Ads

01 January, 2021

తిరుప్పావై గోదాదేవి 17వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

పదహేడవ రోజు అనగా 01.01.2021 శుక్రవారము..

17 వ రోజు - ఆచార్యుడి ద్వారా అందే మంత్రం..

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము:

అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం

ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్

కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే

ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్

అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద

ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!

ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్

ఈ రోజు ఆచార్యుడు, ఆచార్యుడి ద్వారా అందే మంత్రం, ఆ మంత్రార్థం అయిన పరమాత్మ, ఆ పరమాత్మను అందించే భాగవతోత్తముల సేవ, ఇవన్నీ పాశురంలో వివరించింది.

నిన్న ద్వారపాలకులు మనవాళ్ళను లోనికి పంపాక, ఒక్క సారి తొంగి చూసారు. అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదట నందగోపుడు, తరువాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించట్లేదు, కాని ఒక కాలికి కడియం వేసి ఉంది, మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుషా వారు కృష్ణ, బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు. ఏక్రమంలో చూస్తున్నారో అదే క్రమంలో లేపడం ప్రారంభించారు.

ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆండాళ్. "అమ్బరమే" వస్త్రములు, "తణ్ణీరే" నీళ్ళు, "శోఱే" ఆహారం, "అఱం శెయ్యుం" ఏ ప్రయోజనం ఆశించకుండా, "ఎమ్బెరుమాన్" దానం ఇచ్చే "నందగోపాలా!" నంద గోపాలా "ఎరుందిరాయ్" లేవయ్యా, అనిలేపారు.

ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది, మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం. అదే యశోదమ్మ అని అనొచ్చు, ఎందుకంటే యశస్సును ప్రసాదించేది - యశోద లేక మంత్ర రత్నం.

"కొన్బనార్ క్కెల్లాం" సుందరమైన దేహ స్వరూపం కల్గి, స్త్రీ జాతి కందరికి "కొరుందే!" చిగురులాంటి దానా. "కుల విళక్కే" ఆ కృష్ణ ప్రేమ కల్గిన కులానికే ఒక దీపంలాంటి దానా, "ఎమ్బెరుమాట్టి" నీవే ఆయన అనుగ్రహాన్ని కల్గించే స్వామినివి  "యశోదా!" ఓ యశోదమ్మా! "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో. యశోదమ్మను మంత్రం గా ఊహించింది అందుకే తెలివితెచ్చుకో అని చెబుతుంది. ఓ అష్టాక్షరీ మహా మంత్రమా జ్ఞానాన్ని ప్రసాదించు అని అర్థం. ఇంక యశోదమ్మ కూడా అంగీకరించింది, ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు.

అక్కడ ఒక పాదంలో  కొన్ని గుర్తులు కనబడుతున్నాయి, అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్ళారు. "అమ్బరం ఊడఱుత్తు" ఆకాశం మద్య అంతా ఆక్రమించేట్టుగా "ఓన్గి" పెరిగి "ఉలగళంద"లోకాలను అంతా కొలిచిన, "ఉమ్బర్ కోమానే!" దేవతలందరికి నియంత అయిన స్వామి "ఉఱంగాదు" నిద్ర పోవటానికా నీవు వచ్చావా ఇక్కడికి, "ఎరుందిరాయ్" లేవయ్యా. 

అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది. ఇన్నాళ్ళు మాకు తెలియక నీ వద్దకు రాలేదు, ఇప్పుడు నీగురించి తెల్సుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాళ్ విన్నపించింది.

ఆయన లేవలేదు, అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని ఆండాళ్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది. కృష్ణావతరంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు, బాలరాముణ్ణి  విడిచి ఉండడు. దేవకీ దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు. ఎవ్వరూ దక్కక పోయే సరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణీ దేవి గర్భంలో పెంచారు. ఆ పుట్టిన శిషువుకి ఒక బంగారు కడియం వేశారు. ఆయన పాద విశేషంచే, కృష్ణుడు మనకు దక్కాడు.

"శెమ్బొఱ్ కరలడి" అపరంజి బంగారు కడియం కల్గిన, "చ్చెల్వా" ఓ సంపన్నుడా, "బలదేవా!" బలదేవా! "ఉమ్బియుం నీయుం" నీవు నిద్ర పోకూడదు, "ఉఱంగ్" మమ్మల్ని రక్షించు. అయితే, బలరాముడు లేచి,  మీరు భ్రమించారు. కృష్ణుడు ఇక్కడ లేడు. నీలాదేవి భవనంలో ఉన్నాడని, రహస్యాన్ని చెప్పాడు.

సంక్షిప్త భావం:

ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.

అవతారిక:

ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు.

ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.      

(ఆనందబైరవి రాగము - ఝంపెతాళము)

ప.. లేవయ్యా మా స్వామి! నందగోపాలా!

      లేవయ్యా స్వామి! మా సర్వప్రదాతా!

అ..ప.. లేవమ్మ మాయమ్మా! లే యశోదమ్మా!

            లేవె! స్త్రీ జాతి కంతకును తలమానికమ!

చ.. ఆకాశమున జీల్చి లోకాల గొలిచిన శ్రీకృష్ణ!

      మేలుకో! నిత్య సూరుల స్వామి!

      శ్రీ కీర్తి కంకణాల్ ధరియించు బలదేవ!

      ఇంక నిదురింపకుమ! లెమ్ము! కృష్ణుని తోడ!

      లేవయ్య మా స్వామి! నందగోపాలా!

      లేవయ్య స్వామి మా సర్వప్రదాతా!

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/Ugw4Jc4TttTDRxVKYcN4AaABCQ

No comments: