Ads

27 January, 2021

శుక్ర నీతి: మనిషి సంతోషంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి! Shukracharya's System of Morals - Shukra Niti


శుక్ర నీతి: మనిషి సంతోషంగా ఉండాలంటే వీటికి దూరంగా ఉండాలి! 

బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడూ, సప్తరుషుల్లో ఒకరైన భృగు మహర్షి కుమారుడు 'శుక్రాచార్యుడు'. తండ్రిలాగే, శుక్రాచార్యుడు కూడా గొప్ప విద్వాంసుడు. ఎన్నో సాహిత్యాలను రచించి, లోక శ్రేయస్సుకై అందించాడు. అంతే కాదు, మన పురణాల ప్రకారం, మరణించిన వారిని కూడా బ్రతికించగలిగే మృతసంజీవనీ మంత్రాన్ని, శివుడినుండి పొందాడు. రాక్షసుల గురువైనా, శుక్రచార్యుడు గొప్ప తత్త్వవేత్త. సత్యయుగంలో శుక్రాచార్యుడు పేర్కొన్న విషయాలు, ప్రస్తుత కాలానికీ ఎంతో ఉపయోగపడతాయి. ఆయన చెప్పిన విధంగా, కొన్ని విషయాలకు దూరంగా ఉంటే, జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. అవేంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2UA7CE0A80E ]

ఎదుటివారిని ఆకర్షించడం నేరం కాదు.. అయితే, భౌతిక అందం కోసం, స్త్రీ పురుషులు ప్రాకులాడరాదు. దీని వల్ల శారీరక సౌందర్యం మరుగున పడిపోయి, మనిషి తన స్వచ్ఛమైన హృదయాన్ని కోల్పోతాడు. ఈ నిబంధనను అనుసరించడం కష్టమైనా, దీని వల్ల ఎంతో ఆనందం సొంతమవుతుంది. భౌతిక అంశాలూ, మాయకూ దూరంగా ఉండాలి. మనుషులనూ, వస్తువులనూ వేర్వేరుగా చూడాలి.

కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే విషయంలో, తనను తాను విశ్వసించాలి కానీ, చుట్టూ ఉన్నవారి అభిప్రాయం ప్రకారం చేయడం, మంచిది కాదు.

ఉన్నత లక్ష్యాన్ని కలిగి ఉండాలి.. దానిపైనే దృష్టి కేంద్రీక‌రించాలి. ఒకవేళ లక్ష్యం ప్రక్కదారి పడితే, అది ఇతరులనే కాదు.. మనల్ని కూడా నాశనం చేస్తుంది.

కపట ప్రేమకు దూరంగా ఉండాలి.. తల్లి తన బిడ్డలకు ప్రేమను పంచుతుంది. ఇది నిజమైన ప్రేమ.. కేవలం ప్రపంచం కోసం చేసేదీ, స్థితిని బట్టి మారేదీ, ఎక్కడున్నారో, అక్కడికే దారి తీస్తుంది. జీవితంలో ఇలాంటి విషపూరిత ప్రేమలకు దూరంగా ఉండాలి.

'జీవితం' ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. పరుగెత్తడం ప్రారంభించిన తర్వాత, ప్రశ్నించుకోరాదు. గత విషయాలను తలచుకుంటూ బాధపడటంకంటే, వర్తమానంలో జీవించాలి.

చర్యకు ప్రతిచర్యలాగే, మంచి చేస్తే మంచే జరగుతుంది. కాబట్టి, శుక్రాచార్యుడు చెప్పినట్లు, ఎల్లప్పుడూ మంచి చేయడానికే ప్రయత్నించాలి. ఎవరైనా చెడుకు ప్రయత్నిస్తే, వాటిని విస్మరించి, ముందకు సాగాలి.

ఎప్పుడూ విధిపై నమ్మకం ఉంచాలి. అనుకూల లేదా ప్రతికూలతలు ఎదురైనా, ఒకేలా స్వీకరించాలి. విధితో పోరాటానికి సిద్ధపడేముందు, మీరు చేసిన కర్మలను తెలుసుకోవాలి. దీని వల్ల, మీ భాగ్యం మారుతుంది.

గత జన్మలో చేసిన కర్మల ఫలితం, ఈ జన్మలో అనుభవిస్తారు. వాటి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

కష్టపడి పనిచేస్తే, కోరుకున్నది సాధ్యమవుతుంది. జీవితంలో కొన్ని విషయాలను, పూర్తిగా పొందలేదని మధపడతాం. పరిస్థితులతో సంబంధం లేకుండా, మనసు కోరుకుంటున్న విధంగా పయనం సాగాలి.

చెడు లక్షణాల కారణంగా, ఓ వ్యక్తిని ద్వేషించరాదు.. లోపాలు, అవలక్షణాలను ఒప్పకుంటే, ఇతరులు దగ్గరవుతారు. ఒకే వస్తువును ఇద్దరూ కొరుకున్నప్పుడే, శత్రువులుగా మారి, దానిని దక్కించుకోడానికి పోరాటం చేస్తారు.

వయస్సూ, సంపాదన, దేవుడిని పూజించే విధానం, ఆరోగ్యం, ఇతరులకు సహాయంచేసే విషయాలూ, సమాజాన్ని గౌరవించే విధానం గురించి, ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇతరులకు తెలుపరాదు. ఇలా చేస్తే, తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

బద్దకస్తుడూ, త్రాగుబోతూ, స్త్రీలోలుడూ, అప్పులు చేసి ఎగ్గొట్టేవాడికీ, సమాజంలో మనుగడ సాధ్యం కాదు.

తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, విధుల నుంచి తప్పించుకు తిరిగేవారూ, జీవితంలో చాలా కోల్పోతారు.

మనిషికి, కులం కారణంగా పరిపాలించే అర్హత రాదు. అది చర్యల ఫలితంగా వస్తుంది. పుట్టుకతో ఎవరూ పేదవారు లేదా అంటరానివారు కాదు. ఇతరులకు కీడు తలపెట్టి, గౌరవించకపోవడమే, అంటరానితనం. శుక్రాచార్యుడు చెప్పిన మంచి విషయాలను పాటించి, ఆనందమయ జీవనాన్ని పొందుదాము.

Link: https://www.youtube.com/post/Ugz-9IsXrgAxglSgyE94AaABCQ

No comments: