Ads

02 February, 2022

ఏది అగ్ర కులం?! బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారా? Bhagavadgita

  

ఏది అగ్ర కులం?! బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారా?

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (13 – 18 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 13 నుండి 18 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/kC8wy0dBDsY ]

నిజమైన సంతోషాలు పొందాలంటే ఏంచేయాలో శ్రీ కృష్ణుడు చెప్పబోతున్నాడు..

సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।। 13 ।।

ఆత్మ నిగ్రహమూ, వైరాగ్యమూ ఉన్న జీవాత్మలు, తాము దేనికీ కర్త కాదనీ, దేనికీ కారణమూ కాదని తెలుసుకుని, ఈ యొక్క తొమ్మిది ద్వారములుగల నగరములో, సంతోషంగా ఉంటారు.

ఈ శ్లోకంలో, నవ రంధ్రాలు గల శరీరమును, తొమ్మిది ద్వారాలు గల పట్టణంతో పోల్చుతున్నాడు శ్రీ కృష్ణుడు. శరీరము తొమ్మిది ద్వారాలను కలిగి ఉంటుంది. రెండు చెవులూ, ఒక నోరూ, రెండు నాసికారంధ్రాలూ, రెండు కళ్ళూ, అపానమూ, జననేంద్రియము.. భౌతిక దృక్పథంలో, ఈ దేహంలో ఉండే జీవాత్మ తనను తాను, ఈ నవ ద్వార పట్టణంతో అనుసంధానం చేసుకుంటుంది. జీవాత్మ ఆ పట్టణానికి రాజు. దాని పరిపాలనంతా, అహంకారమూ, బుద్ధీ, మనస్సూ, ఇంద్రియములూ, జీవ-శక్తీ అనే మంత్రిత్వ శాఖల ద్వారా, నడిపించబడతాయి. కాలము, మృత్యు రూపంలో శరీరాన్ని తీసివేసే వరకే, ఈ శరీరంపై రాజ్యపాలన కొనసాగుతుంది. కానీ, పాలన కొనసాగుతున్నప్పుడు కూడా, జ్ఞానోదయమైన యోగులు, తమను తాము శరీరంగా భావించరు. అంతేకాక, తమను తాము ఈ శరీరానికి అధిపతులం అనుకోరు సరికదా, శరీరమునూ, దానిచే చేయబడిన అన్ని క్రియలనూ, భగవంతునికి చెందినవేనని భావిస్తారు. అన్ని కర్మలనూ మానసికంగా త్యజించి, ఇటువంటి జ్ఞానోదయమైన యోగులు, సంతోషంగా ఈ శరీరంలో స్థితులై ఉంటారు. దీనినే, 'సాక్షీ భావము' అంటారు. అంటే, తన చుట్టూ జరిగే అన్ని విషయములకూ, ఆసక్తిరహిత సాక్షిగా నిలిచిపోవటం. లోకంలోని సమస్త భూతములనూ నియంత్రించే పరమేశ్వరుడు కూడా, ఈ దేహములో స్థితమై ఉంటాడు. ఎప్పుడైతే జీవాత్మ భగవంతునితో అనుసంధానమవుతుందో, ఈ శరీరంలో వసిస్తున్నా, అది ఆయన లాగే, స్వేచ్ఛను పొందుతుంది.

న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః ।
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే ।। 14 ।।

కర్తృత్వ భావన కానీ, కర్మల స్వభావం కానీ, భగవంతునిచే సృష్టించబడవు. కర్మ ఫలములను సృష్టించేది కూడా, ఆయన కాదు. భౌతిక ప్రకృతి గుణములే, వీటన్నింటినీ ప్రవర్తిల్లచేయును.

భగవంతుడు సర్వశక్తిమంతుడూ, సమస్త విశ్వమునూ నియంత్రణ చేసేవాడు. ఈ విశ్వం యొక్క కార్యకలాపాలు ఆయనే నిర్వహించినా, ఆయన అకర్తగా ఉంటాడు. మన క్రియలను నిర్దేశించడు, మనలను శాసించడు. మనం కర్తృత్వ భావనలో ఇరుక్కుపోవటానికి, భగవంతుడు కారణం కాదు. ఆయనే, కావాలని మనలో గర్వాన్ని కలుగ చేసి ఉంటే, మన తప్పుడు చేష్టలకు ఆయనే దోషిగా నిలబడతాడు. నిజానికి, జీవాత్మే తన అజ్ఞానంచే, ఆ కర్తృత్వ భావనని తనకు కలుగచేసుకుంటుంది. ఒకవేళ జీవాత్మ ఆ అజ్ఞానాన్ని వదిలించుకోవాలని చూస్తే, అప్పుడు భగవంతుడు, తన కృపతో దానిని నిర్మూలించటానికి సహాయపడతాడు. ఈ విధంగా, కర్తృత్వ భావనను త్యజించటం అనేది, జీవాత్మ యొక్క బాధ్యత. ఈ శరీరము, ప్రకృతి యొక్క త్రిగుణములచే కూడుకున్నది. అన్ని కర్మలు కూడా, ఆ త్రిగుణములచే చేయబడతాయి. కానీ, అజ్ఞానంలో ఉన్న జీవాత్మ, తాను ఈ శరీరమే అనుకుని, కర్మల యొక్క కర్తగా ఇరుక్కుపోతుంది. నిజానికి అవి ప్రకృతి గుణములచే చేయబడతాయి.

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।

సర్వాంతర్యామి అయిన భగవంతుడు, ఏ ఒక్కరి పుణ్య, పాపపు కర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము, అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన, వారు భ్రమకు లోనవుతున్నారు.

భగవంతుడు, ఏ ఒక్కరి పుణ్య, పాప పనులకూ, బాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని, మూడు అంచెలుగా ఉంటుంది. 
1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తినిస్తాడు.. 
2) మనకు ఇవ్వబడిన శక్తితో మనం పనులు చేయగానే, మనం చేసినదానిని గుర్తిస్తాడు..
3) మన కర్మ ఫలితములను అందజేస్తాడు..

ప్రతి జీవాత్మకూ, తన స్వంత నిర్ణయం ద్వారా, మంచి లేదా చెడు పనులు చేయటానికి, పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్ర చిత్తమే, సృష్టికి మూలాధారము, ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి, మూల కారణము. జీవాత్మ తన ఇంద్రియమనోబుద్ధులను, తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో, అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది. అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా, ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు. ఎందుకంటే, దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే, ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలనే ఉద్దేశంతోనే, మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి, మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛా చిత్తము ఉందని తెలుసుకుంటారు. కానీ, శారీరిక అహంకారంలో, కర్తృత్వ భావన కలిగి ఉంటారు. ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే.

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః ।
తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్ ।। 16 ।।

కానీ, ఎవరికైతే దివ్య ఆధ్యాత్మిక జ్ఞానముచే, ఆత్మ పట్ల అజ్ఞానం నాశనం చేయబడునో, సూర్యుడు పగటి పూట అన్నింటినీ ప్రకాశింపచేసినట్లు, ఆ జ్ఞానము, వారికి పరమాత్మను ప్రకాశింపచేయును.

రాత్రి యొక్క చీకటిని తొలగించటంలో సూర్యునికి ఉన్న శక్తి, సాటిలేనిది. సూర్యుని వెలుగు ఎంత మహోన్నతమైనదంటే, చీకటి దాని ముందు నిలబడలేదు. భగవంతుని జ్ఞానం యొక్క వెలుగు కూడా, అజ్ఞానపు చీకటిని తొలగించటానికి, అదే మాదిరి ప్రభావం కలిగి ఉంటుంది. చీకటి అనేది, భ్రమలను కలుగచేస్తుంది. అజ్ఞానమనే చీకటిలో, మనం ఈ శరీరమే అని భావించి, మనమే కర్తలమనీ, మనమే మన కర్మ ఫలముల భోక్తలమనీ, అనుకుంటాం. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక జ్ఞాన వెలుగు, ఎప్పుడైతే ప్రకాశించటం ప్రారంభమవుతుందో, మన భ్రమ, త్వరితగతిన పారిపోతుంది. భగవంతుని భౌతిక శక్తి, జీవాత్మను చీకటితో ఆవరించడం చేత, అది మాయలో పడిపోతుంది. భగవంతుని దివ్య ఆధ్యాత్మిక శక్తి, జ్ఞాన వెలుగును ప్రసరించినప్పుడు, ఈ మాయ నిర్మూలించ బడుతుంది.

తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠాస్తత్పరాయణాః ।
గచ్ఛంత్యపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ।। 17 ।।

తమ బుద్ధి భగవంతుని యందే స్థితులైనవారూ, సంపూర్ణముగా భగవంతుని యందే నిమగ్నమైన వారూ, ఆయనే పరమ లక్ష్యమనే ధృఢ విశ్వాసం కలవా రూ, వారి పాపములు, జ్ఞాన కిరణములచే నిర్మూలింపబడి, త్వరితగతిన, మరలా తిరిగిరాని స్థితిని పొందుతారు.

ఎలాగైతే అజ్ఞానము, వ్యక్తిని నిరంతర జనన-మరణ చక్రంలో బాధకు గురిచేయునో, అలాగే జ్ఞానమునకు, వ్యక్తిని భౌతిక బంధము నుండి విడిపించే శక్తి ఉంది. ఇటువంటి జ్ఞానము ఎప్పుడూ కూడా, భగవంతునిపై భక్తితో కూడి ఉంటుంది.

ఈ శ్లోకంలో చెప్పబడినట్లు, తత్-బుద్ధయః అంటే, బుద్ధి భగవంతుని దిశగా నిర్దేశించబడి, తదాత్మనః అంటే, మనస్సూ, బుద్ధీ, కేవలం భగవంతుని యందే నిమగ్నమై, తన్నిష్ఠా అంటే, భగవంతుని యందు సంపూర్ణ విశ్వాసముంచి, తత్పరాయణాః అంటే, భగవంతుడే పరమ లక్ష్యమూ, ఆశ్రయమూ అని శ్రమిస్తూ ఉంటే, అది భగవంతునిపై ప్రేమకు దారి తీస్తుంది. ఈ విధమైన ప్రేమచే, భక్తులు సర్వత్రా ఆయననే దర్శిస్తారు.

విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।
శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।

నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో, ఓ బ్రాహ్మణుడినీ, ఓ ఆవునీ, ఓ ఏనుగునీ, ఓ కుక్కనీ, ఓ ఛండాలుడినీ, సమ దృష్టితో చూస్తారు.

మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు, దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు. అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది. పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడి ఉంటుంది. భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి, విభిన్నమైనది. జ్ఞాన సంపన్నులైన భక్తులు, అన్ని ప్రాణులనూ భగవదంశ అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. బ్రాహ్మణుడూ-ఛండాలుడూ, ఆవు-కుక్క ఈ జీవ జాతులన్నీ, వారికి సమానమే. నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నింటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు కాబట్టి, సమ దృష్టితో చూస్తాడు. బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని, వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశలైన నిత్య జీవాత్మలే.. అందుకే, అందరూ సమానమే.

ఇక మన తదుపరి వీడియోలో, ఆత్మ యందు అంతులేని ఆనందాన్ని అనుభవించాలంటే, శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

31 January, 2022

దేవయానీ శర్మిష్ఠల వైరం! జీవితాలను అల్లకల్లోలం చేసిన వాగ్వాదం! Mahabharata Stories

  

దేవయానీ శర్మిష్ఠల వైరం! జీవితాలను అల్లకల్లోలం చేసిన వాగ్వాదం!

శుక్రాచార్యుడి గారాల పట్టి దేవయాని, బృహస్పతి కుమారుడైన కచుణ్ణి అమితంగా ప్రేమించింది. కానీ, అతడు నిరాకరించడంతో భంగపడింది. మన గత వీడియోలో, కచ దేవయానిల ప్రేమ గాథ వివరించాను. చూడనివారికోసం ఆ వీడియో లింక్, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తున్నాను. గురుపుత్రిక దేవయానికీ, రాజ కుమార్తె శర్మిష్ఠకూ మధ్య జరిగిన వాగ్వాదం, వారి జీవితాలను అల్లకల్లోలం చేసింది. దేవయానీ, శర్మిష్ఠల మధ్య ఏం జరిగింది? కూతురి బాధను చూసి తాళలేని శుక్రాచార్యుడు ఏం చేశాడు?  తనకు జరిగిన అవమానానికి, దేవయాని ఏ విధంగా పగ తీర్చుకుంది - వంటి ఉత్సకతను రేకేత్తించే విషయాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iW5A4tyLmLo ]

ఒకనాడు రాక్షస రాజు వృషపర్వుడి కుమార్తె అయిన శర్మిష్ఠ, తన వెయ్యిమంది చెలికత్తెలతో కలసి, వనవిహారానికి  బయలుదేరింది. వారితో పాటు, రాజ గురువైన శుక్రాచార్యుని గారాల పట్టి దేవయాని కూడా వెళ్ళింది. వారందరూ  మధ్యాహ్న వేళ జల క్రీడలకై, శీతల సరోవరంలో దిగడానికి ఉపక్రమించారు. కట్టుకున్న చీరలు విప్పి గట్టుపై పెట్టి,  ఆనందంగా కేరింతలు కొడుతూ, జలకాలాడడం మొదలు పెట్టారు. అంతలో సుడిగాలి భయంకరంగా వచ్చింది. ఆ గాలి తీవ్రతకు, గట్టు మీద పెట్టిన బట్టలన్నీ కలగాపులగం అయ్యాయి. ఆ సుడిగాలి భీభత్సానికి భయభ్రాంతులయిన ఆ  లలనామణులు, గొల్లుమంటూ పరిగెత్తుతూ, ఒడ్డుకు చేరారు. ఆ గందరగోళంలో, గట్టుపై ఉన్న చీరలలో ఎవరికి దొరికిన  చీర వాళ్ళు తీసి, కట్టుకున్నారు. ఆ హడావిడిలో శర్మిష్ఠ, దేవయాని చీర కట్టుకుంది. సహజంగా అహంభావి అయిన దేవయాని, అది చూసింది. వెంటనే కోపం కట్టలు తెంచుకుంది. అయితే, శర్మిష్ఠ తన చీరను కట్టుకోమని దేవయానికి చెప్పింది.

దాన్ని కనీసం ముట్టుకోకుండా, అసహ్యించుకుంది దేవయాని. 'బ్రాహ్మణ పుత్రికను నేను. అదీగాక, ఈ రాజ్యానికి గురువయిన శుక్రాచార్యుని కుమార్తెను. కనుక నువ్వు నా శిష్య సమానురాలవు. నువ్వు నాకు వంగి దణ్ణం పెట్టాల్సిన దానవు. ఉచితానుచితాలు మరచి, నా బట్టలు కట్టడమే కాకుండా, నన్ను నీ మైల చీర కట్టుకోమంటావా?' అంటూ ధుమధుమ లాడింది. దేవయాని మాటలు శర్మిష్ఠను ఆగ్రహానికి గురిచేశాయి. 'ఓసీ దేవయానీ. దానవులకు ‘రాజైన’ వృషపర్వడు నా తండ్రి. అటువంటి మా తండ్రి వద్ద చేతులు కట్టుకుని పనిచేసుకు  బ్రతుకుతున్నాడు, నీ తండ్రి. అలాంటిది, నువ్వు నా దగ్గర నీ గీర్వాణాలు తీస్తున్నావు. పైపెచ్చు, సిగ్గూ సెరమూ లేకుండా  మాట్లాడుతున్నావు. నా చీర నీకు కట్టుకోవడానికి దొరకడమే, నీ అదృష్టం. నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. ఎక్కువగా నోరు పారేసుకుంటే, క్షణంలో శాసించగలను. ఇంకా మాట్లాడితే, కఠినంగా శిక్షించగలను. జాగ్రత్త' అంటూ,  కఠోరంగా పలికింది శర్మిష్ఠ. ఆమె మాటలు విని కోపోద్రిక్తురాలైన దేవయాని, శర్మిష్ఠ కట్టుకున్న తన చీరను  ఊడదీయమంది.

ఆ చర్యను సహించలేని శర్మిష్ఠ క్రోధంతో ఊగిపోతూ, దేవయానిని ప్రక్కనే ఉన్న పాడుబడిన బావిలోకి తోసేసి, చెలికత్తెలతో కలిసి, అంత:పురానికి వెళ్ళిపోయింది. చాలా సేపు నగ్నంగా ఆ బావిలోనే ఉండిపోయింది దేవయాని. కొంతసేపటికి దైవికంగా అక్కడకు వచ్చాడు, నహుష నందనుడు యయాతి. వేటాడి అలసిపోయి, దాహార్తియై, ఆ బావి చెంతకు వచ్చాడు. అందులో అగ్ని శోభ వలె వెనుగులీనుతూ, దేవతామూర్తి వలె  గోచరిస్తున్న దేవయానిని చూశాడు. ఒక తీగను పట్టుకుని, అసహాయతతో వ్రేళాడుతూ ఉన్న దేవయానిని చూసి,  సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. తరువాత తేరుకుని, 'కళ్యాణీ, ఎవరు నీవు? ఈ పాడుబడిన బావిలో ఎలా పడ్డావు? నీ ముఖంలో, తీవ్రమైన ఆవేదన కనబడుతోంది? అసలేం జరిగింది?' అని అనునయంగా అడిగాడు, యయాతి.  'మహాత్మా! ఎవరి అనుగ్రహం చేత మరణించిన దానవులు పునర్జీవులై దేవతలను నియంత్రిస్తున్నారో, అట్టి  పూజనీయుడైన శుక్రాచార్యుని ప్రియ పుత్రికను నేను. నా  పేరు దేవయాని. నా ఈ దురవస్థ, నా తండ్రికి ఇంకా తెలిసి  ఉండదు. ఇంతకీ మీరెవరు? ఏ పని నిమిత్తం ఇటు వచ్చారు?’ అని అడిగింది దేవయాని.

'ఓ బాలా! నేను నహుష రాజ  కుమారుడను. యయాతిని. వేటాడుతూ, పిపాసా పీడితుడనై, స్వచ్ఛ జలాలు అన్వేషిస్తూ, ఈ బావి వద్దకు వచ్చాను. ఇక్కడ నువ్వు యాదృచ్ఛికంగా కనిపించావు' అన్నాడు యయాతి.  'రాజా, మీరు కరుణామూర్తులు. ఈ ప్రమాదం నుండి అబలనైన నన్ను, మీరే రక్షించాలి. ఈ కూపము నుండి నన్ను మీరే ఉద్ధరించాలి' అంటూ, తన కుడి చేతిని అందించింది దేవయాని. వెంటనే తన కుడి చెయ్యి అందించి, భద్రంగా పైకి తీసి, ఇక నిర్భయంగా ఇంటికి వెళ్ళమని,  దేవయానికి చెప్పాడు యయాతి. రాజు వెళ్ళిపోయాక కొంతసేపటికి, దేవయానిని వెతుక్కుంటూ వచ్చింది ఆమె  పరిచారిక ఝార్ణిక. శర్మిష్ఠతో జరిగిన వాగ్వాదం గురించి ఆమెకు చెప్పి, ఇకపై వృషపర్వుడి రాజ్యంలో ఉండబోనని తన మాటగా తండ్రికి చెప్పమంది, దేవయాని. శర్మిష్ఠ తనకు చేసిన పరాభవానికి తగిన శాస్తి జరిగే వరకూ అడవిలోనే  ఉంటానని, ఖరాఖండిగా చెప్పింది.

ఘార్ణిక దేవయాని చెప్పిన మాటలు, పూసగుచ్చినట్లుగా శుక్రాచార్యుడికి చేరవేసింది. హూటాహుటిన దేవయాని ఉన్న  ప్రాంతానికి చేరుకున్నాడు, శుక్రాచార్యుడు. భోరున విలపిస్తున్న కూతురిని ఆ  స్థితిలో చూసిన శుక్రాచార్యుడికి, గుండె తరుక్కుపోయింది. దేవయానిని ఊరడిస్తూ, 'అమ్మా, అసలేం జరిగింది?' అంటూ పరామర్శింపజూశాడు. అప్పుడు దేవయాని, 'తండ్రీ, అవన్నీ అటుంచండి. మీరు వృషపర్వుడిని నిత్యం స్తుతిస్తూ, ఆయన దయా దాక్షిణ్యాలతో బతుకు వెళ్ళదీస్తున్నారని శర్మిష్ఠ అన్నది. అది వాస్తమేనా? దానికి సమాధానం కావాలి నాకు' అన్నది దేవయాని. అప్పుడు  శుక్రుడు, 'అమ్మా, శర్మిష్ఠ పలికిన మాటలలో వాస్తవం లేదు. రాజులను పొగడుతూ, వాళ్ళ వద్ద చేతులు చాస్తూ, వాళ్ళ అనుగ్రహంతో బ్రతికే ఖర్మ, నీ తండ్రికి లేదు. స్తుతులనూ, ప్రస్తుతులనూ పొందేవాడేగానీ, అన్యులను స్తుతించి ఎరుగడు ఈ శుక్రాచార్యుడు. నేను సదా లోక కళ్యాణార్ధం నిమగ్నుడనై ఉంటూ, పరమాత్మ నాకనుగ్రహించిన వరాలను, జగత్కళ్యాణానికి వినియోగిస్తాను. శర్మిష్ఠ ఆవేశంలో అన్న మాటలను, అంతగా పట్టించుకోకు. నీ కంటే వయస్సులో చిన్నది శర్మిష్ఠ. పైగా రాజపుత్రిక. తనతో మనకి పంతమేమిటి? శాంతించు. నా మాట విను' అంటూ అనునయించాడు.

ఎర్రబడిన ముఖంతో, అవమాన భారంతో రగిలిపోతున్న దేవయానికి, తండ్రి మాటలు రుచించలేదు. కోపంతో ఊగిపోతున్న దేవయానిని చూసి శుక్రాచార్యుడు, 'అమ్మా, మనకు కోపం వలదు. వెయ్యి యజ్ఞాలు చేసిన వాళ్ళకంటే, కోపాన్ని అధిగమించి, అదుపులో ఉంచుకున్న వారే గొప్పవారు. మాట అన్నవారు అగ్రజులూ కారు, పడ్డవారు చిన్న వారూ కారు. అజ్ఞానంతో పిల్లలు పోట్లాడుకోవచ్చు.. వారిని పెద్దలు అనుకరించ కూడదు. అన్నీ తెలిసిన బుద్ధిమంతురాలివి నువ్వు. నీకు నేను చెప్పాలా!' అన్నాడు శుక్రాచార్యుడు. తండ్రి మాటలకు నెమ్మదించిన దేవయాని, ‘నాన్నా, మీరెన్నైనా చెప్పండి. వృషపర్వుడి రాజ్యంలో మాత్రం అడుగు మోపను. శర్మిష్ఠ కఠినోక్తులతో గాయపడిన నా హృదయం, తిరిగి స్వస్థతను పొందలేదు. కావలిస్తే మీరు వెళ్ళండి.. నేను మాత్రం రాను' అని నిష్కర్షగా చెప్పింది. ఆ మాటలు శుక్రాచార్యుణ్ణి మిక్కిలి బాధించాయి. అతనిలో క్రోధాన్ని రగిల్చాయి. తక్షణమే బయలుదేరి, వృషపర్వుని సమీపించాడు. వృషపర్వుని రాజ్యం ధర్మానికి దూరంగానూ, పాపానికి దగ్గరగానూ చరిస్తోందనీ, అటువంటి రాజ్యంలో ఉండలేననీ, తక్షణమే రాజ్యాన్ని త్యజిస్తున్నానీ, తెగేసి చెప్పాడు. జరిగిన తతంగమంతా చారులద్వారా  అంతకు  ముందే తెలుసుకున్న వృషపర్వుడు, జరిగిన అపరాధాన్ని మన్నించమని, శుక్రాచార్యుడిని బ్రతిమాలాడు.

'ఈ ఆస్తీ, పాస్తీ, రాజ్యం, ప్రజలూ, అంతా మీరు పెట్టిన భిక్షే. మీరు లేకపోతే, ఏనాడో మమ్మల్ని ఆపోశనం పట్టేసి, అంతం చేసే వాళ్ళు దేవతలు. మమ్మల్ని మన్నించి, కనికరించండి.' అంటూ, అనేక విధాల ప్రాధేయ పడ్డాడు వృషపర్వుడు. అప్పటికీ చల్లారని శుక్రాచార్యుడు, 'వృషపర్వా! నీ మాటలు నాకనవసరం. నా బిడ్డకు కలిగిన దు:ఖాన్ని నేను భరించలేకపోతున్నాను. నా కూతురు దేవయాని బాధను నీవు ఉపశమింప జేయగలిగితే, నాతో మీకు సంబంధాలు మిగులుతాయి. లేదంటే, శాశ్వతంగా తెగిపోతాయి.' అని ఖరాఖండిగా చెప్పాడు. అంతట వృషపర్వుడు, 'ఆచార్య, అంతటి కఠోర నిర్ణయాలు తీసుకోవద్దు. జరిగిన పాపంలో నా పాత్ర ఉంటే, నాకు సద్గతులుండవు. నా పాపానికి నిష్కృతి ఉండదు. అమ్మాయిని శాంతించమనండి. ఆమె ఏది కోరితే అది ఇచ్చుకుంటాను. ఆమె చెప్పినట్లుగానే  నడుచుకుంటాను. సదా మీ అనుగ్రహాన్ని కోరుకునే ఈ దాసుడు, మీ ఆగ్రహానికి తాళలేడు.' అంటూ స్తుతించాడు వృషపర్వుడు. శుక్రాచార్యునితో కలసి, వృషపర్వుడు దేవయాని వద్దకు వెళ్ళాడు. 'అమ్మా దేవయానీ. నేను ఈ దేశానికి రాజునే గానీ, మీ తండ్రికి సేవకుడను. నీకు జరిగిన తప్పిదానికి, మిక్కిలి చింతిస్తున్నాను. నీకు ఎలాంటి పరిష్కారం కావాలో, నిస్సంకోచంగా చెప్పు. తక్షణమే అమలు చేస్తాను.' అని అన్నాడు. 'అయితే వినండి మహారాజా! తన వెయ్యి మంది చెలికత్తెలతో సహా, మీ కూతురు శర్మిష్ఠను నాకు దాసీగా చేయండి. అంతేకాదు, నాకు వివాహమై, అత్తవారింటికి వెళ్ళినా సరే, శర్మిష్ఠ, ఆమె సహస్ర దాసీ పరివారం, అక్కడ కూడా నన్ను సేవించాలి.' అని మొక్కవోని ధైర్యంతో పలికింది దేవయాని.

ఆమె మాటలు విన్న వృషపర్వుడు, దేవయాని మనోరథాన్ని నెరవేర్చడానికి సంసిద్ధుడయ్యాడు. కుల ప్రయోజనాన్ని ఆశించి, వ్యక్తిని త్యజించవచ్చు. గ్రామ  శ్రేయస్సు కోసం, కులాన్ని త్యజించవచ్చు. జన కల్యాణానికై,  గ్రామాన్ని త్యజించవచ్చు. ఆత్మార్థం కోసం, ప్రపంచాన్నే త్యాగం చేయవచ్చు. ఆచార్యా! దేవయాని కోరికను నేను సఫలం చేస్తాను. నా యావత్ దానవ జాతి శ్రేయస్సు కోరి, శర్మిష్ఠను త్యజిస్తాను.' అని పలికి, శర్మిష్ఠను పిలిపించాడు. దేవయానికి దాసీగా సమర్పించాడు. శర్మిష్ఠ, విషయాన్ని గ్రహించింది. తండ్రి మనోవేదనను అర్థం చేసుకుంది. దేవయాని కోరినట్లు,  జీవితాంతం ఆమెను సేవించేందుకు అంగీకరించింది. రాజ కుమార్తె శర్మిష్ఠ వెంట, వెయ్యి మంది పరిచారికలు కూడా,  దేవయానిని అనుసరించారు. అప్పుడు దేవయాని, 'నాన్నా, ఈ సంఘటనతో, నాకొక విషయం అవగతమైంది. విద్యకు గల బలం, విత్తానికి గానీ, అధికారానికి గానీ లేదని, నాకు అర్థమయ్యింది. పదండి నాన్నా, మీ వెంట నగరానికి వస్తున్నాను.' అంటూ, సంతోషంగా నడిచింది దేవయాని. రాచ మర్యాదలతో, శుక్రాచార్యుణ్ణీ,  దేవయానినీ నగరంలోకి ఆహ్వానించారు, దానవులు.

ఇక మన తదుపరి వీడియోలో, దేవయానీ, యయాతిల కలయిక, వివాహం, యయాతి దేవయానిని మోసం చేసిన వైనం, యయాతికి శుక్రాచార్యుడిచ్చిన శాపం వంటి విషయాల గురించి, తెలుసుకుందాము..

26 January, 2022

జన్మ మృత్యు సంసార చక్రం! Bhagavadgita

  

జన్మ, మృత్యు, సంసార చక్రం!

'భగవద్గీత' పంచమోధ్యాయం - కర్మ సన్న్యాస యోగం (07 – 12 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో ఐదవ అధ్యాయం, కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ సన్న్యాస యోగంలోని 07 నుండి 12 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ncVFV_BFNzs ]

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, ఆత్మ శుద్ధి కోసం ఆచరించే కర్మల గురించి, శ్రీ కృష్ణుడు చెప్పబోతున్నాడు..

00:46 - యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।

పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతి ప్రాణిలోని ఆత్మలో, పరమాత్మను  దర్శిస్తారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, వారు కర్మబంధాలలో చిక్కుకోరు.

కర్మయోగులలో వివిధ రకాల వారు ఉన్నారు. 
విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు, 
విజితాత్మా - మనస్సుని జయించినవాడు, 
జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.

ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందూ భగవంతుడినే దర్శిస్తారు. అందరితో  గౌరవప్రదంగా మెలుగుతూ ఉంటారు. వారు చేసే కార్యకలాపాలు, స్వార్థ ప్రయోజనం కోసం కాదు కాబట్టి, వారి జ్ఞానం, క్రమక్రమంగా వృద్ధిచెందుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక  భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. అవి ఇక భగవత్ సేవకు అందుబాటులో ఉంటాయి. భక్తి యుక్త సేవ, అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము సహజ పద్ధతిలో, జ్ఞానోదయ దిశగా, ఒక్కొక్క మెట్టూ పైకి తీసుకువెళుతుంది. కాబట్టి, ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

02:08 - నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్
పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్ఛన్ స్వపన్ శ్వసన్ ।। 8 ।।

02:18 - ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ।
ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ ।। 9 ।।

కర్మ యోగములో ధృఢ సంకల్పంతో స్థితులై ఉన్న వారు, చూస్తున్నప్పుడూ, వింటున్నప్పుడూ, స్పృశిస్తున్నప్పుడూ, వాసన చూస్తున్నప్పుడూ, భుజిస్తున్నప్పుడూ, కదులుతున్నప్పుడూ, నిద్రిస్తున్నప్పుడూ, శ్వాస క్రియలప్పుడూ, మాట్లాడుతున్నప్పుడూ, త్యజించేటప్పుడూ, గ్రహించేటప్పుడూ, కన్నులు తెరుస్తున్నప్పుడూ, మూస్తున్నప్పుడూ, "చేసేది నేను కాదు" అన్ని ఎల్లప్పుడూ భావిస్తారు. ప్రాకృతిక ఇంద్రియములే, వాటి వాటి విషయములలో కదులుతున్నట్లు, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంతో గ్రహిస్తారు.

మనం ఎప్పుడైనా గొప్ప విషయం సాధిస్తే, మనమే ఏదో గొప్ప పని చేసినట్టు గర్వపడుతుంటాము. ఈ కర్తుత్వ భావనతో వచ్చే  గర్వం, ప్రాపంచిక దృక్పథాన్ని దాటి పోవటానికి, పెద్ద అడ్డంకిగా మారుతుంది. కానీ, భగవత్ దృక్పథంలో ఉన్న కర్మ యోగులు, ఈ అడ్డంకిని సునాయాసంగా అధిగమిస్తారు. పరిశుద్ధమొనర్చుకున్న బుద్ధితో, వారు తమని తాము శరీరం కంటే వేరుగా చూస్తారు కాబట్టి, తమ శారీరిక క్రియలను, తమకు ఆపాదించుకోరు. శరీరము, భగవంతుని యొక్క ప్రాకృతిక శక్తితో  తయారు చేయబడినది. కాబట్టి, వారు చేసే అన్ని పనులూ, భగవత్ శక్తి ద్వారా చేయబడినట్లు భావిస్తారు. వారు ఈశ్వర  సంకల్పానికి శరణాగతి చేశారు కాబట్టి, తమ మనోబుద్ధులకు, ఆయన దివ్య సంకల్పం అనుగుణంగా ప్రేరణ పొందటానికి, కృషి చేస్తారు. ఈ విధంగా, భగవంతుడే అన్ని పనులూ చేస్తున్నాడనే భావనలో, దృఢంగా స్థితులై ఉంటారు.

03:54 - బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః ।
లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా ।। 10 ।।

సమస్త మమకారాసక్తులనూ త్యజించి, భగవంతునికే తమ అన్ని కర్మలనూ అంకితం చేసేవారు, తామరాకు, నీటిచే తడపబడనట్లు,  వారు పాపముచే తాకబడరు.

తామర పువ్వును, భగవంతుని దివ్య శరీర భాగాలని వర్ణించేటప్పుడు, ఒక గౌరవ ప్రదమైన ఉపమానంగా వాడతారు. తామర పూవుకు మరోక పేరు, 'పంకజము'.. అంటే, "బురద నుండి జన్మించినది". కొలను అడుగున ఉండే బురద నుండి, తామర పూవు జనిస్తుంది. నీటి ఉపరితలం పైకి పెరిగి, సూర్యుని వైపు పుష్పిస్తుంది. బురదలో పుట్టినా, తన  అందాన్నీ, స్వచ్ఛతనూ కాపాడుకుంటుంది. కొలను నీటి ఉపరితలంపై తేలియాడే తామరాకులు, నీటిని అంటుకోనివ్వవు. తామరాకుకున్న అద్భుతమైన గుణం ఏమిటంటే, అది నీటిలోనే పుట్టి పెరిగినా, నీటిని తాకనివ్వదు. అదే విధంగా, కర్మ యోగులు, అన్ని పనులూ చేస్తున్నా, వారు భగవత్ దృక్పథంలో పని చేయటం వలన, వారికి పాపము అంటదు.

04:58 - కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి ।
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే ।। 11 ।।

యోగులు మమకారాసక్తిని విడిచిపెట్టి, కేవలం ఆత్మ శుద్ధి కోసం మాత్రమే, శరీరమూ, మనస్సూ, ఇంద్రియములతో కర్మలను ఆచరిస్తూ ఉంటారు.

ఆనందాన్ని అన్వేషిస్తూ, భౌతిక, ప్రాపంచిక కోరికల వెంటపడటం అనేది, ఎడారిలో ఎండమావి వెంట పడటం లాంటి వృధా ప్రయాసే అని, యోగులు అర్థం చేసుకుంటారు. వాస్తవాన్ని తెలుసుకుని, వారి స్వార్ధ కోరికలను త్యజించి, అన్ని కర్మలూ భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. కేవలం ఆయనే, అన్ని కర్మల యొక్క సర్వోన్నత భోక్త అని విశ్వసిస్తారు. అయితే, అంత:కరణ శుద్ధి అనేది, మన చేతిలోనే ఉంటుంది. మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, దానిని భక్తిలో నిమగ్నం చేస్తే, అదే భగవంతునికి అమితానందాన్నిస్తుంది. దీనిని అర్థం చేసుకున్న గొప్ప యోగులు, తమ అంతఃకరణ శుద్ధిని, అతిముఖ్యమైన లక్ష్యంగా చేసుకుంటారు. దానిని స్వార్థం కోసం కాకుండా, భగవత్ ప్రీతి కోసమే చేస్తారు.

06:03 - యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ ।
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే ।। 12 ।।

అన్ని క్రియాకలాపముల ఫలాలను భగవంతునికే అర్పితము చేసి, కర్మ యోగులు శాశ్వతమైన శాంతిని పొందుతారు. అదే  సమయంలో, తమ కోరికలచే ప్రేరేపింపబడి, స్వార్థ ప్రయోజనాల కోసం పని చేసే వారు, కర్మ బంధములలో  చిక్కుకుంటారు. ఎందుకంటే, వారు కర్మ ఫలములపై ఆసక్తి కలిగి ఉంటారు.

చేసే పని ఒక్కటే అయినా, కొందరు భౌతిక బంధాలలో చిక్కుకుంటారు. అదే సమయంలో మరి కొందరు, భౌతిక  బంధాలనుండి విముక్తిని పొందుతారు. భౌతిక ఫలాలపై ఆసక్తి లేకుండా, వాటిచే ప్రేరేపింపబడకుండా ఉన్న వారు, కర్మ బంధాలలో చిక్కుకోరు. కానీ, ప్రతిఫలం కోసం ప్రాకులాడుతూ, భౌతిక సుఖాలనుభవించాలనే కామానికి వశమై పోయిన వారు, కర్మబంధ ప్రతి క్రియలలో చిక్కుకుంటారు. భగవంతునితో మానసికంగా ఏకమైపోయిన యుక్త పురుషులు, తమ కర్మలకు ప్రతిఫలాన్ని ఆశించకుండా, ప్రతిగా, అంతఃకరణ శుద్ధి కోసం మాత్రమే, కర్మలు చేస్తుంటారు. కాబట్టి, వారు త్వరలోనే దివ్య జ్ఞానాన్నీ, మరియు శాశ్వతమైన ముక్తినీ పొందుతారు. భగవంతునితో ఏకమవ్వని అయుక్త పురుషులు, అత్యాశచే ఉసికొల్పబడి, వ్యామోహంతో, కర్మ ఫలములను ఆశిస్తారు. ఇటువంటి దృక్పథంతో చేయబడిన పనులు, జన్మ-మృత్యు సంసార చక్రం లో బంధించివేస్తాయి.

ఇక మన తదుపరి వీడియోలో, నిజమైన సంతోషాలు పొందాలంటే ఏంచేయాలో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!