Ads

Showing posts with label Kartika Paurnami. Show all posts
Showing posts with label Kartika Paurnami. Show all posts

08 November, 2021

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత? Significance of Karthika Deepam

  

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత?

కార్తీకమాసం అనగానే, తెల్లవారు ఝామున స్నానాలూ, ఉభయ సంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలూ, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం.. చక్కని సందడి!


ఇందులో దివ్యత్వంతో పాటు, ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి..

చిరు చలిలో బద్ధకాన్ని వదుల్చుకుని చేసే స్నానం, చిరు దీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం..

ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి, ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళా చాతురిని కొనియాడవలసిందే..

కార్తీకంలో, దేశమంతా ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ, దైవాన్ని కొలుచుకుంటారు.

కార్తీకం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికీ ప్రాధాన్యం..

కృత్తికా నక్షత్రం నాడు, పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం..

కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి, ఆరాధించడమే యజ్ఞం..

అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది, కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే, 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది..

కార్తీకంలో దీపార్చన, దీప దానం వంటివి, యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి..

భర్తృహరి తన శతక సాహిత్యంలో, పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం, యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు..

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా, ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి, ఉపాసించమని ఉపదేశించే మాసమిది..

ఓం నమః శివాయ!

29 November, 2020

అరుణాచల - కార్తీక దీపం!


అరుణాచల - కార్తీక దీపం!

పవిత్ర తిరువణ్ణామలై 'కార్తీక దీపం' ఉత్సవం నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపై దీప ప్రజ్వలన గావించే (పర్వత రాజకుల) వారి వంశ చరిత్ర..

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీప ఉత్సవము నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపైన దీప జ్వలన గావించే గొప్ప అవకాశం, పర్వత రాజకులనబడే వంశస్తులచే, లేదా ఆ కులము వారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ పవిత్ర దీపమునకు కావలసిన 

పవిత్ర వస్త్రములు, సేవలుగా, పురాతన కాలంనుండి చేయడం జరుగుతోంది. ఈ వంశము వారు, తమ యొక్క ఈ మహా దివ్య కార్యాన్ని, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ సమస్త సృష్టికి, లోక నాయకుడిగా ఉదయించిన పరమేశ్వరుని మహా దివ్య రూపమే, అరుణ గిరి.

ఆ పరమ శివుడే దివ్య జ్యోతి స్వరూపముగా, కృత్తికా దీపము నాడు కనపడుచున్నారు. తిరువణ్ణామలై, పరమ పవిత్రమైన పర్వతము.   ఇక్కడ ఉన్న మట్టి కూడా, మహేశ్వర రూపమే. ప్రతీ రాయి, పరమేశ్వరుని లింగ రూపమే. ముప్పై కోట్ల దేవతలు పూజించిన స్వయంభువు రూపమే, అణ్ణామలై. సాక్షాత్తు భువి కైలాసంగా కీర్తించబడుచున్నది. మానవ జీవిత పరమార్ధం, మానవ జన్మ ప్రయోజనం చూడటమే. ఈ జ్యోతి దర్శనం. మనలోని అంతః జ్యోతి రూపుడైన ఈశ్వరుని దర్శించడమే, ఈ కృత్తికా దీప దర్శనం. విశ్వవ్యాప్తంగా, ఎంతో అఖండ ఖ్యాతిని పొందిన ఈ అరుణ గిరి పర్వతంపై మహాజ్యోతి చూడటం, ఒక వరం అయితే, అణ్ణామలైలో మహాజ్యోతి వెలిగించడం, ఈ పర్వత రాజ కులము వారు ఎంత ధన్యులో కదా!

తిరువణ్ణామలై కార్తీక పూర్ణమి నాడు, ఈ పర్వత రాజకులం వారికి ఈ మహా యోగం లభించింది. ఈ పర్వత రాజ వంశస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, అణ్ణామలై మహాదీపం వెలిగించే కార్యాన్ని నెరవేర్చేస్తున్నారు. తిరువణ్ణామలై పట్టణంలో మొత్తము, వీరివి మాత్రమే, 2 వేల కుటుంబాలున్నాయి. వారిలో (ఐదుగురు వారసుల కుటుంబం, అరుణ గిరిపై దీపం వెలిగించే హక్కును, పర్వత రాజకులం వారికి ఎలా వచ్చింది? అంటే, ఈ పర్వత రాజకుల రాజవంశంలో పర్వత రాజుకు జన్మించిన జగన్మాత పార్వతీ దేవి, ఈ వంశస్తులు కావడమే, ఆ వంశస్తులు పొందిన మహా యోగం. జగన్మాత పార్వతీ దేవి వంశస్తులే, ఈ పర్వత రాజ కులము వారు. అందుకే, అట్టి పవిత్ర పరమేశ్వరుని సాక్షాత్తు దివ్య స్వరూపమైన అరుణ గిరిని అధిరోహించడానికి. అంతే కాకుండా, అరుణ గిరిపై వెలిగించే దివ్య జ్యోతిని ప్రజ్వలించే అధికారం, ఈ పార్వతీదేవి సంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఉన్నది కనుక, తిరువణ్ణామలై  కొండలపై మహా దీపం వెలిగించే పవిత్రకార్యాన్ని నిర్వహిస్తున్నారు.

పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ ఋషి ధ్యానాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు పాప కార్యమునకు పాల్పడ్డారు. బ్రహ్మఋషి కోపాగ్నికి భయపడి, రాక్షసులు చేపలుగా మారి, సముద్రంలో కనుమరుగవుతారు. రాక్షసులను నాశనం చేయమని, లోకానికి రక్షణ ఇమ్మని, శివుని బ్రహ్మఋషి ప్రార్ధించారు. భక్త రక్షణ ఎరిగిన పరమశివుడు, పర్వత రాజుని పిలిచాడు. సముద్రంలో దాగిన రాక్షసులను చేప రూపంలో నాశనం చేయాలని, ఆయన ఆదేశం. అందుకు సాయం చేయడానికి, విశ్వకర్మ సృష్టించిన జ్ఞాని శెంపాన్ అనే పడవను ఇచ్చాడు. పర్వత రాజు సముద్రంలోకి దూకి, చేపల ఆకార రాక్షసులను పట్టుకొని సంహరించి, తీరంలో పడేసినా, మరణించిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ ప్రాణం పొంది, సముద్రంలోకి దూకి అదృశ్యమవుతున్నారు. ఇలా అనేక మార్లు జరిగి,  అలిసిపోయిన పర్వత రాజు, తన కుమార్తె అయిన పార్వతీ దేవి సాయం కోరారు. పార్వతీ దేవి అఘోరా రూపంలో సముద్రం మధ్యలో నిలబడి, రాక్షస  రూపంలో ఉన్న చేపలను మింగేసి, రాక్షస జాతిని నాశనం చేసింది.

ఆ సమయంలో అనుకోకుండా రాక్షసులకు చెలరేగిన వలలో, సముద్రం కింద తపస్సు చేసిన మీనామరీషి అనే ఋషి, తన తపస్సు భంగం అయిందనే కోపంతో, 'నీ వంశం నాశనం కావాలి. చేపలు పట్టడం వల్ల జీవించాలి' అని పర్వత రాజును శపించాడు. శాపనికి భయపడిన పర్వత రాజు వెళ్లి శివుని ప్రార్ధించాడు. కరుణామయుడు శివుడు కార్తిగై శుభదినాన తిరువణ్ణామలైలో జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాననీ, ఆ జ్యోతిని వెలిగించే పని నీ వంశమే నెరవేర్చడం వలన, ఈ శాప విముక్తి పొందుతారనీ వరం ఇచ్చి, శాప విమోచన మార్గం అనుగ్రహించారు, పరమ శివుడు. ఆ ప్రకారం, అప్పటి నుండి ఈ పవిత్ర కృత్తికా మాసంలో, కార్తీక మహా దీపం వెలిగించే హక్కు పొందిన పర్వత రాజ కులము వారి సంప్రదాయ అనుసరణగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజు వారి కుటుంబ దేవత తిమలాయ్ అంగలమ్మన్ ఆలయ పూజ నిర్వహిస్తారు. దీపమునకు వలయు వస్త్రములను తీసుకుని, ఊరేగింపుగా గిరి శిఖరములపైకి చేరుకుంటారు. రాత్రి 6 గంటలకు, కార్తీకై దీప ప్రజ్వలన చేస్తారు పర్వత రాజకుల వంశం వారు.

నేటి సాయంత్రం జ్యోతి రూపంలో దర్శనమిస్తున్న అరుణాచలేశ్వరుడు! ఓం అరుణాచలేశ్వరాయ నమః!

కార్తీక పౌర్ణమి! జ్వాలాతోరణం! Kartika Paurnami - Jwala Toranam

 

కార్తీక పౌర్ణమి! జ్వాలాతోరణం! శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలాతోరణం". కార్తీక పౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయ ప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, ఆ తరువాత భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు. దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.. ఒకటి.. త్రిపురాసురలనే ముగ్గురు రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడు కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీ మాత దృష్టి దోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది. రెండవ కధ.. అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగు పరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు. జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు. అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది. ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది. ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని, ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రింది నుండి వెళ్ళడం వలన నరక ద్వారా ప్రవేశం తొలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భోవ్ భోవ్ అనే గట్టి అరుపులతో తరుముతుంది. ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది. ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు. అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధ పడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీక పౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరక బాధ నుంచి విముక్తినిస్తాడు. అందుకే ప్రతి శివాలయంలో కార్తీక పౌర్ణమి నాడు విశేషంగా జ్వాలాతోరణం జరుపుతారు. ముఖ్యమైన విధులు.. ఈ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః | దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః || ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు, పక్షులు, దోమలు, చెట్లు, మొక్కలు, ఉభయచరాలు అన్ని కూడా, అవి ఎ ఎ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం. ఎంతో పుణ్యం చేసుకుంటే మనకి ఈ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు. కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి. వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మన లాగే అవికూడా భగవంతుణ్ణి చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి..

Link: https://www.youtube.com/post/UgxoTsxUW1ueToux5_N4AaABCQ

28 November, 2020

రేపు కార్తీక పౌర్ణమి రోజు '29/11/2020' చదవవలసిన కార్తీక దీప నమస్కార శ్లోకం! Kartika Paurnami


రేపు కార్తీక పౌర్ణమి రోజు '29/11/2020' చదవవలసిన కార్తీక దీప నమస్కార శ్లోకం!

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః!

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!

వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి, పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. ఆ కార్తీక దీపానికి నమస్కారం చేయాలి.

ఆ రోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు, మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి.. అంతే కాదు.. చెరువు ఉందనుకోండి, అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిపై ఉన్నటువంటి పురుగులు, ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి.

ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో, ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో, ఆఖరికి చెట్లు కూడా.. అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ పొంది, ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది, ఈశ్వర కర్మానుష్ఠానము చేసి, భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి, దీపం వెలిగించి నమస్కరిస్తారు.

ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. దీపపు కాంతి పడితేనే, అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే, ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?

సర్వేజనాః సుఖినోభవంతు!

Link: https://www.youtube.com/post/Ugycb5suQYb1Eb4K53J4AaABCQ