Ads

01 August, 2022

ప్రతి ఒక్కరూ నలోపాఖ్యానం తప్పనిసరిగా ఎందుకు వినాలి!? Nalopakhyanam

 

ప్రతి ఒక్కరూ నలోపాఖ్యానం తప్పనిసరిగా ఎందుకు వినాలి!?

ఎవరు విన్నా, చదివినా, కలి దోషాన్ని హరింపజేసి, కష్టాలను కడతేర్చే నలోపాఖ్యానంలో, రసరమ్యమైన నల దమయంతుల ప్రేమ కథ గురించి మనం తెలుసుకున్నాం. గత రెండు భాగాలలో, నల దమయంతుల ప్రేమ చిగురించడం, దేవతలను ఒప్పించి పరిణయమాడడం, కలి ప్రవేశంతో నలుడు రాజ్యాన్నీ, సర్వస్వాన్నీ పొగొట్టుకుని అడవుల పాలవ్వడం, దమయంతి బాధను చూడలేక, ఆమెను అడవులలో వదిలి ఋతుపర్ణుని దగ్గర అశ్వకుడిగా, వంటవాడిగా చేరడం, దమయంతి అడవిలో దిక్కు లేకుండా తిరిగి, చివరకు తన పిన తల్లి అయిన ఛేది దేశపు రాజమాతను కలుసుకోవడం, తిరిగి ఆమె తన తండ్రి విదర్భరాజ్యాన్ని చేరుకోవడం వరకూ జరిగిన గాథను తెలుసుకున్నాము. చూడని వారి కోసం, ఆ భాగాల లింక్ లను క్రింద description లో పొందుపరిచాను. ఇక ఈ రోజుటి మన వీడియోలో, విదర్భ దేశాన్ని చేరుకున్న దమయంతి, వికృత రూపంలో ఉన్న తన భర్త ఆచూకీ ఎలా కనిపెట్టింది? దమయంతి మారు మనువుకు ఎందుకు సిద్ధపడింది - వంటి ఉత్సుకతను రేకెత్తించే నలోపాఖ్యానంలోని చివరి అంకాన్ని తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HTBq-RHPlbI ]

తన తండ్రి చెంతకు చేరి, రాజ సౌధంలో తన పిల్లలతో ఉన్నా, దమయంతి భర్త వియోగంతో బాధ పడుతూనే ఉంది. తండ్రి వద్దకు వెళ్ళి, తన భర్తను వెతికించి తీసుకురావాలనీ, లేకపోతే తాను జీవించలేననీ చెప్పి, కన్నీరు మున్నీరయ్యింది. భీముడు వెంటనే మరికొంత మంది బ్రాహ్మణులను పిలిచి, నలుని వెతకమని ఆదేశించాడు. వారితో దమయంతి ఇలా చెప్పింది. ‘నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక, మారు వేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ సభలలో ఈ విధంగా ప్రకటించండి. నీవు సత్యసంధుడవే కానీ, నీ సతిని వంచించావు. ఆమె అర్ధ వస్త్రం తస్కరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? అని ప్రకటించండి. ఆ మాటలకు ఎవరైనా రోషపడి బదులిస్తే, నా వద్దకు వచ్చి తెలియజేయండి’ అని అన్నది. అలా నలుని వెదకడానికి వెళ్ళిన వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతితో, "అమ్మా! నేను ఋతుపర్ణుని రాజ్యంలో నీవు చెప్పినట్లే చెప్పాను. అక్కడ ఒక కురూపి వంటవాడూ, సారధి అయిన బాహుకుడనేవాడు నన్ను రహస్యంగా కలుసుకుని, 'అయ్యా! భర్త కష్టాలలో ఉన్నా సహించి, ఆదరించే భార్య ఇహలోకంలోనూ, పరలోకంలోనూ సుఖపడుతుంది' అని అన్నాడని, అక్కడ జరిగిన విషయాన్ని దమయంతికి తెలియజేశాడు, పర్ణాదుడు.

దమయంతి ఆలోచించగా, అతడు నలుడు కాకపోతే, అలా ఎందుకు బదులిస్తాడని అనుకుంది. తన అనుమానం దృఢ పరచుకోవడానికి తల్లి అనుమతితో, సుదేవడనే బ్రాహ్మణుని పిలిపించింది. ‘మీరు ఋతుపర్ణుని కలిసి.. భీముడు తన అల్లుని కొరకు వెతికించినా ఫలితం లేకపోవడంతో, తన కుమార్తెకు ద్వితీయ స్వయంవరం ప్రకటించాడు. భూమండలం లోని రాజులంతా వస్తున్నారు. మరునాడే స్వయంవరం కనుక, మీరు వెంటనే బయలుదేరండి.’ అని చెప్పి రమ్మని పంపింది దమయంతి. సుదేవడు, ఋతుపర్ణునితో దమయంతి చెప్పమన్నట్లే చెప్పాడు. దమయంతి బ్రాహ్మణుని ద్వారా పంపిన సందేశం విని, ఋతుపర్ణుడు స్వయంవరానికి వెళ్ళాలని అనుకున్నాడు. ఒక్క రోజులో విదర్భను చేరటం ఎలా? అని అనుకుని, సారధి అయిన బాహుకుని పిలిచి, "బాహుకా! దమయంతికి ద్వితీయ స్వయంవరం ప్రకటించారు. నాకు పాల్గోనాలని ఉంది. ఒక్క రోజులో మనం విదర్భకు వెళ్ళాలి. నీ అశ్వసామర్ధ్యం ప్రకటించు" అని అన్నాడు. సరే అని చెప్పి బాహుకుడు ప్రయాణానికి సిద్ధమైనా, తను మనస్సులోనే చాలా బాధపడ్డాడు. "నేను అడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి రాబట్టి కదా, దమయంతి రెండవ స్వయంవరం ప్రకటించింది. అవివేకులైన పురుషులు తాము ఏమి చేసినా, భార్య ప్రేమిస్తుందని అనుకుంటారు. కానీ అది నిజంకాదు. నా మీద కలిగిన కోపంతో, దమయంతి ఇలా చేసింది. అని దమయంతి గురించి తలుచుకుని దుఃఖించాడు.

తన భార్యనూ, తన పిల్లలనూ చూడాలనే తపనతో, వెంటనే రథానికి గుర్రాలను కట్టి, విదర్భకు ఋతుపర్ణుని తీసుకుని ప్రయాణం అయ్యాడు. ఋతుపర్ణునికి రథం పోయే వేగం చూస్తుంటే, అది సూర్యుని రథంలా, బాహుకుడు అనూరుడిలా అనిపించాడు. ఋతుపర్ణుని ప్రక్కనే ఉన్న వార్ష్ణేయుడికీ, అదే సందేహం కలిగింది. "భూలోకంలో నలునికి మాత్రమే ఇలాంటి నైపుణ్యం ఉంది.. కానీ ఈ కురూపి నలుడెలా ఔతాడు" అని మనస్సులో అనుకున్నాడు. ఇంతలో ఋతుపర్ణుని ఉత్తరీయం జారి క్రింద పడింది. "బాహుకా, రథం ఆపు. వార్ష్ణేయుడు దిగి ఉత్తరీయం తీసుకు వస్తాడు" అని అన్నాడు ఋతుపర్ణుడు. అందుకు బాహుకుడు, "మహారాజా! మనం ఆమడ దూరం వచ్చేశాం. అంతదూరం నడుచుకుంటూ వెళ్ళి ఎలా తీసుకు రాగలడు?" అని ప్రశ్నించాడు. అతని రథ సారథ్యానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన పరిజ్ఞానాన్ని బాహుకునికి చూపించాలన్న ఆసక్తి కలిగింది. అంతలో రథం ఒక పెద్ద వృక్షాన్ని దాటింది. ఋతుపర్ణుడు బాహుకునితో, "బాహుకా, ఆ వృక్షంలో ఎన్ని కాయలూ, ఎన్ని పూలూ, ఎన్ని ఆకులూ ఉన్నాయో నేను చెప్పగలను" అని అన్నాడు. బాహుకుడు ఆశ్చర్యంతో, "చెప్పండి మహారాజా" అని అడిగాడు. ఋతుపర్ణుడు సమాధానం చెప్పగా, లెక్కించి చూస్తే కాని నమ్మలేనని, రథం ఆపి ఆ చెట్టుని పడగొట్టించి లెక్కించాడు బాహుకుడు. ఋతుపర్ణుడు చిప్పిన లెక్క కచ్చితంగా సరిపోయింది.

బాహుకుడు ఆశ్చర్యపడి, ఆ విద్యను తనకు ఉపదేశించమని అడిగాడు. అందుకు ఋతుపర్ణుడు అక్షవిద్య అనే సంఖ్యాశాస్త్రాన్ని బాహుకుడిని బోధించాడు. ఆ అక్షహృదయ విద్య మహిమవలన, బాహుకునిగా ఉన్న నలునిలో నుండి కలి వెలుపలికి వచ్చాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. నలుడు ఆగ్రహించి శపించబోయాడు. అప్పుడు కలి నలునితో, "నలమహారాజా! నిన్ను ఆవహించి నీలో ఉన్న సమయంలో, కర్కోటకుడు నిన్ను కాటువేయడం వలన, అనుక్షణం కాలి పోయాను. ఇంతకంటే శిక్ష ఏముంది? నన్ను క్షమించి విడిచిపెట్టు" అని వేడుకున్నాడు.

అటుపిమ్మట బాహుకుడు ఋతుపర్ణునితో, "మహారాజా! మీరు నాకు నేర్పిన అక్ష హృదయ విద్యకు ప్రతిగా, నేను మీకు అశ్వహృదయ విద్యను నేర్పుతాను" అని అన్నాడు. అందుకు ఋతుపర్ణుడు, "ఇప్పుడు కాదు. తరువాత అడిగి నేర్చుకుంటాను. ముందు మనం సరైన సమయానికి విదర్భ దేశాన్ని చేరుకోవాలి" అని అన్నాడు. వెంటనే నలుడు రథాన్ని పరుగులు పెట్టించాడు. నలుని రథం విపరీతమైన ఘోషతో, విదర్భలోకి ప్రవేశించింది. ఆ ఘోష విన్న దమయంతి, అది నలుని రథం అని గుర్తు పట్టింది. కానీ రథంలో ఋతుపర్ణుని చూసి నిరాశ చెందింది. భీముడు ఎంతో ఆనందంతో ఋతుపర్ణుని ఆహ్వానించి, విడిది చూపించాడు. అక్కడకు వెళ్ళిన ఋతుపర్ణునికి, విదర్భలో స్వయంవరం జరుగుతున్న సందడి కనిపించలేదు. సారధిగా వచ్చిన బాహుకుడు రథాన్ని అశ్వశాలలో నిలిపి, సేదతీరాడు.

అతడిని చూసిన దమయంతి తన దాసిని, స్వయంవరానికి ఋతుపర్ణ మహారాజుతో వచ్చిన ఆ కురూపి గురించి వివరాలు తెలుసుకు రమ్మని పంపింది. అతనిని చూడగానే ఆమె మనస్సు పరవశించిపోయింది. తన భర్త నలుడే మారు రూపులో ఉన్నాడని, ఆమె అనుమానం. దమయంతి పంపిన దాసి నలుని వద్దకు వెళ్ళి, తన యోగ క్షేమాలు తెలుసుకుని, తన గురించి అడిగింది. అందుకు బాహుకుడి రూపంలో ఉన్న నలుడు, "మీ రాకుమారి స్వయంవరం ప్రకటించింది కదా.. దానికి నేను మా మహారాజును, ఒక్క రోజులో, నూరు ఆమడల దూరం ప్రయాణించి తీసుకు వచ్చానని చెప్పు" అని అన్నాడు. దాసీకి అనుమానం కలిగింది. ఇతను రథ సారథి అయితే, ఋతుపర్ణుడితో వచ్చిన వార్ష్ణేయుడు ఎవరు? అనే సందేహాంతో, అతని గురించి ప్రశ్నించింది. అప్పుడు బాహుకుడు, "అతడు వార్ష్ణేయుడు. ఇంతకు ముందు నలుని సారధి" అని అన్నాడు. అయితే అతనికి నలుని జాడ తెలిసి ఉంటుందా? అని ఆశ్చర్యంగా అడుగగా అందుకతడు, "తనరాజ్యాన్ని పోగొట్టుకునేముందు నలుడు, తన పిల్లలనిచ్చి, వార్ష్ణేయుని విదర్భకు పంపాడు. ఆ తరువాత వార్ష్ణేయుడు ఋతుపర్ణుని వద్ద సారధిగా చేరాడు. నలుని గురించి నలునికే తెలియాలి. లేదా అతని భార్యకు తెలియాలి. వేరొకరికి తెలిసే అవకాశం లేదు" అన్నాడు బాహుకుడు.

ఆ సమాధానం విన్న దాసీ, "అయ్యా! నలుడు తనను ప్రాణప్రదంగా చూసుకునే భార్యను నిర్దాక్షిణ్యంగా అడవిలో విడిచి వెళ్ళాడు. దమయంతి నలుడు విడిచి వెళ్ళిన సగంచీరను ధరించి, కాలం గడుపుతోంది. ఆమెను అలా విడిచి వెళ్ళడం ధర్మమా?" అని అడిగింది. ఆమె మాటలకు నలుని కంట నీరు పెల్లుబికింది. అది దాసీకి తెలియ కూడదని, మొహం తిప్పుకున్నాడు. దాసీ దమయంతి దగ్గరకు తిరిగి వెళ్ళి, జరిగినదంతా వివరించింది. ఆ మాటలతో దమయంతి ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చింది. నలుడు వంట చేయడంలో దిట్ట. ఇతను కూడా వంటవాడని చెప్పారు కనుక, వంట ఎలా చేస్తాడో పరీక్షించమని, మరల దాసీని పంపింది దమయంతి. ఆమె వెళ్ళి నలుని పనితీరును నిశితంగా పరిశీలించి, "అమ్మా! అతను సామాన్యుడు కాడు. అతడు ఏ పనయినా సునాయాసంగా చేస్తున్నాడు. అతడు గడ్డిని విదిలిస్తే, మంటలు వస్తున్నాయి. వంట పూర్తయ్యే వరకూ, అలా మండుతూనే ఉన్నాయి. వంటలు అద్భుతంగా ఉన్నాయి" అని దమయంతికి చెప్పింది.

ఆ మాటలు విన్న దమయంతి ఆనందంతో, నలుడు వండిన వంటలు తెప్పించి రుచి చూసి, "సందేహం లేదు, ఇవి నలుని వంటలే" అని గ్రహించి, దాసీతో తన పిల్లలను నలుని వద్దకు పంపింది. నలుడు వారిని చూసి చలించి, ఎత్తుకుని ముద్దాడాడు. తన గురించి నిజం బయటపడుతుందన్న అనుమానంతో, "అమ్మా! ఏమీ అనుకోవద్దు. వీరిని చూస్తే నా బిడ్డలు గుర్తుకు వచ్చారు. అందుకే అలా చేశాను. ఇక నువ్వు నా వద్దకు రావద్దు. ఎవరైనా చూస్తే ఏదైనా అనుకుంటారు. అయినా మేము విదేశాలనుండి వచ్చిన అతిథులం. మాతో నీకేం పని?" అని దాసీని కసురుకుని పంపించేశాడు. జరిగినది తెలసుకున్న దమయంతి సంతోషపడి తన తల్లి వద్దకు వెళ్ళి, "ఋతుపర్ణుని సారధిగా వచ్చిన కురూపి బాహుకుడే ‘నలుడు’. అమ్మా అతను ఇక్కడకు వస్తాడా? నేను అక్కడకు వెళ్ళాలా, నువ్వే నిర్ణయించు!" అని అడిగింది. భీమరాజు అనుమతితో ఆమె బాహుకుడిని దమయంతి వద్దకు రప్పించింది.

దమయంతి నలుని చూసి, "అయ్యా, నిస్సహాయంగా ఉన్న నన్ను, నా భర్త నలమహారాజు నట్టడవిలో నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళాడు. అలా సంతానవతినైన నన్ను విడిచి వెళ్ళడం ధర్మమా? అలా చేయడానికి నేనేమి అపకారం చేశాను? అగ్ని సాక్షిగా, నన్ను విడువనని ప్రమాణం చేసిన భర్త, అలా చేయవచ్చా?" అని దుఃఖించింది. అందుకు నలుడు కుమిలిపోతూ, "సాధ్వీ! ఆ సమయంలో నన్ను కలి ఆవహించి ఉన్నాడు. అందువలన నేను అలా చేశాను. జూదంలో సర్వం పోగోట్టుకుని బాధలు పడుతున్న నేను, నాతోపాటు బాధలు పడుతున్న నిన్ను చూసి సహించలేక, విడిచి వెళ్ళాను. అలా చేస్తే నువ్వైనా నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటావని అలోచించాను. నీపై అనురాగంతో, మిమ్మల్ని చూడటానికే నేనిప్పుడిక్కడకు వచ్చాను. మరొక భర్తకోసం స్వయంవరం ప్రకటించడం, కులస్త్రీలకు తగునా? అలా ఎందుకు చేశావు? అందుకే కదా ఋతుపర్ణుడు వచ్చాడు. ఇది ధర్మమా?" అని దమయంతిని అడిగాడు. అందుకు దమయంతి, "నాధా, నేను మీకోసం గాలిస్తూ పంపిన విప్రులలో, అయోధ్యకు వెళ్ళిన విప్రుడు మిమ్ములను గుర్తించాడు. మిమ్ములను ఇక్కడికి రప్పించుటకే అలా చేశాను. మీరుకాక, ఇంకెవరు నూరు యోజనముల దూరం ఒక్క రోజులో ప్రయాణించగలరు? నాలో ఎటువంటి పాపపు తలంపూ లేదు." అని దమయంతి నలుని పాదాలకు నమస్కరించింది.

వెంటనే ఆకాశం నుండి వాయుదేవుడు, "నలచక్రవర్తీ! ఈమె పవిత్రురాలు, పతివ్రత. నేను, సూర్యుడు, చంద్రుడు, ఈమె సౌశీల్యం కాపాడుతున్నాము" అని పలికాడు. వెంటనే నలుడు ఆనందభరితుడై, కర్కోటకుని స్మరించాడు. వెను వెంటనే ఒక వస్త్రం వచ్చింది. అది ధరించగానే, నలునికి ఇంద్రతేజో సమానమైన, మనోహరమైన పూర్వ రూపం వచ్చింది. దమయంతిని పరిగ్రహించాడు. నలుడు విదర్భలో ఒక మాసం ఉండి, తన రాజధానికి వెళ్ళి, పుష్కరుని కలిశాడు. నలుడు పుష్కరునితో, "పుష్కరా! జూదమాడటం నీకు ప్రియం కదా. నేను నా భార్య దమయంతిని పణంగా పెడతాను. నీవు నీ సర్వస్వం పెట్టి నాతో ఆడతావా? లేదా నాతో యుద్ధం చెయ్యి. ఎవరు గెలిస్తే వారిదే రాజ్యం. నీకేది ఇష్టమో నిర్ణయించుకో" అని అన్నాడు. పుష్కరుడు జూద ప్రియుడు. పైగా ఒకసారి జూదమాడి గెలిచాడు కనుక, అతడు నలునితో "నేను జూదమే ఆడతాను" అని అన్నాడు. నలుడు పుష్కరునితో జూదమాడి, తన రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు. పుష్కరునితో, "పుష్కరా, నేను ఇదివరకూ నీతో జూదమాడినపుడు, నన్ను కలి ఆవహించి ఉన్నాడు. కనుక ఓడి పోయాను. నీవు నా పిన తండ్రి కుమారుడివి కనుక, నిన్ను ఏమీ చేయకుండా వదిలివేస్తున్నాను.. వెళ్ళు" అని చెప్పి పంపాడు. నలుడు తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుని, తన ప్రియసతి దమయంతితో సంతోషంగా జీవితాన్ని సాగించాడు.

ఈ నలదమయంతుల కథను, అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుకు బృహదశ్వుడనే ముని వివరించాడు..

శ్లో: కర్కోటకస్య నాగస్య దమయంత్యాః నలస్య చ ।
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం ।।

ఈ నలచరిత్ర విన్నవారికి కలిదోషములు ఉండవనీ, నాగుడైన కర్కోటకునీ, దమయంతినీ, నలునీ, రాజర్షియైన ఋతుపర్ణునీ తలచిన వారిని కలి బాధింపడనీ, ఈ శ్లోకానికి అర్థం. ఈ నలోపాఖ్యానం విన్న వారికి కలి ప్రభావం తగ్గి, సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని, పురాణ విదితం.

సర్వేజనాః సుఖినోభవంతు!

No comments: