Ads

06 December, 2020

‘తిరుమల మూలవిరాట్టు ఎవరో నిరూపించిన’ రామానుజాచార్యులు! Part 2!


‘తిరుమల మూలవిరాట్టు ఎవరో నిరూపించిన’ రామానుజాచార్యులు! Part 2!

మమతనూ, మానవతనూ ప్రవచించిన సమతా మూర్తీ, అత్యంత దయాళుడు, వేదానికి సరైన నిర్వచనం చెప్పి, సనాతన ధర్మం గొప్పదనాన్నీ, ఆధ్యాత్మికతనూ, మానవీయ విలువలనూ.., శ్రీవేంకటేశ్వరుని ప్రాభవం.., విశిష్టాద్వైత గొప్పదనాన్నీ ప్రచారం చేసిన మహనీయులు, శ్రీ రామానుజాచార్యులు. ఆయన సమాజంలో తీసుకువచ్చిన గొప్ప సంస్కరణల గురించీ, విశిష్టాద్వైతానికి ఆయన చేసిన కృషి గురించీ, ఎంత చెప్పినా తక్కువే. ఈ రోజు ఆయన జీవితంలో చిరస్మరణీయంగా నిలిచి, నేటి తరానికి సాక్ష్యంగా మిగిలిన కొన్ని సంఘటనల గురించి, తెలుసుకుందాం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/d5_mFcDNQ9o ]

కంచిలోని, యాదవ ప్రకాశుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో, గురువుతో అనేక వాదోపవాదాలు చేశారు, రామానుజులు. ఉపనిషత్తులలోని వ్యాఖ్యానాలను వివరిస్తూ, తప్పుగా బోధిస్తున్న వ్యాఖ్యానాలకు సరైన వివరణలిచ్చారు, రామానుజాచార్యులు. దాంతో, ఆయన యెక్క పాండిత్యం, ఆస్థికత్వంతో కూడిన ఆర్ద్రతాభావం, భక్తిపూరితమైన వ్యాఖ్యానాలూ, యాదవ ప్రకాశునికి నచ్చక, ఆయనని తన శిష్యుల నుండి తొలగించిన విషయం, గత భాగంలో తెలుసుకున్నాము. రామానుజాచార్యుల మేధస్సు గురించి తెలుసుకున్న, ఆళవందార్ గా ప్రసిద్ధి చెందిన యమునాచార్యులు, ఆయనను శిష్యునిగా చేసుకోవాలని భావించారు. తన ఉద్దేశ్యాన్ని, మహాపూర్ణుడనే శిష్యుని ద్వారా, రామానుజులకు తెలియచేశారు. రామానుజులు ఆళవందార్ ను కలుసుకోవడానికి శ్రీరంగం వచ్చేసరికి, ఆయన తన ఆఖరి శ్వాసను విడిచారు. అంత్యక్రియలకు సిద్ధమైన యమునాచార్యుల కుడి చేతి మూడు వేళ్ళు ముడుచుకుని ఉండటం, రమానుజుచార్యులు గమనించారు.

ఆ మూడు వేళ్ళూ, తాను చేయవలసిన మూడు పనులకు సంకేతమని భావించిన రామానుజులు, మూడు శపథాలను చేశారు. వైష్ణవ సంప్రదాయాలకు సంకేతమైన, పంచ సంస్కార కర్మా, దివ్య ప్రబంధ బోధనా, శరణాగతితో కూడిన మత ప్రతిపాదనా ప్రచారం అనే విధులను, తప్పక నిర్వర్తించటం, వేదాంతానికి మూలస్తంభాల వంటి వేదాంత సూత్రాలకు, సరిక్రొత్త వ్యాఖ్యానాలు వ్రాయడం, భాగవత, విష్ణుపురాణాలను రచించిన వేదవ్యాస, పరాశర మునుల అంశలతో జన్మించిన ఇద్దరు శిశువులను గుర్తించి, వారికా నామధేయాలను ప్రసాదించి, వ్యాస, పరాశరులకు నివాళులు అర్పించడం వంటి శపథాలను చేస్తుండగా, మరణించిన యమునాచార్యుల వారి ఒక్కో వ్రేలు తెరుచుకుంది. ఆ సంఘటనను చైసిన ఆయన శిష్యులు నివ్వెరపోయారు. వారిలో పెరియనంబి అనే శిష్యుడు, రామానుజులతో, తిరుక్కొట్టియూర్ లో, గోష్టిపూర్ణులనే గొప్ప పండితులున్నారు. వారి వద్ద నీవు తిరుమంత్రం, చరమశ్లోకం, అర్ధవిశేషాలను తెలుకోమని సూచించాడు.

దాంతో రామానుజులు, గోష్టిపూర్ణుల దగ్గరకు వెళ్లి, స్పష్టంగా దండ ప్రణామం చేసి, ‘ఆచార్యా! నేను మీ దాసుణ్ణి. మీ వలన తిరుమంత్రం, చరమశ్లోకాలను ఉపదేశంగా పొందాలని వచ్చాను. ఆశీర్వదించండి’ అన్నారు. అతని వినయసంపదకు గోష్టిపూర్ణులు ఎంతో ఆనందపడ్డారు. మంత్రం కోసం వచ్చిన రామానుజులు నిజంగా తపనతో, ఆర్తితో వచ్చాడా, లేక అందరిలా మంత్రోపదేశం పొందడానికి వచ్చాడా? అత్యంత ఆర్తిలేని వారికి, పరమ పవిత్రమైన మంత్రాన్ని ఉపదేశించకూడదనుకుని, 'రామానుజ! ఆ మంత్రోపదేశానికి కొన్ని అర్హతలుండాలి. అవి నీలో ఉన్నాయో లేదో చూసి, అప్పుడు మంత్రోపదేశం చేస్తానని అన్నారు, గోష్టిపూర్ణులు. అలా అయన పెట్టిన పరీక్షలకు ఎదురొడ్డి నిలబడి, గురువు వద్ద నుండి మంత్రోపదేశం పొందారు, రామానుజలు. దివ్యమంత్రోపదేశంతో పులకించిపోయింది, రామానుజుల దేహం. అయన ముఖ పద్మం, మంత్ర భాస్కర కాంతులతో ప్రఫుల్లమైంది. తరువాత నెమ్మదిగా లేచి, ఆచార్యులకు నమస్కరించి, బయలుదేరారు.

మార్గ మధ్యలో, ఇంత ఆర్తితో ఉన్న నాకు, ఈ మంత్రం లభించడం ఇంత కష్టమైతే, మిగిలిన వారు ఈ దివ్య మంత్రాన్ని పొందడం వీలు పడదు కదా? అని ఆలోచించారు. వెంటనే తన గురువు ఉపదేశించిన అత్యంత గోప్యమైన అష్టాక్షరీ మంత్రాన్ని, శ్రీరంగం లోని తిరుకొట్టియూర్ ఆలయ రాజగోపురం పైకెక్కి, అందరికీ వినబడేలా బిగ్గరగా ఉపదేశించాడు. దాంతో, గురువు అక్కడకు చేరుకుని, ఈ మంత్రాన్ని బహిరంగంగా చెబితే, 'నీవు నరకానికి వెళతావు' అని అనగా, అందుకు రామానుజులు, దీనిని తెలుసుకున్న ప్రతీ ఒక్కరూ, స్వర్గానికి వెళతారు. అది చాలు నాకు. అని బదులిచ్చారు. తరువాత కాలంలో ఒకనాడు, తిరుమలలోని మూలవిరాట్టైన ధ్రువబేరం, విష్ణుమూర్తి విగ్రహం కాదనీ, శక్తి విగ్రహమో, శివ ప్రతిమో, సుబ్రహ్మణ్యమూర్తో కావచ్చన్న వివాదం చెలరేగింది. తిరుమల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న యాదవరాజు వద్దకు, శైవులు ఈ వివాదాన్ని తీసుకువెళ్ళి, వాదించారు. 

తిరుమలలో జరుగుతున్న వైష్ణవ పూజలు ఆపు చేయించి, శైవారాధనలకు అవకాశం ఇమ్మని కోరారు. పలువురు వైష్ణవుల ద్వారా, ఈ విషయాన్ని తెలుసుకున్న రామానుజులు, యాదవరాజు కొలువుకు వెళ్ళి, వాదించారు. శైవులతో జరిగిన వాదనలో, పలు పౌరాణిక ఆధారాలనూ, శాస్త్ర విధానాలనూ సాక్ష్యాలుగా చూపి, వారిని ఓడించారు. శైవులు ప్రత్యక్ష ప్రమాణాన్ని కోరారని, రామానుజులు, వేంకటేశ్వరుని విగ్రహం ఎదుట, బంగారంతో చేయించిన వైష్ణవాయుధాలూ, శైవాయుధాలూ, శక్తి ఆయుధాలూ పెట్టి, నీవు ఏ దైవానివైతే, ఆ ఆయుధాలే స్వీకరించు అని ప్రార్థించి, తలుపులు మూసేసారు. ఆ రాత్రి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ గడవగా, తెల్లవారిన తరువాత, తలుపులు తెరిచి చూసే సరికి, ధ్రువబేరానికి శంఖ చక్రాలు అలంకరించి కనిపించాయి. 

ఆ సంఘటనతో, తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని నిర్ధారణై, తిరుమలపై వైష్ణవ ఆరాధనలు కొనసాగించడానికి, యాదవరాజు అంగీకరించారు. తిరుమలలో, కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూసేందుకు, రామానుజులు, ఏకాంగి వ్యవస్థను ఏర్పరిచారు. అదే, తర్వాతి కాలంలో, జీయర్ల వ్యవస్థగా పరిణమించి, స్థిరపడింది. తిరుపతిలో గోవిందరాజుల ఆలయాన్ని నిర్మింపజేసింది, రామానుజులు. యాదవరాజు, ఆ ఆలయం చుట్టూ, ఆలయ పూజారులకు అగ్రహారమిచ్చి, వీధుల నిర్మాణం చేపట్టి, తన గురువుగా భావించే రామానుజుని పేరిట ‘రామానుజపురంగా’, దానిని రూపకల్పన చేశారు. అదే నేటి తిరుపతి నగరానికి పునాది అయ్యింది. రామానుజాచార్యులు, తాను పాంచరాత్రాగమాన్ని పాటించే వ్యక్తయినా, తిరుమలలో పరంపరాగతంగా వస్తోన్న వైఖానస ఆగమాన్ని, కొనసాగించారు. అయితే, అప్పటికున్న వైదికాచారాలతో పాటుగా, కొన్ని ద్రవిడ వేదాలనూ, పాంచరాత్రాగమ ఆచారాలనూ, తిరుమల అర్చనా విధానంలో చేర్చారు.

Link: https://www.youtube.com/post/UgxNh1WW33dJNiRuZOV4AaABCQ

No comments: