి.

రామకృష్ణ పరమహంస, ప్రతినిత్యం తాను భగవంతుడితో మాట్లాడుతున్నానని చెప్పేవారు. నరేంద్రుడు ఆయన దగ్గరకు వెళ్ళి, తన సమస్యలు చెప్పి, తన కష్టాలు తీరేలా జగన్మాతను ప్రార్థించమని అర్థించాడు. రామకృష్ణులు, 'నువ్వే ప్రార్థించు. అమ్మ నీ మొర ఆలకిస్తుంది' అని అన్నారు. నరేంద్రుడు ఆలయానికి వెళ్ళి, కళ్లు మూసుకుని దేవిని ప్రార్థిస్తుంటే, ఆ శక్తి స్వరూపిణి తన కళ్ల ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆ సమయంలో ఆయనకు తన కష్టాలూ, కన్నీళ్లూ గుర్తుకు రాలేదు. ఆ తల్లిని భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ప్రసాదించమని కోరుకున్నాడు. దేవి అంతర్ధానమయ్యాక, మళ్ళీ ప్రాపంచిక విషయాలు గుర్తుకు వచ్చాయి. తన కోరిక చెప్పుకోలేకపోయానని బాధపడ్డాడు. ఇలా మూడుసార్లు జరిగింది. సమస్యలూ, కష్టాలూ, సంక్షోభాలూ, అందరి జీవితాల్లోనూ ఉంటాయి. ఎవరికి వారే, వాటిని పరిష్కరించుకోవాలి. అందుకు అవసరమైన శక్తిని ఇవ్వమని మాత్రమే, భగవంతుని ప్రార్థించాలి.

ప్రార్థనలో హృదయశుద్దీ, భగవద్విశ్వాసం ముఖ్యం. నమ్మకం లేనప్పుడు, ప్రార్థన సాధ్యం కాదు. సర్వాంతర్యామి మనముందు నిలబడి, మనం చెప్పేది శ్రద్ధగా వింటున్నట్లు, నమ్మాలి. దైవాన్ని నిరాకారుడిగానూ, నిర్గుణుడిగా కూడా ప్రార్థించవచ్చు. దైవాన్నే గాక, త్రిమూర్త్యాత్మకుడైన సద్గురువునూ ప్రార్థించవచ్చు. ప్రార్థన వల్ల అజ్ఞానికి జ్ఞానం, పిరికివాడికి ధైర్యం, కష్టాల్లో ఉన్నవాడికి ఓదార్పూ లభిస్తాయి. ప్రార్థనవల్ల, మనలోని అహంకారం నశిస్తుంది, సాత్వికత పెంపొందుతుంది, ఆత్మబలం ఇనుమడిస్తుంది, మనసు ప్రక్షాళనమవుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, శాంతి సహనాలు వృద్ధి చెందుతాయి. ప్రార్థించే సాధకుడికి ప్రశాంత జీవనశైలి అవసరం. ప్రార్థన మన జీవన విధానంలో మార్పును తీసుకువస్తుంది. ప్రార్థించేవారికి, శరణాగతి ముఖ్యం. ధర్మవిరుద్ధమైన, న్యాయ ప్రతికూలమైన ప్రార్థనలు ఎన్నటికీ ఫలించవు. సాధకుడికి ధార్మిక వర్తనం ముఖ్యం. యోగ్యమైన ప్రార్థన, ఎన్నటికీ వ్యర్థం కాదు.

వ్యక్తిగత క్షేమం గురించి కాక, రుషులూ, మహనీయులూ, లోక కల్యాణం కోసం ప్రార్థించారు. సకల జనులకూ శుభం కలగాలనీ, అన్ని లోకాలూ క్షేమంగా ఉండాలనీ ప్రార్థించారు. సగుణారాధన విశ్వసించని బ్రహ్మసమాజం వంటి సంస్థల్లో, ప్రార్థనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మనమూ, నిర్భాగ్యుల కోసం, బలహీనుల కోసం ప్రార్థించాలి! పరుల సుఖాలనే మన సుఖమనీ, విశ్వశ్రేయస్సే మనకూ శ్రేయోదాయకమనీ, బుద్ధిగా జీవించాలనీ, త్రికరణ శుద్ధితో ఆ పరమాత్మకు చేసే విన్నపమే, 'ప్రార్థన!'.

భగవంతుడు మనిషికి అన్నీ ఇచ్చాడు. అయినా, ఏదో తెలియని ఆరాటం, గుండెల్లో ఆరడి చేస్తూనే ఉంటుంది. అందుకు కారణం, ఏదో ఒకమూల స్వార్థ పిశాచం పట్టి పీడిస్తూ ఉండడం వల్లే, అలా మనస్సు ఊగిసలాడుతూ ఉంటుంది. మనం చేయవలసినదేదో, శక్తివంచన లేకుండా, సక్రమంగా చేస్తే చాలు. తక్కినదంతా, ఆ పరమాత్ముడే చూసుకుంటాడు. ఆ మాట గీతాచార్యుడు చాలా స్పష్టంగానే వ్యక్తపరిచారు. అయినా, 'అజ్ఞానం, అహంకారం, మమకారం' అనే ఈ మూడూ ఏకమై, మనలను పెడదారికి ఈడుస్తూ ఉంటాయి. అలా జరగకుండా, మనస్సును నిర్మలంగా ఉంచమనీ, ప్రపంచాన్ని ప్రేమగా చూడగల హృదయ సౌందర్యాన్ని ప్రసాదించమనీ, పరోపకారం వైపు బుద్ధిని మరల్చమనీ, మాటలకందని మౌనభాషలో భగవంతుణ్ని వేడుకోవడమే, నిజమైన 'ప్రార్థన!'. ఆ ప్రార్థన సన్నని వెలుగై, మన జీవితాలను గమ్యంవైపు నడిపిస్తుంది. ‘సర్వేజనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు’ అనే ఒక గొప్ప ప్రార్థనను, వేదం ప్రపంచానికి అందించింది. అదే మన జీవితాలకో దారి దీపమై, వెలుగును చూపాలని అర్థించాలి. 'అందరూ బాగుండాలి.. అందులో మనమూ ఉండాలి' అనే భావనతో, జీవనం కొనసాగించాలి. అదే మనం చేయవలసిన 'ప్రార్థన'!

కృష్ణం వందే జగద్గురుం!

[ మంచిమాట వీడియోలు: https://www.youtube.com/playlist?list=PLNoNQLGbZ7gbq-DusM1YjHrgyBxuhCXRi ]

Link: https://www.youtube.com/post/UgkxzauIt-imaloF5GDQDjs2Nzrlf7N9uuXK

05 January, 2022

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం! Bhagavadgita

  

అనంత జన్మల అజ్ఞానం - గురువుద్వారా ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం!

'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (31 – 36 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 31 నుండి 36 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, శ్రీ కృష్ణుడిలా చెబుతున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/GT_2nUOrUyU ]

యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ ।
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ ।। 31 ।।

యజ్ఞము యొక్క రహస్యము తెలిసినవారు, దానిని ఆచరించి, అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి, పరమ సత్యము దిశగా పురొగమిస్తారు. ఓ కురు వంశ శ్రేష్టుడా, ఏ విధమైన యజ్ఞమూ చేయని వారు, ఈ లోకంలో గానీ, పరలోకంలో గానీ, ఎటువంటి సుఖమునూ పొందలేరు.

ఒక కార్యాన్ని భగవంతుని ప్రీతి కొరకు చెయ్యాలనే భావన కలిగి ఉండటమే, యజ్ఞము యొక్క రహస్యం. భక్తులు ఆహారాన్ని దేవునికి నివేదన చేసిన తరువాతనే, దాన్ని స్వీకరిస్తారు. ఆ నివేదన అనంతరం, పళ్ళెంలో ఉన్న శేషాన్ని, ఆయన ప్రసాదంగా తీసుకుంటారు. అటువంటి అమృతతుల్యమైన ప్రసాదం, మనలను జ్ఞానోదయం, పరిశుద్ధత, మరియు ఆధ్యాత్మిక పురోగతి దిశగా తీసుకెళ్తాయి. అదేవిధంగా, భక్తులు భగవంతునికి బట్టలు సమర్పించిన తరువాతే, వాటిని ఆయన ప్రసాదంలా తొడుక్కుంటారు. ఎప్పుడైతే వస్తువులు, లేదా పనులు, భగవంతునికి యజ్ఞంగా సమర్పిస్తారో, ఆ శేషం, అంటే ప్రసాదం, ఆత్మకి అమృతతుల్యమైన అనుగ్రహము వంటిది. అలా కాకుండా, యజ్ఞాన్ని ఆచరించని వారు, కర్మ-ఫల బంధాలలో చిక్కుకుని, మాయ పెట్టే యాతన అనుభవిస్తూనే ఉంటారు. వారు ఎప్పటికీ, సుఖ సంతోషాలను పొందలేరు.

ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే ।
కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే ।। 32 ।।

ఇలాంటి వివిధ రకాల యజ్ఞములన్నీ, వేదముల యందు వివరించబడ్డాయి. అవి విభిన్న రకాల పనుల నుండి ఉద్భవించినవి, అని తెలుసుకొనుము. ఈ జ్ఞానమే, నీ యొక్క భౌతిక బంధ చిక్కుముడిని ఖండించివేస్తుంది.

వేదముల యొక్క అధ్బుతమైన లక్షణం ఏమిటంటే, అవి ఎన్నో, విభిన్నరకాల మానవ స్వభావాలను గుర్తించి, వాటికి సరిపోయే విధానాలను సూచిస్తాయి. రకరకాల మనుష్యులకు, రకరకాల యజ్ఞములు వివరించబడ్డాయి. వీటన్నింటికీ ఉమ్మడిగా ఉన్న లక్షణం ఏమిటంటే, ఇవన్నీ భక్తితో, భగవత్ అర్పితముగా చేయాలి. కాబట్టి, వేదములలో చెప్పబడిన వివిధ రకాల ఉపదేశాలతో తికమక పడకుండా, మనకు సరిపోయే యజ్ఞ విధానాన్ని నిర్వర్తిస్తూ, భౌతిక బంధాల నుండి విముక్తి పొందే జ్ఞానాన్ని, సముపార్జించాలి.

శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ।। 33 ।।

ఓ శత్రువులను లోబరుచుకునే వాడా, యాంత్రికముగా, ద్రవ్యముతో చేసే యజ్ఞము కన్నా, జ్ఞానంతో చేసే యజ్ఞము ఏంతో శ్రేష్ఠమైనది. ఏది ఏమైనా, ఓ పార్థ, అన్ని యజ్ఞ కర్మలూ జ్ఞానమునందే పరిసమాప్తమవుతాయి.

పూజాది క్రియలూ, ఉపవాసాలూ, మంత్ర జపాలూ, తీర్థ యాత్రలూ, ఇవన్నీమంచివే కానీ, వాటిని జ్ఞాన యుక్తంగా చేయకపోతే, అవి కేవలం భౌతికమైన క్రియలుగా మిగిలిపోతాయి. ఏమీ చేయకపోవటం కన్నా, ఇటువంటి యాంత్రికమైన పనులు మంచివే కానీ, మనస్సుని పరిశుద్ధం చేసుకోవడానికి, అవి సరిపోవు. చాలా మంది ప్రజలు, భగవన్నామాన్ని జపిస్తుంటారు, శాస్త్రాలు వల్లె వేస్తుంటారు, పవిత్ర ధామాలను సందర్శిస్తుంటారు, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటువంటి భౌతిక క్రియలతోనే, భౌతిక బంధాలనుండి విముక్తి లభిస్తుందనే విశ్వాసంతో, ఇవన్నీ చేస్తుంటారు. అయితే, జ్ఞాన సముపార్జనతో, భక్తి పూర్వక భావాలు పెంపొందుతాయి. భగవంతునిపై, మరియు ఆయనతో మనకున్న సంబంధంపై జ్ఞానం పెంపొందించుకోవటం వలన, మన భక్తి భావన వృద్ధిచెందుతుంది.

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ।
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వదర్శినః ।। 34 ।।

ఒక ఆధ్యాత్మిక గురువును చేరి, పరమ సత్యమును నేర్చుకొనుము. వినయంతో ఆయనను ప్రశ్నలడుగుతూ, ఆయనకు సేవ చేయుము. అటువంటి మహాత్ముడైన జ్ఞాని, నీకు జ్ఞానోపదేశం చేయగలడు. ఎందుకంటే, అతను స్వయంగా, యథార్థమును దర్శించినవాడు.

ఆత్మ యొక్క బుద్ధి, అనంత జన్మల అజ్ఞానంచే కప్పివేయబడి ఉంటుంది. అవిద్యచే ఆవరింపబడి ఉండి, బుద్ధి తన అజ్ఞానాన్ని తన సొంత ప్రయత్నంచే జయించలేదు. పరమ సత్యాన్ని ఎరిగిన, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముని ద్వారా, ఆ జ్ఞానాన్ని అందుకోవాలి. గురువు గారిని స్వచ్ఛమైన మనస్సుతో, సందేహములు విడిచి, సేవించాలి. అలా చేసినట్లయితే, ఆయన శాస్త్ర జ్ఞానాన్నీ, మరియు వివేచనాత్మకతను ఉపదేశించి, గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు. గురువుకి శరణాగతి చేయకుండా, భౌతిక మాయ నుండి ముక్తి లభించదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే ప్రక్రియ, ప్రాపంచిక జ్ఞానాన్ని ఆపాదించే ప్రక్రియ కన్నా, విభిన్నమైనది. ప్రాపంచిక విద్యకోసం, బోధకునికి రుసుము చెల్లిస్తే సరిపోతుంది. కానీ, ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం అనేది, శిష్యునికి యాంత్రికమైన బోధనా పద్ధతి ద్వారా ఆపాదించబడదు. దానిని ఎంతో కొంత రుసుము చెల్లించి కొనుక్కోలేము. శిష్యుడు ఎప్పుడైతే వినయమూ, నమ్రతా పెంపొందించుకుంటాడో, సేవా దృక్పథంచే గురువు ప్రసన్నమవుతాడో, అది గురుకృపచే శిష్యుని హృదయంలో, ప్రకటించబడుతుంది.

యజ్ఞాత్వా న పునర్మోహమ్ ఏవం యాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి ।। 35 ।।

ఈ మార్గాన్ని అనుసరిస్తూ, గురువు ద్వారా జ్ఞానోదయం సాధించిన పిమ్మట, ఓ అర్జునా, నీవు తిరిగి మోహంలో పడిపోవు. ఈ జ్ఞాన ప్రకాశంతో, నీవు సమస్త ప్రాణులూ భగవంతుని భాగాలే అనీ, అవి నా యందే స్థితమై ఉన్నాయనీ, గ్రహిస్తావు.

ఏ విధంగానయితే సూర్యుడిని చీకటి కప్పివేయలేదో, అదే విధంగా, మాయ అనేది, ఒకసారి జ్ఞానోదయమైన జీవాత్మని, వశపరుచుకోలేదు. భగవంతుడిని ఎరిగిన వారు, ఎప్పటికీ ఆ భగవత్ ధ్యాసలోనే ఉంటారు. మాయ యొక్క భ్రాంతిలో, మనం ప్రపంచాన్ని ఆ భగవంతుని కంటే వేరుగా చూస్తాము. తోటి వారు, మన స్వార్థ ప్రయోజనం కోసం సహకరిస్తున్నారా లేదా అన్న విషయంపై, మనం వారితో స్నేహం, లేదా శతృత్వం పెంచుకుంటాము. జ్ఞానోదయం ద్వారా వచ్చే దివ్య ఆధ్యాత్మిక వివేకము, మనం ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని మార్చి వేస్తుంది. జ్ఞానోదయమైన మాహాత్ములు, ఈ ప్రపంచాన్ని భగవంతుని శక్తి స్వరూపంగా దర్శిస్తారు. వారికి లభించినదంతా, ఆ భగవత్ సేవలోనే ఉపయోగిస్తారు. అందరు మనుష్యులూ, ఆ భగవంతుని అంశలే అని భావించి, అందరి పట్లా దైవీ భావన కలిగి ఉంటారు.

అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।
సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।

పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారని పరిగణించబడిన వారు కూడా, ఈ ప్రాపంచిక భవసాగరాన్ని, ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి, దాటిపోవచ్చు.

భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది. దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు, మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల కష్టాలకు గురి చేస్తుంది.

ఆది ఆత్మిక అంటే, తన శరీరం, మనస్సూ  పెట్టే బాధలు; 
ఆది భౌతిక అంటే, ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; 
ఆది దైవిక అంటే, వాతావరణ, మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు.

ఈ యొక్క భౌతికబద్ధ స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు. ఈ బాధలు భరిస్తూ, అనంత జన్మలు గడిచిపోతుంటాయి. ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది. ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం, ఈ భౌతిక భవ సాగరాన్ని దాటడానికి, ఒక పడవనిస్తుంది. అవివేకులు కర్మలు చేసి, వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా, జ్ఞానులు ముక్తిని సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి, సహకరిస్తుంది.

ఇక మన తదుపరి వీడియోలో, అలౌకిక జ్ఞానంతో, శాశ్వతమైన పరమ శాంతిని ఎలా పొందాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

03 January, 2022

ది గ్రేట్ ఎస్కేప్ – ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి! Shivaji's historic escape from Agra

 

ది గ్రేట్ ఎస్కేప్ – ఎక్కడ తగ్గాలో తెలిసిన అపరమేధావి!

మన భారత దేశ చరిత్రలో ఎందరో రాజులున్నారు, చక్రవర్తలున్నారు. కానీ ఛత్రపతి మాత్రం ఒక్కరే.. ఆయనే, శివాజీ రాజే భోంస్లే. హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ చరిత్ర, ఎప్పటికీ చిరస్మరణీయం. ఉన్నతమైన వ్యక్తిత్వం, పర మత సహనం, అపారమైన దైవ భక్తి, స్త్రీల పట్ల గౌరవం, అయనలోని గొప్పతనాన్ని చాటే ముచ్చుతునకలు. మొఘలులపై, బీజాపూర్ సుల్తానులపై, ఎన్నో యుద్ధాలు చేసి, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు, ఛత్రపతి శివాజీ. యుద్ధంలో చావో, రేవో అనేలా పోరాడడం మాత్రమే కాకుండా, చాకచక్యంగా, అవసరమైనప్పుడు వెనకడుగు వేసి తప్పించుకుని, తిరిగి తన పంజా విసిరి, శత్రువులను దెబ్బతీయడం, శివాజీ నైజం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ay2IFCn95Wo ]

[ ఛత్రపతి శివాజీ వీర గాధ!: https://youtu.be/it7JY1jp20A ]

అటువంటి ఘటనలెన్నో ఉన్నాయి. ఒకనాడు ఔరగంజేబు, శివాజీనీ, ఆయన కుమారుడు శంభాజీనీ మర్యాదపూర్వకంగా ఆగ్రాకు పిలిపించి, వారిని బంధీలుగా చేశాడు. అక్కడినుండి శివాజీ ఎలా తప్పించుకున్నారు? మొఘలుల మున్సబుగా సంధి చేసుకున్న శివాజీని, ఔరంగజేబు ఎందుకు బంధించాడు? భవనం చుట్టూ ఉన్న వందల మంది సైనికులను తప్పించుకుని, శివాజీ ఎలా బయటపడ్డారు? ఏడు నెలల పాటు ఆగ్రాలో ఏం జరిగింది? వంటి ఉత్సుకత రేకెత్తించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో గుర్తుచేసుకుందాము..

1666 లో, ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా, శివాజీనీ, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీనీ ఆగ్రాకు అహ్వానించాడు. అక్కడకు వెళ్ళడం, శివాజీకీ ఇష్టంలేదు. ఎందుకంటే, ఔరంగజేబు మేక వన్నె పులి అనీ, ఎంతకైనా తెగిస్తాడనీ, శివాజీకి తెలుసు. కానీ, ఔరంగజేబు తరుపున వచ్చిన రాజా జై సింగ్ శివాజీతో, ‘మీరు ఔరంగజేబును కలిస్తే, ఆయన తర్వాత మిమ్మల్ని దక్కనుకు వైస్రాయ్‌గా చేస్తారేమో, బీజాపూర్, గోల్కొండను ఆక్రమించుకోవడానికి, తన నాయకత్వంలో ఒక దళాన్ని పంపిస్తారేమో’, అని ఆశ కల్పించాడు. అయితే, శివాజీ కోరిక ఏంటంటే, ఔరంగజేబును కలిస్తే, బీజాపూర్ నుంచి పన్ను వసూలు చేసుకోవడానికి అనుమతి దొరకవచ్చేమో అనుకున్నారు. ఆ నిర్ణయాన్ని మరాఠా దర్బార్‌లోని వారు కూడా, ఆమోదించారు. దాంతో, 1666 మార్చి 5న, తల్లి జిజియాబాయికి రాజ్య బాధ్యతలను అప్పజెప్పి, ఔరంగజేబును కలవడానికి, ఆగ్రా బయల్దేరారు శివాజీ. అయితే, శివాజీ భద్రత చూసుకునే బాధ్యతను రాజా జై సింగ్, ఆగ్రాలో ఉన్న తన కొడుకు కుమార్ రాం సింగ్‌కు అప్పగించాడు. శివాజీ ఆగ్రా రావడానికి ఖర్చుల నిమిత్తం, కొంత ధనం, ఒక లేఖ పంపించాడు, ఔరంగజేబు.

ఆ లేఖలో, "మీరు ఇక్కడకు ఎలాంటి సంకోచం లేకుండా రండి. మీ మనస్సులో ఎలాంటి ఆందోళనా ఉంచుకోకండి. నన్ను కలిశాక, మీకు రాచ మర్యాదలు జరుగుతాయి. మిమ్మల్ని తిరిగి గౌరవంగా ఇంటికి పంపిస్తాం. మీరు వేసుకోడానికి ఖిలాత్, అంటే, ఖరీదైన దుస్తులను కూడా పంపుతున్నాను" అని ఉంది. వారం తరువాత శివాజీ, ఆయన పరివారం, ఆగ్రా చేరుకున్నారు. ఔరంగజేబు దర్బారులో, 'శివాజీ రాజా' అని గట్టిగా పేరు పిలవగానే, శివాజీ, ఆయన కొడుకు శంభాజీ, పది మంది అనుచరులనూ సభలోకి తీసుకెళ్లాడు, కుమార్ రాం సింగ్. మరాఠా రాజ్యం తరపున, ఔరంగజేబ్‌కు 2 వేల బంగారు నాణాలు 'నజర్'గా, 6 వేల రూపాయలు 'నిసార్‌'గా అందించి, ఔరంగజేబు సింహాసనం దగ్గరికి వెళ్లి, ఆయనకు మూడుసార్లు సలాం చేశారు. ఔరంగజేబు తల ఊపి, శివాజీ బహుమతులు స్వీకరించాడు. శివాజీకి కనీస మర్యాద కూడా లభించలేదు. ఔరంగజేబు సహాయకుడు శివాజీనీ, ఆయన పరివారాన్నీ, మూడవ హోదాలో ఉండే మున్సబుదారులతో పాటు, దూరంగా ఉన్న వెనుక వరుసలో నిలబెట్టారు. తనకు అలాంటి స్వాగతం లభిస్తుందని శివాజీ ఊహించలేదు.

అంతేకాకుండా, ఆగ్రా బయట తనకు స్వాగతం పలకడానికి, రామ్‌ సింగ్, ముఖ్లిస్ ఖాన్ వంటి మామూలు అధికారులు రావడం కూడా, శివాజీకి నచ్చలేదు. సభలో తల వంచి, ఔరంగజేబుకు సలాం కొట్టిన తన గురించి, ఒక మంచి మాట చెప్పడం గానీ, ఆయనకు ఏదైనా బహుమతులు ఇవ్వడం గానీ చేయలేదు. దానికి తోడు, ఆయనను సాధారణ మున్సబుదారుల మధ్య, ఎన్నో వరుసల వెనక నిలబెట్టారు. ఔరంగజేబ్ కు కూడా, సరిగా కనిపించనంత దూరంగా ఉంచారు. ఈ సంఘటనలతో, శివాజీకి కోపం కట్టలు తెంచుకుంది. దాంతో, ఆయన రామ్ సింగ్‌ ని పిలిచి, "నన్ను ఎవరి మధ్య తీసుకొచ్చి నిలబెట్టావ్" అని అడిగారు. అప్పుడు రాం సింగ్, ‘మీరు 5 వేల మంది సైనికులకు అధిపతి అయిన పాంచ్ హాజారీ మున్సబ్‌దారుల మధ్య ఉన్నారు’ అని విన్నవించాడు. దాంతో శివాజీ గట్టిగా, "నా ఏడేళ్ల కొడుకూ, నా నౌకర్ నేతాజీ కూడా, పాంచ్ హజారీలే. చక్రవర్తి అని గౌరవించి, అంత దూరం నుంచి ఆగ్రా వచ్చిన నన్ను, వీళ్లతో పోల్చుతారా" అంటూ మండిపడ్డారు. తనకు ఘోర అవమానం జరగడంతో రగిలిపోయిన శివాజీ, రాం సింగ్‌ తో గట్టిగా మాట్లాడుతున్నారు. దర్బార్‌లో అలా మాట్లాడుతుండడంతో, రాం సింగ్ కంగారు పడిపోయి, శివాజీ కోపం చల్లార్చే ప్రయత్నాలు చేశాడు. అయినా శివాజీ శాంతించలేదు. శివాజీ గట్టిగా అరవడం విన్న ఔరంగజేబు, ఆ అరుపులేంటని రాం సింగ్ ని అడుగగా, ఆయన ఎంతో చాకచక్యంగా, "సింహం అడవి జంతువు, అది ఇక్కడ ఉక్కపోతను భరించలేక, జబ్బు పడింది" అన్నాడు.

దాంతో శివాజీని పక్కనున్న గదిలోకి తీసుకెళ్లి, ఆయనపై పన్నీరు చల్లామన్నాడు ఔరంగజేబు. ఆయన కుదుటపడిన తర్వాత, దర్బారు ముగిసేవరకూ వేచిచూడకుండా, శివాజీని నేరుగా, ఆయన కోసం ఏర్పాటు చేసిన విడిది ప్రాంతానికి తీసుకెళ్లమని, సూచించాడు. ఆగ్రా నగరం బయట, జయ్‌పూర్ సరాయ్‌లో, శివాజీకి విడిది ఏర్పాటు చేశారు. శివాజీ జయ్‌పూర్ నివాసంలోకి వెళ్లగానే, ఒక అశ్విక దళం, ఆ ఇంటిని నాలుగు వైపుల నుంచీ చుట్టుముట్టింది. కాసేపటికే, మరికొందరు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లు తమ ఫిరంగులను, భవనానికి ఉన్న ప్రతి తలుపు వైపూ గురిపెట్టారు. శివాజీ తానున్న ఆ భవనం నుంచి బయటకు వెళ్లడానికి, అనుమతి లేదు. అయితే, వారి ఉద్దేశ్యం, శివాజీని చంపడం కాదు. అలా జరిగితే, మరాఠాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనీ, సరైన సమయం చూసుకుని, శివాజీని చంపాలనీ, ఔరంగజేబు భావించాడు. అందుకే, శివాజీని బంధీగా ఉన్న అతిథిలా గౌరవించాడు. ఔరంగజేబు ఆయనకు పండ్ల బుట్టలను కూడా పంపించేవాడు. ఇలా గడుస్తుండగా, శివాజీ కొంత కాలానికి, ఔరంగజేబు ప్రధాన వజీర్ ఉమ్‌దావుల్ ముల్క్‌ ద్వారా, "చక్రవర్తి నన్ను సురక్షితంగా తిరిగి పంపిస్తానని హామీ ఇచ్చారు. కానీ, అది జరిగేలా ఏమాత్రం కనిపించడం లేదు" అని ఔరంగజేబుకు సందేశం పంపించాడు. అయినా ఔరంగజేబు, ఏ మాత్రం స్పందించలేదు.

అతని నుండి ఎటువంటి సమాధానమూ రాకపోవడంతో, తనను చంపడానికి తగిన సాకు కోసం ఔరంగజేబు వేచిచూస్తున్నాడనీ, మెల్లమెల్లగా రెచ్చగొట్టి, కోపొద్రిక్తుడిని చేయాలనుకుంటున్నాడనీ, శివాజీకి అర్థమైంది. దాంతో, ఒక మంచి ఆలోచన చేసి, తప్పించుకునే మార్గాన్ని వెదికాడు. ఆనాటి నుండి, ఆయన చాలా సంతోషంగా ఉన్నట్టు, తనకు కాపలాగా ఉన్న సైనికులతో నవ్వుతూ, సరదాగా మాట్లాడేవాడు. సైనికాధికారులకు ఎన్నో బహుమతులు పంపించేవాడు. ఆగ్రా వాతావరణం తనకు బాగా నచ్చిందని, చూట్టూ తిరుగుతూ సందడి చేసేవాడు. తన కోసం ఎన్నో తీపి వంటకాలూ, పండ్లూ పంపిస్తున్న చక్రవర్తికి ఎంతో రుణపడి ఉంటానని, శివాజీ అందరితో చెప్పేవాడు. పాలన కార్యకలాపాలకు దూరంగా, ఆగ్రా లాంటి సాంస్కృతిక నగరంలో ఉండడం చాలా హాయిగా ఉందంటూ, అందరినీ నమ్మించాడు. చక్రవర్తి గూఢచారులు మాత్రం, శివాజీపై రాత్రింబవళ్లు నిఘా ఉంచేవారు. దాంతో, ఔరంగజేబ్‌కు మరింత నమ్మకం కలిగేలా, తన తల్లి, భార్య కూడా తన దగ్గరకు వచ్చి ఉండడానికి అనుమతిస్తారా అని, శివాజీ చక్రవర్తికి ఒక సందేశం కూడా పంపించాడు. దానికి ఔరంగజేబు సరే అన్నాడు.

తమ ఇంటి ఆడవాళ్లను బందీలుగా చేసే వ్యక్తి, ఎప్పటికీ పారిపోయే సాహసం చేయడని, ఔరంగజేబు అనుకున్నాడు. కానీ, చక్రవర్తి అనుమతి లభించినా, శివాజీ కుటుంబంలోని మహిళలు ఆగ్రాకు రాలేదు. భారీ వర్షాల వల్ల, వాళ్లు అంత సుదీర్ఘ ప్రయాణం చేయలేకపోయారనీ, అందుకే ఆగ్రాకు రాలేదనీ, శివాజీ అందరికీ సాకు చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత, తనతో పాటూ వచ్చిన మరాఠా అశ్వికులను తిరిగి తమ రాజ్యానికి పంపించాలని, ఔరంగజేబుకు సందేశం పంపించాడు శివాజీ. స్వయంగా శివాజీ తన  సైనికులను వదిలించుకోవాలని అనుకుంటున్నాడని తెలిసి, చక్రవర్తి ఎంతో సంతోషపడ్డాడు. అలా శివాజీని నమ్మిన ఔరంగజేబు, అతని వర్గం, ఆయనపై నిఘాను కాస్త తగ్గించారు. తర్వాత అసలు ప్లాన్ ని అమలు చేశారు, శివాజీ. తనకు అనారోగ్యంగాఉందని చెప్పి, బయట కాపలా ఉన్న మొఘల్ సైనికులకు సైతం వినిపించేలా, మూలిగేవాడు. తన ఆరోగ్యం కుదుటపడాలని, బ్రాహ్మణులకూ, సన్యాసులకూ, ప్రతీ సాయంత్రం బుట్టల్లో మిఠాయిలూ, పళ్లూ పంపించేవాడు శివాజీ. వాటిని సైనికులు తనిఖీ చేసి, బయటకు పంపించేవారు. అలా రోజులు గడిచే కొద్ది, ఆ బుట్టలను పట్టించుకోవడం మానేశారు కాపలాదారులు. ఒకరోజు, తన ఆరోగ్యం అస్సలు బాగోలేదనీ, మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నట్లుగా నటించాడు.

తన విశ్రాంతికి భంగం కలిగించవద్దనీ, ఎవరినీ లోపలికి పంపించవద్దనీ, సైనికులకు చెప్పాడు. అచ్చం తనలాగే కనిపించే తన సవతి సోదరుడు హీరాజీ ఫర్జాంద్‌కు, తన బట్టలూ, ముత్యాల హారం వేసి, మంచంపై పడుకోబెట్టాడు. కేవలం శివాజీ కడియం ఉన్న ఆయన చెయ్యి మాత్రమే కనిపించేలా, మిగతా శరీరం అంతా దుప్పటి కప్పేశాడు. రోజూ వెళ్లే పండ్ల బుట్టలలో, తన కొడుకును కూర్చోబెట్టుకుని, శివాజీ దాన్ని మోస్తున్న కూలీవేషంలో, ఆ భవనం నుండి బయటకు వచ్చేశాడు. శివాజీ, ఆయన కొడుకూ, ఆగ్రా నుంచి ఆరు మైళ్ల దూరంలోని ఒక గ్రామం చేరుకున్నాక, కూలీల గుంపునుండి వేరయ్యాడు. ఈలోపు హీరాజీ ఫర్జాంద్‌, ఆ రాత్రీ, మారునాటి మధ్యాహ్నం వరకూ, అలా పడుకునే ఉన్నాడు. గదిలోకి తొంగి చూసిన సైనికులకు, ఆయన చేతికున్న బంగారు కడియం, ఒక సహాయకుడు నేల మీద కూర్చుని, ఆయనకు మాలిష్ చేయడం కనిపించాయి. దాంతో, శివాజీ అక్కడే పడుకుని ఉన్నారనుకున్నారు, సైనికులు. సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో, హీరాజీ ఒక నౌకరుతో కలసి, ఆ ఇంటి నుంచి బయటకు వెళ్తూ వెళ్తూ, "గట్టిగా అరవకండి, శివాజీకి ఆరోగ్యం సరిగా లేదు, ఆయనకు వైద్యం జరుగుతోంది" అని చెప్పి, అక్కడి నుండి తప్పించుకున్నాడు. కాసేపటికి శివాజీ గది నుంచి ఎలాంటి శబ్దాలూ రాకపోవడంతో, సైనికులకు సందేహం వచ్చింది. లోపలికెళ్లి చూస్తే, అక్కడ ఎవరూ కనిపించలేదు.

దాంతో ఖంగుతిన్న సైనికులు, తమ నాయకుడైన ఫలాద్ ఖాన్‌కు చెప్పగా, అతను ఔరంగజేబు దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్లపై పడి, "మాయ జరిగిపోయింది. శివాజీ అదృశ్యం అయ్యాడు. ఆయన గాల్లో ఎగిరెళ్లాడో, లేక ఆయన్ను భూమి మింగేసిందో, పొరపాటు ఎక్కడ జరిగిందో, నాకు తెలీయడం లేదు" అంటూ, జరిగిన సంగతిని వివరించాడు. అది వినగానే ఔరంగజేబుకు చెమటలు పట్టాయి. వెంటనే నలువైపులకూ తన సైనికులను పంపించి, శివాజీ కోసం వెతికించాడు. కానీ, ఎవ్వరూ శివాజీ జాడను కనిపెట్టలేకపోయారు. ఔరంగజేబు నుంచి తప్పించుకుని, ఆగ్రా నుండి, ఆరు గంటల్లోనే మధురకు చేరుకున్నారు, శివాజీ, శంభాజీ. అక్కడ శివాజీ తన జుట్టూ, గడ్డం, మీసాలు తీయించుకున్నారు. శివాజీ, ఆయన కుమారుడూ, ఒక సామాన్యుడి వేషంలో, కాషాయ బట్టలు ధరించారు. అలా శివాజీ, ఎవరూ ఊహించని దారిలో, మధుర, అలహాబాద్, వారణాసీ, పూరీ మీదుగా, ఒడిషా, గోల్కొండ దాటుకుని, రాజ్‌ఘడ్ చేరుకున్నారు. డిసెంబర్ నెలలో, అంటే, దాదాపు ఏడు నెలల తరువాత, శివాజీ తిరిగి తన రాజ్యానికి చేరుకున్నారు.

ఇక్కడ గమనించవలసిన నీతి ఏంటంటే, శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు, అతను చేసే నష్టం అంచనా వేయడం కష్టం కాబట్టి, మనమీద అనుమానం రాకుండా, మనకు నష్టం కలగకుండా మట్టుబెట్టే విధానం గురించి మనకు ముందు తెలిసి ఉండాలి. ఛత్రపతి శివాజీ కూడా 2 సంవత్సరాలు వేచి ఉండి, ఆ తరువాత చావు దెబ్బ కొట్టారు ఔరంగజేబును..

🚩 ఓం నమః శివాయ 🙏