Ads

24 November, 2020

కార్తీక పురాణం! (నవమాధ్యాయము - తొమ్మిదవ రోజు పారాయణము)

 

విష్ణు పార్షద, యమదూతల వివాదము:

'ఓ యమ దూత లారా! మేము విష్ణు దూతలము వైకుంఠము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నించిరి. అందుకు జవాబుగా యమదూతలు, 'విష్ణు దూతలారా! మానవుడు చేయు పాపపుణ్యములను, సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధన౦జయాది వాయువులు, రాత్రి౦బవళ్లు, సంధ్య కాలం సాక్షులుగా వుండి, ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునికి చూపించి, ఆ మనుజుని అవసాన కాలమున, మమ్ము పంపి, వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.

వేదోక్త సదాచారములు విడిచి, వేద శాస్త్రముల నిందించు వారును, గోహత్య, బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు, పర స్త్రీలను కామించిన వారును, పరాన్న భుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కుల వృతిని తిట్టి, హింసి౦చు వారున్నూ, జీవ హింస చేయు వారున్నూ, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును, జారత్వం, చొరత్వంచే భ్రష్టులగు వారును, యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును, చేసిన మేలు మరచిన కృతఘ్నులును, పెండిండ్లు, శుభకార్యములు జరగనివ్వక, అడ్డుతగిలే వారునూ, పాపాత్ములు. వారు మరణించగానే, తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి, దండి౦పుడని మా యమ ధర్మ రాజు గారి యాజ్ఞ. అది అటులుండగా, ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి, దురాచారములకు లోనై, కుల భ్రష్టుడై, జీవ హింసలు చేసి, కామాంధుడై, వావివరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు?' అని యడగగా విష్ణు దూతలు, 'ఓ యమ కి౦కరులారా! మీరెంత యవివేకులు? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. 

సజ్జనులతో సహవాసము చేయువారును, జపదాన ధర్మములు చేయువారును, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారును, అనాధ ప్రేత సంస్కాములు చేయువారును, తులసి వనము పెంచువరును, తటాకములు త్రవ్వి౦చువరును, శివ కేశవులను పూజి౦చు వారును సదా హరి నమ స్మరణ చేయువారును మరణ కాలమందు 'నారాయణా'యని శ్రీ హరినిగాని, 'శివ' అని శివుని గాని స్మరించు వారును, తెలిసిగాని తెలుయక గాని, మరే రూపమున గాని, హరి నామ స్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు! కాబట్టి, అజా మీళుడు ఎంత పాపాత్ముడైనను, మరణకాలమున 'నారాయణా' అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణలాలకించి ఆశ్చర్యమొంది, 'ఓ విష్ణు దూతలారా! పుట్టిన నాటి నుండి నేటి వరకు, శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని, ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము, ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై, నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో 'నారాయణా' యని నంత మాత్రమున, నన్ను ఘోర నరక బాధలనుండి రక్షించి, వైకంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా! నేనెంత అదృష్టవంతుడ! నా పూర్వ జన్మ సుకృతము, నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది.' అని పలుకుచు, సంతోషముగా విమాన మెక్కి, వైకంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ! తెలిసిగాని, తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి బాధ కలిగించునో, అటులనే, శ్రీ హరిని స్మరించిన యెడల, సకల పాపములును నశించి, మోక్షము నొందెదరు. ఇది ముమ్మాటికినీ నిజము.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్య మందలి 'నవమాధ్యాయము - తొమ్మిదవ రోజు పారాయణము' సమాప్తము.

Link: https://www.youtube.com/post/UgxipebW3_e9K1qs-4N4AaABCQ

No comments: