Ads

Showing posts with label Kartika Deepam. Show all posts
Showing posts with label Kartika Deepam. Show all posts

08 November, 2021

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత? Significance of Karthika Deepam

  

కార్తీక మాసంలో దీపారాధనకు ఎందుకంత ప్రాధాన్యత?

కార్తీకమాసం అనగానే, తెల్లవారు ఝామున స్నానాలూ, ఉభయ సంధ్యల్లో శివకేశవాది ఆలయాలలో దీపారాధనలూ, నదులలో, తటాకాలలో దీపాలను విడిచి పెట్టడం.. చక్కని సందడి!


ఇందులో దివ్యత్వంతో పాటు, ఉత్సాహం, ఉల్లాసం వెల్లివిరుస్తాయి..

చిరు చలిలో బద్ధకాన్ని వదుల్చుకుని చేసే స్నానం, చిరు దీపాలు నీటి అలల్లో తేలియాడుతుంటే ఉండే సౌందర్యం..

ప్రకృతిలో దివ్యత్వాన్ని ప్రతిష్ఠించి, ప్రదర్శించే హైందవ మతంలోని దివ్యకళా చాతురిని కొనియాడవలసిందే..

కార్తీకంలో, దేశమంతా ప్రత్యేకంగా, ఆధ్యాత్మిక చైతన్యంతో విలసిల్లుతుంది. ఎవరికి తగ్గ నియమాన్ని వారు పాటిస్తూ, దైవాన్ని కొలుచుకుంటారు.

కార్తీకం దీపానికీ, మాఘం స్నానానికీ, వైశాఖం దానానికీ ప్రాధాన్యం..

కృత్తికా నక్షత్రం నాడు, పూర్ణిమ ఏర్పడే మాసం కార్తికం..

కృత్తిక అగ్ని నక్షత్రం. అగ్నియందు ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి, ఆరాధించడమే యజ్ఞం..

అందుకే వేదాలలో 'నక్షత్రేష్టి' అనేది, కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమవుతుంది. ఆ యజ్ఞతత్వానికి సంకేతంగానే, 'దీపారాధన' అనేది కార్తికంలో ప్రధానమయ్యింది..

కార్తీకంలో దీపార్చన, దీప దానం వంటివి, యజ్ఞఫలాలను ప్రసాదిస్తాయి..

భర్తృహరి తన శతక సాహిత్యంలో, పరమేశ్వరుని 'జ్ఞానదీపం'గా అభివర్ణించాడు. ఈ దీపం, యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తోందని సంభావించాడు..

జ్యోతిర్లింగ స్వరూపుడైన శివునకు ప్రతీకగా, ప్రతి దీపమూ ఒక జ్యోతిర్లింగమై భాసిస్తూ, విశ్వవ్యాపకమైన ఈశ్వరజ్యోతిని దర్శించి, ఉపాసించమని ఉపదేశించే మాసమిది..

ఓం నమః శివాయ!

29 November, 2020

అరుణాచల - కార్తీక దీపం!


అరుణాచల - కార్తీక దీపం!

పవిత్ర తిరువణ్ణామలై 'కార్తీక దీపం' ఉత్సవం నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపై దీప ప్రజ్వలన గావించే (పర్వత రాజకుల) వారి వంశ చరిత్ర..

పవిత్ర తిరువణ్ణామలై కార్తీక దీప ఉత్సవము నాడు, దివ్య అరుణ గిరి శిఖరములపైన దీప జ్వలన గావించే గొప్ప అవకాశం, పర్వత రాజకులనబడే వంశస్తులచే, లేదా ఆ కులము వారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ పవిత్ర దీపమునకు కావలసిన 

పవిత్ర వస్త్రములు, సేవలుగా, పురాతన కాలంనుండి చేయడం జరుగుతోంది. ఈ వంశము వారు, తమ యొక్క ఈ మహా దివ్య కార్యాన్ని, ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ సమస్త సృష్టికి, లోక నాయకుడిగా ఉదయించిన పరమేశ్వరుని మహా దివ్య రూపమే, అరుణ గిరి.

ఆ పరమ శివుడే దివ్య జ్యోతి స్వరూపముగా, కృత్తికా దీపము నాడు కనపడుచున్నారు. తిరువణ్ణామలై, పరమ పవిత్రమైన పర్వతము.   ఇక్కడ ఉన్న మట్టి కూడా, మహేశ్వర రూపమే. ప్రతీ రాయి, పరమేశ్వరుని లింగ రూపమే. ముప్పై కోట్ల దేవతలు పూజించిన స్వయంభువు రూపమే, అణ్ణామలై. సాక్షాత్తు భువి కైలాసంగా కీర్తించబడుచున్నది. మానవ జీవిత పరమార్ధం, మానవ జన్మ ప్రయోజనం చూడటమే. ఈ జ్యోతి దర్శనం. మనలోని అంతః జ్యోతి రూపుడైన ఈశ్వరుని దర్శించడమే, ఈ కృత్తికా దీప దర్శనం. విశ్వవ్యాప్తంగా, ఎంతో అఖండ ఖ్యాతిని పొందిన ఈ అరుణ గిరి పర్వతంపై మహాజ్యోతి చూడటం, ఒక వరం అయితే, అణ్ణామలైలో మహాజ్యోతి వెలిగించడం, ఈ పర్వత రాజ కులము వారు ఎంత ధన్యులో కదా!

తిరువణ్ణామలై కార్తీక పూర్ణమి నాడు, ఈ పర్వత రాజకులం వారికి ఈ మహా యోగం లభించింది. ఈ పర్వత రాజ వంశస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో, అణ్ణామలై మహాదీపం వెలిగించే కార్యాన్ని నెరవేర్చేస్తున్నారు. తిరువణ్ణామలై పట్టణంలో మొత్తము, వీరివి మాత్రమే, 2 వేల కుటుంబాలున్నాయి. వారిలో (ఐదుగురు వారసుల కుటుంబం, అరుణ గిరిపై దీపం వెలిగించే హక్కును, పర్వత రాజకులం వారికి ఎలా వచ్చింది? అంటే, ఈ పర్వత రాజకుల రాజవంశంలో పర్వత రాజుకు జన్మించిన జగన్మాత పార్వతీ దేవి, ఈ వంశస్తులు కావడమే, ఆ వంశస్తులు పొందిన మహా యోగం. జగన్మాత పార్వతీ దేవి వంశస్తులే, ఈ పర్వత రాజ కులము వారు. అందుకే, అట్టి పవిత్ర పరమేశ్వరుని సాక్షాత్తు దివ్య స్వరూపమైన అరుణ గిరిని అధిరోహించడానికి. అంతే కాకుండా, అరుణ గిరిపై వెలిగించే దివ్య జ్యోతిని ప్రజ్వలించే అధికారం, ఈ పార్వతీదేవి సంప్రదాయానికి చెందిన వారికి మాత్రమే ఉన్నది కనుక, తిరువణ్ణామలై  కొండలపై మహా దీపం వెలిగించే పవిత్రకార్యాన్ని నిర్వహిస్తున్నారు.

పూర్వము ఒకానొక సమయంలో బ్రహ్మ ఋషి ధ్యానాన్ని భగ్నం చేయడానికి రాక్షసులు పాప కార్యమునకు పాల్పడ్డారు. బ్రహ్మఋషి కోపాగ్నికి భయపడి, రాక్షసులు చేపలుగా మారి, సముద్రంలో కనుమరుగవుతారు. రాక్షసులను నాశనం చేయమని, లోకానికి రక్షణ ఇమ్మని, శివుని బ్రహ్మఋషి ప్రార్ధించారు. భక్త రక్షణ ఎరిగిన పరమశివుడు, పర్వత రాజుని పిలిచాడు. సముద్రంలో దాగిన రాక్షసులను చేప రూపంలో నాశనం చేయాలని, ఆయన ఆదేశం. అందుకు సాయం చేయడానికి, విశ్వకర్మ సృష్టించిన జ్ఞాని శెంపాన్ అనే పడవను ఇచ్చాడు. పర్వత రాజు సముద్రంలోకి దూకి, చేపల ఆకార రాక్షసులను పట్టుకొని సంహరించి, తీరంలో పడేసినా, మరణించిన రాక్షసులు మళ్ళీ మళ్ళీ ప్రాణం పొంది, సముద్రంలోకి దూకి అదృశ్యమవుతున్నారు. ఇలా అనేక మార్లు జరిగి,  అలిసిపోయిన పర్వత రాజు, తన కుమార్తె అయిన పార్వతీ దేవి సాయం కోరారు. పార్వతీ దేవి అఘోరా రూపంలో సముద్రం మధ్యలో నిలబడి, రాక్షస  రూపంలో ఉన్న చేపలను మింగేసి, రాక్షస జాతిని నాశనం చేసింది.

ఆ సమయంలో అనుకోకుండా రాక్షసులకు చెలరేగిన వలలో, సముద్రం కింద తపస్సు చేసిన మీనామరీషి అనే ఋషి, తన తపస్సు భంగం అయిందనే కోపంతో, 'నీ వంశం నాశనం కావాలి. చేపలు పట్టడం వల్ల జీవించాలి' అని పర్వత రాజును శపించాడు. శాపనికి భయపడిన పర్వత రాజు వెళ్లి శివుని ప్రార్ధించాడు. కరుణామయుడు శివుడు కార్తిగై శుభదినాన తిరువణ్ణామలైలో జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాననీ, ఆ జ్యోతిని వెలిగించే పని నీ వంశమే నెరవేర్చడం వలన, ఈ శాప విముక్తి పొందుతారనీ వరం ఇచ్చి, శాప విమోచన మార్గం అనుగ్రహించారు, పరమ శివుడు. ఆ ప్రకారం, అప్పటి నుండి ఈ పవిత్ర కృత్తికా మాసంలో, కార్తీక మహా దీపం వెలిగించే హక్కు పొందిన పర్వత రాజ కులము వారి సంప్రదాయ అనుసరణగా వస్తున్న ఆనవాయితీ. ఈ రోజు వారి కుటుంబ దేవత తిమలాయ్ అంగలమ్మన్ ఆలయ పూజ నిర్వహిస్తారు. దీపమునకు వలయు వస్త్రములను తీసుకుని, ఊరేగింపుగా గిరి శిఖరములపైకి చేరుకుంటారు. రాత్రి 6 గంటలకు, కార్తీకై దీప ప్రజ్వలన చేస్తారు పర్వత రాజకుల వంశం వారు.

నేటి సాయంత్రం జ్యోతి రూపంలో దర్శనమిస్తున్న అరుణాచలేశ్వరుడు! ఓం అరుణాచలేశ్వరాయ నమః!