Ads

Showing posts with label రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వర ప్రభావం!. Show all posts
Showing posts with label రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వర ప్రభావం!. Show all posts

16 January, 2022

రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వర ప్రభావం! Weird boon of Sri Rama

 

రాముడిని ఊర్మిళా దేవి కోరిన వింత వరం! - ఆ వర ప్రభావం నేటికీ మన పూరీ క్షేత్రంలో కనబడుతుంది!

రామాయణము భారతీయ వాఙ్మయంలో ఆది కావ్యంగానూ, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని, ఆదికవిగానూ సుప్రసిధ్ధము. ఎంతో ఆదరణీయము, పూజనీయము అయిన ఈ కావ్యంలోని ఘట్టాలలోకి వెళితే, రావణ సంహారం జరిగిన తరువాత, రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా, ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒక రోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా, యుద్ధానికి సంబంధించిన విషయాలు, చర్చకు వచ్చాయి. 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషే, ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే, ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడని, ఎవరో గుర్తుచేశారు. ఎంతో ఉత్సుకతను రేకెత్తించే ఈ చర్చలో అంశాలను తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/E2BEx7J9lyg ]

తమ అరణ్యవాసం మొత్తం, నిద్రాహారాలు లేకుండా గడిపిన లక్ష్మణుడి గురించిన ఆ మాటలు విన్న రాములవారికి, ఒక అనుమానం వచ్చింది. ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు, నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు. నీ భార్య ఊర్మిళ, ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని తాననుభవించిందనీ తెలుసు. కానీ, రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు?' అని అడిగారు.

దానికి లక్ష్మణుడు, 'మనం వనవాసం చేస్తున్నన్నాళ్లూ, నాకు అందించిన ఆహారాన్ని, పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని,' అని జవాబిచ్చాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి. కానీ, సరదాగా ఆ ఆహారపు పొట్లాలన్నీ, ఓసారి లెక్కపెడదామని అనుకున్నారు. దాంతో, వాటిని తెప్పించి, సైనికులతో లెక్కించారు. కానీ, లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది.

అప్పుడు రాములవారు, 'లక్ష్మణా! ఓ ఏడు రోజులపాటు ఆహారంగానీ ఆరగించావా ఏం!' అని పరిహాసంగా అడిగారు.

అందుకు లక్ష్మణుడు, 'అన్నయ్యా! మొదటి సందర్భంలో, తండ్రిగారి మరణవార్త తెలిసిన రోజున, మనం ఆహారం తీసుకోనేలేదు. రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున, ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే, మనకు రాలేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన సందర్భంలో, మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు. నేను ఇంద్రుజిత్తు సంధించిన బాణానికి మూర్ఛిల్లిన రోజున, ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు. మర్నాడు ఇంద్రుజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ, ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు. ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున, బ్రహ్మహత్యా పాతకం జరిగిందన్న బాధతో, ఆహారాన్ని అందించలేదు. మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా, మన సేన కూడా ఉపవాసం చేసింది. ఇలా ఏడు సందర్భాలలో, అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు,' అని బదులిచ్చాడు. లక్ష్మణుడి నిబద్ధతకు రాములవారి మనస్సు కరిగిపోయిందని, వేరే చెప్పాలా.

అదే సమయంలో, ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు.. 'తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే, మేము అక్కడ అన్ని సమస్యలనూ తట్టుకుని నిలబడగలిగాము. అందుకే, సీతా లక్ష్మణులతో పాటుగా, నువ్వు కూడా మా ప్రక్కనే ఆశీనురాలివై ఉండు!' అని అన్నారు, రాముల వారు.

రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. అప్పుడు ఊర్మిళ, 'ప్రభూ! నాకు మీ పాదపద్మముల దగ్గర చోటుకంటే, వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ మీ పాదాల చెంతకి చేరుకుని, మీ అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేనుండేలా, అనుగ్రహించండి' అని వేడుకుంది.

అప్పుడు శ్రీరాముడు, 'కలియుగంలో పూరీక్షేత్రంలో, నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు, బలరాముని రూపంలో, నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో, ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలిగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,' అంటూ వరాన్ని అందించారు.

ఆ వరం కారణంగా, ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం ప్రక్కన, విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ, భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం, 56 రకాల ప్రసాదాలతో, వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం, తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో, ఈ ఊర్మిళా దేవి కథ కూడా, విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది..

శ్రీరామ జయ రామ జయజయ రామ! లోకాః సమస్తా సుఖినోభవంతు!