Ads

Showing posts with label Day 17. Show all posts
Showing posts with label Day 17. Show all posts

02 December, 2020

కార్తీక పురాణం! (సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణం)


అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము:

'ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము. కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించు చున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది' అని అంగీరసుడు చెప్పగా..

"ఓ మునీంద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యాక్యార్ధమును గురించి నాకు తెలియ జేయండి"యని ధనలోభుడు కోరెను.

అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె, 'ఈ దేహము అంత:కరణ వృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం'  అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము.

ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖముగావుంది'  అనుకొనునదియే ఆత్మ.

దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును,  ప్రకాశింపజేయునటులే, ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన,  దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే  'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము. "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా, సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చనిపోవుట, మొదలగు ఆరు భాగములు, శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడి యున్నదో, అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ, పరమాత్మయని తెలుసుకొనుము.

జీవులచే కర్మ ఫలమనుభవింప జేసేవాడు పరమేశ్వరుడనియు,  జీవులా కర్మ ఫలమును అనుభవింతురనియు, తెలుసుకొనుము. అందువలన, మానవుడు గుణ సంపత్తి గలవాడై, గురు శుశ్రూష నొనర్చి, సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి, విముక్తి నొందవలయును. మంచి పనులు తలచిన చిత్తశుద్దియు, దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు గలిగి, ముక్తి పొందును. అందువలన, సత్కర్మానుష్ఠానము చేయ వలయును. మంచి పనులు చేస్తే గాని, ముక్తి లభించదు' అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనెను.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి 'సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణం' సమాప్తం.

Link: https://www.youtube.com/post/UgzY4omSVy58wQ3JWiR4AaABCQ